Showing posts with label Advent. Show all posts
Showing posts with label Advent. Show all posts

ఆగమనకాల రెండవ ఆదివారము, YEAR C

ఆగమనకాల రెండవ ఆదివారము, YEAR C
బారూకు 5:1-9; ఫిలిప్పీ 1:4-6, 8-11; లూకా 3:1-6
ప్రభువు మార్గములో నడచెదము


సియోను వాసులారా! వినుడు. ప్రజలను రక్షించు నిమిత్తము రక్షకుడు వచ్చును. ఆయన వచ్చి తన ఇంపైన స్వరమును మీ హృదయములకు ఆనందకరముగా వినిపింపజేయును. ఈరోజు శ్రీసభ మనకు ఒక గొప్ప వ్యక్తిని ఆదర్శముగా చూపిస్తూ ఉంది. అతడే పునీత బప్తిస్మ యోహాను. ప్రవక్తలందరిలోకెల్ల గొప్ప ప్రవక్త, చివరి ప్రవక్త బప్తిస్మ యోహాను. దేవుని వాక్యాన్ని ఆలకించి, దానిని మనసారా స్వీకరించి, దైవప్రజలకు అందించడం ప్రవక్తల మొదటి కర్తవ్యం. కనుక ప్రవక్త దేవునికి ప్రజలకు మధ్యవర్తి. అలాంటి ప్రవక్తలలో ఒకరైన యెషయా ప్రవక్త పలికిన మాటలు, బప్తిస్మ యోహాను జీవితము ద్వారా నిజమవుతూ ఉన్నాయి. "ప్రభువు మార్గమును సిద్ధము చేయుడు" (యెష 40:3; లూ 3:4) అని ప్రవక్త పలికిన ఈ మాటలద్వారా బప్తిస్మ యోహాను దైవప్రజలను ప్రభువు మార్గములోనికి ఆహ్వానించియున్నాడు. ప్రభువు రాకకోసం మార్గమును సిద్ధము చేయాలని కోరుతున్నాడు. పశ్చాత్తాపము, జ్ఞానస్నానము అను మార్గములద్వారా ప్రజలను సిద్ధముచేసి ముందుకు నడిపించాడు. ప్రవక్తగా, ప్రభువు మార్గమును సిద్ధపరచడం, ప్రభువును అనుసరింపగోరువారికి పశ్చాతాపముగూర్చి ప్రకటించడం యోహాను పాత్ర. ప్రభువు దరికి వచ్చు వారి జీవితాలను సక్రమం చేయడం ఆయన భాద్యత.

మొదటి పఠనములో బారూకు ప్రవక్త చెప్పిన విధముగా: "ప్రతీ లోయ పూడ్చబడును. పర్వతములు, కొండలు సమము చేయబడును. వక్రమార్గములు సక్రమము చేయబడును. కరకు మార్గము నునుపు చేయబడును" (5:7; లూ 3:5). మొదటి పఠన నేపధ్యము, ఇశ్రాయేలు ప్రజల బానిసత్వ ముగింపును, రక్షణను (మార్గము), త్వరలో వారు పొందబోవు ఆనందమును ఈ వాక్యం సూచిస్తుంది. ఈవిధముగా, ప్రభువు తన ప్రజల పాపములను క్షమించి తన దయను చూపును.

క్రీస్తు రాకకొరకు మనలను మనం తయారుచేసుకొనే ఈ పవిత్ర ఆగమన కాలములో, మనలోనున్న లోయలగు చెడును తీసివేయడానికి ప్రయత్నించాలి. అలాగే, గర్వాన్ని, అహంకారాన్ని విడచి పెట్టాలి. మనం తీసుకొనే చెడు నిర్ణయాలకు స్వస్తి చెప్పాలి. మనలో ఉన్న రాతి హృదయాన్ని కరిగించమని ప్రభువును వేడుకోవాలి. పాపము మన రక్షణ మార్గమునకు ఆటంకము. రక్షణ మార్గమునకు మొదటి మెట్టు నిజమైన పశ్చాత్తాపము, పరిపూర్ణమైన ప్రేమ. రక్షణ అనేది దేవుని వరం. అయినను, మన కృషిని, సహకారాన్ని దేవుడు ఆశిస్తాడు. 'యేసు క్రీస్తునందు విశ్వాసము' మనకు రక్షణ వరము లభింప జేయును: 1). క్రీస్తు పిలుపును (మా 1:17; 2:14) అందుకొని ఆయనను అనుసరిస్తూ, ఆయన ప్రేషిత కార్యములో భాగస్తులం కావాలి. 2). క్రీస్తు శ్రమలు, మరణములో పాల్గొనునట్లు చేయు ఆయన సిలువను అంగీకరించాలి (మ 16:24). అన్నింటికన్న, ఆయనను పరిపూర్ణముగా ప్రేమించాలి. 3). అన్ని విషయములలో క్రీస్తును అనుసరించాలి, అనుకరించాలి (యో 12:26).

అయితే, ఇక్కడ మనం ఒక ముఖ్య విషయాన్ని గ్రహించాలి. మనం ప్రభు చెంతకు వెళ్ళటం కంటే కూడా, ఆ ప్రభువే మన చెంతకు వస్తూ ఉన్నాడు. మనం ఆయన చెంతకు వెళ్లకముందే ఆయన ఒక అడుగు ముందుకేసి మనకన్న ముందుగా మన దగ్గరకు వస్తున్నాడు. ఎందుకన, రక్షణ కార్యములో మొదటి అడుగు వేసింది ప్రభువే కదా! కనుక, క్రిస్మస్ పండుగ రోజున దేవుడే మానవ రూపాన్ని ధరించి యేసు అను వ్యక్తిగా మన మధ్యకు వస్తూ ఉన్నాడు. ఆ గొప్ప ఘడియనే మనం క్రీస్తు జయంతిగా కొనియాడుతూ ఉన్నాము. ఒక విధముగా దేవుడే మనకు మార్గాన్ని తయారు చేస్తున్నాడు. ఆ మార్గములో మనలను నడచుకోమని, జీవించమని ఆహ్వానిస్తూ ఉన్నాడు. అందుకే ప్రభువు "నేనే మార్గమును, సత్యమును, జీవమును" (యో 14:6) అని చెప్పారు. కనుక, ప్రభువు పిలుపును గుర్తించి, గ్రహించి, అది ఒక భాద్యతగా స్వీకరించి, ప్రభువుకు సమాధానం చెప్పాలి. ఆయన మార్గములో నడవడానికి ప్రయత్నం చేయాలి. అయితే ప్రభువు మార్గము మన మార్గాలకన్న భిన్నమైనది. ఆయన మార్గము రక్షణ మార్గము. "ప్రతీ ఒక్కరు దేవుని రక్షణమును కాంచును" (లూ 3:6) అని సువార్తలో వినియున్నాము. కనుక, ఎవరైతే ప్రాపంచిక మార్గాలను విడిచి, ప్రభువు చూపించే మార్గములో నడుచుకొంటారో, వారు తప్పక ఆయన రక్షణములో పాలు పంచుకొంటారు.

ఆగమన కాలంలో, 'ప్రభువు వస్తున్నాడు' అన్న సందేశం మన హృదయాలలో మ్రోగుతూ ఉంటుంది. ఆ సంతోషకర సందేశమే మనలను ముందుకు నడిపిస్తూ ఉంటుంది. ప్రభువు రాకతో, తన జీవితాన్ని, ప్రేమను మనతో పంచుకొంటున్నాడు. అదే సమయములో, మన జీవితాన్ని, ప్రేమను దేవునితోను, ఇతరులతోనూ పంచుకోవాలని  ఆహ్వానిస్తున్నాడు. యోహాను ప్రకటించిన 'క్రీస్తు రాకడ' కొరకు విశ్వాసముతో నిరీక్షించాలి. ప్రభువు రాకను స్వాగతించి, ఆయనకు మన హృదయాలలో స్థానం ఇవ్వాలి. యోహానువలె మనముకూడా ఈనాడు మన సంఘములో ప్రవక్తలుగా మారాలి. ఇతరులకు మార్గచూపరులుగా ఉండాలి. ఇతరుల జీవితాలలో వెలుగును నింపాలి. ప్రభువు దరికి రావడానికి వారికి మార్గమును సిద్ధపరచాలి. దేవుని వాక్యమును బోధించాలి.

రెండవ పఠనములో మూడు అంశాలను చూడవచ్చు: 1). కృతజ్ఞత: ఫిలిప్పీ క్రైస్తవుల ఉదారస్వభావాన్నిబట్టి, తన అపోస్తోలిక కృషిలో వారు చేసిన సహాయాన్ని బట్టి, పౌలు సంతోషముతో దేవునకు కృతజ్ఞతలు తెలియజేయు చున్నాడు. వారియందు దేవుడు ప్రారంభించిన మంచి పనిని సంపూర్ణము చేయును. 2). ప్రేమయందు ఎదుగుదల: దైవప్రేమ, సోదర ప్రేమ వారిలో ఎదగాలని ఆశిస్తున్నాడు. వారి ప్రేమ వర్ధిల్లాలని పౌలు ప్రార్ధన చేయుచున్నాడు. 3). క్రీస్తు దినము: క్రీస్తు దినమున వారు కల్మషము లేనివారుగా, నిర్దోషులుగా ఉండాలని ఆశిస్తున్నాడు. అది వారి ప్రేమద్వారా సాధ్యమగును.

ఆగమనకాల నాలుగవ ఆదివారము, 23 డిశంబరు 2012


ఆగమనకాల నాలుగవ ఆదివారము, 23 డిశంబరు 2012
మీకా 5:1-4, హెబ్రీ 10:5-10, లూకా 1:39-44

ఓ ఆకాశములారా! మేఘములారా! మాకు రక్షకుని స్వర్గమునుండి పంపుడు. ఓ భూతలమా! తెరచుకొని రక్షకుని పంపుము.
ఈ రోజు నాలుగవ ఆగమన ఆదివారము. ఈ వారముతో క్రిస్మస్ పండుగకు మన ఆయత్తం ముగుస్తుంది. మన ప్రార్ధనలన్నీ కూడా "ఇమ్మానుయేలు" (దేవుడు మనతో ఉన్నాడు) అను అంశముపై కేంద్రీకృతమై ఉంటాయి. ఆయన మనలో, మన శ్రమలో, మన జీవితములో ఒకనిగా, మనతో లోకాంత్యము వరకు ఉండటానికి మరియు ఆయన స్వభావాన్ని మనతో పంచుకొనడానికి ఆశించియున్నాడు. ఈనాటి పఠనాలు క్రిస్మస్ పండుగకు మనలను మరింత దగ్గరగా తీసుకొని వస్తున్నాయి. మూడు పఠనాలు, మూడు కోణాలలో ఈ పరమ రహస్యాన్ని మనకు అర్ధమయ్యేలా విశదపరుస్తున్నాయి. దేవుడు తన ప్రణాళికను, ఆయన ఎన్నుకొన్న వ్యక్తుల ద్వారా నెరవేర్చడం ద్వారా, సమస్తము ఆయనకు సాధ్యమే అన్న సత్యాన్ని మనం చూస్తున్నాము. ప్రభుని రాక, ఇంత ముందుగానే సమస్త లోకానికి తెలియజేయడమైనది.

మొదటి పఠనము మీకా గ్రంథమునుండి వింటున్నాము. మీకా ప్రవక్త యిస్రాయెలు ప్రజలకు రాబోవు గొప్ప రాజు గూర్చి ప్రవచిస్తున్నారు. బెత్లెహేము నుండి యిస్రాయెలు పాలకుడు ఉద్భవించును. అతని వంశము పురాతన కాలమునకు చెందినది. దేవుని ప్రభావముతో తన మందలను పాలించును. లోకములో నరులెల్లరు అతని ప్రాభవమును అంగీకరింతురు. అయితే, ఆ రాజు ఎప్పుడు వచ్చునో పరలోక తండ్రి మాత్రమే ఎరిగియున్నాడు. రక్షకుడు వచ్చినప్పుడు, సమస్త లోకానికి శాంతిని ఒసగును. దైవ ప్రజలు పాప బానిసత్వము నుండి విడుదలై స్వతంత్రులుగా జీవించెదరు.

యేసుక్రీస్తు మనలో ఒకనిగా వచ్చిన ఆ పరమ రహస్యాన్ని, క్రీస్తు తనను తానుగా అర్పించిన బలి మరియు ఆయన విధేయత వలన మాత్రమే సంపూర్ణముగా అర్ధము చేసుకోవచ్చని రెండవ పఠనము తెలియ జేస్తుంది. యేసు క్రీస్తు ఈ లోకానికి ఏమీ ఆశించక తండ్రి చిత్తాన్ని నేరవేర్చ ఆశించాడు. దేవుడు జంతు బలులను, అర్పణలను కోరలేదు. దహన బలులకు, పాప పరిహారార్ధమయిన అర్పణలకు ఇష్ట పడ లేదు. పాత బలులను అన్నింటిని తొలగించి వాని స్థానమున దేవుడు క్రీస్తు బలిని నియమించెను (హెబ్రీ 10:5-6,10). ఈ పరిశుద్ధ  కార్యానికి క్రీస్తు తనను తాను త్యజించి, తండ్రి దేవుని చిత్తానికి విధేయుడై, మన పాపపరిహారార్ధమై తనను తాను బలిగా అర్పించు కొనుటకు ఈ లోకములో జన్మించియున్నాడు. ఆయన జన్మము మనకు జీవమును, శాంతిని, సమాధానమును, స్వతంత్రమును ఒసగు చున్నది. మన జీవితము వెలుగులో ప్రకాశింప బడుచున్నది. క్రీస్తు బలి ద్వారా మనలను ఆయనలో ఐక్యము చేసి పవిత్రులనుగా చేసియున్నాడు.

"ఇదిగో, నేను ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక!"

సువిశేష పఠనము మరియమ్మ ఎలిశబెతమ్మను దర్శించిన సంఘటనను తెలియ జేస్తుంది. యేసు జనన సూచనను దూత ప్రకటించిన కొద్ది సమయములోనే మరియమ్మ ఎలిశబెతమ్మను సందర్శించింది. గబ్రియేలు దూతే ఈ సందర్శనను సూచించినది. "నీ బంధువు ఎలిశబెతమ్మను చూడుము. ఆమెకు వయస్సు మళ్ళినది గదా! గొడ్రాలైన ఆమె గర్భము ధరించి ఇది ఆరవ మాసము" (లూకా 1:36). ఆ విషయము గ్రహించిన మరియమ్మ యూదా సీమలో పర్వత ప్రాంతమున గల ఒక పట్టణమునకు త్వరితముగా ప్రయాణమై వెళ్ళినది.

మరియమ్మ పవిత్రాత్మ శక్తివలన అప్పుడే గర్భము ధరించినది. దైవ కుమారున్ని ఈ లోకానికి స్వాగతించడానికి ముందుగానే సిద్ధపడినది. దేవుడు తనకు అప్పగించిన పవిత్రమైన భాద్యతను ఆమె గుర్తించినది. తన ద్వారానే లోక రక్షకుడు ఈ లోకానికి రావలసి యున్నదని గుర్తించి, దేవుని చిత్తాన్ని అంగీకరించినది. "నీ మాట చొప్పున నాకు జరుగునుగాక!"

మరియమ్మ జెకర్యా ఇంటిలో ప్రవేశించి  ఎలిశబెతమ్మకు వందన వచనము పలికింది. పవిత్రాత్మతో నింపబడి ఆ వందన వచనములను పలికింది. దైవ కుమారుడిని, లోక రక్షకుడిని గర్భము ధరించి నప్పటికిని, మరియమ్మ తనే స్వయముగా  ఎలిశబెతమ్మను సందర్శించినది. యేసు, ఈ లోకానికి సేవింపబడుటకుగాక, సేవ చేయడానికి వస్తున్నాడన్న విషయం స్పష్టముగా తెలుస్తుంది. సేవ ద్వారా ఈ లోకం ఆయనను ప్రభువుగా గుర్తిస్తుంది. ప్రభువు సన్నిధిలో, వందన వచనములు  ఎలిశబెతమ్మ చెవిన పడగానే, ఆమె గర్భ మందలి శిశువు (బప్తిస్మ యోహాను) గంతులు వేసెను.

క్రీస్తు మన మధ్యలో ఉన్నప్పుడు, మనలో సంతోషము, ఆనందము తప్పక ఉంటాయి. క్రీస్తు మన హృదయములో నున్నప్పుడు, జన్మించినప్పుడు, మన హృదయాలు, మనస్సులు ఆనందముతో గంతులు వేస్తాయి. ప్రభువు మనతో ఉంటె, మనకు ఆశీర్వాదము, శాంతి సమాధానాలు ఉంటాయి.

పవిత్రాత్మ వరముతో,  ఎలిశబెతమ్మ గర్భములోనున్న శిశువు గంతులు వేయడమే గాక,  ఎలిశబెతమ్మ కూడా ఎలుగెత్తి ఇలా పలికింది: "స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడినదానవు. నీ గర్భ ఫలము ఆశీర్వదింప బడెను". మరియమ్మ జీవితములో గొప్ప ఆశీర్వాదాన్ని, దీవెనను, ధన్యతను పొందినది. దీనికి ముఖ్య కారణం, "ప్రభువు పల్కిన వాక్కులు నేరవేరునని మరియమ్మ విశ్వసించినది" (లూకా 1:45). మరియ ద్వారా ఈ లోకానికి వచ్చు ఆ శిశువు "యేసు" అను పేరు పొందును. మహనీయుడై, మహోన్నతుని  కుమారుడని పిలువబడును. ప్రభువైన దేవుడు, తండ్రియగు దావీదు సింహాసనమును పొందును. ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును. ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు (లూకా 1:31-33). గబ్రియేలు మరియమ్మతో పలికిన వాక్కులు.

ప్రభువు మనతో కూడా ఈనాడు మాట్లాడు చున్నాడు. ఆయన పలుకులు తప్పక వేరవేరుతాయని విశ్వసించుదాం. ఆ విశ్వాసము వలననే దేవుడు మనలను కూడా ఆశీర్వదిస్తాడు. మరియమ్మ తన జీవితాంతము దేవునికి విశ్వాసపాత్రురాలుగా జీవించినది. ఆమె విశ్వాసము వలననే, దేవుని ప్రణాళికకు, చిత్తానికి  "నీ మాట చొప్పున నాకు జరుగునుగాక" అని చెప్ప గలిగినది.

మన అనుదిన జీవితములో, ప్రభువు మనలో తన ఉనికిని గ్రహించుటకు అనేక ఆనవాళ్ళను ఇస్తూ ఉంటాడు. అనేక సంఘటనల ద్వారా, వ్యక్తుల ద్వారా, తన ఉనికిని చాటుతూ ఉంటాడు. జ్ఞానస్నానములోను, భద్రమైన అభ్యంగనమున పొందిన పవిత్రాత్మ, మనం విశ్వాస కన్నులతో చూచునట్లు సహాయం చేయును. దైవ రాజ్యమును స్వీకరించుటకు సిద్ధపడునట్లు చేయును.

క్రిస్మస్ దినమున, పభువును స్వీకరించుటకు ఆయత్త పడుదాం!

ఆద్యంత రహితులైన ఓ సర్వేశ్వరా! మా మనసులను మీ కృపతో నింపుడు. ఈ విధమున మీ దూత సందేశము ద్వారా, మీ కుమారుని మనుష్యావతార వార్తనందుకొనిన మాకు ఆయన సిలువ పాటుల ఫలితమున ఆయన పునరుత్థాన మహిమలో చేరు భాగ్యము లభించును గాక!

ఆగమనకాల మూడవ ఆదివారం, YEAR C, 16 డిశంబర్ 2012, Third Sunday Advent


ఆగమనకాల మూడవ ఆదివారం, YEAR C, 16 డిశంబర్ 2012
పఠనాలు: జెఫన్యా 3:14-18, ఫిలిప్పీ 4:4-7, లూకా 3:10-18

ప్రభువునందు మీరు ఎల్లప్పుడును ఆనందింపుడు! మరల చెప్పుచున్నాను! ప్రభువు త్వరలో విచ్చేయుచున్నాడు.

సంతసం

సంతోషంగా ఉండాలని అందరు కోరుకొంటారు
అందరు సంతోషంగా ఉండాలని కొందరు కోరుకొంటారు
తమ సంతోషం కొరకు, ఇతరుల సంతోషం కొరకు అం(కొం)దరు శ్రమిస్తారు.

ఆ సంతోషమునే ధ్యేయముగా, లక్ష్యముగా చేసుకోవాలని ఈనాటి పఠనాలు ప్రభోదిస్తున్నాయి: మారు మనస్సు, మరో మార్గం, మంచి మార్గం, మంచి జీవితం అని ఎడారిలో బోధిస్తున్న యోహాను యొక్క సందేశమును వినుటకు వచ్చిన వారు, యోహాను సందేశమునకు స్పందించి, ఆ సంతోష జీవితమును పొందుటకు "మేము ఏమి చేయవలెనను" అని ప్రశ్నించారు. ఆ ప్రశ్నను ఈనాటి ధ్యానంశముగా చేసుకొని, ఈ ప్రశ్నకు సమాధానమును సువార్తలోను మరియు మొదటి రెండు పఠనాలలోనూ చూద్దాం!

సంతోషమునకు కారణములెన్నో ఉన్నాయి (ఉంటాయి). ఏదైనా పొందినప్పుడు, అనుకున్నది సాధించినప్పుడు, ప్రేమగా చూసే వారి చెంత ఉన్నప్పుడు, మనలను అర్ధం చేసుకొనే వారున్నప్పుడు... ఇలా ఎన్నో!

మొదటి పఠనములో జెఫనయ ప్రవక్త ఇస్రాయేలీయులతో "ఆనందించండి, హర్ష ద్వానము చేయండి, నిండు హృదయముతో సంతసించండి." ఎందుకంటే, మీకు విధించబడిన తీర్పు, శిక్ష తొలగించబడినవి. మీ శత్రువును ప్రభువు చెల్లా చెదరు చేసెను. అన్నటికంటే ముఖ్యముగా "ప్రభువు మీ మధ్యనే ఉన్నారు." ప్రభువు మీ చెంతనే ఉన్నారు, ప్రభువు మీతో ఉన్నారు. అందుకే భయపడకుడి. దైవ భయం (భీతి) తప్ప మీలో ఏ భయం  ఉండకూడదు. నిర్భయముగా ఉండండి. మీ చేతులను వ్రేలాడ నీయకుము, (చేతులను వ్రేలాడనీయడం అనగా శక్తి లేక, బలము లేక పోరాడక చేస్తున్న పనిని వదిలి వేయడం). నీలో సత్తువ సన్నగిల్లినను, నీలో(తో) ఉన్న ప్రభువు నీచేత మంచి కార్యములు జరిగిస్తాడు. నీ సంతోషమును నీ ద్వారా ఇతరులకు సంతోషమును కలుగ జేస్తారు. చితికిన, నలిగిన, విరిగిన నీ పైనే (నా పైనే) ప్రభువు అండగా ఉండి సంతోషమును కలుగ జేస్తారు.

అందుకే ఇశ్రాయేలు జనమా, యేరూషలేము నగరమా, సియోను కుమారి, సంతసించండి. సంతోషముగా ఉండటానికి ఆయన కీర్తనలు పాడండి. ఆయన మీ (నా) తో, మీ(నా)లో ఉన్నారని గుర్తించండి. ఆయన రాజుగా, అధిపతిగా, నాయకుడిగా ముందుండి మన (నా)తో ఉండి నడిపిస్తున్నాడని తెలుసుకోండి. ఎవరులేకున్నా ఆయన ఉన్నాడని, ఉంటాడని విశ్వసించండి. సంతోషముగా ఉండటానికి ఈ ఒక్క కారణం చాలదా?

ఇదే సంతోషాన్ని పునీత పౌలుగారు కూడా ధృఢపరుస్తున్నారు. అనుభవపూర్వకముగా ఆయన మనకిస్తున్న సందేశమిది. క్రీస్తు సందేశమును భోధించినందుకు, ఖైదీగా ఉండి, శిక్ష (మరణ శిక్ష) విధించబడి, ఆ శిక్ష అమలుకొరకు ఎదురు చూస్తున్న పౌలు వ్రాసిన సందేశమిది. ఆయనలో విచారం లేదు, దు:ఖం లేదు, ఆతురత అంతకంటే లేదు. ఎందుకంటే, ఈ సమయములోనే ప్రభువు యొక్క సన్నిధిని, సహవాసమును, ఆదరణను, ప్రేమను ఆయన అనుభవించారు. ఆ అనుభవముతో చెప్పిన (వ్రాసిన) సందేశమే. "ఆనందించండి, ప్రభువునందు ఎల్లప్పుడూ ఆనందించండి." ఎందుకంటే, ప్రభువుకు సాధ్యము కానిది ఏది లేదు (చూ. లూకా 1:37, యిర్మియా 32:27). ఆయన ఆధీనములో లేని పరిస్థితి ఏదీ లేదు. ఎటువంటి పరిస్థితి ఎదురైనా ధైర్యముగా ఎదుర్కొనండి. విచారించకండి. అది మిమ్ము, మీనుండి, దేవుని నుండి దూరం చేస్తుంది. కాబట్టి, కృతజ్ఞతతో కూడిన ప్రార్ధనతో దేవునికి దగ్గరగా రండు. ఆయన మీ (నీ)తో ఉన్నాడని తెలుసుకోండి. అప్పుడు మీకు సమాధానం, దేవుని శాంతి మీ హృదయములను, మనస్సులను భద్రముగా ఉంచుతుంది. ఇంతకంటే, ఇంకా ఏమి కావాలి సంతోషముగా ఉండటానికి?

అదే మాటను బాప్తిస్మ యోహానుగారు తనదైన శైలిలో సుంకరులతోను, రక్షక భటులతోను అంటున్నారు. వారి జీవితాలను, దానికి కావలసిన పనిని మానుకోమని యోహానుగారు చెప్పడం లేదు. దానిని నిజాయితీగా చేయమని చెబుతున్నాడు. ఇప్పటి వరకు వీరు "ఎంత ఎక్కువ ఇతరుల నుండి పొందితే అంత ఎక్కువ సంతోషం తమ స్వంతమవుతుందని" అనుకొన్నారు. దానికి భిన్నముగా యోహానుగారు నిజమైన సంతోషం 'ఇవ్వడములో'ఉన్నదని బోధిస్తున్నారు. ఇప్పటి వరకు పొందాలని (ఎక్కువ పొందాలని) తమ వారినుండి దూరమయ్యారు. ఇప్పటినుండి ఇస్తూ, తమకున్న దాన్ని ఇతరులతో పంచుకొంటూ సంతోషాన్ని పొందండని, దేవుని ప్రత్యక్షతను (సన్నిధిని) అవసరం ఉన్న ప్రతీ సోదరిలోను, సోదరునిలోను గుర్తించి, అనుభవించండని పిలుపునిస్తున్నాడు.

మొదటి పఠన౦ : ఆయన మీ మధ్యన ఉన్నాడు
రెండవ పఠన౦ : ఆయన నాతో (లో) ఉన్నాడు.
సువార్త పఠన౦ : అవసరం ఉన్న ప్రతి సోదరి, సోదరునిలో ఆయన నీకై ఎదురు చూస్తున్నాడు.
వెళ్ళు! ముందుకెళ్ళు! ఆయనను, ఆయన సన్నిధిని గుర్తించు!
ఇవ్వు! నీకు సాధ్యమైనంత!
అనుభవించు ఆ సంతోషమును.
అదే క్రిస్మస్ నీకూ, నాకు.

త్రిలోక అధినేతవైన ఓ సర్వేశ్వరా! ఈ ప్రజలు రక్షకుని రాకకై ఉత్సాహముతో వేచియుండుట మీరు కాంచుచున్నారు. అట్టి ఘన రక్షణానందమును చేరుకొనను, ఆ ఉత్సవములను ఎల్లప్పుడు గొప్ప వేడుకతో చేసికొనను, మాకు మీ కృపను ప్రసాదింపుడు.
  
Fr. John Antony Polisetty OFM Cap

ఆగమనకాల రెండవ ఆదివారము, YEAR C, 9 డిశంబర్ 2012


ఆగమనకాల రెండవ ఆదివారము, YEAR C, 9 డిశంబర్ 2012
బారూకు గ్రంధము 5:1-9; ఫిలిప్పీ 1:4-6,8-11; లూకా 3:1-6

సియోను వాసులారా! వినుడు. ప్రజలను రక్షించు నిమిత్తము రక్షకుడు వచ్చును. ఆయన వచ్చి తన ఇంపైన స్వరమును మీ హృదయములకు ఆనందకరముగా వినిపింపజేయును.

ఈరోజు శ్రీసభ మనకు ఒక గొప్ప వ్యక్తిని ఆదర్శముగా చూపిస్తూ ఉంది. అతడే పునీత బాప్తిస్మ యోహాను. ప్రవక్తలందరిలోకెల్ల గొప్ప ప్రవక్త మరియు చివరి ప్రవక్త బాప్తిస్మ యోహాను. ప్రవక్తల మొదటి కర్తవ్యం, దేవుని వాక్యాన్ని ఆలకించి, దానిని మనసారా స్వీకరించి, దైవ ప్రజలకు అందించడం. కనుక ప్రవక్త దేవునికి ప్రజలకు మధ్యవర్తి.

అలాంటి ప్రవక్తలలో ఒకరైన యెషయా ప్రవక్త పలికిన మాటలు, బాప్తిస్మ యోహాను జీవితము ద్వారా నిజమవుతూ ఉన్నాయి. "ప్రభువు మార్గమును సిద్ధము చేయుడు" అని ప్రవక్త పలికిన ఈ మాటల ద్వారా బాప్తిస్మ యోహాను దైవ ప్రజలను ప్రభువు మార్గములోనికి ఆహ్వానించి యున్నాడు. ప్రభువు రాక కోసం మార్గమును సిద్ధము చేయాలని కోరుతున్నాడు. యోహాను ప్రభువు రాక కోసం ప్రజలను సిద్ధము చేసాడు. పశ్చాత్తాపము, జ్ఞానస్నానము అను మార్గముల ద్వారా ప్రజలను సిద్ధము చేసి ముందుకు నడిపించాడు. ప్రవక్తగా, ప్రభువు మార్గమును సిద్ధపరచడం, ప్రభువును అనుసరింపగోరువారికి పశ్చాతాపము గూర్చి ప్రకటించడం యోహానుగారి పాత్ర. మరియు ప్రభువు దరికి వచ్చు వారి జీవితాలను సక్రమం చేయడం ఆయన భాద్యత.

మొదటి పఠనములో బారూకు ప్రవక్త చెప్పిన విధముగా: "ప్రతీ లోయ పూడ్చబడును. పర్వతములు, కొండలు సమము చేయబడును. వక్రమార్గములు సక్రమము చేయబడును. కరకు మార్గము నునుపు చేయబడును." క్రీస్తు యేసు రాక కొరకు మనలను మనం తయారుచేసుకొనే ఈ పవిత్ర ఆగమన కాలములో, మనలో ఉన్న లోయలను, చెడును తీసివేయడానికి ప్రయత్నించాలి. గర్వాన్ని, అహంకారాన్ని విడచి పెట్టాలి. మనం తీసుకొనే చెడు నిర్ణయాలకు స్వస్తి చెప్పాలి. మనలో ఉన్న రాతి హృదయాన్ని కరిగించమని ప్రభువును వేడుకోవాలి.

అయితే, ఇక్కడ మనం ఒక ముఖ్య విషయాన్ని గ్రహించాలి. మనం ప్రభు చెంతకు వెళ్ళటం కంటే కూడా, ఆ ప్రభువే మన చెంతకు వస్తూ ఉన్నాడు. మనం ఆయన చెంతకు వెళ్లక ముందే ఆయన ఒక అడుగు ముందు కేసి మనకన్న ముందుగా మన దగ్గరకు వస్తున్నాడు. ఎందుకన, రక్షణ కార్యములో మొదటి అడుగు వేసింది ప్రభువే కదా! కనుక క్రిస్మస్ పండుగ రోజున దేవుడే మానవ రూపాన్ని ధరించి యేసు అను వ్యక్తిగా మన మధ్యకు వస్తూ ఉన్నాడు. ఆ గొప్ప ఘడియనే మనం క్రీస్తు జయంతిగా కొనియాడుతూ ఉన్నాము. ఒక విధముగా దేవుడే మనకు మార్గాన్ని తయారు చేస్తున్నాడు. ఆ మార్గములో మనలను నడచుకోమని, జీపించమని ఆహ్వానిస్తూ ఉన్నాడు. అందుకే ప్రభువు "నేనే మార్గమును, సత్యమును, జీవమును" (యోహా 14:6) అని చెప్పారు. కనుక ప్రభువు పిలుపును గుర్తించి, గ్రహించి, అది ఒక భాద్యతగా స్వీకరించి, ప్రభువుకు సమాధానం చెప్పాలి. ఆయన మార్గములో నడవడానికి ప్రయత్నం చేయాలి. అయితే ప్రభువు మార్గము మన మార్గాలకన్న భిన్నమైనది. ఆయన మార్గము రక్షణ మార్గము. "ప్రతీ ఒక్కరు దేవుని రక్షణమును కాంచును" అని సువార్తలో వినియున్నాము. కనుక ఎవరైతే ప్రాపంచిక మార్గాలను విడిచి, ప్రభువు చూపించే మార్గములో నడుచుకొంటారో, వారు తప్పక ఆయన రక్షణములో పాలు పంచుకొంటారు..

దేవుని వాక్యము ఎడారిలో జీవించే బాప్తిస్మ యోహానుగారికి వినిపించింది. మనుగడ లేని ఎడారిలో ఆయన దేవుని వాక్కును వినగలిగాడు. అదేవిధముగా, మన జీవితములో కూడా కొన్ని సందర్భాలు ఎడారిగా మారుతూ ఉంటాయి. జీవితములో కష్టం వచ్చినప్పుడు, నిరాశ కలిగినప్పుడు, జీవితం అంధకారముగా కనిపించినప్పుడు, ఎటు వెళ్ళాలో అని దారి తెలియనప్పుడు, మన జీవితం ఎడారిలా కనిపిస్తుంది. ఒంటరివారము అవుతాము. జీవం లేనివారముగా ఉంటాము. బ్రతకాలన్న ఆశ కూడా ఉండదు. ఈ సందర్భాలన్నీ మన జీవితములో ఒక ఎడారి అనుభవాన్ని తలపిస్తాయి. కాని, మన దేవుడు, ఆయన వాక్కు ద్వారా మనతో మాట్లాడతాడు. ఇలాంటి సందర్భాలలోనే అనేకమంది ప్రవక్తలు దైవ పిలుపును పొందియున్నారు. వారిలాగా మనము కూడా మన అంత:రంగమునుండి దేవుని వాక్యాన్ని విని, దానిపై ధ్యానించినట్లయితే, మనం కూడా తప్పక ఆయన ప్రేమ పిలుపును పొందగలుగుతాము. ఆయన ప్రేమ పలుకులు మనకు జీవాన్ని ఇస్తాయి.

కష్ట సమయములో ప్రవక్త ఒక నూతన సృష్టిగా మారతాడు. దేవుని వాక్కును విని, గ్రహించి తనలో ఉన్న దైవశక్తి చేత కొత్త వ్యక్తిగా తయారవుతాడు. అదేవిధముగా, ఈ పవిత్ర ఆగమన కాలములో దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రవక్తలవలె మనం కూడా దేవుని వాక్యాన్ని విని, గ్రహించినట్లయితే, మనం కూడా నూతన వ్యక్తులుగా తయారు కావడానికి ఆస్కారం ఉంటుంది. కనుక కష్ట సమయాలలో అధైర్యం చెందక ఉండాలి. దేవుని వాక్య సహాయముతో ఒక నూతన జీవితానికి నాంది పలుక గలుగుతాము. దేవుడు ప్రతీ రోజు నూతన జీవితానికి ఆహ్వానిస్తూ ఉన్నాడు.

ఆగమన కాలంలో, ప్రభువు వస్తున్నాడు అన్న సందేశం మన హృదయాలలో మ్రోగుతూ ఉంటుంది. ఆ సంతోష కర సందేశమే మనలను ముందుకు నడిపిస్తూ ఉంటుంది. ప్రభువు రాకతో, తన జీవితాన్ని, ప్రేమను మనతో పంచుకొంటున్నాడు. అదే సమయములో, మన జీవితాన్ని, ప్రేమను దేవునితోను, ఇతరులతోనూ పంచుకోవాలని  ఆహ్వానిస్తున్నాడు. యోహాను గారు ప్రకటించిన క్రీస్తు రాకడ కొరకు విశ్వాసముతో నిరీక్షించాలి. ప్రభువు రాకను స్వాగతించి, ఆయనకు మన హృదయాలలో స్థానం ఇవ్వాలి.

యోహాను వలే మనము కూడా ఈనాడు మన సంఘములో ప్రవక్తలుగా మారాలి. ఇతరులకు మార్గ చూపరులుగా ఉండాలి. ఇతరుల జీవితాలలో వెలుగు నింపాలి. ప్రభువు దరికి రావడానికి వారికి మార్గమును సిద్ధపరచాలి. దేవుని వాక్యమును బోధించాలి.

ఈ నిరీక్షణలో మరియమ్మను ఆదర్శముగా తీసుకొందాం. లోక రక్షణకోసం ఆమె ఎంతగానో నిరీక్షించారు. తనను తాను సిద్ధం చేసుకొన్నారు. ప్రార్ధనలు చేసారు. దేవుని వాక్యం విని ధ్యానం చేసారు.  మరియ తల్లి ప్రార్ధన సహాయం మనకు తోడ్పడునుగాక!

సర్వశక్తి వంతులును, కనికరపూరితులైన ఓ సర్వేశ్వరా! మీ కుమారునికై ఎదురేగ ఉత్సాహముతో వచ్చు మమ్ము లోక అవరోధములేవియు ఆటంకపరపకుండునుగాక. స్వర్గీయ జ్ఞాన సంపూర్ణమును, ఆయనతో నేకమగు భాగ్యమును మాకు ప్రసాదింపుడు.

Fr. Inna Reddy Allam
OFM Cap

ఆగమనకాల నాలుగవ ఆదివారము, Year B

ఆగమనకాల నాలుగవ ఆదివారము, Year B
18 December 2011
2 సా. 7: 1-11,16; రోమీ. 16:25-27; లూకా 1:26-38

ఈనాటి పటనాలు ఒక గొప్పవిషయాన్ని స్పష్టంచేస్తున్నాయి. దేవుడు మనందరికీ ఒక్కొక్క ప్రణాళికను ఈర్పాటు చేసియున్నాడు. మరియు, ఆ ప్రణాళిక తప్పక నెరవేరుతుంది. మన హృదయాలలో నిజమైన శాంతి నెలకొనాలంటే, దేవుని ప్రణాళిక, మన ప్రణాళిక కావాలి - పరలోక జపములో ప్రార్దిస్తున్నట్లుగా, ''మీ చిత్తము నెరవేరును గాక!''

దావీదు మాహారాజు దేవాలయమును నిర్మించుటకు నిర్ణయించుకొన్నాడు. అది తన ఆలోచనగా, ప్రణాళికగా భావించాడు. కాని, అది దైవ ప్రణాళిక: ''ప్రభువు ఇల్లు కట్టనియెడల దానిని కట్టినవారిశ్రమ వ్యర్ధమగును'' (కీర్తన 127:1). దావీదును, అతని వంశమును నిత్యకాలము నిలచే ఆలయముగా మరియు మెస్సయ్యజన్మించే ఆలయముగా నిర్మించాలనేది దేవుని ఆలోచన, ప్రణాళిక! దేవుని ''మాస్టర్ ప్లాన్'' విశ్వసృష్టితోనే ఆరంభమైనది. రక్షణ ప్రణాళికను ఏదేను తోటలోనే ఏర్పాటుచేసియున్నాడు - ''స్త్రీ మరియు ఆమె సంతతి'' (ఆ.కాం.3). ఈ ప్రణాళిక పరిపూర్తికి ఆరంభం ఈనాటి సువిశేష పటనములో చూస్తున్నాము. ''దావీదు వంశస్తుడగు యోసేపునకు ప్రధానము చేయబడిన కన్యక మరియమ్మయొద్దకు దేవుడు గబ్రియేలుదూతను పంపెను'' (లూకా 1:26-27). దేవుని ప్రణాళిక సారాంశం లూకా 1: 31-33 వచనాలలో చూస్తున్నాము.

ఈనాటి సువిశేష పటనాన్ని ధ్యానిద్దాము:


లూకా 1:26-27:
ఈ ఆలోచనే అప్పటి వారికి ఒక పరిహాసముగా తోచియుండవచ్చు. ఎందుకనగా, గలిలయ తృణీకరించబడిన పట్టణము. ''గలిలయనుండి ఏ ప్రవక్తయు రాడు'' (యోహాను 7:52), ''నజరేతునుండి ఏదైనా మంచి రాగలదా?'' (యోహాను 1:46). దేవుని ఆలోచనలు, ప్రణాళికలు వేరుకదా! ఆయన గలిలయపట్టణమునుండియే, ప్రవక్తలందరిలో గొప్ప ప్రవక్తను ఎన్నుకొంటున్నాడు. ఈ విధముగా, ప్రవక్తల ముఖ్యముగా యెషయ ప్రవక్త ప్రవచనాలు నేరవేర్చబడుతున్నాయి. దావీదువంశస్తుడగు యోసేపునకు 'ప్రధానము' చేయబడిన మరియమ్మ అనుకన్యకకు శుభసందేశాన్ని అందించుటకు గబ్రియేలుదూత పంపబడెను. ఇక్కడ గమనించవలసిన విషయం: మరియమ్మ కన్యక. 'ఆమె ఏ పురుషుని ఎరుగకపోవడం'(లూక 1:34). ఆమె ప్రధానము (engagement) చేయబడిన కన్యక. ఇంకను వివాహము జరగలేదు. చట్టప్రకారముగా, భవిష్యత్తులో తన భర్తతో ఉండవలసినది. ఈ పరిస్థితినుండి బయటపడాలంటే విడాకులు అవసరం (మత్తయి 1:19). ఆ కాలములో ప్రధానము జరిగిన తర్వాత, ఇరువురు శారీరక సంబంధమును కలిగియుండవచ్చు. కాని, మరియ యోసేపుల విషయములో అలా జరగలేదు. దేవునియందు పరిపూర్ణముగా, పరిశుద్ధముగా జీవించుటకు నిర్ణయించుకొని ఉన్నారు. సాధారణముగా, 'ప్రధానము' సమయం పన్నెండ్రు మాసాలు ఉండేది.
'ఆరవమాసము' యోహాను గర్భమందు పడిన తర్వాత ఆరవమాసము. ఇశ్రాయేలుప్రజలు, మెస్సయ్యకోసం, ఎంతోకాల ఎదురుచూపు తర్వాత, దేవుని ప్రణాళిక ఇప్పుడు వేగముగా జరగడం చూస్తున్నాం. దేవుని శుభసందేశం గబ్రియేలుదూతద్వారా పంపడుతుంది. గబ్రియేలుదూత, గలిలయలోని నజరేతునగరమునకు పంపబడెను.

లూకా 1:28: ''అనుగ్రహ పరిపూర్ణురాలా! నీకు శుభము. ఏలినవారు నీతో ఉన్నారు''. మరియ 'అనుగ్రహ పరిపూర్ణురాలు'. ప్రతీ స్త్రీ మెస్సయ్యకు తల్లి కావాలని కోరుకొనేది. కాని, అందరి స్త్రీలలోకెల్ల మారుమూల నజరేతులోనున్న మరియను దేవుడు ఎన్నుకొన్నాడు. భర్తను ఎరుగక జన్మనివ్వడం సమాజములో అవమానకరమని మనందరికీ తెలిసిన విషయమే! ఆ అవమానాన్ని భరించుటకు 'ఏలినవారు ఆమెతో ఉన్నారు'. ఆమె గర్భమునుండి సంపూర్ణ మానవత్వం-దైవత్వం కలిగిన దేవుని కుమారుడు జన్మించవలసియున్నది. మరియ జీవితములో జరగబోయే ప్రతీ కార్యములో ఆమెతో ఉంటాడని, దేవుడు అభయాన్ని ఇస్తున్నాడు.

లూకా 1:29: ''మరియ కలత చెందినది''. దేవుని శుభవచనాలకు అర్ధ మేమిటోయని ఆలోచించింది. తననుండి దేవుడు ఏదో గొప్ప విషయాన్నే కోరుతున్నాడని ధ్యానించి ఉంటుంది. ఇంతకుముంది ఇలాంటి దర్శనాలను పొందిన సంఘటనలు ఆమె మదిలో మెదలి ఉంటాయి (ఆ.కాం. 18:10-15; న్యాయాధిపతులు 13:3-5,9).

లూకా 1:30: ''మరియమ్మా! భయపడకుము. నీవు దేవుని అనుగ్రహమును పొందియున్నావు. ఇదిగో! నీవు గర్భమును ధరించి కుమారుని కనిదెవు. ఆ శిశువునకు 'యేసు' అని పేరు పెట్టుము. దేవుని అనుగ్రహమనేది మనపైగాని, మన కార్యాలపైగాని ఆధారపడదు. దేవుని అనుగ్రహం ఒక వరం. ఆ వరాన్ని, ఆ అనుగ్రహాన్ని మరియమ్మ పొందియున్నది. మరియ ఒక కన్యకగా గర్భము ధరించవలసియున్నది. ఎందుకన, పవిత్రాత్మ ఆమెపై వేంచేయును. యెషయ 7:14 వచనం గుర్తుకు వస్తుంది: ''యువతి గర్భవతియై ఉన్నది. ఆమె కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు (దేవుడు మనతో ఉన్నాడు) అని పేరు పెట్టును. 'యేసు' అనగా 'యహోవా రక్షణ'.

లూకా 1:32-33: గబ్రియేలుదూత జన్మించబోయేవాడు ఎలాంటివాడో తెలియపరుస్తుంది: ''మహనీయుడు, మహోన్నతుని కుమారుడని పిలువబడును, ప్రభువగు దేవుడు, తండ్రియైన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును, ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును, మరియు ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు.''

లూకా 1:34: ''నేను పురుషుని ఎరుగనుకదా! ఇది ఎట్లు జరుగును?'' మరియమ్మ అమాయకత్వం కనిపిస్తుంది. ఇదంతయు కూడా పవిత్రాత్మ దేవుని శక్తి వలన జరుగును.

లూకా 1:35: పవిత్రాత్మ వలన గర్భము! మానవుని ఆలోచనలకు అందనటువంటిది. ఇది మానవ శక్తితో జరిగేది కాదు. కాని, దేవుని మహోన్నతమైన పవిత్రాత్మ శక్తి వలన జరిగెడి రక్షణ ప్రణాళిక. అందుమూలముననే, జన్మించేవాడు, మహోన్నతుని కుమారుడు, దేవుని కుమారుడు అని పిలువబడును. ఈవిధముగా, రాబోవువాని జన్మ అద్భుతమైనదని మరియు ఆ రాబోవువాడు మెస్సయ్య అని తెలియుచున్నది.

లూకా 1:36-37: ఎలిశబెతమ్మ ముసలిప్రాయములో గర్భము ధరించడముగూర్చి వింటున్నాం. ఇప్పుడు ఆరవమాసము. మరియమ్మకు తప్పక ఈ విషయం తెలుసు. కాని, ఆమె ఆశ్చర్యపడకపోయిఉండవచ్చు. కాబట్టి, గబ్రియేలు దూత దీనిని కేవలం ఒక వార్తగా కాకుండా, ఆ ఇరువురి (యోహాను మరియు యేసు) జన్మల ప్రాముఖ్యతను గూర్చి తెలియపరస్తుంది. దేవుని వాక్యము శక్తివంతమైనది, ఫలవంతమైనదని తెలుస్తున్నది. మరియమ్మకు దూతద్వారా అందిన దేవుని వాక్యముకూడా తప్పక నేరవేరునని నిరూపితమగుచున్నది. యుక్తవయస్సులోనున్న మరియకు ఇది ఒకపెద్ద విధియే! అందుకే ఎలిశబెతమ్మను గూర్చి చెప్పడము వలన మరియపట్ల దేవుని కరుణ, దయ, స్పష్టమగుచున్నది. ''దేవునికి అసాధ్యమైనది ఏదియు లేదు'' అని ధ్యానించుదాం!

లూకా 1:38: ''ఇదిగో! నేను ప్రభువుదాసిరాలను. నీ మాటచొప్పున నాకు జరుగునుగాక!'' దేవుడు తనని ఎందుకు ఎన్నుకొన్నాడో మరియ జవాబుద్వారా నిరూపితమగుచున్నది. దేవుడు మరియను అనుగ్రహించాడు; ఆమె ప్రభువు దాసిరాలు. మరియ దేవుని చిత్తానికి తననుతాను పరిపూర్ణముగా సమర్పించుకొన్నది. పరిపూర్ణమైన విధేయతను చూపించింది. అసాద్యమైనది తననుండి కోరబడినది. కాని, దేవునికి అసాద్యమైనది ఏదియు లేదని మరియమ్మ విశ్వసించినది. దేవుని ప్రణాళికయే, తన ప్రణాళికగా భావించింది. మరియగర్భం నిత్యకాలమునిలచే, మరియు దేవుడే స్వయముగా ఏర్పాటుచేసికొన్న దేవుని దేవాలయము. దేవుని ఆలోచన, ప్రణాళిక సజీవమైనది! ఇదంతయు మనరక్షణ నిమిత్తమేనని మనం మరువకూడదు సుమా!

మనముకూడా మరియవలె క్రీస్తుకు ఈ లోకములో జన్మనివ్వాలి. మన హృదయాలు ఆయనకు ఆలయాలు కావాలి. ఆయన నిత్యకాలము మనలో నివసించాలి. పునీత పౌలుగారి వాక్యాలను గుర్తుకు చేసుకొందాం: ''ఆయనతో ఏకత్వము వలన మీరును అందరితో కలసి ఒక గృహముగా నిర్మింపబడుచున్నారు. అందు దేవుడు తన ఆత్మద్వారా నివసించును (ఎఫే 2:22). ''మనము ఈ భూమిమీద జీవించు ఈ గుడారము, అనగా మన భౌతిక దేహము శిధిలమగును. అప్పుడు మన జీవమునకై దేవుడు పరలోకమున ఒక గృహమును ఒసగును. అది చేతులతో చేసినది కాదు. అది ఆయనచే నిర్మింపబడినదే. పైగా నిత్యమైనది'' (2 కొరి 5:1).

ఆగమనకాల మూడవ ఆదివారం

ఆగమనకాల మూడవ ఆదివారం
11 డిశంబర్ 2011 YEAR B
యెషయ 61:1-2, 10-11; I తెస్స 5: 16-24; యోహాను 1 : 6-8, 19-28

మొదటిపటనములో, శుభవార్తప్రకటన, బందీలకువిముక్తి అనుదైవకార్యమును కల్గియుండి రాబోవువానిని గూర్చి యెషయప్రవక్త ప్రవచిస్తున్నాడు. సువిశేషపటనములో ఈలోకమునకు వెలుగైనున్నవాని రాకనుగూర్చి బప్తిస్మయోహానుగారు ప్రవచిస్తున్నారు.

గత ఆదివారముకూడా యోహానుగూర్చి, అతని జీవితము, భోధనలగూర్చి ధ్యానించియున్నాము. ఈ రోజుకూడా, బప్తిస్మ యోహానుగూర్చి సువిషేశములో వింటున్నాము. అతనుఎవరో, ఎవరుకాదో సుస్పష్టముగా ఈరోజు తెలుసుకోవచ్చు. మొదటిగా, ఎలియావలె దుస్తులు ధరించినప్పటికినీ(మా 1:6; 2 రా. 1:8), ఎలియావలె పశ్చాత్తాపము, తీర్పుగురించి ప్రకటించినప్పటికిని (1రా. 18:21; 2 రా.ది. 21:12-15), యోహాను పరలోకమునుండి తిరిగివచ్చిన ఎలియాకాదు(2 రా. 2:11). అయితే, యోహాను శారీరకముగా ఎలియాకానప్పటికిని, అతడు ఎలియాఆత్మయును, శక్తియునుకలిగి (లూకా 1:17; మలాకి 3: 23-24) దైవకార్యమును పరిపూర్ణముచేయుటకు పంపబడినవాడు. యోహాను దేవునివాక్యమును ప్రకటించినప్పటికిని, ద్వి.కాం. 18: 15-19 లో మోషేప్రవచించిన ప్రవక్తయునుకాదు. తల్లిగర్భమునుండియే పవిత్రాత్మతో అభిషిక్తుడైనప్పటికిని, అతను మెస్సయ్య కాదు (లూకా 1: 15,44).


మరి యోహాను ఎవరు? యోహాను ప్రభువుమార్గమును సిద్ధముచేయుటకు ఎడారిలో ఎలుగెత్తిపలుకు స్వరము (యోహా 1:23). ఎవరిపై అయితే పరమండలమునుండి ఆత్మదిగివచ్చినదో (యోహాను 1:32), మరియు మొదటిపటనములోవిన్న వాగ్దానములను పరిపూర్ణముచేయుటకు వచ్చియున్నాడో (లూకా 4:16-21) అతనిని మనకు పరిచయం చేయుటకు పంపబడినవాడు.

క్రిస్మస్ దినమునవచ్చు మెస్సయ్యను విశ్వసించుటకు బాప్తిస్మయోహాను మనకు 'వెలుగు'ను చూపించుటకు వచ్చినవాడు. యోహాను ఆవెలుగు కాదు. కాని, ఆ వెలుగునకు సాక్షమీయవచ్చెను. ఈ వెలుగుకోసమే మనం ఈ ఆగమనకాలమంతయు ఆయత్తపడుతూ, విశ్వాసముతో, నమ్మకముతో, గొప్పఆశతో ఎదురుచూస్తున్నాము. వెలుగు ఎప్పుడుప్రకాశిస్తూఉంటుంది. వెలుగువచ్చినపుడు మనలో, మనచుట్టూఉన్న అంధకారము పటాపంచలు అవుతుంది.

మనందరికి తెలిసినవిధముగా, వెలుగు చీకటి రెండు ఏకకాలములో విమడలేవు. చీకటివున్నచోట వెలుగు ఉండదు. వెలుగుఉన్నచోట చీకటిఉండదు. ఆ వెలుగు పేదలకు సువార్తను భోదించుటకు, చేరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డివారికి చూపును కలిగించుటకు, పీడితులకు విమోచనము కలుగజేయుటకు మరియు ప్రభుహితమైన సంవత్సరమును ప్రకటించుటకు పంపబడెను (లూకా 4:18-19). క్రీస్తువచ్చినప్పుడు మనలోని అంధకారము పటాపంచలు అవుతుంది. ఆయనరాకతో మనజీవితాలు ప్రకాశవంతమవుతాయి. ఆ వెలుగు ఈ లోకమున ఉండెను. ఆ వెలుగుమూలమున ఈ లోకము సృజింపబడెను.

ఈనాటి రెండవపటనములో, పౌలుగారు ''సర్వదా సంతోషముగా ఉండుడు'' అని చెప్పుచున్నారు. ఒకరు ఆదిశిస్తే వచ్చేది కాదు సంతోషం. అది ఒక అనుభూతి. కాని, పౌలు గారు చెప్పిన విధముగా, మనం ఎల్లప్పుడూ సంతోషముగా ఉండాలి, ఉండగలం. ఎందుకన, మన సంతోషానికి మూలాధారం మన ప్రభువు. మన భాదలలో కూడా, మనం సంతోషముగా ఉండవచ్చు. మనం ఎంత సంతోషముగా ఉన్నామనేది, మనం ప్రభువునకు ఎంత దగ్గరగా ఉన్నామో, ప్రభువు మనకి ఎంత దగ్గరాగా ఉన్నాడో అన్న దానిపై ఆధార పడిఉంటుంది. కాబట్టి, మనం ప్రభువునకు ఎంత దగ్గరగా ఉంటె, అంత సంతోషముగా ఉండగలం. ప్రభువు శిలువలోనున్న, భాదలలోనున్న ఆయన ప్రభువే. శిలువనుండికూడా మనకి సంతోషాన్ని ఇవ్వగలడు. 'కష్టాలు వచ్చినప్పుడే దేవుడు గుర్తుకొస్తాడు' అని అంటాముకదా! మరి అలాంటప్పుడు, మన భాదలో, దుఃఖంలో, వ్యాధిలో కూడా మనం ప్రభువుతో ఉన్నప్పుడు సంతోషముగా ఉండగలం. ప్రతీ పునీతుని సంతోషరహస్యం అదే! భాదలు వారిసంతోషాన్ని అధికమేచేసాయి. ఎందుకన, వారు ఎల్లప్పుడూ ప్రభువుతో ఉన్నారు కనుక! ఇదీ మన సంతోషరహస్యముకూడా కావాలి!

ప్రభువునకు చేరువ కావాలంటే,

మనకి, మనప్రభువునకు మధ్యఉన్న ఆటంకాలను తొలగించాలి. ఇంకోమాటలో చెప్పాలంటే, మన జీవితమునుండి, మన పాపాలను తీసివేయాలి. మనపాపమే ప్రభువునుండి మనలను దూరంచేస్తుంది. దీనికి, మొట్టమొదటి మెట్టు 'పాప సంకీర్తనము'.

ప్రతీదినం, ప్రతీక్షణం, ప్రభువు మనలను ఎక్కడఉండమని నిర్దేశిస్తే అక్కడ ఉండాలి. మనభాద్యతలను సక్రమముగా నిర్వహించాలి.

ఆదివార దివ్యపూజలో విశ్వాసముగా పాల్గొనాలి. అప్పుడే, ప్రభువునకు విశ్వాసముగా ఉండగలం, ఆయనకీ దగ్గర కాగలం.

''సదా ప్రార్దింపుడు'' (1 తెస్స 5:17). ప్రార్దన అనగా ప్రభుతో సంభాషించడం. ఆయనతో ఒక స్నేహితునితో మాట్లాడినట్లుగా, మాట్లాడవచ్చు.

''పొరుగు వారిని ప్రేమింపుడు''. క్షమా, అర్థం చేసుకోవడం, అంగీకారం, ప్రోత్సాహం అను గుణాలను అలవార్చుకొందాం. ఈ విధముగా, ప్రభువునకు ఎల్లప్పుడూ కృతజ్ఞులమైఉండగలం. ''అన్ని వేలలయందును క్రుతజ్ఞులై ఉండుడు (1 తెస్స 5:18).

ఇలా ప్రభువునకు చేరువ అయినప్పుడే, పరిపూర్ణమైన ఆనందముతో, సంతోషముతో క్రిస్మస్ పండుగను కొనియాడగలము. ప్రభుహితమైన సంవత్సరమును కొనియాడుటకు క్రిస్మస్ రోజు మనదరికి చాల ప్రత్యేకమైనది. యెషయ ప్రవక్తద్వారా, పౌలుగారి లేఖద్వారా, మరియు బాప్తిస్మయోహానుగారిద్వారా, ప్రభుహితమైన సంవత్సరమును కొనియాడుటకు, సంతోషముతో, ఆనందముతో మనల్నిమనం సిద్ధపరచుకోవాలని ప్రభువు ఆదేశిస్తున్నారు.

ఆగమనకాల రెండవ ఆదివారము

ఆగమనకాల రెండవ ఆదివారము
యెషయ 40:1-5, 9-11; పేతురు 3:8-14; మార్కు 1:1-8

ఆగమన కాలము: రెండు భాగాలు
భాగం 1: డిశంబర్ 16 వరకు

అన్ని దైవార్చనకాలాలలో ముఖ్యముగా, సువిశేషపటనము ప్రధానకేంద్రముగా నిలుస్తూఉంటుంది. ఆగమనకాలములోని మొదటివారాల పటనాలు యెషయగ్రంథమునుండి తీసుకొనబడుతున్నాయి. విశ్వాసకన్నులతో చూసినట్లయితే, ఈ పటనాలు మెస్సయ్యరాకను గూర్చి ప్రభోదిస్తున్నాయి. అధేవిదముగా , ఇతర దైవార్చనకాలాలకు భిన్నముగా, సువిశేష పటనము వేరువేరు సువార్తలనుండి తీసుకొనబడటము గమనిస్తాము.

దాదాపు రెండువారాలపాటు యెషయగ్రంథమునుండి పటనాలను ధ్యానించినతరువాత, మెస్సయ్యరాకను గూర్చి, సిరాకు, సంఖ్యాకాండము, జెఫన్యా గ్రంధములనుండి ఆలకిస్తాము. తర్వాత, మరల యెషయగ్రంధమునకు తిరిగిరావడం జరుగుతుంది. వారాలు గడచేకొలది ప్రవక్తలు రక్షకునిరాకను గూర్చి సుస్పష్టముగా ప్రవచించడం చూస్తాము.

ఈవిధముగా, ఆగమనకాల మొదటిభాగములో, మొదటిపటనాన్ని పటించినప్పుడు, నిరీక్షణ, ఆశ, నమ్మకము, వాగ్ధానము మొదలగు అంశములగూర్చి ధ్యానిస్తూఉంటాము. సువిశేషపటనాన్ని చదువుకొన్నప్పుడు, ప్రవక్తలప్రవచనాల సంపూర్ణతను ధ్యానిస్తూఉంటాము.

భాగము 2: డిశంబరు 17 - 24

క్రిస్మస్ పండుగకుముందు 8 రోజులు, పటనాలమధ్య బాంధవ్యం మారుతుంది. సువిశేషపటనం క్రిస్మస్ వేడుకలకు తీసుకొని వస్తుంది. మత్తయి, లూకా సువార్తలలోని యేసు బాల్యవృత్తాంతాలను ధ్యానిస్తూఉంటాము. ఈదినాలలో, మొదటిపటనము హెబ్రీయుల గ్రంథమునుండి తీసుకొనబడుతుంది.

నా కంటే శక్తిమంతుడొకడు నా వెనుక రానున్నాడు (మార్కు 1:7) - బప్తిస్మ యోహాను.

ఆగమనకాలము 'కాలసూచనలను' (signs of the times) గమనించేకాలము. దైవరాజ్యము మనహృదయాలలో, మనసంఘములో నెలకొనుసమయములో పొందు ఆనందము, నమ్మకము అను కాలసూచనలను గమనించాలి. ఆగమనకాలాన్ని ఒక నమ్మకము మరియు ఎదురు చూసే సమయముగా కొనియాడుటకు మన విశ్వాసమే మనలను ఆహ్వానిస్తుంది. మనకు తెలిసినవిధముగా, క్రీస్తురాకయందు న్యాయము, ప్రేమ, శాంతితో కూడిన దైవరాజ్యస్థాపన జరిగి ఈలోకాన్నే మారుస్తుంది. క్రీస్తు మానవరూపమున ఈలోకమున జన్మించి 2000 ల సం,,లు గడచి పోయాయి. ఈ కాలమంతయుకూడా మనవలోకానికి ఒక గొప్ప దైవవరం, అనుగ్రహం. ఈ సమయమంతయు, అన్నిచోట్ల, అన్నిజాతులకు, దయ, పాపక్షమాపణతోకూడిన సువార్త బోధించబడియున్నది. ఈ కాలమంతయు, పవిత్రాత్మశక్తి లోకాన్ని మారుస్తూ దైవరాజ్యస్థాపనకు మనల్ని ఆయత్తంచేస్తూ ఉండినది. ప్రతీ ఆగమనకాలము ఒక దైవవరం. దైవ రాజ్యస్థాపనకు ఆయత్తపడేకాలం. యేసునాటికాలములో, పాలస్తీనాప్రజలు యోహానుబోధలు విని సిద్ధపడ్డారో, ఈ రోజు మనముకూడా సిద్ధపడాలి: ''పరలోకరాజ్యము సమీపించినది. మీరు హృదయపరివర్తనము చెందుడు'' (మ. 3:2).

బైబిలుగ్రంధములో ఇద్దరువ్యక్తులు ప్రాధాన్యముగా ఆగమనకాలముతో అనుబంధాన్ని కలిగియున్నారు: ఒకరు మరియమ్మగారు, మరొకరు బప్తిస్మయోహానుగారు. ఇద్దరుకూడా వారివారి రీతిలో క్రీస్తురాకకై ఎదురుచూసారు. మరియమ్మ తననమ్మకాన్ని సంపూర్ణముగా దేవునిపై ఉంచి, దైవచిత్త కార్యరూపానికి ఎదురుచూసింది. ఆమె ''అవును'' అని చెప్పి ఎదురుచూసింది. దేవుడు ఆమెతో చేసినవాగ్దానములు తప్పక నెరవేర్చబడతాయని నమ్మకముకలిగి ఉన్నది. బప్తిస్మయోహానుగారు శక్తివంతముగా దైవకుమారునిరాకనుగూర్చి భోదించాడు. అతని ఎదురుచూపు, తక్షణమైన పశ్చాత్తాపము, మారుమనస్సుతో ఉన్నది. మరియమ్మది ఓర్పు, నమ్మకముతో కూడిన ఎదురుచూపు. యోహానుగారిది ఛాలెంజ్, తీర్పుతో కూడిన ఎదురుచూపు. ఈనాటి మన ధ్యానాంశం బాప్తిస్మ యోహానుగారి జీవితం, ఆయన భోధన మరియు ఆయన ఎదురుచూపు.

బప్తిస్మ యోహానుగూర్చి మనకి ఏం తెలుసు?

మెస్సయ్యమార్గమును సిద్ధపరచువాడు ఒక పెద్ద 'బుల్డోజరు' వలె వచ్చును అని యెషయప్రవచనాలలో కన్పిస్తుంది.. దేవునికొరకు ఎడారిలోనే రహదారిని ఏర్పాటు చేయగలవాడు. ''ప్రతి లోయ పూడ్చి ఎత్తుచేయుడు, ప్రతిపర్వతమును, కొండను నేలమట్టముచేయుడు. మిట్టపల్లములు సమతలముకావలెను. కరుకు తావులు నునుపుకావలెను. (యెషయా 40:4).

తిబేరియ రోములో చక్రవర్తి. పోంతు పిలాతు యూదయాలో పాలకుడు. హేరోదు అంతిపాసు గలీలయను, ఫిలిప్పు ఇతూరయా-త్రకోనితలకు, లిసాన్యా అబిలేనేకు అధిపతులు. అన్నా-కైఫాలు ప్రధానార్చకులు. లోతైన అవినీతి, పరిపాలనలోను-మతపరమైన విషయాలలోను క్రూరత్వం! ఇలాంటి పరిస్థితులలో జీవించిన వ్యక్తి బప్తిస్మయోహానుగారు. బప్తిస్మయోహానుగారి పరిచర్య అనాది క్రైస్తవులకు ఎంతోవిశేషమైనది, ప్రాముఖ్యమైనది. సువార్తలన్నియుకూడా అతనిగూర్చి చెబుతున్నాయి. 400 నిశబ్ద సం,,ల తర్వాత దేవుడు తనప్రజలతో తన నూతనప్రవక్తద్వారా మాట్లాడుతున్నాడు. మెస్సయ్యరాకనుగూర్చి ప్రవచించడానికి రాబోవు ఏలియ బప్తిస్మయోహానుగారు (మార్కు 9:13; మ 11:10-14; 17:12; లూ 1:17). ప్రభువు మార్గమును సిధ్ధమొనర్చువాడు, ఆయన త్రోవను తీర్చిదిద్దువాడు.

యోహాను జీవితం

యోహాను జననము ప్రత్యేకమైనది, అద్భుతమైనది (లూ 1:57-80). యోహాను అను నామము దేవుని చేత ఇవ్వబడినది (లూ 1:13). యోహాను అనగా 'దేవుడు దయాళుడు'. దేవునిఆగమనమును స్వీకరించుటకు, ప్రజల హృదయాలను సిద్దపరచుటకు పంపబడిన ప్రవక్త. ప్రజలు పాపమునుండి పశ్చత్తాపమునకు, అందకారమునుండి వెలుగులోనికి రావాలని భోదించాడు.

''బాలుడు పెరిగి దృఢకాయుడై పరిపూర్ణజ్ఞానము కలవాడాయెను''(లూ 2:40). యూదయాదేశపు ఎడారిలో బోధించుచూ, ప్రభువుమార్గమును సిద్ధముచేస్తూ, ఆయనత్రోవను తీర్చిదిద్దుతున్నాడని చూస్తున్నాము. (మ 3:1-12; మా 1:1-11). ఎడారి, ప్రవక్తలందరికి ప్రత్యేకమైనస్థలం. తర్ఫీదుపొందు తావు. ప్రవక్తలందరూ ఎడారిలో గడిపినవారే! మొదటిగా, ఏడారిలోనే మోషే దేవునిస్వరాన్ని విన్నాడు (ని.కా.3:1-6). ఇశ్రాయేలుప్రజలతో ఒప్పందం చేసుకొన్నది, 10 ఆజ్ఞలుపొందినది ఎడారిలోనే! ఏలియా ఎడారిలోనికి నడిపించబడ్డాడు (1 రాజులు 19:3-7). అక్కడ అతను దేవుణ్ణి కలుసుకోవడం జరిగింది(19:3 -12). ఎడారి దేవుణ్ణి కలుసుకొను స్థలముగా సూచిస్తున్నది. అందుకే యేసుప్రభువుకూడా తండ్రిదేవుణ్ణి కలుసుకొనడానికి ఎడారికి వెళ్ళాడు (మా 1:11-12). ఏలియావలె (II రా 1:8) యోహానుకూడా, ఒంటె రోమములు కంబళి ధరించి, నడుమునకు తోలుపట్టెను కట్టి, మిడతలను భుజించుచూ, పుట్టతేనేను త్రాగుతూ జీవించుచుండెను. (మ 3:4).

యోహాను భోధన

అతని భోదనలు శక్తివంతమైనది. దుస్తులను, భోజనాన్ని ఇతరులతో పంచుకోవాలని (లూ 3:11), సుంకరులు నిర్ణయించబడిన పన్నుకంటే అధికముగా తీసుకోవలదని (లూ 3:12-13), రక్షకభటులు బలాత్కారముగాకాని, అన్యాయారోపణవలనగాని, ఎవరిని కొల్లగొట్టవలదని (లూ 3:14) ముక్కుసూటిగా భోదించాడు. తన భోధ ద్వారా ప్రభువుమార్గమును సిద్ధమొనర్చాడు (మా 3:14). ఆ మార్గమే ప్రభువు ఆగమనము: ''నా కంటే శక్తివంతుడు నా వెనుక రానున్నాడు.'' (మా 1:7). అందుకే ప్రభువు యోహానుగూర్చి ఇలా చెప్పడములో అతిశయోక్తిలేదు: ''మానవులందరిలో బప్తిస్మ యోహానుకంటే అధికుడగువాడు ఎవ్వడు పుట్టలేదు'' (మ 11:11-14).

ఈ ఆగమనకాలములో యోహాను జీవితం, భోధనలనుండి మనం ఏమి నేర్చుకోవాలి?

1. పాపము/పశ్చాత్తాపము

యోహానుగారిభోధ ఉరుములాంటిది, శక్తివంతమైనది, ముక్కుసూటిగా ఉంటుంది: 'హృదయపరివర్తన చెందండి, మీ మార్గములను మార్చుకొనండి, సక్రమముగా జీవించండి' అన్నది ఆయన భోదనల సారాంశం. పశ్చాత్తాపము అనగా, ఆలోచన విధానం మార్చుకోవడం కన్న, చేసిన పాపాలకు చింతించడం కన్న, మరియు ప్రాయశ్చిత్తం చేయడంకన్నఎక్కువ. పశ్చాత్తాపము అనగా ఆలోచనలో, మనసులో, హృదయములో సంపూర్ణమైన మార్పు కలగడం. నూతన జీవితమునకు నడిపించే మార్పు. మనపాపాలకు పశ్చాత్తాపపడి సూటిగా జీవించే శక్తి మనకి ఎక్కడనుంచి వస్తుంది? ''ఇదిగో! లోకముయొక్క పాపములను పరిహరించు దేవుని గొర్రెపిల్ల'' (యో 1:29, 36) అని యోహాను యేసు ప్రభువును మనకి పరిచయం చేస్తున్నాడు. క్రీస్తు అనుచరులకు పాప విముక్తి సిలువనుండియే కదా!

2. నిరాశ/ఆశ

''పరలోక రాజ్యము సమీపించినది'' మెస్సయ్యరాబోవు సమయం ఆసన్నమైనది. ఇన్ని సంవత్సరాల ఆశలు, కలలు త్వరలో నేరవేరబోతున్నాయి. మెస్సయ్యరాజ్యము వినయవినమ్రతలతో కూడినది. కడపటివారు, మొదటివారగుదురు. చిన్న బిడ్డలే ఈ రాజ్యములో మొదటివారు. ఈ విషయములో, యోహానుగారే మనకు ఆదర్శం: ''నేను ఆయన పాదరక్షలు మోయుటకైనను యోగ్యుడనుకాను''(మ 3:11). అది నిజమైన వినమ్రత. మనలోనున్న పాపము, అధికారదాహం, గర్వం, స్వార్ధం, వ్యామోహం...మొ,,వి మనలోనున్న నిరాశ. దైవరాజ్యసామీప్యముతో, క్రీస్తు ఆగమనముతో మనలో నూతన జీవితానికి ఆశను కల్పిస్తున్నది.

3. అంధకారము/వెలుగు

యోహాను సువార్తలో బప్తిస్మ యోహానుగూర్చి ఇలా చదువుతున్నాం: ''దేవుడు ఒక మనుష్యుని పంపెను. అతని పేరు యోహాను. అతనిమూలమున అందరు విశ్వసించుటకు, అతడు వెలుగునకు సాక్షమీయవచ్చెను'' (1:6-7). నిజమైన ఆ వెలుగు క్రీస్తు. మనలోనున్న అంధకారం తొలగిపోవాలి. అంధకారం? ప్రతి రోజు సగం ప్రపంచం ఆకలి భాధతో నిద్రిస్తున్నది, రోగాలు, ఆత్మహత్యలు, బాల్య కార్మికం, అశ్లీలత, అపనమ్మకం, నమ్మకద్రోహం మొ,,గు,, అంధకారములో జీవిస్తున్నాం. వెలుగును పొందుటకు ఆయత్తపాడుదాం.

ఆగమనకాల మొదటి ఆదివారము

ఒకసారి ఒక గురువు జ్ఞానస్థాన సాంగ్య సందర్భమున, జ్ఞానస్థానము పొందు బిడ్డ తండ్రిని ఇలా అడిగాడు: క్రైస్తవ జీవితములో జ్ఞానస్థానము ఒక ముఖ్యమైన ఘట్టము. దీనికి మీరు సంసిద్ధ పడియున్నారా? దానికి సమాధానముగా, ఆతండ్రి, సిద్ధపడ్డాము. చాలామంది ఆతిధులను ఆహ్వానించాము. రుచికరమైన భోజనాలను తయారు చేసియున్నాము. అప్పుడు ఆగురువు, నా ఉద్దేశము అది కాదు. మీరు ఆధ్యాత్మికముగా సిద్ధపడ్డి ఉన్నారా? అందులకు అతను, తప్పకుండా ఫాదర్... బీరు, విస్కీ అన్నియు సమకూర్చాము.
ఈ యువ తండ్రిని చూస్తే మన అందరికి నవ్వు రావచ్చు. కాని, ఈ రోజు మనలో చాల మందిమి క్రిస్మస్ పండుగకు ఈలాగే సిద్ధపడుతూ ఉన్నాము. ఆగమనము అనగా వచ్చుట. ప్రభువు వస్తాడు, ఆయన అగమనాన్ని మనం కొనియాడుతూ ఉంటాము.

ప్రభువు ఆగమనాన్ని మనం ఎలా నమ్మాలి? ఆగమన పటనాలు ప్రభువురాకకు సంభందించిన వాగ్దానాలను, భావనలను వ్యక్తపరుస్తూ ఉంటాయి. ప్రభువువచ్చి మనలను రక్షిస్తాడు అని గుర్తుకుచేస్తూ ఉంటాయి. ఈ పటనాలు మన అపోహలను పటాపంచలు చేస్తాయి. మన నిరాశాలకు ఆశలను కల్పిస్తాయి. ప్రభువు ప్రేమను పొందడానికి, మనలో ఒకనిగా రాబోవు ప్రభువును ఆలింగనము చేసికోవడానికి మనహృదయాలను తెరుస్తాయి. ప్రభువు, మన జీవితము, మన కష్టాలను ఎరిగియున్నాడు. మనకు ఆశను కల్పించి, ఆత్మ ద్వారా ప్రతీరోజు, ప్రతీక్షణం మనతో ఉంటాడు. ఆగమన కాల ముఖ్య అంశం: ప్రభువు రాకను కొనియాడటము. అలాగైతే, ఆయన ఆగమనాన్ని కొనియాడటకు ఏవిధముగా సంసిద్ధపడుదాం? మొట్ట మొదటిగా, ప్రశాంతతని వహిద్దాం. ప్రతీ పండుగలాగా, ఆర్భాటాలకుపోకుండా నిదానిద్దాం. గుండెలనిండా ఊపిరిపీల్చుకుందాం. ఆగమనకాలం ఒక పవిత్రమైన సమయమని విశ్వసిద్దాం. మనల్నిమనం ఎవరమని తెలుసుకొంటూ, దేవుని వాక్యాన్ని, ఆయన స్వరాన్ని ఆలకించుదాం. ప్రశాంతతతో ప్రార్ధన చేద్దాం: ''ప్రభువా! వేంచేయండి. నా జీవితములోనికి రండి, మా కుటుంబములోనికి రండి, మా సంఘములోనికి రండి. నీవు నన్ను ప్రేమిస్తున్నావని విశ్వసిస్తున్నాను. నీ ప్రేమతో, శాంతితో నన్ను నింపండి. నన్ను స్వస్థత పరచండి. సంతోషాన్ని ఇవ్వండి''. ఈ విధముగా, పండుగ, భాహ్యమైన ఆర్భాటాలకు ముందుగా ఆధ్యాత్మికముగా, మనల్ని మనం ఆయత్త పరచుకొందాం. మన హృదయాలను సిద్ధపరచుకొందాం. ఇలా సంపూర్ణముగా సిద్ధపడినపుడే, క్రిస్మస్ సందేశాన్ని స్వీకరించగలం.
మార్కు సువిషేశములో (13:33) ప్రభువు ఇలా అంటున్నాడు: ''ఆ సమయము ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. కావున జాగరూకులై ఉండుడు''. నిజమే, ఆ సమయం - ప్రభువు రాకడ, లోకాంత్యము, మరణం, తుది తీర్పు - ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు. ''ఒకవేళ అతడు అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రించుట చూడవచ్చును'' (13:36). అందుకే, ''జాగరూకులై ఉండుడు'' (13:37) అని ప్రభువు హెచ్చరిస్తున్నారు.