31వ సామాన్య ఆదివారము, Year C
20 వ సామాన్య ఆదివారము, YEAR C
20 వ సామాన్య ఆదివారము, YEAR C
యిర్మియా 38:4-6, 8-10; హెబ్రీ 12:1-4; లూకా 12:49-53
ఈ రోజు మనము సామాన్య కాలంలోని 20వ ఆదివారమును జరుపుకుంటున్నాము.
ఈ ఆదివారం పఠనాలలో మన హృదయాలను ఆలోచింపజేసే కొన్ని ముఖ్యమైన సందేశాలు ఉన్నాయి.
యేసుప్రభువు నేటి సువార్తలో ఒక శక్తివంతమైన ప్రకటన చేశారు. “నేను
భూమిమీద నిప్పు అంటించుటకు వచ్చియున్నాను. అది ఇప్పటికే రగుల్కొని ఉండవలసినది” (లూకా 12:49) అని క్రీస్తు అంటున్నారు. ఈ ‘నిప్పు’ అంటే కేవలం
భౌతికమైన అగ్ని కాదు. లూకా సువార్త 3వ అధ్యాయంలో, బప్తిస్త యోహాను మాటలను ఇది
గుర్తుకు చేస్తుంది, “నేను నీటితో మీకు బప్తిస్మము ఇచ్చుచున్నాను. కాని, నాకంటె
అధికుడు ఒకడు రానున్నాడు. ఆయన మీకు పవిత్రాత్మతోను, అగ్నితోను జ్ఞానస్నానము
చేయించును” (లూక 3:16). యేసు ఇక్కడ చెప్పిన అగ్ని, రాబోయే తీర్పు వల్ల కలిగే వేదనను సూచిస్తుంది.
పాత నిబంధనలో, ‘అగ్ని’ దేవుని శక్తికి,
సన్నిధికి చిహ్నం. మోషే మండుతున్న పొదనుండి దేవుని స్వరం విన్నాడు.
ఇశ్రాయేలు ప్రజలు వాగ్ధత్త భూమికి ప్రయాణం చేయు సమయములో రాత్రిపూట అగ్నిస్తంభము వారికి
మార్గదర్శిగా నిలిచింది. నూతన నిబంధనలో, పెంతకోస్తు రోజున
పవిత్రాత్మ అగ్నినాలుకల రూపములో శిష్యులపైకి దిగివచ్చింది. ఈ అగ్ని వారి హృదయాలను పూర్తిగా మార్చి, వారికి కొత్త
శక్తిని ఇచ్చింది.
ఈ అగ్నితో యేసు మనల్ని నాశనం చేయాలనుకుంటున్నాడా? లేదు, యేసు తెచ్చే అగ్ని భిన్నమైనది. అది మన
ఆత్మలను దుష్టత్వం నుండి శుద్ధి చేసి, మనల్ని రక్షించే
పరిశుద్ధాత్మ అగ్ని. ఈ ‘అగ్ని’ గురించి అలెగ్జాండ్రియాకు చెందిన పునీత సిరిల్ గారు, “క్రీస్తు తెచ్చే అగ్ని మనుష్యుల రక్షణకు మరియు ప్రయోజనాలకు
ఉద్దేశించబడింది... ఇక్కడ అగ్ని అంటే, సువార్త యొక్క
రక్షణాత్మక సందేశం మరియు దాని ఆజ్ఞల శక్తి” అని చాలా చక్కగా చెప్పారు.
యేసు చెప్పిన ఈ ‘అగ్నిని’, మనం మూడు ముఖ్యమైన అంశాలుగా అర్థం
చేసుకోవచ్చు:
1. పరిశుద్ధాత్మ అగ్ని: క్రీస్తు చెప్పిన ఈ అగ్ని, పరిశుద్ధాత్మ శక్తికి ప్రతీక.
పెంతుకోస్తు పండుగ రోజున శిష్యులపైకి అగ్ని జ్వాలల రూపంలో పరిశుద్ధాత్మ దిగివచ్చిన
విషయం మనందరికీ తెలుసు (అపో.కా. 2:3). ఆ అగ్ని వారిలో కొత్త
శక్తిని నింపింది. వారిలోని భయాన్ని తీసివేసి వారిని ధైర్యవంతులుగా మార్చి,
క్రీస్తు సువార్తను ధైర్యముగా ప్రకటించడానికి వారిని సిద్ధం
చేసింది. ఈ అగ్ని మనలో ఉన్న భయాన్ని, అనుమానాలను తొలగించి,
దేవుని కార్యం చేయడానికి కావలసిన ధైర్యాన్ని, ఉత్సాహాన్ని
ఇస్తుంది. ఈ అగ్ని మనల్ని సామాన్య వ్యక్తుల నుండి దైవసాక్షులుగా మారుస్తుంది.`
2. శుద్ధీకరణ అగ్ని: లోహాలను అగ్నితో శుద్ధి చేసినట్లు, ఈ అగ్ని మనలోని పాపాలను, చెడు అలవాట్లను, స్వార్థాన్ని, కోపాన్ని కాల్చివేస్తుంది. మన
హృదయాలను పవిత్రం చేస్తుంది. మనలో ఉన్న స్వార్థం, ద్వేషం, అసూయ, కోపం వంటివి
దేవుని దృష్టిలో కల్మషాలు. క్రీస్తు ఈ అగ్ని ద్వారా ఈ కల్మషాలను దహించివేసి,
మనల్ని ఆయన ప్రేమకు, సేవకు యోగ్యులుగా
చేస్తారు. ఈ ప్రక్రియ కష్టంగా అనిపించినా, దాని వల్ల మన ఆత్మ
పవిత్రమై, దేవుని ప్రేమకు యోగ్యంగా మారుతుంది.
3. దేవుని ప్రేమ మరియు ఉత్సాహం యొక్క అగ్ని: ఈ అగ్ని దేవుని పట్ల మనకున్న ప్రేమను, ఆయన రాజ్య స్థాపన పట్ల మనకున్న ఉత్సాహాన్ని సూచిస్తుంది. ఈ అగ్ని మనలో
జ్వలించినప్పుడు, మనం క్రీస్తు ప్రేమను ఇతరులకు పంచుతాము. ఈ
ప్రేమ మన మాటలలో, చేతలలో వ్యక్తమవుతుంది. ఈ అగ్ని, మన
హృదయాలను కదిలించి, మనలను దేవుని వైపుకు మారుస్తుంది. నేడు
మనం యేసు శిష్యులముగా దైవప్రేమ యొక్క అగ్నిని ప్రతీచోట వ్యాప్తిచేయాలి.
క్లుప్తముగా చెప్పాలంటే, క్రీస్తు చెప్పిన ‘అగ్ని’
కేవలం భౌతికమైన వినాశనం కాదు, అది పరిశుద్ధాత్మ శక్తి,
పవిత్రీకరణ మరియు దేవుని పట్ల ఉన్న ప్రేమ, ఉత్సాహానికి ప్రతీక. ఈ అగ్నిని మనం మన హృదయాల్లోకి ఆహ్వానించినప్పుడు, మన జీవితాలు ఒక కొత్త మార్గంలో పయనిస్తాయి.
“నేను శ్రమలతో కూడిన జ్ఞానస్నానమును పొందవలయును” (లూకా 12:50). ఈ వాక్యం చాలా లోతైన అర్థాన్ని కలిగి ఉంది. యేసు త్యాగంలో ఉన్న లోతైన
అర్థాన్ని మన కళ్ళముందు ఉంచుతుంది. ఇక్కడ యేసు తాను పొందబోయే శ్రమలను మరియు మరణాన్ని,
“శ్రమల జ్ఞానస్నానంతో” పోలుస్తున్నారు. సాధారణంగా, మనం
జ్ఞానస్నానం గురించి ఆలోచించినప్పుడు, అది నీటిలో మునిగి,
మళ్ళీ బయటకు రావడాన్ని సూచిస్తుంది. అనగా, పాపాల నుండి పవిత్రమై,
క్రీస్తులో కొత్త జీవితాన్ని ప్రారంభించడాన్ని సూచిస్తుంది. అయితే,
ఇక్కడ యేసు దీనికి భిన్నంగా మాట్లాడుతున్నారు. ఇచ్చట జ్ఞానస్నానం
యేసు శ్రమలలో, మరణములో మునుగుటను సూచిస్తుంది. దీనిద్వారానే
మనం విముక్తిని పొందుతాము. అయితే యేసు ప్రభువు, మరణము అను
జ్ఞానస్నాన తొట్టిలో మునిగి ఉత్థానముతో నూతన జీవితములోనికి ఆవిర్భవించుటను
తెలియజేయు చున్నది. ఈవిధముగా, ఈ వాక్యం, జ్ఞానస్నానం యొక్క రెండు ముఖ్య అంశాలను
తెలియజేస్తుంది:
1. శ్రమలలో మునిగిపోవడం: యేసు తన రాకకు ముందుగానే, తాను పడబోయే
శ్రమల గురించి, సిలువపై తన మరణం గురించి
ఎరిగియున్నాడు. ఆయన తాను అనుభవించబోయే వేదన, అవమానం, మరియు మరణమనే “జ్ఞానస్నానం”లో మునిగిపోతానని చెప్తున్నారు. ఇది కేవలం ఒక
బాధాకరమైన అనుభవం కాదు, మానవాళిని రక్షించడానికి దేవుడు
సిద్ధం చేసిన ఒక అనివార్యమైన ప్రణాళికలో భాగం. ఆయన సిలువపై పడిన బాధలన్నీ మన
పాపాలను శుభ్రం చేయడానికి ఒక నూతనమైన, పవిత్రమైన ప్రక్రియ.
2. మరణం నుండి నూతన జీవితంలోకి ఉద్భవించడం: జ్ఞానస్నానం మునిగి మళ్ళీ లేచి రావడం
ఎలాగైతే సూచిస్తుందో, అలాగే, యేసు మరణమనే జ్ఞానస్నానంలో మునిగి, ఉత్థానంతో నూతన
జీవితంలోకి వస్తారు. ఈ గొప్ప విజయం ద్వారా ఆయన మరణాన్ని
జయించి, మనకు విముక్తిని ప్రసాదించారు. ఆయన పడిన బాధలు, మరణం కేవలం ఒక అంతం కాదు, అది మనకు రక్షణ,
కొత్త జీవితాన్ని ఇచ్చే ఒక మార్గం.
క్లుప్తంగా చెప్పాలంటే, యేసు ఈ మాటల ద్వారా,
తన త్యాగం ఎంత గొప్పదో, దాని వెనుక దేవుని సంకల్పం ఎంత లోతైనదో తెలియజేశారు. ఆయన పడిన శ్రమలు,
మరణం ఒక పవిత్రమైన కార్యం. అది ఆయనను అనుసరించే
ప్రతి ఒక్కరినీ పాపం నుండి విడిపించి, పునరుత్థానం
ద్వారా కొత్త జీవితంలోకి నడిపిస్తుంది.
“నేను భూమిమీద శాంతి నెలకొల్పుటకు వచ్చితినని మీరు తలంచు చున్నారా? లేదు. విభజనలు కలిగించుటకే వచ్చితిని” (లూకా 12:51). ఈ మాటలు
వినడానికి కఠినంగా అనిపించవచ్చు. యేసు శాంతిస్థాపకుడు కాదా? అన్న
అనుమానం కలుగుతుంది. యేసు జననమున, దేవదూతలు, “మహోన్నత స్థలములో సర్వేశ్వరునికి
మహిమ, భూలోకమున ఆయన అనుగ్రహమునకు పాత్రులగు వారికి శాంతి కలుగును గాక” (లూకా 2:14)
అని స్తుతించలేదా! సిమియోను, బాలయేసును హస్తములలోనికి తీసుకొని, “ప్రభూ! ఈ దాసుని
ఇక సమాదానముతో నిష్క్రమింపనిమ్ము” (లూకా 2:29) అని పలకలేదా! యేసు తన శిష్యులతో, “శాంతిని మీకు అనుగ్రహించు చున్నాను. నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను.
లోకము వలె నేను ఇచ్చుట లేదు” (యోహాను 14:27) అని కడరా భోజన
సమయములో చెప్పలేదా! “భారముచే అలసి సొలసి యున్న సమస్త జనులారా! నా యొద్దకు రండు.
మీకు విశ్రాంతి నొసగెదను” (మత్త 11:28) అని చెప్పలేదా!
భయముచే శిష్యులు ఒకచోట తలుపులు మూసుకొని యుండగా, యేసు వచ్చి
వారి మధ్య నిలువబడి, “మీకు శాంతి కలుగునుగాక!” (యోహాను 20:19)
అని పలుకలేదా! అవును, యేసు మనకు ఆంతరంగిక
శాంతిని ఇస్తారు. కానీ, ఆయన మార్గాన్ని అనుసరించేవారు లోకంలో
సవాళ్లను, విభజనలను ఎదుర్కోవలసి వస్తుందని
హెచ్చరిస్తున్నారు. అందుకే సిమియోను, “ఇదిగో! ఈ బాలుడు యిస్రాయేలీయులలో అనేకుల
పతనముకను, ఉద్దరింపునకు కారకుడు అగును. ఇతడు వివాదాస్పదమైన గురుతుగా నియమింపబడి
యున్నాడు” (లూకా 2:34) అని పలికాడు. దేవుని రాజ్యానికి అంతిమ లక్ష్యం శాంతి, కానీ శాంతికి ఒక మూల్యం చెల్లించాల్సి ఉందని అర్ధమగుచున్నది.
ఎక్కడైతే దేవుని వాక్యం వినిపింప బడుతుందో, అక్కడ విభజన జరుగుతుందని యేసు ప్రజలను
హెచ్చరిస్తున్నారు. అన్యాయమైన సమాజానికి, దానికి
వ్యతిరేకంగా ఉన్నవాటన్నింటికీ, సువార్త భిన్నంగా ఉండడం వల్ల విభజనకు కారణమవుతుందనేది
వాస్తవమే కదా!
అలాగే, తాను ఈ లోకమునుండి వెడలి పోయిన తరువాత శిష్యుల ప్రయాణం కఠినంగా
ఉంటుందని హెచ్చరించారు. యేసు నిమిత్తము అందరు ద్వేషింతురని చెప్పారు. సువార్త
వ్రాయబడే సమయానికి ప్రభువు ప్రవచనాలు నేరవేరుచున్నాయి. కుటుంబాలలో విభజనలు కలిగాయి
ఎందుకన, కొంతమంది క్రీస్తును విశ్వసించి,
జ్ఞానస్నానాన్ని పొందుచున్నారు. తనను అనుసరించాలని అనుకొనేవారు,
అవసరమైతే, తల్లిదండ్రులను, తోబుట్టువులను, బంధువులను ఆస్తిపాస్తులను విడిచి
పెట్టాలని ప్రభువు తెలియజేసారు. సత్యం, ప్రేమ, స్వేచ్చ, న్యాయము అను మార్గములో పయనించాలనుకుంటే,
సవాళ్లు ఎదుర్కోవడం తప్పదు! దీర్ఘకాలములో, సత్యం, ప్రేమ, స్వేచ్చ,
న్యాయములే ఖచ్చితముగా విజయాన్ని సాధిస్తాయి.
ఈవిధముగా, క్రీస్తు చెప్పిన విభేదాలు విశ్వాసపు విభేదాలు. ఈ విభజనలు
విశ్వాసం వల్ల వచ్చేవి. క్రీస్తు సువార్త అనేది ఎల్లప్పుడూ ఒక సవాలు! అది మనల్ని
మన సౌకర్యవంతమైన జీవితం నుండి బయటకు రమ్మని పిలుస్తుంది. క్రీస్తును అనుసరించడం
అంటే, కొన్నిసార్లు మన కుటుంబ సభ్యులకు,
స్నేహితులకు నచ్చని నిర్ణయాలు తీసుకోవడం. క్రీస్తు కోసం
నిలబడినప్పుడు, మన చుట్టూ ఉన్న ప్రపంచంతో మనకు విభేదాలు
ఏర్పడవచ్చు. హెబ్రీయుల లేఖలో, “మన విశ్వాసమునకు కారకుడు, పరిపూర్ణతను ఒసగు వాడైన,
ఆ యేసుపై మన దృష్టిని నిలుపుదము” (హెబ్రీ 12:2) అని చదువుచున్నాము. విశ్వాస
మార్గంలో పరుగెత్తేటప్పుడు మనకు అనేక అడ్డంకులు, కష్టాలు
ఎదురవుతాయి. అప్పుడు మనం క్రీస్తు వైపు చూడాలి. ఆయన సిలువను భరించారు, అవమానాలను సహించారు. కానీ చివరికి విజయం సాధించారు. మనము కూడా క్రీస్తు
మార్గంలో ఎదురయ్యే విభేదాలను, కష్టాలను ధైర్యంగా
ఎదుర్కోవాలి. క్రీస్తు కోసం నిలబడటం అంటే, కొన్నిసార్లు
తండ్రికి వ్యతిరేకంగా కొడుకు, తల్లికి వ్యతిరేకంగా కూతురు
నిలబడవలసి వస్తుంది. ఇది ఒక భయంకరమైన పరిస్థితి. కానీ క్రీస్తు మనల్ని
భయపెట్టడానికి ఈ మాటలు చెప్పలేదు. మన విశ్వాసాన్ని మనం ఎంత గట్టిగా పట్టుకోవాలి
అని చెప్పడానికి ఆయన ఈ మాటలను ఉపయోగించారు. దేవుని ప్రేమ, దేవుని
రాజ్యం కోసం మనం ఏదైనా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండాలి.
నేడు అనేకచోట్ల హింసాకాండను, యుద్ధవాతావరణాన్ని
చూస్తున్నాము. నేటి సువిశేషం, యుద్ధానికి పిలుపునిస్తుంది.
అయితే ఈ యుద్ధం ఇతరులపై కాదు. ఈ యుద్ధం, పాపము, అవినీతిపై.
మొదటి పఠనములో యిర్మియా ప్రవక్త తప్పుడు ప్రవక్తలకు వ్యతిరేకముగా
పోరాటం చేయుచున్నాడు. సత్యానికి కట్టుబడి యున్నాడు. యిర్మియా ప్రవక్త, దేవుని సత్య
వాక్యాన్ని చెప్పినందుకు ఎంతో బాధను అనుభవించాడు. రాజవంశీయులు మరియు అధికారులు
యిర్మియా చెప్పిన దేవుని సందేశాన్ని ఇష్టపడలేదు. ఇశ్రాయేలు ప్రజలు యెరూషలేమును
విడిచి శత్రువులైన కల్దీయులకు లొంగిపోవాలని యిర్మియా ప్రవచించాడు. ఇది సైనికుల మనోధైర్యాన్ని
దెబ్బతీస్తుందని, రాజ్యాన్ని నిర్వీర్యం
చేస్తుందని అధికారులు వాదించారు. ఈ ప్రవచనం శాంతిని కోల్పోయేలా చేసి, ప్రజలను చనిపోయేలా చేస్తుందని వారు రాజుతో చెప్పారు (38:4). అప్పుడు
సిద్కియా రాజు బలహీనంగా, ప్రజల మాటలకు లొంగిపోయాడు. “అతడు మీ
ఆదీనమున ఉన్నాడు. నేను మీకు అడ్డుపడజాలను కదా!” అని అధికారులతో చెప్పాడు. దీనితో
రాజు యిర్మియాను రక్షించడానికి ఏమీ చేయలేదని, అధికారులు తమ
ఇష్టప్రకారం వ్యవహరించడానికి అనుమతించాడని స్పష్టమవుతుంది (38:5). ఆ అధికారులు
యిర్మియాను పట్టుకొని, మల్కీయా కుమారుడైన హమ్మేలెకు బురద
బావిలో పడవేశారు. ఆ బావి రాజభవన ప్రాంగణంలోనే ఉంది. బావిలో నీరు లేకపోయినా,
బురద మాత్రం ఉంది. యిర్మియా ఆ బురదలో కూరుకుపోయాడు. ఇది యిర్మియాకు
జరిగిన అత్యంత ఘోరమైన అన్యాయం మరియు శ్రమ (38:6).
అయితే, దేవుడు అతన్ని
విడనాడలేదు. ఎబెద్మెలెకు అనే ఒక కూషు లేదా ఇథియోపియా దేశస్థుడు, నపుంసకుడు అయిన ఒక విదేశీయుడిని పంపి
యిర్మియాను రక్షించారు. అతను సిద్కియా రాజుతో మాట్లాడి యిర్మియాను కాపాడాడు.
రాజుకు వ్యతిరేకంగా మాట్లాడటం ప్రమాదకరం అయినప్పటికీ, అతడు
నిజం మాట్లాడి యిర్మియాను కాపాడాడు. ఈవిధముగా, మొదటి పఠనములో, విశ్వాసం, కష్టం మరియు ఊహించని దేవుని సహాయం గురించి చూస్తున్నాము. యిర్మియా దేవుని
మాటను ధైర్యంగా చెప్పాడు, అందుకు కష్టాలను అనుభవించాడు. కానీ
దేవుడు ఆయనను మరచిపోలేదు, ఎబెద్మెలెకు అనే ఒక విదేశీయుడి
ద్వారా ఆయనను రక్షించాడు. ఇది దేవుడు తన సేవకులను ఎప్పుడూ కాపాడతాడని, సరైన సమయంలో సహాయం పంపుతాడని తెలియజేస్తుంది.
అలాగే, సత్యం, న్యాయం కొరకు పోరాటములో
దేవుడు ఎప్పుడు మన తోడుగా ఉంటారు. అందుకే రెండవ పఠనములో “మీరు గుండె ధైర్యమును
కోల్పోవలదు. నీరసపడి పోవలదు. మీరు పాపముతో పోరాడుటలో ఇంకను రక్తము చిందు నంతగా
ఎదిరింపలేదు” (హెబ్రీ 12:3-4) అని చదువుచున్నాము. విశ్వాస
మార్గంలో పరుగెత్తేటప్పుడు ఎదురయ్యే అడ్డంకులను, కష్టాలను
ధైర్యంగా ఎదుర్కోవాలని ఈ మాటలు చెబుతున్నాయి. మన దృష్టిని “మన విశ్వాసానికి
కారకుడూ, దానిని పరిపూర్ణం చేసేవాడూ అయిన యేసు” మీద
నిలుపుదాం.
నేటి ప్రసంగము నుండి కొన్ని ముఖ్యమైన విషయాలను గ్రహించి, మన
జీవితాలలలో ఆచరిద్దాం:
మొదటిగా, యేసు చెప్పిన ‘అగ్ని’ కేవలం నాశనానికి సంబంధించినది కాదు, అది మన హృదయాలను శుద్ధి చేసి, మనల్ని మార్చడానికి వచ్చిన పరిశుద్ధాత్మ
శక్తి. దీనిని ఆచరణలో పెట్టడానికి, మనం: ముందుగా ధైర్యంగా ఉండాలి: పెంతుకోస్తు రోజున శిష్యులు పరిశుద్ధాత్మను పొందిన తర్వాత ధైర్యంగా
సువార్తను ప్రకటించారు. అదేవిధంగా, మనలో ఉన్న భయాన్ని, అనుమానాలను తొలగించుకొని, దేవుని కార్యాన్ని
చేయడానికి, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి కావలసిన ధైర్యాన్ని,
ఉత్సాహాన్ని కలిగి యుండాలి. తరువాత, సాక్షులుగా జీవించాలి: పరిశుద్ధాత్మ అగ్ని మనల్ని కేవలం
మామూలు వ్యక్తులుగా కాకుండా, క్రీస్తుకు సాక్షులుగా మారుస్తుంది. మన జీవితం ద్వారా దేవుని
ప్రేమను ఇతరులకు చూపించాలి.
రెండవదిగా, యేసు
తెచ్చిన అగ్ని లోహాలను శుద్ధి చేసినట్లుగా, మనలోని
పాపాలను, చెడు అలవాట్లను, స్వార్థాన్ని,
ద్వేషాన్ని, అసూయను దహించివేసి మన హృదయాలను పవిత్రం
చేస్తుంది. కనుక, మనం ఆత్మపరిశీలన చేసుకోవాలి: మనలో ఉన్న కల్మషాలను, దేవునికి ఇష్టం లేని వాటిని గుర్తించి,
వాటిని వదిలించుకోవడానికి ప్రయత్నించాలి. ఇది
కష్టంగా అనిపించినా, ఈ ప్రక్రియ మన ఆత్మను పవిత్రం చేసి,
దేవుని ప్రేమకు యోగ్యంగా మారుస్తుంది.
మూడవదిగా, యేసు ‘శాంతిని కాదు, విభజనను” తెచ్చానని చెప్పడం వెనుక ఉన్న సందేశం,
ఆయన మార్గాన్ని అనుసరించేవారు లోకంలో సవాళ్లను
ఎదుర్కోవాల్సి వస్తుందని అర్ధం. కనుక, ముందుగా మనం విశ్వాసంలో స్థిరంగా ఉండాలి: క్రీస్తును అనుసరించడం వల్ల
కొన్నిసార్లు మన కుటుంబ సభ్యులతో, స్నేహితులతో విభేదాలు రావచ్చు.
అయినప్పటికీ, మనం సత్యం,
ప్రేమ, న్యాయం కోసం నిలబడాలి. అలాగే, క్రీస్తు వైపు దృష్టి ఉంచాలి: విశ్వాస మార్గంలో కష్టాలు వచ్చినప్పుడు,
హెబ్రీ 12:2లో చెప్పినట్లుగా,
“మన విశ్వాసమునకు కారకుడు, పరిపూర్ణతను ఒసగువాడైన, ఆ యేసుపై మన
దృష్టిని నిలుపుదము”. ఆయన సిలువను భరించి విజయం సాధించినట్లు, మనం కూడా ఎదురయ్యే కష్టాలను ధైర్యంగా ఎదుర్కోవాలి.
నాలుగవదిగా, నేటి సువార్తలో చెప్పబడిన 'యుద్ధం' ఇతరులపై కాదు, అది మనలోని పాపం, అవినీతిపై జరిగే యుద్ధం. కనుక, మనం పాపంతో పోరాడాలి: హెబ్రీ 12:4 ప్రకారం,
“మీరు పాపముతో పోరాడుటలో ఇంకను రక్తము
చిందునంతగా ఎదిరింపలేదు”. ఈ మాటలు మనలోని చెడు అలవాట్లు, పాపపు కోరికలతో పోరాడాలని ప్రోత్సహిస్తాయి. అలాగే, దేవుని
సహాయాన్ని నమ్మాలి: యిర్మియా ప్రవక్త విషయంలో చూసినట్లుగా, సత్యం కోసం నిలబడినప్పుడు కష్టాలు వచ్చినా, దేవుడు మనల్ని విడిచిపెట్టడు. సరైన సమయంలో ఆయన సహాయాన్ని పంపి
రక్షిస్తాడు.
ముగింపు: యేసు చెప్పిన అగ్నిని మన హృదయాల్లోకి
ఆహ్వానిద్దాం. ఆ అగ్ని మనల్ని పవిత్రం చేసి, దేవుని ప్రేమతో
నింపుతుంది. సత్యం కోసం, క్రీస్తు కోసం నిలబడటానికి సిద్ధంగా
ఉందాం. అప్పుడు మన జీవితాలు ఒక సాక్ష్యంగా మారి, మన చుట్టూ
ఉన్న ప్రపంచానికి శాంతిని, ప్రేమను పంచుతాయి. ఈ యుద్ధం
ఇతరులపై కాదు, మనలోని పాపం, అవినీతిపై.
ఈ పోరాటంలో దేవుడు ఎప్పుడూ మనతో ఉంటాడు.
కనుక, ఈరోజు, తల్లి శ్రీసభ మనలను దుష్కార్యాలపై పోరాడమని ప్రోత్సహిస్తుంది. దాని కోసం క్రీస్తు
అడుగుజాడలను అనుసరించాలి, ఎందుకంటే ఆయన మనల్ని శుద్ధి చేయడానికి,
మార్చడానికి, మనల్ని పీడించే ప్రమాదాల నుండి రక్షించడానికి భూమిపైకి ‘అగ్నిని’ తీసుకొచ్చాడు. కనుక మన విశ్వాసానికి కారకుడైన క్రీస్తునందు మన
దృష్టిని ఉంచుదాం. కష్ట సమయాల్లో క్రీస్తు యొక్క పట్టుదల మరియు ధైర్యాన్ని మనం అనుకరించాలి.
15వ సామాన్య ఆదివారము, Year C
14వ సామాన్య ఆదివారము, YEAR C - పునీత తోమా
దేవుడు ఒసగు ఈ దివ్య శాంతి మన హృదయాల్లోకి ప్రవహించి, మన జీవితాలను నడిపించడానికి మనం అనుమతించినప్పుడు, మన జీవితాలు సంపూర్ణమవుతాయి. అంతేకాదు, మన సమాజాలు, యావత్ ప్రపంచం ఒక అద్భుతమైన ప్రదేశంగా మారుతాయి. అందుకే దేవుడు మనల్ని శాంతికి దూతలుగా, సాధనాలుగా, ప్రతినిధులుగా ఉండమని పిలుస్తున్నారు. ఈ శాంతి మన నుండి మొదలై, మన ద్వారా ఇతరులకు కూడా ప్రవహించాలి.
బైబులులో హీబ్రూ భాషలో శాంతిని ‘షలోం’ [shalom] అని పిలుస్తాం. అయితే, బైబిల్లో 'శాంతి' అనే పదానికి కేవలం యుద్ధం లేకపోవడం అనే అర్థం మాత్రమే కాదు, అంతకు మించి లోతైన, సమగ్రమైన అర్థం ఉంది.
- సంపూర్ణత్వం (Wholeness): షలోం అంటే ఒక వ్యక్తి లేదా పరిస్థితి అన్ని విధాలా సంపూర్ణంగా, లోపాలు లేకుండా ఉండటం. శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా ఆరోగ్యంగా ఉండటాన్ని ఇది సూచిస్తుంది;
త్రిత్వైక సర్వేశ్వరుని మహోత్సవము, Year C
త్రిత్వైక సర్వేశ్వరుని మహోత్సవము, Year C
సామె. 8: 22-31; రోమీ. 5:1-5; యోహాను. 16:12-15
ధ్యానాంశము: త్రిత్వైక సర్వేశ్వరుడు: ప్రేమ, ఐఖ్యత
ధ్యానమునకు ఉపకరించు వాక్యములు: “సత్యస్వరూపియగు ఆత్మ వచ్చినపుడు మిమ్ములను సంపూర్ణ సత్యమునకు
నడిపించును” (యో 16:13).
ఈరోజు మనం త్రిత్వైక సర్వేశ్వరుని పండుగను గొప్పగా జరుపుకుంటున్నాం. ఇది మన విశ్వాసంలో అత్యంత లోతైన మరియు మర్మమైన సత్యం. మన దేవుడు ఒక్కరే
అయినప్పటికినీ, ఆయనలో తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ అనే ముగ్గురు దివ్య వ్యక్తులు ఉన్నారని మన విశ్వాసం బోధిస్తుంది. ఇది
మానవ తర్కానికి అందని విషయమే అయినా, ప్రేమలో నిండిన దేవుని నిజమైన స్వభావం
ఇదే.
చారిత్రాత్మకంగా, ఈ పండుగ క్రీ.శ. 1030వ సంవత్సరంలో పెంతెకోస్తు పండుగ తర్వాత వచ్చే ఆదివారం ప్రారంభమైంది.
ఆ తర్వాత క్రీ.శ. 1334వ సంవత్సరంలో, ఇరువై రెండవ జాన్ పోప్ గారు దీనిని విశ్వశ్రీసభ పండుగగా అధికారికంగా ఆమోదించారు.
మన దేవుడు ఏక త్రిత్వవంతుడైన సర్వేశ్వరుడు. అంటే, ఆయన ఒకే సర్వేశ్వరుడు అయినప్పటికీ, త్రిత్వవంతుడై ఉన్నాడు. పిత, పుత్ర, పవిత్రాత్మ అనే ముగ్గురు వేర్వేరు వ్యక్తులు ఉన్నారని, కానీ ఆ ముగ్గురు వ్యక్తులకు ఒకే స్వభావం ఉందని దీని అర్థం. ఈ ముగ్గురు వ్యక్తులు ఒకే
సర్వేశ్వరుడు. ఎందుకంటే వీరికి ఒకే జ్ఞానం, ఒకే చిత్తం, ఒకే శక్తి, ఒకే దైవ స్వభావం ఉన్నాయి. వీరిలో శక్తి, మహిమ వంటి లక్షణాలలో ఎలాంటి భేదం లేదు.
ఈ ముగ్గురు వ్యక్తులు అన్నింటిలో సరిసమానులు. వీరు ముగ్గురూ ఆరంభం లేనివారు కాబట్టి,
వీరిలో ముందు లేదా వెనుక అనే తేడా లేదు.
“పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరుని
విశ్వసించుచున్నాను. అతని ఏక పుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించు
చున్నాను. పవిత్రాత్మను విశ్వసించు చున్నాను” అని అపోస్తలుల విశ్వాస ప్రమాణములో స్పష్టంగా ప్రకటిస్తున్నాము.
పితయైన దేవుడు-మన ప్రేమగల తండ్రి: పితయైన దేవుడు మనకు ప్రేమగల తండ్రి వంటివారు. ఆయన తన దివ్య పోలికలో మనలను సృజించారు. ఈ భూలోక ప్రయాణం
ముగిసిన తర్వాత, మనం తిరిగి తండ్రియైన దేవుని చెంతకు
చేరుకుంటాము. ఆయన మనలను పోషిస్తారు, మరియు
నిత్యజీవాన్ని మనకు అనుగ్రహిస్తారు. “నేను ఉన్నవాడను”
అని దేవుడు మోషేకు తనను తాను తెలియజేశారు. తండ్రియైన దేవుడు ఇశ్రాయేలు ప్రజలను తన
సొంత ప్రజలుగా ఎన్నుకున్నారు. వారిని బానిసత్వం నుండి విడిపించి, సీనాయి కొండపై పది ఆజ్ఞలను ఒసగి, నిత్యం వారి వెన్నంటే ఉన్నారు. ఆయన ప్రేమామయులు, దయామయులు, మరియు విశ్వసనీయులు.
పుత్రుడైన దేవుడు-మన సోదరుడు, స్నేహితుడు: పుత్రుడైన దేవుడు, యేసుక్రీస్తు,
మనకు ప్రియమైన సోదరుడు మరియు నిస్వార్థ
స్నేహితుడు. ఆయనే మనకు తండ్రియైన దేవుడిని పరిచయం చేశారు. అంతేకాదు, అవిధేయత మార్గాల నుండి మనలను తనవైపునకు ప్రేమతో మరల్చుకుంటారు. ఆయన మనకోసం, మనలో ఒకరిగా ఈ లోకంలో జన్మించారు. మనం శ్రమలలో ఉన్నప్పుడు, ఆయన మనతో పాటు శ్రమలనుభవించి, మన ఆనందంలో పాలుపంచుకుంటారు. ప్రేమించడం, ప్రేమించబడటం అనే జీవిత పరమార్థం వైపునకు మనలను నడిపిస్తారు. ఆయన ద్వారానే మనం
దేవుని కృపానుగ్రహాన్ని, రక్షణను
పొందుకొని ఉన్నాము.
పవిత్రాత్మ దేవుడు-మనలోని జీవం, దైవిక శక్తి: పవిత్రాత్మ దేవుడు మనలో వసిస్తున్న జీవం, మన శ్వాస,
మరియు మన దైవిక శక్తి. ఆత్మ ద్వారానే మనం
దేవుణ్ణి 'అబ్బా! తండ్రీ!' అని పిలవగలుగుతున్నాం. దీని ద్వారా మనం దేవుని బిడ్డలమయ్యాము.
బిడ్డలం కాబట్టి, మనము ఆయనకు వారసులము; క్రీస్తుతోటి వారసులము (రోమీ 8:15-17). యేసుక్రీస్తు మరియు పవిత్రాత్మ ఇద్దరూ
కూడా మనలను ప్రేమగల తండ్రియైన దేవుని వైపునకు నడిపిస్తారు. జ్ఞానస్నానం ద్వారా
ఆత్మను పొందిన మనం 'నూతన జీవితాన్ని'
పొందియున్నాము. ఆత్మ మనలను క్రీస్తులో ఐక్యం
చేస్తుంది; దేవుని బిడ్డలుగా ఆయనతో ప్రత్యేకమైన
అనుబంధాన్ని ఏర్పరుస్తుంది. ఆత్మ మనకు మార్గనిర్దేశం చేస్తుంది, బోధిస్తుంది, మనలను ప్రేమిస్తుంది, ఓదార్చుతుంది, మరియు బలపరుస్తుంది.
నేటి పఠనాలు-త్రిత్వైక సత్య దర్శనం: ఈ రోజు పఠనాలు త్రిత్వైక సత్యాన్ని వివిధ కోణాల నుండి మనకు
స్పష్టంగా వెల్లడిస్తున్నాయి.
మొదటి పఠనం, సామెతల గ్రంథం నుండి, దైవిక విజ్ఞానం గురించి విన్నాము. ఈ
విజ్ఞానం సృష్టికి ముందే దేవునితో ఉందని, సృష్టి కార్యంలో
దేవునితో కలిసి పనిచేసిందని వర్ణించబడింది. “ప్రభువు నన్ను ప్రప్రథమమున సృజించెను.
తాను పూర్వమే కలిగించినవాని యన్నింటిలో నన్ను మొదటి దానినిగా చేసెను” (సామెతలు 8:22). ఈ విజ్ఞానం దైవత్వానికి చెందినది, ఇది దేవునిలో నిత్యంగా ఉన్నది మరియు ఆయన సృష్టికర్త శక్తిని
ప్రతిబింబిస్తుంది. ఇది దేవుని రెండవ వ్యక్తియైన యేసుక్రీస్తును సూచిస్తుంది, ఆయన ద్వారానే సమస్తము సృష్టించబడింది.
రెండవ పఠనం, రోమీయులకు వ్రాసిన పత్రిక నుండి, విశ్వాసం ద్వారా దేవునితో సమాధానం
లభించిందని పౌలు మనకు గుర్తుచేస్తున్నాడు. క్రీస్తు ద్వారానే మనకు దేవుని దయలోనికి
ప్రవేశం లభించింది. శ్రమలలో కూడా ఆనందించాలని పౌలు మనల్ని ప్రోత్సహిస్తాడు,
ఎందుకంటే: “కష్టములు ఓర్పును, ఓర్పు సచ్చీలమును, సచ్చీలము నిరీక్షణను
కలిగించును. ఈ నిరీక్షణ మనకు నిరాశను కలిగింపదు. ఏలయన, దేవుడు మనకొసగిన పవిత్రాత్మ
ద్వారా తన ప్రేమతో మన హృదయములను నింపెను” (రోమీ. 5:3-5).
ఈ వచనం త్రిత్వంలోని మూడు వ్యక్తులనూ స్పష్టంగా సూచిస్తుంది: దేవుని ప్రేమ (తండ్రి), యేసుక్రీస్తు ద్వారా మనకు లభించిన దయ (కుమారుడు), మరియు మన హృదయాలలో నింపబడిన పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ ద్వారానే మనం
దేవుని అపారమైన ప్రేమను అనుభవించగలుగుతున్నాము.
సువార్తలో త్రిత్వైక బోధన-అద్భుత ఐక్యత: యోహాను సువార్త తండ్రి, కుమారుల మధ్య ఉన్న అత్యంత సన్నిహిత
సంబంధాన్ని స్పష్టంగా నొక్కి చెబుతుంది. తండ్రి ప్రేమను లోకానికి తెలియజేయడమే
కుమారుని ప్రధాన లక్ష్యం (యో 17:6-8). “నేనును, నా తండ్రియు ఏకమై యున్నాము” (యో 10:30) అని యేసు ప్రకటించారు. వారి మధ్య ఉన్న అగాధమైన ఐక్యతను ఇది
తెలియజేస్తుంది. ఒకరిని చూస్తే మరొకరిని చూసినట్లే అని యేసు అన్నారు (యోహాను 14:9). తండ్రిని గురించి వెల్లడి చేస్తూనే,
యేసు ఆత్మ గురించి కూడా తెలియజేశారు.
"తండ్రి యొద్దనుండి వచ్చు సత్యస్వరూపియగు ఆత్మ" (యోహాను 15:26) మనతో ఉండటానికి దేవుడు పవిత్రాత్మను పంపుతారని ఆయన అన్నారు.
అంతేకాకుండా, "నేను వెళ్ళినచో ఆయనను మీ యొద్దకు
పంపెదను" (యోహాను 16:7) అని యేసు పలికారు. అంటే, యేసు పవిత్రాత్మను పంపుతారు. ఈ సత్యం తండ్రి దేవుడు మరియు పుత్ర దేవుడు పవిత్రాత్మను పంపుతారనే గొప్ప సహవాసాన్ని, ఐక్యతను స్పష్టంగా వెల్లడి చేస్తుంది. ఇదే ఐక్యత తన ప్రజల మధ్య కూడా ఉండాలని
ప్రభువు ఆశించారు (యో 13:34-35; 17:21). ఇదే త్రిత్వైక
సర్వేశ్వరుని పండుగ యొక్క గొప్ప సందేశం: మనము పరస్పర ప్రేమ కలిగి, ఐక్యతతో జీవించాలి.
ప్రియ సహోదరీ సహోదరులారా, త్రిత్వైక దేవుడు మనకు దూరంగా ఉండే దేవుడు కాదు, ఆయన మన జీవితంలో చురుకుగా పాల్గొనే దేవుడు.
తండ్రి-మన సృష్టికర్త, పోషకుడు, ప్రేమగల తండ్రి: తండ్రియైన దేవుడు మన సృష్టికర్త. ఆయన మనకు జీవాన్ని
ఇచ్చారు, మనలను అపారంగా ప్రేమిస్తారు, మరియు మనల్ని నిత్యం పోషిస్తారు. మన క్రైస్తవ విశ్వాసంలో, తండ్రియైన దేవుడే మన అస్తిత్వానికి మూలం. దీనిని మనం ఆదికాండము నుండే
స్పష్టంగా చూడవచ్చు. “ఆదిలో దేవుడు ఆకాశమును, భూమిని సృష్టించెను” (ఆది 1:1) అని
ఉంది. ఈ వచనం దేవుడే సమస్త సృష్టికి కారణమని స్పష్టం చేస్తుంది. ఆయన మానవజాతిని
కూడా తన స్వరూపములో, తన పోలికలో సృష్టించాడు (ఆది 1:27).
ఇది మనకు ప్రత్యేకమైన గౌరవాన్ని, విలువను ఇస్తుంది. మనలో ప్రతి ఒక్కరూ ఒక గొప్ప లక్ష్యంతో, ఒక ఉద్దేశ్యంతో సృష్టించబడ్డాము.
దేవుడు కేవలం మన శరీరాలను సృష్టించడమే కాకుండా, మనలోకి జీవశ్వాసమును ఊదాడు (ఆదికాండము 2:7). ఈ జీవశ్వాసం మన ఆత్మను, మన
వ్యక్తిత్వాన్ని సూచిస్తుంది. కాబట్టి, మనం కేవలం భౌతిక
శరీరాలు కాదు, దైవత్వం నుండి వచ్చిన జీవాన్ని
కలిగియున్న జీవులము. ప్రతి ఉదయం మనం మేల్కొన్నప్పుడు, అది దేవుడు మనకు ప్రసాదించిన మరో అద్భుతమైన రోజు అని గుర్తుచేస్తుంది.
దేవుని ప్రేమ మానవ ప్రేమకు మించినది. ఆయన ప్రేమ నిస్వార్థమైనది,
షరతులు లేనిది మరియు శాశ్వతమైనది. "దేవుడు
లోకమును ఎంతో ప్రేమించి, తన ఏకైక కుమారుని ప్రసాదించెను"
(యోహాను 3:16). ఈ ప్రేమ కేవలం మాటల్లో కాదు, తన కుమారుడైన యేసుక్రీస్తును మన పాపముల నిమిత్తం బలిగా అర్పించడంలో
అది అత్యున్నతంగా ప్రదర్శించబడింది.
తండ్రి మన బలహీనతలను, తప్పులను ఉన్నప్పటికీ, మనల్ని ప్రేమిస్తారు. ఆయన మనల్ని క్షమించడానికి, మనల్ని తన దగ్గరకు తిరిగి తీసుకోవడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు.
దేవుడు మనకు జీవాన్ని ఇచ్చి, మనల్ని ప్రేమించడమే కాకుండా, మనల్ని నిరంతరం పోషిస్తారు. ఆయన మన భౌతిక అవసరాలను (ఆహారం, నీరు, వస్త్రాలు) తీరుస్తాడు, కానీ అంతకు మించి మన ఆధ్యాత్మిక అవసరాలను కూడా తీరుస్తారు. ఆయన
పరిశుద్ధాత్మ ద్వారా మనకు జ్ఞానాన్ని, బలాన్ని,
మార్గదర్శకత్వాన్ని ఇస్తారు. ఆయన మన
ప్రార్థనలను వింటారు, మనకు ఓదార్పునిస్తారు మరియు కష్ట
సమయాలలో మనకు తోడుగా ఉంటారు. ఒక మంచి తండ్రి తన పిల్లల బాగోగులు చూసుకున్నట్లే,
తండ్రియైన దేవుడు మనకు కావలసినవన్నీ సమకూరుస్తారు.
కుమారుడు, యేసుక్రీస్తు-మన రక్షకుడు, విమోచకుడు: కుమారుడైన యేసుక్రీస్తు మన రక్షకుడు. ఆయన మన పాపాల కోసం తన ప్రాణాన్ని ఇచ్చి, దేవునితో మన సంబంధాన్ని పునరుద్ధరించారు. ఆయనే దేవుని అపారమైన
ప్రేమను మనకు చూపారు.
క్రైస్తవ విశ్వాసంలో, తండ్రియైన దేవుని తర్వాత, కుమారుడైన యేసుక్రీస్తు రెండవ దైవవ్యక్తి. ఆయన ఈ సృష్టిలో మానవ రూపంలో వచ్చిన దేవుడు.
మన రక్షణ ప్రణాళికలో యేసుక్రీస్తు పాత్ర అత్యంత
కీలకమైనది.
యేసుక్రీస్తు మన విమోచకుడు. మానవజాతి ఆదాము ద్వారా పాపంలో పడింది.
ఈ పాపం దేవునితో మన సంబంధాన్ని తెగదెంపులు చేసింది, మనలను మరణానికి, దేవుని నుండి వేరుపాటుకు గురిచేసింది.
దేవుని న్యాయమైన తీర్పు ప్రకారం, పాపానికి ప్రతిఫలం మరణం. అయితే,
దేవుడు తన అనంతమైన ప్రేమతో మనల్ని ఈ స్థితి
నుండి విమోచించడానికి ఒక మార్గాన్ని సిద్ధం చేశాడు.
కుమారుడైన యేసుక్రీస్తు ఈ విమోచనను సాధించాడు. ఆయన పాపరహితుడైన
దేవుని కుమారుడు. ఆయన తన స్వచ్ఛమైన, అమూల్యమైన
రక్తాన్ని సిలువపై చిందించడం ద్వారా మన పాపాలకు ప్రాయశ్చిత్తం చేశాడు. "మన
పాపములను భరించుటకు మన పాపముల నిమిత్తమై తనను తాను అర్పించుకొనెను" (1
పేతు 2:24). “ఏలయనగా, పాపము వలన వచ్చు జీతము మరణము; అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్యజీవము”
(రోమీ 6:23). యేసు మరణం మన పాపాలకు విలువ
చెల్లించింది, దాని ద్వారా మనం విమోచించబడ్డాము.
ఈ విధంగా, యేసుక్రీస్తు మన పాపాల కోసం తన
ప్రాణాన్ని ఇచ్చి, దేవునితో మన సంబంధాన్ని
పునరుద్ధరించారు. యేసుక్రీస్తు దేవుని ప్రేమను అత్యంత స్పష్టంగా మనకు చూపినవాడు.
ఆయన ద్వారానే మనం దేవునితో సమాధానం పొంది, నిత్యజీవంలోకి
ప్రవేశించగలుగుతాము.
పరిశుద్ధాత్మ-మన మార్గదర్శి, బలపరిచేవారు, మరియు అంతరంగిక నివాసి: పరిశుద్ధాత్మ మన మార్గదర్శి, మనలను బలపరిచేవారు, మనలో నివసించేవారు, మరియు మనలను సత్యం వైపు నడిపించేవారు. పరిశుద్ధాత్మ ద్వారానే మనం
దేవుని చిత్తాన్ని తెలుసుకోగలుగుతాము, ఆయన అద్భుతమైన
శక్తితో జీవించగలుగుతాము.
త్రిత్వంలోని మూడవ వ్యక్తి అయిన పరిశుద్ధాత్మ, క్రైస్తవ జీవితంలో అత్యంత చురుకైన మరియు సన్నిహిత పాత్రను
పోషిస్తారు. యేసు పరలోకానికి తిరిగి వెళ్ళే ముందు తన శిష్యులకు పరిశుద్ధాత్మను
పంపుతానని వాగ్దానం చేశారు. ఈ వాగ్దానం పెంతెకోస్తు రోజున శక్తివంతంగా నెరవేరింది.
యేసు తన శిష్యులకు చెప్పినట్లుగా, “సత్యస్వరూపియగు ఆత్మ వచ్చినప్పుడు,
మిమ్ములను సంపూర్ణ సత్యమునకు నడిపించును” (యో 16:13).
పరిశుద్ధాత్మ మన మార్గనిర్దేశి (The Guide): పరిశుద్ధాత్మ మన జీవితంలో ఒక GPS లాంటివారు, మనకు సరైన మార్గాన్ని చూపిస్తారు. జీవితంలో నిర్ణయాలు తీసుకోవడంలో,
దేవుని చిత్తాన్ని అర్థం చేసుకోవడంలో, మంచి చెడులను వివేచించడంలో ఆయన మనకు సహాయపడతారు. ఇది కేవలం నైతిక
మార్గదర్శకత్వం మాత్రమే కాదు, ఆధ్యాత్మిక సత్యాలను అర్థం
చేసుకోవడానికి, బైబిలు వచనాల లోతైన అర్థాన్ని
గ్రహించడానికి కూడా ఆయన మనకు సహాయపడతారు.
పరిశుద్ధాత్మ మన బలపరిచేవారు (The Strengthener): పరిశుద్ధాత్మను “ఆదరణకర్త” (Comforter/ Advocate/Helper)
అని కూడా అంటారు (యో 14:16). జీవితంలో మనం ఎదుర్కొనే కష్టాలు, శ్రమలు, ప్రలోభాలు, బలహీనతలలో ఆయన మనకు అపారమైన బలాన్ని ఇస్తారు. ఆయన మనల్ని ఓదార్చుతారు,
మనకు ధైర్యాన్ని ఇస్తారు, మరియు దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి అవసరమైన శక్తిని
ప్రసాదిస్తారు. అపోస్తలుడైన పౌలు ఇలా అంటాడు, “నా బలహీనతయందు నాకు దేవుని కృప చాలును, ఆయన శక్తి బలహీనతలో పరిపూర్ణమగును.” ఈ శక్తి పరిశుద్ధాత్మ ద్వారానే
వస్తుంది. క్రైస్తవ జీవితం జీవించడానికి, పాపాన్ని
జయించడానికి, దేవునికి మహిమను తీసుకురావడానికి మన
సొంత బలం సరిపోదు; పరిశుద్ధాత్మ యొక్క దైవిక బలం
అత్యవసరం.
పరిశుద్ధాత్మ మనలో నివసించేవారు (The Indwelling Spirit): ఇది పరిశుద్ధాత్మ యొక్క అత్యంత అద్భుతమైన మరియు వ్యక్తిగత అంశాలలో
ఒకటి. యేసుక్రీస్తును మన ప్రభువుగా, రక్షకుడిగా
అంగీకరించిన క్షణం నుండి, పరిశుద్ధాత్మ మనలో నివసిస్తారు. “మీరు
దేవుని ఆలయమనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నారనియు
మీకు తెలియదా?” (1 కొరి 3:16).
పరిశుద్ధాత్మ మనలో నివసించడం వల్ల, మనం ఎప్పుడూ ఒంటరిగా ఉండము. ఆయన మన ఆత్మతో సన్నిహిత సంబంధం కలిగి
ఉంటారు, మనతో సంభాషిస్తారు, మన ప్రార్థనలకు సహాయపడతారు (రోమీ 8:26). ఇది మనకు దేవుని నిరంతర ఉనికిని, ఆయన అపారమైన ప్రేమను, ఆయనకు మనపై ఉన్న శ్రద్ధను అనుభవించే
అమూల్యమైన అవకాశాన్ని ఇస్తుంది.
పరిశుద్ధాత్మ మనల్ని సత్యం వైపు నడిపించేవారు (The Revealer
of Truth): పరిశుద్ధాత్మ సత్య స్వరూపి. ఆయన దేవుని
సత్యాలను మనకు వెల్లడిస్తారు, క్రీస్తు బోధనలను మనకు గుర్తుచేస్తారు,
మరియు దేవుని ప్రణాళికలను మనకు తెలియజేస్తారు.
"ఆయన నాకున్న దానిని, నా నుండి గైకొనిన దానిని, మీకు తెలియచేయును" (యో 16:14). పరిశుద్ధాత్మ లేకుండా, మనం దేవుని
మాటలను, ఆయన హృదయాన్ని పూర్తిగా అర్థం
చేసుకోలేము. ఆయన మన కళ్ళను తెరిచి, ఆధ్యాత్మిక సత్యాలను చూడటానికి మనకు
సహాయపడతారు, తద్వారా మనం దేవుని చిత్తాన్ని మరింత
స్పష్టంగా తెలుసుకోగలుగుతాము.
త్రిత్వైక దేవుని ప్రేమలో జీవిద్దాం: ప్రియ సహోదరీ సహోదరులలరా!
పిత, పుత్ర, పరిశుద్ధాత్మ — ఈ ముగ్గురు
దివ్య వ్యక్తులు ఒకే దేవునిలో ఉన్నట్లే, మన జీవితాలలో
కూడా వారు కలిసి అద్భుతంగా పనిచేస్తారు. దేవుని అపారమైన ప్రేమ తండ్రి నుండి ప్రవహిస్తుంది,
కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనకు చేరుతుంది,
మరియు పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయాలలో
నివసిస్తుంది.
ఈ రోజు మనం ఈ మహత్తర త్రిత్వైక సత్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు,
త్రిత్వంలోని పరిపూర్ణ ప్రేమ సంబంధాన్ని మనం అనుకరించడానికి ప్రయత్నించాలి. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ఒకరినొకరు సంపూర్ణంగా
ప్రేమించుకున్నట్లే, మనం కూడా ఒకరినొకరు నిజాయితీగా
ప్రేమించుకోవాలి, ఒకరికొకరు సేవించుకోవాలి మరియు ఐక్యతతో జీవించాలి.
మన సంఘంలో, మన కుటుంబాల్లో, మన సమాజంలో, మనం త్రిత్వైక దేవుని ప్రేమను
ప్రతిబింబించాలి. త్రిత్వం ప్రేమ యొక్క పరమ రహస్యం. త్రిత్వం ఐక్యత యొక్క పరమ రహస్యం. త్రిత్వైక దేవుని దివ్య జీవితంలో మనము
పాలుపంచుకోవడానికి పిలువబడి యున్నాము. ఆయన మనకు నిత్యజీవాన్ని ప్రసాదిస్తారు.
త్రిత్వైక దేవునిలో ప్రేమ, ఐక్యత కలిగి
మనము జీవించాలని ప్రార్థన చేద్దాం. త్రిత్వైక
దేవుడు మన హృదయాలలో ఐక్యతను, శాంతిని మరియు ప్రేమను పెంపొందించుగాక.
ఆమేన్.