Showing posts with label Articles-Reflections in Telugu. Show all posts
Showing posts with label Articles-Reflections in Telugu. Show all posts

మత్తయి 3:1-12 – యోహాను బోధ

మత్తయి 3:1-12 – యోహాను బోధ

బప్తిస్త యోహాను పరిచర్య, పశ్చాత్తాపానికి పిలుపులో, యేసు రాకడకు మార్గాన్ని సంసిద్ధం చేయడములో అతని పాత్రను తెలియ జేస్తుంది. ఈ భాగమునందు, పశ్చాత్తాపం, జ్ఞానస్నానం, మెస్సయ్య రాకకు సంబంధించిన వేదాంతపరమైన మరియు ఆధ్యాత్మికపరమైన ప్రాముఖ్యతను చూడవచ్చు. యెషయ 40:3లోని ప్రవచనం నెరవేరుస్తూ, యోహాను “ప్రభువుకు మార్గము సిద్ధముచేయ” వచ్చెను. యోహాను పాత నిబంధన ప్రవక్తలలో చివరివానిగా మరియు క్రీస్తునందు నూతన నిబంధనతో, పాత నిబంధనకు వారధిగా పరిగణింప బడినాడు. యేసు ఆరంభించబోవు ‘పరలోక రాజ్యము’యొక్క రాకడ కోసం, పశ్చాత్తాపము, సంసిద్ధత కొరకు ప్రజలను పిలవడం యోహాను లక్ష్యము.

యోహాను జీవితము, జీవనశైలి (3:4) ప్రవక్త ఏలియాతో పోల్చబడుచున్నది. మెస్సయ్య రాకమునుపే ఏలియా ప్రవక్త వస్తాడని మలాకీ 4:5లో ప్రవచనాన్ని చదువుచున్నాము. యోహాను జీవితము అతని సాధారణమైన సరళ జీవితాన్ని, పవిత్ర పరిచర్యను సూచిస్తుంది.

యోహాను బోధ ప్రధాన సందేశం, పశ్చాత్తాపమునకు పిలుపు, “పరలోక రాజ్యము సమీపించినది. మీరు హృదయ పరివర్తనము చెందుడు” (3:2). దేవునితో సహవాస సంబంధములోనికి ప్రవేశించాలంటే, హృదయపరివర్తనము తప్పక అవసరము. పాపమునుండి దూరముగా ఉండటమే కాకుండా, దేవునివైపు, ఆయన చిత్తమువైపు మరలడము. ఈ పిలుపు యేసు రాకను ముందుగానే ఎరుక పరచుచున్నది. యేసు సందేశము కూడా ఇదే పిలుపుతో ప్రారంభమైనది, “హృదయ పరివర్తనము చెందుడు. పరలోక రాజ్యము సమీపించి యున్నది” (మత్త 4:17). యోహాను జ్ఞానస్నానం శుద్దీకరణకు, లేదా ప్రక్షాళనకు సూచన. కాని యేసు పరిశుద్ధాత్మతో తీసుకొని రాబోయే శక్తివంతమైన జ్ఞానస్నానమును సూచిస్తున్నది.

జ్ఞానస్నానము, పాపముల ఒప్పుకోలు: యెరూషలేము, యూదయా అంతటనుండి ప్రజలు తమతమ పాపములను ఒప్పుకొనుచు, యోర్దాను నదిలో జ్ఞానస్నానము పొందుచుండిరి (3:5-6). కతోలిక శ్రీసభలోనున్న జ్ఞానస్నాన దివ్యసంస్కారాన్ని సూచిస్తుంది. జ్ఞానస్నానము ఆదిపాపమును తొలగించి, క్రీస్తు శరీరములో ఐఖ్యము చేయును. యోహాను బప్తిస్మము పశ్చాత్తాపానికి సూచన. యేసుక్రీస్తు స్థాపించిన దివ్యసంస్కారమైన క్రైస్తవ జ్ఞానస్నానము, పాపమునుండి విముక్తులను చేసి, దేవుని వరమగు పవిత్రాత్మయొక్క అనుగ్రహాన్ని ఒసగి నూతన జీవితాన్ని ఒసగుచున్నది (మత్త 3:11; యోహాను 3:5; అ.కా. 2:38).

పరిసయ్యులకు, సద్దూకయ్యులకు యోహాను హెచ్చరిక: “ఓ విష సర్పసంతానమా!” (3:7) అని వారిని తీవ్రముగా మందలిస్తున్నాడు. వారు ఆధ్యాత్మిక మత నాయకులు. వారు పశ్చాత్తాపము, హృదయ పరివర్తనముపై గాక, వారసత్వము మరియు బాహ్యపరమైన మాతాచారాలపై ఆధారపడుచున్నందున వారిని విమర్శించాడు. అబ్రహాము వారసులుగా గుర్తింపు పొందినంత మాత్రమున, వారి రక్షణకు అది సరిపోదని వారిని హెచ్చరించాడు. పశ్చాత్తాపానికి సూచనగా ‘మంచి పనులు’ చేయాలి (3:8). దేవుని చిత్తాన్ని జీవించడానికి, పశ్చాత్తాపము ఎంతో అవసరము.

యోహాను సందేశముయొక్క ఆవశ్యకత: “గొడ్డలి సిద్ధముగా నున్నది” (3:10). దేవుని తీర్పు ఆసన్నమైనదని, పశ్చాత్తాపమునకు చాలా తక్కువ సమయమున్నదని సూచిస్తుంది. “మంచి పండ్ల నీయని వృక్షము నరకబడి అగ్నిలో పారవేయ బడును” (3:10). పశ్చాత్తాప పిలుపునకు ప్రతిస్పందించని వారి విధిని సూచిస్తుంది. “అగ్ని” తీర్పునకు మరియు శుద్ధీకరణకు సూచనగా నున్నది. తీర్పునకు ముందే పశ్చాత్తాపమునకు పిలుపులో దేవుని దయ ప్రతిబింబిస్తున్నది.

పవిత్రాత్మతోను, అగ్నితోను బప్తిస్మము (3:11): యోహాను బప్తిస్మముకన్న, యేసు బప్తిస్మము మరింత శక్తివంతమైనది. ఇది పెంతకోస్తున పవిత్రాత్మ రాకడకు సూచనగా అర్ధం చేసుకోబడుచున్నది (అ.కా. 2). పవిత్రాత్మ రాకడ శిష్యులను, శ్రీసభ పరిచర్యను బలోపేతం చేసినది. “అగ్నితో” బప్తిస్మము అనేది పవిత్రాత్మ యొక్క శుద్ధీకరణ మరియు పరివర్తన కార్యముగా అర్ధం చేసుకొనవచ్చు. బైబులులో “అగ్ని” తరుచుగా శుద్ధీకరణ మరియు దేవుని సన్నిధికి సూచనగా నున్నది (ఉదా. నిర్గమ 3:2; మలాకీ 3:2-3). యేసు బప్తిస్మము దేవుని దయ యొక్క సంపూర్ణతను తెస్తున్నది. పాపము నుండి విముక్తిని చేస్తుంది. ఆత్మను శుద్దీకరిస్తుంది.

తీర్పు, చేట (3:12): “తూర్పార బట్టుటకు యేసు చేతియందు చేట సిద్ధముగా నున్నది. గోధుమ ధాన్యపు గింజలను గిడ్డంగులయందు భద్రపరచి, పొట్టును ఆరని అగ్నిలో వేసి కాల్చివేయును” (3:12). ఇది అంతిమ తీర్పును సూచిస్తుంది. నీతిమంతులకు ప్రతిఫలం లభిస్తుంది. దుష్టులు ఖండింప బడతారు. విశ్వాసము, మంచి కార్యాలను బట్టి తీర్పు ఉంటుంది. “గోధుమలు” దేవుని కృపకు ప్రతిస్పందించి మంచి ఫలాలను ఫలించే వారిని సూచిస్తాయి. “పొట్టు” పశ్చాత్తాపం కోసం దేవుని పిలుపును తిరస్కరించిన వారిని సూచిస్తుంది.

ఆధ్యాత్మిక సందేశం: (1). రక్షణకు పశ్చాత్తాపం తప్పనిసరి. యోహాను సందేశానికి, యేసు పరిచర్యకు ప్రధానం పశ్చాత్తాపానికి పిలుపు. మనం క్రమం తప్పకుండా ఆత్మపరిశీలన చేసుకొని, పాపములను ఒప్పుకోవాలి. దేవుని చిత్తానుగుణముగా జీవిస్తూ దేవుని దయను పొందుదాం. (2). బప్తిస్మము దేవుని కృపకు మార్గము. బప్తిస్మమువలన దేవుని పరిశుద్ధాత్మను స్వీకరించి, శ్రీసభలో సభ్యులముగా చేర్చబడుచున్నాము. (3). పశ్చాత్తాపము మంచి ఫలాలను ఇస్తుంది. పశ్చాత్తాపము అనగా కేవలం పాపాలకు చింతించడం మాత్రమేగాక, మంచి పనులు, దాతృత్వం, హృదయ పరివర్తన కలిగిన జీవితాన్ని జీవించడం. (4). క్రీస్తు రాకడకు సిద్ధపడాలి. అంతిమ దినమున క్రీస్తు రాకడకై ఎదురు చూస్తూ జీవించాలి. 

మత్తయి 2:16-18 – శిశుహత్య

 మత్తయి 2:16-18 – శిశుహత్య

బాల యేసును చంపే క్రమములో బేత్లెహేము నందును, పరిసరములందున్న రెండేండ్లను, అంతకంటే తక్కువ ప్రాయముగల మగ శిశువులందరు, పవిత్రమైన చిన్నారి బిడ్డలను ఘోరాతి ఘోరముగా చంపమని హేరోదు రాజు ఆజ్ఞాపించాడు. ఇదొక విషాద సంఘటన. హేరోదు రాజుచేత చంపబడిన ఈ చిన్నారులు క్రీస్తు వేదసాక్షులుగా శ్రీసభ పరిగణిస్తుంది. వారు చేసిన త్యాగం, వారికి తెలియక పోయిననూ, వారు యేసుక్రీస్తు కొరకు మరణించారు. డిశంబరు 28న వారిని తల్లి శ్రీసభ స్మరించుకుంటూ ఉన్నది. వేదసాక్షులుగా వారిని గౌరవిస్తూ ఉన్నది. వారి శ్రమలు, బాధలు, క్రీస్తు రక్షణలో పాల్గొనడముగా పరిగణింప బడుతుంది. తరువాత క్రీస్తు మానవాళి కొరకు శ్రమలను పొంది మరణించారు.

2:17-18, యిర్మియా ప్రవక్త పలికిన ప్రవచనం నేరవేరినట్లుగా ప్రస్తావించబడినది (యిర్మియా 31:15). రాహేలు, యాకోబు భార్య, ఇశ్రాయేలు ప్రజలకు తల్లిగా, వారు బానిసత్వము లోనికి కొనిపోబడి నపుడు ఆమె విలపించినది. మత్తయి సువార్తలో బేత్లెహేములోని తల్లులు తమ పిల్లల పట్ల దు:ఖిస్తున్నప్పుడు ఈ ప్రవచనం వర్తింప జేయబడినది. పాత నిబంధన ప్రవచనాలను నెరవేరుస్తూ, యేసు జననానికి సంబంధించిన సంఘటనలు దేవుని ప్రణాళికలో భాగమని అర్ధమగుచున్నది.

చిన్నారుల ఊచకోత, లోకములోనున్న చెడును బట్టబయలు చేస్తుంది. ముఖ్యముగా, గర్వం, భయం, అధికార దుర్వినియోగము యొక్క విధ్వంసకర పరిణామాలను తెలియ జేస్తుంది. యేసు జనన వార్త విని హేరోదు కలత చెందడం, బెదిరింపులకు గురైనప్పుడు, హింసను ఆశ్రయించే మానవ ధోరణి వెల్లడిస్తుంది. అహం, భూలోక శక్తి, అన్యాయాలకు దారితీస్తుంది.

బాలయేసు సాన్నిధ్యమే ప్రపంచ అవినీతి అధికారులను వణికించినది. లోకముననున్న అవినీతి, అన్యాయ, అక్రమ, హింస, అణచివేత మొదలగు దుష్ట శక్తులకు యేసు సువార్త పరిచర్య సవాలుగా ఉండబోతుందని స్పష్టముగా అర్ధమగుచున్నది.

చిన్నారి బిడ్డల మరణం దు:ఖాన్ని కలిగిస్తుంది. ఇది లోకమున అమాయకుల బాధలను ప్రతిబింబిస్తున్నది. నేడు మనం అలాంటి అమాయక బిడ్డలను కాపాడాలి. అన్యాయానికి వ్యతిరేకముగా మనం ఉద్యమించాలి.

అయితే, ఈ లోకములో చెడు తాత్కాలికముగా గెలిచినట్లు అనిపించినప్పటికినీ, అంతిమముగా మంచిదే విజయం. దేవుని ప్రణాళిక ఎన్నటికీ విఫలం కాదు. బాధలలో దేవుని సహాయం ఉంటుంది. బాధలలో దేవుని ఓదార్పు తప్పక ఉంటుంది.

ఆధ్యాత్మిక సందేశం: (1). మానవ జీవితం యొక్క గౌరవాన్ని కాపాడాలి. అందరి జీవితాలు ముఖ్యముగా అత్యంత దుర్భల జీవితాలు కూడా పవిత్రమైనవే అని గుర్తించాలి. (2). దేవుని ప్రణాళికయందు నమ్మకం ఉంచాలి. అర్ధములేని హింసలు, బాధలలోకూడా విశ్వాసులు దేవుని రక్షణ ప్రణాళికపై నమ్మకముంచాలి. (3). ఇతరులతో సంఘీభావం కలిగి జీవించాలి. బాధలు, కష్టాలు అనుభవిస్తున్న వారితో సంఘీభావం కలిగి జీవించుదాం. న్యాయం, శాంతి కోసం కృషి చేద్దాం.

మత్తయి 2:1-12 – జ్ఞానులు – బాలయేసు సందర్శనము

 మత్తయి 2:1-12 – జ్ఞానులు – బాలయేసు సందర్శనము

యేసు దావీదు కుమారుడు. ఆయన యూద వంశములో జన్మించిన రాజు. ఆయన నిజమైన రాజు. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. యూదయా సీమయందలి బెత్లేహేమునందు యేసు జన్మించాడు. తూర్పు దిక్కునుండి వచ్చిన జ్ఞానులు యూదేతరులు. యేసు రాజ్యాధికారం ఇశ్రాయేలుకు మాత్రమేగాక, అన్ని దేశాలకు సంబంధించినదని సూచిస్తుంది. ప్రభువు సేవకుని గూర్చిన రెండవ గీతములో, “నేను నిన్ను జాతులకు జ్యోతిగా నియమింతును” (యెషయ 49:6) అన్న ప్రవచనాన్ని నెరవేరుస్తూ, యేసు పుట్టుక విశ్వవ్యాప్తముగా ప్రాముఖ్యమైనదని అర్ధమగుచున్నది. విశ్వమంతయు, క్రీస్తు రాజ్యాధికారమును గుర్తించులాగున జ్ఞానుల సందర్శన మనకు తెలియ జేయుచున్నది.

తూర్పు దిక్కున నక్షత్రమును చూచి జ్ఞానులు యేసును ఆరాధింప వచ్చితిరి. నక్షత్రము దైవీక మార్గదర్శకముగా చూస్తున్నాము. వారు విశ్వాసముతో నక్షత్రాన్ని అనుసరించారు. గమ్యం తెలియకపోయినా, దేవుని ప్రణాళికలో విశ్వాసము, విశ్వాసంయొక్క ప్రాముఖ్యతను ఇది సూచిస్తుంది. హేరోదురాజు, భూసంబంధమైన శక్తి, భయం, అధికారమును కాపాడుకోవాలనే కోరికకు ప్రతీక. యేసు జనన వార్త విని “కలత చెందాడు”, కలవర పడ్డాడు. తన రాజ్యాధికారానికి ముప్పుగా భావించాడు. దీనికి విరుద్ధముగా, జ్ఞానులు వినయముతో రాజుగా జన్మించిన యేసును గౌరవించి ఆరాధింప వచ్చారు. వినయశీలురు దేవుని చిత్తాన్ని అంగీకరిస్తారు. ప్రాపంచిక శక్తి, అహంకారమును అంటిపెట్టుకొని యున్నవారు దేవుని చిత్తాన్ని వ్యతిరేకిస్తారు.

జ్ఞానులు తెచ్చిన బహుమతులు, అర్ధవంతమైన బహుమతులు. ‘బంగారం’ యేసు రాజుల రాజు అని సూచిస్తుంది. ‘సాంబ్రాణి’ యేసు దైవత్వాన్ని సూచిస్తుంది. ఎందుకన, ఆరాధనలో సాంబ్రాణి [ధూపం] ఉపయోగిస్తారు. ‘పరిమళ ద్రవ్యములు’ మానవాళి రక్షణ కొరకు యేసు మరణాన్ని సూచిస్తుంది. భూస్థాపనలో పరిమళ ద్రవ్యములను ఉపయోగిస్తారు. భవిష్యత్తులో యేసు శ్రమలను, లోక పాప పరిహార్ధముగా మరణించబోయే రక్షకునిగా ఆయన పాత్రను సూచిస్తుంది.

“హేరోదు చెంతకు మరలి పోరాదని స్వప్నమున దేవుడు వారిని హెచ్చరింపగా వారు మరొక మార్గమున తమ దేశమునకు తిరిగిపోయిరి”. దైవీక రక్షణకు ప్రతీక. మానవ బెదిరింపులు, దుష్టపథకాలు పన్నినప్పుడు, దేవుని సహాయం ఎల్లప్పుడూ ఉంటుందని అర్ధమగుచున్నది. రక్షణ ప్రణాళికను ఎవరూ అడ్డుకొనలేరు. అది కొనసాగుతూనే ఉంటుంది.

జ్ఞానులద్వారా, అన్యులకు దేవుడు బయలు పరచు [ఎరుక పరచుట] సంఘటనను “యేసు సాక్షాత్కార మహోత్సవము”గా కొనియాడుతూ ఉంటాము. యేసును మెస్సయ్యగా, రాజుగా కొనియాడటం. ఈ సంఘటన యేసును మెస్సయ్యగా, రాజుగా బహిరంగముగా అంగీకరించిన ప్రధమ సంఘటనలలో ఒకటి.

ఆధ్యాత్మిక సందేశం: (1). క్రీస్తును నిష్కపట హృదయాలతో వెదకాలి. జ్ఞానుల ప్రయాణం, నరుని ఆత్మ సత్యమును, అర్ధమును అన్వేషించుటను సూచిస్తుంది. ఎన్ని ఇబ్బందులు, అడ్డంకులు ఉన్నప్పటికినీ, విశ్వాసులు, హృదయపూర్వకముగా, విశ్వాసముతో, అంకితభావముతో యేసును వెదకాలి. (2). దేవుని పిలుపుకు ప్రతిస్పందించాలి. నక్షత్రమనే దైవీక చిహ్నానికి జ్ఞానులు స్పందించినట్లుగా, మన జీవితములో కూడా, ప్రార్ధన, వాక్కు, ఇతర దైవీక మార్గదర్శకాల ద్వారా దేవుని సాన్నిధ్యముగల సంకేతాలకు ప్రతిస్పందించాలి. (3). యేసు ముందు సాష్టాంగపడి వినయపూర్వకముగా ఆరాధించాలి. ‘సాష్టాంగపడటం’ వినయమునకు, గౌరవమునకు సూచన. నిజమైన గొప్పతనం దేవున్ని ఆరాధించడములో ఉంటుంది తప్ప, భూసంబంధమైన శక్తిని, హోదాను వెదకుటలో ఉండదు.

మరణాన్ని ఎలా అర్ధం చేసుకుందాం?

 మరణాన్ని ఎలా అర్ధం చేసుకుందాం?


మరణము–బైబులు: జీవితం దైవానుగ్రహం. ‘ఆత్మ’ తన ఉనికిని కొనసాగించే నూతన జీవితమునకు మార్పుయే మరణము. కనుక, మరణం అంతిమం కాదు. పాపము వలన మరణం లోకమునకు ప్రవేశించినది. ఆదాము ఏవలు దేవున్ని అవిధేయించిన కారణమున, నరుని ఏదెను తోటనుండి వెళ్ళగొట్టెను (ఆది 3:23). తద్వారా, మరణం నరుని జీవితములోనికి ప్రవేశించినది (3:19). నూతన నిబంధనములో పౌలు “పాపము యొక్క వేతనము మరణము” (రోమీ 6:23) అని ఇదే విషయాన్ని పున:ప్రస్తావించాడు. మరణం ఆదిపాపానికి శిక్షయని, అయితే మానవాళిపట్ల దేవుని దయగల ప్రణాళికలో భాగమే అని పునీత అగుస్తీను వర్ణించాడు. మరణం అనగా శరీరమునుండి ఆత్మ వేరుచేయబడుట. “నరుని దేహము ఏ మట్టినుండి వచ్చినదో ఆ మట్టిలోనికి తిరిగి పోవును. అతని ప్రాణము మొదట దానిని దయచేసిన దేవుని చేరుకొనును” (ఉపదేశకుడు 12:7). అయితే, మరణించిన వారి పునరుత్థానముపై నిరీక్షణను కూడా బైబులు నొక్కివక్కానిస్తుంది. యేసు పునరుత్థానం క్రైస్తవ విశ్వాసమునకు పునాది, ప్రధానం. మరణానికి అంతము లేదనే ఆశను మనకు కలిగిస్తుంది. “నేనే పునరుత్థానమును, జీవమును. నన్ను విశ్వసించువాడు, మరణించినను జీవించును. జీవము ఉండగా నన్ను విశ్వసించు ప్రతివాడు ఎన్నటికిని మరణింపడు” (యోహాను 11:25-26) అని యేసు ప్రకటించాడు. పౌలు కూడా మరణాన్ని జయించడం గురించి చెప్పాడు, “మృత్యువు నాశనం చేయబడినది. ఓ మృత్యువా! నీ విజయము ఎక్కడ? ఓ మృత్యువా! బాధ కలిగింపగల నీ ముల్లు ఎక్కడ?” (1 కొరి 15:54-55). క్రీస్తుద్వారా మరణముపై ఈ విజయం క్రైస్తవ విశ్వాసానికి ప్రధానం.

మరణము–కతోలిక విశ్వాసం: మరణం భూలోక జీవితమునుండి శాశ్వతజీవితానికి మార్గము. శరీరమునుండి ఆత్మ నిష్క్రమిస్తుంది, కాని వ్యక్తిగత ఉనికికి అది ముగింపు కాదు. ఆత్మ జీవిస్తూనే ఉంటుంది. అది శాశ్వతములోనికి ప్రవేశిస్తుంది. మరణం తరువాత, ప్రతీ ఆత్మ ప్రత్యేక/వ్యక్తిగత తీర్పును ఎదుర్కుంటుంది. “ప్రతి వ్యక్తి ఒక్కసారే మరణించి తదుపరి దేవునిచే తీర్పు పొందవలెను” (హెబ్రీ 9:27). విశ్వాసము, నైతిక జీవిత ఆధారముగా, ఆత్మ పరలోకములోనికిగాని, ఉత్థరించు స్థలములోనికిగాని, నరకములోనికిగాని ప్రవేశిస్తుంది. పరలోకము అనగా [వెంటనే లేదా ఉత్థరించు స్థలముద్వారా] దైవకృపలో నున్నవారు, నీతిమంతులు. ఉత్థరించు స్థలము అనగా రక్షింపబడిన వారు, కాని ఇంకా శుద్ధీకరణ అవసరమైనవారు. నరకము అనగా పశ్చాత్తాపం లేకుండా ఘోర పాపములో మరణించి తద్వారా దైవకృపను తిరస్కరించినవారు. అంతిమ కాలమున, సకల ఆత్మలు సాధారణ తీర్పును పొందును. పునరుత్థానములో ఆత్మలు వారి శరీరములతో ఐఖ్యమగును. దేవుని న్యాయము సంపూర్ణముగా బయలు పరచ బడును (పునీత జస్టిన్, వేదసాక్షి).

మరణము-వేదసాక్షి: శ్రీసభ వేదసాక్షులను అనగా విశ్వాసము కొరకు తమ ప్రాణాలను అర్పించినవారిని ఎంతగానో గౌరవిస్తూ ఉంటుంది. శాశ్వత జీవితమునకు, క్రీస్తుతో ఐఖ్యము, సహవాస జీవితానికి ప్రత్యక్ష మార్గము. వీరు ఎలాంటి శుద్ధీకరణ లేకుండానే నేరుగా పరలోకానికి కొనిపోబడతారు. పునీత అతియోకు ఇగ్నేషియస్ గారు ఇలా ప్రార్ధించారు, “నేను దేవుని గోధుమను. క్రూరమృగాల దంతాలచేత నేను నలిపివేయబడినప్పుడు, నేను క్రీస్తుయొక్క స్వచ్చమైన రొట్టెను కనుగొనగలను” (రోమీయులకు లేఖ, 4వ అధ్యాయం).

నిత్యజీవితము: మరణం అంతిమం కాదని కతోలిక విశ్వాసం. దేవుని కృపలో మరణించేవారు పరలోకములో ఆయనతో నిత్య జీవితాన్ని ఆనందిస్తారు. ఇది దేవునితో పరిపూర్ణమైన సహవాస జీవితము. “దేవుడు ప్రతీ కన్నీటిని తుడిచి వేయును...ఇక మృత్యువు ఏ మాత్రము ఉండబోదు” (దర్శన 21:4) అని దర్శన గ్రంధములో చూస్తున్నాము.

మరణం-క్రీస్తు మరణములో పాల్గొనడము: కతోలిక విశ్వాసం ప్రకారం, క్రీస్తు మరణ-పునరుత్థానముల వలన మరణం రూపాంతరము చెందినది. క్రైస్తవులు జ్ఞానస్నానములో క్రీస్తు మరణ-ఉత్థానములో ఐఖ్యమగుచున్నారు. “మనము అందరము క్రీస్తు యేసు నందు జ్ఞానస్నానము పొందినపుడు ఆయన మరణము నందు జ్ఞానస్నానము పొందితిమి. కనుక మన జ్ఞానస్నానము వలన మనము ఆయనతో సమాధి చేయబడి ఆయన మరణమున పాలుపంచుకొంటిమి. ఆయన మరణములో మనము ఆయనతో ఏకమై యుండినచో, ఆయన పునరుత్థానములో కూడ మనము తప్పక ఆయనతో ఏకమై యుందుము” (రోమీ 6:3-5). అనగా మరణము వలన కలుగు దు:ఖములో నున్నప్పటికిని, మరణము పాస్క పరమ రహస్యములో పాల్గొంటుంది. కనుక, మరణము అర్ధరహితమైనది కాదు. మరణము నిరీక్షణతో నిండియున్నది. ఎందుకన, క్రీస్తు మనందరి కోసం నిత్యజీవపు ద్వారాలను తెరచాడు. “చనిపోయిన వారిని పోగుట్టుకున్న వారివలె దు:ఖపడకూడదు. ఎందుకన, మరణించి ఉత్థానమైన క్రీస్తునందు వారు లేపబడుదురు అని విశ్వసిస్తున్నాము” (పు. జెరుసలెం సిరిల్, సంక్షేప బోధనలు IV 23).

మరణము-దివ్యసంస్కారాలు: కతోలికులు అవస్థ అభ్యంగనమను దివ్యసంస్కారాన్ని విశ్వసిస్తారు. తీవ్రమైన అనారోగ్యము లేదా మరణావస్థలో నున్నవారికి ఈ దివ్యసంస్కారం ఇవ్వబడుతుంది. దైవకృప, ఆధ్యాత్మిక స్వస్థత, కొన్నిసార్లు శారీరక స్వస్థతను చేకూరుస్తూ వారిని ఆత్మీయముగా బలపరుస్తుంది. మరణావస్థలో నున్నవారిని [చివరి] దివ్యసత్ప్రసాదమును (వియాటికుం) స్వీకరించమని శ్రీసభ ప్రోత్సహిస్తుంది. ఇది నిత్యజీవిత ప్రయాణానికి ఆధ్యాత్మిక పోషణగా ఒసగబడుచున్న పవిత్ర దివ్యసత్ప్రసాదము.

పునీతుల బాంధవ్యము-మరణించిన వారి కొరకు ప్రార్ధనలు: పునీతుల బాంధవ్యముద్వారా జీవించుచున్నవారికి, మరణించిన వారికి మధ్యన లోతైన బంధమున్నదని కతోలిక విశ్వాసం. మృతుల కొరకు ప్రార్ధించే సంప్రదాయాన్ని శ్రీసభ పాటిస్తుంది. మరణించిన ఆత్మలకోసం, ముఖ్యముగా ఉత్థరించు స్థలములోనున్నవారి శుద్ధీకరణ కొరకు ప్రార్ధించమని భూలోకములో జీవించుచున్న విశ్వాసులను ప్రోత్సహిస్తుంది. ఈ విశ్వాసం 2 మక్క 12:45న చూడవచ్చు, “చనిపోయిన వారికి పాప విముక్తి కలుగునని యెంచి వారి కొరకు పాపపరిహారబలి అర్పింపజేసెను”. “క్రీస్తు శరీరరక్తముల బాంధవ్యములో శ్రీసభ మరణించిన వారికొరకు ప్రార్ధిస్తూ ఉంటుంది” (పు. అగుస్తీను, ప్రసంగం 172, 2). “ఒక వ్యక్తి శరీరమునుండి నిష్క్రమించిన తరువాత, ఆ వ్యక్తి పేర అర్పించబడే ప్రార్ధనలు, పుణ్యకార్యాలు, దానధర్మాల ద్వారా సహాయం అందించ బడుచున్నది” (పు. నిస్సా గ్రెగోరి, మరణించిన వారిపై ప్రసంగం)

మంచి మరణము కొరకు సిద్ధపడుట: ఆధ్యాత్మిక సంసిద్ధత ఎంతో అవసరము. సుగుణాలతో కూడిన జీవితాన్ని జీవించాలి. విశ్వాసము, పశ్చాత్తాపము కలిగి జీవించాలి. మంచి మరణము అనగా దేవునితో సఖ్యపడి, దేవుని కృపలో మరణించడం. మరణ తీర్పులో మనతో వచ్చేవి మన సద్గుణాలు, మన మంచి పనులు మాత్రమే! “ఈ లోకాన్ని విడచినప్పుడు, మనం ఈ లోకములో వదిలేసిన వాటిపైగాక, మనతో తీసుకొని వెళ్ళే సద్గుణాలు, పుణ్యకార్యాలను బట్టి తీర్పు ఉంటుంది” (పు. జాన్ క్రిసోస్తం, మత్తయి సువార్తపై ప్రసంగం 34).

సారాంశం: పాపము యొక్క ఫలితం మరణము అయితే, క్రీస్తుద్వారా మరణము జయించ బడినది. మరణం అనేది శాశ్వత జీవితానికి మార్పు. ఆత్మలు తీర్పునకులోనై, పరలోకము, ఉత్థరించు స్థలము, నరకములోనికి ప్రవేశిస్తాయి. శరీరము యొక్క పునరుత్థానం, దేవునితో శాశ్వత జీవిత సహవాసం కతోలిక విశ్వాసములో ప్రధానం.

వేదవ్యాపక ఆదివారము

 వేదవ్యాపక ఆదివారము
యెషయ 2:1-5; ఎఫెసీ 3:2-12; మార్కు 16:15-20
“మీరు ప్రపంచ మందంతట తిరిగి, సకలజాతి జనులకు సువార్తను బోధింపుడు” (మార్కు. 16:15)


ఉపోద్ఘాతము

క్రీస్తునందు ప్రియమైన సహోదరీ సహోదరులారా! ప్రతీ సంవత్సరం అక్టోబర్ మూడవ ఆదివారమున ‘ప్రపంచ వేదవ్యాపక ఆదివారము’. ప్రపంచ వ్యాప్తముగా ఒక బిలియన్ పైగానున్న (10,000 లక్షలు) కతోలిక విశ్వాసులందరమూ ‘ప్రపంచ వేదవ్యాపక ఆదివారము’ను కొనియాడుచున్నాము. ‘వేదవ్యాపక ఆదివారము’ను 1926వ సం.లో 11వ భక్తినాధ జగద్గురువులు స్థాపించారు. ఆనాటినుండి నేటివరకు కూడా విశ్వశ్రీసభ అక్టోబరు మాసమును వేదవ్యాపకము కొరకై ప్రార్ధన చేయడానికి అంకితం చేసింది. ఈరోజు మనం వేదవ్యాపక ఆదివార దివ్యపూజాబలిలో పాల్గొని, ప్రపంచ వ్యాప్తంగా సువార్తా ప్రచారము కొరకు, ప్రార్ధనలు చేస్తూ, దానినిమిత్తమై మనకు తోచిన ఆర్ధిక సహాయాన్ని అందజేస్తాము. ఈ వార్షిక వేడుకద్వారా విశ్వశ్రీసభ యొక్క మిషన్, ప్రేషితకార్యమైన సువార్త ప్రచారం లేదా వేదవ్యాపకం గురించి ధ్యానిస్తూ ఉంటాము. అలాగే, విశ్వశ్రీసభతో ‘మేమున్నాము’, క్రీస్తుయొక్క ప్రేశితకార్యమైన ‘దైవరాజ్యవ్యాప్తి’ కొనసాగింపుకు కట్టుబడియున్నామని నేడు మనమందరముకూడా ప్రకటిస్తున్నాము.

సువార్త ప్రచారం శ్రీసభ ప్రధాన పరిచర్య – మనందరి బాధ్యత

శ్రీసభ ప్రధానముగా మిషనరీ లేదా వేదవ్యాపక సభ. కనుక శ్రీసభ ప్రధాన బాధ్యత లేదా ప్రేషిత ధర్మం సువార్తీకరణ. ఎందుకన, యేసుక్రీస్తు ప్రధమ మిషనరీ. తండ్రియైన దేవుడు, దైవకుమారున్ని తన ప్రేమ, పరలోక రక్షణ సందేశముతో ఈ లోకానికి పంపియున్నాడు. ఒక మిషనుతో, ఒక మిషనరీగా ఆయన ఈ లోకానికి ఏతెంచాడు. దైవరాజ్యాన్ని స్థాపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఈ సందేశాన్ని స్పష్టముగా యోహాను సువార్త 3:16లో చూడవచ్చు: “దేవుడు లోకమును ఎంతో ప్రేమించి, తన ఏకైక కుమారుని ప్రసాదించెను. ఆయనను విశ్వసించు ప్రతివాడును నాశనము చెందక నిత్యజీవమును పొందుటకై అట్లు చేసెను”. యోహాను ఇదే విషయాన్ని మరల తన మొదటి లేఖ 4:9లో స్పష్టం చేసియున్నాడు: “ఆయనద్వారా మనము జీవమును పొందగలుగుటకు దేవుడు తన ఒకే ఒక కుమారుని ఈ లోకమునకు పంపెను. దేవుడు మనపై తనకు గల ప్రేమను ఇట్లు ప్రదర్శించెను”. పౌలు తిమోతీకి రాసిన మొదటి లేఖ 2:4లో, శ్రీసభ ప్రేషిత లక్ష్యాన్ని ఇలా తెలిపియున్నారు: “మానవులు అందరు రక్షింపబడ వలయునని, సత్యమును తెలిసికొన వలయునని దేవుని అభిలాష”. ఇదే నిజమైన సువార్త, శుభవార్త. ఈ సువార్తను మనం ప్రకటించాలి.

కనుక, శ్రీసభ తప్పనిసరిగా దేవుని ప్రేమ, దయ, కనికరము, క్షమాపణ, రక్షణ గురించి ప్రకటించాలి, బోధించాలి. అందుకే, శ్రీసభ ప్రధాన అంశం అయిన సువార్తా వ్యాప్తిలో, వేదవ్యాపకములో పాల్గొనడం ముఖ్యమైన భాగముగా మనం గుర్తించాలి. క్రీస్తుసువార్తా సారాంశమైన ప్రేమ, శాంతి, నిరీక్షణ, మన్నింపు, సహవాసముల సందేశాన్ని ధైర్యముగా ప్రకటించాలి. “మీరు ప్రపంచ మందంతట తిరిగి, సకలజాతి జనులకు సువార్తను బోధింపుడు” (మార్కు. 16:15; చూడుము. మత్త. 28:19) అన్న క్రీస్తు మాటలు మనలను చైతన్యవంతులను చేయాలి.

వేదవ్యాపకం జ్ఞానస్నానం పొందిన ప్రతీ క్రైస్తవుని బాధ్యత, కర్తవ్యం. ఈ బాధ్యతను, కర్తవ్యాన్ని యెషయ ప్రవక్తవలె స్వచ్చందముగా చేయాలి. “నేనున్నానుగదా, నన్ను పంపుడు (6:8) అని యెషయ ప్రవక్త పలికి యున్నాడు. ఒకరు బలవంతం చేస్తే చేసేది కాదు వేదవ్యాపకం. మనస్పూర్తిగా, స్వచ్చంధముగా చేయాలి. అయితే అ.కా. 4:20వ వచనములో, విచారణ సభముందు - యూదుల నాయకులు, పెద్దలు, ధర్మశాస్త్ర బోధకులు, ప్రధాన యాజకుడైన అన్నా, కైఫా, మొదలగు వారి సమక్షములో, పేతురు, యోహానులు పలికిన వాక్యాలుకూడా మనకు స్పూర్తిదాయకం కావాలి. “మేము మా కన్నులార చూచిన దానిని గూర్చి, చెవులార విన్న దానిని గూర్చి మాట్లాడకుండ ఉండలేము” అని ధైర్యముగా పలికి యున్నారు. మన హృదిలో, మదిలో పొందిన క్రీస్తు విశ్వాసాన్ని, క్రీస్తు సువార్తను చాటాలి, ప్రకటించాలి.

పరలోకానికి కొనిపోబడుటకు ముందు యేసు తన శిష్యులతో, “పవిత్రాత్మ మీ పైకి వచ్చునప్పుడు, మీరు శక్తిని పొందుదురు. కనుక... భూదిగంతముల వరకు నాకు సాక్ష్యులై ఉండెదరు” (అ.కా. 1:8) అని పలికి యున్నారు. వేదవ్యాపకం కేవలం మన పని కాదు, మనం మాత్రమే చేసేది కాదు. పవిత్రాత్మ శక్తిని పొందుకున్నప్పుడు మాత్రమే మనం చేయగలం. అది పరిశుద్ధాత్మ దేవుని పవిత్ర కార్యము. మనం కేవలం ఆయన సాధనాలము మాత్రమే. కనుక, ప్రతీ క్రైస్తవుడు/రాలు క్రీస్తు మిషనరీగా, క్రీస్తు సాక్షిగా పిలువబడి యున్నారు. సువార్తా ప్రచారం మన అందరి బాధ్యత. ప్రతీ ఒక్కరు దేవుని ప్రేమను, రక్షణను ఇతరులతో పంచుకోవాలి.

సువార్త వ్యాప్తి / వేదవ్యాపకం మనం ఎలాచేయాలి?

            మొట్టమొదటిగా శ్రేష్టమైన, పారదర్శకమైన, పవిత్రమైన క్రైస్తవ జీవితాన్ని జీవించడం ద్వారా సువార్తా ప్రచారం చేయాలి. క్రీస్తుకు సాక్షిగా ఉండటానికి అత్యంత శక్తివంతమైన సాధనం ‘నిజమైన లేదా అసలు సిసలైన క్రైస్తవ జీవితాన్ని జీవించడం’. ప్రేమ, దయ, కనికరము, ప్రార్ధన, క్షమాగుణము కలిగిన జీవితాన్ని జీవించడం. “నా జీవితమే నా సందేశము”గా మారాలి. రోజాపువ్వు ఎలాంటి వాఖ్యలను చేయదు. కాని, తను వెదజల్లే సువాసనద్వారా, తన ఎదురులేని అందముద్వారా అందరిని తనవైపునకు ఆకర్షిస్తుంది. కనుక, వేదవ్యాపకములో ముఖ్యమైన విషయం మనం జీవించే మంచి జీవితం. అనాధి క్రైస్తవులు ఆదర్శవంతమైన జీవితాన్ని జీవించారు. క్రైస్తవుల పరస్పర ప్రేమను చూసి అన్యులు అనేకమంది ఆకర్షింప బడ్డారు. ఇచ్చట క్రీస్తు పలుకులను జ్ఞాపకం చేసుకుందాం: “మీరు పరస్పరము ప్రేమ కలిగి యున్నచో, దానిని బట్టి మీరు నా శిష్యులని అందరు తెలిసి కొందురు” (యోహాను. 13:35).

రెండవదిగా ప్రార్ధన. మన ప్రార్ధనద్వారా సువార్తా ప్రచారం చేయవచ్చు. “నేను లేక మీరు ఏమియు చేయ జాలరు” (యోహాను. 15:5) అని ప్రభువు పలికి యున్నారు. కనుక, యేసును ప్రభువుగా, రక్షకునిగా అంగీకరించాలని కోరుకునే వారందరికీ, అలాగే క్రీస్తు సువార్తను బోధించే ప్రతి ఒక్కరికి ప్రార్ధన ఎంతో అవసరం. ప్రార్ధన నేపధ్యములో మాత్రమే క్రీస్తుకు సాక్ష్యులుగా మారడానికి పరిశుద్ధాత్మ మనకు సహాయం చేయును. మిషనరీలు, సువార్తా బోధకులు అందరిలాగే మానవ మాత్రులు, బలహీనులు. క్రీస్తుకు సాక్ష్యులుగా జీవించడం అంత సులువు కాదు. అది ఎన్నో సవాళ్ళతో కూడుకున్నటు వంటిది, కనుక మన ప్రార్ధనలతో వారిని బలపరచుదాం. “పంట విస్తారము కాని పనివారు తక్కువ. కనుక పనివారిని పంపవలసినదిగా ప్రార్ధింపుడు” (లూకా. 10:2). కనుక, దేవుని రాజ్యములో పనిచేయుటకు, తమ జీవితాలను అంకితం చేసుకొనుటకు అనేకమంది ప్రేరేపింప బడాలని, సంసిద్ధమై ధైర్యముగా ముందుకు రావాలని ప్రార్ధన చేద్దాం. సిలువ చెంత, మరియు ‘పైగది’లో శిష్యులతో కలిసి మరియ తల్లి శ్రీసభ కొరకు ప్రార్ధన చేసిన విధముగా, తనవంతు సహకారాన్ని అందించిన విధముగా, మనము కూడా ప్రార్ధన ద్వారా, తల్లి శ్రీసభకు మనవంతు సహకారాన్ని అందిద్దాం.

మూడవదిగా ఆర్ధిక సహాయముద్వారా మనం సువార్తా ప్రచారం లేదా వేదవ్యాపకాన్ని చేయవచ్చు. ప్రతీ వేదవ్యాపక ప్రయత్నానికి ఆర్ధిక మద్దతు ఎంతో అవసరం. పేదవారికి సహాయం చేయడం, అనారోగ్యులకు వైద్యసహాయం అందించడం, సువార్తా వ్యాప్తికి ఆధునిక టెక్నాలజీకి...మొ.గు వాటన్నింటికీ ఆర్ధిక సహాయం ఎంతో అవసరం. ప్రపంచ మంతటా నెలకొన్న 3వేల మేత్రాసణాలలో దాదాపు ఒక వెయ్యికి పైగా మేత్రాసణాలు ఇంకా మిషనరీ మేత్రాసణాలుగా ఉన్నాయి. వారికి ఆర్ధిక సహాయం ఎంతో అవసరం. మనం చేసే ఆర్ధిక సహాయం, విరాళాలు జగద్గురువులు పోపు ఫ్రాన్సిస్ ద్వారా, ఈ మిషనరీ మేత్రాసణాలకు చేరుతుంది. మన ఉదారమైన విరాళాల ద్వారా సువార్త వ్యాప్తికై సహాయం చేద్దాం, తద్వారా, మనము కూడా వేదవ్యాపకములో భాగస్థులమవుదాం.

సవాళ్లు / ఇబ్బందులు – మన దృక్పధం

వేదవ్యాపకం ఎన్నో సవాళ్ళతో కూడుకున్నటు వంటిది. “మీరు పొందు. ఇదిగో! తోడేళ్ళ మధ్యకు గొర్రెపిల్లలవలె మిమ్ము పంపుచున్నాను” (లూకా. 10:3) అని ప్రభువు చెప్పియున్నారు. నేడు మనం ఎదుర్కుంటున్న పెద్దమిషనరీ సవాలు లౌకికవాదం మరియు వినియోగ సంస్కృతి. వీని మూలముగా అనేకమంది దేవునికి అంతగా ప్రాముఖ్యత లేకుండా జీవిస్తున్నారు. నైతిక విలువలు కుంటుబడి పోవుచున్నాయి. మతాలు అవసరం లేదని ఎంతోమంది భావిస్తున్నారు. ఇలాంటి ‘సంస్కృతి’లో, సువార్తా ప్రచారం, వేదవ్యాపకం నిజముగా పెద్ద సవాలే! ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులలో శ్రీసభ మరింత ఆలోచనాత్మకముగా, పవిత్రముగా, మిషనరీ-కేంద్రీకృతమైన శ్రీసభగా మారాలి. తన ప్రేషిత కార్యాన్ని ప్రార్ధనపై ఆధారపడుతూ కొనసాగించాలి. దైవపిలుపులు అధికముగా నున్న ప్రాంతాలనుండి, దైవపిలుపులు ఎక్కువగా లేని ప్రాంతాలకు వెళ్లి సువార్తా పరిచర్యను చేయడానికి సిద్ధపడాలి. నేటికీ సువార్త ప్రకటింపబడని ప్రాంతాలకు సైతము ఉత్సాహముతో, ధైర్యముగా వెళ్ళడానికి సిద్ధపడాలి.

ప్రజలందరూ దేవునివైపుకు చేసే ప్రయాణములో, వారిని సువార్త వెలుగుతో ప్రకాశింప జేయడమే శ్రీసభ లక్ష్యం. దైవప్రేమకుగల శక్తి తప్పక అంధకారాన్ని జయించి, సన్మార్గములో నడిపిస్తుంది. కనుక, ఇతర సాంప్రదాయాలను, తాత్విక వ్యవస్థలను తెలుసుకోవడం, గౌరవించడం ఎంతో అవసరం. వారివారి సాంప్రదాయాలు, సంస్కృతులద్వారా దేవుని జ్ఞానరహస్యములోనికి ప్రవేశించుటకు, క్రీస్తు సువార్తను విశ్వసించుటకు సహాయం చేయాలి. ప్రజలందరు వారి మూలాలకు వెళ్ళడం, వారి సంస్కృతుల విలువలను రక్షించుకుంటూ సత్యములోనికి రావడమే శ్రీసభ లక్ష్యం. ఇది ఎంతో సవాలుతో కూడినటువంటిదే! అయినను, ఇది పరిశుద్ధాత్మ దేవుని కార్యముగా భావించి మనవంతు మనం కృషి చేయాలి. పవిత్రాత్మచేత మనం నడిపింప బడాలి. పవిత్రాత్మ ప్రేరణలను శ్రద్ధగా ఆలకించాలి.

మనముందు ఉన్న మరో సవాలు, నేడు కొంతమంది కతోలికులు శ్రీసభను వీడి ఇతర క్రైస్తవ శాఖలలో చేరుతున్నారు. ఇది కతోలికేత్తర క్రైస్తవులను, క్రైస్తవేత్తరులను ఒకింత డైలమాలోనికి, సందేహములోనికి నెట్టివేస్తుంది. కతోలికులుగా చేరాలని అనుకుంటున్నవారు వెనకడుగు వేస్తున్నారు లేదా వారి ఆలోచనలను విరమించు కుంటున్నారు. దీనికి కారణాలు అనేకం కావచ్చు – ఉదాహరణకు అంత:ర్గత కలహాలు, విభేదాలు, సమన్వయలోపం, వ్యక్తిగతస్వార్ధం, లౌకికకార్యకలాపాలు, గ్రూపులు, దైవార్చనలో అతిఆర్భాటాలు...మొ.వి. కనుక, వారిని తప్పుబట్టకుండా, మన జీవితాలను ఆత్మపరిశీలన చేసుకుందాం. ముందుగా, మన జీవితాలను పునరుద్దరించుకుందాం! మానవీయ, సువార్తా విలువలు కలిగి జీవించుదాం!

నేడు మనముందున్న మరో అతిగొప్ప సవాలు – క్రైస్తవులు ‘మతమార్పిడి’ చేస్తున్నారనే తప్పుడు భావన, తప్పుడు ప్రచారం! వాస్తవానికి అది కతోలిక శ్రీసభ ఉద్దేశ్యం కానేకాదు. మన ఉద్దేశ్యం – మానవాళికి సేవచేయడం. ‘మతమార్పిడి’ అను తప్పుడు భావనను సామరస్యముగా పరిష్కరించడానికి ప్రయత్నం చేయాలి.

ముగింపు

ప్రియ క్రైస్తవ సహోదరీ సహోదరులారా! నేడు ప్రధానముగా కావలసిన అంశాలు: బోధనకన్న క్రీస్తుబోధనల సారాంశాన్ని జీవించ గలగడం. జీవిత సాక్ష్యులుగా మారడం. సిననడల్ పద్ధతిలో ప్రయాణం చేయడం: అనగా అందరితో కలిసి నడవడం, అందరితో చర్చించడం / సంభాషించడం, పవిత్రాత్మ ప్రేరణతో నిర్ణయాలు చేయడం. విశ్వాస వికాసానికి ప్రతీ ఒక్కరు కృషిచేయడం. విశ్వాసులు మరియు ఆధ్యాత్మిక నాయకులు పవిత్ర జీవితాన్ని జీవించడం, ముఖ్యముగా ప్రార్ధనా జీవితాన్ని జీవించడం. 

వేదవ్యాపక ఆదివారాన్ని కొనియాడుచున్న మనం, వేదవ్యాపకుల కొరకు మరీ ముఖ్యముగా తిరుసభలో పునరుద్ధరనకు అవిరామముగా కృషి చేయుచున్న జగద్గురువులు పోప్ ఫ్రాన్సిస్ వారి కొరకు ప్రార్ధన చేద్దాం. తాను తలపెట్టిన సినడల్ ప్రయాణం దిగ్విజయముగా శ్రీసభ ఆధ్యాత్మికాభివృద్ధికి బాటలు వేయాలని ప్రార్ధన చేద్దాం. అలాగే వేదవ్యాపకములో పాల్గొంటున్న మేత్రాణుల కొరకు, గురువుల కొరకు, మఠకన్యల కొరకు, ఉపదేశుల కొరకు ప్రార్ధన చేద్దాం. దేవుడు మనందరినీ కూడా తన ప్రణాళిక ప్రకారం సువార్తా ప్రచారం కొరకు వినియోగించు కొనమని వేడుకుందాం. దేవుడు మనలను దీవించునుగాక! ఆమెన్.

దివ్యసంస్కారాలు

దివ్యసంస్కారాలు
బైబులు ఆధారితము
దివ్యసంస్కారము అనగా “దేవ వరప్రసాదములను ఇచ్చుటకు యేసునాధుడు స్థాపించిన సాధనము”. దేవవరప్రసాదము అనగా “మోక్షము పొందుటకు సర్వేశ్వరుడు మనకు ఉచితముగా దయచేయు దైవవరమే దేవవరప్రసాదము”. సంస్కారం ఆటే ఏమిటో ఒక్కమాటలో చెప్పాలంటే, “అంతరంగిక దైవానుగ్రహాన్ని సూచించే బహిరంగ చిహ్నం”. శ్రీసభ ఇచ్చే నిర్వచనం – “పవిత్రీకరణ దైవవరప్రసాదాన్ని సూచించి, దాన్ని ఉత్పత్తి చేయు జ్ఞానేంద్రియాలతో గ్రహింపగల ఒక సంకేతం”. ఇవి “శ్రీసభ జీవజాలాలు, దేవుని క్రుపావర సెలయేళ్ళు”.

అక్వినా తోమాసు గారు ఇలా అన్నారు: “సంస్కారం అంటే గతములో యేసు సాధించి పెట్టిన రక్షణ సంస్మరణం, వర్తమానములో సిద్ధిస్తున్న వరాల సాక్ష్యం, భవిష్యత్తులో బహుకరించనున్న నిత్యజీవ వాగ్దానం”.

కతోలిక శ్రీసభ సత్యోపదేశం నం. 1116 ప్రకారం, సంస్కారాలు క్రీస్తు దేహము నుండి వెలువడే శక్తులు’. (లూకా 5:17; 6:19; 8:46). అవి ఎల్లప్పుడూ జీవిస్తాయి, జీవాన్ని అందిస్తాయి. క్రీస్తు శరీరమైన శ్రీసభలో పనిచేసే పవిత్రాత్మ చర్యలు. నూతన శాశ్వత ఒప్పందములో అవి దేవుని ప్రతిభా కృతులు (the masterworks of God).

దివ్యసంస్కారము అనగా క్రీస్తుచే స్థాపించబడిన బాహ్యపరమైన లేదా గ్రహించదగిన చిహ్నము. ఇది దైవీక జీవితాన్ని, దేవునితో సన్నిహిత స్నేహాన్ని ప్రసరించుటకు సమర్ధవంతమైన సాధనం. “చావు పుట్టుకల మధ్య వచ్చు వివిధ దశల్లో ఆవశ్యకమగు ఆధ్యాత్మిక వరాలను అనుగ్రహించుటకు యేసు ప్రభువు సంస్కారాలను స్థాపించాడు”. “శ్రీసభ ఆరాధనా జీవితమంతా దివ్యప్రసాద సంస్కారం కేంద్రముగా గల ఏడు సంస్కారాల చుట్టూ పరిభ్రమిస్తుంది (SC పవిత్ర దైవార్చనా చట్టం 6)

ఈవిధముగా, ఒక దివ్యసంస్కారాన్ని కొనియాడుటకు ఖచ్చితముగా అత్యవసరమైన మూడు ప్రధాన అంశాలు ఉన్నాయి: (1). క్రీస్తుచేత స్థాపించ బడటం (2). బాహ్యపరమైన లేదా గ్రహించదగిన చిహ్నం (3). దైవీక జీవితాన్ని, దేవునితో సన్నిహిత స్నేహాన్ని సమర్ధవంతముగా క్రీస్తు తన శ్రీసభలో  ప్రసరించుటకు సమర్ధవంతమైన సాధనముగా ఉండటం.

(1). మనకొరకు స్వయముగా క్రీస్తే దేవుని సంస్కారము. ఆయనే ‘ఆదిమమైన సంస్కారము’ (Primordial Sacrament). తన పవిత్ర మానవత్వం, తన మనుష్యావతారము వలన, దేవుడు మన జీవితాలను తట్టియున్నాడు. అదృష్యుడైన దేవుడు క్రీస్తుద్వారా మనందరికీ ప్రత్యక్షమయ్యాడు.
(2). ఉత్తానమైన క్రీస్తు తన ప్రేషితకార్యమును నేటికీ శ్రీసభద్వారా కొనసాగిస్తున్నారు. శ్రీసభ భాహ్యముగా కనిపించెడు ఉత్థాన క్రీస్తు సంఘము. అందుకే, శ్రీసభ ప్రాధమిక సంస్కారము (Basic Sacrament). ఉత్థాన క్రీస్తు దైవప్రజల అర్చనలో ప్రత్యక్షమవును. క్రీస్తు శరీరముగా, మన అనుదిన నిర్దిష్ట పరిస్థితులద్వారా, క్రీస్తు సాన్నిధ్యమును ఈ లోకములో కొనసాగిస్తున్నాము. ఇది మన సంస్కారాల జీవితానికి ఆధారం.
(3). ప్రతీ దివ్యసంస్కారమును కొనియాడుటలో దివ్యసంస్కారానుభూతిని మనం పొందాలి. దానికై ‘శ్రీసభ అర్చన - నిర్వహణా విధానము’ ఉంటుంది. ఈ ‘నిర్వహణా విధానము’ను విశ్వాసముతోను, నిబద్ధతతోను కొనియాడాలి. లేనిచో అది కేవలం ఒక మతాచారముగానే మిగిలి పోతుంది.
(4). యేసుక్రీస్తు, శ్రీసభ, దివ్యసంస్కారాలు అను త్రయం ఇమిడి యున్నాయి. ఈ త్రయాన్ని విడదీయలేము.
(5). అలాగే విశ్వాసం, దివ్యసంస్కారం, శ్రీసభ అను త్రయం కూడా యున్నది. అవి ఒకదానితో ఒకటి ముడిపడి యున్నవి (అ.కా. 2:37-38; 8:12-13, 34-38; 9:4-6, 17-18; 10:44-48; 16:14-15; 18:8; 22:12-16; మత్త 28:18-20). అందుకే శ్రీసభ పితరులు “విశ్వాసపు సంస్కారాలు” అని పిలవడానికి ఇష్టపడ్డారు. ఎందుకన, విశ్వాసం దివ్యసంస్కారాలకు నడిపించును; దివ్యసంస్కారాలు విశ్వాసమును పోషించును (కతోలిక శ్రీసభ సత్యోపదేశం 1122-1124; SC పవిత్ర దైవార్చనా చట్టం 59
(6). ప్రతీ దివ్యసంస్కారమును కొనియాడుట, ఉత్థానక్రీస్తు సాన్నిధ్యమును మనకు ప్రత్యక్షం చేస్తుంది. అయితే, క్రీస్తు సాన్నిధ్యాన్ని నేనెప్పుడైతే గ్రహిస్తానో, అప్పుడే క్రీస్తు సాన్నిధ్యం ఫలభారిత మవుతుంది. వేరే మాటలలో చెప్పాలంటే, ప్రభువు సన్నిధి నాకు అందుబాటులో నున్నది కాని, ప్రభువు సన్నిధిలో నేను కొలువై యుండక పోవచ్చు!
(7). ప్రతీ దివ్యసంస్కారములో ఉత్థానక్రీస్తు తననుతాను నాకు సమర్పణ గావించుకొనుచున్నారనే వాస్తవాన్ని నేను అంగీకరించాలి. కనుక, నిజమైన ఉనికి పరస్పరము ఇచ్చుకోవడాన్ని, అంగీకరించు కోవడాన్ని సూచిస్తుంది. ఫలితముగా, ఇది వేడుకలకు దారితీస్తుంది.
 దివ్యసంస్కారాలు – బైబులు ఆధారిత ఆవిర్భావం
బైబులులో క్రీస్తు తన శిష్యులకు దివ్యసంస్కారాలను ఎలా నిర్వహించాలో, ఎలా స్వీకరించాలో స్పష్టమైన సూచనలను చేసాడు. ఆయన చేసిన కార్యాలలో, జబ్బుపడిన వారిని స్వస్థపరచడములో, ఉపమానాలలో, ఆత్మల రక్షణ నిమిత్తమై తన శరీరరక్తాలను ఇవ్వడములో, పాపులను క్షమించుటలో ఇది మనకు కనిపిస్తుంది. దేవున్ని ఆరాధించుటకు, రక్షణ పొందుటకు దివ్యసంస్కారాలు నిర్దేషించ బడ్డాయి.

‘సంస్కారం’ అను పదం గ్రీకు పదమైన ‘మిస్తేరియన్’ అన్న పదములో వేళ్ళూని ఉంది. దీనిని రెండు పదాలుగా అనువాదం చేయాల్సి వచ్చింది: ఒకరి మిస్తేరిఉం = సంస్కార పరమార్ధములోని అంతరంగిక దైవానుగ్రహాన్ని ప్రతిధ్వనిస్తుంది. రెండు సాక్రమెంతుం = జ్ఞానేంద్రియాలతో గ్రహింపగల చిహ్నాన్ని ప్రతిధ్వనిస్తుంది. మిస్తేరియం అనుపదం గ్రీకు మతకర్మల్లో, ప్లేటో తత్వశాస్త్రములో కన్పిస్తుంది. అయితే, బైబులులో కూడా ఈ పదం కనిపిస్తుంది. కాని దాని భావం చాల విసృతార్ధముతో నిండుకొని యున్నది – జ్ఞాన 6:22; దాని 2:28, 47, మత్త 13:11; లూకా 8:10; 1కొరి 2:7-10, రోమీ 16:25-26; కొలస్సీ 1:26-27; 4:3; ఎఫెసీ 1:9-10; 3:3-12; 5:32.

అయితే 12వ శతాబ్దం వరకు దాని (‘సంస్కారం’) నికరమైన అర్ధాన్ని గూర్చి పెద్దగా పట్టించుకోలేదు. మొదటిసారిగా లాబర్ట్ పీటర్ సంస్కారము యొక్క విశిష్టతను నిర్దుష్టముగా వివరించాడు. ఆదినుండి క్రైస్తవులు “ఆత్మకు అద్వితీయ వరప్రసాదాలను కలిగియుండె కనిపించే చిహ్నాలు సంస్కారాలు” అని, వాటినే యేసే స్థాపించాడని నమ్మారు. ఆ భావాన్ని లాబర్ట్ పీటర్ గారు, “పవిత్రీకరించు వరప్రసాద కార్యకారణ సంబంధప్రేరణం” అని చక్కగా వ్యక్తం చేసాడు. ఈవిధముగా 12వ శతాబ్దంలో క్రమబద్ధమైన వేదాంతముగా సప్త దివ్యసంస్కారాలు రూపొందాయి.

 1. జ్ఞానస్నానము
జ్ఞానస్నానము అన్ని సంస్కారాలకు మూలం. మొదటిది, ప్రధానమైనది. క్రైస్తవ జీవితానికి పునాది. ఆత్మైక జీవనానికి ఆరంభం. క్రీస్తుతోను, శ్రీసభతోను ఐఖ్యమయ్యే మొట్టమొదటి దివ్యసంస్కారము. జ్ఞానస్నానము స్వీకరించకుండా ఏ ఇతర దివ్యసంస్కారాలను మనము పొందలేము (సత్యోపదేశం, 1213). కనుక, ఇతర సంస్కారాలను స్వీకరించేందుకు ముఖద్వారం, దివ్యమార్గం.
సాధారణముగా, ఒక గురువు (లేదా దీకను) జ్ఞానస్నానమును ఇస్తారు. జ్ఞానస్నాన అభ్యర్ధి తలమీద నీళ్ళు పోయుచు పేరు చెప్పి, “పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున నేను నీకు జ్ఞానస్నానమును  ఇచ్చుచున్నాను” అని చెప్పెదరు. నీరు, వాక్కుద్వారా జన్మపాపమును, ఇతర పాపములను పోగొట్టి సర్వేశ్వరునికి, తిరుసభకు బిడ్డలుగా చేయును. ‘బప్తిస్మం’ అనే పదం ‘బాప్తేజియన్’ అనే గ్రీకు పదం నుండి వచ్చినది. దీని అర్ధం ‘ముంచడం’ లేదా ‘కడగడం’. ఇది మన ఆత్మను కడిగి, డాన్ని పాపమాలిన్యం నుండి శుద్ధిచేస్తుంది.
జ్ఞానస్నాన దివ్యసంస్కారము యేసుక్రీస్తుచేత స్థాపించబడినది. ప్రభువు దీనిని సరికొత్త ఆచారముగా స్థాపించలేదు. ఉన్న ఆచారాన్నే (బప్తిస్మ యోహాను జ్ఞానస్నానం ఇచ్చేవాడు) తీసుకొని దానికి ప్రత్యేక వరప్రసాదాన్ని జోడించాడు. స్నాపక యోహాను ద్వారా బప్తిస్మం పొందినపుడు, క్రీస్తుని పరిశుద్ధ శరీరము నీటిని తాకుట మూలముగా పాపములను పోగొట్టు శక్తిని ఆ నీటికిచ్చి, బప్తిస్మం అను దివ్యసంస్కారాన్ని స్థాపించారు.
దీనిని తను జ్ఞానస్నానము పొందుటలోను (మత్త 3:13-17), మోక్షరోహణమున శిష్యులకు ఇచ్చిన ఆజ్ఞద్వారా సూచించ బడినది:
మార్కు 1:9-11 – “ఆ రోజులలో గలిలీయ సీమలోని నజరేతునుండి యేసు వచ్చి, యోర్దాను నదిలో యోహానుచేత బప్తిస్మము పొందెను. ఆయన నీటినుండి వెలుపలికి వచ్చిన వెంటనే పరమండలము తెరువ బడుట, పవిత్రాత్మ పావురము రూపమున తనపై దిగివచ్చుట చూచెను. అప్పుడు పరలోకమునుండి ఒక వాణి ‘నీవు నా ప్రియమైన కుమారుడవు. నిన్నుగూర్చి నేను ఆనందించుచున్నాను’ అని వినిపించెను”. యేసు పొందిన ఈ జ్ఞానస్నానం, తాను స్థాపించబోయే దివ్యసంస్కారాన్ని సూచిస్తుంది.
అటుపిమ్మట యేసు కూడా జ్ఞానస్నాన మిచ్చినట్లు యో 3:22లో చూస్తున్నాము (చదువుము).
మత్త 28:19 – యేసు తన అంతిమ సందేశములో తన శిష్యులతో, “మీరు వెళ్లి, సకల జాతి జనులకు పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున జ్ఞానస్నాన మొసగుచు, వారిని నా శిష్యులను చేయుడు” అని ఆజ్ఞాపించాడు.
ఈవిధముగా, క్రీస్తు మొక్షారోహణం అగుటకు ముందు తన అపోస్తలులకు, వారి తర్వాత వచ్చు వారికిని ఈ అధికారం ఇచ్చారు.
శిష్యులు ఈ ఆజ్ఞను పెంతకోస్తు రోజుననే విధేయించారు. పేతురు సందేశమును వినిన తరువాత ప్రజలు తీవ్రమైన ఆవేదనతో, “మేము ఏమి చేయవలయును?” అని ప్రశ్నించినపుడు, పేతురు, “మీరు హృదయ పరివర్తన చెంది మీ పాప పరిహారమునకై ప్రతి ఒక్కడు యేసుక్రీస్తు నామమున, బప్తిస్మము పొందవలయును” (అ.కా.2:38; (9:18; 10:48)) అని చెప్పాడు. ఆరోజు రమారమి మూడువేల మంది జ్ఞానస్నానమును పొందిరి (అ.కా.2:41). శిష్యులు జ్ఞానస్నానమిచ్చి సంఘములోనికి చేర్చుకొనిరి. ఏడుగురు దీకనులలో ఒకడైన ఫిలిప్పు నపుంసకుడగు ఇతియోపియా నివాసికి, యేసును గురించి బోధించిన తరువాత మార్గమధ్యలో నీటి మడుగులో అతనికి జ్ఞానస్నానమును ఇచ్చెను (అ.కా.8:26-40).
జ్ఞానస్నానముద్వారా, మనము దేవుని బిడ్డలమైనాము, బిడ్డలము కనుక వారసులమైనాము (రోమీ 8:15-17; గల 4:4-6). జ్ఞానస్నానముద్వారా, మనము క్రీస్తుతో సమాధి చేయబడి ఆయన మరణమున పాలు పంచుకొంటిమి (రోమీ 6:4; ఎఫెసీ 2:6; కొలొ 3:1; 2 తిమో 2:11).
జ్ఞానస్నానముద్వారా, “క్రీస్తు సభ్యులమయ్యాం. శ్రీసభలో చేర్చబడినాము. శ్రీసభ ప్రేషిత కార్యములో భాగస్తులమయ్యాం” (సత్యోపదేశం, 1213). జ్ఞానస్నానముద్వారా, “మనం క్రీస్తు రూపురేఖలను పొందుతున్నాం” (LG లోకానికి వెలుగు శ్రీసభ, 7). “మనము అందరము ఒకే ఆత్మయందు ఒకే శరీరములోనికి బప్తిస్మము పొందితిమి” (1 కొరి 12:13). “జ్ఞానస్నానం ఆచరించిన విశ్వాసులు, తాము పొందిన ‘నవజీవం’ వలనను, పవిత్రాత్మ ప్రభు అభిషేకం వలనను, పావనమైన ఆధ్యాత్మిక మందిరముగా రూపాంతరం చెందుతున్నారు, పవిత్రులైన యాజకులుగా మారుతున్నారు” (LG లోకానికి వెలుగు శ్రీసభ, 10).
దేవుని బిడ్డలుగా శాశ్వత పరమానందము లోనికి (పరలోకం) ఖచ్చితముగా ప్రవేశించే మార్గం జ్ఞానస్నానం తప్ప మరొక మార్గం శ్రీసభకు తెలియదు. రక్షణకు జ్ఞానస్నానం అవసరమని ప్రభువే స్పష్టం చేసియున్నారు: “ఒకడు నీటి వలన, ఆత్మ వలన జన్మించిననే తప్ప దేవుని రాజ్యములో ప్రవేశింప లేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను” (యో 3:5). రక్షణకు జ్ఞానస్నానం ఎందుకు అవసరము? ఎందుకంటే, ఇది స్వయముగా క్రీస్తు బోధ (యో 3:5; మార్కు 16:16). శిష్యులకు ఆజ్ఞాపించాడు (మత్త 28:19). క్రీస్తు కాలమునుండియే శ్రీసభయొక్క స్పష్టమైన బోధ. అలాగే, కేవలం జ్ఞానస్నాన దివ్యసంస్కారం మాత్రమే జన్మపాపమును తొలగించ గలదు (cf. సత్యోపదేశం, 1257).
జ్ఞానస్నానముద్వారా, శ్రీసభలో సభ్యులుగా చేరే విశ్వాసులు, తమ బాప్తిస్మ ధర్మం ప్రకారం క్రైస్తవ మతారాధనలలో అర్చనాకాండలో పాల్గొన బద్ధులై ఉంటారు. దేవుని కుమారులుగా, కుమార్తెలుగా పునర్జన్మించిన విశ్వాసులు, శ్రీసభద్వారా దేవుడు తమకు ప్రసాదించిన విశ్వాస వరాన్ని మానవుల ఎదుట తమ ఆదర్శ జీవనంద్వారా సజీవముగా ప్రదర్శించాలి, స్పష్టముగా ప్రకటించాలి.
జ్ఞానస్నానం యొక్క ప్రభావాలు:
(1). మొదటిగా యేసుక్రీస్తుతో సజీవ సంబంధాన్ని ఏర్పరస్తుంది (cf. 1 పేతు 2:4-5). మనం పాపమునకు మరణించి, క్రీస్తుతో నూతన జీవములోనికి ఎత్తబడు చున్నాము. పాపాంధకారము క్రీస్తువెలుగుతో భర్తీచేయ బడినది. ఇది త్రిత్వైక దేవునితో సాంగత్యమును కలుగజేస్తుంది. మనం దేవుని బిడ్డలము అవుచున్నాము. ఈవిధముగా, జ్ఞానస్నానముద్వారా మనం పునర్జన్మించిన వారమవుతున్నాము. (2) రెండవదిగా, జ్ఞానస్నానముద్వారా, శ్రీసభ సభ్యులవుతున్నాము. శ్రీసభ చట్టాలకు లోబడి ఉంటాము. ఇతర దివ్యసంస్కారాలను స్వీకరించుటకు అర్హులమవుతున్నాము. విశ్వాసమును ప్రకటించుటకు క్రీస్తు శిష్యులుగా జీవించాల్సిన బాధ్యతను పొందుచున్నాము. (3). జ్ఞానస్నానం క్రైస్తవునిపై చెరగని ఆధ్యాత్మిక ముద్రను వేస్తుంది. క్రీస్తుకు చెందిన వాడని దీని భావం. అనగా మనం క్రైస్తవులమని ధృవీకరిస్తుంది. ఏ పాపముకూడా ఈ ముద్రను చెరిపివేయలేదు (cf. రోమీ 8:29). అందుకే, ఒకసారి తీసుకున్న జ్ఞానస్నానాన్ని మరల తీసికోకూడదు (సత్యోపదేశం, 1272). ఎందుకన, “క్రీస్తులోనికి జ్ఞానస్నానము పొందిన మీరందరు క్రీస్తును ధరించి యున్నారు” (గలతీ 3:27).
జ్ఞానస్నానములో ఉపయోగించే బాహ్యసూచకాలు: నీరు, క్రిస్మాతైలం, తెలుపువస్త్రం, వెలుగుచున్న క్రొవ్వొత్తి, ఎఫెతా సాగ్యం.

2. భద్రమైన అభ్యంగము (ధృవీకరణం)
జ్ఞానస్నాన కృపావరాన్ని భద్రమైన అభ్యంగము పరిపూర్తి చేస్తుంది (సత్యోపదేశం, 1288). భద్రమైన అభ్యంగముతో ఇంకా ఎక్కువగా శ్రీసభతో బంధాన్ని పెంచుకుంటారు. పవిత్రాత్మ ప్రత్యేక శక్తితో సంపూర్ణులవుతారు (సత్యోపదేశం, 1285). జ్ఞానస్నానం తీసుకున్న వ్యక్తి భద్రమైన అభ్యంగమునకు అర్హుడు (సత్యోపదేశం, 1306). జ్ఞానస్నానంద్వారా సంక్రమించిన యాజకత్వాన్ని [జ్ఞానస్నానం వలన క్రీస్తు యాజకత్వములోనూ, ప్రబోధములోనూ, రాజరిక ప్రేషిత కార్యములో పాల్గొంటారు, సత్యోపదేశం, 1268] ఈ “అక్షయ ముద్ర” సంపూర్ణం చేస్తుంది. భద్రమైన అభ్యంగమును ఆచరించిన వ్యక్తి అధికారికముగా, బహిరంగముగా క్రీస్తులో తన విశ్వాసాన్ని ప్రకటించే శక్తిని అందుకుంటాడు (సత్యోపదేశం, 1305). దీనికొరకే, జ్ఞానస్నానం పొందిన వ్యక్తి, భద్రమైన అభ్యంగములో పవిత్రాత్మ వరములను పొందును.
ధృవీకరణ ద్వారా పవిత్రాత్మను పొంది, విశ్వాసములో ధృడపడి, క్రీస్తు సారూప్యాన్ని పొంది క్రీస్తుకు సాక్షుల మౌతాము. విశ్వాస యోధులుగా సత్యవేద ప్రచార బాధ్యతను స్వీకరిస్తాం. క్రైస్తవ జీవితములో, మనం విశ్వసించు సత్యాన్ని పూర్తిగా నమ్మి, అందుకు సాక్ష్యమిచ్చుటే గాక అవసరమైతే ప్రానాలిచ్చేందుకు కూడా సిద్ధం చేస్తుంది ఈ సంస్కారం.
భద్రమైన అభ్యంగము రక్షణకు అత్యవసరము కాకున్నను, ఆచరించుటలో నిర్లక్ష్యం చేయడం పాపమే! ఎందుకన ఇది పవిత్రాత్మ ఫలాలను, వరాలను ఒసగుతుంది.
పెంతకోస్తు (ఏబదియవ దినము, కోతకాల పండుగ) దినమున పవిత్రాత్మ రాకడ గూర్చి అ.కా. 2:1-4లో చదువుచున్నాము. క్రీస్తు తన శిష్యులకు పవిత్రాత్మ వరమును వాగ్దానం చేసాడు. తద్వారా వారు క్రీస్తు సందేశమును ధైర్యముగా ప్రకటించెదరు (లూకా 24:47-49; యో 14;16-17; 16:7,13).
పాతనిబందనలో పవిత్రాత్మ ప్రస్తావన: ఆ.కాం.1:2; 2:7; న్యాయాధి 3:10-11; 1 సమూ 10:6; 16:13; యిర్మీ 1:4-10.
నూతన నిబంధనలో, యేసు ప్రభువు పవిత్రాత్మ శక్తి చేతనే సువార్తను బోధించారని, అద్భుతాలు చేసారని సువార్తలలో చెప్పబడింది (లూకా 4:18; 11:20).
అపోస్తలులే స్వయముగా ఈ దివ్యసంస్కారాన్ని ఇచ్చారు (అ.కా 8:17; 19:6; హెబ్రీ 6:2). హస్తనిక్షేపణము పవిత్రాత్మ వరాలను ప్రసాదించును [అందుకే మేత్రానులు అభ్యర్ధిపై చేతులు చాపి పవిత్రాత్మ ప్రార్ధన చేయును].
భద్రమైన అభ్యంగము దైవీక జీవితాన్ని మనలో బలపరుస్తుంది. ప్రత్యేకమైన దివ్యసంస్కార కృపానుగ్రహాన్ని ఒసగుతుంది. మన ఆత్మపై ఎన్నటికి చెరగని  “అక్షయ ముద్ర”ను వేస్తుంది. క్రీస్తు క్రైస్తవున్ని తన ఆత్మతో ముద్రించి, గుర్తిస్తాడని ఈ అక్షయ ముద్ర సూచిస్తుంది.
పవిత్రాత్మను పొందిన వారే నిజమైన క్రైస్తవులు. ఎందుకంటే, ఆత్మ వలన నడిపించ బడినవారే ఆయన పుత్రులని పౌలు ప్రభోదించారు (రోమీ 8:14). చదువుము రోమీ 8:15; గలతీ 4:14-19; 1 కొరి 3:16; 6:19). సత్యమును బోధించుటలోను, న్యాయం కోసం పోరాడుట లోను పవిత్రాత్మ దేవుడు మనకు తోడుగా నిలుస్తున్నారు.
భద్రమైన అభ్యంగము యొక్క ప్రభావాలు:
(1). భద్రమైన అభ్యంగము ప్రత్యేకమైన కృపావరాన్ని ఒసగుతుంది, తద్వారా మన విశ్వాసం బలపడుతుంది. ఇతరుల ఆధ్యాత్మిక విషయాలపట్ల కూడా శ్రద్ధను వహిస్తాము. క్రీస్తు రక్షణ కార్యములో భాగస్థులమవుతాము. దైవరాజ్య వ్యాప్తిలో క్రీస్తు ప్రేషిత కార్యములో పాలుపంచు కుంటాము. క్రీస్తుకు సాక్షులుగా మారతాము (సత్యోపదేశం, 1303-1304). (2). భద్రమైన అభ్యంగము వలన క్రీస్తు అపోస్తలులకు వాగ్దానం చేసిన దానిని పొందుతాము: “పవిత్రాత్మ మీ పైకి వచ్చునప్పుడు, మీరు శక్తిని పొందుదురు. కనుక మీరు ... భూదిగంతముల వరకు నాకు సాక్ష్యులై ఉండెదరు” (అ.కా.1:8). పవిత్రాత్మ ప్రసాదించే ప్రత్యేక వరప్రసాదాలతో వారు బలసంపన్ను లవుతారు. కనుక, క్రీస్తుకు సజీవ సాక్షులుగా, తమ భక్తివిశ్వాసాలను తమ మాటలద్వారాను చేతలద్వారాను చాటిచెప్పడం ధర్మముగా భావించాలి (LG లోకానికి వెలుగు శ్రీసభ, 11). (3). అక్షయ ముద్ర – ఆధ్యాత్మికమైన, చెరగని ముద్ర. మనం సంపూర్ణముగా క్రీస్తుకు చెందినవారమని సూచిస్తుంది. భద్రమైన అభ్యంగము ఆచరించిన వారు శ్రమలనుభవించుటకు సిద్దముగా ఉంటారు (చదువుము: మత్త 10:19-20). అక్షయ ముద్ర వలన భద్రమైన అభ్యంగమును ఒకసారి మాత్రమే స్వీకరించాలి.
ధృవీకరణ ఫలాలు: (1). పవిత్రాత్మ జ్ఞానవరాలు: జ్ఞానము, బుద్ధి, విమర్శ, ధృడము, తెలివి, భక్తి, దైవభయం, (2). పవిత్రాత్మ అనుగ్రహాలు: సోదరప్రేమ, జ్ఞానసంతోషం, సమాధానం, ఓర్పు, దయ, మేలెరిగినతనం, తాళిమి, శాంతం, విశ్వాసం, మర్యాద, నిగ్రహం, విరక్తత్వం
 ధృవీకరణ – కర్మాచరణం: (1). ముందుకు వచ్చుట (2). విశ్వాస ప్రకటన (3). చేతులను చాచి ప్రార్ధించుట (4). క్రిస్మాతైలం పూయుట (5). చెంపపై కొట్టుట (6). చివరి ఆశీస్సులు

 3. దివ్యసత్ర్పసాదము
దివ్యసత్ప్రసాదము అన్ని సంస్కారాలకు కేంద్రం. దీనిని ‘సంస్కారాలకే సంస్కారం’ అని సంబోధిస్తారు. దివ్యసత్ప్రసాద దివ్యసంస్కారము ప్రవేశ దివ్యసంస్కారాలను పరిపూర్తి చేస్తుంది. క్రైస్తవ ప్రవేశాన్ని పరిపూర్తి చేస్తుంది (సత్యోపదేశం, 1322).
దివ్యసత్ప్రసాద దివ్యసంస్కారాన్ని యేసు ప్రభువు కడరాత్రి భోజన సమయములో స్థాపించాడు. పరిశుద్ధ దివ్యసత్ప్రసాదములో బెత్లెహేములో జన్మించి, కలువరిలో సిలువపై మరణించి, మూడవ రోజున ఉత్థానమైన క్రీస్తు కొలువై ఉంటాడు. ఇది దైవప్రేమకు, కరుణకు నిదర్శనం. ఇందులో క్రీస్తు ఆత్మ దైవత్వముతో పాటు, ఆయన శరీర రక్తాలు ఉంటాయి. కాబట్టి దివ్యసత్ప్రసాదములో సంపూర్ణ క్రీస్తు సత్యముగా, వాస్తముగా, స్వభావ సిద్ధముగా ఉన్నాడు (సత్యోపదేశం, 1374). దివ్యసత్ప్రసాదము క్రైస్తవ జీవనానికి ‘ఆరంభమూ అంతిమ గమ్యమూ (LG లోకానికి వెలుగు శ్రీసభ, 11).

దివ్యసత్ప్రసాదమును క్రీస్తు కడరా భోజన సమయములో స్థాపించాడు. “దివ్యబలి సంస్కారాన్ని సాక్షాత్తూ మన రక్షకుడైన క్రీస్తు ప్రభువే స్థాపించారు. ఆయన “అప్పగింప బడనున్న రాత్రి”, కడరా భోజన సదర్భములో, తన శరీర రక్తాలతో “దివ్యబలి”ని స్థాపించారు. సిలువపై తాను సమర్పించిన లోక రక్షణ బలిని తరతరాల వరకు, తాను మరల వచ్చువరకు కొనసాగించడానికి వీలుగా ప్రభువు ఈ దివ్యసంస్కారాన్ని నెలకొల్పారు” (SC పవిత్ర దైవార్చనా చట్టం, 47).
ఈ దివ్యసంస్కారాన్ని స్థాపించడానికి మూడు కారణాలు:
(1). మన ఆత్మకు దివ్యభోజనమై ఉండుటకు (యో 6:48, 56, 58). (2). మనతో వాసము చేయుటకు – “నేను మీ యందు ఉందును. మీరు నా యందు ఉండుడు” (యో 15:4). (3). తన మరణమును జ్ఞాపక పరచుకొనుటకు – “ఈ రొట్టెను భుజించునపుడెల్ల, ఈ పాత్రము నుండి పానము చేయునపుడెల్ల ప్రభువు వచ్చు వరకు మీరు ఆయన మరణమును ప్రకటింతురు” (1 కొరి 11:26). ఈ దివ్యసంస్కారాన్ని “కృతజ్ఞాతార్పణం” (Eucharist) అని పిలుస్తాము. ఎందుకన, ఇది దేవునికి కృతజ్ఞతలర్పించే చర్య (సత్యోపదేశం, 1328). యేసుక్రీస్తు దివ్యసత్ప్రసాదమును స్థాపించు సమయములో దేవునకు కృతజ్ఞతలను అర్పించాడు. దివ్యబలిపూజ ద్వారా దేవునకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము.
ఈ దివ్యసంస్కారము పరమ పవిత్ర సంస్కారముగా పిలువబడుచున్నది, ఎందుకన, ఇది స్వయముగా క్రీస్తునే మనకు ఒసగుచున్నది.
దివ్యబలిపూజలో స్వీకరించు దానిని మనం “దివ్యసత్ర్పసాధము” అని పిలుస్తాం. మరణావస్థలో ఒసగే దివ్యసత్ర్పసాధమును “స్వర్గ ప్రయాణ భోజనము” అని పిలుస్తున్నాము (సత్యోపదేశం, 1524).
క్రీస్తు ఈ దివ్యసంస్కారాన్ని ఎలా స్థాపించారు? (చదువుము మత్త 26:26-28). చివరిగా, “దీనిని నా జ్ఞాపకార్ధము చేయుడు” (లూకా 22:19; 1 కొరి 11:23-25) అని శిష్యులకు ఆజ్ఞాపించాడు.
క్రీస్తు ఎప్పుడైతే, “ఇది నా శరీరము” అని పలికాడో, రొట్టె [లేదా అప్పము] అంతయు కూడా (పదార్థము అంతయు) తన శరీరముగా మారినది. “ఇది నా రక్తము” అని పలికినప్పుడు, ద్రాక్షారస మంతయు (పదార్థము అంతయు) తన రక్తముగా మారినది.
ఈ దివ్యసంస్కారాన్ని స్థాపించక మునుపే ప్రభువు తన శరీరాన్ని భోజనముగా, తన రక్తాన్ని పానముగా వాగ్దానం చేసియున్నాడు (చదువుము యో 6:48-57).
కడరా భోజన సమయములో ప్రభువు పలికిన మాటలను అపోస్తలులు అర్ధం చేసుకున్నారు. అందుకే పౌలు ఇలా వ్రాసాడు: చదువుము 1 కొరి 10:16; 11:27.

కడరా భోజన సమయములో (పవిత్ర గురువారమున) ప్రభువు గురుత్వాన్నికూడా స్థాపించాడు. “దీనిని నా జ్ఞాపకార్ధము చేయుడు” (లూకా 22:19) అన్న మాటలతో అపోస్తలులకు, వారి వారసులకు అప్పద్రాక్ష రసములను క్రీస్తు శరీర రక్తములుగా మార్చె శక్తిని ఒసగి యున్నాడు. కృతజ్ఞతార్చనలో క్రీస్తు మాటలను పలుకుట వలన గురువులు ప్రభువు ఒసగిన శక్తిని వినియోగించు చున్నారు. అప్పుడు రొట్టెలోని పదార్థము క్రీస్తు శరీరముగా, ద్రాక్షా రసములోని పదార్థము, క్రీస్తు శరీరముగా మార్పు చెందుతుంది.

ఈ మార్పును కతోలిక శ్రీసభ “పదార్థ రూపాంతర మార్పు” (పదార్ధాంతరీకరణం - transubstantiation) అని పిలుస్తుంది (సత్యోపదేశం, 1376).
దివ్యసత్ప్రసాదములో ఉత్థాన క్రీస్తు ఉన్నాడు. క్రీస్తు సాన్నిధ్యం ఉన్నది. రొట్టెను విరిచినప్పుడు క్రీస్తు ముక్కలు కాదు. ప్రతీ ముక్కలో కూడా ఆయన సంపూర్ణముగా సమగ్రముగా ఉంటాడు (సత్యోపదేశం, 1377).
దివ్యబలిపూజ యొక్క ఉద్దేశాలు:
(1). దేవున్ని సృష్టికర్తగా ఆరాధించుటకు. (2). దేవుని అనేక కృపానుగ్రహాలకు కృతజ్ఞతలు చెల్లించుటకు. (3). దేవుని కృపానుగ్రహాలను అందరిపై కుమ్మరించుమని వేడుకొనుటకు. (4). దేవునితో సఖ్య పడుటకు (పాప పరిహార్ధమై మత్త 26:28).
దివ్యబలిపూజ యొక్క ఫలాలు:
(1). దేవుని దయను పొందెదము; చేసిన పాపాలకు పశ్చాత్తాప పడే కృపను పొందెదము; పాపాలకు మన్నిపును పొందెదము; పాపశిక్ష నుండి ఉపశమనం పొందెదము. (2). మన ప్రార్ధనలు తప్పక ఆలకించ బడును, ఎందుకన, పూజలో స్వయముగా ప్రభువే మన కోసం ప్రార్ధన చేయును. 
దివ్యసత్ర్పసాద అనుగ్రహాలు:  
(1). క్రీస్తుతో మన ఐఖ్యతను బలపరుస్తుంది (యో 6:56-57; 1 కొరి 10:17). (2). మనలను పాపమునుండి వేరుచేస్తుంది (సత్యోపదేశం, 1393), సత్కార్యములలో పాల్గొనునట్లు చేయును. (3). దేవునితో స్నేహాన్ని అధికం చేస్తుంది. భౌతిక ఆహారం ఏ ఫలితాన్ని ఇస్తుందో దివ్యసత్ర్పసాదము ఆధ్యాత్మిక జీవితములో సాధిస్తుంది. దివ్యసత్ర్పసాదము పవిత్రాత్మద్వారా జీవాన్నిచ్చింది, జీవాన్నిస్తూనే ఉన్నది. జ్ఞానస్నానములో అందుకున్న కృపావరాన్ని పదిలపరచి అభివృద్ధి చేస్తుంది, నూత్నీకరిస్తుంది (సత్యోపదేశం, 1392). (4). దివ్యసత్ర్పసాదము పేదలపట్ల మనలను బాధ్యులను చేస్తుంది (సత్యోపదేశం, 1397). రోజు రోజుకూ దేవునితోను, సాటి విశ్వాసులతోను సంపూర్ణ సాన్నిహిత్యాన్ని సాధించేలా చేస్తుంది (SC పవిత్ర దైవార్చనా చట్టం 48).
 బైబులులోవిందు – ద్వితీ 12:7; లేవీ 7:15; ఆది.కాం 14:18-20 (చదువుము).
ఆది.కాం. 18:1-18; ద్వితీ 26:11; ఆది.కాం 26:28-30; 31:46-54; నిర్గమ 24:11;

4. పాప సంకీర్తనము / పాపోచ్చారణం-సఖ్యత
‘పాపోచ్చారణం’ అనగా జ్ఞానస్నానం పొందిన వెనుక కట్టుకొను పాపములను మన్నించి, దేవునితోను, తోటివారితోను సఖ్యతను ప్రసాదించు దివ్యసంస్కారం. పాపసంకీర్తన (పాప విమోచన / పశ్చాత్తాప) దివ్యసంస్కారమును మొదటి పాస్కా ఆదివార సాయంత్రమున మన ప్రభువే స్థాపిచాడు. శిష్యుల మీద శ్వాస ఊది, “ఎవరి పాపములనైనను మీరు క్షమించిన యెడల అవి క్షమింప బడును. మీరు ఎవరి పాపములనైనను క్షమింపని యెడల అవి క్షమింప బడవు” (యో 20:22-23) అని చెప్పెను.
పాపసంకీర్తనము ద్వారా జ్ఞానస్నానము తరువాత చేసిన పాపాలు పరిహరించ బడును. పశ్చాత్తాప సంస్కారమును భక్తి విశ్వాసాలతో ఆచరంచే వారు దేవుని దయకు పాత్రులవుతారు. పాప మన్నింపు పొందుతారు. పాపము వలన గాయపడిన తల్లి శ్రీసభతోను తిరిగి సఖ్యత పడుదురు (LG లోకానికి వెలుగు శ్రీసభ, 11; సత్యోపదేశం, 1422).

ప్రభువు శిష్యులకు చేసిన వాగ్ధానము: “భూలోకమందు మీరు వేనిని బంధింతురో అవి పరలోక మందును బంధింప బడును. భూలోకమందు మీరు వేనిని విప్పుదురో అవి పరలోక మందును విప్పబడును (మత్త 18:18). ఈ వాగ్ధానమును ప్రభువు మొదటి పాస్కా ఆదివారమున నెరవేర్చారు. పాపములను క్షమించే అధికారమును ప్రభువు తన శిష్యులకు ఒసగాడు.
యేసు – ప్రజలను పాపం నుండి విమోచిస్తాడు (మత్త 1:21). పాప బానిసత్వం నుండి విముక్తి చేయువాడు క్రీస్తు ఒక్కడే (యో 12:31).

పాపసంకీర్తన (పాప విమోచన / పశ్చాత్తాప) దివ్యసంస్కార ప్రభావాలు:
(1). పాప మన్నింపు. “దేవుని ఎదుట మన పాపములను ఒప్పుకొనినచో, ఆయన మన పాపములను క్షమించును. మన అవినీతి నుండి మనలను శుద్ధి చేయును” (1 యో 1:9). (2). పాపము వలన కలుగు శిక్షనుండి ఉపశమనము. యేసు జక్కయ్యతో ఇట్లు పలికెను, “నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చినది. ఏలన, ఇతడును అబ్రహాము కుమారుడే” (లూకా 19:9). (3). సమస్త సృష్టితో సఖ్యత పడును: తనతోను, దేవునితోను, తోటివారితోను, శ్రీసభతోను సఖ్యపడును. (4). మరల పాపం చేయకుండా ఉండుటకు తోడ్పడును.
పాపసంకీర్తనము చేయుటకు ఐదు కార్యములు కావలెను:
(1). చేసిన పాపములను జ్ఞాపక పరచు కొనుట (2). చేసిన పాపముల కొరకు పశ్చాత్తాప పడుట (3). ఇక పాపములను చేయనని ప్రతిజ్ఞ చేయుట (4). చేసిన చావైన పాపముల నన్నింటిని గురువునకు బయలు పరచుట (5). గురువు కట్టడ చేసిన అపరాధమును తీర్చుట. 
పాపోచ్చారణ చట్టం (1973).
పాపం అనగా అవిధేయత (రోమీ 5:19; 2 కొరి 10:6); అన్యాయ బుద్ధితో ప్రవర్తించుటకు, దురాలోచనలు, మూర్ఖత్వం (1 పేతు 2:6). తప్పిదాల వలన, అక్రమాల వలన, ‘అప్పుపడి’ యుండుట (మత్త 6:12; లూకా 11:4) దేవుని క్షామాపణ (లూకా 15:11-28) పాపాలన్నింటిలో ఘోరపాపం పవిత్రాత్మను తిరస్కరించడం, వెలుగు కాదనడం (మత్త 12:31-32; యో 9:39-41) పాపాల మన్నింపుపై క్రీస్తు మనం పాపాత్ములుగా ఉన్నప్పుడే మనకోసం మరణించాడు (రోమీ 5:6-11) పాపం మన దేహములో తిష్ట వేయును (రోమీ 5:6-12; 7:13-17)
పాపోచ్చారణం చేయు విధానం: (1) అంతరాత్మ పరిశోధన (2) పశ్చాత్తాపం (3) పాపోచ్చారణం (4) పాపపరిహారం-నిష్కృతి

5. వ్యాధిగ్రస్తుల (అవస్థ) అభ్యంగము
వ్యాధిగ్రస్తుల ఆత్మ శరీరములకు ఆదరణను ఇచ్చెడు దివ్య సంస్కారము.
“మీలో ఎవ్వడైన వ్యాధి గ్రస్తుడా? అనచో అతడు సంఘపు పెద్దలను పిలువా వలెను. వారు అతని కొరకు ప్రార్ధింతురు. ప్రభువు నామమున వానిపై తైలమును పూయుదురు. విశ్వాసముతో చేసిన ఈ ప్రార్ధన ఆ వ్యాధి గ్రస్తుని రక్షించును. ప్రభువు వానిని ఆరోగ్య వంతుని చేయును. వాని పాపములు క్షమింప బడును. కాబట్టి పరస్పరము మీ పాపములు ఒప్పుకొనుడు. ఒకరికొకరు ప్రార్ధించు కొనుడు. అప్పుడు మీరు స్వస్తులగుదురు” (యాకోబు 5:14-16).

“స్వస్తతా సంస్కారముద్వారా, ఆ సందర్భములో గురువు చేసే ప్రార్ధనద్వారా, యావత్ శ్రీసభ వ్యాధిబాధితులైన వ్యక్తులను, తన శ్రమలద్వారా ఎనలేని మహిమకు పాత్రుడైన క్రీస్తు ప్రభువు సన్నిధానములో నిలుపుతుంది, వారి విమోచన బాధ్యతను ప్రభువు దివ్యహస్తాలకు అప్పజెబుతుంది, వారిని బాధా విముక్తులను కావించి స్వస్థపరచి రక్షణ భాగ్యాన్ని ప్రసాదించుమని వేడుకుంటుంది” (LG లోకానికి వెలుగు శ్రీసభ, 11).

రోగులను స్వస్థపరచుటకు, బాధితులను ఒదార్చుటకు, ప్రభువు అనేకమైన అద్భుతాలను చేసాడు. “యేసు గలిలీయ ప్రాంత మంతట పర్యటించుచు, వారి ప్రార్ధనా మందిరములలో బోధించుచు, పరలోక రాజ్యపు సువార్తను గూర్చి ప్రసంగించుచు, ప్రజల వ్యాధిబాధల నెల్ల పోగొట్టు చుండెను” (మత్త 4:23). “ప్రొద్దు గ్రుంకు చుండగా నానావిధ రోగ పీడితులైన వారినందరిని వారివారి బంధువులు యేసు వద్దకు తీసికొని వచ్చుచుండిరి. అపుడు ఆయన వారిలో ఒక్కొక్కని మీద తన హస్తము నుంచి వారినందరిని స్వస్థపరచెను” (లూకా 4:40).

యేసు తన శిష్యులను వేద ప్రచారమునకు పంపినపుడు, “వారు అనేక పిశాచములను పారద్రోలిరి. రోగులకు అనేకులకు తైలము అద్ది స్వస్థ పరచిరి” (మార్కు 6:13).
ఇవన్నియుకూడా, ప్రభువే స్వయముగా ఈ సంస్కారాన్ని స్థాపించారని సూచిస్తున్నాయి. మొక్షారోహనమునకు ముందుగా తన శిష్యులకు వాగ్దానం చేసారు: “నా నామమున దయ్యములను వెళ్ళగొట్టెదరు ... రోగులపై తమ హస్తములను ఉంచిన వారు ఆరోగ్య వంతులగుదురు” (మార్కు 16:17-18).
అపోస్తలులు ఖచ్చితముగా ఈ దివ్యసంస్కారాన్ని నిర్వహించారు. ఈ విషయాన్ని గురించి యాకోబు 5:13-15లో స్పష్టముగా చెప్పబడినది.

దివ్యసంస్కార ప్రభావాలు:
(1). పవిత్రాత్మ ప్రత్యేక వరం: బలహీనత వలనగాని, అనారోగ్యము వలనగాని, వృద్ధాప్యం వలనగాని వచ్చే కష్టాలను ఎదుర్కొను బలం, శాంతి, ధైర్యాన్ని ఒసగును. నిస్సహాయత వలన, మరణ భయం వలన కలిగే శోధనలను ఎదుర్కొనే బలాన్ని ఒసగును (సత్యోపదేశం, 1520). (2). క్రీస్తు శ్రమల్లో ఐఖ్యత: క్రీస్తు శ్రమల్లో ఐఖ్యం కావడానికి కావలసిన బలాన్ని పొందును (సత్యోపదేశం, 1521). (3). శ్రీసభ కృపావరం: రోగి దేవుని ప్రజల మంచికి దోహదం చేస్తాడు. శ్రీసభ పునీతులతో ఏకమై రోగి మేలు కొరకు వేడుకుంటుంది (సత్యోపదేశం, 1522). (4). అంతిమ యాత్రకు సన్నాహం: మరణాన్ని దాటి జీవానికి నడిపే సంస్కారం. ఈ ప్రపంచం నుంచి తండ్రి దగ్గరకు తీసికెళ్ళే సంస్కారం (సత్యోపదేశం, 1523). (5). దేవుని చిత్తమైతే, ఆత్మ స్వస్థతతో పాటు దేహ స్వస్థత కూడా జరుగుతుంది (సత్యోపదేశం, 1520). (6). పాపాలకు క్షమాపణ లభిస్తుంది (సత్యోపదేశం, 1520).
పాత నిబంధనలో స్వస్థత – నిర్గమ 15:26; కీర్తన 107;20;

6. గురుపట్టము
పవిత్ర యాజకత్వం ఒక సంస్కారం. దీనిద్వారా క్రీస్తు తన అపోస్తులలకు ఆపగించిన ప్రేషిత కార్యం యుగాంతము వరకు అమలు జరుగుతూనే ఉంటుంది. దీనిలో మూడు అంతస్తులు ఉన్నాయి: పీటాధిపత్యం, గురుత్వం, దీకను (సేవకత్వం).
మన ప్రభువే స్వయముగా ఈ దివ్యసంస్కారాన్ని స్థాపించారు. కడరాత్రి భోజన సమయములో స్థాపించారు. “దీనిని నా జ్ఞాపకార్ధము చేయుడు” (లూకా 22:19) అని చెప్పి దివ్యబలి పూజను సమర్పించమని ఆదేశించారు.
హెబ్రీ 5:1; 5:4; 1 పేతు 2:9; చదువుము: 1 కొరి 11:26 –
ఉత్థాన మైన రోజున పాపములను క్షమించే అధికారం ప్రభువు శిష్యులకు ఒసగాడు (చదువుము యో 20:21-23).
చివరిగా, మొక్షారోహనానికి ముందు సువార్త బోధన ప్రేషిత కార్యాన్ని, సంస్కారాల నిర్వహణ బాధ్యతలను అప్పగించాడు (చదువుము మత్త 28:18-20).
ఈ ప్రేషిత కార్యమును కొనసాగించడానికి, క్రీస్తు శిష్యులపై ప్రత్యేక విధముగా పవిత్రాత్మను వారిపై క్రుమ్మరించాడు. హస్తనిక్షేపణ ద్వారా పవిత్రాత్మ వరమునును నేటికినీ ఇతరులకు ఒసగబడు చున్నది (అ.కా. 1:8; 2;4; యో 20:22-23; 1 తిమో 4:14; 2 తిమో 1:6-7).
క్రీస్తు ప్రధాన యాజకుడు (హెబ్రీ 5:5-6)
గురుతర బాధ్యతలు: యాజకుడు (హెబ్రీ 4:14-5:10), ప్రవక్త (మార్కు 3:14; 16:15; యో 20:21; రోమీ 10:13; 1:1; 1 కొరి 9:16), కాపరి (లూకా 22:26)

 7. జ్ఞాన వివాహము
“దంపతులు సన్మార్గమందు నడచుటకు, తమ బిడ్డలను పుణ్య మార్గములో నడిపించుటకును, దేవవరప్రసాదములను ఇచ్చెడు దివ్యసంస్కారము”.
యోహాను 2:1-11 కానా పల్లెలో వివాహము.
క్రైస్తవ వివాహము [బాప్తిస్మము పొందిన] ఒక పురుషుడిని, ఒక స్త్రీని ఐఖ్యం చేస్తుంది. భార్యాభర్తలు ఇరువురు కూడా శాంతి, ప్రేమలతో జీవించాలి. వివాహమును క్రీస్తు దివ్యసంస్కారముగా ఏర్పాటు చేసి, దాని గౌరవాన్ని పెంచారు. కాన పల్లె వివాహములోనే యేసు తన మొదటి అద్భుతాన్ని చేసి, సందర్భాన్ని గౌరవప్రాయముగా మార్చాడు. వివాహ అంతస్థు పవిత్రమైనదని ప్రకటించాడు.
వివాహ జీవితం ప్రారంభము నుండి ఉన్నది (ఆ.కాం. 2:23-24). ప్రభువు రాకముందు వివాహము ఒక పవిత్రమైన ఒప్పందమే. క్రీస్తు వివాహమును ఓ దివ్యసంస్కారముగా స్థాపించారు. ఒకరినొకరు పరస్పర సమ్మతిని వెల్లడి చేసుకొనడం ద్వారా, అనుగ్రహాన్ని ఒకరిపై ఒకరు ప్రదానం చేయుదురు. గురువు శ్రీసభ చేత ఆమోదింప బడిన సాక్షిగా వారి ఐఖ్యతను ఆశీర్వదించును.
ఏవను ఆదాము శరీరము నుండి సృష్టించాడు (ఆ.కాం. 2:21-22). వారిరువురు సంపూర్ణముగా సమానులని దీని అర్ధం. వివాహము ద్వారా ఇరువురు భిన్న శరీరులు ఏక శరీరులైనారు (మత్త 19:6). కనుక వారిలో స్వార్ధం, పోటీతత్వం, నేనే పెద్ద అన్న వాటికి చోటు ఉండరాదు. వివాహ వాగ్దానాలకు ఒకరికొకరు విశ్వసనీయముగా ఉండాలి.
భర్త భార్యను ప్రేమించాలి (చదువుము ఎఫెసీ 5:25). క్రైస్తవ వివాహ బంధం, క్రీస్తుకు-శ్రీసభకు మధ్యనున్న దైవీక బంధము, ఐఖ్యతతో పోల్చబడినది. క్రీస్తు శ్రేసభకు శిరస్సు. అలాగే, వివాహములో భర్త కుటుంబానికి శిరస్సు అయితే, భార్య హృదయం (పోప్ పయస్ XI).
భార్య భర్తకు సహచరినిగా, తోడుగా సుఖదుఃఖాలలో పాలు పంచుకోవాలి (ఆ.కాం. 2:23-24).
దేవునికి-ప్రజలకు మధ్యనున్న బంధం వివాహ బంధముతో పోల్చబడినది: యెహేజ్కె 16; హోషేయ 2; యెష 54; యిర్మీ 3.
“జీవితములో, ప్రేమలో దంపతులు సన్నిహిత భాగస్వాములుగా ఉండేందుకు వివాహం నిర్దేశింప బడినది” (సత్యోపదేశం, 2364).
కుటుంబ అనుదిన జీవితములో ప్రార్ధన తప్పనిసరి భాగమై యుండాలి (పోప్ జాన్ పాల్ II).
విడాకులు (మత్త 19:6; మార్కు 10:9). “వివాహము విడదీయలేని బంధము అని దేవుడు తన ఉద్దేశాన్ని క్రీస్తు నిశ్చయముగా సమర్ధించాడు. పాత చట్టములో చొరబడిన సర్దుబాటును ఆయన రద్దు చేసాడు”. ఒక్క మరణం తప్ప మరే ఇతర కారణాల వలన ఏ మానవ శక్తి కూడా రద్దు చేయలేదు. (సత్యోపదేశం, 2382).
(చదువుము లూకా 16:18) – వ్యభిచారం
(చదువుము 1 కొరి 7:10-11)
గురుశ్రీ ప్రవీణ్ కుమార్ గోపు OFM Cap.
STL in Biblical Theology
పెద్దవుటపల్లి
9550629255
BIBLIOGRAPHY
 1. కతోలిక శ్రీసభ సత్యోపదేశం (Catechism of the Catholic Church in Telugu), September 2005
2. Our Catholic Faith, Revised Edition for India, Louis Laravoire Morrow, 2004
3. పవిత్ర దైవార్చనా చట్టం (Sacrosanctum Concilium: The Constitution on the Sacred Liturgy), ద్వితీయ వాటికన్ మహాసభ అధికార పత్రాలు (Vatican Council – II Documents), Jeevan Print 2009
4. లోకానికి వెలుగు శ్రీసభ (Lumen Gentium: Dogmatic Constitution on the Church), ద్వితీయ వాటికన్ మహాసభ అధికార పత్రాలు (Vatican Council – II Documents), Jeevan Print 2009
5. దివ్య సంస్కారాలు, SJP భక్త యోహాను ప్రాంతీయ గురువిద్యాలయ ప్రచురణ, 2003