ఆగమనకాల మూడవ ఆదివారం

ఆగమనకాల మూడవ ఆదివారం
11 డిశంబర్ 2011 YEAR B
యెషయ 61:1-2, 10-11; I తెస్స 5: 16-24; యోహాను 1 : 6-8, 19-28

మొదటిపటనములో, శుభవార్తప్రకటన, బందీలకువిముక్తి అనుదైవకార్యమును కల్గియుండి రాబోవువానిని గూర్చి యెషయప్రవక్త ప్రవచిస్తున్నాడు. సువిశేషపటనములో ఈలోకమునకు వెలుగైనున్నవాని రాకనుగూర్చి బప్తిస్మయోహానుగారు ప్రవచిస్తున్నారు.

గత ఆదివారముకూడా యోహానుగూర్చి, అతని జీవితము, భోధనలగూర్చి ధ్యానించియున్నాము. ఈ రోజుకూడా, బప్తిస్మ యోహానుగూర్చి సువిషేశములో వింటున్నాము. అతనుఎవరో, ఎవరుకాదో సుస్పష్టముగా ఈరోజు తెలుసుకోవచ్చు. మొదటిగా, ఎలియావలె దుస్తులు ధరించినప్పటికినీ(మా 1:6; 2 రా. 1:8), ఎలియావలె పశ్చాత్తాపము, తీర్పుగురించి ప్రకటించినప్పటికిని (1రా. 18:21; 2 రా.ది. 21:12-15), యోహాను పరలోకమునుండి తిరిగివచ్చిన ఎలియాకాదు(2 రా. 2:11). అయితే, యోహాను శారీరకముగా ఎలియాకానప్పటికిని, అతడు ఎలియాఆత్మయును, శక్తియునుకలిగి (లూకా 1:17; మలాకి 3: 23-24) దైవకార్యమును పరిపూర్ణముచేయుటకు పంపబడినవాడు. యోహాను దేవునివాక్యమును ప్రకటించినప్పటికిని, ద్వి.కాం. 18: 15-19 లో మోషేప్రవచించిన ప్రవక్తయునుకాదు. తల్లిగర్భమునుండియే పవిత్రాత్మతో అభిషిక్తుడైనప్పటికిని, అతను మెస్సయ్య కాదు (లూకా 1: 15,44).


మరి యోహాను ఎవరు? యోహాను ప్రభువుమార్గమును సిద్ధముచేయుటకు ఎడారిలో ఎలుగెత్తిపలుకు స్వరము (యోహా 1:23). ఎవరిపై అయితే పరమండలమునుండి ఆత్మదిగివచ్చినదో (యోహాను 1:32), మరియు మొదటిపటనములోవిన్న వాగ్దానములను పరిపూర్ణముచేయుటకు వచ్చియున్నాడో (లూకా 4:16-21) అతనిని మనకు పరిచయం చేయుటకు పంపబడినవాడు.

క్రిస్మస్ దినమునవచ్చు మెస్సయ్యను విశ్వసించుటకు బాప్తిస్మయోహాను మనకు 'వెలుగు'ను చూపించుటకు వచ్చినవాడు. యోహాను ఆవెలుగు కాదు. కాని, ఆ వెలుగునకు సాక్షమీయవచ్చెను. ఈ వెలుగుకోసమే మనం ఈ ఆగమనకాలమంతయు ఆయత్తపడుతూ, విశ్వాసముతో, నమ్మకముతో, గొప్పఆశతో ఎదురుచూస్తున్నాము. వెలుగు ఎప్పుడుప్రకాశిస్తూఉంటుంది. వెలుగువచ్చినపుడు మనలో, మనచుట్టూఉన్న అంధకారము పటాపంచలు అవుతుంది.

మనందరికి తెలిసినవిధముగా, వెలుగు చీకటి రెండు ఏకకాలములో విమడలేవు. చీకటివున్నచోట వెలుగు ఉండదు. వెలుగుఉన్నచోట చీకటిఉండదు. ఆ వెలుగు పేదలకు సువార్తను భోదించుటకు, చేరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డివారికి చూపును కలిగించుటకు, పీడితులకు విమోచనము కలుగజేయుటకు మరియు ప్రభుహితమైన సంవత్సరమును ప్రకటించుటకు పంపబడెను (లూకా 4:18-19). క్రీస్తువచ్చినప్పుడు మనలోని అంధకారము పటాపంచలు అవుతుంది. ఆయనరాకతో మనజీవితాలు ప్రకాశవంతమవుతాయి. ఆ వెలుగు ఈ లోకమున ఉండెను. ఆ వెలుగుమూలమున ఈ లోకము సృజింపబడెను.

ఈనాటి రెండవపటనములో, పౌలుగారు ''సర్వదా సంతోషముగా ఉండుడు'' అని చెప్పుచున్నారు. ఒకరు ఆదిశిస్తే వచ్చేది కాదు సంతోషం. అది ఒక అనుభూతి. కాని, పౌలు గారు చెప్పిన విధముగా, మనం ఎల్లప్పుడూ సంతోషముగా ఉండాలి, ఉండగలం. ఎందుకన, మన సంతోషానికి మూలాధారం మన ప్రభువు. మన భాదలలో కూడా, మనం సంతోషముగా ఉండవచ్చు. మనం ఎంత సంతోషముగా ఉన్నామనేది, మనం ప్రభువునకు ఎంత దగ్గరగా ఉన్నామో, ప్రభువు మనకి ఎంత దగ్గరాగా ఉన్నాడో అన్న దానిపై ఆధార పడిఉంటుంది. కాబట్టి, మనం ప్రభువునకు ఎంత దగ్గరగా ఉంటె, అంత సంతోషముగా ఉండగలం. ప్రభువు శిలువలోనున్న, భాదలలోనున్న ఆయన ప్రభువే. శిలువనుండికూడా మనకి సంతోషాన్ని ఇవ్వగలడు. 'కష్టాలు వచ్చినప్పుడే దేవుడు గుర్తుకొస్తాడు' అని అంటాముకదా! మరి అలాంటప్పుడు, మన భాదలో, దుఃఖంలో, వ్యాధిలో కూడా మనం ప్రభువుతో ఉన్నప్పుడు సంతోషముగా ఉండగలం. ప్రతీ పునీతుని సంతోషరహస్యం అదే! భాదలు వారిసంతోషాన్ని అధికమేచేసాయి. ఎందుకన, వారు ఎల్లప్పుడూ ప్రభువుతో ఉన్నారు కనుక! ఇదీ మన సంతోషరహస్యముకూడా కావాలి!

ప్రభువునకు చేరువ కావాలంటే,

మనకి, మనప్రభువునకు మధ్యఉన్న ఆటంకాలను తొలగించాలి. ఇంకోమాటలో చెప్పాలంటే, మన జీవితమునుండి, మన పాపాలను తీసివేయాలి. మనపాపమే ప్రభువునుండి మనలను దూరంచేస్తుంది. దీనికి, మొట్టమొదటి మెట్టు 'పాప సంకీర్తనము'.

ప్రతీదినం, ప్రతీక్షణం, ప్రభువు మనలను ఎక్కడఉండమని నిర్దేశిస్తే అక్కడ ఉండాలి. మనభాద్యతలను సక్రమముగా నిర్వహించాలి.

ఆదివార దివ్యపూజలో విశ్వాసముగా పాల్గొనాలి. అప్పుడే, ప్రభువునకు విశ్వాసముగా ఉండగలం, ఆయనకీ దగ్గర కాగలం.

''సదా ప్రార్దింపుడు'' (1 తెస్స 5:17). ప్రార్దన అనగా ప్రభుతో సంభాషించడం. ఆయనతో ఒక స్నేహితునితో మాట్లాడినట్లుగా, మాట్లాడవచ్చు.

''పొరుగు వారిని ప్రేమింపుడు''. క్షమా, అర్థం చేసుకోవడం, అంగీకారం, ప్రోత్సాహం అను గుణాలను అలవార్చుకొందాం. ఈ విధముగా, ప్రభువునకు ఎల్లప్పుడూ కృతజ్ఞులమైఉండగలం. ''అన్ని వేలలయందును క్రుతజ్ఞులై ఉండుడు (1 తెస్స 5:18).

ఇలా ప్రభువునకు చేరువ అయినప్పుడే, పరిపూర్ణమైన ఆనందముతో, సంతోషముతో క్రిస్మస్ పండుగను కొనియాడగలము. ప్రభుహితమైన సంవత్సరమును కొనియాడుటకు క్రిస్మస్ రోజు మనదరికి చాల ప్రత్యేకమైనది. యెషయ ప్రవక్తద్వారా, పౌలుగారి లేఖద్వారా, మరియు బాప్తిస్మయోహానుగారిద్వారా, ప్రభుహితమైన సంవత్సరమును కొనియాడుటకు, సంతోషముతో, ఆనందముతో మనల్నిమనం సిద్ధపరచుకోవాలని ప్రభువు ఆదేశిస్తున్నారు.

No comments:

Post a Comment