ఆగమనకాల మొదటి ఆదివారము

ఒకసారి ఒక గురువు జ్ఞానస్థాన సాంగ్య సందర్భమున, జ్ఞానస్థానము పొందు బిడ్డ తండ్రిని ఇలా అడిగాడు: క్రైస్తవ జీవితములో జ్ఞానస్థానము ఒక ముఖ్యమైన ఘట్టము. దీనికి మీరు సంసిద్ధ పడియున్నారా? దానికి సమాధానముగా, ఆతండ్రి, సిద్ధపడ్డాము. చాలామంది ఆతిధులను ఆహ్వానించాము. రుచికరమైన భోజనాలను తయారు చేసియున్నాము. అప్పుడు ఆగురువు, నా ఉద్దేశము అది కాదు. మీరు ఆధ్యాత్మికముగా సిద్ధపడ్డి ఉన్నారా? అందులకు అతను, తప్పకుండా ఫాదర్... బీరు, విస్కీ అన్నియు సమకూర్చాము.
ఈ యువ తండ్రిని చూస్తే మన అందరికి నవ్వు రావచ్చు. కాని, ఈ రోజు మనలో చాల మందిమి క్రిస్మస్ పండుగకు ఈలాగే సిద్ధపడుతూ ఉన్నాము. ఆగమనము అనగా వచ్చుట. ప్రభువు వస్తాడు, ఆయన అగమనాన్ని మనం కొనియాడుతూ ఉంటాము.

ప్రభువు ఆగమనాన్ని మనం ఎలా నమ్మాలి? ఆగమన పటనాలు ప్రభువురాకకు సంభందించిన వాగ్దానాలను, భావనలను వ్యక్తపరుస్తూ ఉంటాయి. ప్రభువువచ్చి మనలను రక్షిస్తాడు అని గుర్తుకుచేస్తూ ఉంటాయి. ఈ పటనాలు మన అపోహలను పటాపంచలు చేస్తాయి. మన నిరాశాలకు ఆశలను కల్పిస్తాయి. ప్రభువు ప్రేమను పొందడానికి, మనలో ఒకనిగా రాబోవు ప్రభువును ఆలింగనము చేసికోవడానికి మనహృదయాలను తెరుస్తాయి. ప్రభువు, మన జీవితము, మన కష్టాలను ఎరిగియున్నాడు. మనకు ఆశను కల్పించి, ఆత్మ ద్వారా ప్రతీరోజు, ప్రతీక్షణం మనతో ఉంటాడు. ఆగమన కాల ముఖ్య అంశం: ప్రభువు రాకను కొనియాడటము. అలాగైతే, ఆయన ఆగమనాన్ని కొనియాడటకు ఏవిధముగా సంసిద్ధపడుదాం? మొట్ట మొదటిగా, ప్రశాంతతని వహిద్దాం. ప్రతీ పండుగలాగా, ఆర్భాటాలకుపోకుండా నిదానిద్దాం. గుండెలనిండా ఊపిరిపీల్చుకుందాం. ఆగమనకాలం ఒక పవిత్రమైన సమయమని విశ్వసిద్దాం. మనల్నిమనం ఎవరమని తెలుసుకొంటూ, దేవుని వాక్యాన్ని, ఆయన స్వరాన్ని ఆలకించుదాం. ప్రశాంతతతో ప్రార్ధన చేద్దాం: ''ప్రభువా! వేంచేయండి. నా జీవితములోనికి రండి, మా కుటుంబములోనికి రండి, మా సంఘములోనికి రండి. నీవు నన్ను ప్రేమిస్తున్నావని విశ్వసిస్తున్నాను. నీ ప్రేమతో, శాంతితో నన్ను నింపండి. నన్ను స్వస్థత పరచండి. సంతోషాన్ని ఇవ్వండి''. ఈ విధముగా, పండుగ, భాహ్యమైన ఆర్భాటాలకు ముందుగా ఆధ్యాత్మికముగా, మనల్ని మనం ఆయత్త పరచుకొందాం. మన హృదయాలను సిద్ధపరచుకొందాం. ఇలా సంపూర్ణముగా సిద్ధపడినపుడే, క్రిస్మస్ సందేశాన్ని స్వీకరించగలం.
మార్కు సువిషేశములో (13:33) ప్రభువు ఇలా అంటున్నాడు: ''ఆ సమయము ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. కావున జాగరూకులై ఉండుడు''. నిజమే, ఆ సమయం - ప్రభువు రాకడ, లోకాంత్యము, మరణం, తుది తీర్పు - ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు. ''ఒకవేళ అతడు అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రించుట చూడవచ్చును'' (13:36). అందుకే, ''జాగరూకులై ఉండుడు'' (13:37) అని ప్రభువు హెచ్చరిస్తున్నారు.

No comments:

Post a Comment