ఆగమనకాల రెండవ ఆదివారము, YEAR C, 9 డిశంబర్ 2012


ఆగమనకాల రెండవ ఆదివారము, YEAR C, 9 డిశంబర్ 2012
బారూకు గ్రంధము 5:1-9; ఫిలిప్పీ 1:4-6,8-11; లూకా 3:1-6

సియోను వాసులారా! వినుడు. ప్రజలను రక్షించు నిమిత్తము రక్షకుడు వచ్చును. ఆయన వచ్చి తన ఇంపైన స్వరమును మీ హృదయములకు ఆనందకరముగా వినిపింపజేయును.

ఈరోజు శ్రీసభ మనకు ఒక గొప్ప వ్యక్తిని ఆదర్శముగా చూపిస్తూ ఉంది. అతడే పునీత బాప్తిస్మ యోహాను. ప్రవక్తలందరిలోకెల్ల గొప్ప ప్రవక్త మరియు చివరి ప్రవక్త బాప్తిస్మ యోహాను. ప్రవక్తల మొదటి కర్తవ్యం, దేవుని వాక్యాన్ని ఆలకించి, దానిని మనసారా స్వీకరించి, దైవ ప్రజలకు అందించడం. కనుక ప్రవక్త దేవునికి ప్రజలకు మధ్యవర్తి.

అలాంటి ప్రవక్తలలో ఒకరైన యెషయా ప్రవక్త పలికిన మాటలు, బాప్తిస్మ యోహాను జీవితము ద్వారా నిజమవుతూ ఉన్నాయి. "ప్రభువు మార్గమును సిద్ధము చేయుడు" అని ప్రవక్త పలికిన ఈ మాటల ద్వారా బాప్తిస్మ యోహాను దైవ ప్రజలను ప్రభువు మార్గములోనికి ఆహ్వానించి యున్నాడు. ప్రభువు రాక కోసం మార్గమును సిద్ధము చేయాలని కోరుతున్నాడు. యోహాను ప్రభువు రాక కోసం ప్రజలను సిద్ధము చేసాడు. పశ్చాత్తాపము, జ్ఞానస్నానము అను మార్గముల ద్వారా ప్రజలను సిద్ధము చేసి ముందుకు నడిపించాడు. ప్రవక్తగా, ప్రభువు మార్గమును సిద్ధపరచడం, ప్రభువును అనుసరింపగోరువారికి పశ్చాతాపము గూర్చి ప్రకటించడం యోహానుగారి పాత్ర. మరియు ప్రభువు దరికి వచ్చు వారి జీవితాలను సక్రమం చేయడం ఆయన భాద్యత.

మొదటి పఠనములో బారూకు ప్రవక్త చెప్పిన విధముగా: "ప్రతీ లోయ పూడ్చబడును. పర్వతములు, కొండలు సమము చేయబడును. వక్రమార్గములు సక్రమము చేయబడును. కరకు మార్గము నునుపు చేయబడును." క్రీస్తు యేసు రాక కొరకు మనలను మనం తయారుచేసుకొనే ఈ పవిత్ర ఆగమన కాలములో, మనలో ఉన్న లోయలను, చెడును తీసివేయడానికి ప్రయత్నించాలి. గర్వాన్ని, అహంకారాన్ని విడచి పెట్టాలి. మనం తీసుకొనే చెడు నిర్ణయాలకు స్వస్తి చెప్పాలి. మనలో ఉన్న రాతి హృదయాన్ని కరిగించమని ప్రభువును వేడుకోవాలి.

అయితే, ఇక్కడ మనం ఒక ముఖ్య విషయాన్ని గ్రహించాలి. మనం ప్రభు చెంతకు వెళ్ళటం కంటే కూడా, ఆ ప్రభువే మన చెంతకు వస్తూ ఉన్నాడు. మనం ఆయన చెంతకు వెళ్లక ముందే ఆయన ఒక అడుగు ముందు కేసి మనకన్న ముందుగా మన దగ్గరకు వస్తున్నాడు. ఎందుకన, రక్షణ కార్యములో మొదటి అడుగు వేసింది ప్రభువే కదా! కనుక క్రిస్మస్ పండుగ రోజున దేవుడే మానవ రూపాన్ని ధరించి యేసు అను వ్యక్తిగా మన మధ్యకు వస్తూ ఉన్నాడు. ఆ గొప్ప ఘడియనే మనం క్రీస్తు జయంతిగా కొనియాడుతూ ఉన్నాము. ఒక విధముగా దేవుడే మనకు మార్గాన్ని తయారు చేస్తున్నాడు. ఆ మార్గములో మనలను నడచుకోమని, జీపించమని ఆహ్వానిస్తూ ఉన్నాడు. అందుకే ప్రభువు "నేనే మార్గమును, సత్యమును, జీవమును" (యోహా 14:6) అని చెప్పారు. కనుక ప్రభువు పిలుపును గుర్తించి, గ్రహించి, అది ఒక భాద్యతగా స్వీకరించి, ప్రభువుకు సమాధానం చెప్పాలి. ఆయన మార్గములో నడవడానికి ప్రయత్నం చేయాలి. అయితే ప్రభువు మార్గము మన మార్గాలకన్న భిన్నమైనది. ఆయన మార్గము రక్షణ మార్గము. "ప్రతీ ఒక్కరు దేవుని రక్షణమును కాంచును" అని సువార్తలో వినియున్నాము. కనుక ఎవరైతే ప్రాపంచిక మార్గాలను విడిచి, ప్రభువు చూపించే మార్గములో నడుచుకొంటారో, వారు తప్పక ఆయన రక్షణములో పాలు పంచుకొంటారు..

దేవుని వాక్యము ఎడారిలో జీవించే బాప్తిస్మ యోహానుగారికి వినిపించింది. మనుగడ లేని ఎడారిలో ఆయన దేవుని వాక్కును వినగలిగాడు. అదేవిధముగా, మన జీవితములో కూడా కొన్ని సందర్భాలు ఎడారిగా మారుతూ ఉంటాయి. జీవితములో కష్టం వచ్చినప్పుడు, నిరాశ కలిగినప్పుడు, జీవితం అంధకారముగా కనిపించినప్పుడు, ఎటు వెళ్ళాలో అని దారి తెలియనప్పుడు, మన జీవితం ఎడారిలా కనిపిస్తుంది. ఒంటరివారము అవుతాము. జీవం లేనివారముగా ఉంటాము. బ్రతకాలన్న ఆశ కూడా ఉండదు. ఈ సందర్భాలన్నీ మన జీవితములో ఒక ఎడారి అనుభవాన్ని తలపిస్తాయి. కాని, మన దేవుడు, ఆయన వాక్కు ద్వారా మనతో మాట్లాడతాడు. ఇలాంటి సందర్భాలలోనే అనేకమంది ప్రవక్తలు దైవ పిలుపును పొందియున్నారు. వారిలాగా మనము కూడా మన అంత:రంగమునుండి దేవుని వాక్యాన్ని విని, దానిపై ధ్యానించినట్లయితే, మనం కూడా తప్పక ఆయన ప్రేమ పిలుపును పొందగలుగుతాము. ఆయన ప్రేమ పలుకులు మనకు జీవాన్ని ఇస్తాయి.

కష్ట సమయములో ప్రవక్త ఒక నూతన సృష్టిగా మారతాడు. దేవుని వాక్కును విని, గ్రహించి తనలో ఉన్న దైవశక్తి చేత కొత్త వ్యక్తిగా తయారవుతాడు. అదేవిధముగా, ఈ పవిత్ర ఆగమన కాలములో దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రవక్తలవలె మనం కూడా దేవుని వాక్యాన్ని విని, గ్రహించినట్లయితే, మనం కూడా నూతన వ్యక్తులుగా తయారు కావడానికి ఆస్కారం ఉంటుంది. కనుక కష్ట సమయాలలో అధైర్యం చెందక ఉండాలి. దేవుని వాక్య సహాయముతో ఒక నూతన జీవితానికి నాంది పలుక గలుగుతాము. దేవుడు ప్రతీ రోజు నూతన జీవితానికి ఆహ్వానిస్తూ ఉన్నాడు.

ఆగమన కాలంలో, ప్రభువు వస్తున్నాడు అన్న సందేశం మన హృదయాలలో మ్రోగుతూ ఉంటుంది. ఆ సంతోష కర సందేశమే మనలను ముందుకు నడిపిస్తూ ఉంటుంది. ప్రభువు రాకతో, తన జీవితాన్ని, ప్రేమను మనతో పంచుకొంటున్నాడు. అదే సమయములో, మన జీవితాన్ని, ప్రేమను దేవునితోను, ఇతరులతోనూ పంచుకోవాలని  ఆహ్వానిస్తున్నాడు. యోహాను గారు ప్రకటించిన క్రీస్తు రాకడ కొరకు విశ్వాసముతో నిరీక్షించాలి. ప్రభువు రాకను స్వాగతించి, ఆయనకు మన హృదయాలలో స్థానం ఇవ్వాలి.

యోహాను వలే మనము కూడా ఈనాడు మన సంఘములో ప్రవక్తలుగా మారాలి. ఇతరులకు మార్గ చూపరులుగా ఉండాలి. ఇతరుల జీవితాలలో వెలుగు నింపాలి. ప్రభువు దరికి రావడానికి వారికి మార్గమును సిద్ధపరచాలి. దేవుని వాక్యమును బోధించాలి.

ఈ నిరీక్షణలో మరియమ్మను ఆదర్శముగా తీసుకొందాం. లోక రక్షణకోసం ఆమె ఎంతగానో నిరీక్షించారు. తనను తాను సిద్ధం చేసుకొన్నారు. ప్రార్ధనలు చేసారు. దేవుని వాక్యం విని ధ్యానం చేసారు.  మరియ తల్లి ప్రార్ధన సహాయం మనకు తోడ్పడునుగాక!

సర్వశక్తి వంతులును, కనికరపూరితులైన ఓ సర్వేశ్వరా! మీ కుమారునికై ఎదురేగ ఉత్సాహముతో వచ్చు మమ్ము లోక అవరోధములేవియు ఆటంకపరపకుండునుగాక. స్వర్గీయ జ్ఞాన సంపూర్ణమును, ఆయనతో నేకమగు భాగ్యమును మాకు ప్రసాదింపుడు.

Fr. Inna Reddy Allam
OFM Cap

No comments:

Post a Comment