Showing posts with label Pope's Message. Show all posts
Showing posts with label Pope's Message. Show all posts

యూత్ జూబ్లీ దివ్యబలిపూజ, పోప్ లియో XIV ప్రసంగం, టోర్ వెర్గాటా, 3 ఆగస్టు 2025

యూత్ జూబ్లీ
దివ్యబలిపూజ
పరిశుద్ధ పోప్ లియో XIV గారి ప్రసంగం
టోర్ వెర్గాటా
18వ సామాన్య ఆదివారం, 3 ఆగస్టు 2025

పవిత్ర దివ్యబలి పూజకు ముందు యువతకు పరిశుద్ధ పోప్ లియో XIV గారి శుభాకాంక్షలు:

శుభోదయం! ఆదివారం శుభాకాంక్షలు! మీరంతా కాస్త విశ్రాంతి తీసుకున్నారని ఆశిస్తున్నాను. మరికాసేపట్లో క్రీస్తు మనకు ప్రసాదించిన అతి గొప్ప కానుకయైన ఆయన సన్నిధిని దివ్యసత్ప్రసాద రూపంలో మనం అనుభవించబోతున్నాం. ఈ క్షణం మనందరి హృదయాల్లో చిరస్మరణీయంగా నిలిచిపోవాలి. క్రీస్తు సంఘంగా మనమంతా ఒక్కటై, ఆయనతో కలిసి నడుస్తూ, జీవిస్తూ ఈ వేడుకను ఘనంగా జరుపుకుందాం.

-------------------

గత రాత్రి జరుపుకున్న ప్రార్థనా జాగరణ తర్వాత, మరికాసేపట్లో, క్రీస్తు మనకు ప్రసాదించిన అతి గొప్ప కానుక, అయిన దివ్యసత్ప్రసాద విందును (యూకరిస్ట్) మనం ప్రారంభించబోతున్నాం. ఈ ప్రత్యేకమైన సమయాన్ని పురస్కరించుకుని, ఎమ్మావుస్ గ్రామానికి వెళ్లే శిష్యుల ప్రయాణాన్ని మన మనసుల్లోకి తెచ్చుకుందాం (లూకా 24:13-35). యేసు మరణంతో నిరాశ, భయంతో యెరూషలేము నుండి బయలుదేరిన ఆ శిష్యులు, ఇక ఏ ఆశా మిగలలేదని భావించారు. అయితే, ఆ మార్గంలో యేసు వారిని కలుసుకున్నారు. వారు ఆయన్ని తమ తోడుగా ఆహ్వానించి, ఆయన లేఖనములను వివరిస్తుంటే శ్రద్ధగా ఆలకించారు. చివరికి రొట్టెను విరిచే సమయంలో ఆయన్ని గుర్తించారు. ఆ క్షణంలో వారి కళ్ళు తెరుచుకున్నాయి. ఈస్టర్ శుభవార్త వారి హృదయాలను ఆనందంతో నింపింది. ఈ రోజు, మనం కూడా ఈ దివ్యబలి పూజలో, క్రీస్తు మనతో ఉన్నారని గ్రహించి ఆనందంతో నిండిపోదాం.

దివ్య గ్రంథ ఆరాధనలో ఈ సంఘటన గురించి నేరుగా ప్రస్తావించనప్పటికీ, ఇది మన జీవితాలను పూర్తిగా మార్చివేసే ఒక ప్రత్యేకమైన కలయిక గురించి ఆలోచించమని మనల్ని ప్రోత్సహిస్తుంది. పునరుత్థానం చెందిన క్రీస్తుతో మనకు కలిగే ఈ సమావేశం మన ప్రేమ, ఆశలు, ఆలోచనలను ప్రకాశవంతం చేస్తుంది, సరికొత్త దృక్పథాన్ని అందిస్తుంది.

ఉపదేశకుని గ్రంథంనుండి తీసుకున్న మొదటి పఠనంలో, ఎమ్మావుస్ గ్రామానికి వెళ్లే శిష్యుల వలె, మనలోని పరిమితులను, అలాగే ఏదీ శాశ్వతం కాదని, అన్నీ క్షణికమైనవేనని (1:2; 2:21-23) అంగీకరించమని కోరుతుంది. కీర్తన 90:5-6 లో కూడా “ఉదయమున మొలకెత్తు గడ్డి వంటివారము; సాయంకాలమున వాడి ఎండి పోవును” అని గడ్డితో పోల్చి మానవ జీవితం యొక్క అస్థిరతను వివరిస్తుంది. ఈ రెండు వాస్తవాలు మనల్ని కలవరపెట్టవచ్చు. అయితే, వీటిని మనం భయపడి పక్కన పెట్టాల్సిన అంశాలుగా చూడకూడదు. ఎందుకంటే, వాటి సున్నితత్వం సృష్టిలోని అద్భుతాలలో భాగం. గడ్డి పూల పొలం గురించి ఆలోచించండి: దాని అందం ఎంత అద్భుతమైనదో! ఆ గడ్డి సున్నితమైన కాండాలతో బలహీనంగా ఉన్నప్పటికీ, త్వరగా వాడిపోవచ్చు, విరిగిపోవచ్చు. అయినప్పటికీ, వాడిపోయిన ఆ పూల నుండి వచ్చే పోషకాలతో మళ్ళీ కొత్త పూలు మొలకెత్తుతాయి. ఈ నిరంతర పునరుత్పత్తి ప్రక్రియ ద్వారానే ఆ పొలం జీవిస్తుంది. చలికాలంలో అంతా నిశ్శబ్దంగా ఉన్నట్లు అనిపించినా, దాని శక్తి భూమిలో నిక్షిప్తమై ఉంటుంది. వసంతం వచ్చినప్పుడు వేల రంగులతో వికసించడానికి అది సిద్ధంగా ఉంటుంది.

ప్రియమైన మిత్రులారా, మనం కూడా అదే విధంగా సృష్టించబడ్డాం. కేవలం ఒకేలా ఉండే జీవితం కోసం కాదు, ప్రేమతో మనల్ని మనం ఇతరులకు అర్పించుకోవడం ద్వారా నిరంతరం నూతనమయ్యే ఉనికి కోసం మనం సృష్టించబడ్డాం. అందుకే, ఈ సృష్టిలో ఏదీ ఇవ్వలేని ఏదో 'గొప్ప' దాని కోసం మనం నిరంతరం తపిస్తూ ఉంటాం. ఈ లోకంలోని ఏ పానీయం తీర్చలేని లోతైన దాహాన్ని మనం అనుభవిస్తుంటాం. ఈ సత్యాన్ని గ్రహించి, మన హృదయాలను చవకబారు వాటితో నింపి మోసపోవద్దు. బదులుగా, మన అంతరాత్మ మాట విందాం! ఆ దాహాన్ని దేవునితో మనల్ని కలిపే ఒక మెట్టుగా మారుద్దాం. పిల్లలు ఎలాగైతే కాలి వేళ్లపై నిలబడి కిటికీలోంచి తొంగి చూస్తారో, అలాగే మనం కూడా ఆయన్ని చేరుకోవడానికి ప్రయత్నిద్దాం. అప్పుడు, మన ఆత్మ తలుపును సున్నితంగా తడుతున్న ఆయన (దర్శన 3:20) ఎదుట మనం నిలబడతాం. ముఖ్యంగా యుక్తవయసులో మన హృదయాలను పూర్తిగా తెరిచి, ఆయనను లోపలికి రానిచ్చి, ఆయనతో కలిసి నిత్యత్వం వైపు ఈ సాహసయాత్రను ప్రారంభించడం నిజంగా ఒక అద్భుతమైన అనుభవం.

పునీత అగుస్తీనుగారు తన లోతైన దైవాన్వేషణ గురించి ఆలోచిస్తూ తనను తాను ఇలా ప్రశ్నించుకున్నారు: “మరి, మన ఆశ దేనిపై ఉండాలి? ఈ భూమి పైనా? కాదు. భూమి నుండి వచ్చే బంగారం, వెండి, చెట్లు, పంటలు, లేదా నీరు వంటి వాటి పైనా? ఇవన్నీ మనసుకు ఆనందాన్ని, అందాన్ని, మంచిని ఇస్తాయి. కానీ వీటిపై కాదు.” ఆ తర్వాత అగుస్తీనుగారు ఈ నిర్ధారణకు వచ్చారు: “వాటిని సృష్టించిన ఆయన్నే వెదకండి, ఆయనే మీ నిజమైన నిరీక్షణ.” తన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని స్మరించుకొంటూ ఇలా ప్రార్థించారు: “ఓ ప్రభూ, నువ్వు నాలోనే ఉన్నావు, కానీ నేను వెలుపల ఉండి నిన్ను వెదికాను... నీవు పిలిచావు, బిగ్గరగా అరిచావు, నా చెవుడును పోగొట్టావు. నీవు మెరిసావు, ప్రకాశించావు, నా అంధత్వాన్ని తొలగించావు. నీ పరిమళాన్ని నాపై వెదజల్లావు; నేను శ్వాస తీసుకున్నాను, ఇప్పుడు నీ కోసం ఆరాటపడుతున్నాను. నిన్ను నేను రుచి చూశాను (కీర్తన 34:8; 1 పేతురు 2:3), ఇప్పుడు మరింత ఆకలి, దాహంతో ఉన్నాను (మత్త 5:6; 1 కొరి 4:11); నువ్వు నన్ను తాకావు, నీ శాంతి కోసం నేను తపించాను” (కన్ఫెషన్స్, 10, 27).

మన హృదయాలలో ఒక మండుతున్న ప్రశ్న, మనం విస్మరించలేని ఒక సత్యం కోసం ఒక అవసరం ఉంది. ఇది మనల్ని మనం ఇలా ప్రశ్నించుకునేలా చేస్తుంది: నిజమైన ఆనందం అంటే ఏమిటి? జీవితం యొక్క నిజమైన అర్థం ఏమిటి? అర్థం లేనితనం, విసుగు, మామూలుతనం నుండి మనల్ని ఏది విముక్తి చేస్తుంది?

ఇటీవలి రోజుల్లో మీరు ఎన్నో అద్భుతమైన అనుభవాలను సొంతం చేసుకున్నారు. ప్రపంచం నలుమూలల నుండి, విభిన్న సంస్కృతుల నుండి వచ్చిన యువతను కలుసుకున్నారు. కళలు, సంగీతం, సాంకేతికత, క్రీడల వంటి వాటి ద్వారా మీ అనుభవాలను, ఆశయాలను పరస్పరం పంచుకున్నారు. అలాగే, సర్కస్ మాక్సిమస్‌లో, మీరు పాప క్షమాపణ దివ్యసంస్కారాన్ని కూడా స్వీకరించి, మంచి జీవితాన్ని గడపడానికి దేవుని దయను కోరారు.

ఈ అనుభవాలన్నిటి ద్వారా మీరు ఒక ముఖ్యమైన విషయాన్ని అర్థం చేసుకోగలరు. మన జీవిత పరిపూర్ణత అనేది మనం కూడబెట్టుకునే వాటిపై, లేదా సువార్తలో చెప్పినట్లుగా, మనం కలిగి ఉండే వాటిపై ఆధారపడి ఉండదు (లూకా 12:13-21). బదులుగా, ఆ పరిపూర్ణత మనం సంతోషంగా స్వీకరించే, మరియు పంచుకునే వాటిపై ఆధారపడి ఉంటుంది (మత్తయి 10:8-10; యోహాను 6:1-13). కేవలం కొనడం, నిల్వ చేయడం, మరియు వినియోగించడం మాత్రమే సరిపోదు. మనం మన కళ్ళను పైకి ఎత్తి, “పైనున్న వాటి”వైపు చూడాలి (కొలొస్సీ 3:2). అప్పుడే ఈ ప్రపంచంలోని ప్రతిదీ మనల్ని దేవునితో, మన సహోదరీ, సహోదరులతో ప్రేమలో ఏకం చేయడానికి ఉపయోగపడుతుందని తెలుసుకుంటాం. ఆ తర్వాత మనం “కరుణ, దయ, వినయం, సాత్వికం, ఓర్పు’ (కొలొస్సీ 3:12), క్షమ (కొలొస్సీ 3:13), మరియు శాంతి (యోహాను 14:27)లలో ఎదగగలం. ఇదంతా క్రీస్తును అనుసరించడం ద్వారానే సాధ్యమవుతుంది (ఫిలిప్పీ 2:5). విధంగా, మనకు ఇవ్వబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయాలలో నింపబడింది కాబట్టి, మన నిరీక్షణ ఎప్పటికీ నిరాశపరచదు అనే లోతైన అవగాహనలోకి మనం ఎదుగుతాం (రోమీ 5:5).

ప్రియమైన యువ మిత్రులారా, యేసు మన నిరీక్షణ. రెండవ పోప్ జాన్ పాల్ గారు చెప్పినట్లు, “మన జీవితంలో గొప్ప కార్యాలు చేయాలనే కోరికను, సమాజాన్ని మరింత మానవీయంగా, సౌభ్రాతృత్వంగా మార్చడానికి మనల్ని ప్రేరేపించేది ఆయనే” (15వ ప్రపంచ యువజన దినోత్సవం, ప్రార్థనా జాగరణ, 19 ఆగస్టు 2000). మనం ఎల్లప్పుడూ ఆయనతో ఐక్యంగా, ఆయన స్నేహంలో నిలిచి ఉందాం. ప్రార్థన, ఆరాధన, దివ్యసత్ప్రసాద స్వీకరణ, తరచుగా పాపక్షమాపణ మరియు దానధర్మాల ద్వారా ఈ స్నేహాన్ని పెంచుకుందాం. త్వరలో పునీతులుగా ప్రకటించబడనున్న ధన్యులైన పియర్‌జార్జియో ఫ్రస్సాతి, ధన్యులైన కార్లో అకుటిస్ వంటివారిని స్ఫూర్తిగా తీసుకుందాం. మీరు ఎక్కడ ఉన్నా సరే, గొప్ప విషయాల కోసం, పరిశుద్ధత కోసం ఆరాటపడండి. తక్కువతో సంతృప్తిపడకండి. అప్పుడే సువార్త వెలుగు మీలో, మీ చుట్టూ ప్రతిరోజూ పెరుగుతూ ఉండటాన్ని మీరు చూస్తారు.

మీరు మీ దేశాలకు తిరిగి వెళ్తున్నప్పుడు, ప్రపంచంలోని ప్రతి ప్రాంతంలో, రక్షకుని అడుగుజాడల్లో ఆనందంగా నడవాలని, మీరు కలిసే ప్రతి ఒక్కరికీ మీ ఉత్సాహాన్ని, మీ విశ్వాసాన్ని చాటిచెప్పాలని నిరీక్షణ మాత అయిన కన్య మరియకు మిమ్మల్ని అప్పగిస్తున్నాను.

మూలము:
https://www.vatican.va/content/leo-xiv/en/homilies/2025/documents/20250803-omelia-giubileo-giovani.html

గురుశ్రీ ప్రవీణ్ గోపు OFM Cap.

త్రికాల ప్రార్ధన, లియో XIV, 3 ఆగష్టు 2025

 లియో XIV
త్రికాల ప్రార్ధన
పునీత పేతురు బసిలికా ప్రాంగణం
ఆదివారము, 3 ఆగష్టు 2025

 

ప్రియమైన మిత్రులారా,

మన ప్రభువైన యేసుక్రీస్తు మన మధ్య, మనలోని ప్రతి ఒక్కరిలో ఉన్నారు. ఆయనతో కలిసి, ఈ ప్రత్యేకమైన రోజులనుబట్టి, ఈ సువర్ణోత్సవానికి మన తండ్రి అయిన దేవుడికి కృతజ్ఞతలు తెలియజేయాలని నేను కోరుకుంటున్నాను. ఇది మన సంఘానికి, యావత్ ప్రపంచానికి ఒక గొప్ప వరంగా నిలిచిపోయింది. మీలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం వల్లే ఇది సాధ్యమైంది. అందుకే, నా హృదయం నిండా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ మధ్యకాలంలో మరణించిన ఇద్దరు యువ యాత్రికులను నేను ప్రత్యేకంగా గుర్తు చేసుకుంటున్నాను. ఒకరు స్పెయిన్‌కు చెందిన మరియ, మరొకరు ఈజిప్ట్‌కు చెందిన పాస్కల్. వారి ఆత్మలను నేను ప్రభువుకు అప్పగిస్తున్నాను. ఈ కార్యక్రమానికి సహాయం చేసిన బిషప్‌లు, గురువులు, మఠవాసులు, మఠకన్యలు, విద్యావేత్తలు, మరియు ఈ కార్యక్రమం కోసం ప్రార్థించి, ఆత్మీయంగా భాగం పంచుకున్న ప్రతి ఒక్కరికీ నా ధన్యవాదాలు.

క్రీస్తుతో మన ఐక్యత, సహవాసము ద్వారా, ఈ ప్రపంచానికి శాంతి, ఆశలను అందిస్తూ, ఇతరుల వల్ల కలిగే తీవ్రమైన కష్టాలను అనుభవిస్తున్న యువతకు మనం గతంలో కంటే ఇప్పుడు మరింత దగ్గరగా ఉన్నాము. గాజా, ఉక్రెయిన్, మరియు యుద్ధాలతో రక్తసిక్తమైన ప్రతి దేశంలోని యువతకు మేము అండగా ఉన్నాము. నా ప్రియ యువతీయువకులారా, వేరే ప్రపంచం సాధ్యమని నిరూపించేది మీరే. ఆ ప్రపంచంలో సోదరభావం, స్నేహం ఉంటాయి. అక్కడ సమస్యలు ఆయుధాలతో కాకుండా, చర్చల ద్వారా పరిష్కరించబడతాయి.

అవును, క్రీస్తుతో ఇది సాధ్యమే! ఆయన ప్రేమ, ఆయన క్షమాపణ, ఆయన ఆత్మ శక్తితో ఇది తప్పక సాధ్యమవుతుంది. నా ప్రియ స్నేహితులారా, మీరు ద్రాక్షతీగకు అంటుకట్టబడిన కొమ్మలవలే యేసుతో ఐక్యంగా ఉంటే, మీరు గొప్ప ఫలాలను ఫలిస్తారు. మీరు ఈ భూమికి ఉప్పులా, లోకానికి వెలుగులా మారతారు. మీరు మీ కుటుంబాలలో, స్నేహితులలో, పాఠశాలలో, కార్యాలయాలలో, క్రీడలలో, మీరు నివసించే ప్రతి చోటా ఆశకు విత్తనాలుగా ఉంటారు. మన ఆశయానికి మూలమైన క్రీస్తుతో కలిసి మీరు ఆశాజ్యోతులుగా నిలబడతారు.

ఈ జూబిలీ తరువాత, యువత యొక్క ఆశతో కూడిన యాత్ర కొనసాగుతుంది, అది మనల్ని ఆసియాకు తీసుకువెళ్తుంది! రెండు సంవత్సరాల క్రితం లిస్బన్‌లో పోప్ ఫ్రాన్సిస్ ఇచ్చిన ఆహ్వానాన్ని నేను మరోసారి గుర్తుచేస్తున్నాను. ప్రపంచం నలుమూలల నుండి యువతీ యువకులు 2027 ఆగస్టు 3 నుండి 8 వరకు దక్షిణ కొరియాలోని సియోల్‌లో జరిగే ప్రపంచ యువజన దినోత్సవంలో పునీత పేతురు వారసుడితో కలిసి పాల్గొంటారు. ఆ వేడుకల అంశం ధైర్యంగా ఉండండి! నేను ఈ లోకాన్ని జయించాను!(యోహాను 16:33). మన హృదయాలలో నిండిన ఆశే, చెడు మరియు మరణంపై క్రీస్తు సాధించిన విజయాన్ని ప్రకటించడానికి మనకు శక్తిని ఇస్తుంది. ఆశతో కూడిన యువ యాత్రికులైన మీరు, ఈ సత్యానికి భూమి నలుమూలలా సాక్షులుగా నిలుస్తారు. మిమ్మల్ని సియోల్‌లో కలవడానికి నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. మనం కలిసి కలలు కనడం, కలిసి ఆశించడం కొనసాగిద్దాం.

పవిత్ర కన్య మరియ మాతృత్వ రక్షణలో మనల్ని మనం అప్పగించుకుందాం.

మూలము:
https://www.vatican.va/content/leo-xiv/en/angelus/2025/documents/20250803-angelus.html

గురుశ్రీ ప్రవీణ్ గోపు OFM Cap.

త్రికాల ప్రార్ధన, లియో XIV, 27 జూలై 2025

త్రికాల ప్రార్ధన
లియో XIV
పునీత పేతురు బసిలికా ప్రాంగణం
ఆదివారము, 27 జూలై 2025 


ప్రియ సహోదరీ సహోదరులారా! శుభ ఆదివారం!

ఈ రోజు సువార్తలో, యేసు తన శిష్యులకు ప్రార్థన గురించి బోధిస్తూ ‘పరలోక తండ్రి’ ప్రార్థనను నేర్పించారు (లూకా 11:1-13). ఈ ప్రార్థన క్రైస్తవులందరినీ ఏకం చేస్తుంది. ప్రభువు మనలను దేవున్ని “అబ్బా, తండ్రి” అని పిలవమని ఆహ్వానిస్తున్నారు. ఈ పిలుపులో ఒక బిడ్డకు ఉండే సహజమైన సరళత, నమ్మకం, ధైర్యం మరియు తాను ప్రేమించబడుతున్నాననే నిశ్చయత కనిపిస్తుంది (కతోలిక శ్రీసభసత్యోపదేశం 2778).

ఈ విషయాన్ని సత్యోపదేశం చాలా చక్కగా వివరిస్తుంది: “ప్రభువు ప్రార్థన మనల్ని మనకే బయలుపరుస్తుంది, అలాగే తండ్రిని మనకు బయలుపరుస్తుంది” (నం. 2783). ఇది నిజంగా ఎంతో సత్యం! మనం పరలోక తండ్రిని ఎంత నమ్మకంతో ప్రార్థిస్తే, మనం ఆయనకు అత్యంత ప్రీతిపాత్రమైన బిడ్డలమని అంత ఎక్కువగా గ్రహిస్తాము. అలాగే, ఆయన లోతైనప్రేమ కూడా మరింతగా అనుభవించగలుగుతాము (రోమా 8:14-17 చూడండి).

నేటి సువార్తలో, యేసు తండ్రి దేవుని స్వభావాన్ని కొన్ని ఉదాహరణలతో మనకు వివరిస్తున్నారు: ఒకటి, అర్ధరాత్రి తన ఇంటికి అకస్మాత్తుగా వచ్చిన అతిథికి సహాయం చేసిన తండ్రి; మరియు, తమ పిల్లలకు మంచి వరాలు ఇవ్వడానికి శ్రద్ధ చూపే తండ్రి.

ఈ ఉపమానాలు మనకు ఒక ముఖ్యమైన సత్యాన్ని గుర్తుచేస్తున్నాయి. మనం తలుపు తట్టినప్పుడు దేవుడు ఎప్పుడూ మనలను తిరస్కరించరు. మనం చేసిన తప్పులు, కోల్పోయిన అవకాశాలు, వైఫల్యాల తర్వాత ఆలస్యంగా వచ్చినా ఆయన మనల్ని స్వాగతిస్తారు. కొన్నిసార్లు మనల్ని ఆహ్వానించడం కోసం, ఇంట్లో నిద్రపోతున్న తన పిల్లలను కూడా “లేపాల్సి” వచ్చినా ఆయన వెనుకాడరు (లూకా 11:7 చూడండి). నిజానికి, శ్రీసభ అనే మహా కుటుంబంలో, తండ్రి తన ప్రేమయుక్తమైన ప్రతి చర్యలో మనమందరినీ భాగస్వాములను చేయడానికి వెనుకాడరు. మనం ప్రార్థించినప్పుడు ప్రభువు మనలను ఎల్లప్పుడూ ఆలకిస్తారు. ఆయన సమాధానం కొన్నిసార్లు మనకు అర్థంకాని రీతిలో లేదా మనం ఊహించని సమయాలలో రావచ్చు. ఎందుకంటే ఆయన జ్ఞానం, దూరదృష్టి మన అవగాహనకు అతీతమైనవి. అలాంటి సందర్భాలలో కూడా మనం విశ్వాసంతో ప్రార్థించడం ఆపకూడదు, ఎందుకంటే ఆయనలో మనం ఎల్లప్పుడూ వెలుగును, బలాన్ని పొందుకుంటాము.

‘పరలోక తండ్రి’ ప్రార్థనను జపించేప్పుడు, మనం దేవుని బిడ్డలమనే గొప్ప అనుగ్రహాన్ని గుర్తు చేసుకోవడమే కాకుండా, ఈ వరానికి ప్రతిస్పందనగా క్రీస్తులో సోదరీ సోదరులుగా ఒకరినొకరు ప్రేమించుకోవడానికి మనకున్న అంకితభావాన్ని కూడా వ్యక్తపరుస్తాము. దీనిపై శ్రీసభ పితరులు ఇలా అన్నారు: పునీత సిప్రియన్: “మనం దేవుడిని ‘మన తండ్రి’ అని పిలిచినప్పుడు, మనం నిజమైన దేవుని బిడ్డలముగా ప్రవర్తించాలి.” పునీత జాన్ క్రిసోస్టమ్: “నీవు క్రూరమైన, దయలేని హృదయాన్ని కలిగి ఉంటే, సర్వ దయామయుడైన దేవుడిని నీ తండ్రి అని పిలవలేవు. ఎందుకంటే అలాంటి హృదయంలో పరలోకపు తండ్రి దయ యొక్క ముద్ర ఉండదు”. కాబట్టి, మనం దేవుడిని “తండ్రి” అని పిలిచి, మన తోటివారి పట్ల కఠినంగా, సున్నితత్వం లేకుండా ఉండలేము. అందుకు బదులుగా, ఆయన దయ, సహనం మరియు కరుణల ద్వారా మనం మార్చబడాలి, తద్వారా ఆయన స్వరూపం అద్దంలో లాగా మన జీవితాల్లో ప్రతిబింబిస్తుంది.

ప్రియ సహోదరీ సహోదరులారా, నేటి దైవార్చన మనలను ప్రార్థన, ప్రేమ అనే మార్గాల ద్వారా దేవుని ప్రేమను అనుభవించమని ఆహ్వానిస్తోంది. ఆ ప్రేమను పొందుకొని, ఆయనలాగే ఇతరులను ప్రేమించమని కూడా పిలుస్తోంది. ఆ ప్రేమ నిష్కపటమైనది, వినయంతో కూడినది, పరస్పర శ్రద్ధను చూపించేది, మరియు నిజాయితీతో నిండినది. ఈ గొప్ప పిలుపుకు మనం ప్రతిస్పందించేందుకు, మరియు తండ్రి యొక్క దయగల ముఖాన్ని ఇతరులకు ప్రతిబింబించేందుకు, కన్య మరియమ్మ మనకు సహాయం చేయాలని ప్రార్థిద్దాం.

మూలము:
https://www.vatican.va/content/leo-xiv/en/angelus/2025/documents/20250727-angelus.html

గురుశ్రీ ప్రవీణ్ గోపు OFM Cap.


లియో XIV ప్రసంగము, ఆల్బానో కేథడ్రల్, 20 జూలై 2025 (16 C)

 పవిత్ర దివ్య పూజాబలి
పరిశుద్ధ పోప్ లియో XIV ప్రసంగము
ఆల్బానో కేథడ్రల్
16వ సామాన్య ఆదివారం, 20 జూలై 2025

 


ప్రియ సహోదరీ సహోదరులారా,

ఈ అందమైన ఆల్బానో కథడ్రల్‌లో నేటి దివ్యపూజాబలిని కొనియాడుట చాలా సంతోషంగా ఉంది. మీకు తెలిసిన విధంగా, నేను మే 12 ఇక్కడకు రావలసి ఉంది, కానీ పరిశుద్ధాత్మ వేరే విధంగా నన్ను నడిపించారు. నేడు, సహోదరభావంతో, క్రైస్తవ ఆనందంతో మీతో కలిసి ఉండటం నాకు నిజంగా సంతోషంగా ఉంది. ఇక్కడ ఉన్న మీ అందరికీ, మేత్రానులకు, అధికారులకు నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

దివ్యపూజాబలిలో, మొదటి పఠనం మరియు సువార్త పఠనం రెండూ కూడా ఆతిథ్యం, సేవ మరియు దేవుని వాక్యాన్ని వినడం (ఆది 18:1-10; లూకా 10:38-42) గురించి ధ్యానించమని మనలను ఆహ్వానిస్తున్నాయి.

ఆదికాండము 18:1-2లో చెప్పబడినట్లుగా, ముందుగా దేవుడు “మధ్యాహ్నపు ఎండలో” అబ్రాహాము గుడారము దగ్గరికి వచ్చి సందర్శించారు. ఈ సన్నివేశాన్ని ఊహించడం చాలా సులభం: మండుతున్న సూర్యుడు, ఎడారి నిశ్శబ్దం, భరించలేని వేడి, మరియు ఆశ్రయం కోసం చూస్తున్న ముగ్గురు అపరిచితులు. అబ్రాహాము “తన గుడారము వాకిట” కూర్చుని ఉన్నాడు. ఆ సందర్శకులలో అబ్రాహాము దేవుని ఉనికిని గుర్తించి, లేచి, వారిని పలకరించడానికి పరిగెత్తిపోయి వారి యెదుట సాగిలపడి వేడుకున్నాడు. మధ్యాహ్నపు నిశ్శబ్దం ప్రేమపూర్వకమైన పనులతో సాగిపోయింది. అబ్రాహాముతో పాటు, అతని భార్య సారా మరియు సేవకులు అందరు కలిసి భోజనాన్ని సిద్ధం చేసారు. అతిధులు భుజించుచుండగా అబ్రాహాము వారికి సేవలు చేయుటకు తాను అక్కడే చెట్టు క్రింద నిలుచున్నాడు (ఆది 18:8). దేవుడు అబ్రాహామునకు అత్యుత్తమ వార్తను అందించాడు: “నీ భార్య సారాకు ఒక కుమారుడు కలుగును” (ఆది 18:10).

ఈ సంఘటనను బట్టి, దేవుడు సారా, అబ్రాహాముల జీవితాల్లోకి ప్రవేశించడానికి, వారు ఎప్పటినుంచో ఆశించి, చివరికి ఆశ వదులుకున్న సమయములో బిడ్డను ప్రసాదిస్తానని ప్రకటించడానికి, దేవుడు ఆతిథ్య మార్గాన్ని ఎలా ఎంచుకున్నాడో మనం ధ్యానించవచ్చు. అనేక కృపా సమయాల్లో వారిని ఇంతకుముందు సందర్శించిన దేవుడు, ఇప్పుడు ఆతిథ్యాన్ని, నమ్మకాన్ని కోరుతూ వారి తలుపు తట్టడానికి తిరిగి వచ్చారు. వృద్ధ దంపతులు ఏమి జరగబోతుందో పూర్తిగా అర్థం చేసుకోకపోయినా, సానుకూలంగా స్పందిస్తారు. వారు ఆ అజ్ఞాత సందర్శకులలో దేవుని ఆశీర్వాదాన్ని మరియు సాన్నిధ్యాన్ని గుర్తించి, తమ వద్ద ఉన్నదంతా వారికి సమర్పించారు: భోజనం, సాంగత్యం, సేవ మరియు చెట్టు నీడ. దీనికి ప్రతిఫలంగా, వారికి కొత్త జీవితం మరియు సంతానం యొక్క వాగ్దానం లభించింది.

పరిస్థితులు భిన్నంగా ఉన్నప్పటికీ, నేటి సువార్త, దేవుని కార్యాచరణ విధానాన్ని మనకు బోధిస్తుంది. యేసును మార్త, మరియమ్మల ఇంటిలో అతిథిగా చూస్తున్నాము. అయితే ఈసారి, ఆయన మొదటి పఠనంలోవలె అపరిచితుడు కాదు: ఆయన తన స్నేహితుల ఇంటికి పండుగ వాతావరణంలో వచ్చారు. అక్కచెల్లెళ్లలో ఒకరు ఆయనకు సేవ చేస్తూ స్వాగతం పలుకగా, మరొకరు శిష్యురాలు గురువును వింటున్నట్లుగా ఆయన పాదాల వద్ద కూర్చుని ఉన్నారు. మార్తమ్మ తన పనులలో సహాయం కావాలని చేసిన ఫిర్యాదు సందర్భమున, యేసు, దేవుని వాక్యాన్ని వినడం యొక్క విలువను గుర్తించమని తెలియ జేశారు (లూకా 10:41-42 చూడండి).

అయితే, ఈ రెండు వైఖరులను పరస్పరం విరుద్ధమైనవిగా చూడటం లేదా ఈ ఇద్దరు స్త్రీల యోగ్యతలను పోల్చడం సరికాదు. సేవ చేయడం మరియు వాక్యాన్ని వినడం, రెండూ కూడా ఆతిథ్యం యొక్క ప్రధాన అంశాలు.

దేవునితో మన సంబంధానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. మనం మన విశ్వాసాన్ని ఆచరణాత్మక పనుల ద్వారా, మన జీవన స్థితికి, పిలుపుకు అనుగుణంగా మన విధులను నమ్మకంగా నిర్వర్తించాలి. అయితే, దేవుని వాక్యాన్ని ధ్యానించిన తర్వాత, పరిశుద్ధాత్మ మన హృదయాలకు ఏమి చెబుతుందో విన్న తర్వాత మాత్రమే అలా చేయడం అత్యవసరం. దీని కొరకు, నిశ్శబ్దానికి, ప్రార్థనకు మనం సమయాన్ని కేటాయించాలి. శబ్దాలు, ఇతర పరధ్యానాలను తగ్గించి, హృదయపూర్వక సరళతతో దేవుని సన్నిధిలో మనం ఏకాగ్రత వహించాలి. క్రైస్తవ జీవితంలో ఈ కోణం వ్యక్తిగతంగా, సామాజికంగా ఒక విలువగా మారాలి, అలాగే మన కాలానికి ఒక ప్రవచనాత్మక సూచనగా నిలవాలి. దీన్ని మనం ఈ రోజు తిరిగి పొందడం చాలా ముఖ్యం. మాట్లాడే తండ్రిని వినడానికి, “రహస్యంగా చూసే” (మత్త 6:6) దేవునకు మనం స్థానం కల్పించాలి. ఈ వేసవి కాలంలో, దేవునితో మన సంబంధం యొక్క అందాన్ని, ప్రాముఖ్యతను అనుభవించడానికి, అది ఇతరుల పట్ల మనం ఎంతగా బహిరంగంగా, స్వాగతించేలా ఉండటానికి సహాయపడుతుందో తెలుసుకోవాలి.

వేసవి కాలంలో మనకు ఎక్కువ విశ్రాంతి సమయం ఉంటుంది. ఈ సమయంలో మనం ఆలోచించుకోవచ్చు, ధ్యానం చేయవచ్చు, ప్రయాణించవచ్చు, ఒకరితో ఒకరు గడపవచ్చు. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. పనుల ఒత్తిడిని, చింతలను పక్కన పెట్టి, కొన్ని ప్రశాంతమైన క్షణాలను, ధ్యానాన్ని ఆస్వాదిద్దాం. అలాగే, ఇతర ప్రదేశాలను సందర్శించడానికి, ఇతరులను చూసి ఆనందాన్ని పంచుకోవడానికి సమయం కేటాయిద్దాంనేను ఈ రోజు ఇక్కడ చేస్తున్నట్లుగా. వేసవి కాలాన్ని ఇతరుల పట్ల శ్రద్ధ వహించడానికి, ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి, సలహాలు ఇవ్వడానికి, ఓపికగా వినడానికి ఒక అవకాశంగా మలుచుకుందాం. ఎందుకంటే ఇవి ప్రేమకు వ్యక్తీకరణలు, మనందరికీ అవసరమైనవి. ధైర్యంగా ఇలా చేద్దాం. ఈ విధంగా, సంఘీభావం ద్వారా, విశ్వాసాన్ని, జీవితాన్ని పంచుకోవడం ద్వారా, మనం శాంతి సంస్కృతిని ప్రోత్సహించడానికి సహాయపడతాము. మన చుట్టూ ఉన్నవారు విభేదాలను, శత్రుత్వాన్ని అధిగమించి, వ్యక్తులు, ప్రజలు మరియు మతాల మధ్య సత్సంబంధాలను పెంపొందించుకోవడానికి మనం సహాయపడతాము.

పోప్ ఫ్రాన్సిస్ ఇలా అన్నారు: “మనం జీవితాన్ని ఆనందంగా ఆస్వాదించాలంటే, ఈ రెండు మార్గాలను అనుసరించాలి. ఒకవైపు, యేసు పాదాల వద్ద ఉండి, ఆయన మనకు ప్రతిదాని రహస్యాన్ని వెల్లడించినప్పుడు వినాలి; మరోవైపు, ఆయన విశ్రాంతి, స్నేహపూర్వక సహవాసం అవసరమైన స్నేహితుని రూపంలో మన తలుపు తట్టినప్పుడు, ఆతిథ్యం అందించడంలో శ్రద్ధగా, సిద్ధంగా ఉండాలి” (ఏంజెలుస్, జూలై 21, 2019). ఈ మాటలను కరోన మహమ్మారి వ్యాప్తి చెందడానికి కొన్ని నెలల ముందు చెప్పారు. మనం ఇంకా గుర్తుంచుకుంటున్న ఆ సుదీర్ఘమైన, కష్టతరమైన అనుభవం, ఈ మాటలలోని సత్యాన్ని మనకు ఎంతో స్పష్టంగా చూపింది.

ఖచ్చితంగా, ఇదంతా ప్రయత్నంతోనే సాధ్యమవుతుంది. సేవ చేయడం, వినడం ఎప్పుడూ సులభం కాదు; వాటికి కఠోర శ్రమ, త్యాగ నిరతి అవసరం. ఉదాహరణకు, కుటుంబాన్ని పెంచే క్రమంలో నమ్మకమైన, ప్రేమగల తల్లిదండ్రులుగా ఉండటానికి, వినడానికి, సేవ చేయడానికి కృషి అవసరం. అలాగే, పిల్లలు ఇంట్లో, పాఠశాలలో తల్లిదండ్రుల శ్రమకు ప్రతిస్పందించడానికి కూడా కృషి కావాలి. అంతేకాదు, అభిప్రాయభేదాలు వచ్చినప్పుడు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి, తప్పులు జరిగినప్పుడు క్షమించడానికి, ఎవరైనా అనారోగ్యంతో ఉన్నప్పుడు సహాయం చేయడానికి, దుఃఖ సమయాల్లో ఒకరికొకరు ఓదార్పునివ్వడానికి కూడా ప్రయత్నం అవసరం. అయితే, సరిగ్గా ఈ ప్రయత్నం ద్వారానే జీవితంలో విలువైన వాటిని నిర్మించగలం. ప్రజల మధ్య బలమైన, నిజమైన సంబంధాలను ఏర్పరచడానికి, వాటిని పెంపొందించడానికి ఇదే ఏకైక మార్గం. ఈ విధంగా, దైనందిన జీవితపు పునాదులతో, దేవుని రాజ్యం వృద్ధి చెందుతుంది మరియు దాని ఉనికిని వ్యక్తపరుస్తుంది (లూకా 7:18-22).

పునీత అగుస్తీను, మార్తమ్మ మరియు మరియమ్మల కథను తన ఉపన్యాసాలలో ఒకదానిలో వివరిస్తూ ఇలా అన్నారు: “ఈ ఇద్దరు స్త్రీలు రెండు రకాల జీవితాలకు ప్రతీకలు: వర్తమాన జీవితం, భవిష్యత్ జీవితం; కష్టాలతో కూడిన జీవితం, విశ్రాంతి మయమైన జీవితం; ఒకటి బాధలతో నిండినది, మరొకటి దీవించబడినది; ఒకటి తాత్కాలికమైనది, మరొకటి శాశ్వతమైనది" (ప్రసంగం 104, 4). మార్తమ్మ పనిని గురించి ఆలోచిస్తూ అగుస్తీనుగారు ఇలా అన్నారు: “ఇతరులను చూసుకోవాల్సిన బాధ్యత నుండి ఎవరు తప్పించుకోగలరు? ఈ పనుల నుండి ఎవరు విశ్రాంతి తీసుకోగలరు? మనం వాటిని ప్రేమతో, ఎవరూ తప్పుపట్టని విధంగా చేయడానికి ప్రయత్నిద్దాం... అలసట తీరిపోతుంది, విశ్రాంతి వస్తుంది, కానీ మనం చేసిన ప్రయత్నం ద్వారా మాత్రమే అది లభిస్తుంది. ఓడ ప్రయాణించి తన గమ్యస్థానానికి చేరుకుంటుంది; కానీ ఓడ ప్రయాణం ద్వారా తప్ప గమ్యస్థానాన్ని చేరుకోలేము” (ప్రసంగం 104, 6-7).

నేడు, అబ్రాహాము, మార్తమ్మ, మరియమ్మలు మనకు ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నారు: వినడం మరియు సేవించడం అనేవి రెండు పరస్పరం సహకరించే వైఖరులు. ఇవి మనల్ని, మన జీవితాలను ప్రభువు ఆశీర్వాదాలకు తెరవడానికి సహాయపడతాయి. వారి ఉదాహరణను బట్టి, మనం ధ్యానాన్ని మరియు కార్యాన్ని, విశ్రాంతిని మరియు కష్టాన్ని, నిశ్శబ్దాన్ని మరియు మన దైనందిన జీవితంలోని హడావిడిని, జ్ఞానం, సమతుల్యతతో సమన్వయం చేసుకోవాలి. ఎల్లప్పుడూ యేసు ప్రేమను మన కొలమానంగా, ఆయన వాక్యాన్ని మన వెలుగుగా, మరియు మన సొంత శక్తికి మించి మనల్ని నిలబెట్టే ఆయన కృపను మన బలంగా తీసుకుందాం (ఫిలిప్పీ 4:13).

త్రికాల ప్రార్ధన, లియో XIV, 20 జూలై 2025

 లియో XIV
త్రికాల ప్రార్ధన
లిబర్టీ స్క్వేర్ - పియాజ్జా దెల్ల లిబర్తా (కాస్టెల్ గండోల్ఫో)
ఆదివారము, 20 జూలై 2025


ప్రియ సహోదరీ సహోదరులారా! శుభ ఆదివారం!

నేటి దైవార్చన అబ్రహాము మరియు ఆయన భార్య సారాలు చూపిన ఆతిథ్యాన్ని, ఆ తర్వాత యేసు స్నేహితులైన మార్తమ్మ, మరియమ్మ చూపిన ఆతిథ్యాన్ని ధ్యానించమని మనల్ని ఆహ్వానిస్తుంది (ఆది 18:1-10; లూకా 10:38-42 చూడండి). మనం ప్రభువు విందుకు ఆహ్వానించబడి, దివ్యసత్ప్రసాద విందును స్వీకరించిన ప్రతిసారీ, స్వయంగా దేవుడే “మనకు సేవ చేయడానికి వస్తారు” (లూకా 12:37). అయితే, దేవుడు మొదట అతిథిగా ఉండటం అంటే ఏమిటో తెలుసుకున్నారు. నేటికీ, ఆయన మన ద్వారం వద్ద నిలిచి తలుపు తట్టుచున్నాడు (దర్శన 3:20). ఇటాలియన్ భాషలో, “అతిథి” మరియు “ఆతిథ్యమిచ్చే వ్యక్తి” అనే రెండింటికీ ఒకే పదం ఉపయోగించబడుతుంది. ఈ ఆదివారం, ఆతిథ్యం ఇవ్వడం మరియు స్వీకరించడం అనే ఈ పరస్పర సంబంధం గురించి మనం ధ్యానిద్దాం.

ఆతిథ్యం ఇవ్వడానికే కాదు, దాన్ని స్వీకరించడానికి కూడా వినయం అవసరం. ఆతిథ్యానికి మర్యాద, శ్రద్ధ, మరియు నిస్వార్థ గుణం కూడా అవసరం. ఈ క్రమంలో సువార్తలో, మార్తమ్మ కొంత సంతోషాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. యేసును ఆహ్వానించడానికి ఆమె ఎంతగా మునిగిపోయింది అంటే, ఒక ప్రత్యేకమైన కలయిక క్షణాన్ని దాదాపుగా పాడుచేసుకుంది. మార్తమ్మ ఉదార స్వభావం కలది, కానీ ప్రభువు ఆమెను ఉదారత కంటే ఎక్కువగా ఉండాలని కోరుతున్నాడు. మార్తమ్మ తన సన్నాహాలను వదిలిపెట్టి, వచ్చి తనతో సమయం గడపమని యేసు ఆమెను ఆహ్వానిస్తున్నాడు.

ప్రియ సహోదరీ సహోదరులారా, మన జీవితాలు వర్ధిల్లాలంటే, మనకంటే గొప్పదైన దానికి, మనకు ఆనందాన్ని మరియు సంతృప్తిని కలిగించే దానికి మనం మనల్ని మనం తెరిచి ఉంచడం నేర్చుకోవాలి. మార్తమ్మ, తన సోదరి మరియమ్మ పనులన్నీ తనపై వదిలి, తనను వంటరిగా వదిలి వేసిందని ఫిర్యాదు చేసింది (లూకా 10:40). కాని మరియమ్మ మాత్రం యేసు బోధలు వినడంలో లీనమై పోయింది. మరియమ్మ తన సోదరి కంటే తక్కువ ఆచరణాత్మకమైనదీ కాదు, తక్కువ ఉదారమైనదీ కాదు, కానీ ఆమె అత్యంత ముఖ్యమైనది ఏమిటో గుర్తించింది. అందుకే యేసు మార్తమ్మను మందలించారు. ఆమెకు ఎంతో ఆనందాన్ని కలిగించే ఒక అద్భుతమైన క్షణాన్ని పంచుకునే అవకాశాన్ని ఆమె కోల్పోతోంది (10:41-42).

మనం ఎలా నెమ్మదించాలో, మార్తమ్మ కంటే మరియమ్మ వలె మారడం ఎలాగో నేర్చుకోవాలి. కొన్నిసార్లు మనం కూడా అవసరమైన, ఉత్తమమైన వాటిని ఎంచుకోవడంలో విఫలమవుతాము. మనం విశ్రాంతి తీసుకోవడానికి సమయం కేటాయించాలి మరియు ఆతిథ్యం మెరుగ్గా ఇవ్వటాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నించాలి. ‘హాలిడే పరిశ్రమ’ మనకు రకరకాల “అనుభవాలను” విక్రయించాలని చూస్తూ ఉంటుంది, కానీ అవి మనం నిజంగా వెతుకుతున్నవి కాకపోవచ్చు. ప్రతి నిజమైన కలయిక ఉచితం; అది దేవునితో అయినా, ఇతరులతో అయినా, లేదా ప్రకృతితో అయినా ఉచితమే. మనం ఆతిథ్యమును మాత్రమే నేర్చుకోవాలి, ఇందులో ఇతరులను స్వాగతించడం, మనం కూడా స్వాగతించబడటానికి అనుమతించడం ఉన్నాయి. మనం ఇవ్వడమే కాదు, పొందవలసింది కూడా చాలా ఉంది. అబ్రహాము మరియు సారా, వారి వృద్ధాప్యంలో ఉన్నప్పటికీ, ముగ్గురు సందర్శకులలో ప్రభువును ఆహ్వానించిన తర్వాత వారు సంతానాన్ని పొందుకొన్నారు. మనం కూడా మన ముందు ఉన్న జీవితాన్ని స్వాగతించడానికి మరియు స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి.

పరిశుద్ధ మరియ మాతకు ప్రార్థన చేద్దాం. ఆమె మన ప్రభువును తన గర్భంలో మోసి, యోసేపుతో కలిసి ఆయనకు కుటుంబాన్ని ఇచ్చింది. మరియ మాతలో మన పిలుపులోని అందాన్ని, శ్రీసభ యొక్క పిలుపును చూస్తాం. శ్రీసభ అందరికీ తెరిచిన గృహముగా ఉండాలి. ఈ విధంగా, మన తలుపు తట్టి, లోపలికి రావడానికి అనుమతి అడిగే ప్రభువును ఆహ్వానించాలి.

త్రికాల ప్రార్ధన అనంతరం:

ప్రియ సహోదరీ సహోదరులారా,

ఈ ఉదయం నేను అల్బానో కేథడ్రల్‌లో దివ్య బలిపూజను కొనియాడాను. సంఘ ఐక్యతకు, మేత్రాసణ సంఘమును కలుసుకోవడానికి ముఖ్యమైన సమయం. ఈ అద్భుతమైన వేడుకను నిర్వహించడానికి కృషి చేసిన బిషప్ వివా గారికి, అందరికీ నా ధన్యవాదాలు. మేత్రాసణ సంఘానికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను!

ఈ రోజుల్లో మిడిల్ ఈస్ట్ నుండి, ముఖ్యంగా గాజా నుండి విషాదకర వార్తలు వస్తూనే ఉన్నాయి.

గత గురువారం గాజా నగరంలోని హోలీ ఫ్యామిలీ కతోలిక విచారణపై ఇజ్రాయెల్ సైన్యం జరిపిన దాడిపై నేను తీవ్ర విచారంను వ్యక్తం చేస్తున్నాను. ఈ దాడిలో ముగ్గురు క్రైస్తవులు మరణించారు, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. మరణించిన సాద్ ఇస్సా కోస్తాండి సలామెహ్, ఫౌమియా ఇస్సా లతీఫ్ అయ్యద్, నజ్వా ఇబ్రహీం లతీఫ్ అబు దౌద్ ల కోసం నేను ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబాలకు, మరియు విచారణలోని విశ్వాసులందరికీ నా సానుభూతిని తెలియ జేస్తున్నాను. ఈ చర్య గాజాలోని పౌరులు మరియు ప్రార్థనా స్థలాలపై జరుగుతున్న నిరంతర సైనిక దాడులకు అదనంగా చేరడం చాలా విచారకరం.

యుద్ధాన్ని తక్షణమే నిలిపివేయాలని, శాంతియుత పరిష్కారం కనుగొనాలని నేను మరోసారి పిలుపునిస్తున్నాను.

అంతర్జాతీయ సమాజం మానవతా చట్టాన్ని పాటించాలని, పౌరులను రక్షించే బాధ్యతను గౌరవించాలని, సామూహిక శిక్షలను, విచక్షణారహిత బలప్రయోగాన్ని, మరియు ప్రజల బలవంతపు స్థానభ్రంశాన్ని నిషేధించాలని నేను పునరుద్ఘాటిస్తున్నాను.

ప్రియ మిడిల్ ఈస్ట్ క్రైస్తవులారా, ఈ క్లిష్ట పరిస్థితుల్లో మీరు ఏమీ చేయలేకపోతున్నారని భావించే మీ బాధను నేను లోతుగా అర్థం చేసుకోగలను. పోప్, మరియు విశ్వ శ్రీసభ హృదయంలో మీరందరూ ఉన్నారు. మీ విశ్వాస సాక్ష్యానికి ధన్యవాదాలు తెలుపుచున్నాను. [లెవాంట్] కన్య మరియ, మిమ్మల్ని ఎల్లప్పుడూ రక్షించుగాక మరియు ప్రపంచాన్ని శాంతి వైపు నడిపించుగాక.

కాస్టెల్ గాండోల్ఫోలోని విశ్వాసులకు, ఇక్కడ చేరిన యాత్రికులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ‘కాథలిక్ వరల్డ్‌వ్యూ ఫెలోషిప్’ నిర్వహించిన తీర్థయాత్రలో పాల్గొన్న యువకులకు నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వారు కొన్ని వారాల ప్రార్థన, శిక్షణ తర్వాత రోమును సందర్శిస్తున్నారు.

“నాయకుల కోసం ప్రార్థనా మారథాన్”ను ప్రోత్సహించిన ఇంటర్నేషనల్ ఫోరం ఆఫ్ కాథలిక్ యాక్షనుకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను: ప్రతి ఒక్కరికీ అందించిన ఆహ్వానం ఏమిటంటే, ఈ రోజు ఉదయం 10 నుండి రాత్రి 10 గంటల మధ్య ఒక్క నిమిషం పాటు ప్రార్థన చేయడానికి సమయం కేటాయించాలి, మన నాయకులను జ్ఞానవంతులను చేయమని, వారిలో శాంతి కోసం ప్రణాళికలను ప్రేరేపించమని ప్రభువును కోరాలి.

ఈ వారాల్లో, ఫోకోలారె ఉద్యమంలోని కొన్ని కుటుంబాలు “న్యూ ఫ్యామిలీస్ అంతర్జాతీయ పాఠశాల” కోసం లోప్పియానోలో ఉన్నాయి. ఆధ్యాత్మికత మరియు సౌభ్రాతృత్వానికి సంబంధించిన ఈ అనుభవం మిమ్మల్ని విశ్వాసంలో స్థిరంగా, మరియు ఇతర కుటుంబాలకు ఆధ్యాత్మిక తోడుగా ఉండటంలో ఆనందంగా ఉంచుతుందని నేను ప్రార్థిస్తున్నాను.

కాథలిక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, సిబ్బందికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దీని ప్రధాన కార్యాలయం ఇక్కడే కాస్టెల్ గాండోల్ఫోలో ఉంది. అగెసి జెలా 3 స్కౌట్ గ్రూపుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను, ఇది ధన్య కార్లో అకుటిస్ సమాధి వద్ద ముగిసే జూబిలీ తీర్థయాత్రలో పాల్గొంటుంది. కాస్టెల్లో ది గోడెగో యువకులకు కూడా నేను శుభాకాంక్షలు తెలియ జేస్తున్నాను, వీరు రోము కారితాసుతో సేవా అనుభవంలో పాల్గొంటున్నారు. పాలెర్మో, సార్సినా లలోని విశ్వాసులకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

“ఓ స్టాజ్జో” జానపద బృందం సభ్యులు, అలాగే ఆల్బా ది టోర్మెస్ నుండి వచ్చిన సంగీత బృందం కూడా ఇక్కడ ఉన్నారు.

ఈ రెండు వారాలు నేను కాస్టెల్ గాండోల్ఫోలో బస చేసిన తర్వాత, కొన్ని రోజుల్లో నేను తిరిగి వాటికన్‌కు వెళ్తాను. మీ ఆతిథ్యానికి మీ అందరికీ ధన్యవాదాలు. మీ అందరికీ సంతోషకరమైన ఆదివార శుభాకాంక్షలు!

మూలము:
https://www.vatican.va/content/leo-xiv/en/angelus/2025/documents/20250720-angelus.html
గురుశ్రీ ప్రవీణ్ గోపు OFM Cap.

 

 

 

5వ ప్రపంచ తాత/మ్మలు, వృద్ధుల దినోత్సవం 2025, పరిశుద్ధ పొప్ సందేశము, 27 జూలై 2025

 పరిశుద్ధ పొప్ సందేశము
5వ ప్రపంచ తాత/మ్మలు, వృద్ధుల దినోత్సవం 2025
27 జూలై 2025 



“నమ్మకముతో జీవించు నరుడు ధన్యుడు” (సీరా 14:2)

ప్రియ సహోదరీ, సహోదరులారా,

మనం జరుపుకుంటున్న ఈ జూబిలీ సందర్భముగా, నిరీక్షణ (ఆశ) అనేది వయస్సుతో సంబంధం లేకుండా, నిరంతరం ఆనందాన్ని పంచుతుందని గ్రహించాలి. సుదీర్ఘమైన జీవిత ప్రయాణంలో, నిరీక్షణ కష్టాలను తట్టుకొని నిలబడినప్పుడే నిజమైన ఆనందాన్ని ఇస్తుంది.

బైబులులో ఎంతో మంది స్త్రీపురుషుల ఉదాహరణలు ఉన్నాయి. వారందరినీ ప్రభువు వారి జీవిత చరమాంకంలో తన రక్షణ ప్రణాళికలో భాగస్వాములను చేశారు. అటువంటి వారిలో అబ్రాహాము, సారా గొప్ప ఉదాహరణ. వయస్సు మీద పడినప్పటికీ, దేవుడు వారికి బిడ్డను వాగ్దానం చేసినప్పుడు, వారు నమ్మలేకపోయారు. వారికి పిల్లలు లేకపోవడం భవిష్యత్తుపై ఎలాంటి ఆశ లేకుండా చేసింది.

బప్తిస్త యోహాను జననం గురించిన దూత ప్రకటనను విన్నప్పుడు జెకర్యా స్పందన కూడా భిన్నంగా ఏమీ లేదు. “ఇదెట్లు జరుగును? నేనా ముసలి వాడను. నా భార్యకు కూడ వయస్సు వాలినది” (లూకా 1:18) అని దేవదూతతో పలికాడు. వృద్ధాప్యం, గొడ్రాలుతనం, భౌతిక క్షీణత, జీవితంపై సంతానంపై గల ఆశను అడ్డుకుంటాయని వారు భావించారు. “నూతనంగా జన్మించడం” గురించి యేసు నికోదేముతో మాట్లాడినప్పుడు, నికోదేము, “వృద్ధుడైన మనుష్యుడు మరల ఎటుల జన్మింప గలడు? అతడు తల్లి గర్భమున రెండవ పర్యాయము ప్రవేశించి జన్మింప గలడా?” అని యేసును ప్రశ్నించాడు (యోహాను 3:4). అయినప్పటికినీ, ఎప్పుడైతే మన పరిస్థితులు మారవని భావిస్తామో, సరిగ్గా అప్పుడే ప్రభువు తన రక్షణ శక్తితో మనల్ని ఆశ్చర్యపరుస్తారు.

వృద్ధులు, నిరీక్షణకు సంకేతాలు

బైబులులో, దేవుడు జీవిత చరమాంకంలో ఉన్న వ్యక్తులను ఎంచుకోవడం ద్వారా, తన దైవిక సంరక్షణను పదేపదే తెలియ జేశారు. అబ్రాహాము, సారా, జెకర్యా, ఎలిశబెతమ్మ విషయములో మాత్రమే కాదు, మోషే విషయంలో కూడా ఇదే జరిగింది; దేవుడు తన ప్రజలను విడిపించడానికి మోషేను పిలిచినప్పుడు అతనికి అప్పటికే ఎనభై సంవత్సరాలు (నిర్గమ 7:7). దీని ద్వారా దేవుని దృష్టిలో వృద్ధాప్యం అనేది ఆశీర్వాదం మరియు కృపతో కూడిన కాలం అని మనకు బోధపడుతుంది. అంతేకాకుండా, దేవుని దృష్టిలో వృద్ధులు నిరీక్షణకు ప్రథమ సాక్షులుగా ఉన్నారు. పునీత అగుస్తీను గారు, “వృద్ధాప్యం అంటే ఏమిటి? అని ప్రశ్నించినప్పుడు, దేవుడే ఆ ప్రశ్నకు ఇలా సమాధానం ఇచ్చారని చెబుతాడు, “మీ బలం క్షీణించనివ్వండి, తద్వారా నా బలం మీలో నివసిస్తుంది, అప్పుడు మీరు అపోస్తలుడైన పౌలుతో “నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను” అని చెప్పగలరు (2 కొరి 12:10). వృద్ధుల సంఖ్య పెరుగుదల అనేది మనం వివేకంతో అర్థం చేసుకోవాల్సిన ఒక కాలపు సూచన, తద్వారా చరిత్రలోని ఈ క్షణాన్ని సరిగ్గా వివరించగలం.

శ్రీసభ మరియు ప్రపంచము యొక్క జీవితాన్ని తరాల ప్రవాహం వెలుగులోనే అర్థం చేసుకోగలం. వృద్ధులను అక్కున చేర్చుకోవడం ద్వారా జీవితం వర్తమానం మాత్రమే కాదని, కేవలం పైపై పరిచయాలు, క్షణిక సంబంధాలతో వృథా చేయకూడదని అర్థం చేసుకుంటాం. అలాగే, జీవితం నిరంతరం మనల్ని భవిష్యత్తు వైపు నడిపిస్తుంది. ఆదికాండంలో, వృద్ధుడైన యాకోబు తన మనవలకు, యోసేపు కుమారులకు దీవెనలిచ్చిన హృదయాన్ని కదిలించే ఘట్టాన్ని మనం చూస్తాం. భవిష్యత్తును ఆశతో చూడమని, దేవుని వాగ్దానాలు నెరవేరే సమయంగా భావించమని చేసిన విజ్ఞప్తిగా యాకోబు మాటలను చూస్తున్నాము (ఆది 48:8-20). వృద్ధుల బలహీనతకు యువత శక్తి అవసరం అనేది నిజమైతే, భవిష్యత్తును జ్ఞానంతో నిర్మించడానికి యువత అనుభవరాహిత్యానికి వృద్ధుల సాక్ష్యం అవసరం అనేది కూడా అంతే నిజం. ఎన్నిసార్లు మన తాతలు మనకు విశ్వాసం, భక్తి, పౌర ధర్మం, సామాజిక నిబద్ధతకు, కష్టాలలో జ్ఞాపకశక్తికి, పట్టుదలకు ఉదాహరణలుగా నిలిచారు! వారు ఆశతో, ప్రేమతో మనకు అందించిన అమూల్యమైన వారసత్వం ఎల్లప్పుడూ కృతజ్ఞతకు మూలం, పట్టుదలకు ఒక పిలుపు.

వృద్ధులకు నిరీక్షణ సంకేతాలు

బైబులు కాలం నుండి, జూబిలీ, విమోచన సమయంగా అర్థం చేసుకోబడింది. ఈ సమయంలో, బానిసలు స్వేచ్ఛ పొందారు, అప్పులు రద్దు చేయబడ్డాయి, భూమి అసలు యజమానులకు తిరిగి ఇవ్వబడింది. జూబిలీ అనేది దేవుడు కోరుకున్న సామాజిక క్రమం తిరిగి స్థాపించబడే సమయం, సంవత్సరాలుగా పేరుకుపోయిన అసమానతలు, అన్యాయాలు సరిదిద్దబడే సమయం. నజరేతులో ప్రార్థనా మందిరంలో, యేసు పేదలకు సువార్తను, గ్రుడ్డివారికి చూపును, ఖైదీలకు, అణగారినవారికి స్వాతంత్ర్యాన్ని ప్రకటించినప్పుడు, ఆ విమోచన క్షణాలను గుర్తుచేశారు (లూకా 4:16-21).

జూబిలీ స్ఫూర్తితో వృద్ధులను చూసినప్పుడు, వారికి విమోచనను, ముఖ్యంగా ఒంటరితనం, నిర్లక్ష్యం నుండి విమోచనను అనుభవించేలా తోడ్పడాలి. అలా చేయడానికి ఈ జూబిలీ సంవత్సరం సరియైన సమయం. దేవుడు తన వాగ్దానాలను నెరవేర్చడంలో చూపే విశ్వసనీయత, వృద్ధాప్యంలో ఒక దివ్యమైన ఆనందం ఉందని మనకు బోధిస్తుంది. ఇది నిజమైన సువార్త ఆనందం. వృద్ధులు తరచుగా తమను తాము బంధించుకునే నిర్లక్ష్యం (ఉదాసీనత) అనే అడ్డుగోడలను బద్దలు కొట్టడానికి మనకు స్ఫూర్తినిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా మన సమాజాలు, జీవితంలో అత్యంత ముఖ్యమైన, సుసంపన్నమైన వృద్ధులను విస్మరించడానికి, వారిని పక్కన పెట్టడానికి అలవాటు పడుతున్నాయి. ఇది చాలా ఆందోళన కలిగించే పరిణామం.

ఈ పరిస్థితిలో, శ్రీసభ వృద్ధుల పట్ల బాధ్యతను తీసుకోవడం ఎంతో అవసరం. ప్రతి విచారణ, సంఘం, ప్రతీ సమూహం వృద్ధుల విషయములో కీలక పాత్ర పోషించాలి. వృద్ధులను క్రమం తప్పకుండా సందర్శించడం, వారికి వారికి మద్దతు ఇవ్వడం, ప్రార్థనల సమూహాలను ఏర్పాటు చేయడం, వారికి ఆశ, గౌరవాన్ని తిరిగి తీసుకురాగల సంబంధాలను పెంపొందించడం ద్వారా ఇది సాధ్యపడుతుంది. క్రైస్తవ నిరీక్షణ ఎల్లప్పుడూ మనల్ని మరింత ధైర్యంగా ఉండమని, గొప్పగా ఆలోచించమని, ప్రస్తుత పరిస్థితులతో సంతృప్తి చెందకుండా ఉండమని ప్రోత్సహిస్తుంది. ఈ సందర్భంలో, వృద్ధులకు లభించాల్సిన గౌరవం, ఆప్యాయతను తిరిగి తీసుకురాగల మార్పు కోసం మనం కృషి చేయాలి.

అందుకే పోప్ ఫ్రాన్సిస్, ప్రపంచ తాతలు, వృద్ధుల దినోత్సవాన్ని ముఖ్యంగా ఒంటరిగా నివసిస్తున్న వృద్ధులతో కలిసి జరుపుకోవాలని కోరారు. ఈ కారణంగా, ఈ పవిత్ర జూబిలీ సంవత్సరంలో రోముకు తీర్థయాత్ర చేయలేని వారు “ఒంటరిగా ఉన్న వృద్ధులను సందర్శిస్తే జూబిలీ ఇండల్జెన్స్ పొందవచ్చు... ఒక రకంగా, వారిలో ఉన్న క్రీస్తు వద్దకు తీర్థయాత్ర చేయడమే” (మత్త 25:34-36) (అపోస్టోలిక్ పెనిటెన్షియరీ, జూబ్లీ ఇండల్జెన్స్ మంజూరుకు సంబంధించిన నిబంధనలు, III). ఒక వృద్ధుడిని సందర్శించడం అనేది యేసును కలుసుకోవడానికి ఒక మార్గం, ఇది మనల్ని ఉదాసీనత మరియు ఒంటరితనం నుండి విముక్తి చేస్తుంది.

సిరాకు గ్రంథం (14:2) ఆశను కోల్పోని వారు ధన్యులు అని చెబుతుంది. బహుశా, మన జీవితం సుదీర్ఘంగా ఉంటే, భవిష్యత్తు వైపు కాకుండా గతం వైపే చూసేందుకు మనం ప్రలోభపడవచ్చు. అయినప్పటికీ, పోప్ ఫ్రాన్సిస్ తన చివరి దశలో ఆసుపత్రిలో ఉండగా ఇలా వ్రాసారు, “మన శరీరాలు బలహీనంగా ఉన్నప్పటికీ, ప్రేమించకుండా, ప్రార్థించకుండా, మనల్ని మనం అర్పించుకోకుండా, ఒకరికొకరు తోడుగా ఉండకుండా, విశ్వాసంతో ఆశకు ప్రకాశవంతమైన చిహ్నాలుగా ఉండకుండా ఏదీ మనల్ని నిరోధించదు” (త్రికాల ప్రార్ధన, మార్చి 16, 2025). ఏ కష్టమూ దూరం చేయలేని ప్రేమించే, ప్రార్థించే స్వేచ్ఛ మనకు ఉంది. ప్రతి ఒక్కరూ, ఎల్లప్పుడూ, ప్రేమించగలరు, ప్రార్థించగలరు.

మన శక్తులు సన్నగిల్లినా, ప్రియమైన వారిపై, భార్య లేదా భర్తపై, పిల్లలపై, ప్రకాశవంతం చేసే మనవలు, మనవరాళ్లపై మనకున్న ప్రేమ తగ్గదు. నిజానికి, వారి ప్రేమ తరచుగా మనలో శక్తిని పునరుజ్జీవింప జేస్తుంది, ఆశను, ఓదార్పును కలిగిస్తుంది.

దేవునిలో మూలాలున్న ఈ ప్రేమకు సంబంధించిన సూచనలు మనకు ధైర్యాన్ని ఇస్తాయి. “భౌతికముగ క్షీణించుచున్నను, ఆధ్యాత్మికముగా దినదినము నూతనత్వమును పొందుచున్నాము” (2 కొరి 4:16) అని ఆ సూచనలు మనకు గుర్తుచేస్తాయి. ముఖ్యంగా వయసు పెరిగే కొద్దీ, ప్రభువుపై నమ్మకంతో ముందుకు సాగుదాం. ప్రార్థనలోనూ, పవిత్ర దివ్యబలిపూజలోనూ ఆయనతో మన కలయిక ద్వారా ప్రతిరోజూ మనం నూతనపరచబడతాం.

వాటికన్, 26 జూన్ 2025

మూలము”
https://www.vatican.va/content/leo-xiv/en/messages/grandparents/documents/20250626-messaggio-nonni-anziani.html

గురుశ్రీ ప్రవీణ్ గోపు OFM Cap.


త్రికాల ప్రార్ధన, లియో XIV, 13 జూలై 2025

 లియో XIV
త్రికాల ప్రార్ధన
లిబర్టీ స్క్వేర్ - పియాజ్జా దెల్ల లిబర్తా (కాస్టెల్ గండోల్ఫో)
ఆదివారము, 13 జూలై 2025

 


ప్రియ సహోదరీ సహోదరులారా! శుభోదయం!

మీకు ఆదివారం శుభాకాంక్షలు! నేటి సువిశేషం యేసును అడిగిన ఒక గొప్ప ప్రశ్నతో మొదలవుతుంది: “బోధకుడా, నిత్య జీవము పొందుటకు నేను ఏమి చేయవలయును? (లూకా 10:25). ఈ మాటలు మన జీవితంలోని నిరంతర కోరికను వ్యక్తపరుస్తాయి: రక్షణ కొరకు మన తపన, మరియు అపజయం, చెడు, మరణం లేని జీవితం కోసం మన నిరంతర ఆకాంక్షను ఆ ప్రశ్న తెలియ జేస్తుంది.

మానవ హృదయపు ఈ నిరీక్షణను “వారసత్వ సంపదగా” పొందాలని వివరింపబడింది; దీన్ని బలవంతంగా సంపాదించడం కుదరదు, యాచించి పొందడం సాధ్యం కాదు, లేదా సంప్రదింపులతో సాధించేది కాదు. నిత్య జీవితాన్ని దేవుడు మాత్రమే ప్రసాదించగలరు. తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇచ్చినట్లే ఇదివారసత్వంగా దక్కుతుంది.

అందుకే, మనం దేవుని బహుమతిని పొందాలంటే, దేవుని చిత్తాన్ని నెరవేర్చాలని యేసు తెలియజేసారు. ధర్మశాస్త్రంలో ఇలా వ్రాయబడింది: “నీ ప్రభువైన దేవున్ని నీ పూర్ణ హృదయంతో ప్రేమించాలి, మరియు “నీ పొరుగువారిని నిన్నువలె ప్రేమించాలి” (లూకా 10:27; ద్వితీ 6:5; లేవీ 19:18). మనం ఈ రెండు ఆజ్ఞలను పాటించినపుడు, తండ్రి ప్రేమకు మనం ప్రతిస్పందించినవారమవుతాము. దేవుని చిత్తమే జీవిత నియమం. దీనిని తండ్రి అయిన దేవుడు స్వయంగా తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనల్ని అనంతంగా ప్రేమించడం ద్వారా మొదట పాటించారు.

సహోదరీ సహోదరులారా, మనం యేసు వైపు చూద్దాం! దేవుని పట్ల, ఇతరుల పట్ల ఉన్న నిజమైన ప్రేమకు అర్థాన్ని ఆయన మనకు చూపుతారు. ఆ ప్రేమ ఉదారమైనది, స్వార్థపూరితమైనది కాదు. అది నిస్సంకోచంగా క్షమించే ప్రేమ, ఇతరులకు చేయూతనిచ్చి, ఎప్పుడూ విడిచిపెట్టని ప్రేమ. క్రీస్తులో, దేవుడు ప్రతి స్త్రీ, పురుషుడికి పొరుగువాడు అయ్యాడు. అందుకే మనలో ప్రతి ఒక్కరూ మనం కలిసే ప్రతి ఒక్కరికీ పొరుగువారు కాగలరు, మరియు కావాలి. లోక రక్షకుడైన యేసును ఆదర్శంగా తీసుకుని, మనం కూడా ముఖ్యంగా నిరుత్సాహంగా మరియు నిరాశతో ఉన్నవారికి ఓదార్పును, నిరీక్షణను అందించడానికి పిలవబడ్డాము.

నిత్యం జీవించడానికి, మనం మరణాన్ని మోసగించాల్సిన అవసరం లేదు. బదులుగా, మన జీవితకాలంలో ఇతరులను ప్రేమగా చూసుకోవడం ద్వారా జీవితానికి సేవ చేయాలి. ఇదే అన్ని సామాజిక నియమాలకు అతీతమైన, వాటికి అసలైన అర్థాన్ని ఇచ్చే అత్యున్నత సూత్రం.

దయగల కన్యక అయిన మరియ మాతను మనం వేడుకుందాం. దేవుని చిత్తానికి మన హృదయాలను తెరవడానికి ఆమె మనకు సహాయం చేయుగాక. ఎందుకంటే, ఆయన చిత్తం ఎల్లప్పుడూ ప్రేమతో కూడిన రక్షణ చిత్తమే. ఈ విధంగా, మన జీవితంలో ప్రతిరోజూ మనం శాంతిని స్థాపించే వారంగా మారతాం.

త్రికాల ప్రార్ధన తరువాత

ప్రియ సహోదరీ సహోదరులారా,

కాస్టెల్ గండోల్ఫోలో మీ అందరితో కలిసి ఉండటం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడి పౌర, సైనిక అధికారులకు నేను నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే, నన్ను సాదరంగా ఆహ్వానించిన మీ అందరికీ నా ధన్యవాదాలు.

నిన్న, బార్సిలోనాలో, 1909లో విశ్వాసం పట్ల ద్వేషంతో హత్య చేయబడిన బ్రదర్ లికారియోన్ మే (ఫ్రాంకోయిస్ బెంజమిన్) ధన్యుడిగా ప్రకటించబడ్డారు. ఈయన ‘ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది మారిస్ట్ బ్రదర్స్ ఆఫ్ ది స్కూల్స్‌’కు చెందిన మఠవాసి. ప్రతికూల పరిస్థితులలోనూ, ఆయన తన విద్యా, బోధనాపరమైన బాధ్యతను అంకితభావంతో, ధైర్యంగా నిర్వర్తించారు. ఈ హతసాక్షి వీరోచిత సాక్ష్యం మనందరికీ, ముఖ్యంగా యువత విద్య కోసం పనిచేసే వారికి స్ఫూర్తినిస్తుందని ఆశిస్తున్నాను.

పోలాండ్ నుండి వచ్చిన లిటర్జికల్ అకాడమీ వేసవి కోర్సులో పాల్గొంటున్న వారందరికీ, అలాగే ఈ రోజు చెస్టోచోవా పుణ్యక్షేత్రానికి వార్షిక తీర్థయాత్రలో పాల్గొంటున్న పోలిష్ యాత్రికులకు నేను నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

నేటితో బెర్గామో మేత్రాసన జూబిలీ తీర్థయాత్ర ముగుస్తుంది. తమ బిషప్‌తో కలిసి పవిత్ర ద్వారం గుండా వెళ్ళడానికి రోముకు వచ్చిన యాత్రికులకు నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

పెరూలోని చిక్లాయోకు చెందిన కొలెజియో సాన్ అగస్టిన్‌లోని బ్లెస్సెడ్ అగస్టిన్ ఆఫ్ టరానో పాస్టోరల్ కమ్యూనిటీకి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జూబిలీ వేడుకల కోసం వారు కూడా రోముకు వచ్చారు. అలాగే, అల్కాలా ది హెనరెస్ మేత్రాసనములోని సాన్ పెడ్రో అపోస్టల్ విచారణ నుండి వచ్చిన యాత్రికులకు (వారు తమ విచారణ స్థాపించి 400 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వేడుకలు చేసుకుంటున్నారు); కొలంబియాలోని ఉరిబియా-లా గ్వాజిరా నుండి వచ్చిన లీజియొనరీస్ ఆఫ్ మేరీ సభ్యులకు; మెర్సిఫుల్ లవ్ కుటుంబ సభ్యులకు; అగేషి అల్కామో 1వ స్కౌట్ గ్రూప్‌కు; మరియు చివరగా, ఇక్కడ హాజరైన ఆగస్టీనియన్ మఠవాసులకు కూడా నేను నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

ఫ్రాన్స్ నుండి వచ్చిన అకాడెమీ మ్యూజికల్ ది లీస్సే బాలల బృందానికి స్వాగతం పలుకుతున్నాము. మీరు హాజరైనందుకు మరియు గానం, సంగీతం పట్ల మీ నిబద్ధతకు ధన్యవాదాలు.

ఈరోజు వెల్లెత్రి స్కూల్‌లోని కరబినీరీ కోర్సుకు చెందిన 100 మంది క్యాడెట్‌లు మనతో ఉన్నారు. ఈ స్కూల్ గౌరవనీయులైన సాల్వో డి'అక్విస్టో పేరు మీద ఉంది. కమాండర్‌కు, అలాగే ఇతర అధికారులు, నాన్-కమిషన్డ్ అధికారులకు నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ దేశానికి, పౌర సమాజానికి సేవ చేయడంలో మీ శిక్షణను కొనసాగించమని మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. ధన్యవాదాలు! వారి సేవకు గాను మనమంతా ఉత్సాహంగా చప్పట్లు కొడదాం.

వేసవి నెలల్లో, పిల్లలు మరియు యువత కోసం అనేక కార్యక్రమాలు జరుగుతాయి. ఈ సేవకు తమను తాము అంకితం చేసుకుంటున్న విద్యావేత్తలకు, నిర్వాహకులకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా, ప్రపంచం నలుమూలల నుండి యువతను ఒకచోట చేర్చే గిఫోనీ ఫిల్మ్ ఫెస్టివల్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాలనుకుంటున్నాను. ఈ సంవత్సరం దాని థీమ్ “మానవత్వం పొందడం”.

సహోదరీ సహోదరులారా, హింస లేదా యుద్ధం కారణంగా బాధలు, అవసరాల్లో ఉన్న వారందరి కోసం మరియు శాంతి కోసం ప్రార్థించడం మనం మర్చిపోవద్దు.

మీ అందరికీ ఆదివార శుభాకాంక్షలు!

మూలము:
https://www.vatican.va/content/leo-xiv/en/angelus/2025/documents/20250713-angelus.html

గురుశ్రీ ప్రవీణ్ గోపు OFM Cap.

సృష్టి పరిరక్షణ కొరకు దివ్య బలిపూజ, పోప్ లియో XIV ప్రసంగము, 9 జూలై 2025

 సృష్టి పరిరక్షణ కొరకు దివ్య బలిపూజ
పోప్ లియో XIV గారి ప్రసంగము
బోర్గో లౌదాతో సి' (కాస్టెల్ గాండోల్ఫో)
బుధవారం, 9 జూలై 2025



ఈ అందమైన రోజున, ప్రకృతి సౌందర్యం నడుమ మనం ఇక్కడ ఏమి జరుపుకుంటున్నామో ఒక్కసారి ఆలోచించమని నాతో సహా మీ అందరినీ కోరుతున్నాను. వృక్షాలు, సృష్టిలోని ఎన్నో అంశాలతో నిండిన ఈ “ప్రకృతి దేవాలయం” మనందరినీ ఇక్కడకు చేర్చింది. ప్రభువుకు కృతజ్ఞతలు చెప్పే దివ్యబలి పూజ కొనియాడుటకు మనందరం ఒకటిగా ఇక్కడ సమావేశమయ్యాము.

ఈరోజు దివ్యబలి పూజలో ప్రభువుకు కృతజ్ఞతలు చెప్పడానికి అనేక కారణాలున్నాయి. సృష్టి పరిరక్షణ కోసం ఉద్దేశించిన దివ్యబలి పూజకు సంబంధించిన కొత్త ప్రార్థనలను ఉపయోగించి జరుపుతున్న మొదటి వేడుక బహుశా ఇదే కావచ్చు. ఈ ప్రార్థనలు వాటికన్ (హోలీ సీ) లోని అనేక డికాస్టరీలు (విభాగాలు) చేసిన కృషి ఫలితంగా రూపొందాయి.

ఈ ప్రార్థనల రూపకల్పనలో భాగమైన ప్రతి ఒక్కరికీ నా కృతజ్ఞతలు. మీకు తెలిసినట్లే, ప్రార్థనలు జీవితానికి ప్రతీకలు, మరియు లౌదాతో సి' సెంటర్’కు మీరే జీవం. ఈ సందర్భంగా, పోప్ ఫ్రాన్సిస్ గారి గొప్ప ఆలోచనను కార్యరూపం దాల్చడానికి మీరు చేస్తున్న కృషికి కూడా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సృష్టిని, మన ఉమ్మడి నివాసాన్ని పరిరక్షించే కీలకమైన బాధ్యతను కొనసాగించడానికి, వారు ఈ చిన్న భూభాగాన్ని, ఈ ఉద్యానవనాలను, ఈ నడక మార్గాలను దానం చేసారు. ‘లౌదాతో సి' ప్రచురించిన పదేళ్ల తర్వాత, ఈ లక్ష్యాన్ని నిరంతరాయంగా కొనసాగించవలసిన ఆవశ్యకత  మరింత స్పష్టంగా కనిపించింది.



ఈ ప్రదేశం [ఒక జలధార ముందు] ప్రాచీన దేవాలయాలను తలపిస్తోంది. అప్పట్లో దేవాలయములోకి వెళ్ళేముందు, జ్ఞానస్నానం ఇచ్చే స్థలం (baptismal font) గుండా వెళ్ళేవారు. నేను ఇక్కడ ఈ నీటిలో జ్ఞానస్నానం తీసుకోవాలనుకుంటున్నానో లేదో నాకు తెలియదు... కానీ మన పాపాలు, ప్రక్షాళన చేసుకోవడానికి నీటి గుండా పయనించి, ఆపై శ్రీసభ అనే పవిత్ర రహస్యంలోకి ప్రవేశించడం అనే సందేశాన్ని నేటికీ మనకు తెలియపరుస్తుంది. దివ్యబలి పూజ ప్రారంభంలో, మన హృదయపరివర్తన(conversion) కొరకు ప్రార్థనలు చేశాం. మన ఉమ్మడి నివాసాన్ని పరిరక్షించాల్సిన ఆవశ్యకతను ఇంకా గుర్తించని, శ్రీసభ లోపల, వెలుపల ఉన్న ఎందరో వ్యక్తుల మార్పు కోసం కూడా మనం ప్రార్థించాలని నా కోరిక.

మన ప్రపంచంలో దాదాపు ప్రతిరోజూ, అనేక ప్రదేశాల్లో, దేశాల్లో సంభవిస్తున్న అనేక సహజ విపత్తులు అన్నీ, మానవుల మితిమీరిన చర్యల వల్లే, మన జీవనశైలి వల్లే సంభవిస్తున్నాయి. మనం నిజంగా మారుమనస్సు (conversion) పొందుతున్నామా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. మారుమనస్సు మనకెంత అవసరం!

ఈరోజు నేను మీతో ఒక ముఖ్యమైన ప్రసంగాన్ని పంచుకోబోతున్నాను. మీరంతా దయచేసి కాస్త ఓపిక పట్టండి. ఇందులో కొన్ని కీలక అంశాలు మన ఆలోచనలకు మరింత పదును పెడతాయి. భూతాపం [గ్లోబల్ వార్మింగ్], సాయుధ పోరాటాల కారణంగా ప్రపంచం అల్లకల్లోలంగా ఉన్నప్పటికీ, మనం సోదరభావంతో కూడిన, శాంతియుత క్షణాలను ఆస్వాదిస్తున్నాం. పోప్ ఫ్రాన్సిస్ తన ఎన్‌సిక్లికల్స్ 'లౌదాతో సి' మరియు 'ఫ్రతెల్లి తుత్తి'లలో ఇచ్చిన సందేశం నేటికీ ఎంతో సమయోచితంగా ఉంది.

మనం ఇప్పుడే విన్న సువార్తను గురించి ఆలోచిస్తే, తుఫాను మధ్య శిష్యులు అనుభవించిన భయం నేడు మానవాళిలో చాలా మందిలో ఉన్న భయాన్ని ప్రతిబింబిస్తుంది. అదే సమయంలో, జూబిలీ సంవత్సరంలో మనం పదే పదే నిరీక్షణను నమ్ముతూ, ప్రకటిస్తున్నాం. మనం ఆ నిరీక్షణను యేసులో కనుగొన్నాం. ఆయనే తుఫానును శాంతింపజేస్తాడు. ఆయన శక్తి విచ్ఛిన్నం చేయదు, బలోపేతం చేస్తుంది. నాశనం చేయదు, నూతన సృష్టిని చేసి, కొత్త జీవితాన్ని ప్రసాదిస్తుంది. “ఈయన ఎంతటి మహానుభావుడు! గాలి, సముద్రము సయితము ఈయన ఆజ్ఞకు లోబడినవి” (మత్త 8:27) అని మనం మనల్ని మనం ప్రశ్నించుకోవాలి.

ఈ ప్రశ్నలో వ్యక్తమైన ఆశ్చర్యం, భయం నుండి విముక్తి పొందే దిశగా ఇది తొలి అడుగు. యేసు గలిలయ సముద్ర ప్రాంతమున నివసించి, ప్రార్థనలు చేశారు. అక్కడే ఆయన తన ప్రథమ శిష్యులను వారి దైనందిన జీవితంలో, పనిలో భాగంగా పిలిచారు. ఆయన దేవుని రాజ్యాన్ని ప్రకటించిన ఉపమానాలు, ఆ భూమితో, ఆ జలాలతో, ఋతువుల క్రమంతో, సృష్టిలోని జీవుల జీవితంతో ఆయనకు ఉన్న లోతైన అనుబంధాన్ని స్పష్టం చేస్తాయి.

మత్తయి సువార్తికుడు తుఫానును ఒక కల్లోలంగా [గ్రీకు పదం, సేయిస్మోస్] వర్ణించారు. యేసు మరణించినప్పుడు, అలాగే ఆయన పునరుత్థానం పొందిన వేళ సంభవించిన భూకంపానికి కూడా మత్తయి ఇదే గ్రీకు పదాన్ని వాడారు. ఈ కల్లోలంపై క్రీస్తు తన పాదాలను స్థిరంగా నిలిపి నిలబడతారు. ఇక్కడే సువార్త మన గందరగోళ చరిత్రలో ఉన్న పునరుత్థానుడైన ప్రభువును మనకు చూపిస్తుంది. యేసు గాలిని, సముద్రాన్ని గద్దించడం, జీవితాన్ని, రక్షణను ఒసగే ఆయన శక్తిని స్పష్టం చేస్తుంది. ఈ శక్తి జీవులను వణికించే శక్తులన్నిటికంటే గొప్పది.

మరొక్కసారి మనం మనల్ని మనం ప్రశ్నించుకోవచ్చు: “ఈయన ఎంతటి మహానుభావుడు! గాలి, సముద్రము సయితము ఈయన ఆజ్ఞకు లోబడినవి” (మత్త 8:27). మనం విన్న కొలొస్సీయులకు రాసిన లేఖలోని స్తోత్రం ఈ ప్రశ్నకు సమాధానం ఇస్తున్నట్లు కనిపిస్తుంది: “క్రీస్తు అదృశ్యుడైయున్న దేవుని ప్రత్యక్ష రూపము. ఆయన సమస్త సృష్టిలో తొలుత జన్మించిన పుత్రుడు. ఏలన, దేవుడు సమస్త విశ్వమును ఆయన ద్వారా, ఆయన కొరకు సృష్టించెను” (కొలొస్సీ 1:15-16).

ఆ రోజు తుఫానుకు చిక్కుకుని, శిష్యులు భయంతో నిండిపోయారు; యేసు గురించిన ఈ జ్ఞానం వారికి అప్పుడు పూర్తిగా బోధపడలేదు. అయితే, నేడు, మనకు అందించబడిన విశ్వాసం ప్రకారం, మనం మరింత ముందుకు వెళ్లి ఇలా చెప్పగలం: “ఆయన తన శరీరమైన శ్రీసభకు శిరస్సు, సమస్తమున ఆయనయే ప్రధముడగుటకు ఆయన ఆదియై ఉండి మృతుల నుండి లేచిన వారిలో ప్రధమ పుత్రుడు” (కొలొస్సీ 1:18).

ఆ మాటలు, ప్రతి యుగంలోనూ, మనల్ని జీవముగల శరీరంగా మారుస్తాయి, క్రీస్తు శిరస్సుగా ఉన్న ఆ శరీరానికి మనం నిబద్ధులం అయ్యేలా చేస్తాయి. సృష్టిని పరిరక్షించడం, శాంతిని, సఖ్యతను పెంపొందించడం మన లక్ష్యం. ఇది యేసు సొంత లక్ష్యం, అలాగే, ప్రభువు మనకు అప్పగించిన బాధ్యత. మనం భూమి యొక్క ఆక్రందనను వింటాం, పేదల రోదనను వింటాం, ఎందుకంటే ఈ విన్నపం దేవుని హృదయాన్ని చేరింది. మన ఆవేదనే ఆయన ఆవేదన; మన శ్రమ ఆయన శ్రమయే.

ఈ విషయంలో, కీర్తనకారుడి పాట మనకు స్ఫూర్తినిస్తుంది: “ప్రభువు స్వరము జలముల మీద విన్పించు చున్నది. మహిమాన్వితుడైన ప్రభువు ఉరుములతో గర్జించు చున్నాడు. ఆయన స్వరము సాగరము మీద  విన్పించు చున్నది. ప్రభువు స్వరము మహాబలమైనది. మహా ప్రభావము కలది” (కీర్తన 29:3-4). ఆ స్వరం, ఈ లోకంలోని దుష్టశక్తులను వ్యతిరేకించడానికి ధైర్యం అవసరమైనప్పుడు ప్రవచనాత్మకంగా మాట్లాడటానికి సంఘాన్ని ప్రోత్సహిస్తుంది. సృష్టికర్తకు, ఆయన సృష్టికి మధ్య ఉన్న విడదీయరాని నిబంధన (covenant) మన మనస్సులను ప్రేరేపిస్తుంది. ఇది చెడును మంచిగా, అన్యాయాన్ని న్యాయంగా, అత్యాశను పంచుకోవడంగా మార్చడానికి మన ప్రయత్నాలను ఉత్సాహపరుస్తుంది.

అనంతమైన ప్రేమతో దేవుడు అన్నిటినీ సృష్టించి వాటికి ప్రాణం పోశాడు. అందుకే పునీత అస్సీసిపుర ఫ్రాన్సిసుగారు ప్రతి జీవిని తన సోదరుడు, సోదరి, తల్లి అని పిలవగలిగారు. కేవలం ధ్యాన దృష్టి (contemplative gaze) మాత్రమే సృష్టితో మనకున్న సంబంధాన్ని మార్చగలదు. దేవునితో, మన పొరుగువారితో, భూమితో మన సంబంధాలు తెగిపోవడం వల్ల ఏర్పడిన పర్యావరణ సంక్షోభం నుండి ఇది మనల్ని బయటపడేస్తుంది. ఈ సంబంధాల విచ్ఛిన్నం పాపం యొక్క పర్యవసానం (లౌదాతో సి', 66 చూడండి).

ప్రియమైన సహోదరీ సహోదరులారా, మనం ప్రస్తుతం ఉన్న ఈ బోర్గో లౌదాతో సి', పోప్ ఫ్రాన్సిస్ గారి దార్శనికతకు అనుగుణంగా, ఒక రకమైన “ప్రయోగశాల”గా రూపుదిద్దుకోవాలని ఆశిస్తోంది. సృష్టితో సామరస్యాన్ని అనుభవించడం ద్వారా స్వస్థతను, సఖ్యతను పొందడానికి ఇది ఒక వేదిక. మనకు అప్పగించబడిన సహజ పర్యావరణాన్ని రక్షించడానికి కొత్త, సమర్థవంతమైన మార్గాలను అభివృద్ధి చేయడం ద్వారా దీన్ని సాధించవచ్చు. ఈ ప్రాజెక్టును సాకారం చేయడానికి కృషి చేస్తున్న మీ అందరికీ నా ప్రార్థనలను, ప్రోత్సాహాన్ని తెలియజేస్తున్నాను.

మనం జరుపుకునే దివ్యబలి పూజ మన శ్రమకు శక్తిని, అర్థాన్ని ఇస్తుంది. పోప్ ఫ్రాన్సిస్ రాసినట్లుగా, “సృష్టించబడినవన్నీ దివ్యబలి పూజలోనే గొప్ప ఉన్నతిని పొందుతాయి. దేవుడు స్వయంగా మానవుడిగా మారి తన సృష్టికి ఆహారంగా మారినప్పుడు, స్పష్టంగా వ్యక్తమయ్యే కృప అసమానమైన వ్యక్తీకరణను కనుగొంది. మానవునిగా జన్మించిన రహస్యం యొక్క పరాకాష్టలో, ప్రభువు ఒక సూక్ష్మ పదార్థం ద్వారా మన అంతర్గత లోతులకు చేరుకోవాలని ఎంచుకున్నాడు. ఆయనపై నుండి కాదు, లోపల నుండి వస్తారు; మన ఈ ప్రపంచంలో మనం ఆయనను కనుగొనేలా వస్తారు” (లౌదాతో సి', 236).

ఈ ఆలోచనలను ముగించే ముందు, పునీత అగుస్తీను తన ‘కన్‌ఫెషన్స్’ చివరి పేజీలలో సృష్టిని, మానవాళిని ఒక విశ్వ స్తుతి గీతంలో ఏకం చేస్తూ చెప్పిన మాటలతో ముగించాలను కుంటున్నాను: ప్రభూ, “మీ కార్యములు మిమ్మల్ని స్తుతించుగాక, తద్వారా మేము మిమ్మల్ని ప్రేమించగలం; మేము మిమ్మల్ని ప్రేమించగలం, తద్వారా మీ కార్యములు మిమ్మల్ని స్తుతించుగాక” (XIII, 33, 48). సామరస్యాన్నే మనం ప్రపంచమంతటా వ్యాపింపజేద్దాం.

మూలము:
https://www.vatican.va/content/leo-xiv/en/homilies/2025/documents/20250709-omelia-custodia-creazione.html
గురుశ్రీ ప్రవీణ్ గోపు OFM Cap.