20 వ సామాన్య ఆదివారము, YEAR C

 20 వ సామాన్య ఆదివారము, YEAR C
యిర్మియా 3:4-6, 8-10; హెబ్రీ 12:1-4; లూకా 12:49-53

"నేను భూమిమీద నిప్పు అంటించుటకు వచ్చియున్నాను. అది ఇప్పటికే రగుల్కొని ఉండవలసినది" (లూకా 12:49). పాత నిబంధనలో, నిప్పు శక్తివంతమైన దేవుని సాన్నిధ్యాన్ని సూచిస్తుంది. మండుచున్న పొదనుండి మోషే దేవుని స్వరాన్ని వినగాలిగాడు. ఇశ్రాయేలు ప్రజలు వాగ్ధత్త భూమికి వచ్చు సమయములో రాత్రివేళ అగ్నిస్తంభము వారి ముందు కదిలిపోయెను. పెంతకోస్తు దినమున పవిత్రాత్మ అగ్నినాలుకల రూపములో శిష్యులపైకి వేంచేసి యుండుట మనకు జ్ఞాపకమే!. ఈ పెంతకోస్తు అగ్ని, హృదయాలను దహించి వేసి, వారి జీవిత గమ్యాన్ని మార్చేలా చేసింది. నేడు మనం యేసు శిష్యులముగా దైవప్రేమ యొక్క అగ్నిని ప్రతీచోట వ్యాప్తిచేయాలి.

"నేను శ్రమలతో కూడిన జ్ఞానస్నానమును పొందవలయును" (లూకా 12:50). ఇచ్చట జ్ఞానస్నానం యేసు శ్రమలలో, మరణములో మునుగుటను సూచిస్తుంది. దీనిద్వారానే మనం విముక్తిని పొందుతాము. అయితే యేసు ప్రభువు, మరణము అను జ్ఞానస్నాన తొట్టిలో మునిగి ఉత్థానముతో నూతన జీవితములోనికి ఆవిర్భవించుటను తెలియజేయు చున్నది.

"నేను భూమిమీద శాంతి నెలకొల్పుటకు వచ్చితినని మీరు తలంచు చున్నారా? లేదు. విభజనలు కలిగించుటకే వచ్చితిని" (లూకా 12:51). ఇది వినడానికి కటినముగా యున్నది. యేసు శాంతిస్థాపకుడు కాదా? అన్న అనుమానం కలుగుతుంది. యేసు తన శిష్యులతో, "శాంతిని మీకు అనుగ్రహించు చున్నాను. నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను. లోకము వలె నేను ఇచ్చుట లేదు" (యోహాను 14:27) అని కడరా భోజన సమయములో చెప్పలేదా! "భారముచే అలసి సొలసి యున్న సమస్త జనులారా! నా యొద్దకు రండు. మీకు విశ్రాంతి నొసగెదను" (మత్త 11:28) అని చెప్పలేదా! భయముచే శిష్యులు ఒకచోట తలుపులు మూసుకొని యుండగా, యేసు వచ్చి వారి మధ్య నిలువబడి, "మీకు శాంతి కలుగునుగాక!" (యోహాను 20:19) అని పలుకలేదా!

అయితే, తాను ఈ లోకమునుండి వెడలి పోయిన తరువాత శిష్యుల ప్రయాణం కటినముగా ఉంటుందని హెచ్చరించారు. యేసు నిమిత్తము అందరు ద్వేషింతురని చెప్పారు. సువార్త వ్రాయబడే సమయానికి ప్రభువు ప్రవచనాలు నేరవేరుచున్నాయి. కుటుంబాలలో విభజనలు ఎందుకన, కొంతమంది క్రీస్తును విశ్వసించి, జ్ఞానస్నానాన్ని పొందుచున్నారు. తనను అనుసరించాలని అనుకొనేవారు, అవసరమైతే, తల్లిదండ్రులను, తోబుట్టువులను, బంధువులను ఆస్తిపాస్తులను విడిచి పెట్టాలని ప్రభువు తెలియజేసారు. సత్యం, ప్రేమ, స్వేచ్చ, న్యాయము అను మార్గములో పయనించాలనుకుంటే, సవాళ్లు ఎదుర్కోవడం తప్పదు! దీర్ఘకాలములో, సత్యం, ప్రేమ, స్వేచ్చ, న్యాయములే ఖచ్చితముగా విజయాన్ని సాధిస్తాయి.

నేడు అనేకచోట్ల హింసాకాండను, యుద్ధవాతావరణాన్ని చూస్తున్నాము. నేటి సువిశేషం, యుద్ధానికి పిలుపునిస్తుంది. అయితే ఈ యుద్ధం ఇతరులపై కాదు. ఈ యుద్ధం, పాపము, అవినీతిపై. మొదటి పఠనములో యిర్మియా ప్రవక్త తప్పుడు ప్రవక్తలకు వ్యతిరేకముగా పోరాటం చేయుచున్నాడు. సత్యానికి కట్టుబడి యున్నాడు. అందుకు అతనిని మట్టి బావిలోనికి త్రోసి వేసారు. అయితే, దేవుడు అతన్ని విడనాడలేదు. ఒక ఇథియోపియను అను విదేశీయుడిని పంపి యిర్మియాను రక్షించాడు. సత్యం, న్యాయం కొరకు పోరాటములో దేవుడు ఎప్పుడు మనతోడుగా ఉంటారు. అందుకే రెండవ పఠనములో "గుండె ధైర్యమును కోల్పోవలదు. నీరసపడి పోవలదు. పాపముతో పోరాడుటలో ఇంకను రక్తము చిందు నంతగా ఎదిరింపలేదు (హెబ్రీ 12:3-4) అని చదువుచున్నాము.

No comments:

Post a Comment