యేసు దివ్యరూపధారణ మహోత్సవం (6 ఆగష్టు)

యేసు దివ్యరూపధారణ మహోత్సవం (6 ఆగష్టు)
దాని 7:9-10, 13-14 లేదా 2 పేతు 1:16-19; లూకా 9:28-36


ఆగస్టు 6 మనం యేసు దివ్యరూపధారణ మహోత్సవాన్ని జరుపుకొంటున్నాము. ఈ పండుగ మన విశ్వాస జీవితంలో చాలా ముఖ్యమైనది. యేసు దివ్యరూపధారణ ఆయన అనుభవించబోయే శ్రమల తర్వాత పొందే పరలోక మహిమకు నిదర్శనం. మనం కూడా పరలోకంలో పంచుకోవాలని ఆశిస్తున్న మహిమకు సూచన. ఈ అద్భుతమైన సంఘటనను గూర్చి మనం, మత్త 17:1-8; మార్కు 9:2-9; లూకా 9:28-36; 2 పేతు 1:16-18లో చదవవచ్చు. యేసు దివ్యరూపధారణ కేవలం ఒక మహిమగల దృశ్యం మాత్రమే కాదు. యేసు తన సిలువ మరణం గురించి, ఆ తరువాత వచ్చే మహిమ గురించి శిష్యులకు తెలియ జేయడానికే, ఈ అద్భుత దివ్యరూపధారణను ప్రదర్శించారు. ఈ లోకంలో బాధలు, కష్టాలు ఎంత నిజమో, చివరికి వచ్చే మహిమ కూడా అంతే నిజం అని యేసు శిష్యులకు స్పష్టం చేశారు.

పండుగ చరిత్ర:

యేసు దివ్యరూపధారణ మహోత్సవం యొక్క చరిత్ర చాలా పురాతనమైనది. ఒకప్పుడు అన్యమత దేవతల పండుగలకు బదులుగా, క్రైస్తవులైన ప్రజలు ఈ పండుగను జరుపుకోవడం మొదలుపెట్టారు. యేసు దివ్యరూపధారణ జరిగిన ప్రదేశమైన ‘తబోరు’ పర్వతంపై, ఈ పండుగ మొదట ప్రారంభమైంది. నాల్గవ శతాబ్దం నుండి, యెరూషలేములోని క్రైస్తవులు తబోరు పర్వతంపై ఒక దేవాలయాన్ని నిర్మించి, అక్కడ ఈ సంఘటనను గుర్తుచేసుకుంటూ పండుగ నిర్వహించేవారు.

తూర్పు ఆర్థోడాక్స్ సంఘంలో ఈ పండుగకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఆరవ శతాబ్దం నుంచే ఈ పండుగను ఆగస్టు 6వ తేదీన జరుపుకోవడం ఒక సంప్రదాయంగా మారింది. ఆగస్టు 6వ తేదీని ఎంచుకోవడానికి కారణం ఏమిటంటే, యేసు పుట్టిన తరువాత 40 రోజులకు శిశువుగా దేవాలయంలో సమర్పించబడినట్లే, దివ్యరూపధారణ జరిగిన తరువాత 40 రోజులకు ఆయన సిలువపై మరణించారు అని ఒక సంప్రదాయం నమ్ముతుంది. ఈ 40 రోజుల వ్యవధి ఉపవాస కాలంలో వస్తుంది కాబట్టి, దానిని ఆగస్టు 6కు మార్చారు. ఈ తేదీ నుంచి 40 రోజులు లెక్కిస్తే, సెప్టెంబర్ 14 వస్తుంది. ఆ రోజున పవిత్ర సిలువ విజయోత్సవ పండుగను జరుపుకుంటారు.

తూర్పు శ్రీసభలో ముఖ్యంగా అర్మేనియాలో ఈ పండగ మూడునుండి ఆరు రోజుల వరకు జరుపుకునేవారు. పశ్చిమ శ్రీసభలో, 9వ శతాబ్దం నుంచి ఈ పండగ ఆచరణలోకి వచ్చినట్లు చరిత్ర చెబుతోంది. రోమన్ కతోలిక సంఘంలో ఈ పండుగ ప్రవేశం నెమ్మదిగా జరిగింది. చాలా శతాబ్దాల పాటు, ఇది కేవలం తూర్పు సంఘాలకే పరిమితమైంది. కాని, 9వ శతాబ్దం నుంచి రోములోకూడా ఈ పండుగను జరుపుకోవడం మొదలుపెట్టారు.

15వ శతాబ్దంలో, క్రైస్తవులు హంగేరీలోని బెల్గ్రేడ్ పట్టణంలో టర్కీ వారితో జరిగిన యుద్ధంలో విజయం సాధించారు. ఈ విజయం ఆగస్టు 6, 1456న జరిగింది. ఈ విజయాన్ని దేవుని దయగా భావించిన పోప్ మూడవ కలిస్తస్, ఆ విజయానికి గుర్తుగా యేసు దివ్యరూపధారణ మహోత్సవాన్ని రోమన్ కతోలిక శ్రీసభలో అధికారికంగా జరపాలని ఆదేశించారు. ఆ విధంగా, ఆగస్టు 6వ తేదీ, రోమన్ కతోలిక శ్రీసభలో ఒక ముఖ్యమైన పండుగగా మారింది.

ఈ విధంగా, యేసు దివ్యరూపధారణ మహోత్సవం మొదట ఒక చిన్న ప్రాంతంలో జరుపుకునే పండుగ నుంచి ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే ముఖ్యమైన పండుగగా మారింది. ఈ పండుగ దేవుని మహిమను, మన విశ్వాసానికి బలమైన పునాదిని గుర్తు చేస్తుంది.

మొదటి పఠనము: యేసు దివ్యరూపధారణ గురించి దానియేలు గ్రంథం కూడా ప్రవచించింది. నేటి మొదటి పఠనంలో, దేవుని మహిమ, ఆయన సింహాసనం, మరియు “మనుష్యకుమారుడు” గురించిన వర్ణనను మనం చూడవచ్చు. ఈ ప్రవచనం యేసు మహిమను గురించే మాట్లాడుతుంది. ఆ "మనుష్యకుమారుడు" యేసు ప్రభువే అని మనకు తెలుసు, ఆయన రాజ్యానికి ఎన్నటికీ అంతం ఉండదు.

దానియేలు గ్రంథం "శాశ్వతజీవి, నరపుత్రుని" గురించిన దర్శనం ద్వారా క్రీస్తు ప్రభువును మనకు పరిచయం చేస్తుంది. ఈ దర్శనంలో ప్రభువు సింహాసనముపై ఆసీనులై ఉండెను. క్రీస్తు ప్రభువే తీర్పరి. క్రీస్తు ప్రభువుని దివ్యరూపము, ఆయన వస్త్రములు, మంచు వలె తెల్లగా ఉండెను. తల వెంట్రుకలు తెల్లని ఉన్నివలె నిర్మలంగా ఉండెను. అగ్ని చక్రముల పైనున్న అతని సింహాసనము అగ్నిజ్వాలలతో మండుచూ ఉండెను. అతని సింహాసనము నుండి, అతని యెదుటి నుండి అగ్నివంటి ప్రవాహము పారుచుండెను. వేలకొలది దూతలు ఆయనకు సేవచేస్తూ చేయుచుండిరి. లక్షల కొలది సైనికులు ఆయన ఎదుట నిలిచి యుండిరి.

ఈ దర్శనంలోన్యాయస్థానము” అంటే, సభ ప్రారంభమైనప్పుడు, క్రీస్తు రెండవ రాకడ రోజున, మనం చేసిన మంచి చెడులను బట్టి తీర్పు జరుగుతుందని అర్థం. అప్పుడు దుష్టులు మంటల్లో కాలిపోతారు, మంచివారు సజీవులుగా ఉంటారు. “మనుష్య కుమారుడు పరిపాలన” అంటే, క్రీస్తు ప్రభువు, పరలోక రాజ్యాన్ని పరిపాలిస్తారు. సకల మానవాళి ఆయనకు స్తుతులు చెల్లిస్తూ, ఆనందంగా శాశ్వత జీవితంలో ఉంటారు. పరలోక రాజ్యానికి ఎన్నటికీ అంతం ఉండదు. ఈ దర్శనం ద్వారా దేవుడు మనకు ఈ సత్యాలను తెలియజేస్తున్నారు.

రెండవ పఠనము: పేతురు తన రెండవ లేఖలో యేసు దివ్యరూపధారణ గురించి చాలా స్పష్టంగా తెలియజేశారు. “మేము కట్టుకథలపై ఆధారపడలేదు. మా కన్నులార మేము ఆయన గొప్ప తనమును కాంచితిమి” అని పేతురు చెప్పారు. ఈ మాటలు దివ్యరూపధారణ సంఘటన ఎంత వాస్తవమో మనకు తెలియజేస్తున్నాయి. మన విశ్వాసం కల్పిత కథల మీద కాదు, కళ్లారా చూసిన నిజమైన సాక్షుల సాక్ష్యం మీద ఆధారపడి ఉందని దీని ద్వారా అర్థమవుతోంది.

సువిశేష పఠనము: దివ్యరూప ధారణకు ముందుగా, యేసు తన శిష్యులతో తన శ్రమలు, మరణం, ఉత్థానం గురించి ప్రస్తావించారు. అప్పుడు శిష్యులు, “అట్లు పలుకరాదని” యేసును వారించారు (మత్త, మార్కు). దీనికి కారణం శిష్యులు యేసును ఒక రాజకీయ నాయకుడిగా, రోమన్ల పాలన నుండి ఇశ్రాయేలును విడిపించే మెస్సయాగా భావించారు. అందుకే, ఈ సంఘటన జరిగిన వెంటనే, యేసు తన దివ్యరూపాన్ని శిష్యులకు చూపించారు. తాము అనుసరిస్తున్నది కేవలం ఒక బోధకుడిని కాదని, దైవమహిమ గల దేవుని కుమారుడిని అని వారికి నమ్మకం కలిగించడానికి ఈ ప్రత్యేకమైన కృపను అనుగ్రహించారు. యేసు శ్రమలు, మరణం తర్వాత మహిమ పొందడం ఖాయమని వారికి భరోసా ఇవ్వడానికే ఈ రూపాంతరం జరిగింది. ఇది శిష్యుల విశ్వాసాన్ని దృఢపరిచింది.

యేసు ప్రభువు తన సిలువ శ్రమలకు ముందు, తన ప్రియ శిష్యులైన పేతురు, యాకోబు, యోహానులను వెంటబెట్టుకొని కైసరియా ఫిలిప్పి నుండి ఎనిమిది రోజుల ప్రయాణం చేసి ఒక ఎత్తైన కొండపైకి వెళ్లారు. ఆ కొండ గలిలీ ప్రదేశంలోని తిబేరియా సరస్సుకు దాదాపు రెండువేల అడుగుల ఎత్తున ఉన్న తబోరు పర్వతం అని క్రీ.శ. 254వ సంవత్సరంలో గుర్తించబడింది.

“అక్కడ వారి యెదుట యేసు రూపాంతరము చెందారు. ఆయన ముఖము సూర్యునివలె ప్రకాశించెను. ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లగా మారాయి. ఆయనతో మోషేఏలీయాలు సంభాషించుచున్నట్లు వారికి కనిపించారు” (మత్త 17:2-3; మార్కు 9:2-3).

మోషే, ధర్మశాస్త్రానికి, ఏలీయా, ప్రవక్తలకు ప్రతినిధులు. వారు యేసు ప్రభువును ఆరాధించి, ఆయనతో సంభాషించారు. అదే సమయంలో, పరలోక తండ్రి స్వరం “ఈయన నా ప్రియమైన కుమారుడు. ఈయనను గూర్చి నేను ఆనంద భరితుడనైతిని. ఈయనను ఆలకింపుడు” (మత్త 17:5; మార్కు 9:7) అని వినిపించింది.

ఈ మాటలు, యేసు నిజముగా ‘దేవుని కుమారుడు’ అని శిష్యులు అర్ధము చేసుకున్న విషయాన్ని ధృవపరిచాయి. “ఈయనను ఆలకింపుడు” అనగా, మనం క్రీస్తు ప్రభువుని బోధనలను మనసుతో ఆలకించి, వాటిని మన జీవితంలో, ఆచరణలో పెట్టాలని, దేవుని వాక్కు మనకు బోధిస్తుంది.

యేసు తన బహిరంగ జీవితాన్ని ప్రారంభించడానికి ముందు, తన శిష్యులైన పేతురు, యాకోబు, యోహానులకు తన మహిమను చూపించారు. రాబోయే కాలంలో తాను అనుభవించబోయే కష్టాలను చూసి వారు భయపడకుండా, తమ విశ్వాసాన్ని దృఢం చేసుకునేందుకు ఈ అద్భుతం వారికి సహాయపడింది. యేసు దివ్యరూపధారణ సంఘటన వారి హృదయాలలో చెరగని ముద్ర వేసింది.

దివ్యరూపధారణలో దాగియున్న పరమార్ధము:

దివ్యరూపధారణలో ఉన్న అంతరార్థం చాలా లోతైనది. శిష్యులు ఇప్పటి వరకు యేసును ఒక బోధకునిగా, నాయకునిగా, రక్షకునిగా, మెస్సయాగా మాత్రమే భావించారు. ఈ సంఘటన ద్వారా యేసు తన నిజ స్వరూపాన్ని వారికి వెల్లడి చేశారు.

దీనివల్ల శిష్యుల విశ్వాసం మరింత దృఢపడింది. ప్రభువులోని దైవత్వాన్ని చూసి వారు బలపడ్డారు. తండ్రి తనకు అప్పగించిన పనిని తాను నెరవేరుస్తున్నానని ఈ సంఘటన ద్వారా యేసు చూపించారు. (యెష 42:1-4, లూకా 9:35, యోహాను 4:34).

అలాగే, మోషే (ధర్మశాస్త్రం), ఏలీయా (ప్రవక్తలు) లతో మాట్లాడటం ద్వారా తాను ధర్మశాస్త్రాన్ని, ప్రవక్తల బోధనలను రద్దు చేయడానికి కాకుండా, వాటిని సంపూర్ణం చేయడానికి వచ్చానని యేసు తెలియజేశారు. (మత్త 5:17).

యేసు దివ్యరూపధారణ పరలోకం గురించిన ఒక రహస్యాన్ని మనకు వెల్లడి చేస్తుంది. పరలోకం అంటే ఏదో ఒక స్థలం కాదు, అది ఒక వ్యక్తి అని, ఆ వ్యక్తి యేసు క్రీస్తు అని ఇది తెలియజేస్తుంది. యేసు ప్రభువే ఆ దైవరాజ్యం. త్రిత్వంలో ఉన్న దేవుడే ఆ పరలోక రాజ్యం, అంటే నిత్యజీవం.

యేసు దివ్యరూపధారణ ఆయన ప్రార్థనా జీవితానికి గొప్ప ఉదాహరణ. ప్రార్థన అనేది తండ్రికి, కుమారుడికి మధ్య ఉన్న అనుబంధాన్ని చూపిస్తుంది. ప్రభువు చేసిన సేవ అంతా కూడా ఆయన ప్రార్థన ఫలితమే.

ప్రియ సహోదరీ సహోదరులారా! యేసు దివ్యరూపధారణ మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. ఈ లోకంలో మనం ఎదుర్కొనే కష్టాలు, శ్రమలు శాశ్వతం కావు. సిలువ తరువాత పునరుత్థానం, బాధల తరువాత మహిమ తప్పకుండా ఉంటాయి.

మన జీవితంలో ‘చీకటి సమయాలు’ వచ్చినప్పుడు, యేసు దివ్యరూపధారణను గుర్తుంచుకుందాం. కొండపై వెలుగు చూసిన శిష్యులలాగే, మన జీవితాల్లో కూడా ఒక వెలుగు ఉంది, అదే క్రీస్తు వెలుగు అని నమ్ముదాం.

దివ్యరూపధారణనుండి మనం నేర్చుకోవాల్సిన కొన్ని పాటాలు:

(1). శిష్యుల భయం మరియు అపార్థం: యేసు మహిమను కళ్లారా చూసిన తర్వాత కూడా, శిష్యులు భయం, గందరగోళం, మరియు అపార్థంతో నిండిపోయారు. పేతురు “ప్రభూ! మనము ఇచ్చట ఉండుట మంచిది. మూడు గుడారాలను నిర్మింతుము” అని పలకడం వారి ఆశ్చర్యానికి, భయానికి స్పష్టమైన నిదర్శనం (లూకా 9:33). దేవుని మహిమను చూసిన తర్వాత కూడా, వారిలో ఉన్న మానవ బలహీనత, భయం కారణంగా యేసు యొక్క రాబోయే సిలువ శ్రమల గురించి అర్థం చేసుకోలేకపోయారు. ఈ సంఘటన, మన జీవితంలో కూడా గొప్ప ఆధ్యాత్మిక అనుభవాలు పొందినప్పటికీ, కొన్నిసార్లు మనం దేవుని సంకల్పాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేమని మనకు గుర్తు చేస్తుంది.

(2). ప్రార్థన యొక్క ప్రాముఖ్యత: యేసు దివ్యరూపధారణ కేవలం ఒక గొప్ప దృశ్యం మాత్రమే కాదు, అది ప్రార్థన యొక్క శక్తికి గొప్ప ఉదాహరణ. యేసు ప్రార్థనలో నిమగ్నమై ఉన్నప్పుడే, ఆయన ముఖం సూర్యునిలా ప్రకాశించింది, వస్త్రాలు వెలుగులా మారాయి. ఇది కేవలం యేసుకే పరిమితం కాదు, మన జీవితంలో కూడా ప్రార్థన ఇలాంటి రూపాంతరాన్ని తీసుకురాగలదు. మనం ప్రార్థనలో గడిపిన ప్రతి క్షణం, మన హృదయాన్ని, మనసును, ఆత్మను శుద్ధి చేసి, క్రీస్తు స్వభావానికి అనుగుణంగా మారుస్తుంది. మన ప్రార్థనా జీవితం ఎంత లోతుగా ఉంటే, దేవుని మహిమను, ఆయన ఉనికిని మనం అంత ఎక్కువగా అనుభవించగలం. ప్రార్థన మన జీవితంలో దేవుని మహిమను చూసే మార్గం.

(3). విశ్వాస జీవితంలో కష్టాల ప్రాముఖ్యత: యేసు దివ్యరూపధారణ తరువాత, కొండ దిగి వచ్చినప్పుడు, అక్కడ ఒక దెయ్యం పట్టిన బాలుడిని శిష్యులు స్వస్థపరచలేకపోయారు (మత్త 17:14-21). ఇది, కేవలం ఒక మహత్తరమైన అనుభవం సరిపోదని, విశ్వాస జీవితంలో సవాళ్లను ఎదుర్కోవడానికి ప్రార్థన, ఉపవాసం అవసరం అని చూపిస్తుంది. మన విశ్వాసం కేవలం “కొండపై” (అనగా మంచి సమయాల్లో) మాత్రమే కాకుండా, లోయలో” (అనగా కష్టాల సమయంలో) కూడా బలంగా ఉండాలని అర్ధమగుచున్నది.

(4). మన జీవితంలో రూపాంతరం: యేసు దివ్యరూపధారణ ఒక చారిత్రక సంఘటన మాత్రమే కాదు, ప్రతి ఒక్కరి జీవితంలో జరగాల్సిన రూపాంతరానికి ఒక ప్రతీక. మనం కూడా ప్రార్థన, దేవుని వాక్యం ద్వారా క్రీస్తులా మారడానికి ప్రయత్నించాలి. మన పాపపు, లోక సంబంధమైన ఆలోచనల నుండి దేవుని మహిమతో నిండిన జీవితానికి రూపాంతరం చెందాలి.

ఈ పండుగ మనందరినీ ఆత్మవిశ్వాసంతో, ధైర్యంతో ముందుకు సాగేలా ప్రోత్సహించుగాక.

1 comment: