పునీత జాన్ మరియ వియాన్ని (ఆగష్టు 4)

పునీత జాన్ మరియ వియాన్ని (ఆగష్టు 4)
గురువుల పాలక పునీతులు (క్రీ.శ. 1786-1859)

 


ఆగష్టు 4వ తారీఖున, గురువులకు పాలక పునీతుడు అయిన పునీత జాన్ మరియ వియాన్ని గారి పండుగను కొనియాడుచున్నాము. ఆయన జీవితం, బోధనలు, మరియు దైవసేవకు ఆయన చేసిన విశేష కృషిని గూర్చి తెలుసుకుందాం!

“యెహెజ్కేలు గ్రంథము 3:17-19: “నరపుత్రుడా! నేను నిన్ను ఇస్రాయేలీయులకు కావలివానినిగా నియమించితిని. నీవు నా హెచ్చరికలను వారికి తెలియజేయుచుండవలెను. నేను ఎవడైన దుర్మార్గుడు 'చచ్చునుఅని చెప్పితిననుకొనుము.  నీవు అతనిని హెచ్చరించి అతడు తన దుష్టత్వమును విడనాడి మరల బ్రతుకునట్లు చేయనందున అతడు పాపిగానే చనిపోయెను అనుకొనుము. అప్పుడు అతని మరణమునకు నీవు బాధ్యుడవగుదువు. కాని నీవు దుష్టుని హెచ్చరించినను అతడు తనపాపము నుండి వైదొలగక ఆ పాపములోనే చచ్చిపోయెనను కొనుము.  అప్పుడు నీ ప్రాణమునకు ముప్పు కలుగదు.”

పునీత జాన్ మరియ వియాన్ని గారి జీవితం ఈ వాక్యాన్ని అద్దం పడుతుంది. ఆయనను చాలామంది జ్ఞానం లేనివారుగా, తెలివితక్కువవారుగా, సాధారణ వ్యక్తిగా తృణీకరించారు. అయితే, దేవుని దృష్టిలో, ఈ లోకం తిరస్కరించినవారే పరలోక రాజ్యంలో సత్కరింపబడతారని, దేవుని ప్రేమను పొందుకుంటారని మనకు అర్ధమగుచున్నది. ఎందుకూ, పనికిరాదని తీసిపారవేసిన రాయే, మూలరాయి అవుతుందని, క్రీస్తు ప్రభువు చెప్పినట్లు, ఈ లోకముచే తిరస్కరింపబడితే, పరలోక రాజ్యమున సత్కరింపబడతాము. దేవుని ప్రేమను చూరగొంటాము. ఆ విధంగా తిరస్కరింపబడిన వారే ‘పునీత జాన్ మరియ వియాన్ని గారు!’ దేవుని సేవ చేయాలనే వారిలో ఉన్న తపన, దేవుని సేవ చేయడములోనే, గొప్పతనం ఉందని, వారు నిర్ణయించుకున్నారు. దేవుని పిలుపును అందుకొని, వారి జీవితాన్ని సార్థకం చేసుకున్నారు. ప్రభువు తనకిచ్చిన బాధ్యతను దేవునికి అనుసరణలో నెరవేర్చారు. క్రీస్తు ప్రభువుని ప్రబోధాల ప్రకారం జీవించిన ఆదర్శమూర్తి పునీత జాన్ మరియ వియాన్నిగారు.

ఫ్రాన్స్ దేశములోని నైరుతి ప్రాంతమైన లయన్స్ నగరానికి ఆరు మైళ్ళ దూరంలోనున్న డర్డిల్లీ గ్రామంలో మే 8, 1786వ సంవత్సరములో, పునీత జాన్ మరియ వియాన్నిగారు జన్మించారు. ఆరుగురిలో మరియ వియాన్ని నాలుగవ వారు. తండ్రి మాత్యూ వియాన్ని వ్యవసాయి. తల్లి పేరు మరియ. కుటుంబము కతోలిక విశ్వాసములో జీవించినది. వారు పేదరికంలో జీవించినను, పేదలకు ఎంతగానో సహాయం చేసేవారు. వియాన్నిగారి ఆధ్యాత్మికతలో ఎదగడానికి తల్లి పాత్ర ప్రశంసనీయం.

వియాన్ని బాల్యం అంతా వ్యవసాయ పనులతోనే గడిచింది. తన చిన్నతనములో ఫ్రెంచ్ విప్లవం కారణముగా గురువులు, సన్యాసులు ఎన్నో ఇబ్బందులకు లోనయ్యారు. రహస్యముగా జీవించేవారు. అలాంటి గురువులు కొనియాడే దివ్యపూజలో జాన్ వియాన్ని పాల్గొనేవాడు. ఆ గురువుల ధైర్యసాహసాలు వియాన్నిని ఎంతగానో ఆకట్టుకున్నాయి. వారిని ‘హీరోలు’గా భావించేవాడు.

వియాన్ని సోదరి కాథరిన్ వివాహానికి, ధనం సమకూర్చడంలో తండ్రి తలమునకలయ్యేవాడు. తన పేదరికం వలన కుమారుడు వియాన్ని చదువులను తండ్రి పెద్దగా పట్టించుకోలేక పోయాడు. అయితే డ్యూజోవర్ పాయింటులో నున్న తన తల్లి తరపు తాతగారింట్లో ఉండి ప్రాధమిక విద్యను అభ్యసించాడు. ఎంతైనా చదువులో వెనకబడి ఉండేవాడు.

వియాన్నిగారు తన 13వ యేట ప్రథమ దివ్యసత్ప్రసాదమును స్వీకరించారు. క్రమంగా గురువు కావాలన్న కాంక్ష అతనిలో పెరిగింది.

1806వ సంవత్సరలో, ‘ఈకల్లీ’ అనే విచారణ గురువు, చార్లెస్ బాల్లీ గారి వద్ద ఉండి గురుశిక్షణ విద్యను పొందారు. చిన్నప్పుడు విద్య సరిగా లేనందునలతీను బాషను నేర్చుకోవడములో చాలా ఇబ్బందులు పడేవారు. కాని, గురువు కావాలన్న, అతని దీక్ష, పట్టుదల ముందు అన్ని అడ్డంకులు చిన్నబోయాయి. తర్ఫీదు పొందుచుండగానే, 1809లో నెపోలియన్ సైన్యములో చేరాలని పిలుపు వచ్చింది. అయితే రెండురోజులకు ముందుగా, అనారోగ్యంపాలై ఆసుపత్రిలో చేరడం వలన వెళ్ళలేక పోయాడు.

ఎన్నో శ్రమలను ఎదుర్కొని, చివరకు గురువిద్యను ముగించుకొని, 1815 ఆగష్టు 12న, తన 29వ యేట, గ్రెనోబుల్ పట్టణ దేవాలయంలో గురుపట్టాభిషేకాన్ని పొందారు. ఆగష్టు 13న, తన ప్రథమ దివ్యపూజాబలిని సమర్పించారు. వీరి గురుపట్టాభిషేకానికి అనుమతి పొందేముందు లయన్స్’కు చెందిన వికార్ జనరల్, “శ్రీసభకు పండితులైన గురువులు మాత్రమే కాదుదైవసేవకు అంకితమైయ్యే గురువులు చాలా అవసరం” అని నొక్కి వొక్కాణించారు.

‘ఎకుల్లి’ అను విచారణలో సహాయక గురువుగా పనిచేసి, 1818వ సంవత్సరంలో, లయన్స్ నగర సమీపమున గల ‘ఆర్స్’ అనే ఓ చిన్న గ్రామంలో విచారణ గురువులుగా నియమితులయ్యారు. ‘ఆర్స్’ గ్రామంలో అప్పటికే క్రైస్తవ విలువలు క్రింది స్థాయికి దిగజారాయి. అంతరించి పోయిన క్రైస్తవ విశ్వాసాన్ని మరలా వెలిగించాల్సిన భాద్యత జాన్ వియాన్ని గారిపై పడింది. ప్రారంభములోనే విచారణలోని పేదలనురోగులను పరామర్శిస్తూ ఉండేవారు. తరచూ గంటల తరబడి దివ్యసత్ప్రసాదం ఎదుట మోకాళ్లూని తన విచారణ ప్రజల యొక్క మనోప్రవర్తనకై, వారు రక్షణ పొందుకోవాలని ప్రార్ధించేవారు. వియాన్ని గారు సరళమైన, సామాన్య ప్రజలందరికీ అర్థమయ్యే రీతిలో దైవబోధ చేసేవారు. తన ప్రసంగాలతో, పాపసంకీర్తనాలతోఆదర్శ సందేశాలతో విచారణ రూపురేఖలను మార్చివేశారు. జాన్ వియాన్ని గారు ఇచ్చే ఆధ్యాత్మిక శిక్షణలో వాళ్ళంతా ఎంతో చక్కగా పాల్గొనేవారు.

బోధించడంలో జాన్ వియాన్నిగారు అలనాటి భోధకులలోకెల్లా మేటి బోధకుడు అనిపించుకున్నారు. గురువుల శిక్షణకు సరైన సదుపాయాలు లోపించిన రోజుల్లో కూడా వారు శ్రమించి అంతటి అర్హతను సంపాదించారు. తన ముక్కుసూటి పట్టుదల వల్ల త్రాగుడునృత్యం పనికి రావనిఅవి పాపానికి హేతువని పట్టుబట్టగా క్రైస్తవులచే తిరస్కరించబడి కష్టాలపాలయ్యారు. పాపాన్ని విడిచిపెట్టి హృదయపరివర్తన చెందమని, దేవునియందు భక్తి విశ్వాసాలు పొందుకునేలాగా జీవించాలని, వారు పశ్చాతాపం పొందుకునేలాగా, అక్కడఉన్న ప్రజల తప్పులను ఎత్తి చూపేవారు.

వియాన్ని గారు అక్కడ ఉన్న  అనాథలకుదిక్కుమొక్కు లేని బాలికలకు దేవాలయం దాపున ఒక పాఠశాలను ప్రారంభించారు. వీటి నిర్వహణకై, పేద ప్రజల అవసరాలకై, వారే స్వయంగా లయన్స్ నగర వీధుల్లో భిక్షాటన చేసిఆర్దిక వనరులు సమకూర్చేవారు. వారిలో భక్తివిస్వాసాలను పెంపొందింప చేశారు.

జాన్ వియాన్నిగారి ప్రార్ధనల వలన ఆత్మారోగ్యంతోపాటుశారీరక స్వస్థతలుకూడా జరగడం విశ్వాసులను అబ్బుర పరచింది. రోజుకు 12 నుండి 18 గంటలు వియాన్నిగారు ఓపికతో పాపసంకీర్తన సంస్కారమును అందించేవారు.

దేవుని కొరకు తపించే వారిని సైతాను  ఎంతగానో శోధిస్తుంది కదా! సైతాను క్రీస్తు ప్రభువు వారిని కూడా శోధించింది. వియాన్నిగారిని సాతాను చాలాసార్లు బాధపెట్టింది. రాత్రి సమయాల్లో భయానక అరుపులు, శబ్దాలు వినిపించేవి. ఇలా సాతానుతో 21 సంవత్సరాలు ఘర్షణ పడి, నిద్రలేమి వలన, అనారోగ్యం వలన వృద్ఢుడిలా కనిపించసాగారు.

వియాన్ని గారు ఏమాత్రం,   అనారోగ్య సమస్యలకు అధైర్యం చెందలేదు. దేవుని కొరకు పనిచేయాలనే దీక్ష పట్టుదలతో వారు ఆత్మస్థైర్యాన్ని కోల్పోలేదు. వారు  వృద్ధాప్యంలో కూడా  ఎంతో చురుకుగా పనిచేశారు. తన వృద్దాప్యంలో కూడా వియాన్నిగారు పిల్లలకు సత్యోపదేశం నేర్పించేవారు. జపమాల పట్ల భక్తిని నేర్పించారు.

చిన్న గ్రామమైన ‘ఆర్స్’, జాన్ వియాన్ని గారి ఎనలేని ఆధ్యాత్మిక కృషి వలన, ప్రపంచ నలుమూలల నుండి ఎంతో మందిని తన ఆధ్యాత్మిక సేవలను పొందుటకై ఆకర్షించినది.

‘ఆర్స్’ విచారణలో 41 సంవత్సరాలు సేవలందించిచివరి రోజుల్లో కేవలం వారాలు మాత్రమే జబ్బున పడ్డారు. అస్వస్థతలో తానిక 3 వారాలు మాత్రమే జీవిస్తానని తన మరణం గురించి ముందుగానే తెలియ జేశారు. 1859 ఆగష్టు 4న, తన 73వ యేట జాన్ వియాన్ని గారు స్వర్గస్తులైనారు. వీరి చివరి ఘడియల్లో,  పీఠ కాపరి మరియు సుమారు 20 మంది గురువులు, వియాన్నిగారి మంచం చుట్టూ నిలబడి ప్రార్థించారు. భక్తి విశ్వాసములతో వీరు ప్రాణమును విడిచి, దైవ సన్నిధికి వెళ్ళారు.

జనవరి 8, 1905వ సంవత్సరంలో, 10వ భక్తినాధ పోపుగారు వియాన్ని గారికి ధన్యత పట్టం ఇవ్వడం జరిగింది. మే 31, 1925వ సంవత్సరంలో, 11వ భక్తినాధ పోపుగారు పునీత పట్టాన్ని ఇవ్వడం జరిగింది. 1929వ సంవత్సరములో, 11వ భక్తినాథ పోపుగారు గురువు ప్రజల మనిషి, ఆత్మల రక్షణ కంటే మరో పని గురువులకు ఉండదు, అందుకు, వియాన్ని గారి జీవితమే ఆదర్శం అని ప్రకటిస్తూ, వియాన్ని గారిని గురువుల పాలక పోషకులుగా ప్రకటించడం జరిగింది.

“పరిశుద్దాత్మచేత నడిపింప బడువారు మాత్రమే, జీవితాలను గ్రహించగలరు.” “దేవునికి సమర్పించనిది ఏదైనను వృధాయే” అని పునీత జాన్ మరియ వియాన్నిగారు చెప్పారు.

పునీత వియాన్ని గారి సుగుణాలు:

1. దాతృత్వం: దేవునిపట్ల ప్రగాఢమైన ప్రేమను, తోటివారిపట్ల కరుణను కలిగి జీవించాడు. తన విచారణ సంఘస్తులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, అంకిత భావముతో ఆధ్యాత్మిక సహాయాన్ని అందించాడు. నిస్వార్ధ ప్రేమతో వారికి సేవలు చేసాడు. ఆయన దాతృత్వం కేవలం ప్రార్థనలకు మాత్రమే పరిమితం కాలేదు. ఆయన నిస్వార్థ ప్రేమతో వారికి సహాయం చేశారు. అంటే, వారి కష్టాల్లో తోడు నిలిచారు, వారి సమస్యలను ఆలకించారు, వారికి ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం అందించారు, అవసరమైనప్పుడు భౌతికంగా కూడా సహాయపడ్డారు. పేదల కోసం పాఠశాలలు ప్రారంభించడం, వాటి నిర్వహణకు స్వయంగా భిక్షాటన చేయడం వంటివి ఆయన దాతృత్వానికి గొప్ప ఉదాహరణలు. ఈ లక్షణం ఒక గురువు తన ప్రజలతో ఎంత సన్నిహితంగా, ప్రేమగా ఉండాలో తెలియజేస్తుంది.

2. వినయం: తన వలన ఎన్ని అద్భుతాలు, స్వస్థతలు జరిగినను, ఎల్లప్పుడూ వినయముతో జీవించాడు. తన బలహీనతలను, పరిమితులను గుర్తించి, ఎల్లప్పుడూ దేవునిపై ఆధారపడి జీవించాడు. ఆయన ద్వారా ఎన్నో అద్భుతాలు, స్వస్థతలు జరిగాయి. సాధారణంగా, ఇలాంటి అసాధారణమైన శక్తులు ఉన్నప్పుడు మనుషులు అహంకారం, గర్వం పెంచుకునే అవకాశం ఉంటుంది. కానీ వియాన్ని గారు మాత్రం ఎల్లప్పుడూ వినయముతో జీవించారు. ఆయన చేసిన గొప్ప పనులన్నీ దైవశక్తి ద్వారానే జరిగాయని, తాను కేవలం ఒక సాధనం మాత్రమేనని ఆయన నమ్మారు. ఈ వినయమే ఆయనను నిజమైన గొప్ప వ్యక్తిగా నిలబెట్టింది.

3. పట్టుదల: పేదరికం, ఫ్రెంచ్ విప్లవం, అనారోగ్యం, పైఅధికారులనుండి వ్యతిరేకత...మొదలగు సవాళ్లు, అడ్డంకులపై సానుకూలముగా పోరాడి, వాటిని ధైర్యముగా ఎదుర్కొని, తన బాధ్యతలను పట్టుదలతో, నిబద్ధతతో నెరవేర్చాడు. ఏదో విధంగా సమస్యను తప్పించుకోవాలని చూడకుండా, దృఢంగా నిలబడి, తన బాధ్యతలను పట్టుదలతో, నిబద్ధతతో నెరవేర్చారు. తమ దైవసేవకు ఎటువంటి అడ్డంకినీ రానివ్వకుండా, చివరి వరకు కృతనిశ్చయంతో పనిచేశారు.

4. దైవభక్తి: వియాన్ని గారికి దేవునిపట్ల నున్న భక్తి, అతని రోజువారి జీవితములో స్పష్టముగా కనిపించేది. రోజులో చాలా సమయాన్ని ప్రార్ధనలో గడిపేవాడు. దివ్యసత్ప్రసాదము పట్ల ఎనలేని భక్తిని కలిగి యుండేవాడు. ఈ భక్తికి నిదర్శనంగా, ఆయన రోజులో చాలా సమయాన్ని ప్రార్థనలో గడిపేవాడు. ఇది కేవలం లాంఛనప్రాయమైన ప్రార్థనలు కాదు, దేవునితో వ్యక్తిగత సంభాషణ. గంటల తరబడి దివ్యసత్ప్రసాదం ముందు మోకరిల్లి ప్రార్థించడం ఆయన భక్తికి నిదర్శనం. దివ్యసత్ప్రసాదము పట్ల ఎనలేని భక్తిని కలిగి యుండేవాడు. దివ్యసత్ప్రసాదం అత్యంత పవిత్రమైనది, క్రీస్తు సాన్నిధ్యంగా భావిస్తాము. దివ్యసత్ప్రసాదం పట్ల ఆయనకు ఉన్న అపారమైన గౌరవం, భక్తి ఆయన దైవభక్తికి ప్రబల నిదర్శనం. ఆయన దైవభక్తి, ఆయన చేసిన సేవకు మూలస్తంభంగా నిలిచింది.

5. సహనం: విచారణ సంఘస్తుల సమస్యలను ఎంతో ఓపికతో, సహనముతో శ్రద్ధగా ఆలకించేవాడు. సహనముతో వారికి ఆధ్యాత్మిక మార్గనిర్దేశం చేసేవాడు. ఆయన తన విచారణ సంఘస్తుల (ఆయన సేవ చేసిన గ్రామంలోని ప్రజలు) సమస్యలను ఎంతో ఓపికతో మరియు సహనముతో శ్రద్ధగా ఆలకించేవాడు. ప్రజలు తమ కష్టాలను, సందేహాలను, పాపాలను ఆయనతో పంచుకున్నప్పుడు, ఆయన తొందరపడకుండా, విసుగు చెందకుండా, వారి మాటలను శ్రద్ధగా వినేవారు. ఇది ప్రజలకు తమపై నమ్మకాన్ని పెంచేది, ఎందుకంటే వారు తమ సమస్యలను తీర్పు లేకుండా పంచుకోవచ్చని వారికి తెలుసు.

6. నిరాడంబరత: వియాన్నిగారు చాలా నిరాడంబరముగా, సరళముగా జీవించాడు. తన జీవనశైలి చాలా సాధారణముగా, సరళముగా, నిరాడంబరముగా ఉండేది. ఏవిధమైన విలాసాలకు, దుర్భల జీవితానికి చోటు ఇచ్చేవాడు కాదు. విశ్వాస విషయాలపై మాత్రమే తన దృష్టిని సారించేవాడు.

7. ఉత్సాహం: విచారణ సంఘస్తులను ఆధ్యాత్మిక పధములో నడుపుటలోను, వారిలో మార్పు, పరివర్తన తీసుకొని రావడములోను, తన ప్రేషిత సేవలోను ఎంతో ఉత్సాహాన్ని చూపించాడు. ఆయన ప్రేషిత సేవలోను ఎంతో ఉత్సాహాన్ని ప్రదర్శించారు. ఏ చిన్న పనిలోనైనా, ఏ పెద్ద కార్యక్రమంలోనైనా ఆయన పూర్తి శక్తితో, ఆనందంతో పాల్గొనేవారు. ఈ ఉత్సాహమే ఆయన సేవను విజయవంతం చేసింది, ప్రజలను ఆకర్షించింది, మరియు ఆర్స్‌ గ్రామంలో ఒక గొప్ప ఆధ్యాత్మిక పునరుజ్జీవనాన్ని తీసుకురావడానికి కారణమైంది.

ప్రియ సహోదరీ సహోదరులారా! దైవసేవకులందరూ, దేవుని విశ్వాసులందరూ, దేవుని యెడల తపన కలిగి, ఆయన యందు విశ్వాసముతో జీవించుట అలవర్చుకొని రక్షింపబడాలి. మరి ముఖ్యంగా, దైవసేవకులు!, సామాన్య ప్రజలందరినీ కూడా దేవుని రక్షణలో భాగస్వామ్యం కల్పించే లాగా, వారి హృదయాలను దేవునికి అర్పించి జీవించే లాగా, వారు దేవుని అనుసరణకై పనిచేసేలాగా, తపించేలాగా, దేవుని కొరకు మరణించడానికైనా తెగించేలాగా పనిచేస్తూ, సామాన్య ప్రజలలో దైవభక్తిని, దైవభయమును, అపారమైన విశ్వాసమును, కలుగజేయాలి. సంఘ కాపరి, సంఘములోని సామాన్యుల తప్పులను హెచ్చరించి, వారి దుష్టత్వమును, పాపమును విడిచి పెట్టి, మరణమునకు ముందే వారు చేసిన తప్పులను తెలుసుకొనే లాగా, చేయాలని దేవుని వాక్కు తెలియజేస్తుంది. కనుక దేవుని సేవకులారా, గురువులారా, దేవుని కొరకు జీవించండి. దేవుని పనులలో నిమగ్నము కండి.

అలాగే, సామాన్య ప్రజలు నాకెందుకులే అని ఉండకుండా కష్టపడండి. కష్టమైనా, నష్టమైనా, ప్రాణహానైనా, దేవుని కొరకు పని చేసి, ఆత్మలు నశించి పోకుండా ఆత్మల రక్షణకై జీవించండి. మనమందరము కూడా దేవుని యందు విశ్వాసముతో భయముతో, భక్తితో మన ఆత్మలను రక్షించుకుందాం. మనము చేసిన తప్పులను ఒప్పుకొని, హృదయపరివర్తనను పొందుకొని, ఆవిధంగా జీవించటానికి, మనమందరమూ, మన హృదయములలో తపన కలిగి, దేవుని రక్షణలో, మనమూ, మన ఇరుగుపొరుగువారూ ఉండాలనే తపనతో జీవించుదాం. ఆమెన్.

No comments:

Post a Comment