పునీత జాన్ మరియ వియాన్ని (ఆగష్టు 4)

 పునీత జాన్ మరియ వియాన్ని (ఆగష్టు 4)
గురువు, విచారణ గురువుల పాలక పునీతులు (క్రీ.శ. 1786-1859)


ఆగష్టు 4న పునీత జాన్ మరియ వియాన్నిగారిని స్మరించుకుంటున్నాము. ఫ్రాన్స్ దేశములోని నైరుతి ప్రాంతమైన లయన్స్ నగరానికి ఆరు మైళ్ళ దూరంలోనున్న డర్డిల్లీ గ్రామంలో పునీత జాన్ మరియ వియాన్ని, మే 8న జన్మించారు. ఆరుగురిలో మరియ వియాన్ని నాలుగవ వారు. తండ్రి మాత్యూ వియాన్ని వ్యవసాయి. తల్లి మరియ. కుటుంబము కతోలిక విశ్వాసములో జీవించినది. పేదలకు ఎంతగానో సహాయం చేసేవారు. మరియ వియాన్ని ఆధ్యాత్మికతలో ఎదగడానికి తల్లి పాత్ర ఎంతగానో ఉన్నది.

వియాన్ని బాల్యం అంతా వ్యవసాయంలోనే గడిచింది. తన చిన్నతనములో ఫ్రెంచ్ విప్లవం కారణముగా గురువులు, సన్యాసులు ఎన్నో ఇబ్బందులకు లోనయ్యారు. రహస్యముగా జీవించేవారు. అలాంటి గురువులు కొనియాడే దివ్యపూజలో వియాన్ని పాల్గొనేవాడు. ఆ గురువుల ధైర్యసాహసాలు వియాన్నిని ఎంతగానో ఆకట్టుకున్నాయి. వారిని ‘హీరోలు’గా భావించేవాడు.

వియాన్ని సోదరి కాథరిన్ పెళ్ళికి ధనం సమకూర్చడంలో తండ్రి తలమునకలయ్యేవాడు. తన పేదరికం వలన కుమారుడు వియాన్ని చదువులను తండ్రి పెద్దగా పట్టించుకోలేక పోయాడు. అయితే డ్యూజోవర్ పాయింటులో నున్న తన తల్లి తరపు తాతగారింట్లో ఉండి ప్రాధమిక విద్యను అభ్యసించాడు. ఎంతైనా చదువులో వెనకబడి ఉండేవాడు.

వియాన్ని తన 13వ ఏట ప్రథమ దివ్యసత్ప్రసాదమును లోకొన్నారు. క్రమంగా గురువు కావాలన్న కాంక్ష వారిలో తీవ్రమైంది. 1802లో నెపోలియన్ బొనపార్తే కతోలిక శ్రీసభను ఫ్రెంచ్’లో పునరుద్దరింప జేశాడు. 1806వ సం.లో, "ఈకల్లీ"విచారణ గురువు అయిన చార్లెస్ బాల్లీ గారి వద్ద ఉండి గురుశిక్షణ విద్యగడిపారు. చిన్నప్పుడు విద్య సరిగా లేనందున, లతీను బాష నేర్చుకోవడములో చాలా ఇబ్బందులు పడ్డాడు. కాని, గురువు కావాలన్న, అతని దీక్ష, పట్టుదల ముందు అన్ని అడ్డంకులను జయించి విద్యాంశాలు నేర్చుకున్నారు. తర్ఫీదు పొందుచుండగానే, 1809లో నెపోలియన్ సైన్యములో చేరాలని పిలుపు వచ్చింది. అయితే రెండురోజులకు ముందుగా, అనారోగ్యంపాలై ఆసుపత్రిలో చేరడం వలన వెళ్ళలేక పోయాడు.

గురువిద్యను ముగించుకొని, 1815 ఆగష్టు 12న గ్రెనోబుల్ పట్టణ దేవాలయంలో గురుపట్టాభిషిక్తులు అయ్యారు. మరుసటిరోజు తన ప్రథమ దివ్యపూజాబలిని సమర్పించారు. వీరి గురుపట్టాభిషేకానికి అనుమతి పొందేముందు లయన్స్’కు చెందిన వికార్ జనరల్ గారు "శ్రీసభ”కు బాగా విద్వాంసులైన గురువులు మాత్రమే కాదు, దైవసేవకు అంకితమైపోయే గురువులు చాలా అవసరం" అని నొక్కి వొక్కాణించారు. లయన్స్ నగరం సమీపంలో "ఆర్స్" అనే ఓ మారుమూల గ్రామంలో విచారణ గురువులుగా నియమితులయ్యారు.

‘ఆర్స్’ గ్రామంలో అప్పటికే క్రైస్తవ విలువలు క్రింది స్థాయికి దిగజారాయి. అంతరించిపోయిన క్రైస్తవ విశ్వాసాన్ని మరలా వెలిగించాల్సిన భాద్యత ఫాదర్ వియాన్ని గారిపై పడింది. ప్రారంభములోనే విచారణలోని పేదలను, రోగులను పరామర్శిస్తూ ఉండేవారు. తరచూ గంటల తరబడి దివ్యసత్ప్రసాదం ఎదుట మోకాళ్లూని తన విచారణ ప్రజల యొక్క మనోప్రవర్తనకై ప్రార్ధించేవారు. తన ప్రసంగాలతో, మంచి పాపసంకీర్తనలతో, ఆదర్శ సందేశాలతో విచారణ రూపురేఖాలను మార్చివే శారు. ఫాదర్ వియాన్ని గారు ఇచ్చే ఆధ్యాత్మిక శిక్షణలో వాళ్ళంతా ఎంతో చక్కగా పాల్గొనేవారు.

బోధించడంలో వియాన్నిగారు ఆనాటి భోధకులలోకెల్లా మేటి బోధకుడు అనిపించుకున్నారు. గురువుల శిక్షణకు సరైన సదుపాయాలు లోపించిన రోజుల్లో కూడా వారు శ్రమించి అంతటి అర్హతను సంపాదించారు. తన ముక్కుసూటి పట్టుదల వల్ల త్రాగుడు, నృత్యం పనికి రాదని, అవి పాపానికి హేతువని పట్టుబట్టగా క్రైస్తవులచే తిరస్కరించబడి కష్టాలపాలయ్యారు.

అనాథలకు, దిక్కు మొక్కు లేని బాలికలకు దేవాలయం దాపున ఒక పాఠశాలను ప్రారంభించారు. వీటి నిర్వహణకై లయన్స్ నగర వీధుల్లో భిక్షాటన చేసి, ఆర్దిక వనరులు సమకూర్చేవారు. వియాన్నిగారి ప్రార్ధనల వలన ఆత్మారోగ్యంతోపాటు, శారీరక స్వస్థతలుకూడా సమకూరడం భక్తులను అబ్బుర పరచింది. రోజుకు 14 నుండి 18 గంటలు వియాన్నిగారు ఓపికతో పాపసంకీర్తన సంస్కారమును అందించేవారు.

వియాన్నిగారు తమ నడివయస్సులో ఉన్నపుడు సాతాను చాలాసార్లు బాధపెట్టింది. రాత్రి సమయాల్లో భయానక అరుపులు, శబ్దాలు వినిపించేవి. ఇలా సాతాను తో 21 సం.లు ఘర్షణ పడి నిద్రలేమి వలన అనేక రోగాల వలన వృద్ఢుడిలా కనిపించసాగారు. తన వృద్దాప్యంలో కూడా వియాన్నిగారు పిల్లలకు సత్యోపదేశం నేర్పించేవారు. జపమాల పట్ల భక్తిని నేర్పించారు.

1845లో వియాన్నిగారిని సాతాను భాదపెట్టడం మానేసింది. ‘ఆర్స్’ విచారణ లో 41 సం.లు సేవలందించాక, చివరి రోజుల్లో కేవలం 3 వారాలు మాత్రమే జబ్బున పడ్డారు. అస్వస్థతలో తానిక 3 వారాలు మాత్రమే జీవిస్తానని తన మరణం గురించి ముందుగానే తెలిపారు. అలాగే జరిగింది. 1859 ఆగష్టు 4వ తేదీన తన 73వ యేట పరమపదించారు.

8 జనవరి 1905 జనవరి 10వ పయస్ పోపుగారు వియాన్ని గారికి ధన్యత పట్టం కట్టారు. తరువాత 1925 మే 31 11వ పయస్ పోపుగారు పునీత పట్టాభిషిక్తుల గావించారు. గురువంటే ప్రజల మనిషని, ప్రజల అవసరాలకు మించిన మరే పని గురువులకు ముఖ్యం కాదని పునీత వియాన్ని గారి జీవితాదర్శం తెలుపుతుంది. అందుకే వీరిని విచారణ గురువుల పాలక పునీతులుగా శ్రీసభ గుర్తించింది. ‘మరియ’ అనగా ఏలినవారు, యజమానురాలు అని అర్ధం.

No comments:

Post a Comment