మరియ మాత జయంతి ఉత్సవం (8 సెప్టెంబరు)

మరియ మాత జయంతి ఉత్సవం (8 సెప్టెంబరు)

సిలువ పై వ్రేలాడుతూ మృత్యు ముఖంలో నున్న యేసు ప్రభువు రక్త సిక్తమైన తన దేహంతో ఒక ప్రక్క లోకపు పాపాన్ని మరోప్రక్క దేవుని కారుణ్యాన్ని భరిస్తూ మానవ దౌర్భల్యానికి, దేవుని వాత్సల్యానికి మధ్యన నలిగి పోతున్న తరుణంలో సిలువ చెంత శోక మూర్తుల్లా నిబడిన ఆయన తల్లి మరియ, ఆయన శిష్యుడు యోహాను ఆయనకు అంతిమ ఓదార్పుగా మిగిలారు. ఆ మహా భయంకరమైన క్షణంలో తండ్రి తనకు అప్పగించిన లోక కార్యాన్ని సంపూర్ణం కావించే ముందు క్రీస్తు ప్రభువు తన తల్లి మరియ మాతను మనందరికి తల్లిగా ఒసగారు (యోహాను 19:26-27). ప్రభువు తల్లితో, ‘‘స్త్రీ, ఇదిగో నీ కుమారుడు’’ తరువాత శిష్యునితో, ‘‘ఇదిగో నీ తల్లి’’ అని పలికాడు. ఇలా మరణావస్థలో ప్రభువు పలికిన మాటలు తన తల్లి పట్ల తనకు గల ప్రేమాభిమానమును వ్యక్తం చేయటమేగాక, ప్రధానంగా మరియతల్లికి అప్పగింప బడనున్న రక్షణ ప్రణాలికను వెల్లడిస్తున్నాయి.

ప్రభువు తన తల్లిని మన తల్లిగా అప్పగించి అనంతరం అంతయు పరిపూర్తియైనదని గ్రహించి, ‘‘అంతయు సమాప్తమైనది’’ (యోహాను 19:28) అని పలికి ప్రాణం విడిచారు. ఇలా మరియ మాతను లోకమాతగా ప్రకటించడం, లోక రక్షణ బాధ్యతను మరియ తల్లికి అప్పగించి వెళ్ళడం, రక్షణ ప్రణాలికలో భాగమే అని ప్రభువు పరోక్షంగా తెలియ జేస్తున్నారు.

సృష్టి ఆరంభంలోనే ఎప్పుడైతే ఆది తల్లిదండ్రులు దేవుని మాటకు వ్యతిరేకంగా పాపము చేశారో అప్పుడే దేవుడు మరియ తల్లిని రక్షణ ప్రణాలికలో భాగంగా ఎన్నుకోవడం జరిగింది. అందుకే ‘‘నీకును స్త్రీకిని, నీ సంతతికిని, స్త్రీ సంతతికిని తీరని వైరము కలుగును’’ (ఆ.కాం. 3:15) అని దేవుడు పలికాడు. రక్షణ ప్రణాలికలో ఆ మరియ తల్లి పాత్ర లేకపోతే, అనాడు తండ్రి దేవుడు నీకును స్త్రీకిని అనకుండా స్త్రీ సంతతికి, నీ సంతతికిఅని పలికే వాడు కదా! దేవుడు ఆవిధంగా పలకడంలో పరమార్ధం రక్షణ ప్రణాలికలో మరియ తల్లి సైతానుతో పోరాడుతుందని అర్ధం. అనగా మరియ తల్లి ఎన్నిక అప్పుడే జరిగింది.

అందుకే, ఎన్నో సంవత్సరాలుగా బిడ్డలు లేక బాధపడుతున్న అన్నమ్మ జ్వాకీములకు పవిత్రాత్మ వరం వలన జన్మించింది మరియ తల్లి. ఆ పుణ్య దంపతుల ప్రేమ, అనురాగాలతో పెరుగుతూ మంచి నడవడికను, క్రమశిక్షణను, వినయం విధేయత అను సుగుణాలను అవరచుకున్నది. ముఖ్యంగా తన ప్రార్ధనా జీవితం ద్వారా చిన్నతనం నుండే దేవునికి ప్రియమైన బిడ్డగా జీవించింది. ప్రభువు కార్యాన్ని నిర్వర్తించడానికి సిద్ధపడినది. ఎప్పుడైతే గబ్రియేలు దూత వచ్చి తండ్రి దేవుని సందేశాన్ని మరియ తల్లికి తెలియ జేసిందో, ‘‘నేను ప్రభువు దాసిరాను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక’’ (లూకా 1:38) అని తండ్రి మాటను విధేయించింది.

తల్లి లేని బిడ్డలుగా మనం ఈ లోకంలో జీవన యాత్రను కొనసాగించడం ప్రభువునకు ఇష్టం లేదు. కనుకనే, మనను ఆ తల్లి చెంతకు నడిపించి మన రక్షణ భారాన్ని ఆ తల్లికి అప్పగించారు. ఆ తల్లి నిత్యం మనతో ఉంటూ మన అనుదిన జీవనంలో పాలు పంచుకొంటూ మనను దేవుని ప్రేమతో నింపుతూ ఆ ప్రభుని దరికి చేరుస్తుంది.

కనుక, మనం మన కన్నతల్లి పట్ల ఏవిధంగా ప్రేమ చూపించి మనకు కావసిన అవసరాలను అడుగుటకు వెనకాడమో, అంతకంటే ఎక్కువ ప్రేమను మరియ తల్లి పట్ల చూపుతూ మనకు కావసిన అవసరాలను ఆ తల్లితో విన్నవించు కొంటూ ఆ తల్లిని అంటి పెట్టుకొని జీవిద్దాం.

1 comment: