ఆగమనకాల మూడవ ఆదివారం, YEAR C

ఆగమనకాల మూడవ ఆదివారం, YEAR C
జెఫన్యా 3:14-18; ఫిలిప్పీ 4:4-7; లూకా 3:10-18

ప్రభువునందు మీరు ఎల్లప్పుడును ఆనందింపుడు! మరల చెప్పుచున్నాను!
ప్రభువు త్వరలో విచ్చేయుచున్నాడు."
[ఆనంద ఆదివారము, Gaudete Sunday]
సంతోషం / ఆనందం / పరమానందము


ఈరోజు ఆగమన కాల మూడవ ఆదివారము. దీనికి ఆనంద ఆదివారము అని పేరు. క్రిస్మస్ పండుగ / క్రీస్తురాక దగ్గర పడుచున్నందు వలన, మనం ఆనంద పడాలి అని తల్లి శ్రీసభ మనలను కోరుచున్నది. అయితే, అప్పుడే మన సంసిద్ధత ముగిసిందని కాదు. త్వరలోనే మన సంసిద్ధతకు దేవుడు మనలను దీవిస్తాడని ఆనందించాలి. కనుక ఇంకా మనం తీక్షణముగా క్రీస్తురాకకై సంసిద్ధ పడాలి. క్రీస్తునందు నిజమైన, సంపూర్ణ ఆనందాన్ని ధ్యేయముగా, లక్ష్యముగా చేసుకోవాలని ఈనాటి పఠనాలు బోధిస్తున్నాయి. మారుమనస్సు, మరోమార్గం, మంచిమార్గం, మంచిజీవితం అని ఎడారిలో బోధిస్తున్న యోహాను సందేశమును వినుటకు వచ్చినవారు, యోహాను సందేశమునకు స్పందించి, ఆ సంతోష జీవితమును పొందుటకు "మేము ఏమి చేయవలెనను" అని ప్రశ్నించారు. ఆ ప్రశ్నను ఈనాటి ధ్యానంశముగా చేసుకొని, ఈ ప్రశ్నకు సమాధానమును సువార్తలోను, మొదటి రెండు పఠనాలలోనూ చూద్దాం!

సంతోషమునకు కారణములెన్నో ఉన్నాయి (ఉంటాయి). ఏదైనా పొందినప్పుడు, అనుకున్నది సాధించినప్పుడు, ప్రేమగా చూసే వారి చెంత ఉన్నప్పుడు, మనలను అర్ధం చేసుకొనే వారున్నప్పుడు... ఇలా ఎన్నో!

మొదటి పఠనములోజెఫన్యా ప్రవక్త ఇస్రాయేలీయులతో "ఆనందించండి, హర్షద్వానము చేయండి, నిండు హృదయముతో సంతసించండి" అని ఆనంద గీతాన్ని పలుకుచున్నాడు. ఎందుకనగా, వారికి విధించబడిన తీర్పు, శిక్ష తొలగించబడినవి. వారి శత్రువును ప్రభువు చెల్లాచెదరు చేసెను. అన్నటికంటే ముఖ్యముగా "ప్రభువు మీ మధ్యనే ఉన్నారు" అని జెఫన్యా ప్రవక్త తెలియజేయుచున్నారు.

ప్రభువు మీ చెంతనే ఉన్నారు, ప్రభువు మీతోనే ఉన్నారు. అందుకే భయపడకుడి. దైవభయం (భీతి) తప్ప ఏ భయం ఉండకూడదు. నిర్భయముగా ఉండండి. మీ చేతులను వ్రేలాడ నీయకుము అని జెఫన్యా ప్రవక్త తెలియజేయు చున్నారు. చేతులను వ్రేలాడనీయడం అనగా శక్తి లేక, బలము లేక, పోరాడక, చేస్తున్న పనిని వదిలి వేయడం అని అర్ధం. కనుక, మీలో సత్తువ సన్నగిల్లినను, మీతో ఉన్న ప్రభువు మీచేత మంచి కార్యములు జరిగిస్తాడు. మీ సంతోషమును మీ ద్వారా ఇతరులకు సంతోషమును కలుగ జేస్తారు. చితికిన, నలిగిన, విరిగిన మీ పైనే ప్రభువు అండగా ఉండి సంతోషమును కలుగ జేస్తారు. అలాగే, ప్రభువు, న్యాయము, స్వతంత్రము, శాంతితో వస్తున్నాడు, కనుక ఆనందపడాలి.

దైవప్రజలు దేవున్ని ఎడబాసి అన్యదేవుళ్ళను కొలుస్తున్నారు. అలాంటి సందర్భములో, వారి జీవితములో గొప్ప మార్పు సంభవించబోతున్నదని జెఫన్యా ప్రవక్త తెలియజేయు చున్నాడు. వారిలో ఓ గొప్ప ఆశను నింపుచున్నాడు. ఆ ఆశ కొరకే మనం మెస్సయ్య అయిన క్రీస్తు కొరకు ఎదురుచూస్తూ ఉన్నాము.

అందుకే ఇశ్రాయేలు జనమా, యేరూషలేము నగరమా, సియోను కుమారీ! సంతసించండి. సంతోషముగా ఉండటానికి ఆయన కీర్తనలు పాడండి. ఆయన మీతో, మీలో ఉన్నారని గుర్తించండి. ఆయన రాజుగా, అధిపతిగా, నాయకుడిగా ముందుండి మనతో ఉండి నడిపిస్తున్నాడని తెలుసుకోండి. ఎవరులేకున్నా ఆయన ఉన్నాడని, ఉంటాడని విశ్వసించండి. సంతోషముగా ఉండటానికి ఈ ఒక్క కారణం చాలదా?

రెండవ పఠనములో, పునీత పౌలు ఇదే సంతోషాన్ని ధృఢపరుస్తున్నారు. అనుభవపూర్వకముగా ఆయన మనకిస్తున్న సందేశమిది. క్రీస్తు సందేశమును భోధించినందుకు, ఖైదీగా ఉండి, శిక్ష (మరణ శిక్ష) విధించబడి, ఆ శిక్ష అమలుకొరకు ఎదురు చూస్తున్న పౌలు వ్రాసిన సందేశమిది. ఆయనలో విచారము లేదు, దు:ఖము లేదు, ఆతురత అంతకంటే లేదు. ఎందుకంటే, ఈ సమయములోనే ప్రభువుయొక్క సన్నిధిని, సహవాసమును, ఆదరణను, ప్రేమను ఆయన అనుభవించారు. ఆ అనుభవముతో చెప్పిన (వ్రాసిన) సందేశమే, "ఆనందించండి, ప్రభువునందు ఎల్లప్పుడును ఆనందించండి" (ఫిలిప్పీ 4:4). ఎందుకంటే, ప్రభువుకు సాధ్యము కానిది ఏదీలేదు (చూ. లూకా 1:37, యిర్మి 32:27). ఆయన ఆధీనములో లేని పరిస్థితి ఏదీలేదు. ఎటువంటి పరిస్థితి ఎదురైనా, ధైర్యముగా ఎదుర్కొనండి. విచారించకండి. విచారము మిమ్ము దేవునినుండి దూరం చేస్తుంది. కాబట్టి, కృతజ్ఞతతో కూడిన ప్రార్ధనతో దేవునికి దగ్గరగా రండు. ఆయన మీతో ఉన్నాడని తెలుసుకోండి. అప్పుడు మీకు సమాధానం, దేవుని శాంతి మీ హృదయములను, మనస్సులను భద్రముగా ఉంచుతుంది. ఇంతకంటే, ఇంకా ఏమి కావాలి సంతోషముగా ఉండటానికి? పౌలు ప్రభువు రెండవ రాకడ గురించి ఎదురుచూసే సందర్భమున, ప్రభువు రాకతో కలుగు సంపూర్ణ ఆనందము (పరమానందము), సమాధానము గురించి చెప్పుచున్నారు.

సువిశేష పఠనములో, "మేము ఏమి చేయవలయును?", “మా కర్తవ్యము ఏమి?" (లూకా 3:10,12,14) అని అడిగిన వారికి సంతోషము గురించి, ఆనందము గురించి బప్తిస్మ యోహాను తనదైన శైలిలో జనులకు, సుంకరులకు, రక్షక భటులకు తెలియజేయు చున్నాడు: సామాన్య జనులు దుస్తులను, భోజన పదార్ధములను ఏమీ లేనివారితో పంచుకోవాలి; సుంకరులు నిర్ణయింప బడిన పన్నుకంటే అధికముగా ఏమియు తీసికొనవలదు (చదువుము మత్త. 16:26; 1 తిమో 6;10); రక్షకభటులు బలాత్కారముగా గాని, అన్యాయారోపణ వలన గాని, ఎవ్వరిని కొల్లగొట్ట వలదు. వేతనముతో సంతృప్తి పడుడు.

వారి జీవితాలను, దానికి కావలసిన పనిని మానుకోమని యోహానుగారు చెప్పడంలేదు. దానిని నిజాయితీగా చేయమని చెబుతున్నాడు. ఇప్పటి వరకు వీరు ఎంత ఎక్కువ ఇతరులనుండి పొందితే అంత ఎక్కువ సంతోషం తమ స్వంతమవుతుందని అనుకొన్నారు. దానికి భిన్నముగా యోహానుగారు నిజమైన సంతోషం 'ఇవ్వడములో' ఉన్నదని బోధిస్తున్నారు. ఇప్పటి వరకు పొందాలని (ఎక్కువ పొందాలని) తమ వారినుండి దూరమయ్యారు. ఇకనుండి ఇస్తూ, తమకున్న దానిని ఇతరులతో పంచుకొంటూ సంతోషాన్ని పొందండని, దేవుని ప్రత్యక్షతను (సన్నిధిని) అవసరం ఉన్న ప్రతీ సోదరిలోను, సోదరునిలోను గుర్తించి, అనుభవించండని పిలుపునిస్తున్నాడు. అలాగే, నిజమైన సంతోషమును ఒసగు మెస్సయ్య రాక కొరకు ప్రజలను సంసిద్ధం చేయుచున్నాడు (పశ్చాత్తాపం, మారుమనస్సు, హృదయ పరివర్తన, జీవితశైలిలో మార్పు, జీవితములో పునరుద్ధరణ, జ్ఞానస్నానం).

మనం ఏమిచేద్ధాము? మనకు సాధ్యమయ్యే చిన్నచిన్న విషయాలనే, చాలా సాధారణమైన విషయాలనే చేయాలని యోహాను చెప్పారు. వాటిని హృదయపూర్వకముగా, చిత్తశుద్ధితో చేయాలి. మన బాధ్యతలను సక్రమముగా, సరిగా నిర్వహించుదాం. సోదరప్రేమతో జీవిద్దాం (చదువుము అ.కా. 2:36-39).

క్రైస్తవ ఆనందం దేవుని వరం. ఎవరుకూడా దానిని మనలనుండి తీసివేయలేరు. నిజమైన ఆనందం క్రీస్తునందే! తన మరణం, ఉత్థానం ద్వారా, మనకు నిజమైన స్వర్గీయ ఆనందాన్ని ఒసగాడు. ఆ సంపూర్ణ ఆనందాన్ని పొందాలంటే, యోహాను బోధించిన విధముగా, హృదయపరివర్తన చెందాలి. దేవుని వైపునకు మరలాలి. అన్యాయాన్ని అధిగమించి, న్యాయపరమైన సమాజాన్ని నిర్మించాలి. మన ప్రవర్తనలో నీతి, న్యాయం, నిజాయితీ, నైతికత ఉండాలి.

యోహాను గొప్ప వినయం: యోహాను బోధనలను విన్న ప్రజలు ఈ యోహానే క్రీస్తేమో! అని తమలోతాము ఆలోచించు కొన్నారు. ఇచ్చట యోహాను వినయాన్ని ఆదర్శముగా తీసుకోవాలి. తననుతాను తగ్గించుకొని, "నేను ఆయన పాదరక్షల వారును విప్పుటకైనను యోగ్యుడను కాను" అని ప్రజలకు స్పష్టం చేసాడు. రానున్నవాడు పవిత్రాత్మతోను, అగ్నితోను జ్ఞానస్నానము చేయించును. ఆ అగ్ని చెడును ధ్వంసముచేసి మంచిని పోషించును. ఆత్మ మనలను దేవుని బిడ్డలుగా చేయును. అది నిజమైన సంతోషం! కనుక, మనం పవిత్రాత్మ కొరకు ప్రార్ధన చేయాలి (చదువుము యోహాను 14:16). అలాగే, మనము  మన జీవితముద్వారా, మన క్రియలద్వారా, ప్రభువును హెచ్చించాలి, దేవున్ని మహిమ పరచాలి.

తీర్పు దినమున (లూకా 3:17) మనలను తూర్పారబట్టుటకు క్రీస్తు చేతియందు చేట సిద్ధముగా ఉన్నది. కనుక, మంచి జీవితముద్వారా, గింజలవలె గిడ్డంగులలో అనగా దైవరాజ్యములో ప్రవేశించుదాం. చెడు జీవితమును జీవిస్తే, పొట్టువలె అగ్నిలో వేసి కాల్చివేయబడతాము. కనుక, ప్రభువును కలుసుకొనుటకు సంసిద్ధ పడదాం. పవిత్ర జీవితముతో ప్రభువును ఆహ్వానిద్దాం.

ఓ సర్వేశ్వరా! ఈ ప్రజలు రక్షకుని రాకకై ఉత్సాహముతో వేచియుండుట మీరు కాంచుచున్నారు. అట్టి ఘన రక్షణానందమును చేరుకొనను, ఆ ఉత్సవములను ఎల్లప్పుడు గొప్ప వేడుకతో చేసికొనను, మాకు మీ కృపను ప్రసాదింపుడు.

1 comment:

  1. Excellent sermon. Thank YOU for sharing with us. Continue your social media evangilization.

    ReplyDelete