పునీత జోజప్పగారి పండుగ (మార్చి 19)

పునీత జోజప్పగారి పండుగ (మార్చి 19)

2సమూ7:4-5, 12-14, 16; రోమీ 4:13, 16-18, 22; మత్త 1:16, 18-21, 24



కన్య మరియ సంరక్షక భర్త
బాల యేసుకు సాకుడు తండ్రి
విశ్వ శ్రీసభ పాలకపోషకుడు
కార్మిక వర్గ పాలక పునీతుడు
పునీత జోజప్పగారు!

ఉపోద్ఘాతము: ‘యోసేపు’ లేదా ‘జోజప్ప’ అనగా ‘కలుపుకొను’ లేదా ‘దేవుడు సమృద్ది చేయును’ అని అర్ధం. యోసేపు కన్యమరియమ్మకు జ్ఞానభర్త, యేసుకు సాకుడు తండ్రి. ఇంత గొప్ప వ్యక్తి పండుగను మార్చి 19న కొనియాడు చున్నాము. యోసేపు గురించి బైబులులో చాలా తక్కువగా వ్రాయబడటం వలన, మనం ఆయన గురించి చాలా తక్కువ శ్రద్ధను చూపుతూ ఉంటాము. ఆయనపట్ల భక్తిని పెంపొందించుట చాలా అరుదు! పవిత్ర కుటుంబములో మరచిపోబడినవారు! యోసేపు, మరియలను మనం ఎప్పుడు కూడా ఒక జంటగా గుర్తించాలి.

1962వ సం.లోనే 23వ జాన్ జగద్గురువులు, రోమీయ క్రమములో (ప్రస్తుత ప్రధమ కృతజ్ఞతార్చన ప్రార్ధన) యోసేపు నామమును చేర్చడం గమనార్హం! నేడు ఇతర కృతజ్ఞతార్చన ప్రార్ధనలలో కూడా పునీత జోజప్పగారిని స్మరించుకుంటున్నాము. యోసేపు మరియభర్త కనుక, యేసునకు తండ్రి!

బాలయేసు దేవాలయములో తప్పిపోయినప్పుడు, మరియ యేసుతో, “నీ తండ్రియు, నేనును విచారముతో నిన్ను వెదుకుచుంటిమి” (లూకా 2:48) అని చెప్పినది. “యేసు జ్ఞానమందును, ప్రాయమందును వర్దిల్లుటకు” (లూకా 2:52) యోసేపు కృషి ఎనలేనిది!

యూదసంప్రదాయములో ఐదు సం.లు నిండిన పిల్లలు, తండ్రుల ప్రత్యేకమైన సంరక్షణలో ఉండేవారు. యోసేపు యూదమత విశ్వాసాన్ని, బోధనలను యేసుకు బోధించాడనడములో ఎంతమాత్రము అతిశయోక్తి లేదు! యోసేపు తన కుటుంబాన్ని దేవుని మార్గములో నడిపించాడు. యేసుకు ప్రాయము వచ్చినప్పుడు, యోసేపే యేసును యూద ప్రార్ధనా మందిరమునకు (సినగోగు) పరిచయం చేసియుంటాడు. యోసేపు వండ్రంగి, కనుక వండ్రంగి పని నైపుణ్యాలను కూడా యేసునకు నేర్పియుంటాడు. “మీలో ఏ తండ్రియైన కుమారుడు చేపను అడిగినచో పామును ఇచ్చునా? గ్రుడ్డును అడిగినచో తేలును ఇచ్చునా” (లూకా 11:11-12) అని చెప్పినప్పుడు యోసేపు ప్రేమ, ఆప్యాయతలు యేసు మదిలో మెదిలి ఉంటాయి! “తప్పిపోయిన కుమారుడు” (లూకా 15) ఉపమానం చెప్పినప్పుడు, యోసేపు తండ్రి ప్రేమను యేసు గుర్తుకు చేసుకొని యుంటారు!

పండగ ఆవిర్భావం-యోసేపుపట్ల గౌరవం: యోసేపునకు సంబంధించిన పండుగ ఐదవ శతాబ్దములో ‘కోప్టిక్ దైవార్చన కాలెండరు’లో మొదటిసారిగా ప్రస్తావించ బడినది. 8 వందల సంవత్సరములలో మొదటిసారిగా ఫ్రెంచ్ కాలెండరులో కనిపిస్తుంది. అనేక శతాబ్దాలుగా యోసేపునకు ప్రాముఖ్యత ఇవ్వబడలేదు. 16వ శతాబ్ధములోనే అతని ఆరాధనకు అధికారిక ప్రోత్సాహం ఇవ్వబడినది. ఆధునిక కాలములో అత్యంత ప్రజాదరణ పొందిన పునీతులలో యోసేపు ఒకరు.

మరియ భర్తయగు పునీత యోసేపుగారి మహోత్సవమును 9వ భక్తినాధ జగద్గురువులు 1847లో ప్రారంభించారు. క్రీ.శ. 1869-70లో జరిగిన ప్రధమ వాటికన్ మహాసభలో, 9వ భక్తినాధ జగద్గురువులు పునీత యోసేపుగారిని “విశ్వశ్రీసభ పాలక పోషకుడు”గా ప్రకటించారు. అలాగే, శ్రీసభ “ఆస్తిపాస్తులకు సంరక్షకులు”గా ప్రకటించారు. క్రీ.శ. 1955లో 12వ భక్తినాధ జగద్గురువులు యోసేపుగారిని “కార్మికుల పాలకుడు”గా గౌరవించారు. మంచి మరణాన్ని కోరుకునే వారందరూ పునీత యోసేపుగారిని ప్రత్యేకంగా ప్రార్ధిస్తారు. 1989వ సంవత్సరములో రెండవ జాన్ పౌలు జగద్గురువు యోసేపు “రక్షకుని సంరక్షుకుడు” అని గౌరవించారు.

“యోసేపుద్వారా మరియ వద్దకు, మరియద్వారా, పవిత్రతకు ఊటయైన యేసు వద్దకు మనం నడిపించ బడుచున్నాము” అని 15వ బెనెడిక్ట్ జగద్గురువులు యోసేపు పట్ల భక్తిని వెల్లడించారు.

“కొంతమంది పునీతులు వాళ్ళ ప్రత్యేక కార్యసాధకతతో కొన్ని అవసరాల్లో మాత్రమే వారి సహకారాన్ని మనకందిస్తారు. కాని, మన పవిత్ర పాలకులైన యోసేపు ప్రతీ అవసరంలోను, ప్రతీ పనిలోను, ప్రతీ సందర్భములోను మనకు సహాయం చేసే శక్తి కలిగియున్నారు” అని పునీత థామస్‌ అక్వినాస్‌ కొనియాడారు.

“పునీత యోసేపుగారిని అడిగినదంతా నేను ఎన్నడూ పొందకుండా లేను. దీనిని నమ్మనివారు పరీక్షించుకోవచ్చును. ఆ పరమపితా పితృని గౌరవించుట ఎంతో మేలని తెలుసుకొందురు” అని పునీత తెరేసమ్మ వెల్లడి చేసారు.

యోసేపు జ్ఞానభర్త, సాకుడు తండ్రి: యోసేపు బెత్లేహేములో జన్మించారు. యోసేపుకు చాలా పెద్దవయస్సు ఉన్నప్పుడు కన్యమరియతో ప్రధానం జరిగిందని తెలుస్తుంది. అప్పటికి మరియ వయస్సు 14 సంవత్సరములు ఉండవచ్చు. గాబ్రియేలు దేవదూత శుభవర్తమానాన్ని మరియమ్మగారికి అందించక మునుపే ఈ నిశ్చితార్ధం జరిగింది.

“దేవుడు యోసేపును కన్య మరియకు జీవిత భాగస్వామిగా ఒసగాడు. మరియకు తోడుగా, ఆమె కన్యత్వమునకు సాక్షిగా, ఆమె గౌరవానికి సంరక్షకునిగా నిలిచాడు” అని 13వ సింహరాయ జగద్గురువులు పేర్కొన్నారు.

యేసుక్రీస్తు సువార్త ప్రచారం ఆరంభించక మునుపే, నజరేతు గ్రామంలో క్రీ.శ. 20లో యేసు, మరియ హస్తాలలో తమ వయోభారంతో పరిశుద్దమైన సహజ మరణం పొందారు.

యోసేపు బాధ్యతగల జ్ఞానభర్తగా, మంచి సాకుడు తండ్రిగా అత్యుత్తమ బాధ్యతాయుతముగా, లోకరక్షకునికే సంరక్షకుడుగా యున్నారని సువార్తలద్వారా గ్రహించ గలుగుతున్నాము. మత్త 1:17 ప్రకారం, యేసుక్రీస్తు వంశావళిలో అబ్రహామునుండి దావీదు వంశము వరకు యోసేపు ముందు తరాల పేర్లు ఇవ్వబడినవి. అయితే యోసేపు మరియతో వివాహానికి నిశ్చితార్ధం జరిగాక, వారు సంసార పక్షంగా కాపురం చేయకముందే మరియమ్మ గర్భవతి కావడం యోసేపును ఎంతగానో కలచి వేసింది. మరియమ్మను నొప్పింపక, అవమానింపక, రహస్యంగా పరిత్యజించి మెల్లగా తప్పుకోవాలనే ప్రయత్నం చేసినట్లు మత్త 1:19లో చెప్పబడినది. ఇక్కడ యోసేపు గంభీర వ్యక్తిత్వం, ఘర్షణ ధోరణిలేని సాధుత్వం, పుట్టుకతో వచ్చిన సహజమైన పాపభీతి ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. పిమ్మట ప్రభువు దూత మాటప్రకారం, మారుమాటలాడక మరియను చేర్చుకున్నారు. ఇక్కడే వారు తమ బాధ్యత, విధేయత, పరిశుద్దతకు పూర్తిగా లోబడి దైవాజ్ఞలను తు.చ. తప్పక పాటించారు. ఇదే వారి విశ్వసనీయత, విజ్ఞత, ఘనత.

మనుష్యావతారమెత్తిన యేసుక్రీస్తుకు, మరియమాతకు సంరక్షకుడుగా, బాలయేసుకు సాకుడు తండ్రిగా యోసేపు గురించి సువార్తలు వెల్లడిస్తున్నాయి. కాని, యోసేపు మాత్రం సువార్తల్లో ఎక్కడా ఒకమాటైనా మాట్లాడినట్లు లేదు. వారి ప్రవర్తన, చేసే పనిని నిర్వర్తించడంబట్టి దైవాదేశానుసారముగా జీవించాడని ఖచ్చితముగా చెప్పవచ్చు. గొప్ప విశ్వాసం, విరక్తత్వం, విధేయత, శ్రమైక జీవితం, బాధ్యతా పాలన, వివేకం, వివేచనం, మితవ్యయం, మితభాషిత్వం, తననుతాను తగ్గించుకొనడం, దయ, దానధర్మగుణం, ఆపదలోనున్న వారిని ఆదుకోవడం, నిగర్వం, నిశ్చలత, నిరాడంబరత్వం ఇలా మంచి గుణాలన్నీ పుణికిపుచ్చుకున్న మహా మనిషి పునీత జోజప్పగారు!

యోసేపు సుగుణాలు

నీతిమంతుడు: సువార్తలలో జోజప్పగారు న్యాయవర్తనుడు, నీతిమంతుడు అని అర్ధమగుచున్నది.
పునీత రెండవ జాన్ పాల్ జగద్గురువులు, శ్రీసభకు రాసిన లేఖలో (రెడెంప్తోరిస్ కుస్తోస్ 1989), పునీత యోసేపుగూర్చి, “లోక సర్వేశ్వరునికి సంరక్షకుడు అంటే అతడు చాలా పరిశుద్ధుడు, పవిత్రుడు, సాధుశీలుడు, వినమ్ర హృదయుడు. నిర్మలత్వం, నిష్కపటత్వము మొదలైన సుగుణాలతో కూడిన వ్యక్తిత్వం కలవారు” అని ప్రశంసించారు.

వాస్తవానికి జోజప్పగారు నీతిమంతుడు, ప్రార్ధనాపరుడు, విశ్వాసములో జీవించేవాడు. మత్త 1:19లో, యోసేపు “నీతిమంతుడు”

అని చదువు చున్నాము. యోసేపు “నీతిమంతుడు” అని పిలవటం వెనుక ఎన్నో కారణాలు ఉన్నాయి.

యూదుల సంప్రదాయాలలో వివాహానికి ఒక చక్కటి విశిష్టత ఉన్నది. వివాహానికి కొద్ది నెలల ముందు యూదులు దేవుని, కుటుంబీకుల సమక్షంలో నిశ్చితార్థాన్ని కొనియాడేవారు. ఈ నిశ్చితార్థం పూర్తయిన కొన్ని నెలల తర్వాత వివాహాన్ని ఆచరించేవారు. లూకా 1:7 ప్రకారం, యోసేపునకు మరియతల్లి ప్రధానము చేయబడింది. ఇక వీరిరువురుకూడా కొన్ని రోజులలో పరిశుద్ధ వివాహాన్ని చేసుకొని కుటుంబ జీవితంలోకి అడుగు పెట్టబోతున్న తరుణంలో, పవిత్రాత్మ ప్రభావం వలన మరియతల్లి గర్భం దాల్చారు. ఇది దైవ ప్రణాళిక! మోషే ధర్మశాస్త్రం ప్రకారం, వివాహం కాకముందు స్త్రీ గర్భం ధరిస్తే అది పాపం. శిక్షలుకూడా చాలా కఠినంగా ఉంటాయి. ద్వితీ. 22:20-21 ప్రకారం, అలాంటి స్త్రీని రాళ్ళతో కొట్టి చంపాలని చెబుతుంది.

యోసేపు స్థానంలో మరొక మానవమాత్రుడు ఉన్నట్లయితే, ఖచ్చితంగా మరియతల్లిని తీసుకొని వెళ్లి న్యాయంకోసం పరిసయ్యుల, ధర్మశాస్త్ర బోధకుల చేతికి అప్పగించేవాడు. కాని యోసేపు ఆ పని చేయలేదు. సమాజంలో నిలబెట్టి బహిరంగంగా అవమానింప ఇష్టంలేక మరియతల్లిని మౌనంగా, రహస్యంగా విడిచి పెట్టాలనుకున్నారు (మత్త 1:19). ఎందుకన, ఆయన నీతిమంతుడు. దేవదూత స్వప్నంలో కనిపించి ఇది దైవకార్యం, మరియను విడిచి పెట్టవద్దు, ఆమెను స్వీకరించు అని చెప్పినప్పుడు, దేవుని ప్రణాళికను అర్థంచేసుకొని యోసేపు మరియతల్లికి అన్ని వేళలా తోడుగా ఉన్నారు.

నేడు కొన్ని కుటుంబాలను చూసినట్లయితే భార్య/భర్తమీద లేనిపోని అనుమాన పడేవారు, చిన్నచిన్న మనస్పర్ధలకు విడాకులు తీసుకొని కుటుంబాలను చేజేతులారా నాశనం చేసుకునేవారు కోకొల్లలు! అట్టివారు ఓసారి యోసేపుగారిని స్మరించుకుంటే మంచిది. యోసేపు, మరియతల్లి వీరిరువురుకూడా కాపురం చేయకముందే మరియతల్లి గర్భం దాల్చారు. ఆ క్షణంలో మరియమ్మను యోసేపుగారు బహిరంగంగా జనంమధ్య అవమానించ లేదు, దానికి బదులుగా, మౌనంగా రహస్యముగా విడిచి పెట్టాలను కున్నారు. కాని దూతద్వారా ఇది దైవకార్యం, పవిత్రాత్మ ప్రభావం వలన జరిగిన మహత్కార్యం అని తెలుసుకొని మరియతల్లికి అండగా ఉన్నారు. ముఖ్యంగా ప్రసవ సమయంలో యోసేపుగారి మంచి మనసును బట్టి దేవుడు ఆయనను నీతిమంతునిగా సత్కరించారు. ఇది ఆయనకు దక్కిన అరుదైన గౌరవం. నీతిమంతుడు అనగా, నీతిగా, న్యాయముగా జీవించేవాడు, సత్ప్రవర్తన కలిగి యుండేవాడు, ధర్మాత్ముడు అని అర్ధం. కనుక ఇదొక గొప్ప సుగుణం.

దైవభక్తిపరుడు: దైవభక్తిగల వారిలో ఐదు సుగుణాలు ఖచ్చితముగా ఉంటాయి:

1. దేవున్ని నమ్ముతారు: అనగా అందరికన్నా, అన్నింటికన్నా దేవునికి ప్రధాన స్థానం ఇవ్వడం. దేవునిపై ఆధారపడి జీవించడం. దేవునికన్న, ఇతర విషయాలకు ప్రాముఖ్యతను ఇచ్చినప్పుడు అది విగ్రహారాధన అవుతుంది. దైవభక్తిగల తండ్రి తన కుమారున్ని దేవుని వైపుకు నడిపిస్తాడు. “యేసు జ్ఞానమందును, ప్రాయమందును వర్దిల్లుచు, దేవుని అనుగ్రహమును, ప్రజల ఆదరాభిమానములను పొందుట” (లూకా 2:52) యోసేపుగారు చూసారు. కష్టతరమైనవి ఎన్నో యోసేపుగారు చేయగలిగారు, ఎందుకన, ఆయన దేవున్ని నమ్మాడు, విధేయించాడు. దేవునిపై నమ్మకముంచడం అనగా, మన భయాలలో, బలహీనతలలోకూడా ముందుకు వెళ్ళగలము అని విశ్వసించడం.

2. దేవుని వాక్యాన్ని ఎరిగినవారై ఉంటారు: దేవునియొక్క వాక్యమును హృదయమున నిలుపు కొంటాడు (కీర్త 119:11). దైవభక్తిగల భర్త, తండ్రికి దేవునివాక్యం తప్పక తెలిసి యుంటుంది. యోసేపు దేవుని వాక్యాన్ని క్షుణ్ణముగా ఎరిగినవారు.

3. ఎల్లప్పుడూ ప్రార్ధన చేస్తారు: మత్తయి 6:5-15లో, యేసు తన శిష్యులకు ప్రార్ధన చేయడం నేర్పించాడు. దేవుని చిత్తం నెరవేరాలని ప్రార్ధన చేస్తాడు. యోసేపుగారు దేవుని చిత్తాన్ని అక్షరాల పాటించాడు.

4. బంధాలను నిర్మిస్తారు: ఆపదలలో, కష్టసమయాలలో, కుటుంబాలను నిలబెడతాడు. పునీత జోజప్పగారు అక్షరాల అలాగే చేసారు. తిరుకుటుంబాన్ని నిలబెట్టారు, నిర్మించారు.

5. ఇతరులకు సేవ చేస్తారు: హృదయపూర్వకముగా సేవ చేయుటం. యోసేపు గొప్పతనం ఏమిటంటే, ఆయన మరియతల్లి భర్తగా, యేసుకు తండ్రిగా, రక్షణ ప్రణాళికలో తన సేవను హృదయపూర్వకముగా, సంపూర్ణముగా అందించాడు. ఆయన సేవ త్యాగపూరితమైనది. తిరుకుటుంబానికి తన జీవిత సర్వాన్ని త్యాగం చేసాడు. తన ప్రేమను తన సేవలో పరిపూర్ణం గావించాడు. విశ్వాసముద్వారా నీతిమంతుడు జీవిస్తాడు (రోమీ 1:17).

కష్టజీవి: మత్త 1:1-16 ప్రకారం, యోసేపు దావీదు వంశానికి చెందినవాడు. దావీదు వంశానికి ఎంతటి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయో మనందరికీ తెలుసు. యోసేపు ఈ పేరుప్రఖ్యాతులను ఉపయోగించి ఏవైనా చేయవచ్చు. కాని ఆయన తనకు తెలిసిన వడ్రంగి వృత్తినే కుటుంబ పోషణకై ఎంచుకున్నాడు. ఈ వడ్రంగి వృత్తిలోనే మంచి ప్రావీణ్యతను, గుర్తింపును సంపాదించు కున్నాడు (మత్త 13:55). ‘పని చేయడం’ అనేది రక్షణ ప్రణాళికలో భాగస్తులగుటకు ఓ చక్కటి మార్గం. మనకున్న వరాలద్వారా సమాజములో ఇతరుల సేవనిమిత్తమై ఉపయోగించే బాగ్యం లభిస్తుంది. పనిచేయడం దేవుని ప్రణాళికలో భాగం. ఏ పనైనను మానవ గౌరవార్ధమై యుండాలి.

ప్రతి భర్త! ప్రతి తండ్రి! కూడా పునీత జోజిప్ప గారి వలె, కుటుంబ బాధ్యతలను స్వీకరించగలగాలి. కష్టపడి పని చేయగలగాలి. కుటుంబం అంటే బాధ్యత కలిగి ప్రవర్తించడం అని, వీరి నుండి గ్రహించాలి. కుటుంబం పట్ల ప్రేమ కలిగి ఉండడం వీరినుండే నేర్చుకోవాలి. దేవుని ఆజ్ఞను, దేవుడు ఏర్పరిచిన బాధ్యతను, ఎటువంటి అవాంతరాలు వచ్చినా, కుటుంబమును విడిచిపెట్టకుండా, నెరవేర్చాలి. క్రీస్తు ప్రభుని సాకుడు తండ్రియైన జోజప్పగారు నీతిమంతుడు, పరిశుద్ధుడు, దేవునిచే ఎన్నుకోబడిన మంచి వ్యక్తి. ప్రతి పురుషుడు వీరి వలె, కుటుంబ బాధ్యతలు స్వీకరించి దేవుని అనుసరణలో జీవించడానికి, పిల్లలను క్రమశిక్షణతో, బాధ్యతతో పెంచడానికి, దేవుని అనుసరణలో జీవింపచేయడానికి కష్టపడాలి.

సంరక్షకుడు / ప్రేమగల తండ్రి: తన స్వప్నంలో దేవదూతద్వారా దేవుని ఆదేశాలను స్వీకరించి, హేరోదు రాజుయొక్క దుష్టతలంపులనుండి బాలయేసును కాపాడారు. ఒక గాడిద సహాయముతో తాను నడుస్తూ మరియతల్లిని, బాలయేసును సురక్షిత ప్రాంతానికి చేర్చి శత్రువుల బారినుండి తల్లిని, బిడ్డని కాపాడారు (మత్త 2:13-15). అదేవిధముగా, బాలయేసు 12 ఏళ్ళ ప్రాయంలో యెరుషలేములో తప్పిపోయినప్పుడు తల్లడిల్లిపోయి, మూడు రోజులపాటు నిద్రాహారాలు మానేసి వెతికి వెతికి చివరికి దేవాలయంలో కనుగొన్నారు. అన్ని వేళలా క్రీస్తుకు తోడుగా ఉన్నారు. యోసేపు నిజమైన తండ్రి, నిజమైన సంరక్షకుడు. మరియతల్లి, యేసు కొరకు ఆయన సర్వం ప్రేమతో, ఆప్యాయముతో చేసాడు. అలాగే బాలయేసుకు సర్వం చేసారు. ప్రతీ క్షణం వెన్నంటి ఉన్నారు.

ప్రార్థనాపరుడు: యోసేపు మంచి ప్రార్థనాపరుడు. మోషే ధర్మశాస్త్రాన్ని, పది ఆజ్ఞలను తు.చ. తప్పకుండా పాటించాడు. దేవుని ఆదేశానుసారం ఎనిమిది దినములు గడిచిన పిమ్మట శిశువునకు సున్నతి చేసి దేవదూత ముందుగా సూచించినట్లు ఆ బిడ్డకు ‘యేసు’ అని పేరు పెట్టారు (లూకా 2:21). మోషే ధర్మశాస్త్రాన్ని గౌరవించి, పాటించి ప్రతి తొలిచూలు మగబిడ్డ దేవునికి అర్పింపబడవలెను అని ప్రభువు ధర్మశాస్త్రంలో రాయబడియున్నట్లు బాలయేసుని దేవాలయంలో కానుకగా సమర్పించారు (లూకా 2:22-24). సాధారణంగా కలలను ఎవరూ పట్టించుకోరు. కాని యోసేపు మాత్రం తన స్వప్నంలో దేవునిద్వారా దూత మోసుకొచ్చిన ప్రతి సందేశాన్ని త్రికరణశుద్ధిగా ఆలకించి, పాటించి దేవుని చిత్తాన్ని నెరవేర్చారు (మత్త 1:19-24; 2:13-15; 2:19-23). యోసేపు నోరుతెరిచి మాట్లాడిన ఒక్క సందర్భంకూడా మనకు పరిశుద్ధ గ్రంథంలో కనిపించదు. ఆయన దేవునిపట్ల ప్రేమను, తన విశ్వాసాన్ని మాటల్లోగాక, తన చేతల్లో నిరూపించారు.

మంచి మరణం: పునీత యోసేపు దేవుని పిలుపును అందుకున్నాడు. మరియతల్లికి భర్తగా, దైవకుమారునికి తండ్రిగా పిలుపును అందుకున్నాడు. తన పిలుపును సంపూర్ణ విశ్వసనీయతతో పరిపూర్తి చేసాడు. ఆతరువాత దేవుడు యోసేపును తన సన్నిధిలోనికి పిలచుకున్నాడు. పరిశుద్ధమైన జీవితాన్ని జీవించి, క్రీస్తు, మరియతల్లి సన్నిధిలో, ఒడిలో భాగ్యమైన మరణాన్ని పొందారు. తిరుసభ పాలకుడిగా, మంచి మరణాన్ని ప్రసాదించు పునీతుడిగా వినతికెక్కారు.

ముగింపు: యేసు, మరియ, యోసేపులు తిరుకుటుంబము! లోకరక్షణార్ధమై దేవుడు ఈ కుటుంబాన్ని ఏర్పాటు చేసారు. రక్షణ చరిత్రలో వారు ఒకటిగా నిలిచారు. ముగ్గురుకూడా విడదీయలేనటువంటి వారు. దేవుని ప్రణాళికలో, వారి వ్యక్తిగత గుర్తింపులు ఒకరితోనొకరికి సంబంధాన్ని కలిగియున్నాయి. కనుక, వారి ముగ్గురిని విడివిడిగా చూడక, ఎప్పుడు ఒకటిగానే చూడాలి, ఒకటిగానే అర్ధంచేసుకోవాలి! యోసేపును ఎప్పటికీ మరువరాదు! ఆయన మరియ యేసులకు ఏమిచేసాడో, మనకూ, విశ్వశ్రీసభకూ చేయగలడు!

యోసేపు దేవుని చిత్తానికి పరిపూర్ణముగా తలొగ్గాడు. దైవపిలుపుకు, బాధ్యతకు, త్యాగానికి ప్రతిస్పదించి, దైవప్రణాళికకు సహకరించాడు. తన జీవిత సర్వాన్ని దేవుని చేతులో అప్పజెప్పాడు. అతను ఎందుకు మౌనముగా ఉన్నాడంటే, దేవుని మాటను ఎక్కువగా ఆలకించాడు గనుక! ఎప్పడూ వాదించలేదు; వెనకడుగు వేయలేదు; అభ్యంతరం చెప్పలేదు; వివరణలు అడగలేదు; దేవుని ఆజ్ఞలను ఎప్పుడూ ప్రశ్నించలేదు, దేనిని నిలువరించలేదు. దేవుని ప్రణాళికను మౌనముగా, శాంతియుతముగా నేరవేర్చడములోనే గర్వపడ్డాడు. మౌనములోనే, దేవునికి కృతజ్ఞతలు తెలుపుకున్నాడు.

యోసేపు మౌనజీవిత సందేశం – ఇష్టపూర్వక విధేయత, సేవ! సంకల్పం, సేవయే యోసేపు జీవిత రహస్యం. ఇదే మనకు ఆయన జీవిత సందేశం!

పునీత జోజప్ప గారి ప్రార్థనా సహాయమును, తప్పనిసరిగా మన అందరికీ దయచేయమని, ఈ పండుగ రోజున మనమందరమూ వారికి ప్రార్థించుకుందాం. వారి ఆశీస్సులను పొందుకుందాం. వారిలో ఉన్న, నీతిని మనమూ అలవరచుకొని, దేవుని ఆదేశమును అనుసరించే విధముగా మనమూ ఆ విధముగా దేవుని బోధన ఆలకించి జీవించుదాం.

అందరికీ, మరియ భర్తయగు పునీత జోజప్పగారి పండుగ శుభాకాంక్షలు!

మరియమాత తిరు హృదయ ఉత్సవం (28 జూన్)

 మరియమాత తిరు హృదయ ఉత్సవం (28 జూన్)
ఆదికాండము 18:1-15; లూకా 2:41-51

ఉపోద్ఘాతము: క్రీస్తునందు ప్రియ సహోదరీ సహోదరులారా! జూన్ 28న “మరియతల్లి తిరుహృదయ మహోత్సవాన్ని” జరుపుకుంటున్నాం. యేసుపట్ల, మానవాళిపట్ల మరియతల్లి చూపిన అపారమైన ప్రేమను, త్యాగాన్ని, విధేయతను గుర్తుచేసుకునే పవిత్రమైన సందర్భం ఈ పండుగ. ఈ మహోత్సవము ద్వారా మనం మరియ తిరుహృదయమును లోతుగా అర్థము చేసుకోవడానికి ప్రయత్నిద్దాం.

1. మరియమాత తిరుహృదయం దేవుని ప్రేమకు ప్రతిబింబం

నిస్వార్థ ప్రేమ: మరియమాత తిరుహృదయం నిస్వార్థ ప్రేమకు నిలయం. నిస్వార్థ ప్రేమ అనేది ఎటువంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా, స్వార్థం లేకుండా, నిస్వార్థంగా ఇచ్చే ప్రేమ. ఈ ప్రేమకు మరియమ్మ తిరుహృదయం ఒక గొప్ప ఉదాహరణ. ఆమె జీవితం పూర్తిగా దేవుని చిత్తానికి అంకితమైంది. ఆమె ప్రతీ అడుగులోనూ, ప్రతీ ఆలోచనలోనూ, ప్రతీ క్రియలోనూ ఈ నిస్వార్థ ప్రేమ స్పష్టంగా కనిపిస్తుంది.

మరియమ్మ తన జీవితాన్ని పూర్తిగా దేవుని చిత్తానికి అంకితం చేసింది. గబ్రియేలు దూత ద్వారా దేవుని సందేశాన్ని అందుకున్నప్పుడు మరియమ్మ చూపిన ప్రతిస్పందన ఆమె నిస్వార్థ ప్రేమకు, దైవచిత్తానికి ఆమెకున్న అంకితభావానికి నిదర్శనం. తాను ఒక కుమారునికి జన్మనిస్తుందని ఆమెకు తెలియజేసినప్పుడు, ఆనాటి సామాజిక పరిస్థితులలో ఎన్నో సవాళ్లను తెచ్చిపెట్టే విషయం. వివాహం కాకుండా గర్భవతి కావడం అనేది చాలా కష్టమైన, అవమానకరమైన పరిస్థితి. అయినా సరే, ఆమె తన వ్యక్తిగత కష్టాలను, సామాజిక నిందలను పక్కన పెట్టి, దేవుని సంకల్పానికి తననుతాను పూర్తిగా అంకితం చేసుకుంది.

నేటి మొదటి పఠనములో [ఆదికాండము 18:1-15]విన్నట్లుగా, సారా వయసు మీరిన తర్వాత కూడా గర్భవతి అవుతుందని దేవుడు వాగ్దానం చేసినప్పుడు, ఆమె నవ్వింది. సారా అపనమ్మకంతో నవ్వితే, ఇక్కడ మరియమ్మ విశ్వాసంతో దేవుని చిత్తాన్ని అంగీకరించింది. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదని ఆమె సంపూర్ణంగా విశ్వసించినది. మరియమ్మ తిరుహృదయం దైవిక శక్తిపై అచంచలమైన విశ్వాసానికి నిలయం.

“నేను ప్రభువు దాసురాలను. నీ మాట చొప్పున నాకు జరుగుగాక!” (లూకా 1:38) అని మరియమ్మ పలికిన ఈ మాటలు, ఆమెకున్న అచంచలమైన విశ్వాసాన్ని, లోతైన భక్తిని, నిస్వార్థ ప్రేమను స్పష్టంగా తెలియ జేస్తాయి. “నేను ప్రభువు దాసురాలను” అన్న మాటలు ఆమె దేవుని సేవకురాలిగా, ఆయన సంకల్పానికి లోబడిన వ్యక్తిగా తననుతాను అంకితం చేసుకుందని తెలియజేస్తుంది. తన ఇష్టాలను పక్కన పెట్టి, దైవిక ప్రణాళికకు ఆమె తననుతాను అప్పగించుకుంది. స్వార్థానికి తావు లేకుండా, పూర్తిగా దేవుని చిత్తానికి లోబడిన హృదయాన్ని సూచిస్తుంది. “నీ మాట చొప్పున నాకు జరుగుగాక!” అన్న వాక్యం ఆమెకున్న సంపూర్ణ అంగీకారాన్ని, దేవుని శక్తిపై ఆమెకున్న దృఢమైన నమ్మకాన్ని వెల్లడిస్తుంది. భవిష్యత్తులో తనకు ఎదురయ్యే ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి ఆమె సిద్ధంగా ఉందని, దేవుని ప్రణాళికను స్వీకరించడానికి ఆమె సంసిద్ధంగా ఉందని ఇది తెలియ జేస్తుంది. ఈ అంగీకారం కేవలం మాటలకే పరిమితం కాలేదు; ఆమె జీవితాంతం యేసును పెంచడంలో, ఆయన సువార్త సేవలో ప్రతి కష్టంలోనూ, చివరికి సిలువ చెంత, ఆయన బాధను చూసినప్పుడు కూడా ఆమె ఈ నిస్వార్థ ప్రేమను ప్రదర్శించింది.

మరియమ్మ జీవితం నిస్వార్థ ప్రేమ, అచంచలమైన విశ్వాసం, నిస్వార్థ అంకితభావం యొక్క సమ్మేళనం. ఆమె తన సొంత సౌఖ్యాన్ని, భవిష్యత్తును పక్కన పెట్టి, దేవుని ప్రణాళిక కోసం తననుతాను అంకితం చేసుకుంది. ఈ నిస్వార్థతనే ఆమెను ‘నిస్వార్థ ప్రేమకు నిలయం’గా చేసింది. ఆమె కేవలం ఒక తల్లిగా మాత్రమే కాకుండా, దేవుని చిత్తానికి పూర్తిగా లోబడిన ఒక నమ్మకమైన సేవకురాలిగా నిలిచింది. ఆమె చూపిన ప్రేమ ఎటువంటి పరిమితులు లేకుండా, ఏ ప్రతిఫలాన్ని ఆశించకుండా, కేవలం దేవుని మహిమ కోసమే ఉద్భవించింది.

ఆమె జీవితం మనందరికీ ఒక గొప్ప ఆదర్శం. నిస్వార్థంగా ప్రేమించడం అంటే ఏమిటో, దేవుని ప్రణాళికకు మనల్ని మనం ఎలా అంకితం చేసుకోవాలో, విశ్వాసం ద్వారా ఎలాంటి సవాళ్లనైనా ఎలా ఎదుర్కోవాలో మరియమ్మ మనకు చూపిస్తుంది. ఆమె హృదయం కేవలం నిస్వార్థ ప్రేమకు నిలయం మాత్రమే కాదు, అది విశ్వాసం, విధేయత, దేవుని సంకల్పానికి సంపూర్ణ అంకితభావానికి కూడా ఒక గొప్ప ప్రతీక.

దుఃఖంతో కూడిన ప్రేమ: మరియమాత హృదయం దుఃఖంతో కూడుకున్న ప్రేమకు చిహ్నం. దుఃఖంతో కూడిన ప్రేమ అనేది కేవలం ఆనందంలోనే కాకుండా, బాధలోనూ, వేదనలోనూ, కష్టాల్లోనూ వ్యక్తమయ్యే ప్రేమ. ప్రేమ యొక్క అత్యంత లోతైన, నిస్వార్థమైన రూపాల్లో ఒకటి. మరియమాత తిరుహృదయం ఈ దుఃఖంతో కూడిన ప్రేమకు గొప్ప చిహ్నం. ఆమె తన కుమారుడైన యేసు అనుభవించిన ప్రతీ బాధను, వేదనను తన హృదయంలో మోసింది.

బాల యేసును దేవాలయంలో సమర్పించినప్పుడు, సిమెయోను అనే ప్రవక్త మరియమ్మతో పలికిన మాటలు ఆమె జీవితంలో అనుభవించబోయే అపారమైన దుఃఖాన్ని ముందే తెలియజేశాయి. “ఒక ఖడ్గము నీ హృదయమును దూసికొని పోనున్నది” (లూకా 2:35) అని సిమెయోను ప్రవచించాడు. ఈ మాటలు కేవలం ఒక రూపకం మాత్రమే కాదు, మరియమ్మ జీవితంలో వాస్తవంగా సంభవించిన హృదయ విదారకమైన వేదనకు ప్రతీక.

‘ఖడ్గం’ ఇక్కడ తీవ్రమైన బాధను, శోకాన్ని, హృదయాన్ని చీల్చే దుఃఖాన్ని సూచిస్తుంది. ఒక తల్లిగా, తన కుమారుడికి ఏదైనా కీడు జరుగుతుందని తెలిసినప్పుడు ఆమె హృదయం ఎంతగా తల్లడిల్లిందో ఊహించడం కష్టం. సిమెయోను ప్రవచించిన ఈ మాటలు మరియమ్మ జీవితాంతం ఒక నీడలా వెంటాడాయి. మరియమ్మ యేసు బాల్యం నుండి ఆయన పరిచర్య, కష్టాలు, చివరికి సిలువ మరణం వరకు ప్రతీ దశలోనూ ఆయనతోనే ఉంది. ఆయన ప్రజలచే తిరస్కరించబడటం, శిష్యులచే విడిచిపెట్టబడటం, అవమానాలు ఎదుర్కోవడం, శారీరకంగా హింసించబడటం - ఇవన్నీ ఒక తల్లిగా ఆమెను ఎంతగానో బాధించి ఉంటాయి.

గెత్సెమనే తోటలో యేసు పడిన మానసిక వేదన, ఆయనను బంధించడం, ప్రజలచే దూషించబడటం, కొరడాలతో కొట్టబడటం, ముళ్ల కిరీటం ధరింపజేయబడటం, సిలువ మోయడం వంటి సంఘటనలు మరియమ్మ కళ్ళ ముందు జరిగాయి. ప్రతీ అడుగులోనూ ఆమె హృదయం విలపించింది. సిలువ చెంత మరియమాత  నిలబడి ఉండటం అనేది ఆమె దుఃఖంతో కూడిన ప్రేమకు పరాకాష్ట. తన కళ్ళ ముందే తన కుమారుడు అమానుషంగా శిక్షించబడి, సిలువపై ప్రాణాలు విడుస్తుంటే, ఆమె అనుభవించిన వేదనను మాటల్లో వర్ణించడం అసాధ్యం. ఆ క్షణంలో ఆమె హృదయాన్ని ఆ ఖడ్గం నిజంగానే దూసికొనిపోయి ఉంటుంది.

మరియమ్మ అనుభవించిన ఈ వేదన, బాధ కేవలం దుఃఖం మాత్రమే కాదు, అది ఆమెకున్న అనంతమైన ప్రేమలో భాగం. తన కుమారుడి పట్ల ఆమెకున్న అపారమైన ప్రేమ వలనే ఆమె ఆ బాధనంతా భరించగలిగింది. ప్రేమ కేవలం సంతోషాన్ని మాత్రమే కాదు, ప్రియమైనవారి బాధను కూడా పంచుకుంటుంది. మరియమ్మ విషయంలో, ఆమె ప్రేమ ఎంత లోతైనదో, అంతగా ఆమె వేదన కూడా లోతైనది. ఆమె దుఃఖం ఆమె ప్రేమ యొక్క లోతుకు, పవిత్రతకు నిదర్శనం. ఈ దుఃఖంతో కూడిన ప్రేమ యేసు పట్ల ఆమెకున్న నిస్వార్థ అంకితభావాన్ని, ఆయన ప్రణాళికలో ఆమెకున్న స్థానాన్ని తెలియజేస్తుంది. ఆమె బాధ కేవలం వ్యక్తిగత శోకం మాత్రమే కాదు, అది మానవాళి పాపాలకు ప్రాయశ్చిత్తం చేసిన తన కుమారుడి త్యాగంలో భాగం పంచుకోవడం.

మరియమాత తిరుహృదయం, దుఃఖంతో నిండియున్నప్పటికీ, ప్రేమతో కూడినది. ఆమె అనుభవించిన వేదన కేవలం బాధ కాదు, అది ప్రేమ యొక్క అత్యున్నత రూపం. ఈ కారణంగానే ఆమె “దుఃఖంతో కూడిన ప్రేమకు చిహ్నం”గా నిలిచింది. ఆమె జీవితం, ప్రత్యేకించి ఆమె పడిన బాధ, నిజమైన ప్రేమ కేవలం ఆనందంలోనే కాకుండా, అత్యంత తీవ్రమైన కష్టాల్లోనూ ఎలా వ్యక్తమవుతుందో మనకు బోధిస్తుంది.

మానవాళి పట్ల ప్రేమ: మరియమాత యేసును మనకు, ఈ లోకానికి అందించింది. ఆమె మన ఆధ్యాత్మిక తల్లి. తన కుమారుని ద్వారా మనందరికీ రక్షణ లభించాలని ఆమె కోరుకుంది. ఆమె హృదయం సర్వమానవాళిని కలుపుకునే విశాల హృదయం. మరియమ్మ ప్రేమ కేవలం తన కుమారుడైన యేసుకు, లేదా ఆమె కుటుంబానికి మాత్రమే పరిమితం కాదు. ఆమె హృదయం సర్వమానవాళి పట్ల అపారమైన, విశాలమైన ప్రేమకు నిలయం. ఆమె తన జీవితాన్ని దేవుని చిత్తానికి అంకితం చేసినప్పటి నుంచీ, మానవాళి రక్షణ ప్రణాళికలో ఆమె ఒక కీలకమైన పాత్ర పోషించింది.

మరియమ్మ మానవాళి పట్ల ప్రేమను వ్యక్తం చేసిన ప్రథమ, అత్యంత లోతైన మార్గం యేసును మనకు అందించడం. ఆమె దేవుని సంకల్పానికి “అవును” అని చెప్పడం ద్వారా, రక్షకుడైన యేసుక్రీస్తు ఈ లోకమునకు రావడానికి మార్గం సుగమం చేసింది. ఇది కేవలం ఒక ప్రసవ ప్రక్రియ కాదు, అది మానవాళి పాపాలకు ప్రాయశ్చిత్తం చేసి, నిత్యజీవాన్ని అందించడానికి దేవుడు చేసిన గొప్ప ఏర్పాటులో ఆమె సమ్మతి. తన గర్భంలో దేవుని కుమారుడిని మోసి, ఆయనకు జన్మనిచ్చి, ఆయనను పెంచడం ద్వారా, మరియమ్మ మనకు రక్షణకు మార్గాన్ని చూపింది. ఈ చర్య నిస్వార్థ ప్రేమకు, మానవాళి శ్రేయస్సు పట్ల ఆమెకున్న లోతైన ఆలోచనకు పరాకాష్ట.

క్రైస్తవ సంప్రదాయంలో, మరియమ్మను తరచుగా మన ఆధ్యాత్మిక తల్లిగా పరిగణిస్తారు. సిలువపై యేసు, తన శిష్యుడు యోహానుతో “ఇదుగో నీ తల్లి” (యోహాను 19:27) అని పలికినప్పుడు, అది కేవలం యోహానుకు మాత్రమే కాదు, విశ్వాసులందరికీ మరియమ్మ తల్లిగా ఉండాలని ఆయన ఆశయం. ఒక తల్లి తన బిడ్డల శ్రేయస్సును ఎంతగానో కోరుకున్నట్లే, మరియమ్మ కూడా తన ఆధ్యాత్మిక బిడ్డలైన మనందరి రక్షణను, శ్రేయస్సును కోరుకుంటుంది. ఆమె దేవుని సన్నిధిలో మన కోసం విజ్ఞాపనలు చేస్తుందని, మన ఆధ్యాత్మిక ప్రయాణంలో మనకు సహాయపడుతుందని విశ్వసిస్తారు. ఈ ఆధ్యాత్మిక మాతృత్వం మానవాళి పట్ల ఆమెకున్న ప్రేమకు, ప్రతీ ఒక్కరి ఆధ్యాత్మిక శ్రేయస్సు పట్ల ఆమెకున్న శ్రద్ధకు నిదర్శనం.

మరియమ్మ తన కుమారుడైన యేసు ద్వారా మనందరికీ రక్షణ లభించాలని హృదయపూర్వకంగా కోరుకుంది. ఆమె యేసు ప్రేషిత సేవను అర్థం చేసుకుంది. ఆయన ప్రజలందరి పాపాలకు ప్రాయశ్చిత్తం చేయడానికి వచ్చారని తెలుసుకుంది. అందుకే ఆమె యేసు పరిచర్యలో ఆయనకు అండగా నిలిచింది, ఆయన కష్టాలను, సిలువ మరణాన్ని సహించింది. ఆమె వేదనలో కూడా, మానవాళి రక్షణ కోసం యేసు చేస్తున్న త్యాగాన్ని ఆమె లోతుగా అర్థం చేసుకుంది. ఆమె హృదయం మానవాళిని పాపం నుండి, మరణం నుండి విడిపించి, దేవునితో శాశ్వత సంబంధాన్ని పొందాలని బలంగా కోరుకుంది.

మరియమ్మ హృదయం జాతి, మతం, వర్గం, భౌగోళిక సరిహద్దులకు అతీతంగా సర్వమానవాళిని కలుపుకునే విశాల హృదయం. ఆమె ప్రేమ ఏ ఒక్కరికో పరిమితం కాదు. ఆమె ప్రేమ సమస్త మానవాళిని ఆవరించింది, ప్రతి ఒక్కరిని తన బిడ్డగా భావిస్తుంది. ఆమె యేసును ప్రపంచ రక్షకుడిగా అంగీకరించడం ద్వారా, సమస్త మానవాళికి రక్షణ మార్గాన్ని తెరవడానికి సహకరించింది. అందుకే ఆమెను విశ్వజనీన తల్లిగా, సమస్త మానవాళికి ఆశ్రయంగా భావిస్తారు.

ఈవిధముగా, మరియమాత జీవితం నిస్వార్థ ప్రేమకు, దుఃఖంతో కూడిన ప్రేమకు, మరియు అన్నింటికీ మించి, మానవాళి పట్ల అపరిమితమైన ప్రేమకు ఒక గొప్ప ఉదాహరణ. ఆమె మనకు యేసును మాత్రమే కాకుండా, ప్రేమ, విశ్వాసం, విధేయతతో కూడిన జీవితాన్ని ఎలా జీవించాలో కూడా నేర్పింది. ఆమె హృదయం నిజంగానే విశాలమైనది, మానవాళి మొత్తాన్ని తన ప్రేమలో కలుపుకునేది.

2. మరియ తిరుహృదయ ప్రాముఖ్యత

మరియ తిరుహృదయం కేవలం ప్రేమకు మాత్రమే కాదు, పరిశుద్ధతకు కూడా ఒక శక్తివంతమైన చిహ్నం. ఆమె హృదయం పాపరహితంగా, నిష్కళంకమైన పవిత్రతతో వెలుగొందుతుంది. ఈ పరిశుద్ధత క్రైస్తవ విశ్వాసంలో, ముఖ్యంగా కతోలిక సంప్రదాయంలో, మరియమ్మకు ప్రత్యేక స్థానాన్ని కల్పిస్తుంది.

పరిశుద్ధతకు చిహ్నం: మరియ హృదయం పాపరహితం అనడంలో ముఖ్యమైన భావం ఆదిపాప రహితంగా ఆమె గర్భంలో ధరించబడింది అనేది విశ్వాసం (Immaculate Conception). ఇది కేవలం ఒక మతపరమైన నమ్మకం మాత్రమే కాదు, దేవుడు మానవాళి రక్షణ ప్రణాళికలో మరియమ్మను ఒక ప్రత్యేక పాత్ర కోసం సిద్ధం చేశాడనే దానికి సూచన. సాధారణంగా, మానవులు జన్మతహా ఆదిపాపంతో ఉంటారు. కానీ మరియమ్మ విషయంలో, దేవుడు ఆమెను ఈ పాపం నుండి మినహాయించాడు, తద్వారా ఆమె దైవపుత్రుడికి జన్మనివ్వడానికి, ఆయనకు నిష్కళంకమైన తల్లిగా ఉండటానికి తగినదిగా మారింది. ఈ పాపరహితత్వం ఆమె హృదయాన్ని అన్ని రకాల మలినాల నుండి, దుష్ట ఆలోచనల నుండి, స్వార్థాపేక్షల నుండి విముక్తం చేసింది. అందుకే ఆమె హృదయం దేవుని చిత్తానికి పూర్తిగా లొంగి, ఆయన ప్రేమకు నిలయంగా మారింది. ఆమె జీవితం, ప్రతీ చర్య, ప్రతీ ఆలోచన దైవిక ప్రేమ, పరిశుద్ధతతో నిండి ఉన్నాయి. ఆమె ఎప్పుడూ పాపం చేయలేదని, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ప్రవర్తించలేదని విశ్వసిస్తారు. ఈ నిష్కళంకత్వం ఆమె హృదయాన్ని పరిశుద్ధతకు తిరుగులేని ప్రతీకగా నిలుపుతుంది. మరియమాత హృదయం యొక్క పరిశుద్ధత ఆమె జీవితాన్ని దేవునికి పూర్తిగా అంకితం చేయడంలో స్పష్టంగా కనిపిస్తుంది. ఆమె గబ్రియేలు దూత సందేశాన్ని అందుకున్నప్పటి నుండి, తన జీవితాంతం దేవుని సంకల్పానికి తనను తాను పూర్తిగా సమర్పించుకుంది.

మరియమాత హృదయం మనందరికీ ఒక ఆదర్శం. ఆమె హృదయం యొక్క పరిశుద్ధత మనకు ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్పుతుంది: అదేమిటంటే, మన హృదయాలను కూడా పరిశుద్ధంగా ఉంచుకోవాలని. మరియమ్మ వలె మనం ఆదిపాపరహితంగా జన్మించకపోయినా, దేవుని అనుగ్రహం ద్వారా, పశ్చాత్తాపం ద్వారా, మరియు యేసుక్రీస్తు బలిదానం ద్వారా మన హృదయాలను శుద్ధి చేసుకోవచ్చు. ఆమె మాదిరిగా, మనం కూడా దేవుని చిత్తానికి లోబడి, పాపానికి దూరంగా ఉండి, ప్రేమతో, విధేయతతో జీవించడం ద్వారా పరిశుద్ధతను సాధించవచ్చు. ఆమె జీవితం నిస్వార్థ ప్రేమకు, దైవిక సేవకు, మరియు హృదయం యొక్క నిష్కళంకమైన పవిత్రతకు ఒక నిరంతర జ్ఞాపకం. మరియమాత హృదయం, పరిశుద్ధతకు చిహ్నంగా, మనలను దేవునికి మరింత దగ్గరగా, ఆయన ప్రేమకు మరింత అర్హులుగా మారడానికి ప్రేరేపిస్తుంది. మన హృదయాలను శుభ్రపరచుకోవడానికి, మంచి ఆలోచనలతో, దైవిక ఉద్దేశ్యాలతో నింపుకోవడానికి ఆమె ఒక మార్గదర్శిగా నిలుస్తుంది.

విధేయతకు మాదిరి: మరియమాత తిరుహృదయం కేవలం ప్రేమకు, పరిశుద్ధతకు మాత్రమే కాదు, దేవుని చిత్తానికి సంపూర్ణ విధేయతకు ఒక నిరుపమానమైన మాదిరి. ఆమె జీవితం ప్రతీ దశలోనూ, చిన్నదైన కార్యం నుండి అతి పెద్ద త్యాగం వరకు, దేవుని సంకల్పానికి తనను తాను పూర్తిగా అప్పగించుకుంది. మరియమ్మ జీవితం దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఎటువంటి ప్రలోభాలకూ లొంగలేదు. ఆమె ఎప్పుడూ తన స్వంత కోరికలు లేదా సౌకర్యాలను దేవుని ఆజ్ఞల కంటే పై చేయనివ్వలేదు. ఆమె విధేయత నిస్వార్థమైనది, నిలకడైనది, మరియు నిస్సందేహమైనది.

ప్రార్థనకు నిలయం: మరియమాత తిరుహృదయం నిరంతరం ప్రార్థనలో దేవునితో ఐక్యమై ఉంది. ఆమె జీవితం నిరంతర సంభాషణ, ఆత్మీయ సంబంధంలో దేవునితో ముడిపడి ఉంది. మరియమ్మ ప్రార్థన అనేది కేవలం కొన్ని సమయాలకు పరిమితమైనది కాదు. ఆమె జీవితం ప్రతీ అడుగులోనూ దేవునితో సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉంది. “మరియమ్మ అంతయు తన మనస్సున పదిల పరచుకొని మననము చేయుచెండెను” (లూకా 2:19, 2:51) అని అని చదువుచున్నాము. ఇది ఆమె ప్రార్థనా జీవితానికి, లోతైన ధ్యానానికి నిదర్శనం. ఆమె దేవుని ప్రణాళికలను, తన కుమారుడి జీవితంలోని సంఘటనలను తన హృదయంలో దాచుకొని, వాటి గురించి నిరంతరం ఆలోచిస్తూ, దేవునితో సంభాషిస్తూ ఉండేది. ఇది నిశ్శబ్ద ప్రార్థన, హృదయపూర్వక ఆలోచన.

మరియమాత మనకు ప్రార్థన ద్వారా దేవునితో సన్నిహిత సంబంధం ఏర్పరచుకోవాలని బోధిస్తుంది. ఆమె జీవితం ప్రార్థన అనేది కేవలం విజ్ఞాపనలు చేయడం మాత్రమే కాదని, అది దేవునితో నిరంతర సంభాషణ, ఆయన చిత్తాన్ని అర్థం చేసుకోవడం, ఆయన ప్రేమను అనుభవించడం అని చూపిస్తుంది.

3. మన జీవితాలకు వర్తింపు

మరియమాత తిరుహృదయం కేవలం ఆరాధనకు సంబంధించినది మాత్రమే కాదు; అది మన రోజువారీ జీవితాలకు ఒక శక్తివంతమైన ఆదర్శం. ఆమె హృదయం యొక్క లక్షణాలు - పరిశుద్ధత, విధేయత, ప్రేమ, మరియు ప్రార్థన - మనం ఎలా జీవించాలో చూపిస్తాయి.

హృదయ పరివర్తన: మరియమాత విమల హృదయం మన హృదయాలను శుద్ధి చేసుకోవడానికి, పాపం నుండి దూరంగా ఉండటానికి మనకు ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఆమె ఆదిపాపరహితంగా జన్మించడం, మరియు పాపరహిత జీవితాన్ని గడపడం మనకు ఒక గొప్ప లక్ష్యాన్ని నిర్దేశిస్తుంది. మరియమ్మ లాగా మనం జన్మతహా పరిశుద్ధులు కానప్పటికీ, దేవుని అనుగ్రహం ద్వారా, పశ్చాత్తాపం ద్వారా, మరియు క్రీస్తు బలిదానం ద్వారా మన హృదయాలను శుభ్రపరచుకోవచ్చు. మన స్వార్థాన్ని, వ్యక్తిగత కోరికలను విడిచిపెట్టి, దైవిక ప్రేమతో నిండిన హృదయాన్ని అలవర్చుకోవాలి. ఇది నిరంతర ప్రక్రియ. మన ఆలోచనలు, మాటలు, చేతలు దేవుని మహిమను ప్రతిబింబించేలా చూసుకోవాలి. మరియమ్మ హృదయం దేవుని చిత్తానికి పూర్తిగా లొంగిపోయింది. అలాగే, మనం కూడా మన హృదయాలను దేవునికి అంకితం చేయడం ద్వారా పరిశుద్ధత వైపు అడుగులు వేయగలం.

నమ్మకం మరియు విధేయత: మరియమాత జీవితం దేవుని చిత్తానికి సంపూర్ణంగా విధేయత చూపిన గొప్ప మాదిరి. గబ్రియేలు దూత సందేశం నుండి, యేసు సిలువ మరణం వరకు, ఆమె ఎప్పుడూ దేవుని ప్రణాళికను విశ్వసించింది, ఎటువంటి సందేహం లేకుండా ఆయనకు లోబడింది. ఈ విధేయతలో ఆపారమైన నమ్మకం ఉంది. మన జీవితంలో కూడా అనేక సవాళ్లు, కష్టాలు ఎదురవుతాయి. కొన్నిసార్లు దేవుని ప్రణాళిక మనకు అర్థం కాకపోవచ్చు, లేదా మన కోరికలకు వ్యతిరేకంగా ఉండవచ్చు. అలాంటి సమయాల్లో కూడా, మరియమాత వలె, మనం దేవునిపై అచంచలమైన నమ్మకం ఉంచాలి. ఆయన ప్రణాళిక మనకు ఉత్తమమైనదని విశ్వసించాలి. ఆయనకు సంపూర్ణంగా అప్పగించుకోవడం ద్వారా మనం ఆయన ఆశీర్వాదాలను, శాంతిని అనుభవించగలం. విధేయత అనేది కేవలం ఆజ్ఞలను పాటించడం కాదు, అది దేవుని ప్రేమను, జ్ఞానాన్ని నమ్మడం.

ప్రేమలో ఎదగడం: మరియమాత చూపిన అపారమైన ప్రేమ నిస్వార్థమైనది, దుఃఖంతో కూడినది, మరియు మానవాళి మొత్తం పట్ల విశాలమైనది. ఆమె ప్రేమ కేవలం తన కుమారుడికే పరిమితం కాలేదు, అది విశ్వాసులందరినీ తన ఆధ్యాత్మిక బిడ్డలుగా చూసుకుంది. మనం కూడా ఆమె మాదిరిగానే ప్రేమలో ఎదగడానికి ప్రయత్నించాలి. ఇది మన కుటుంబ సభ్యుల పట్ల, స్నేహితుల పట్ల, మరియు ముఖ్యంగా మన శత్రువుల పట్ల కూడా క్రీస్తు ప్రేమను ప్రతిబింబించగలగాలి. ఇతరుల పట్ల దయ, కరుణ, క్షమాపణ చూపడం ద్వారా మనం మరియమ్మ ప్రేమను అనుకరించగలం. స్వార్థం లేకుండా ఇతరుల మంచిని కోరడం, కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేయడం ద్వారా మనం ఈ ప్రేమను ఆచరణలో పెట్టవచ్చు. ప్రేమించడం అంటే త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండటం, ఇది మరియమ్మ జీవితంలో స్పష్టంగా కనిపిస్తుంది.

ప్రార్థన జీవితం: మరియమాత హృదయం నిరంతరం ప్రార్థనలో దేవునితో ఐక్యమై ఉంది. ఆమె తన జీవితాంతం దేవునితో సంభాషణలో ఉంది, తన హృదయంలో ఆయన వాక్యాన్ని ధ్యానించుకుంది. ఆమెకు దేవునితో ఉన్న సన్నిహిత సంబంధానికి ప్రార్థనే ఆధారం. మన ఆధ్యాత్మిక జీవితంలో, ప్రార్థన కేంద్ర బిందువుగా ఉండాలి. మరియమాత వలె మనం కూడా నిరంతరం ప్రార్థనలో ఉండాలి. ప్రార్థన ద్వారా దేవునితో మన సంబంధాన్ని బలపరుచుకోవాలి. అది కేవలం విజ్ఞాపనలు చేయడం మాత్రమే కాదు, దేవునితో మాట్లాడటం, ఆయన మాట వినడం, ఆయన సన్నిధిలో గడపడం. క్రమం తప్పకుండా ప్రార్థించడం మనకు ఆధ్యాత్మిక బలాన్ని, మార్గదర్శకత్వాన్ని, మరియు దేవునితో శాంతియుతమైన సంబంధాన్ని అందిస్తుంది.

ఈవిధముగా, మరియమాత తిరుహృదయం మనకు పరిశుద్ధత, విధేయత, ప్రేమ, మరియు ప్రార్థనతో కూడిన జీవితాన్ని ఎలా జీవించాలో నేర్పే ఒక నిరంతర ప్రేరణ. ఆమె మాదిరిని అనుసరించడం ద్వారా మనం దేవునికి మరింత దగ్గరగా, ఆయన చిత్తానికి మరింత అనుగుణంగా జీవించగలం.

ముగింపు: ప్రియ సహోదరీ సహోదరులారా! మరియమాత తిరుహృదయ ఉత్సవం కేవలం ఒక సంప్రదాయబద్ధమైన వేడుక మాత్రమే కాదు, మన జీవితాలను ఆధ్యాత్మికంగా పునరుద్ధరించుకోవడానికి లభించిన ఒక అమూల్యమైన అవకాశం. మరియమాత హృదయం నుండి మనం నేర్చుకోవలసిన గొప్ప పాఠాలు చాలా ఉన్నాయి. ఆమె జీవితం దైవిక ప్రేమ, నిస్వార్థ విధేయత, మరియు అచంచలమైన పరిశుద్ధతకు ఒక జీవన మాదిరి.

ఆమె హృదయం దేవుని చిత్తానికి సంపూర్ణంగా అంకితమైంది. “నేను ప్రభువు దాసురాలను; నీ మాట చొప్పున నాకు జరుగుగాక!” అని ఆమె పలికిన మాటలు దేవుని పట్ల ఆమెకున్న అచంచలమైన నమ్మకాన్ని, విధేయతను తెలియజేస్తాయి. మన జీవితంలో ఎన్ని సవాళ్లు ఎదురైనా, దేవుని ప్రణాళికపై సంపూర్ణంగా విశ్వాసం ఉంచి, ఆయన చిత్తానికి లోబడటం ఎలాగో ఆమె మనకు నేర్పుతుంది.

మరియమాత హృదయం కేవలం నిస్వార్థ ప్రేమకు నిలయం మాత్రమే కాదు, తన కుమారుడైన యేసు సిలువపై పడిన బాధను చూసి ఆమె అనుభవించిన వేదన ఆమె దుఃఖంతో కూడిన ప్రేమకు చిహ్నం. ఆ వేదన కూడా ఆమె ప్రేమలో భాగమే. అలాగే, ఆమె హృదయం సర్వమానవాళి పట్ల విశాలమైన ప్రేమను కలిగి ఉంది. ఆమె మనందరికీ ఆధ్యాత్మిక తల్లి. తన కుమారుని ద్వారా మనందరికీ రక్షణ లభించాలని ఆమె హృదయపూర్వకంగా కోరుకుంది. ఆమె చూపిన ఈ ప్రేమను మనం కూడా అనుకరించడానికి ప్రయత్నించాలి. మన కుటుంబ సభ్యుల పట్ల, స్నేహితుల పట్ల, చివరికి మన శత్రువుల పట్ల కూడా క్రీస్తు ప్రేమను ప్రతిబింబించాలి.

మరియమాత జీవితం నిరంతర ప్రార్థనతో దేవునితో ఐక్యమై ఉంది. ఆమె వలె మనం కూడా నిరంతరం ప్రార్థనలో దేవునితో మన సంబంధాన్ని బలపరుచుకోవాలి. ప్రార్థన ద్వారా ఆయనతో సన్నిహితంగా ఉండటం, ఆయన చిత్తాన్ని అర్థం చేసుకోవడం ద్వారా మన హృదయాలను పరిశుద్ధంగా ఉంచుకోవడానికి ఆమె హృదయం మనకు ప్రోత్సాహాన్ని ఇస్తుంది.

మరియ తిరుహృదయం మనకు నిత్యం స్ఫూర్తినిస్తుందని ఆశిస్తున్నాను. ఆమె మనకు దైవిక ఆశీర్వాదాలు పొందేందుకు సహాయపడుగాక! ఆమె బలమైన మధ్యవర్తిత్వం ద్వారా మనం యేసుప్రభువుకు మరింత దగ్గరవుదాం.

మరియ తిరుహృదయం ద్వారా మనందరికీ శాంతి, ప్రేమ, ఆశీర్వాదాలు లభించుగాక. ఆమేన్.

యూత్ జూబ్లీ దివ్యబలిపూజ, పోప్ లియో XIV ప్రసంగం, టోర్ వెర్గాటా, 3 ఆగస్టు 2025

యూత్ జూబ్లీ
దివ్యబలిపూజ
పరిశుద్ధ పోప్ లియో XIV గారి ప్రసంగం
టోర్ వెర్గాటా
18వ సామాన్య ఆదివారం, 3 ఆగస్టు 2025

పవిత్ర దివ్యబలి పూజకు ముందు యువతకు పరిశుద్ధ పోప్ లియో XIV గారి శుభాకాంక్షలు:

శుభోదయం! ఆదివారం శుభాకాంక్షలు! మీరంతా కాస్త విశ్రాంతి తీసుకున్నారని ఆశిస్తున్నాను. మరికాసేపట్లో క్రీస్తు మనకు ప్రసాదించిన అతి గొప్ప కానుకయైన ఆయన సన్నిధిని దివ్యసత్ప్రసాద రూపంలో మనం అనుభవించబోతున్నాం. ఈ క్షణం మనందరి హృదయాల్లో చిరస్మరణీయంగా నిలిచిపోవాలి. క్రీస్తు సంఘంగా మనమంతా ఒక్కటై, ఆయనతో కలిసి నడుస్తూ, జీవిస్తూ ఈ వేడుకను ఘనంగా జరుపుకుందాం.

-------------------

గత రాత్రి జరుపుకున్న ప్రార్థనా జాగరణ తర్వాత, మరికాసేపట్లో, క్రీస్తు మనకు ప్రసాదించిన అతి గొప్ప కానుక, అయిన దివ్యసత్ప్రసాద విందును (యూకరిస్ట్) మనం ప్రారంభించబోతున్నాం. ఈ ప్రత్యేకమైన సమయాన్ని పురస్కరించుకుని, ఎమ్మావుస్ గ్రామానికి వెళ్లే శిష్యుల ప్రయాణాన్ని మన మనసుల్లోకి తెచ్చుకుందాం (లూకా 24:13-35). యేసు మరణంతో నిరాశ, భయంతో యెరూషలేము నుండి బయలుదేరిన ఆ శిష్యులు, ఇక ఏ ఆశా మిగలలేదని భావించారు. అయితే, ఆ మార్గంలో యేసు వారిని కలుసుకున్నారు. వారు ఆయన్ని తమ తోడుగా ఆహ్వానించి, ఆయన లేఖనములను వివరిస్తుంటే శ్రద్ధగా ఆలకించారు. చివరికి రొట్టెను విరిచే సమయంలో ఆయన్ని గుర్తించారు. ఆ క్షణంలో వారి కళ్ళు తెరుచుకున్నాయి. ఈస్టర్ శుభవార్త వారి హృదయాలను ఆనందంతో నింపింది. ఈ రోజు, మనం కూడా ఈ దివ్యబలి పూజలో, క్రీస్తు మనతో ఉన్నారని గ్రహించి ఆనందంతో నిండిపోదాం.

దివ్య గ్రంథ ఆరాధనలో ఈ సంఘటన గురించి నేరుగా ప్రస్తావించనప్పటికీ, ఇది మన జీవితాలను పూర్తిగా మార్చివేసే ఒక ప్రత్యేకమైన కలయిక గురించి ఆలోచించమని మనల్ని ప్రోత్సహిస్తుంది. పునరుత్థానం చెందిన క్రీస్తుతో మనకు కలిగే ఈ సమావేశం మన ప్రేమ, ఆశలు, ఆలోచనలను ప్రకాశవంతం చేస్తుంది, సరికొత్త దృక్పథాన్ని అందిస్తుంది.

ఉపదేశకుని గ్రంథంనుండి తీసుకున్న మొదటి పఠనంలో, ఎమ్మావుస్ గ్రామానికి వెళ్లే శిష్యుల వలె, మనలోని పరిమితులను, అలాగే ఏదీ శాశ్వతం కాదని, అన్నీ క్షణికమైనవేనని (1:2; 2:21-23) అంగీకరించమని కోరుతుంది. కీర్తన 90:5-6 లో కూడా “ఉదయమున మొలకెత్తు గడ్డి వంటివారము; సాయంకాలమున వాడి ఎండి పోవును” అని గడ్డితో పోల్చి మానవ జీవితం యొక్క అస్థిరతను వివరిస్తుంది. ఈ రెండు వాస్తవాలు మనల్ని కలవరపెట్టవచ్చు. అయితే, వీటిని మనం భయపడి పక్కన పెట్టాల్సిన అంశాలుగా చూడకూడదు. ఎందుకంటే, వాటి సున్నితత్వం సృష్టిలోని అద్భుతాలలో భాగం. గడ్డి పూల పొలం గురించి ఆలోచించండి: దాని అందం ఎంత అద్భుతమైనదో! ఆ గడ్డి సున్నితమైన కాండాలతో బలహీనంగా ఉన్నప్పటికీ, త్వరగా వాడిపోవచ్చు, విరిగిపోవచ్చు. అయినప్పటికీ, వాడిపోయిన ఆ పూల నుండి వచ్చే పోషకాలతో మళ్ళీ కొత్త పూలు మొలకెత్తుతాయి. ఈ నిరంతర పునరుత్పత్తి ప్రక్రియ ద్వారానే ఆ పొలం జీవిస్తుంది. చలికాలంలో అంతా నిశ్శబ్దంగా ఉన్నట్లు అనిపించినా, దాని శక్తి భూమిలో నిక్షిప్తమై ఉంటుంది. వసంతం వచ్చినప్పుడు వేల రంగులతో వికసించడానికి అది సిద్ధంగా ఉంటుంది.

ప్రియమైన మిత్రులారా, మనం కూడా అదే విధంగా సృష్టించబడ్డాం. కేవలం ఒకేలా ఉండే జీవితం కోసం కాదు, ప్రేమతో మనల్ని మనం ఇతరులకు అర్పించుకోవడం ద్వారా నిరంతరం నూతనమయ్యే ఉనికి కోసం మనం సృష్టించబడ్డాం. అందుకే, ఈ సృష్టిలో ఏదీ ఇవ్వలేని ఏదో 'గొప్ప' దాని కోసం మనం నిరంతరం తపిస్తూ ఉంటాం. ఈ లోకంలోని ఏ పానీయం తీర్చలేని లోతైన దాహాన్ని మనం అనుభవిస్తుంటాం. ఈ సత్యాన్ని గ్రహించి, మన హృదయాలను చవకబారు వాటితో నింపి మోసపోవద్దు. బదులుగా, మన అంతరాత్మ మాట విందాం! ఆ దాహాన్ని దేవునితో మనల్ని కలిపే ఒక మెట్టుగా మారుద్దాం. పిల్లలు ఎలాగైతే కాలి వేళ్లపై నిలబడి కిటికీలోంచి తొంగి చూస్తారో, అలాగే మనం కూడా ఆయన్ని చేరుకోవడానికి ప్రయత్నిద్దాం. అప్పుడు, మన ఆత్మ తలుపును సున్నితంగా తడుతున్న ఆయన (దర్శన 3:20) ఎదుట మనం నిలబడతాం. ముఖ్యంగా యుక్తవయసులో మన హృదయాలను పూర్తిగా తెరిచి, ఆయనను లోపలికి రానిచ్చి, ఆయనతో కలిసి నిత్యత్వం వైపు ఈ సాహసయాత్రను ప్రారంభించడం నిజంగా ఒక అద్భుతమైన అనుభవం.

పునీత అగుస్తీనుగారు తన లోతైన దైవాన్వేషణ గురించి ఆలోచిస్తూ తనను తాను ఇలా ప్రశ్నించుకున్నారు: “మరి, మన ఆశ దేనిపై ఉండాలి? ఈ భూమి పైనా? కాదు. భూమి నుండి వచ్చే బంగారం, వెండి, చెట్లు, పంటలు, లేదా నీరు వంటి వాటి పైనా? ఇవన్నీ మనసుకు ఆనందాన్ని, అందాన్ని, మంచిని ఇస్తాయి. కానీ వీటిపై కాదు.” ఆ తర్వాత అగుస్తీనుగారు ఈ నిర్ధారణకు వచ్చారు: “వాటిని సృష్టించిన ఆయన్నే వెదకండి, ఆయనే మీ నిజమైన నిరీక్షణ.” తన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని స్మరించుకొంటూ ఇలా ప్రార్థించారు: “ఓ ప్రభూ, నువ్వు నాలోనే ఉన్నావు, కానీ నేను వెలుపల ఉండి నిన్ను వెదికాను... నీవు పిలిచావు, బిగ్గరగా అరిచావు, నా చెవుడును పోగొట్టావు. నీవు మెరిసావు, ప్రకాశించావు, నా అంధత్వాన్ని తొలగించావు. నీ పరిమళాన్ని నాపై వెదజల్లావు; నేను శ్వాస తీసుకున్నాను, ఇప్పుడు నీ కోసం ఆరాటపడుతున్నాను. నిన్ను నేను రుచి చూశాను (కీర్తన 34:8; 1 పేతురు 2:3), ఇప్పుడు మరింత ఆకలి, దాహంతో ఉన్నాను (మత్త 5:6; 1 కొరి 4:11); నువ్వు నన్ను తాకావు, నీ శాంతి కోసం నేను తపించాను” (కన్ఫెషన్స్, 10, 27).

మన హృదయాలలో ఒక మండుతున్న ప్రశ్న, మనం విస్మరించలేని ఒక సత్యం కోసం ఒక అవసరం ఉంది. ఇది మనల్ని మనం ఇలా ప్రశ్నించుకునేలా చేస్తుంది: నిజమైన ఆనందం అంటే ఏమిటి? జీవితం యొక్క నిజమైన అర్థం ఏమిటి? అర్థం లేనితనం, విసుగు, మామూలుతనం నుండి మనల్ని ఏది విముక్తి చేస్తుంది?

ఇటీవలి రోజుల్లో మీరు ఎన్నో అద్భుతమైన అనుభవాలను సొంతం చేసుకున్నారు. ప్రపంచం నలుమూలల నుండి, విభిన్న సంస్కృతుల నుండి వచ్చిన యువతను కలుసుకున్నారు. కళలు, సంగీతం, సాంకేతికత, క్రీడల వంటి వాటి ద్వారా మీ అనుభవాలను, ఆశయాలను పరస్పరం పంచుకున్నారు. అలాగే, సర్కస్ మాక్సిమస్‌లో, మీరు పాప క్షమాపణ దివ్యసంస్కారాన్ని కూడా స్వీకరించి, మంచి జీవితాన్ని గడపడానికి దేవుని దయను కోరారు.

ఈ అనుభవాలన్నిటి ద్వారా మీరు ఒక ముఖ్యమైన విషయాన్ని అర్థం చేసుకోగలరు. మన జీవిత పరిపూర్ణత అనేది మనం కూడబెట్టుకునే వాటిపై, లేదా సువార్తలో చెప్పినట్లుగా, మనం కలిగి ఉండే వాటిపై ఆధారపడి ఉండదు (లూకా 12:13-21). బదులుగా, ఆ పరిపూర్ణత మనం సంతోషంగా స్వీకరించే, మరియు పంచుకునే వాటిపై ఆధారపడి ఉంటుంది (మత్తయి 10:8-10; యోహాను 6:1-13). కేవలం కొనడం, నిల్వ చేయడం, మరియు వినియోగించడం మాత్రమే సరిపోదు. మనం మన కళ్ళను పైకి ఎత్తి, “పైనున్న వాటి”వైపు చూడాలి (కొలొస్సీ 3:2). అప్పుడే ఈ ప్రపంచంలోని ప్రతిదీ మనల్ని దేవునితో, మన సహోదరీ, సహోదరులతో ప్రేమలో ఏకం చేయడానికి ఉపయోగపడుతుందని తెలుసుకుంటాం. ఆ తర్వాత మనం “కరుణ, దయ, వినయం, సాత్వికం, ఓర్పు’ (కొలొస్సీ 3:12), క్షమ (కొలొస్సీ 3:13), మరియు శాంతి (యోహాను 14:27)లలో ఎదగగలం. ఇదంతా క్రీస్తును అనుసరించడం ద్వారానే సాధ్యమవుతుంది (ఫిలిప్పీ 2:5). విధంగా, మనకు ఇవ్వబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయాలలో నింపబడింది కాబట్టి, మన నిరీక్షణ ఎప్పటికీ నిరాశపరచదు అనే లోతైన అవగాహనలోకి మనం ఎదుగుతాం (రోమీ 5:5).

ప్రియమైన యువ మిత్రులారా, యేసు మన నిరీక్షణ. రెండవ పోప్ జాన్ పాల్ గారు చెప్పినట్లు, “మన జీవితంలో గొప్ప కార్యాలు చేయాలనే కోరికను, సమాజాన్ని మరింత మానవీయంగా, సౌభ్రాతృత్వంగా మార్చడానికి మనల్ని ప్రేరేపించేది ఆయనే” (15వ ప్రపంచ యువజన దినోత్సవం, ప్రార్థనా జాగరణ, 19 ఆగస్టు 2000). మనం ఎల్లప్పుడూ ఆయనతో ఐక్యంగా, ఆయన స్నేహంలో నిలిచి ఉందాం. ప్రార్థన, ఆరాధన, దివ్యసత్ప్రసాద స్వీకరణ, తరచుగా పాపక్షమాపణ మరియు దానధర్మాల ద్వారా ఈ స్నేహాన్ని పెంచుకుందాం. త్వరలో పునీతులుగా ప్రకటించబడనున్న ధన్యులైన పియర్‌జార్జియో ఫ్రస్సాతి, ధన్యులైన కార్లో అకుటిస్ వంటివారిని స్ఫూర్తిగా తీసుకుందాం. మీరు ఎక్కడ ఉన్నా సరే, గొప్ప విషయాల కోసం, పరిశుద్ధత కోసం ఆరాటపడండి. తక్కువతో సంతృప్తిపడకండి. అప్పుడే సువార్త వెలుగు మీలో, మీ చుట్టూ ప్రతిరోజూ పెరుగుతూ ఉండటాన్ని మీరు చూస్తారు.

మీరు మీ దేశాలకు తిరిగి వెళ్తున్నప్పుడు, ప్రపంచంలోని ప్రతి ప్రాంతంలో, రక్షకుని అడుగుజాడల్లో ఆనందంగా నడవాలని, మీరు కలిసే ప్రతి ఒక్కరికీ మీ ఉత్సాహాన్ని, మీ విశ్వాసాన్ని చాటిచెప్పాలని నిరీక్షణ మాత అయిన కన్య మరియకు మిమ్మల్ని అప్పగిస్తున్నాను.

మూలము:
https://www.vatican.va/content/leo-xiv/en/homilies/2025/documents/20250803-omelia-giubileo-giovani.html

గురుశ్రీ ప్రవీణ్ గోపు OFM Cap.

త్రికాల ప్రార్ధన, లియో XIV, 3 ఆగష్టు 2025

 లియో XIV
త్రికాల ప్రార్ధన
పునీత పేతురు బసిలికా ప్రాంగణం
ఆదివారము, 3 ఆగష్టు 2025

 

ప్రియమైన మిత్రులారా,

మన ప్రభువైన యేసుక్రీస్తు మన మధ్య, మనలోని ప్రతి ఒక్కరిలో ఉన్నారు. ఆయనతో కలిసి, ఈ ప్రత్యేకమైన రోజులనుబట్టి, ఈ సువర్ణోత్సవానికి మన తండ్రి అయిన దేవుడికి కృతజ్ఞతలు తెలియజేయాలని నేను కోరుకుంటున్నాను. ఇది మన సంఘానికి, యావత్ ప్రపంచానికి ఒక గొప్ప వరంగా నిలిచిపోయింది. మీలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం వల్లే ఇది సాధ్యమైంది. అందుకే, నా హృదయం నిండా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ మధ్యకాలంలో మరణించిన ఇద్దరు యువ యాత్రికులను నేను ప్రత్యేకంగా గుర్తు చేసుకుంటున్నాను. ఒకరు స్పెయిన్‌కు చెందిన మరియ, మరొకరు ఈజిప్ట్‌కు చెందిన పాస్కల్. వారి ఆత్మలను నేను ప్రభువుకు అప్పగిస్తున్నాను. ఈ కార్యక్రమానికి సహాయం చేసిన బిషప్‌లు, గురువులు, మఠవాసులు, మఠకన్యలు, విద్యావేత్తలు, మరియు ఈ కార్యక్రమం కోసం ప్రార్థించి, ఆత్మీయంగా భాగం పంచుకున్న ప్రతి ఒక్కరికీ నా ధన్యవాదాలు.

క్రీస్తుతో మన ఐక్యత, సహవాసము ద్వారా, ఈ ప్రపంచానికి శాంతి, ఆశలను అందిస్తూ, ఇతరుల వల్ల కలిగే తీవ్రమైన కష్టాలను అనుభవిస్తున్న యువతకు మనం గతంలో కంటే ఇప్పుడు మరింత దగ్గరగా ఉన్నాము. గాజా, ఉక్రెయిన్, మరియు యుద్ధాలతో రక్తసిక్తమైన ప్రతి దేశంలోని యువతకు మేము అండగా ఉన్నాము. నా ప్రియ యువతీయువకులారా, వేరే ప్రపంచం సాధ్యమని నిరూపించేది మీరే. ఆ ప్రపంచంలో సోదరభావం, స్నేహం ఉంటాయి. అక్కడ సమస్యలు ఆయుధాలతో కాకుండా, చర్చల ద్వారా పరిష్కరించబడతాయి.

అవును, క్రీస్తుతో ఇది సాధ్యమే! ఆయన ప్రేమ, ఆయన క్షమాపణ, ఆయన ఆత్మ శక్తితో ఇది తప్పక సాధ్యమవుతుంది. నా ప్రియ స్నేహితులారా, మీరు ద్రాక్షతీగకు అంటుకట్టబడిన కొమ్మలవలే యేసుతో ఐక్యంగా ఉంటే, మీరు గొప్ప ఫలాలను ఫలిస్తారు. మీరు ఈ భూమికి ఉప్పులా, లోకానికి వెలుగులా మారతారు. మీరు మీ కుటుంబాలలో, స్నేహితులలో, పాఠశాలలో, కార్యాలయాలలో, క్రీడలలో, మీరు నివసించే ప్రతి చోటా ఆశకు విత్తనాలుగా ఉంటారు. మన ఆశయానికి మూలమైన క్రీస్తుతో కలిసి మీరు ఆశాజ్యోతులుగా నిలబడతారు.

ఈ జూబిలీ తరువాత, యువత యొక్క ఆశతో కూడిన యాత్ర కొనసాగుతుంది, అది మనల్ని ఆసియాకు తీసుకువెళ్తుంది! రెండు సంవత్సరాల క్రితం లిస్బన్‌లో పోప్ ఫ్రాన్సిస్ ఇచ్చిన ఆహ్వానాన్ని నేను మరోసారి గుర్తుచేస్తున్నాను. ప్రపంచం నలుమూలల నుండి యువతీ యువకులు 2027 ఆగస్టు 3 నుండి 8 వరకు దక్షిణ కొరియాలోని సియోల్‌లో జరిగే ప్రపంచ యువజన దినోత్సవంలో పునీత పేతురు వారసుడితో కలిసి పాల్గొంటారు. ఆ వేడుకల అంశం ధైర్యంగా ఉండండి! నేను ఈ లోకాన్ని జయించాను!(యోహాను 16:33). మన హృదయాలలో నిండిన ఆశే, చెడు మరియు మరణంపై క్రీస్తు సాధించిన విజయాన్ని ప్రకటించడానికి మనకు శక్తిని ఇస్తుంది. ఆశతో కూడిన యువ యాత్రికులైన మీరు, ఈ సత్యానికి భూమి నలుమూలలా సాక్షులుగా నిలుస్తారు. మిమ్మల్ని సియోల్‌లో కలవడానికి నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. మనం కలిసి కలలు కనడం, కలిసి ఆశించడం కొనసాగిద్దాం.

పవిత్ర కన్య మరియ మాతృత్వ రక్షణలో మనల్ని మనం అప్పగించుకుందాం.

మూలము:
https://www.vatican.va/content/leo-xiv/en/angelus/2025/documents/20250803-angelus.html

గురుశ్రీ ప్రవీణ్ గోపు OFM Cap.

త్రికాల ప్రార్ధన, లియో XIV, 27 జూలై 2025

త్రికాల ప్రార్ధన
లియో XIV
పునీత పేతురు బసిలికా ప్రాంగణం
ఆదివారము, 27 జూలై 2025 


ప్రియ సహోదరీ సహోదరులారా! శుభ ఆదివారం!

ఈ రోజు సువార్తలో, యేసు తన శిష్యులకు ప్రార్థన గురించి బోధిస్తూ ‘పరలోక తండ్రి’ ప్రార్థనను నేర్పించారు (లూకా 11:1-13). ఈ ప్రార్థన క్రైస్తవులందరినీ ఏకం చేస్తుంది. ప్రభువు మనలను దేవున్ని “అబ్బా, తండ్రి” అని పిలవమని ఆహ్వానిస్తున్నారు. ఈ పిలుపులో ఒక బిడ్డకు ఉండే సహజమైన సరళత, నమ్మకం, ధైర్యం మరియు తాను ప్రేమించబడుతున్నాననే నిశ్చయత కనిపిస్తుంది (కతోలిక శ్రీసభసత్యోపదేశం 2778).

ఈ విషయాన్ని సత్యోపదేశం చాలా చక్కగా వివరిస్తుంది: “ప్రభువు ప్రార్థన మనల్ని మనకే బయలుపరుస్తుంది, అలాగే తండ్రిని మనకు బయలుపరుస్తుంది” (నం. 2783). ఇది నిజంగా ఎంతో సత్యం! మనం పరలోక తండ్రిని ఎంత నమ్మకంతో ప్రార్థిస్తే, మనం ఆయనకు అత్యంత ప్రీతిపాత్రమైన బిడ్డలమని అంత ఎక్కువగా గ్రహిస్తాము. అలాగే, ఆయన లోతైనప్రేమ కూడా మరింతగా అనుభవించగలుగుతాము (రోమా 8:14-17 చూడండి).

నేటి సువార్తలో, యేసు తండ్రి దేవుని స్వభావాన్ని కొన్ని ఉదాహరణలతో మనకు వివరిస్తున్నారు: ఒకటి, అర్ధరాత్రి తన ఇంటికి అకస్మాత్తుగా వచ్చిన అతిథికి సహాయం చేసిన తండ్రి; మరియు, తమ పిల్లలకు మంచి వరాలు ఇవ్వడానికి శ్రద్ధ చూపే తండ్రి.

ఈ ఉపమానాలు మనకు ఒక ముఖ్యమైన సత్యాన్ని గుర్తుచేస్తున్నాయి. మనం తలుపు తట్టినప్పుడు దేవుడు ఎప్పుడూ మనలను తిరస్కరించరు. మనం చేసిన తప్పులు, కోల్పోయిన అవకాశాలు, వైఫల్యాల తర్వాత ఆలస్యంగా వచ్చినా ఆయన మనల్ని స్వాగతిస్తారు. కొన్నిసార్లు మనల్ని ఆహ్వానించడం కోసం, ఇంట్లో నిద్రపోతున్న తన పిల్లలను కూడా “లేపాల్సి” వచ్చినా ఆయన వెనుకాడరు (లూకా 11:7 చూడండి). నిజానికి, శ్రీసభ అనే మహా కుటుంబంలో, తండ్రి తన ప్రేమయుక్తమైన ప్రతి చర్యలో మనమందరినీ భాగస్వాములను చేయడానికి వెనుకాడరు. మనం ప్రార్థించినప్పుడు ప్రభువు మనలను ఎల్లప్పుడూ ఆలకిస్తారు. ఆయన సమాధానం కొన్నిసార్లు మనకు అర్థంకాని రీతిలో లేదా మనం ఊహించని సమయాలలో రావచ్చు. ఎందుకంటే ఆయన జ్ఞానం, దూరదృష్టి మన అవగాహనకు అతీతమైనవి. అలాంటి సందర్భాలలో కూడా మనం విశ్వాసంతో ప్రార్థించడం ఆపకూడదు, ఎందుకంటే ఆయనలో మనం ఎల్లప్పుడూ వెలుగును, బలాన్ని పొందుకుంటాము.

‘పరలోక తండ్రి’ ప్రార్థనను జపించేప్పుడు, మనం దేవుని బిడ్డలమనే గొప్ప అనుగ్రహాన్ని గుర్తు చేసుకోవడమే కాకుండా, ఈ వరానికి ప్రతిస్పందనగా క్రీస్తులో సోదరీ సోదరులుగా ఒకరినొకరు ప్రేమించుకోవడానికి మనకున్న అంకితభావాన్ని కూడా వ్యక్తపరుస్తాము. దీనిపై శ్రీసభ పితరులు ఇలా అన్నారు: పునీత సిప్రియన్: “మనం దేవుడిని ‘మన తండ్రి’ అని పిలిచినప్పుడు, మనం నిజమైన దేవుని బిడ్డలముగా ప్రవర్తించాలి.” పునీత జాన్ క్రిసోస్టమ్: “నీవు క్రూరమైన, దయలేని హృదయాన్ని కలిగి ఉంటే, సర్వ దయామయుడైన దేవుడిని నీ తండ్రి అని పిలవలేవు. ఎందుకంటే అలాంటి హృదయంలో పరలోకపు తండ్రి దయ యొక్క ముద్ర ఉండదు”. కాబట్టి, మనం దేవుడిని “తండ్రి” అని పిలిచి, మన తోటివారి పట్ల కఠినంగా, సున్నితత్వం లేకుండా ఉండలేము. అందుకు బదులుగా, ఆయన దయ, సహనం మరియు కరుణల ద్వారా మనం మార్చబడాలి, తద్వారా ఆయన స్వరూపం అద్దంలో లాగా మన జీవితాల్లో ప్రతిబింబిస్తుంది.

ప్రియ సహోదరీ సహోదరులారా, నేటి దైవార్చన మనలను ప్రార్థన, ప్రేమ అనే మార్గాల ద్వారా దేవుని ప్రేమను అనుభవించమని ఆహ్వానిస్తోంది. ఆ ప్రేమను పొందుకొని, ఆయనలాగే ఇతరులను ప్రేమించమని కూడా పిలుస్తోంది. ఆ ప్రేమ నిష్కపటమైనది, వినయంతో కూడినది, పరస్పర శ్రద్ధను చూపించేది, మరియు నిజాయితీతో నిండినది. ఈ గొప్ప పిలుపుకు మనం ప్రతిస్పందించేందుకు, మరియు తండ్రి యొక్క దయగల ముఖాన్ని ఇతరులకు ప్రతిబింబించేందుకు, కన్య మరియమ్మ మనకు సహాయం చేయాలని ప్రార్థిద్దాం.

మూలము:
https://www.vatican.va/content/leo-xiv/en/angelus/2025/documents/20250727-angelus.html

గురుశ్రీ ప్రవీణ్ గోపు OFM Cap.


లియో XIV ప్రసంగము, ఆల్బానో కేథడ్రల్, 20 జూలై 2025 (16 C)

 పవిత్ర దివ్య పూజాబలి
పరిశుద్ధ పోప్ లియో XIV ప్రసంగము
ఆల్బానో కేథడ్రల్
16వ సామాన్య ఆదివారం, 20 జూలై 2025

 


ప్రియ సహోదరీ సహోదరులారా,

ఈ అందమైన ఆల్బానో కథడ్రల్‌లో నేటి దివ్యపూజాబలిని కొనియాడుట చాలా సంతోషంగా ఉంది. మీకు తెలిసిన విధంగా, నేను మే 12 ఇక్కడకు రావలసి ఉంది, కానీ పరిశుద్ధాత్మ వేరే విధంగా నన్ను నడిపించారు. నేడు, సహోదరభావంతో, క్రైస్తవ ఆనందంతో మీతో కలిసి ఉండటం నాకు నిజంగా సంతోషంగా ఉంది. ఇక్కడ ఉన్న మీ అందరికీ, మేత్రానులకు, అధికారులకు నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

దివ్యపూజాబలిలో, మొదటి పఠనం మరియు సువార్త పఠనం రెండూ కూడా ఆతిథ్యం, సేవ మరియు దేవుని వాక్యాన్ని వినడం (ఆది 18:1-10; లూకా 10:38-42) గురించి ధ్యానించమని మనలను ఆహ్వానిస్తున్నాయి.

ఆదికాండము 18:1-2లో చెప్పబడినట్లుగా, ముందుగా దేవుడు “మధ్యాహ్నపు ఎండలో” అబ్రాహాము గుడారము దగ్గరికి వచ్చి సందర్శించారు. ఈ సన్నివేశాన్ని ఊహించడం చాలా సులభం: మండుతున్న సూర్యుడు, ఎడారి నిశ్శబ్దం, భరించలేని వేడి, మరియు ఆశ్రయం కోసం చూస్తున్న ముగ్గురు అపరిచితులు. అబ్రాహాము “తన గుడారము వాకిట” కూర్చుని ఉన్నాడు. ఆ సందర్శకులలో అబ్రాహాము దేవుని ఉనికిని గుర్తించి, లేచి, వారిని పలకరించడానికి పరిగెత్తిపోయి వారి యెదుట సాగిలపడి వేడుకున్నాడు. మధ్యాహ్నపు నిశ్శబ్దం ప్రేమపూర్వకమైన పనులతో సాగిపోయింది. అబ్రాహాముతో పాటు, అతని భార్య సారా మరియు సేవకులు అందరు కలిసి భోజనాన్ని సిద్ధం చేసారు. అతిధులు భుజించుచుండగా అబ్రాహాము వారికి సేవలు చేయుటకు తాను అక్కడే చెట్టు క్రింద నిలుచున్నాడు (ఆది 18:8). దేవుడు అబ్రాహామునకు అత్యుత్తమ వార్తను అందించాడు: “నీ భార్య సారాకు ఒక కుమారుడు కలుగును” (ఆది 18:10).

ఈ సంఘటనను బట్టి, దేవుడు సారా, అబ్రాహాముల జీవితాల్లోకి ప్రవేశించడానికి, వారు ఎప్పటినుంచో ఆశించి, చివరికి ఆశ వదులుకున్న సమయములో బిడ్డను ప్రసాదిస్తానని ప్రకటించడానికి, దేవుడు ఆతిథ్య మార్గాన్ని ఎలా ఎంచుకున్నాడో మనం ధ్యానించవచ్చు. అనేక కృపా సమయాల్లో వారిని ఇంతకుముందు సందర్శించిన దేవుడు, ఇప్పుడు ఆతిథ్యాన్ని, నమ్మకాన్ని కోరుతూ వారి తలుపు తట్టడానికి తిరిగి వచ్చారు. వృద్ధ దంపతులు ఏమి జరగబోతుందో పూర్తిగా అర్థం చేసుకోకపోయినా, సానుకూలంగా స్పందిస్తారు. వారు ఆ అజ్ఞాత సందర్శకులలో దేవుని ఆశీర్వాదాన్ని మరియు సాన్నిధ్యాన్ని గుర్తించి, తమ వద్ద ఉన్నదంతా వారికి సమర్పించారు: భోజనం, సాంగత్యం, సేవ మరియు చెట్టు నీడ. దీనికి ప్రతిఫలంగా, వారికి కొత్త జీవితం మరియు సంతానం యొక్క వాగ్దానం లభించింది.

పరిస్థితులు భిన్నంగా ఉన్నప్పటికీ, నేటి సువార్త, దేవుని కార్యాచరణ విధానాన్ని మనకు బోధిస్తుంది. యేసును మార్త, మరియమ్మల ఇంటిలో అతిథిగా చూస్తున్నాము. అయితే ఈసారి, ఆయన మొదటి పఠనంలోవలె అపరిచితుడు కాదు: ఆయన తన స్నేహితుల ఇంటికి పండుగ వాతావరణంలో వచ్చారు. అక్కచెల్లెళ్లలో ఒకరు ఆయనకు సేవ చేస్తూ స్వాగతం పలుకగా, మరొకరు శిష్యురాలు గురువును వింటున్నట్లుగా ఆయన పాదాల వద్ద కూర్చుని ఉన్నారు. మార్తమ్మ తన పనులలో సహాయం కావాలని చేసిన ఫిర్యాదు సందర్భమున, యేసు, దేవుని వాక్యాన్ని వినడం యొక్క విలువను గుర్తించమని తెలియ జేశారు (లూకా 10:41-42 చూడండి).

అయితే, ఈ రెండు వైఖరులను పరస్పరం విరుద్ధమైనవిగా చూడటం లేదా ఈ ఇద్దరు స్త్రీల యోగ్యతలను పోల్చడం సరికాదు. సేవ చేయడం మరియు వాక్యాన్ని వినడం, రెండూ కూడా ఆతిథ్యం యొక్క ప్రధాన అంశాలు.

దేవునితో మన సంబంధానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. మనం మన విశ్వాసాన్ని ఆచరణాత్మక పనుల ద్వారా, మన జీవన స్థితికి, పిలుపుకు అనుగుణంగా మన విధులను నమ్మకంగా నిర్వర్తించాలి. అయితే, దేవుని వాక్యాన్ని ధ్యానించిన తర్వాత, పరిశుద్ధాత్మ మన హృదయాలకు ఏమి చెబుతుందో విన్న తర్వాత మాత్రమే అలా చేయడం అత్యవసరం. దీని కొరకు, నిశ్శబ్దానికి, ప్రార్థనకు మనం సమయాన్ని కేటాయించాలి. శబ్దాలు, ఇతర పరధ్యానాలను తగ్గించి, హృదయపూర్వక సరళతతో దేవుని సన్నిధిలో మనం ఏకాగ్రత వహించాలి. క్రైస్తవ జీవితంలో ఈ కోణం వ్యక్తిగతంగా, సామాజికంగా ఒక విలువగా మారాలి, అలాగే మన కాలానికి ఒక ప్రవచనాత్మక సూచనగా నిలవాలి. దీన్ని మనం ఈ రోజు తిరిగి పొందడం చాలా ముఖ్యం. మాట్లాడే తండ్రిని వినడానికి, “రహస్యంగా చూసే” (మత్త 6:6) దేవునకు మనం స్థానం కల్పించాలి. ఈ వేసవి కాలంలో, దేవునితో మన సంబంధం యొక్క అందాన్ని, ప్రాముఖ్యతను అనుభవించడానికి, అది ఇతరుల పట్ల మనం ఎంతగా బహిరంగంగా, స్వాగతించేలా ఉండటానికి సహాయపడుతుందో తెలుసుకోవాలి.

వేసవి కాలంలో మనకు ఎక్కువ విశ్రాంతి సమయం ఉంటుంది. ఈ సమయంలో మనం ఆలోచించుకోవచ్చు, ధ్యానం చేయవచ్చు, ప్రయాణించవచ్చు, ఒకరితో ఒకరు గడపవచ్చు. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. పనుల ఒత్తిడిని, చింతలను పక్కన పెట్టి, కొన్ని ప్రశాంతమైన క్షణాలను, ధ్యానాన్ని ఆస్వాదిద్దాం. అలాగే, ఇతర ప్రదేశాలను సందర్శించడానికి, ఇతరులను చూసి ఆనందాన్ని పంచుకోవడానికి సమయం కేటాయిద్దాంనేను ఈ రోజు ఇక్కడ చేస్తున్నట్లుగా. వేసవి కాలాన్ని ఇతరుల పట్ల శ్రద్ధ వహించడానికి, ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి, సలహాలు ఇవ్వడానికి, ఓపికగా వినడానికి ఒక అవకాశంగా మలుచుకుందాం. ఎందుకంటే ఇవి ప్రేమకు వ్యక్తీకరణలు, మనందరికీ అవసరమైనవి. ధైర్యంగా ఇలా చేద్దాం. ఈ విధంగా, సంఘీభావం ద్వారా, విశ్వాసాన్ని, జీవితాన్ని పంచుకోవడం ద్వారా, మనం శాంతి సంస్కృతిని ప్రోత్సహించడానికి సహాయపడతాము. మన చుట్టూ ఉన్నవారు విభేదాలను, శత్రుత్వాన్ని అధిగమించి, వ్యక్తులు, ప్రజలు మరియు మతాల మధ్య సత్సంబంధాలను పెంపొందించుకోవడానికి మనం సహాయపడతాము.

పోప్ ఫ్రాన్సిస్ ఇలా అన్నారు: “మనం జీవితాన్ని ఆనందంగా ఆస్వాదించాలంటే, ఈ రెండు మార్గాలను అనుసరించాలి. ఒకవైపు, యేసు పాదాల వద్ద ఉండి, ఆయన మనకు ప్రతిదాని రహస్యాన్ని వెల్లడించినప్పుడు వినాలి; మరోవైపు, ఆయన విశ్రాంతి, స్నేహపూర్వక సహవాసం అవసరమైన స్నేహితుని రూపంలో మన తలుపు తట్టినప్పుడు, ఆతిథ్యం అందించడంలో శ్రద్ధగా, సిద్ధంగా ఉండాలి” (ఏంజెలుస్, జూలై 21, 2019). ఈ మాటలను కరోన మహమ్మారి వ్యాప్తి చెందడానికి కొన్ని నెలల ముందు చెప్పారు. మనం ఇంకా గుర్తుంచుకుంటున్న ఆ సుదీర్ఘమైన, కష్టతరమైన అనుభవం, ఈ మాటలలోని సత్యాన్ని మనకు ఎంతో స్పష్టంగా చూపింది.

ఖచ్చితంగా, ఇదంతా ప్రయత్నంతోనే సాధ్యమవుతుంది. సేవ చేయడం, వినడం ఎప్పుడూ సులభం కాదు; వాటికి కఠోర శ్రమ, త్యాగ నిరతి అవసరం. ఉదాహరణకు, కుటుంబాన్ని పెంచే క్రమంలో నమ్మకమైన, ప్రేమగల తల్లిదండ్రులుగా ఉండటానికి, వినడానికి, సేవ చేయడానికి కృషి అవసరం. అలాగే, పిల్లలు ఇంట్లో, పాఠశాలలో తల్లిదండ్రుల శ్రమకు ప్రతిస్పందించడానికి కూడా కృషి కావాలి. అంతేకాదు, అభిప్రాయభేదాలు వచ్చినప్పుడు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి, తప్పులు జరిగినప్పుడు క్షమించడానికి, ఎవరైనా అనారోగ్యంతో ఉన్నప్పుడు సహాయం చేయడానికి, దుఃఖ సమయాల్లో ఒకరికొకరు ఓదార్పునివ్వడానికి కూడా ప్రయత్నం అవసరం. అయితే, సరిగ్గా ఈ ప్రయత్నం ద్వారానే జీవితంలో విలువైన వాటిని నిర్మించగలం. ప్రజల మధ్య బలమైన, నిజమైన సంబంధాలను ఏర్పరచడానికి, వాటిని పెంపొందించడానికి ఇదే ఏకైక మార్గం. ఈ విధంగా, దైనందిన జీవితపు పునాదులతో, దేవుని రాజ్యం వృద్ధి చెందుతుంది మరియు దాని ఉనికిని వ్యక్తపరుస్తుంది (లూకా 7:18-22).

పునీత అగుస్తీను, మార్తమ్మ మరియు మరియమ్మల కథను తన ఉపన్యాసాలలో ఒకదానిలో వివరిస్తూ ఇలా అన్నారు: “ఈ ఇద్దరు స్త్రీలు రెండు రకాల జీవితాలకు ప్రతీకలు: వర్తమాన జీవితం, భవిష్యత్ జీవితం; కష్టాలతో కూడిన జీవితం, విశ్రాంతి మయమైన జీవితం; ఒకటి బాధలతో నిండినది, మరొకటి దీవించబడినది; ఒకటి తాత్కాలికమైనది, మరొకటి శాశ్వతమైనది" (ప్రసంగం 104, 4). మార్తమ్మ పనిని గురించి ఆలోచిస్తూ అగుస్తీనుగారు ఇలా అన్నారు: “ఇతరులను చూసుకోవాల్సిన బాధ్యత నుండి ఎవరు తప్పించుకోగలరు? ఈ పనుల నుండి ఎవరు విశ్రాంతి తీసుకోగలరు? మనం వాటిని ప్రేమతో, ఎవరూ తప్పుపట్టని విధంగా చేయడానికి ప్రయత్నిద్దాం... అలసట తీరిపోతుంది, విశ్రాంతి వస్తుంది, కానీ మనం చేసిన ప్రయత్నం ద్వారా మాత్రమే అది లభిస్తుంది. ఓడ ప్రయాణించి తన గమ్యస్థానానికి చేరుకుంటుంది; కానీ ఓడ ప్రయాణం ద్వారా తప్ప గమ్యస్థానాన్ని చేరుకోలేము” (ప్రసంగం 104, 6-7).

నేడు, అబ్రాహాము, మార్తమ్మ, మరియమ్మలు మనకు ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నారు: వినడం మరియు సేవించడం అనేవి రెండు పరస్పరం సహకరించే వైఖరులు. ఇవి మనల్ని, మన జీవితాలను ప్రభువు ఆశీర్వాదాలకు తెరవడానికి సహాయపడతాయి. వారి ఉదాహరణను బట్టి, మనం ధ్యానాన్ని మరియు కార్యాన్ని, విశ్రాంతిని మరియు కష్టాన్ని, నిశ్శబ్దాన్ని మరియు మన దైనందిన జీవితంలోని హడావిడిని, జ్ఞానం, సమతుల్యతతో సమన్వయం చేసుకోవాలి. ఎల్లప్పుడూ యేసు ప్రేమను మన కొలమానంగా, ఆయన వాక్యాన్ని మన వెలుగుగా, మరియు మన సొంత శక్తికి మించి మనల్ని నిలబెట్టే ఆయన కృపను మన బలంగా తీసుకుందాం (ఫిలిప్పీ 4:13).

త్రికాల ప్రార్ధన, లియో XIV, 20 జూలై 2025

 లియో XIV
త్రికాల ప్రార్ధన
లిబర్టీ స్క్వేర్ - పియాజ్జా దెల్ల లిబర్తా (కాస్టెల్ గండోల్ఫో)
ఆదివారము, 20 జూలై 2025


ప్రియ సహోదరీ సహోదరులారా! శుభ ఆదివారం!

నేటి దైవార్చన అబ్రహాము మరియు ఆయన భార్య సారాలు చూపిన ఆతిథ్యాన్ని, ఆ తర్వాత యేసు స్నేహితులైన మార్తమ్మ, మరియమ్మ చూపిన ఆతిథ్యాన్ని ధ్యానించమని మనల్ని ఆహ్వానిస్తుంది (ఆది 18:1-10; లూకా 10:38-42 చూడండి). మనం ప్రభువు విందుకు ఆహ్వానించబడి, దివ్యసత్ప్రసాద విందును స్వీకరించిన ప్రతిసారీ, స్వయంగా దేవుడే “మనకు సేవ చేయడానికి వస్తారు” (లూకా 12:37). అయితే, దేవుడు మొదట అతిథిగా ఉండటం అంటే ఏమిటో తెలుసుకున్నారు. నేటికీ, ఆయన మన ద్వారం వద్ద నిలిచి తలుపు తట్టుచున్నాడు (దర్శన 3:20). ఇటాలియన్ భాషలో, “అతిథి” మరియు “ఆతిథ్యమిచ్చే వ్యక్తి” అనే రెండింటికీ ఒకే పదం ఉపయోగించబడుతుంది. ఈ ఆదివారం, ఆతిథ్యం ఇవ్వడం మరియు స్వీకరించడం అనే ఈ పరస్పర సంబంధం గురించి మనం ధ్యానిద్దాం.

ఆతిథ్యం ఇవ్వడానికే కాదు, దాన్ని స్వీకరించడానికి కూడా వినయం అవసరం. ఆతిథ్యానికి మర్యాద, శ్రద్ధ, మరియు నిస్వార్థ గుణం కూడా అవసరం. ఈ క్రమంలో సువార్తలో, మార్తమ్మ కొంత సంతోషాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. యేసును ఆహ్వానించడానికి ఆమె ఎంతగా మునిగిపోయింది అంటే, ఒక ప్రత్యేకమైన కలయిక క్షణాన్ని దాదాపుగా పాడుచేసుకుంది. మార్తమ్మ ఉదార స్వభావం కలది, కానీ ప్రభువు ఆమెను ఉదారత కంటే ఎక్కువగా ఉండాలని కోరుతున్నాడు. మార్తమ్మ తన సన్నాహాలను వదిలిపెట్టి, వచ్చి తనతో సమయం గడపమని యేసు ఆమెను ఆహ్వానిస్తున్నాడు.

ప్రియ సహోదరీ సహోదరులారా, మన జీవితాలు వర్ధిల్లాలంటే, మనకంటే గొప్పదైన దానికి, మనకు ఆనందాన్ని మరియు సంతృప్తిని కలిగించే దానికి మనం మనల్ని మనం తెరిచి ఉంచడం నేర్చుకోవాలి. మార్తమ్మ, తన సోదరి మరియమ్మ పనులన్నీ తనపై వదిలి, తనను వంటరిగా వదిలి వేసిందని ఫిర్యాదు చేసింది (లూకా 10:40). కాని మరియమ్మ మాత్రం యేసు బోధలు వినడంలో లీనమై పోయింది. మరియమ్మ తన సోదరి కంటే తక్కువ ఆచరణాత్మకమైనదీ కాదు, తక్కువ ఉదారమైనదీ కాదు, కానీ ఆమె అత్యంత ముఖ్యమైనది ఏమిటో గుర్తించింది. అందుకే యేసు మార్తమ్మను మందలించారు. ఆమెకు ఎంతో ఆనందాన్ని కలిగించే ఒక అద్భుతమైన క్షణాన్ని పంచుకునే అవకాశాన్ని ఆమె కోల్పోతోంది (10:41-42).

మనం ఎలా నెమ్మదించాలో, మార్తమ్మ కంటే మరియమ్మ వలె మారడం ఎలాగో నేర్చుకోవాలి. కొన్నిసార్లు మనం కూడా అవసరమైన, ఉత్తమమైన వాటిని ఎంచుకోవడంలో విఫలమవుతాము. మనం విశ్రాంతి తీసుకోవడానికి సమయం కేటాయించాలి మరియు ఆతిథ్యం మెరుగ్గా ఇవ్వటాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నించాలి. ‘హాలిడే పరిశ్రమ’ మనకు రకరకాల “అనుభవాలను” విక్రయించాలని చూస్తూ ఉంటుంది, కానీ అవి మనం నిజంగా వెతుకుతున్నవి కాకపోవచ్చు. ప్రతి నిజమైన కలయిక ఉచితం; అది దేవునితో అయినా, ఇతరులతో అయినా, లేదా ప్రకృతితో అయినా ఉచితమే. మనం ఆతిథ్యమును మాత్రమే నేర్చుకోవాలి, ఇందులో ఇతరులను స్వాగతించడం, మనం కూడా స్వాగతించబడటానికి అనుమతించడం ఉన్నాయి. మనం ఇవ్వడమే కాదు, పొందవలసింది కూడా చాలా ఉంది. అబ్రహాము మరియు సారా, వారి వృద్ధాప్యంలో ఉన్నప్పటికీ, ముగ్గురు సందర్శకులలో ప్రభువును ఆహ్వానించిన తర్వాత వారు సంతానాన్ని పొందుకొన్నారు. మనం కూడా మన ముందు ఉన్న జీవితాన్ని స్వాగతించడానికి మరియు స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి.

పరిశుద్ధ మరియ మాతకు ప్రార్థన చేద్దాం. ఆమె మన ప్రభువును తన గర్భంలో మోసి, యోసేపుతో కలిసి ఆయనకు కుటుంబాన్ని ఇచ్చింది. మరియ మాతలో మన పిలుపులోని అందాన్ని, శ్రీసభ యొక్క పిలుపును చూస్తాం. శ్రీసభ అందరికీ తెరిచిన గృహముగా ఉండాలి. ఈ విధంగా, మన తలుపు తట్టి, లోపలికి రావడానికి అనుమతి అడిగే ప్రభువును ఆహ్వానించాలి.

త్రికాల ప్రార్ధన అనంతరం:

ప్రియ సహోదరీ సహోదరులారా,

ఈ ఉదయం నేను అల్బానో కేథడ్రల్‌లో దివ్య బలిపూజను కొనియాడాను. సంఘ ఐక్యతకు, మేత్రాసణ సంఘమును కలుసుకోవడానికి ముఖ్యమైన సమయం. ఈ అద్భుతమైన వేడుకను నిర్వహించడానికి కృషి చేసిన బిషప్ వివా గారికి, అందరికీ నా ధన్యవాదాలు. మేత్రాసణ సంఘానికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను!

ఈ రోజుల్లో మిడిల్ ఈస్ట్ నుండి, ముఖ్యంగా గాజా నుండి విషాదకర వార్తలు వస్తూనే ఉన్నాయి.

గత గురువారం గాజా నగరంలోని హోలీ ఫ్యామిలీ కతోలిక విచారణపై ఇజ్రాయెల్ సైన్యం జరిపిన దాడిపై నేను తీవ్ర విచారంను వ్యక్తం చేస్తున్నాను. ఈ దాడిలో ముగ్గురు క్రైస్తవులు మరణించారు, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. మరణించిన సాద్ ఇస్సా కోస్తాండి సలామెహ్, ఫౌమియా ఇస్సా లతీఫ్ అయ్యద్, నజ్వా ఇబ్రహీం లతీఫ్ అబు దౌద్ ల కోసం నేను ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబాలకు, మరియు విచారణలోని విశ్వాసులందరికీ నా సానుభూతిని తెలియ జేస్తున్నాను. ఈ చర్య గాజాలోని పౌరులు మరియు ప్రార్థనా స్థలాలపై జరుగుతున్న నిరంతర సైనిక దాడులకు అదనంగా చేరడం చాలా విచారకరం.

యుద్ధాన్ని తక్షణమే నిలిపివేయాలని, శాంతియుత పరిష్కారం కనుగొనాలని నేను మరోసారి పిలుపునిస్తున్నాను.

అంతర్జాతీయ సమాజం మానవతా చట్టాన్ని పాటించాలని, పౌరులను రక్షించే బాధ్యతను గౌరవించాలని, సామూహిక శిక్షలను, విచక్షణారహిత బలప్రయోగాన్ని, మరియు ప్రజల బలవంతపు స్థానభ్రంశాన్ని నిషేధించాలని నేను పునరుద్ఘాటిస్తున్నాను.

ప్రియ మిడిల్ ఈస్ట్ క్రైస్తవులారా, ఈ క్లిష్ట పరిస్థితుల్లో మీరు ఏమీ చేయలేకపోతున్నారని భావించే మీ బాధను నేను లోతుగా అర్థం చేసుకోగలను. పోప్, మరియు విశ్వ శ్రీసభ హృదయంలో మీరందరూ ఉన్నారు. మీ విశ్వాస సాక్ష్యానికి ధన్యవాదాలు తెలుపుచున్నాను. [లెవాంట్] కన్య మరియ, మిమ్మల్ని ఎల్లప్పుడూ రక్షించుగాక మరియు ప్రపంచాన్ని శాంతి వైపు నడిపించుగాక.

కాస్టెల్ గాండోల్ఫోలోని విశ్వాసులకు, ఇక్కడ చేరిన యాత్రికులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ‘కాథలిక్ వరల్డ్‌వ్యూ ఫెలోషిప్’ నిర్వహించిన తీర్థయాత్రలో పాల్గొన్న యువకులకు నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వారు కొన్ని వారాల ప్రార్థన, శిక్షణ తర్వాత రోమును సందర్శిస్తున్నారు.

“నాయకుల కోసం ప్రార్థనా మారథాన్”ను ప్రోత్సహించిన ఇంటర్నేషనల్ ఫోరం ఆఫ్ కాథలిక్ యాక్షనుకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను: ప్రతి ఒక్కరికీ అందించిన ఆహ్వానం ఏమిటంటే, ఈ రోజు ఉదయం 10 నుండి రాత్రి 10 గంటల మధ్య ఒక్క నిమిషం పాటు ప్రార్థన చేయడానికి సమయం కేటాయించాలి, మన నాయకులను జ్ఞానవంతులను చేయమని, వారిలో శాంతి కోసం ప్రణాళికలను ప్రేరేపించమని ప్రభువును కోరాలి.

ఈ వారాల్లో, ఫోకోలారె ఉద్యమంలోని కొన్ని కుటుంబాలు “న్యూ ఫ్యామిలీస్ అంతర్జాతీయ పాఠశాల” కోసం లోప్పియానోలో ఉన్నాయి. ఆధ్యాత్మికత మరియు సౌభ్రాతృత్వానికి సంబంధించిన ఈ అనుభవం మిమ్మల్ని విశ్వాసంలో స్థిరంగా, మరియు ఇతర కుటుంబాలకు ఆధ్యాత్మిక తోడుగా ఉండటంలో ఆనందంగా ఉంచుతుందని నేను ప్రార్థిస్తున్నాను.

కాథలిక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, సిబ్బందికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దీని ప్రధాన కార్యాలయం ఇక్కడే కాస్టెల్ గాండోల్ఫోలో ఉంది. అగెసి జెలా 3 స్కౌట్ గ్రూపుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను, ఇది ధన్య కార్లో అకుటిస్ సమాధి వద్ద ముగిసే జూబిలీ తీర్థయాత్రలో పాల్గొంటుంది. కాస్టెల్లో ది గోడెగో యువకులకు కూడా నేను శుభాకాంక్షలు తెలియ జేస్తున్నాను, వీరు రోము కారితాసుతో సేవా అనుభవంలో పాల్గొంటున్నారు. పాలెర్మో, సార్సినా లలోని విశ్వాసులకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

“ఓ స్టాజ్జో” జానపద బృందం సభ్యులు, అలాగే ఆల్బా ది టోర్మెస్ నుండి వచ్చిన సంగీత బృందం కూడా ఇక్కడ ఉన్నారు.

ఈ రెండు వారాలు నేను కాస్టెల్ గాండోల్ఫోలో బస చేసిన తర్వాత, కొన్ని రోజుల్లో నేను తిరిగి వాటికన్‌కు వెళ్తాను. మీ ఆతిథ్యానికి మీ అందరికీ ధన్యవాదాలు. మీ అందరికీ సంతోషకరమైన ఆదివార శుభాకాంక్షలు!

మూలము:
https://www.vatican.va/content/leo-xiv/en/angelus/2025/documents/20250720-angelus.html
గురుశ్రీ ప్రవీణ్ గోపు OFM Cap.