త్రిత్వైక సర్వేశ్వరుని మహోత్సవము - జూబిలీ ఆఫ్ స్పోర్ట్, 15 జూన్ 2025

 త్రిత్వైక సర్వేశ్వరుని మహోత్సవము
జూబిలీ ఆఫ్ స్పోర్ట్
పరిశుద్ధ పొప్ లియో XIV గారి ప్రసంగము
సెయింట్ పీటర్స్ బసిలికా
ఆదివారం, 15 జూన్
2025


ప్రియ సహోదరీ సహోదరులారా,

మొదటి పఠనంలో మనం విన్న మాటలు విజ్ఞానం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తున్నాయి. “ప్రభువు నన్ను [విజ్ఞానాన్ని] ప్రప్రధమమున సృజించెను. తానూ పూర్వమే కలిగించినవాని యన్నింటిలో నన్ను మొదటి దానినిగా చేసెను... ఆకాశమున మేఘములను పాదుకొల్పినపుడు... నేను ప్రధాన శిల్పివలె ఆయన చెంత నిల్చియుంటిని. పసికందువలె రోజురోజు ఆయనకు ఆనందము చేకూర్చుచు నిత్యమూ ఆయన సన్నిధిలో ఆటలాడు కొనుచుంటిని. ఆయన చేసిన పుడమి మీద క్రీడించుచు ప్రమోదముతో మానవాళి మధ్య మనుచుంటిని” (సామెతలు 8:22, 28, 30-31). పునీత అగస్టీను గారు చెప్పినట్లుగా, త్రిత్వం (తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ) మరియు విజ్ఞానం చాలా దగ్గరి సంబంధం కలిగి ఉన్నాయి. దైవిక విజ్ఞానం పరిశుద్ధ త్రిత్వంలో వెల్లడైంది. ఈ విజ్ఞానం ఎల్లప్పుడూ మనలను సత్యం వైపు నడిపిస్తుంది. మన జీవితంలో విజ్ఞానాన్ని అలవర్చుకోవడం ద్వారా మనం దైవ సన్నిధిలో ఆనందాన్ని పొందవచ్చు మరియు సత్య మార్గంలో నడవవచ్చు.

ఈరోజు మనం పవిత్ర త్రిత్వైక సర్వేశ్వరుని మహోత్సవం జరుపుకుంటున్నాం. అదే సమయంలో క్రీడా ఉత్సవాన్ని (జూబ్లీ ఆఫ్ స్పోర్ట్) కూడా పాటిస్తున్నాం. త్రిత్వం, క్రీడల కలయిక కొంత అసాధారణంగా అనిపించినా, ఈ రెండింటినీ పక్కపక్కన ఉంచడం అనవసరమైనదైతే కాదు. ప్రతి మంచి, విలువైన మానవ కార్యం ఏదో ఒక విధంగా దేవుని అనంత సౌందర్యాన్ని ప్రతిబింబిస్తుంది. క్రీడ ఖచ్చితంగా వీటిలో ఒకటి. దేవుడు కదలిక లేనివాడు కాదు, తనలో తాను బంధీ అయినవాడు కాదు. ఆయన కార్యశీలి, సహవాసి. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మల మధ్య ఒక చైతన్యవంతమైన సంబంధం ఉంది. ఇది మానవత్వానికి, ప్రపంచానికి తనను తాను తెరుచుకుంటుంది. వేదాంత పండితులు పెరికోరేసిస్ (perichoresis) గురించి మాట్లాడుతారు: దేవుని జీవితం ఒక రకమైన “నృత్యం” లాంటిది. అది పరస్పర ప్రేమ కలిగిన నృత్యం. క్రీడలు కూడా ఈ దైవిక నృత్యాన్ని, చైతన్యాన్ని, సహవాసాన్ని ప్రతిబింబిస్తాయి.


దేవుని అంతరంగ జీవితంలోని ఈ చైతన్యం జీవానికి జన్మనిస్తుంది. మనల్ని సృష్టించిన దేవుడు తన సృష్టికి ఉనికిని ప్రసాదించడంలో ఆనందాన్ని పొందుతాడు. మనం మొదటి పఠనంలో (సామెతలు 8:30-31) విన్నట్లుగా, ఆయన తాను చేసిన భూమి మీద “ప్రమోదం” చెందుతాడు. కొంతమంది శ్రీసభ పితరులు ఏకంగా దేయుస్ లుడెన్స్ (Deus ludens) - అంటే “క్రీడించు దేవుడు” - గురించి మాట్లాడారు (సెయింట్ సలోనియస్ అఫ్ జెనీవా, ఇన్ పరాబోలాస్ సలోమోనిస్ ఎక్స్‌పోసిటియో మిస్టికా; సెయింట్ గ్రెగరీ నజియాంజెన్, కార్మినా, I, 2, 589 చూడండి). ఈ విధంగా, క్రీడ మనకు త్రిత్వైక దేవుడిని అనుభూతి చెందడానికి దోహదపడుతుంది. ఎందుకంటే ఇది కేవలం బాహ్యంగానే కాకుండా, ముఖ్యంగా అంతర్గతంగా కూడా ఇతరులతో సంబంధాలు నెరపడానికి మనల్ని ప్రోత్సహిస్తుంది. లేకపోతే, క్రీడ అహంకారాల మధ్య ఒక శూన్యమైన పోటీగా మాత్రమే మిగిలిపోతుంది. క్రీడ ద్వారా మనం దైవిక సంబంధాన్ని, ప్రేమను, ఆనందాన్ని ఎలా అనుభవించవచ్చో ధ్యానించవచ్చు!


ఇటలీలో క్రీడా కార్యక్రమాలను చూసే ప్రేక్షకులు తరచుగా అథ్లెట్లను ఉత్సాహపరచడానికి “దాయ్!” అని అరుస్తుంటారు. దీనికి “వచ్చేయ్!/ముందుకు వెళ్ళు!” అని అర్థం వస్తుంది. అయితే, ఈ ఇటాలియన్ పదానికి అక్షరాలా “ఇవ్వు!” అని అర్థం. ఇది మనల్ని ఆలోచింపజేస్తుంది. క్రీడలు కేవలం విజయాల గురించి మాత్రమే కాదు, అవి ఎంత అసాధారణమైనవైనప్పటికీ, మనల్ని మనం అంకితం చేసుకోవడం, మనల్ని మనం “ఆటలో నిమగ్నం చేయడం” గురించి కూడా. అంటే ఇతరుల కోసం మనల్ని మనం ఇచ్చుకోవడం - మన వ్యక్తిగత అభివృద్ధి కోసం, మన క్రీడా మద్దతుదారుల కోసం, మన ప్రియమైన వారి కోసం, మన కోచ్‌లు, సహోద్యోగుల కోసం, విస్తృత ప్రజానీకం కోసం, అలాగే మన ప్రత్యర్థుల కోసం కూడా.


గెలుపోటముల కంటే “మంచి క్రీడాకారులుగా” ఉండటమే ముఖ్యం. మనకు తెలిసినట్లుగా, స్వయంగా క్రీడాకారుడైన పునీత రెండవ జాన్ పాల్ జగద్గురువులు ఇలా చెప్పారు: “క్రీడ జీవితానందం, ఒక ఆట, ఒక వేడుక. అందువల్ల, క్రీడల స్వచ్ఛమైన నిస్వార్థతను, స్నేహ బంధాలను ఏర్పరచగల దాని సామర్థ్యాన్ని, సంభాషణను మరియు ఇతరుల పట్ల బహిరంగతను ప్రోత్సహించడం ద్వారా క్రీడలను పెంపొందించాలి... ఉత్పత్తి, వినియోగం యొక్క కఠినమైన నియమాలకు, కేవలం లాభాపేక్ష మరియు భోగలాలసత్వ విధానాలకు దూరంగా ఉండాలి” (క్రీడా జూబిలీ ఉత్సవ ప్రసంగం, 12 ఏప్రిల్ 1984). దీన్నిబట్టి, క్రీడ అనేది కేవలం గెలుపు కోసం కాదు, అది మన వ్యక్తిత్వాన్ని, సంబంధాలను మెరుగుపరుచుకునే ఒక మార్గం అని తెలుస్తోంది!

ఈ దృక్పథం నుండి, క్రీడను, ఈ రోజుల్లో, మానవ మరియు క్రైస్తవ సద్గుణాలతో శిక్షణ పొందేందుకు ఒక విలువైన సాధనంగా మార్చే మూడు ప్రత్యేక విషయాలపై దృష్టి సారిద్దాం.


మొదటిది, ఈ రోజుల్లో సమాజంలో ఒంటరితనం పెరిగిపోతోంది. తీవ్రమైన వ్యక్తిగతవాదం “మనము” అనే భావన నుండి “నేను” అనే దానిపై ఎక్కువ దృష్టి పెడుతుంది. ఇది ఇతరుల పట్ల నిజమైన శ్రద్ధ లోపించడానికి దారితీస్తుంది. ఇలాంటి పరిస్థితులలో, క్రీడలు - ముఖ్యంగా టీమ్ స్పోర్ట్స్ - సహకరించడం, కలిసి పనిచేయడం, పంచుకోవడం వంటి విలువలను నేర్పిస్తాయి. మనం ముందే చర్చించుకున్నట్లుగా, ఈ విలువలు అన్నీ త్రిత్వైక దేవుని జీవితంలో చాలా ముఖ్యమైనవి (యోహాను 16:14-15 చూడండి). కాబట్టి, క్రీడ ప్రజల మధ్య, సంఘాలు, పాఠశాలలు, కార్యాలయాలు, కుటుంబాల మధ్య సయోధ్యకు, కలయికకు ఒక ముఖ్యమైన సాధనంగా మారగలదు. క్రీడలు మనలో ఐకమత్యాన్ని, పరస్పర సహకారాన్ని పెంపొందించగలవని అర్థమవుతోంది!


రెండవది, మనం ప్రస్తుతం డిజిటల్ సమాజంలో ఉన్నాం. సాంకేతికత దూరంగా ఉన్నవారిని దగ్గర చేసినప్పటికీ, భౌతికంగా దగ్గరగా ఉన్నవారి మధ్య తరచుగా దూరాన్ని పెంచుతుంది. ఇటువంటి పరిస్థితులలో, క్రీడ వ్యక్తులను ఒకచోట చేర్చడానికి, శరీరం, స్థలం, కృషి, మరియు సమయం పట్ల ఆరోగ్యకరమైన అవగాహనను అందించడానికి ఒక విలువైన, ఆచరణాత్మక సాధనంగా నిరూపించబడుతుంది. క్రీడ వర్చువల్ లోకాల్లోకి పారిపోయే ప్రలోభాన్ని నిరోధిస్తుంది. ఇది ప్రకృతితో, వాస్తవిక జీవితంతో ఆరోగ్యకరమైన సంబంధాన్ని కాపాడుకోవడానికి సహాయపడుతుంది, అక్కడ నిజమైన ప్రేమ అనుభవించబడుతుంది (1 యోహాను 3:18 చూడండి). క్రీడల ద్వారా మనం డిజిటల్ తెరల వెనుక దాగి ఉన్న మానవ సంబంధాలను తిరిగి పొందవచ్చని ఆలోచింప జేస్తుంది!


మూడవదిగా, ఈ పోటీ ప్రపంచంలో, బలవంతులు, విజేతలు మాత్రమే జీవించడానికి అర్హులు అన్నట్లు కనిపిస్తుంది. కానీ, క్రీడ మనకు ఓడిపోవడాన్ని కూడా నేర్పుతుంది. ఓడిపోవడాన్ని నేర్చుకోవడం ద్వారా, మనం మన మానవ స్థితిలోని అత్యంత లోతైన సత్యాలను ఎదుర్కోవలసి వస్తుంది: మన సున్నితత్వం, మన పరిమితులు మరియు మన అసంపూర్ణతలు. ఇది చాలా ముఖ్యం, ఎందుకంటే ఈ పరిమితుల అనుభవం ద్వారానే మనం ఆశకు మన హృదయాలను తెరుస్తాము. ఎప్పుడూ తప్పులు చేయని, ఎప్పుడూ ఓడిపోని క్రీడాకారులు అంటూ ఉండరు. ఛాంపియన్‌లు సంపూర్ణంగా పనిచేసే యంత్రాలు కాదు, కానీ నిజమైన స్త్రీపురుషులు. వారు పడిపోయినప్పుడు తిరిగి లేవడానికి ధైర్యాన్ని పొందుతారు.


పునీత రెండవ జాన్ పాల్ జగద్గురువులు, యేసును “దేవుని నిజమైన క్రీడాకారుడు” అని చెప్పినప్పుడు సరిగానే చెప్పారు. ఎందుకంటే ఆయన లోకాన్ని బలంతో కాదు, ప్రేమ యొక్క విశ్వసనీయతతో ఓడించాడు (క్రీడాకారుల జూబిలీ దివ్యబలిపూజ ప్రసంగం, 2000 అక్టోబర్ 29, చూడండి). క్రీడలు మనకు కేవలం గెలుపోటముల గురించే కాకుండా, జీవితంలోని ముఖ్యమైన పాఠాలను, ముఖ్యంగా ఓటమిలో కూడా ఆశను ఎలా కనుగొనాలో నేర్పుతాయి. క్రీడల ద్వారా మనం ఈ విలువలను ఎలా పెంచుకోవచ్చో ఆలోచింప జేస్తుంది!


మన కాలంలో అనేక పునీతుల జీవితాలలో క్రీడ ఒక ముఖ్యమైన పాత్రను పోషించడం కేవలం యాదృచ్చికం కాదు. ఇది వారికి వ్యక్తిగత క్రమశిక్షణగా మరియు సువార్తను ప్రకటించే సాధనంగా ఉపయోగపడింది. క్రీడాకారుల పాలకులైన ధన్య పియర్ జార్జియో ఫ్రస్సాతి గారిని ఈ సందర్భంలో మనం గుర్తు చేసుకోవచ్చు. ఈ సంవత్సరం సెప్టెంబర్ 7న వారికి పునీత పట్టం లభించనుంది. వారి నిష్కపటమైన, ప్రకాశవంతమైన జీవితం మనకు ఒక ముఖ్యమైన సత్యాన్ని గుర్తు చేస్తుంది: ఎవరూ ఛాంపియన్‌గా పుట్టరు, ఎవరూ పునీతులుగా పుట్టరు. ప్రేమలో నిత్య శిక్షణే మనల్ని అంతిమ విజయానికి చేరువ చేస్తుంది (రోమా 5:3-5 చూడండి). ఇది మనం నూతన ప్రపంచ నిర్మాణానికి సహకరించడానికి వీలు కల్పిస్తుంది. క్రీడలు, మన జీవితంలో కేవలం శారీరక కార్యకలాపాలుగా కాకుండా, ఆధ్యాత్మిక ఎదుగుదలకు, నైతిక విలువల పెంపుదలకు ఎలా సహాయపడతాయో గ్రహించాలి!


రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన ఇరవై సంవత్సరాల తర్వాత, పునీత ఆరవ పాల్ జగద్గురువులు కూడా ఇదే విషయాన్ని గమనించారు. కాథలిక్ అథ్లెటిక్ అసోసియేషన్ (C.S.I. - Centro Sportivo Italiano) సభ్యులను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ, యుద్ధం వలన విచ్చిన్నమైన సమాజంలో శాంతిని, ఆశను తిరిగి తీసుకురావడంలో క్రీడలు ఎంతో తోడ్పాడ్డాయని గుర్తు చేశారు (C.S.I. సభ్యులకు ప్రసంగం, 1965 మార్చి 20, చూడండి). ఆయన ఇంకా ఇలా అన్నారు: “మీ ప్రయత్నాలు ఒక నూతన సమాజ నిర్మాణానికి ఉద్దేశించబడ్డాయి... క్రీడ, అది ప్రోత్సహించే గొప్ప విద్యా విలువలతో, మానవ వ్యక్తి యొక్క ఆధ్యాత్మిక ఉన్నతికి అత్యంత ఉపయోగకరమైన సాధనంగా మారగలదనే గుర్తింపుతో; ఇది క్రమబద్ధమైన, శాంతియుతమైన మరియు నిర్మాణాత్మకమైన సమాజానికి ప్రాథమిక మరియు అనివార్యమైన షరతు.” దీని ద్వారా, క్రీడలు కేవలం వినోదం కాదని, అవి సమాజంలో సానుకూల మార్పులకు, వ్యక్తిత్వ వికాసానికి ఎంతగానో ఉపయోగపడతాయని పునీత ఆరవ పాల్ జగద్గురువులు నొక్కిచెప్పారు. క్రీడలు మన సమాజంలో ఎలాంటి మార్పులు తీసుకురాగలవని భావిస్తున్నాము?


ప్రియమైన క్రీడాకారులారా, శ్రీసభ మీకు ఒక గొప్ప బాధ్యతను అప్పగిస్తోంది: మీ కార్యకలాపాలన్నింటిలోనూ త్రిత్వైక దేవుని ప్రేమను ప్రతిబింబించడం. ఇది మీ స్వంత మేలు కోసం, అలాగే మీ తోటి సోదర సోదరీమణుల శ్రేయస్సు కోసం. ఈ బాధ్యతను మీరు క్రీడాకారులుగా, శిక్షకులుగా, సంఘాలుగా, బృందాలుగా, మీ కుటుంబాలలో కూడా ఉత్సాహంగా నిర్వర్తించాలి. పోప్ ఫ్రాన్సిస్ తరచుగా ఒక విషయాన్ని గుర్తు చేసేవారు: కన్య మరియను సువార్త ఎప్పుడూ చురుకుగా, కదలికలో, “పరుగెడుతూ” ఉండేదని ప్రస్తావించింది (లూకా 1:39 చూడండి). తల్లులు తమ పిల్లలకు సహాయం చేయడానికి దేవుని సంకేతం అందిన వెంటనే బయలుదేరడానికి ఎలా సిద్ధంగా ఉంటారో, మరియ కూడా అలాగే సిద్ధంగా ఉంటుంది (ప్రపంచ యువజన దినోత్సవ స్వచ్ఛంద సేవకులకు ప్రసంగం, 2023 ఆగస్టు 6, చూడండి). మన ప్రయత్నాలకు, ఉత్సాహానికి తోడుగా ఉండమని, అన్నిటికంటే గొప్ప విజయానికి మనల్ని నడిపించమని మరియ తల్లిని ప్రార్థిద్దాం. ఆ గొప్ప విజయం ఏమిటంటే, మన ఆనందం సంపూర్ణమయ్యే ఆ క్రీడా మైదానంలో నిత్యజీవ బహుమతి (1 కొరి 9:24-25; 2 తిమోతి 4:7-8 చూడండి).

మూలము:

https://www.vatican.va/content/leo-xiv/en/homilies/2025/documents/20250615-omelia-giubileo-sport.html

గురుశ్రీ ప్రవీణ్ కుమార్ గోపు OFM Cap.

 

 

పెంతెకోస్తు మహోత్సవ పరిశుద్ధ పొప్ లియో XIV గారి ప్రసంగము, 8 జూన్ 2025

 పెంతెకోస్తు మహోత్సవ పవిత్ర దివ్యబలిపూజ
పరిశుద్ధ పొప్ లియో XIV గారి ప్రసంగము
సెయింట్ పీటర్స్ స్క్వేర్
ఆదివారం 8 జూన్ 2025
 

ప్రియ సహోదరీ సహోదరులారా,

ఆయన పునరుత్థానం తర్వాత పరలోకములోకి ఆరోహణం ద్వారా మహిమపరచబడిన దినము మనపై ఆవిష్కరించబడినప్పుడు, ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మను పంపి యున్నారు” (పునీత అగుస్తీను, ప్రసంగము 271, 1). ఈరోజు కూడా, అప్పట్లో పైగదిలో (Upper Room) జరిగినది ఈరోజు కూడా మన మధ్య మళ్ళీ జరుగుతుంది. బలమైన గాలుల వలె మనలను ఆవరించి, మనలను ఉలిక్కిపాటుకు గురిచేసే పెద్ద శబ్దంలా, అలాగే మనలను ప్రకాశింపజేసే అగ్నిలా, పరిశుద్ధాత్మ వరం మనపైకి దిగివస్తుంది (పోల్చండి అపొ.కా. 2:1-11).

మొదటి పఠనంలో మనము విన్నట్లుగా, పరిశుద్ధాత్మ అపొస్తలుల జీవితాలలో అసాధారణమైన దానిని సాధించింది. యేసు మరణం తరువాత, వారు భయము, దుఃఖముతో ఒక గదిలో తలుపులు మూసుకొని ఉండిపోయారు. అయితే, పరిశుద్ధాత్మ రాకతో జరిగిన విషయాలను సరికొత్తగా చూసే విధానం లభించింది. జరిగిన సంఘటనలను అర్థం చేసుకోవడానికి, పునరుత్థాన ప్రభువు సన్నిధిని ఆత్మీయంగా అనుభూతి చెందడానికి వారికి అంతర్గత అవగాహన కలిగింది. పరిశుద్ధాత్మ వారి భయాన్ని అధిగమించి, వారి అంతర్గత సంకెళ్లను తెంచి, వారి గాయాలను నయం చేసింది. వారికి బలంతో అభిషేకం చేసి, దేవుని గొప్ప కార్యాలను అందరికీ ప్రకటించడానికి ధైర్యాన్ని ప్రసాదించింది.

అపొస్తలుల కార్యములు నుండి మనం విన్నట్లుగా, ఆ సమయములో యెరూషలేములో వివిధ దేశాల నుండి వచ్చిన ప్రజలు అక్కడకు వచ్చిరి. “ఆ విశ్వాసులు ప్రతి ఒక్కరూ తన స్వంత భాషలో మాట్లాడుట విన్నారు” (వచనం 6). ఒక్కమాటలో చెప్పాలంటే, పెంతెకోస్తు దినమున, పైగది తలుపులు తెరచుకున్నాయి, ఎందుకంటే ఆత్మ సరిహద్దులను తెరుస్తుంది. బెనడిక్ట్ XVI వివరించినట్లుగా “పరిశుద్ధాత్మ అవగాహనను కలిగిస్తుంది. బాబెల్‌లో మొదలైన విచ్ఛేదనాన్ని, మనస్సులో, హృదయంలో ఒకరికొకరు వ్యతిరేకంగా నిలబెట్టే గందరగోళాన్ని ఆత్మ అధిగమిస్తుంది. ఆత్మ సరిహద్దులను తెరుస్తుంది... శ్రీసభ ఎల్లప్పుడూ తాను ఇప్పటికే ఏమై ఉందో దానిని కొత్తగా మారాలి. అది ప్రజల మధ్య సరిహద్దులను తెరవాలి. వర్గ, జాతి భేదాలను తొలగించాలి. దానిలో, నిర్లక్ష్యం చేయబడినవారు లేదా తృణీకరించబడినవారు ఉండకూడదు. శ్రీసభలో కేవలం స్వతంత్ర పురుషులు, స్త్రీలు, యేసుక్రీస్తు సహోదరీ సహోదరీలే ఉంటారు” (పెంతెకోస్తు ప్రసంగము, 15 మే 2005).

పెంతెకోస్తు దృశ్యం చాలా హృద్యంగా ఉంది. దానిపై ఒక క్షణం ఆగి, మీతో కలిసి ధ్యానించడం నాకు సంతోషంగా ఉంటుంది.

పరిశుద్ధాత్మ అన్నింటికంటే ముందుగా, మన హృదయాలలో సరిహద్దులను తెరుస్తుంది. అది మన జీవితాలను ప్రేమకు తెరిచే ఒక గొప్ప వరం. దాని సన్నిధి మన హృదయ కాఠిన్యాన్ని, మన సంకుచిత మనస్తత్వాన్ని, స్వార్థాన్ని, మనలను బంధించే భయాలను, మన గురించి మాత్రమే ఆలోచించే నార్సిసిజాన్ని (స్వప్రేమ) విచ్ఛిన్నం చేస్తుంది. పరిశుద్ధాత్మ మనల్ని సవాలు చేయడానికి వేంచేయును. మన జీవితాలు వ్యక్తిగతవాదం అనే సుడిగుండంలో చిక్కుకొని కుంచించుకు పోతున్నాయనే వాస్తవాన్ని మనం ఎదుర్కొనేలా చేస్తుంది. విచిత్రంగా అనిపించినా, వేగంగా విస్తరిస్తున్న “సామాజిక” మాధ్యమాల ప్రపంచంలో, మనం మరింత ఒంటరిగా మారే ప్రమాదం ఉంది. మనం నిరంతరం అనుసంధానించబడి ఉన్నప్పటికీ, నెట్‌వర్కింగ్” (లోతైన మానవ సంబంధాలు) చేయలేకపోతున్నాం. ఎప్పుడూ గుంపులో ఉన్నా, మనం గందరగోళంగా, ఒంటరి ప్రయాణికులుగా మిగిలిపోతున్నాం.

దేవుని ఆత్మ మనకు జీవితాన్ని సరికొత్త కోణంలో చూసే, అనుభవించే అవకాశాన్ని కల్పిస్తుంది. మనం ధరించే అన్ని ముసుగుల వెనుక ఉన్న మన అంతరంగ ఆత్మతో అది మనల్ని అనుసంధానం చేస్తుంది. ప్రభువు ప్రసాదించే ఆనందాన్ని అనుభూతి చెందడం నేర్పిస్తూ, ఆయన్ని కలుసుకోవడానికి మనల్ని నడిపిస్తుంది. యేసు మాటల్లో మనం ఇప్పుడే విన్నట్లుగా, ప్రేమలో నిలిచి యున్నప్పుడే ఆయన వాక్యానికి నమ్మకంగా ఉండటానికి, అది మనల్ని మార్చడానికి కావలసిన బలం లభిస్తుందని పరిశుద్ధాత్మ మనలను ఒప్పిస్తుంది. పరిశుద్ధాత్మ మన అంతర్గత సరిహద్దులను తెరుస్తుంది, తద్వారా మన జీవితాలు ఆహ్వానం, పునరుజ్జీవనం కలిగించే ప్రదేశాలుగా మారతాయి.

పరిశుద్ధాత్మ ఇతరులతో మన సంబంధాలలో కూడా సరిహద్దులను తెరుస్తుంది. యేసు మనకు చెప్పినట్లుగా, ఈ వరం ఆయనకు, తండ్రికి మధ్య ఉన్న ప్రేమే, ఇది మనలో వసించును. అప్పుడు మనం మన హృదయాలను మన సహోదరీ సహోదరులకు తెరవ గలుగుతాము. పరిశుద్ధాత్మ సహాయంతో, మనం మన కఠినత్వాన్ని అధిగమించి, భిన్నమైన వారి పట్ల మన భయాన్ని దాటి, మనలో రేకెత్తే కోరికలను అదుపు చేసుకో గలుగుతాము. సందేహం, పక్షపాతం, ఇతరులను తమ అధీనంలోకి తెచ్చుకోవాలనే కోరిక వంటి మన సంబంధాలను భంగపరిచే లోతైన, దాగి యున్న ప్రమాదాలను కూడా పరిశుద్ధాత్మ మారుస్తుంది. ఆధిపత్యం వహించాలనే అనారోగ్యకరమైన కోరికలతో కలిగిన సంబంధాలు, సందర్భాలను తలచుకుంటే నాకు చాలా బాధ కలుగుతుంది. ఇది తరచుగా హింసకు దారితీస్తుంది, ఇటీవలి అనేక స్త్రీ హత్యల (femicide) కేసులు విషాదకరంగా ఈ వాస్తవాన్ని రుజువు చేస్తున్నాయి.

పరిశుద్ధాత్మ, మరోవైపు, మనలో మంచి, ఆరోగ్యకరమైన సంబంధాలను పెంపొందించడానికి వీలు కల్పించే ఫలాలను పరిపక్వం చేస్తుంది. అవి, “ప్రేమ, ఆనందము, శాంతి, సహనము, దయ, మంచితనము, విశ్వసనీయత, సాత్వికత, నిగ్రహము” (గలతీ 5:22). ఈ విధంగా, పరిశుద్ధాత్మ మన సంబంధాల పరిధులను విస్తృతం చేస్తుంది, సోదరభావపు ఆనందానికి మనలను తెరుస్తుంది. ఇది శ్రీసభకు కూడా ఒక కీలకమైన కొలమానం. మన మధ్య సరిహద్దులు లేదా విభేదాలు లేనట్లయితే; మనం శ్రీసభలో ఒకరినొకరు సంభాషించుకొని, అంగీకరించగలిగితే, మన వైవిధ్యాలను సామరస్యం చేసుకోగలిగితే; శ్రీసభగా, మనం అందరికీ స్వాగతం పలికే ఆతిథ్యం ఇచ్చే స్థలంగా మారితేనే మనం నిజంగా పునరుత్థానం చెందిన ప్రభువు యొక్క శ్రీసభ, పెంతెకోస్తు శిష్యుల మవుతాము.

చివరగా, పరిశుద్ధాత్మ ప్రజల మధ్య సరిహద్దులను కూడా తెరుస్తుంది. పెంతెకోస్తు నాడు, అపొస్తలులు తాము కలిసిన వారి భాషలలో మాట్లాడారు. ఆత్మ తీసుకువచ్చిన సామరస్యం ద్వారా బాబెల్ గందరగోళం చివరికి పరిష్కరించబడింది. దేవుని “శ్వాస” మన హృదయాలను ఏకం చేసి, ఇతరులను మన సహోదరీ సహోదరులుగా చూసేలా చేసినప్పుడల్లా, తేడాలు, విభజన, సంఘర్షణకు కారణం కావు. బదులుగా, అవి మనం అందరం పొందగలిగే ఒక భాగస్వామ్య వారసత్వంగా మారతాయి. ఇది మనందరినీ కలిసి సౌభ్రాతృత్వంతో ప్రయాణించేలా చేస్తుంది.

పరిశుద్ధాత్మ అడ్డంకులను తొలగిస్తుంది. ఉదాసీనత, ద్వేషం అనే గోడలను కూల్చివేస్తుంది. ఎందుకంటే, అది మనకు సమస్త విషయములను బోధిస్తుంది” మరియు “యేసు చెప్పినవన్నియు మనకు తలపునకు తెచ్చును” (యోహాను 14:26 చూడండి). అన్నిటికంటే ముందు, ప్రభువు తన బోధనలకు కేంద్రంగా, శిఖరంగా చేసిన ప్రేమ ఆజ్ఞను పరిశుద్ధాత్మ మనకు బోధిస్తుంది, గుర్తు చేస్తుంది, మన హృదయాలలో లిఖిస్తుంది. ప్రేమ ఉన్న చోట, పక్షపాతానికి తావు ఉండదు. మన పొరుగువారి నుండి మనల్ని వేరుచేసే “భద్రతా” అంశాలు ఉండవు. విషాదకరంగా, ఇప్పుడు రాజకీయ జాతీయవాదాలలో కూడా కనిపిస్తున్న ఆ మినహాయింపు ధోరణికి ప్రేమలో చోటు లేదు. ప్రేమ సమైక్యతను ప్రోత్సహిస్తుంది, సరిహద్దులను చెరిపివేస్తుంది, మానవాళిని ఏకతాటిపైకి తెస్తుంది.

పోప్ ఫ్రాన్సిస్ 2023 మే 28న పెంతెకోస్తు పండుగ సందర్భంగా మాట్లాడుతూ, ఈనాటి మన ప్రపంచంలో ఎంతో అనైక్యత, విభజన ఉంది. మనమంతా అనుసంధానించబడి’ ఉన్నప్పటికీ, ఒకరికొకరు దూరమై, ఉదాసీనతతో మొద్దుబారి, ఒంటరితనంతో కృంగిపోతున్నాం” అని వ్యాఖ్యానించారు. మన ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న యుద్ధాలు దీనికి విషాదకరమైన నిదర్శనం. ప్రేమ, శాంతికి ప్రతీక అయిన పరిశుద్ధాత్మను మనం వేడుకుందాం. సరిహద్దులను తెరవడానికి, అడ్డుగోడలను కూల్చివేయడానికి, ద్వేషాన్ని తొలగించడానికి, పరలోకములో నున్న ఏకైక తండ్రి బిడ్డలుగా జీవించడానికి ఆయన మనకు సహాయం చేయుగాక.

ప్రియ సహోదరీ, సహోదరులారా, పెంతెకోస్తు పండుగ శ్రీసభను, ప్రపంచాన్ని పునరుద్ధరిస్తుంది! పరిశుద్ధాత్మ యొక్క శక్తివంతమైన గాలి మనపైకి, మన అంతరంగంలోకి వచ్చుగాక. అది మన హృదయాల సరిహద్దులను తెరుచుగాక, దేవునితో ఐక్యం అయ్యే కృపను ప్రసాదించుగాక, మన ప్రేమ యొక్క దిగంతాలను విశాలం చేయుగాక, శాంతి రాజ్యమేలే ప్రపంచాన్ని నిర్మించడానికి మన ప్రయత్నాలకు తోడుగా నిలుచుగాక.

పరిశుద్ధ మరియమ్మ, పెంతెకోస్తు వనిత, ఆత్మచే సందర్శించబడిన కన్యక, కృపతో నిండిన తల్లి, మనకు తోడుగా యుండి మన కొరకు విజ్ఞాపన చేయునుగాక!
మూలము:
గురుశ్రీ ప్రవీణ్ గోపు OFM Cap.

సాధారణ సమావేశం, లియో XIV జగద్గురువులు, 11 జూన్ 2025

 లియో XIV జగద్గురువులు
సాధారణ సమావేశం
సెయింట్ పీటర్స్ స్క్వేర్, బుధవారం, 11 జూన్ 2025



ఉపదేశం - జూబిలీ 2025. యేసుక్రీస్తు మన నిరీక్షణ. II. యేసు జీవితం. ఉపమానాలు 9. బర్తిమయి. “లెమ్ము, ధైర్యముగా నుండుము. ఆయన రమ్మనుచున్నాడు”.

ప్రియ సహోదరీ సహోదరులారా,

ఉపదేశ ధ్యానం ద్వారా, యేసు జీవితంలో మరొక ముఖ్యమైన అంశం - ఆయన చేసిన స్వస్థతలు పై మన దృష్టిని కేంద్రీకరించాలని నేను కోరుకుంటున్నాను. అందువల్ల, మీ జీవితంలో మీకు అత్యంత బాధ కలిగించే, బలహీనంగానున్న అంశాలను, మీరు చిక్కుకు పోయినట్లు మరియు ముందుకు కదలలేక పోతున్నట్లు భావించే పరిస్థితులను, క్రీస్తు హృదయంలో ఉంచమని మిమ్ములను ఆహ్వానిస్తున్నాను. మన ప్రార్థనలను విని, మనలను స్వస్థపరచమని ప్రభువును నమ్మకంతో వేడుకుందాం!

ఈ ధ్యానంలో మనకు తోడుగా, ఆశకు ప్రతీకగా నిలిచే ఒక ముఖ్యమైన పాత్ర ఉంది. మనం దారి తప్పినట్లు అనిపించినప్పుడు కూడా, ఆశను ఎప్పటికీ వదులుకోకూడదని అర్థం చేసుకోవడానికి ఈ పాత్ర మనకు సహాయ పడుతుంది: అతనే బర్తిమయి, ఒక గుడ్డివాడు మరియు భిక్షగాడు. యేసు ఇతన్ని యెరికో పట్టణంలో కలుసు కున్నారు (మార్కు 10:46-52 చూడండి). ఈ సందర్భంలో యెరికో పట్టణం చాలా ముఖ్యం: యేసు తన చివరి ప్రయాణముగా యెరూషలేముకు వెళ్తూ, సముద్ర మట్టానికి దిగువనున్న యెరికో 'అధోలోకం' నుండి ప్రారంభించారు. వాస్తవానికి, యేసు తన మరణం ద్వారా, అట్టడుగున పడిపోయిన మరియు మనలో ప్రతి ఒక్కరినీ సూచించే ఆదామును తిరిగి తీసుకురావడానికి వెళ్ళారు.

బర్తిమయి అంటే ‘తిమయి కుమారుడు’. ఈ పేరు ఒక వ్యక్తిని అతని బంధం ద్వారా వర్ణిస్తుంది, అయినప్పటికీ బర్తిమయి తన పరిస్థితిలో ఒంటరిగా ఉన్నాడు. అయితే, ఈ పేరుకు ‘గౌరవనీయుడు’ లేదా ‘ఆరాధనీయుడు’ అనే అర్థం కూడా ఉంది. ఇది అతను జీవిస్తున్న వాస్తవ పరిస్థితికి పూర్తిగా విరుద్ధం. యూదుల సంస్కృతిలో పేరుకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది కాబట్టి, బర్తిమయి తాను పిలువబడిన గొప్ప పేరుకు తగ్గట్టుగా జీవించలేక పోతున్నాడని దీని అర్థం. అతని పేరు ఉన్నతమైన స్థితిని సూచిస్తే, అతని జీవితం మాత్రం నిస్సహాయత, దైన్యాన్ని ప్రతిబింబిస్తుంది.

యేసు వెనుక జనసమూహాలు నడుస్తూ ఉండగా, దానికి భిన్నంగా బర్తిమయి కదలకుండా త్రోవ పక్కన కూర్చుని యున్నాడని సువార్తికుడు తెలియ జేస్తున్నాడు. ఇది బర్తిమయి నిస్సహాయ స్థితిని స్పష్టం చేస్తుంది. తనంతట తానుగా లేవలేక, ప్రయాణాన్ని తిరిగి ప్రారంభించలేక, అతనికి ఎవరైనా సహాయం అవసరమని ఈ దృశ్యం సూచిస్తుంది. జనసమూహం కదలికలో ఉంటే, బర్తిమయి మాత్రం స్థిరంగా, నిరీక్షణతో ఉన్నాడు.

నిస్సహాయ పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనం ఏమి చేయాలి అనే ప్రశ్నకు, బర్తిమయి తన జీవితం ద్వారా సమాధానం బోధిస్తున్నాడు. మనలో నున్న వనరులను, మనకు అంతర్భాగమైన వాటిని ఎలా ఉపయోగించు కోవాలో అతను నేర్పుతున్నాడు. బర్తిమయి ఒక భిక్షగాడు. అతనికి అడగడం ఎలాగో తెలుసు, అంతేకాదు, అతను అరవగలడు! మీకు నిజంగా ఏదైనా కావాలంటే, ఇతరులు మిమ్ములను నిందించినా, అవమానించినా, ఊరకుండుము అని గద్దించినా సరే, అనుకున్న దానిని చేరుకోవడానికి మీరు ప్రతిదీ చేయగలరు. మీకు నిజంగా అది కావాలంటే, మీరు కేకలు వేస్తూనే ఉంటారు!

మార్కు సువార్తలోని బర్తిమయి కేక “దావీదు కుమారా! యేసు ప్రభూ! నన్ను కరుణింపుము” (వచనం 47), తూర్పు క్రైస్తవ సంప్రదాయంలో అత్యంత ప్రసిద్ధ ప్రార్థనగా మారింది. దీనినే మనం కూడా ఉపయోగించవచ్చు, “యేసుక్రీస్తు ప్రభూ, దైవ కుమారా! నేను పాపిని, నన్ను కరుణింపుము.” ఈ ప్రార్థన, బర్తిమయి చూపిన విశ్వాసాన్ని, ఆశను ప్రతిబింబిస్తుంది. మన నిస్సహాయ స్థితిలో ప్రభువు దయ కోసం విజ్ఞప్తి చేయడానికి ఇది ఒక శక్తివంతమైన మార్గం.

బర్తిమయి గుడ్డివాడైనప్పటికీ, ఆశ్చర్యకరంగా ఇతరులకంటే మెరుగ్గా చూడగలిగాడు. యేసు ఎవరో అతను గుర్తించాడు! అతని కేకను విని, యేసు నిలిచి, “వానిని ఇటకు పిలువుడు” అని చెప్పారు (మార్కు 10:49 చూడండి). ఎందుకంటే, మనం దేవునిని ఉద్దేశించి మాట్లాడుతున్నామని గ్రహించలేకపోయినా, దేవుడు వినని కేక అంటూ ఏదీ ఉండదు (నిర్గమకాండము 2:23 చూడండి).

యేసు వెంటనే అతని వద్దకు వెళ్ళక పోవడం వింతగా అనిపించ వచ్చు. కానీ, మనం లోతుగా ధ్యానిస్తే, అది బర్తిమయి జీవితాన్ని తిరిగి క్రియాత్మకం చేసే మార్గంగా ఉందని అర్థమవుతుంది. అతను మళ్ళీ లేవడానికి యేసు అతన్ని ప్రోత్సహించారు. నడవగలిగే అతని సామర్థ్యంపై నమ్మకం ఉంచారు. ఆ వ్యక్తి మళ్ళీ తన కాళ్ళపై నిలబడగలడు, మృత్యువు అంచు నుండి లేవగలడు. అయితే, ఇది చేయాలంటే, అతను తప్పక చాలా అర్థవంతమైన పని చేయాలి. అదేమిటంటే, అతను తన ‘వస్త్రమును’ పారవేయాలి (మార్కు 10:50 చూడండి)!

ఒక బిచ్చగాడికి, వస్త్రం అనేది కేవలం కప్పుకోవడానికి మాత్రమే కాదు, అది అతని సర్వస్వం. అది అతని భద్రత, అతని ఇల్లు, అతన్ని రక్షించే కవచం. మోషే ధర్మశాస్త్రం కూడా బిచ్చగాడి వస్త్రానికి రక్షణ కల్పించింది; దానిని తాకట్టుగా తీసుకున్నట్లయితే సాయంత్రం తిరిగి ఇవ్వాలని నిర్దేశించింది (నిర్గమకాండము 22:25 చూడండి). అయినప్పటికీ, చాలాసార్లు, మన మార్గంలో అడ్డుపడేవి పైకి కనిపించే భద్రతలే. మనల్ని మనం రక్షించు కోవడానికి మనం ధరించినవే, మనల్ని ముందుకు నడవకుండా నిరోధిస్తాయి. యేసు వద్దకు వెళ్లి స్వస్థత పొందాలంటే, బర్తిమయి తన వస్త్రం లేకుండా, పూర్తి బలహీనతతో తనను తాను చూపించు కోవాలి. తన ఏకైక రక్షణను వదులు కోవాలి. ఇది స్వస్థత ప్రయాణంలో ఒక ప్రాథమిక దశ - మనకున్న ఆధారాలను వదులుకొని, దైవ సహాయంపై పూర్తిగా ఆధారపడటం.

యేసు బర్తిమయిని అడిగిన ప్రశ్న కూడా వింతగా అనిపించవచ్చు: నేను ఏమి చేయగోరు చున్నావు?” (మార్కు 10:51). అస్వస్థతల నుండి స్వస్థత పొందాలని కోరుకోవాలనే నియమమేమీ లేదు. కొన్నిసార్లు, బాధ్యత తీసుకోకుండా నిశ్చలంగా ఉండటానికే మనం ఇష్టపడతాం. కానీ, బర్తిమయి సమాధానం చాలా లోతైనది. అతను అనబ్లెపేన్’ [anablepein] అనే క్రియను ఉపయోగించాడు. దీనికి “మళ్ళీ చూడటం” అని అర్థం, అయితే దీనిని “పైకి చూడటం” అని కూడా అనువదించవచ్చు. నిజానికి, బర్తిమయి కేవలం దృష్టిని తిరిగి పొందాలని మాత్రమే కోరుకోవడం లేదు. అతను తన గౌరవాన్ని తిరిగి పొందాలని కోరుకుంటున్నాడు! పైకి చూడాలంటే, మనం మన తలలు పైకెత్తాలి. కొన్నిసార్లు జీవితం కలిగించిన అవమానాల వల్ల ప్రజలు నిస్సహాయంగా ఉండిపోతారు. అలాంటి స్థితిలో, వారు కోరుకునేది కేవలం తమ ఆత్మగౌరవాన్ని తిరిగి పొందడమే. ఈ అడుగు, శారీరక స్వస్థతతో పాటు మానసిక, ఆత్మీయ స్వస్థతకు కూడా దారి తీస్తుంది.

బర్తిమయిని, మనలో ప్రతి ఒక్కరినీ, నిజంగా రక్షించేది మన విశ్వాసం. యేసు మనలను స్వస్థపరుస్తాడు, తద్వారా మనం స్వతంత్రుల మౌతాము. ఆశ్చర్యకరంగా, యేసు బర్తిమయిని తనను అనుసరించమని ఆహ్వానించలేదు. బదులుగా, “నీవు వెళ్ళుము” అని బర్తిమయితో చెప్పారు (మార్కు 10:52 చూడండి). అయితే, మార్కు సువార్త తన వృత్తాంతాన్ని ముగిస్తూ, బర్తిమయి త్రోవ వెంట యేసును అనుసరించాడని చెబుతుంది. అంటే, అతను స్వేచ్ఛగా, తనంతట తానుగా ఆయనే మార్గమైన యేసును అనుసరించడానికి ఎంచుకున్నాడు. ఇది నిజమైన స్వస్థత యొక్క ఫలితం: కేవలం శారీరక విముక్తి మాత్రమే కాదు, ప్రభువును స్వచ్ఛందంగా ప్రేమించి, అనుసరించే హృదయ పరివర్తన.

ప్రియ సహోదరీ సహోదరులారా, మన అస్వస్థతలను, అలాగే మన ప్రియమైనవారి అస్వస్థతలను కూడా యేసు ముందు నమ్మకంతో ఉంచుదాం. దారి తప్పి, నిస్సహాయంగా నున్నవారి బాధను ఆయన ముందుంచుదాం. వారికోసం కూడా మనం బిగ్గరగా కేకలు వేద్దాం, అప్పుడు ప్రభువు మన మొర విని ఆగుతాడని మనం నిశ్చయించు కోవచ్చు.

విజ్ఞప్తి

గ్రాజ్‌లోని పాఠశాలలో జరిగిన దుర్ఘటన బాధితుల కోసం నా ప్రార్థనలు. ఈ కష్ట సమయంలో బాధిత కుటుంబాలకు, ఉపాధ్యాయులకు, విద్యార్థులకు నేను అండగా ఉంటాను. ప్రభువు ఈ పిల్లలను తన శాంతిలో చేర్చుకొనుగాక.

ప్రత్యేక శుభాకాంక్షలు

ఈరోజు సమావేశంలో పాల్గొంటున్న ఆంగ్ల భాష మాట్లాడే యాత్రికులకు, సందర్శకులకు, ముఖ్యంగా ఇంగ్లాండ్, స్కాట్లాండ్, బెల్జియం, కామెరూన్, జింబాబ్వే, చైనా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, సింగపూర్, కెనడా, మరియు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుండి వచ్చిన వారికి నా హృదయపూర్వక స్వాగతం. వచ్చే ఆదివారం మనం పరమ పవిత్ర త్రిత్వైక సర్వేశ్వరుని మహోత్సవమును జరుపుకోవడానికి సిద్ధమవుతున్నాము కాబట్టి, మీ హృదయాలను తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మలకు స్వాగతించే నివాసంగా మార్చుకోవాలని నేను మిమ్ములను ఆహ్వానించు చున్నాను. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించునుగాక!

పరిశుద్ధ జగద్గురువు మాటల సారాంశం:

ప్రియ సహోదరీ సహోదరులారా,

మన జూబిలీ అంశం అయిన “యేసుక్రీస్తు మన నిరీక్షణ”పై కొనసాగుతున్న మన జ్ఞానోపదేశంలో, ఈ రోజు మనం యేసు జీవితం మరియు పరిచర్యలో మరొక అంశాన్ని - ఆయన చేసిన స్వస్థత అద్భుతాలను - ధ్యానిస్తున్నాము. మనం విన్న సువిశేష భాగంలో, గుడ్డివాడైన బర్తిమయి “యేసు ప్రభూ! నన్ను కరుణింపుము” అనే ప్రార్థనతో యేసును వేడుకున్నాడు. ఇది నిజమైన విశ్వాస కార్యము. యేసు బర్తిమయిని తన వద్దకు రమ్మని అడిగినప్పుడు, ఆ అంధ బిచ్చగాడు వెంటనే తన వస్త్రమును విసిరిపారవేయడం గమనించదగిన విషయం. ఆ వస్త్రం అతని ఏకైక ఆస్తి, మరియు అతని భద్రతకు ఏకైక ఆధారం. ఈ కోణంలో, అతను తన సంపూర్ణ దుర్బలత్వంతో యేసు ముందు నిలబడ్డాడు. తన దృష్టిని తిరిగి పొందగల ప్రభువు శక్తిపై నమ్మకం ఉంచాడు. మనం కూడా, స్వస్థత కోసం మన స్వంత అవసరాన్ని గుర్తించి, మన బలహీనతతో ప్రభువు వద్దకు రావాలి. ఆయన స్వస్థపరిచే శక్తిని అనుభవించడానికి మన “వస్త్రములు” - అనగా మన భద్రతలు, మన సౌకర్యవంతమైన ప్రదేశాలు - విడిచిపెట్టాలి. ఈ నిరీక్షణ జూబిలీ సమయంలో, విశ్వాస వెలుగులో అన్నింటినీ కొత్తగా చూడటానికి, మరియు స్వేచ్ఛతో, నూతన జీవితంతో ప్రభువును అనుసరించడానికి మనమూ కృపను పొందుదుము గాక. 

మూలము:
https://www.vatican.va/content/leo-xiv/en/audiences/2025/documents/20250611-udienza-generale.html
గ్రురుశ్రీ ప్రవీణ్ గోపు, OFM Cap.

ఈస్టర్ 7వ ఆదివారం - 1 జూన్ 2025, కుటుంబాలు, పిల్లలు, తాతయ్యలు, అమ్మమ్మలు, వృద్ధుల ఉత్సవం (జూబ్లీ)

 కుటుంబాలు, పిల్లలు, తాతయ్యలు, అమ్మమ్మలు, వృద్ధుల ఉత్సవం (జూబ్లీ)
పరిశుద్ధ పొప్ లియో XIV ప్రసంగము
సెయింట్ పీటర్స్ స్క్వేర్, ఈస్టర్ 7వ ఆదివారం - 1 జూన్ 2025

మనం వింటున్న సువార్త, కడరాత్రి భోజన సమయంలో, యేసు మనందరి తరపున ప్రార్థించడాన్ని (యోహాను 17:20) తెలియజేస్తుంది. దేవుని వాక్యం మానవునిగా అవతరించి, తన భూలోక జీవితపు చివరి ఘడియలలో, తన సహోదరీ సహోదరులైన మన గురించి ప్రార్థిస్తున్నారు. పరిశుద్ధాత్మ శక్తితో, ఆయన తండ్రికి ఆశీర్వాదంగా, విజ్ఞాపన మరియు స్తుతి ప్రార్థనగా మారియున్నారు. మనము కూడా ఆశ్చర్యంతో, నమ్మకంతో యేసు ప్రార్థనలో పాలుపంచుకుప్పుడు, ఆయన ప్రేమకు కృతజ్ఞత తెలుపుతూ, సర్వ మానవాళికి సంబంధించిన గొప్ప ప్రణాళికలో భాగమవుతాము.

యేసు, "అందరూ ఏకమై ఉండాలి" (యోహాను 17:21) అని ప్రార్థించారు. ఈ ఐక్యతే మనం పొందగలిగే అత్యున్నతమైన మేలు. ఎందుకంటే, తండ్రి ద్వారా జీవం పొందే కుమారుడు, దాన్ని పంచుకునే ఆత్మ వంటి దేవుని స్వభావంలో ఉన్న శాశ్వతమైన ప్రేమ, సృష్టిలోని జీవుల మధ్య కూడా సంపూర్ణ ఐక్యతను కలిగిస్తుంది.

ప్రభువు కోరుకునేది మనం అజ్ఞాతంగా, ప్రాధాన్యత లేకుండా ఉండటం కాదు. బదులుగా, ఆయన మనమంతా ఐక్యంగా ఉండాలని ఆశిస్తున్నాడు. “తండ్రీ! నీవు నాయందు, నేను నీయందు ఉన్నాము గనుక వారును మనయందు ఉండునిమ్ము” (వచనం 21) అని ఆయన ప్రార్ధించారు. యేసు ప్రార్థించిన ఈ ఐక్యత, దేవుని ప్రేమ ఆధారంగా ఏర్పడిన సహవాసం. ఇది లోకానికి జీవాన్ని, రక్షణను అందిస్తుంది. నిజానికి, ఇది యేసు మనకు ప్రసాదించిన ఒక బహుమతి. దేవుని కుమారుడు తన మానవ హృదయం నుండి తండ్రిని ఇలా ప్రార్థిస్తాడు, “వారు సంపూర్ణంగా ఏకమై ఉండుటకును, నీవు నన్ను పంపితివనియు, నీవు నన్ను ప్రేమించినట్లే వారిని కూడా ప్రేమించితివనియు లోకము తెలిసికొనుటకు నేను వారియందును, నీవు నాయందును ఉన్నాము” (యోహాను 17:23).

ఈ మాటలను ఆశ్చర్యంతో విందాం. దేవుడు తనను తాను ప్రేమించినట్లే మనల్ని ప్రేమిస్తున్నాడని యేసు మనకు చెబుతున్నారు. తండ్రి తన ఏకైక కుమారుడిని ప్రేమించిన దానికంటే తక్కువగా మనల్ని ప్రేమించడం లేదు. అనగా, మనల్ని అనంతమైన ప్రేమతో ప్రేమిస్తున్నారు! దేవుడు తక్కువగా ప్రేమించరు, ఎందుకంటే ఆయన ఆదినుండి, ముందుగానే మనలను ప్రేమిస్తున్నారు! క్రీస్తు స్వయంగా ఈ విషయాన్ని ధృవీకరిస్తూ తండ్రితో ఇలా పలికారు, లోకము ఆరంభమునకు మునుపే నీవు నన్ను ప్రేమించితివి” (యోహాను 17:24). నిజానికి, తన కరుణలో, దేవుడు ఎల్లప్పుడూ సర్వ మానవాళిని తన యొద్దకు ఆకర్షించాలని కోరుకున్నాడు. క్రీస్తునందు మనకు అనుగ్రహించబడిన తండ్రి దేవుని జీవమే మనల్ని ఏకం చేస్తుంది, మనల్ని ఒకరితో ఒకరిని కలుపుతుంది.

ఈ రోజు, కుటుంబాలు, పిల్లలు, తాతయ్యలు, అమ్మమ్మలు, వృద్ధుల ఉత్సవం (జూబ్లీ) సందర్భంగా ఈ సువార్త ఆలకించడం మనలను ఆనందంతో నింపుతుంది.

ప్రియ స్నేహితులారా, మనం కోరుకోకముందే ఈ జీవితాన్ని పొందాం. పోప్ ఫ్రాన్సిస్ చెప్పినట్లుగా, మనమందరం కుమారులు, కుమార్తెలమే; అయితే, మనలో ఎవరూ పుట్టడానికి ఎంచుకోలేదు” (ఏంజెలుస్, 1 జనవరి 2025). అంతేకాదు, మనం పుట్టిన వెంటనే జీవించడానికి ఇతరులపై ఆధారపడ్డాం. మనల్ని వదిలేసి ఉంటే బ్రతికేవాళ్ళం కాదు. ఆత్మీయంగా, శారీరకంగా జాగ్రత్తగా చూసుకోవడం ద్వారానే మనం రక్షింపబడ్డాం. ఈ రోజు మనమందరం ఒక బంధం కారణంగానే జీవిస్తున్నాం అది మానవ దయ, పరస్పర శ్రద్ధతో కూడిన స్వేచ్ఛాయుతమైన, విముక్తిని కలిగించే సంబంధం.

మానవత్వం చూపే దయ కొన్నిసార్లు ద్రోహానికి గురవుతుంది. ఉదాహరణకు, స్వేచ్చను జీవం ఇవ్వడానికి కాకుండా, దానిని తీసివేయడానికి; సహాయం చేయడానికి కాకుండా, హాని చేయడానికి ఉపయోగించినపుడు. జీవానికి వ్యతిరేకంగా నిలబడి, దానిని నాశనం చేసే దుష్టత్వం ఎదురైనప్పటికీ, యేసు మన కొరకు తండ్రికి ప్రార్థిస్తూనే ఉంటారు. ఆయన ప్రార్థన మన గాయాలకు ఔషధములా పనిచేస్తుంది; అది మనకు క్షమాపణ మరియు సఖ్యత గురించి బోధిస్తుంది. తల్లిదండ్రులుగా, తాతామామ్మలుగా, కుమారులు, కుమార్తెలుగా ఒకరిపై ఒకరు చూపించుకునే ప్రేమకు ఆ ప్రార్థన సంపూర్ణ అర్థాన్ని ఇస్తుంది. ప్రభువు మనలను “ఐఖ్యముగా” ఉండాలని కోరుకున్నట్లే, మనం లోకానికి ఇదే ప్రకటించదలుచుకున్నాం: జీవితంలోని ప్రతి పరిస్థితిలో, ప్రతి దశలో, మన కుటుంబాలలో, మనం నివసించే, పనిచేసే, చదువుకునే ప్రదేశాలలో మనం “ఐఖ్యముగా” ఉండటానికి ఇక్కడ ఉన్నాం. మనం వేర్వేరుగా ఉన్నప్పటికీ, ఎల్లప్పుడూ ఐక్యంగా ఉంటాం; అనేకంగా ఉన్నప్పటికీ, ఐక్యంగా ఉంటాం.

ప్రియ స్నేహితులారా, “ఆల్ఫా మరియు ఒమేగా,” “ఆదియును, అంతమునైన” (దర్శన 22:13) క్రీస్తులో స్థిరపడి, ఒకరినొకరు ప్రేమించినట్లయితే, సమాజంలోనూ, ప్రపంచంలోనూ అందరికీ శాంతికి చిహ్నంగా నిలుస్తాము. మానవజాతి భవిష్యత్తుకు కుటుంబాలే ఊయల అన్న విషయాన్ని మనం ఎప్పటికీ మరువరాదు.

ఇటీవలి దశాబ్దాలలో, మనకు ఆనందాన్ని కలిగించే మరియు ఆలోచింపజేసే ఒక విశేషమైన సూచన కనిపిస్తోంది: అనేకమంది దంపతులు విడివిడిగా కాకుండా, వివాహిత జంటలుగా పునీతులుగా ప్రకటించబడుతున్నారు. ఈ కోవలో, పునీత థెరిస్ ఆఫ్ ది చైల్డ్ జీసస్ తల్లిదండ్రులైన లూయిస్ మరియు జెలీ మార్టిన్‌లు స్ఫూర్తినిస్తున్నారు. గత శతాబ్దంలో రోమ్‌లో తమ కుటుంబాన్ని భక్తిశ్రద్ధలతో పెంచిన బ్లెస్డ్ లూయిగి మరియు మరియా బెల్‌ట్రామ్ క్వాట్రోచిల జీవితాలు కూడా మనకు ఆదర్శప్రాయం. అంతేకాకుండా, పోలాండ్‌కు చెందిన ఉల్మా కుటుంబాన్ని మనం ఎప్పటికీ మర్చిపోలేం: తల్లిదండ్రులు మరియు పిల్లలు, ప్రేమ, అమరత్వంలో ఏకమైన వారి త్యాగం నిరుపమానం.

ఇది మనల్ని ఆలోచింపజేసే సంకేతం. దేవుని ప్రేమను అర్థం చేసుకోవడానికి, అంగీకరించడానికి, అలాగే సంబంధాలను, సమాజాలను విచ్ఛిన్నం చేసే శక్తులను ఓడించడానికి నేటి ప్రపంచానికి వివాహ నిబంధన (marriage covenant) అవసరం అని శ్రీసభ చెబుతోంది. వివాహ జీవితానికి ఆదర్శప్రాయమైన సాక్షులుగా దంపతులను చూపించడం ద్వారా, ఈ నిబంధన దేవుని ఏకీకృత, రాజీపడని శక్తిని తెలియజేస్తుంది.

ఈ కారణంగా, కృతజ్ఞతతో నిండిన హృదయంతో, వివాహిత జంటలందరికీ నేను గుర్తుచేయదలిచింది ఏమిటంటే, వివాహం కేవలం ఒక ఆదర్శం కాదు, కానీ ఒక పురుషుడు, ఒక స్త్రీ మధ్య ఉన్న నిజమైన ప్రేమకు కొలమానం. ఈ ప్రేమ పరిపూర్ణమైనది, నమ్మకమైనది, ఫలవంతమైనది (సెయింట్ పాల్ VI, హ్యూమనే వీతె, 9). ఈ ప్రేమ మిమ్మల్ని ఏక శరీరులను చేస్తుంది, దేవుని స్వరూపంలో, జీవం అనే బహుమతిని ప్రసాదించడానికి వీలు కల్పిస్తుంది.

మీ పిల్లల ముందు మీరు ఆచరణీయంగా ఉండాలని, వారికి విధేయత ద్వారా స్వేచ్ఛను నేర్పాలని, వారిలోని మంచిని నిరంతరం గుర్తించి, ప్రోత్సహించాలని, అలాగే సమగ్రతకు నిదర్శనంగా నిలవాలని నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. ప్రియమైన పిల్లలారా, మీ తల్లిదండ్రుల పట్ల కృతజ్ఞత కలిగి ఉండండి. మీకు లభించిన ఈ జీవితమనే బహుమతికి, దానితో పాటు వచ్చే ప్రతిదానికీ ప్రతిరోజూ "ధన్యవాదాలు" చెప్పడం ద్వారా మీరు మీ తండ్రిని, తల్లిని గౌరవించవచ్చు (నిర్గమ 20:12). చివరగా, ప్రియమైన తాతయ్యలు, అమ్మమ్మలు, పెద్దలారా, జ్ఞానం, కరుణ, వయస్సుతో వచ్చే వినయం, మరియు ఓర్పుతో మీ ప్రియమైనవారిని జాగ్రత్తగా చూసుకోమని నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను.

కుటుంబంలో, తరతరాలుగా జీవంతో పాటు విశ్వాసం కూడా అందించబడుతుంది. కుటుంబ బల్ల వద్ద ఆహారం పంచుకున్నట్లే, హృదయాల్లోని ప్రేమలా విశ్వాసము కూడా పంచబడుతుంది. ఈ విధంగా, కుటుంబాలు యేసును కలుసుకోవడానికి ప్రత్యేకమైన ప్రదేశాలుగా మారతాయి. ఆయన మనలను ప్రేమిస్తాడు, ఎల్లప్పుడూ మన మంచినే కోరుకుంటాడు.

నేను చివరిగా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మన ప్రయాణంలో మనకు ఆశను ఇచ్చే దేవుని కుమారుని ప్రార్థన, మనం ఒక రోజు అందరం uno unum (సెయింట్ అగస్టిన్, సెర్మో సూపర్ పి.ఎస్. 127), అన్నట్లుగా, ఏకైక రక్షకునిలో ఒకటిగా దేవుని శాశ్వత ప్రేమతో ఆలింగనం చేసుకోబడతామని గుర్తుచేస్తుంది. మనమే కాదు, మన తల్లిదండ్రులు, తాతముత్తాతలు, తోబుట్టువులు, మరియు పిల్లలు కూడా ఇప్పటికే ఆయన శాశ్వత పాస్క కాంతిలోకి వెళ్లిపోయారు. ఈ వేడుక సమయంలో, వారి ఉనికిని మనం ఇక్కడే, మనతో పాటు అనుభవిస్తున్నాము.

మూలము:

https://www.vatican.va/content/leo-xiv/en/homilies/2025/documents/20250601-omelia-giubileo-famiglie.html

గురుశ్రీ ప్రవీణ్ గోపు OFM Cap.


సాధారణ సమావేశం, లియో XIV జగద్గురువులు, బుధవారం, 04 జూన్ 2025

 లియో XIV జగద్గురువులు
సాధారణ సమావేశం
సెయింట్ పీటర్స్ స్క్వేర్, బుధవారం, 04 జూన్ 2025



ఉపదేశం జూబిలీ 2025. యేసుక్రీస్తు మన నిరీక్షణ. II. యేసు జీవితం. ఉపమానాలు 8. ద్రాక్షతోట-కూలీలు. “మీరు నా తోటకు వెళ్లి పని చేయుడు అని అనెను” (మత్త 20:4).

ప్రియ సహోదరీ సహోదరులారా,

యేసు ప్రభువు చెప్పిన ఉపమానాలలో ఒకటి, మనలో నిరీక్షణను నింపే ఒక గొప్ప సత్యాన్ని మరొక్కసారి ధ్యానించాలని నేను ఆశిస్తున్నాను. నిజమే, కొన్నిసార్లు మన జీవితానికి అర్థం లేదని అనిపిస్తుంది. అంగడి వీధిలో పని కోసం నిరీక్షిస్తున్న కూలీల వలె, ఎవరైనా పిలుస్తారని ఆశగా ఎదురుచూస్తూ ఉంటాం. మనం పనికిరాని వాళ్ళమని, అసమర్థులమని భావిస్తూ ఉంటాం. కాలం గడిచిపోతూ ఉంటుంది, జీవితం ముందుకు సాగుతూ ఉంటుంది. ఎవరూ మనల్ని గుర్తించడం లేదని, అభినందించడం లేదని లోలోపల బాధపడుతూ ఉంటాం. బహుశా సరైన సమయానికి మనం అక్కడికి చేరుకోలేకపోయాం కావచ్చు, లేదా ఇతరులు మనకంటే ముందే చేరుకొని ఉండవచ్చు, లేదా కొన్ని సమస్యలు మనల్ని ఆపి ఉండవచ్చు!

మార్కెట్ (అంగడి) అనే రూపకం ఈ రోజుల్లోనూ ఎంతో సముచితంగా ఉంది. ఎందుకంటే, మార్కెట్ వ్యాపార స్థలం. దురదృష్టవశాత్తు, అక్కడ ప్రేమ, గౌరవం కూడా కొని, అమ్మబడుతూ ఉంటాయి. ఏదో ఒకటి సంపాదించుకోవాలనే ప్రయత్నంలో ఇది జరుగుతూ ఉంటుంది. మనం విలువైనవారమని గుర్తించబడనప్పుడు, ప్రశంసించబడనప్పుడు, మొట్టమొదట ధర పలికిన వారికి మనల్ని మనం అమ్ముకునే ప్రమాదం ఉంది. అయితే, ప్రభువు మనకు గుర్తుచేసేది ఏమిటంటే, మన జీవితం అత్యంత విలువైనది. ఈ విలువను కనుగొనడానికి ఆయన మనకు సహాయం చేయాలని ఆశిస్తున్నారు.

మనం ఈరోజు ధ్యానిస్తున్న ఉపమానం కూడా రోజువారీ కూలీ కోసం ఎదురు చూస్తున్న పనివారికి సంబంధించింది. దీనిని మత్తయి సువార్త 20వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. ఇక్కడ కూడా మనం ఒక వింత ప్రవర్తన కలిగిన, మనల్ని ఆశ్చర్యపరిచే, సవాలు చేసే ఒక వ్యక్తిని చూస్తున్నాము. ఆయన ఒక ద్రాక్షతోట యజమాని. పనివారిని వెతుక్కుంటూ స్వయంగా బయటికి వస్తున్నాడు. ఆయన వారితో వ్యక్తిగత సంబంధాన్ని ఏర్పరచుకోవాలని కోరుకుంటున్నాడు.

నిజంగా, ఈ ఉపమానం మనలో ఆశను చిగురింపజేస్తుంది! ఎందుకంటే, తమ జీవితాలకు అర్థం వెతుక్కుంటున్న వారిని కనుగొనడానికి ఈ ద్రాక్షతోట యజమాని పదే పదే బయలుదేరి వెళ్ళాడు. తెల్లవారుజామునే బయలుదేరిన అతను, ఆ తర్వాత ప్రతి మూడు గంటలకు ఒకసారి తన ద్రాక్షతోటలోకి పనివారిని పంపడానికి వెతికాడు. ఈ ప్రణాళిక ప్రకారం, మధ్యాహ్నం మూడు గంటలకు బయలుదేరిన తర్వాత, మళ్ళీ వెళ్లాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, పనిదినం సాయంత్రం ఆరు గంటలకు ముగుస్తుంది.

అలుపెరుగని యజమాని మనలో ప్రతి ఒక్కరి జీవితానికి విలువ ఇవ్వాలని ఎంతగానో కోరుకుంటున్నాడు. అందుకే, పనిదినం ముగియడానికి కేవలం ఒక గంట ముందు, అంటే సాయంత్రం ఐదు గంటల సమయమున కూడా బయటకు వెళ్ళాడు. సంత వీధిలో ఇంకా నిలిచియున్న కూలీలు బహుశా తమ ఆశలన్నీ వదులుకొని ఉంటారు. ఆ రోజు వారికి పని దొరకలేదని పూర్తిగా నిరాశపడి ఉంటారు. అయినప్పటికీ, ఎవరో ఒకరు వారిని నమ్మారు. చివరి గంటలో మాత్రమే కూలీలను తీసుకోవడం వల్ల ఏమిటి ప్రయోజనం అనిపించవచ్చు. అయినా సరే, జీవితంలో మనం చాలా తక్కువ చేయగలుగుతున్నామని అనిపించినా, అది ఎల్లప్పుడూ విలువైనదే. మన జీవితానికి అర్థాన్ని కనుగొనే అవకాశం ఎల్లప్పుడూ ఉంటుంది. ఎందుకంటే, దేవుడు మన జీవితాన్ని అమితంగా ప్రేమిస్తున్నారు.

ఈ ద్రాక్షతోట యజమాని యొక్క విశిష్టత, రోజు చివరిలో, వేతనం చెల్లించే సమయంలో కూడా స్పష్టంగా కనిపిస్తుంది. తెల్లవారుజామున ద్రాక్షతోటలోకి వెళ్ళిన మొదటి పనివారికి రోజుకు ఒక దీనారము (సాధారణ రోజు కూలీ) చెల్లించడానికి యజమాని అంగీకరించాడు. మిగిలిన వారికి “తగిన వేతనము” ఇస్తానని చెప్పాడు. ఇక్కడే ఈ ఉపమానం మనల్ని ఆలోచింపజేస్తుంది: ఏది తగినది? ద్రాక్షతోట యజమాని దృష్టిలో, అంటే దేవుని దృష్టిలో, ప్రతి వ్యక్తికి జీవించడానికి అవసరమైనది ఉండటమే న్యాయం. అతను కూలీలను వ్యక్తిగతంగా పిలిచాడు, వారి గౌరవాన్ని గుర్తించాడు, మరియు దీని ఆధారంగా వారికి వేతనం ఇవ్వాలని కోరుకుంటాడు. అందుకే అందరికీ ఒక దీనారమును ఇచ్చాడు.

ఈ ఉపమానంలో, మొదటి గంట నుండి పని చేసిన కూలీలు నిరాశ పడ్డారు. యజమాని చేసిన పనిలో ఉన్న అందాన్ని వారు చూడలేకపోయారు. అతను అన్యాయం చేయలేదు, కేవలం ఉదారంగా ఉన్నాడు; యోగ్యతను మాత్రమే కాకుండా, అవసరాన్ని కూడా చూశాడు. దేవుడు తన రాజ్యాన్ని అంటే సంపూర్ణమైన, నిత్యమైన, సంతోషకరమైన జీవితాన్నిప్రతి ఒక్కరికీ ఇవ్వాలని కోరుకుంటాడు. మరియు యేసు మనతో చేసేది ఇదే: ఆయన ఎలాంటి ర్యాంకులను ఏర్పాటు చేయడు. ఆయనకు తమ హృదయాలను తెరిచిన వారికి ఆయన సర్వాన్ని ఇస్తాడు.

ఈ ఉపమాన వెలుగులో, నేటి క్రైస్తవులు "”నేను వెంటనే పని ఎందుకు ప్రారంభించాలి? వేతనం ఒకటే అయినప్పుడు నేను ఎక్కువ పని ఎందుకు చేయాలి?” అని శోధింపబడే అవకాశం ఉంది. ఈ సందేహాలకు పునీత అగుస్తీను వారు ఇలా సమాధానమిచ్చారు: “నీకు ప్రతిఫలం లభిస్తుందని ఖచ్చితంగా తెలిసినా, కాని ఆ రోజు ఎదో నీకు ఖచ్చితంగా తెలియకపోయినా, నిన్ను పిలిచిన వానిని ఎందుకు నిరాశపరుస్తావు? అందువల్ల, వాగ్దానం ద్వారా నీకు ఇవ్వబోయే దానిని ఆలస్యం చేయడం ద్వారా నీవే దూరం చేసుకోకుండా చూసుకో.

ముఖ్యంగా యువతీ యువకులకు నేను చెప్పదలచుకున్నది ఏమిటంటే, ఆలస్యం చేయకండి! ప్రభువు తన ద్రాక్షతోటలో పని చేయడానికి పిలుస్తున్నప్పుడు, ఉత్సాహంగా స్పందించండి. ఆలస్యం చేయవద్దు, పనికి సిద్ధపడండి. ఎందుకంటే, ప్రభువు ఉదార స్వభావుడు, మీరు నిరాశ చెందరు! ఆయన ద్రాక్షతోటలో పని చేయడం ద్వారా, మీలో నున్న, “నా జీవితానికి అర్థం ఏమిటి?” అన్న లోతైన ప్రశ్నకు సమాధానాన్ని కనుగొంటారు.

నిరుత్సాహ పడవద్దు! జీవితంలోని చీకటి సమయాల్లో, మనం కోరుకున్న సమాధానాలు దొరకకుండా కాలం గడిచిపోతున్నప్పుడు కూడా, ప్రభువును వేడుకుందాం. ఆయన మళ్ళీ బయటికి వచ్చి, ఆయన కోసం ఎదురు చూస్తున్న చోటనే మనల్ని కనుగొంటాడు. ఆయన ఉదార స్వభావుడు, త్వరలోనే వస్తాడు!

 

ప్రత్యేక శుభాకాంక్షలు:

నేటి సమావేశంలో పాల్గొంటున్న ఆంగ్ల భాష మాట్లాడే యాత్రికులకు, సందర్శకులకు నా హృదయపూర్వక స్వాగతం. ముఖ్యంగా ఇంగ్లండ్, స్కాట్లాండ్, ఐర్లాండ్, ఫిన్లాండ్, కెన్యా, భారతదేశం, ఇండోనేషియా, దక్షిణ కొరియా, ఫిలిప్పీన్స్ మరియు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుండి వచ్చిన మీకు ప్రత్యేక ధన్యవాదాలు. పెంతకోస్తు పండుగను జరుపుకోవడానికి మనం సిద్ధమవుతున్న వేళ, మీపై మరియు మీ కుటుంబాలపై పవిత్రాత్మ వరాలు సమృద్ధిగా కురియాలని ప్రార్థిస్తున్నాను.

పరిశుద్ధ జగద్గురువు మాటల సారాంశం:

ప్రియమైన సహోదరీ సహోదరులారా, “యేసుక్రీస్తు మన నిరీక్షణ” అనే జూబిలీ అంశంపై కొనసాగుతున్న ఉపదేశంలో భాగంగా, ఈరోజు మనం చివరి గంట పని చేసిన కూలీల గురించిన యేసు ఉపమానాన్ని (మత్తయి 20:1-16) ధ్యానిస్తున్నాం. చివరి గంటలో వచ్చిన కూలీలకు కూడా ఒకే వేతనం ఇచ్చిన యజమాని, మన తండ్రియైన దేవునికి ప్రతీక. ఆయన తన వద్దకు వచ్చేవారిని నిరంతరం వెతుకుతూ ఉంటారు. ఆయన ప్రేమ, ఔదార్యం ఆయన పిలుపునకు స్పందించిన వారికి, ఎంత ఆలస్యంగానైనా సరే, సంపూర్ణమైన, నిత్య జీవము గల తన రాజ్యములో పాలుపంచుకునేలా సమృద్ధిగా ప్రతిఫలమిస్తారు. దేవుడు మనలను ఎన్నడూ విడిచిపెట్టడు. మన పరిస్థితి ఎంత నిస్సహాయంగా కనిపించినా, మన యోగ్యతలు ఎంత అల్పంగా తోచినా, ఆయన మనలను అంగీకరించడానికి, మన జీవితాలకు అర్థం, నిరీక్షణ ఇవ్వడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు. మనమందరం, ముఖ్యంగా యువత, ఆయన ద్రాక్షతోటలో పని చేయాలనే ఆయన పిలుపునకు ఉదారంగా, ఉత్సాహంగా స్పందించాలి.

మూలము:
https://www.vatican.va/content/leo-xiv/en/audiences/2025/documents/20250604-udienza-generale.html

గురుశ్రీ ప్రవీణ్ కుమార్ గోపు

పొప్ లియో XIV, రేజీనా చెలీ, 25 మే 2025

పొప్ లియో XIV
రేజీనా చెలీ
పు. పేతురు బసిలికా, రోము నగరము
ఆదివారము, 25 మే 2025

ప్రియమైన సహోదరీ సహోదరులారా! మీ అందరికీ ఆదివారం శుభాకాంక్షలు!

మీ మధ్య నా సేవ ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. అన్నింటికంటే ముందు, మీరు చూపించిన ప్రేమకు నా హృదయ పూర్వక కృతజ్ఞతలు. మీ ప్రార్థనలు, సాన్నిహిత్యంతో నాకు అండగా ఉండాలని కోరుతున్నాను.

మన దైనందిన జీవితంలో లేదా మన విశ్వాస ప్రయాణంలో, ప్రభువు మనలను ఏ కార్యానికి పిలిచినా, కొన్నిసార్లు మనం సరిపోమని భావిస్తుంటాం. అయితే ఈ ఆదివారం సువార్త (యోహాను 14:23-29) మనకు ఒక గొప్ప విషయాన్ని తెలియ జేస్తుంది: మనం మన స్వంత సామర్థ్యాలపై ఆధారపడకూడదు. దానికి బదులుగా మనలను ఎన్నుకున్న ప్రభువు దయపై ఆధారపడాలి. అలాగే, పరిశుద్ధాత్మ మనల్ని నడిపిస్తుందని, మనకు అన్ని విషయాలు నేర్పిస్తుందని మనం ఖచ్చితంగా నమ్మాలి.

ప్రభువు మరణానికి ముందు రోజు, అపొస్తలులు ఆందోళన మరియు బాధలో ఉండి, దేవుని రాజ్యానికి సాక్ష్యం ఇవ్వడము ఎలా కొనసాగించాలని ఆలోచించారు. అప్పుడు యేసు వారికి పరిశుద్ధాత్మ అనుగ్రహము గురించి మాట్లాడారు. ఆయన ఈ అద్భుతమైన వాగ్దానం చేశారు: “నన్ను ప్రేమించువాడు నా మాటను పాటించును. అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును. మేము వాని యొద్దకు వచ్చి వానితో నివసింతుము” (వచనం 23).

ఈ విధంగా, యేసు శిష్యులను వారి ఆందోళన నుండి విముక్తుల్ని చేస్తూ ఇలా అన్నారు: “మీ హృదయములను కలవర పడనీయకుడు. భయ పడనీయకుడు” (వచనం 27). ఎందుకంటే, మనం ఆయన ప్రేమలో ఉంటే, ఆయన మనలో నివసించడానికి వేంచేస్తారు మరియు మన జీవితం దేవుని ఆలయంగా మారుతుంది. ఆయన ప్రేమ మనకు జ్ఞానాన్నిస్తుంది. మనం ఆలోచించే విధానాన్ని, పనిచేసే విధానాన్ని ప్రభావితం చేస్తుంది. ఇతరులకు విస్తరిస్తుంది మరియు మన జీవితంలోని ప్రతి పరిస్థితిని ఆవరించుకుంటుంది.

మనలో దేవుని నివాసం అనేది నిస్సందేహంగా పరిశుద్ధాత్మ యొక్క వరం. పరిశుద్ధాత్మ మనలను చెయ్యి పట్టుకొని, మన దైనందిన జీవితంలో దేవుని ఉనికిని, సాన్నిధ్యాన్ని అనుభవించడానికి సహాయపడుతుంది. ఎందుకంటే, ఆయన మనలను తన నివాసంగా చేసుకుంటాడు.

మన వ్యక్తిగత పిలుపు, మనం ఎదుర్కొనే పరిస్థితులు, మన సంరక్షణకు అప్పగించబడిన వ్యక్తులు, మన బాధ్యతలు, శ్రీసభలో మన సేవ – వీటన్నింటినీ మనం ఆలోచించినప్పుడు, ప్రతి ఒక్కరం విశ్వాసంతో ఇలా చెప్పగలగడం అద్భుతం: “నాలో బలహీనతలు ఉన్నప్పటికీ, ప్రభువు నా మానవనైజం పట్ల సిగ్గుపడరు. బదులుగా, ఆయన నాలో నివసించడానికి వస్తారు. తన ఆత్మతో నాతో పాటు ఉంటారు; నాకు జ్ఞానాన్ని ప్రసాదిస్తారు మరియు ఇతరులకు, సమాజానికి, ప్రపంచానికి తన ప్రేమను అందించడానికి నన్ను ఒక సాధనంగా చేస్తారు.”

ప్రియమైన మిత్రులారా, ప్రభువు వాగ్దానం ఆధారంగా, విశ్వాసం నుండి పుట్టిన ఆనందంతో నడుద్దాం, తద్వారా ప్రభువుకు పవిత్ర ఆలయంగా మారదాం. ఆయన ప్రేమను ప్రతిచోట పంచడానికి సంకల్పించుకుందాం. మన సహోదరీ, సహోదరులు ప్రతి ఒక్కరూ దేవుని నివాస స్థలమే అని, ఆయన ఉనికి ముఖ్యంగా చిన్నవారిలో, పేదవారిలో మరియు బాధపడేవారిలో వ్యక్తమవుతుందని ఎన్నడూ మర్చిపోవద్దు. వీరంతా ఆలోచనాత్మకమైన మరియు కరుణగల క్రైస్తవులుగా ఉండమని మనల్ని కోరుతున్నారు.

మరియు మనం పరిశుద్ధ మరియ మాత మధ్యవర్తిత్వానికి మనల్ని మనం అప్పగించుకుందాం. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా, ఆమె “దేవునికి పవిత్రమైన నివాస స్థలంగా” మారింది. ఆమెతో కలిసి, మనం కూడా మన జీవితాలలో ప్రభువును స్వాగతించే ఆనందాన్ని తెలుసుకుందాం మరియు ఆయన ప్రేమకు చిహ్నాలుగా, సాధనాలుగా ఉందాం.

రేజీనా చెలీ తర్వాత పరిశుద్ధ తండ్రి వ్యాఖ్యలు

ప్రియమైన సహోదర సహోదరీలారా!

నిన్న పోజ్నాన్ (పోలాండ్)లో, స్టానిస్లాస్ కోస్త్కా స్ట్రీచ్ అనే మేత్రాసణములో గురువును ధన్యుడిగా ప్రకటించారు. కమ్యూనిస్ట్ సిద్ధాంతాన్ని అనుసరించేవారికి పేదల మరియు కార్మికుల పట్ల ఆయన చేసిన సేవ నచ్చకపోవడంతో, 1938లో మత ద్వేషంతో ఆయన హత్య చేయబడ్డాడు. సువార్త సేవలో మరియు తమ సహోదరీ సహోదరుల సేవలో గురువులు ముఖ్యంగా ఆయన ఆదర్శాన్ని స్ఫూర్తిగా తీసుకుని తమను తాము ఉదారంగా అంకితం చేసుకోవాలి.

నిన్న, పరిశుద్ధ కన్య మరియ క్రైస్తవుల సహాయ మాత పండుగ రోజున, పోప్ బెనెడిక్ట్ XVI స్థాపించిన చైనాలోని చర్చి కోసం ప్రార్థనా దినోత్సవాన్ని కూడా మనం జరుపుకున్నాం. చైనాలోని మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న చర్చిలలో, పుణ్యక్షేత్రాలలో, చైనీస్ కతోలికుల పట్ల శ్రద్ధకు మరియు ప్రేమకు సూచనగా, మరియు విశ్వవ్యాప్త శ్రీసభతో వారి ఐక్యత కొరకు దేవునికి ప్రార్థనలు సమర్పించ బడ్డాయి. పరిశుద్ధ మరియ మాత మధ్యవర్తిత్వం ద్వారా, వారికి మరియు మనకు, కష్టాల మధ్య కూడా సువార్తకు బలమైన మరియు ఆనందకరమైన సాక్షులుగా ఉండే కృపను పొందేలా చేయుగాక, తద్వారా మనం ఎల్లప్పుడూ శాంతిని మరియు సామరస్యాన్ని ప్రోత్సహించవచ్చు.

ఈ భావాలతో, యుద్ధం కారణంగా బాధపడుతున్న ప్రజలందరినీ మన ప్రార్థన కౌగిలించు కుంటుంది. సంభాషణలో నిమగ్నమైన వారికి మరియు శాంతి కోసం నిజాయితీగా అన్వేషిస్తున్న వారికి ధైర్యాన్ని, పట్టుదలను ప్రసాదించమని మనం వేడుకుందాం.

పదేళ్ల క్రితం, పోప్ ఫ్రాన్సిస్ మన ఉమ్మడి నివాసం (భూమి) సంరక్షణకు అంకితం చేయబడిన తన ఎన్‌సైక్లికల్ లేఖ ‘లౌదాతో సి’ (Laudato Si’) పై సంతకం చేశారు. అది అసాధారణ ప్రభావాన్ని చూపింది. లెక్కలేనన్ని కార్యక్రమాలకు స్ఫూర్తినిచ్చింది మరియు భూమి, పేదల ఉభయ ఆక్రందనను వినమని అందరికీ నేర్పింది. ‘లౌదాతో సి’ ఉద్యమానికి మరియు ఈ నిబద్ధతను కొనసాగిస్తున్న వారందరికీ నేను వందనం పలుకుతూ, ప్రోత్సహిస్తున్నాను.

ఇటలీ నుండి మరియు ప్రపంచంలోని అనేక ప్రాంతాల నుండి వచ్చిన మీ అందరికీ, ముఖ్యంగా వాలెన్సియా మరియు పోలాండ్ నుండి వచ్చిన యాత్రికులకు నేను వందనాలు చెబుతున్నాను. పోలాండ్‌లోని పీకరీ స్లాస్కీలోని మరియ తల్లి పుణ్యక్షేత్రానికి జరుగుతున్న గొప్ప తీర్థయాత్రలో పాల్గొంటున్న వారికి నా ఆశీస్సులు. పెస్కారా, సోర్టినో, పటెర్నో, కాల్టాగైరోన్, మస్సరోసా నార్డ్, మల్నాటే పలగోనియా మరియు సెరెల్లో నుండి వచ్చిన భక్తులకు, అలాగే రోమ్‌లోని యేసు మరియు మరియ తిరు హృదయాల విచారణ నుండి వచ్చిన వారికి కూడా నా వందనాలు. జెనోవా అగ్రపీఠము, శాన్ టియోడోరో, టెంపియో-అంపురియాస్ మేత్రాసణములోని కన్ఫర్మెంట్లకు, మరియు పడెర్నో డుగ్నానో నుండి వచ్చిన సైకిల్‌దారులు మరియు పలెర్మో నుండి వచ్చిన బెర్సాగ్లిరీలకు నేను వందనాలు చెబుతున్నాను.

అందరికీ ఆదివార శుభాకాంక్షలు!

లియో XIV జగద్గురువులు, సాధారణ సమావేశం, 28 మే 2025

 లియో XIV జగద్గురువులు
సాధారణ సమావేశం
సెయింట్ పీటర్స్ స్క్వేర్, బుధవారం, 28 మే 2025
ఉపదేశం జూబిలీ 2025. యేసుక్రీస్తు మన నిరీక్షణ. II. యేసు జీవితం. ఉపమానాలు 7.
“యేసుక్రీస్తు మన నిరీక్షణ. సమరీయుడు. “వానిని చూడగనే అతడు జాలిపడెను” (లూకా 10:33).
 


ప్రియమైన సహోదరీ సహోదరులారా,
 
సువార్తలోని కొన్ని ఉపమానాలను మనం ధ్యానిస్తూనే ఉందాం. ఇవి మన దృక్పథాన్ని మార్చుకోవడానికి మరియు నిరీక్షణకు మనల్ని మనం తెరచుకోవడానికి అవకాశాన్ని కల్పిస్తాయి. కొన్నిసార్లు ఒక నిర్దిష్ట, మొండి మరియు మూసివేసిన రీతిలో విషయాలను చూడటం వలన నిరీక్షణ లేకపోవడం కలుగుతుంది. ఇలాంటి సమయాలలో ఉపమానాలు వాటిని మరొక కోణం నుండి చూడటానికి మనకు సహాయపడతాయి.
 
ఈరోజు నేను ఒక నిపుణుడైన, విజ్ఞానం గల, ధర్మశాస్త్ర బోధకుని గురించి చెప్పాలనుకుంటున్నాను. తనలో తాను లీనమై, తనపైనే దృష్టిని సారించడం వల్ల, ఇతరులను గమనించలేకుండా ఉన్నందున అతను తన దృక్పథాన్ని మార్చుకోవాలి (లూకా 10:25-37). వాస్తవానికి, నిత్య జీవం పొందుటకు ఏమి చేయాలి? అని యేసును పరీక్షింపగోరి ప్రశ్నించాడు. నిత్య జీవాన్ని నిస్సందేహమైన హక్కుగా భావించే పదాన్ని అతను ఉపయోగించాడు. అయితే, బహుశా ఈ ప్రశ్న వెనుక నున్న ఉద్దేశాన్ని గమనించాలి: నా పొరుగువాడు ఎవడు?” అని ప్రశ్నించడం ద్వారా, పొరుగువాడు అనే పదాన్ని వివరించమని యేసును కోరుచున్నాడు. పొరుగువాడు అన్న పదానికి దగ్గరగా ఉన్నవాడు అని అర్థం.
 
అందువల్ల, యేసు సమాధానమిస్తూ ఒక ఉపమానాన్ని చెప్పియున్నారు. ఈ ఉపమానం "నన్ను ఎవరు ప్రేమిస్తారు?" అనే ప్రశ్న నుండి "నన్ను ఎవరు ప్రేమించారు?" అన్న దానిపై దృష్టిని మరల్చడానికి ఒక మార్గం. మొదటిది అపరిపక్వమైన ప్రశ్న. రెండవది తన జీవిత పరమార్థాన్ని అర్థం చేసుకున్న వ్యక్తియొక్క ప్రశ్న. మొదటి ప్రశ్న మనం ఒక మూలగా కూర్చుని వేచియున్నప్పుడు అడిగేది. రెండవది మనల్ని మార్గంలో నడచుటకు పురికొల్పే ప్రశ్న.
 
యేసు చెప్పిన ఉపమానంలో, వాస్తవానికి ఒక త్రోవ/మార్గం నేపథ్యంగా ఉంది. అది జీవితం వలె కష్టమైన మరియు అసాధ్యమైన మార్గం. పర్వతం మీదనున్న యెరూషలేము నగరం నుండి, సముద్ర మట్టానికి దిగువనున్న యెరికో నగరానికి ఒక వ్యక్తి క్రిందికి వెళ్ళే మార్గం అది. ఎప్పుడు ఏమి జరుగునోనని ముందుగానే తెలియజేసే ఒక చిత్రం అది: ఊహించినట్లుగానే, ఆ వ్యక్తి దాడి చేయబడ్డాడు, గాయపరచబడ్డాడు, దోచుకోబడ్డాడు మరియు కొన ఊపిరితో వదిలివేయబడ్డాడు. పరిస్థితులు, వ్యక్తులు, కొన్నిసార్లు మనం నమ్మినవారే మన నుండి సమస్తాన్ని దోచుకుని మనల్ని నడి రోడ్డున పడవేసినప్పుడు ఎదురయ్యే అనుభవం లాంటిదే ఇది.
అయితే, జీవితం పోరాటాలను ఎదుర్కోవడంతో కూడి ఉంటుంది. ఈ పోరాటాలను ఎదుర్కోవడంలో, మనం ఎవరో మనం తెలుసుకోగలుగుతాము. ఇతరుల ముందు, వారి పెళుసుదనం, బలహీనతను ఎదుర్కొంటూ, మనం ఏమి చేయాలో నిర్ణయించుకోవచ్చు: వారిని జాగ్రత్తగా చూసుకోవడం లేదా ఏమీ తప్పు చేయనట్లు నటించడం. ఒక యాజకుడు మరియు ఒక లేవీయుడు అదే మార్గంలో వెళ్లారు. వారు యెరూషలేము దేవాలయంలో సేవ చేసే వ్యక్తులు, పవిత్ర స్థలంలో జీవించేవారు. అయినప్పటికీ, ఆరాధన చేసినంత మాత్రాన కరుణతో ఉండటానికి దారి తీయదు! నిజానికి, మతపరమైన విషయం కంటే ముందుగా, కరుణ మానవత్వానికి సంబంధించిన విషయం! విశ్వాసులం కాకముందే, మనం మానవులుగా ఉండాలని పిలవబడ్డాము.
 
యెరూషలేములో చాలా కాలం గడిపిన తర్వాత, ఆ యాజకుడు మరియు ఆ లేవీయుడు ఇంటికి తిరిగి వెళ్ళడానికి తొందరపడుతున్నారని మనం ఊహించవచ్చు. మన జీవితాలలో కూడా ఈ తొందరపాటు చాలా తరచుగా ఉండటం వలన కరుణను అనుభూతి చెందకుండా మనల్ని అడ్డుకుంటుంది. సొంత ప్రయాణానికే ప్రాధాన్యత ఇవ్వాలని భావించేవారు మరొకరి కోసం ఆగడానికి సిద్ధంగా ఉండరు.
 
కానీ ఇక్కడ ఆగగలిగే ఒక వ్యక్తి వచ్చాడు. అతను ఒక సమరీయుడు. అతను తృణీకరించబడిన ప్రజలకు చెందిన వ్యక్తి (2 రాజులు 17). సమరీయుని విషయంలో, సువార్త పఠనం అతని దిశను నిర్దిష్టంగా చెప్పలేదు, కానీ అతను అటు పయనమై పోవుచున్నట్లుగా మాత్రమే చెబుతుంది. ఇక్కడ మత సంబంధమైన విషయాలకు చోటు లేదు. ఈ సమరీయుడు గాయపడిన వ్యక్తిని చూసి ఆగాడు, ఎందుకంటే అతను సహాయం అవసరమైన మరొక వ్యక్తిని ఎదుర్కున్నాడు.
 
కరుణ (జాలి) ఆచరణాత్మక చర్యల ద్వారా వ్యక్తమవుతుంది. లూకా సువార్తీకుడు సమరీయుని చర్యలను పరిశీలిస్తాడు. మనం అతనిని మంచివాడు (మంచి సమరయుడు) అని పిలుస్తాము, కానీ సువార్తలో అతను కేవలం ఒక వ్యక్తి. సమరీయుడు గాయపడిన వ్యక్తి దగ్గరకు వెళ్ళాడు. మీరు ఒకరికి సహాయం చేయాలనుకుంటే, దూరం పాటించాలని, తప్పుకోవాలని అనుకోలేరు; మీరు పాల్గొనాలి, మురికిగా మారాలి, బహుశా కలుషితం కావచ్చు. అతను గాయాలకు తైలముతో శుభ్రం చేసి, తర్వాత ద్రాక్షారసము పోసి కట్టు కట్టాడు. పిమ్మట అతనిని తన గుర్రంపై కూర్చుండబెట్టి, ఆ వ్యక్తి భారాన్ని మోసాడు. ఎందుకంటే మరొకరి బాధను అనుభవించడానికి సిద్ధంగా ఉన్నప్పుడే, నిజంగా సహాయం చేయగలరు. ఒక సత్రమునకు తీసుకొని పోయి పరామర్శించాడు. అక్కడ అతను డబ్బు, రెండు దీనారములు’ (రెండు వెండి నాణెములు), సుమారు రెండు రోజుల తన సంపాదనను సత్రపుశాల యజమానుని చేతిలో పెట్టాడు. మరియు ఎక్కువ వ్యయము అయినచో తిరిగి వచ్చిన పిమ్మట చెల్లించడానికి అంగీకరించాడు. ఎందుకంటే ఆ వ్యక్తి డెలివరీ చేయాల్సిన పార్సిల్ కాదు; శ్రద్ధ వహించాల్సిన వ్యక్తి.
 
ప్రియమైన సహోదరీ సహోదరులారా, మనం కూడా ఎప్పుడు మన ప్రయాణాన్ని ఆపి, కనికరం చూపగలం? వీధిలో గాయపడిన వ్యక్తి మనలో ప్రతి ఒక్కరిని సూచిస్తాడని అర్థం చేసుకున్నప్పుడు, అలాగే యేసు మనల్ని జాగ్రత్తగా చూసుకోవడానికి ఆగిన సమయాలన్నింటినీ జ్ఞాపకం చేసుకున్నప్పుడు, అవసరంలో ఉన్న వారిపట్ల మనం మరింత కనికరపడేలా చేస్తుంది.
 
కాబట్టి, మనం మానవత్వంలో ఎదగాలని ప్రార్థన చేద్దాం! అప్పుడు, మన సంబంధాలు మరింత నిజమైనవిగా, కరుణతో నిండినవిగా ఉంటాయి. యేసు హృదయం వలెనే కనికరం కలిగి ఉండటానికి ఆ తిరు హృదయాన్ని వేడుకుందాం
 
విజ్ఞప్తి
ఈ రోజుల్లో, నా ఆలోచనలు తరచుగా ఉక్రేనియన్ ప్రజల వైపు వెళుతున్నాయి. పౌరులు మరియు మౌలిక సదుపాయాలపై తీవ్రమైన కొత్త దాడుల వల్ల వారు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు. బాధితులందరికీ, ముఖ్యంగా పిల్లలు మరియు కుటుంబాలకు, నా సాన్నిహిత్యాన్ని మరియు ప్రార్థనను హామీ ఇస్తున్నాను.
 
యుద్ధాన్ని ఆపాలని మరియు సంభాషణ, శాంతికి సంబంధించిన ప్రతి ప్రయత్నానికి మద్దతు ఇవ్వాలని నేను నా విజ్ఞప్తిని గట్టిగా పునరుద్ఘాటిస్తున్నాను. ఉక్రెయిన్‌లో మరియు యుద్ధం వల్ల బాధపడుతున్న ప్రతిచోటా శాంతి కోసం ప్రార్థనలో పాలుపంచుకోవాలని అందరినీ కోరుతున్నాను.
 
గాజా స్ట్రిప్‌లో, పిల్లల నిర్జీవ దేహాలను పట్టుకున్న తల్లిదండ్రుల ఆక్రందనలు ఆకాశానికి మరింత తీవ్రంగా పెరుగుతున్నాయి. అలాగే, బాంబు దాడుల నుండి కొద్దిపాటి ఆహారం మరియు సురక్షితమైన ఆశ్రయం కోసం వారు నిరంతరం ఒక చోట నుండి మరొక చోటకు కదలవలసి వస్తుంది.
 
నేను నాయకులకు నా విజ్ఞప్తిని పునరుద్ధరిస్తున్నాను: కాల్పుల విరమణ చేయండి, బందీలను అందరినీ విడుదల చేయండి, మానవతా చట్టాన్ని పూర్తిగా గౌరవించండి. సమాధాన రాజ్ఞి మరియా, మా కొరకు ప్రార్థించు.
 
ప్రత్యేక శుభాకాంక్షలు:
నేడు ఈ సాధారణ సమావేశములో పాల్గొంటున్న ఆంగ్ల భాష మాట్లాడే యాత్రికులు మరియు సందర్శకులకు, ముఖ్యంగా ఇంగ్లాండ్, స్కాట్లాండ్, నార్వే, ఘనా, కెన్యా, ఆస్ట్రేలియా, చైనా, హాంగ్ కాంగ్, ఇండియా, ఇండోనేషియా, మయన్మార్, ఫిలిప్పీన్స్, దక్షిణ కొరియా, తైవాన్, వియత్నాం, కెనడా మరియు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుండి వచ్చిన వారికి సంతోషంగా స్వాగతం పలుకుతున్నాను. ప్రభువు మోక్షారోహణను మనం స్మరించుకోవడానికి సిద్ధమవుతున్నప్పుడు, మీలో ప్రతి ఒక్కరూ మరియు మీ కుటుంబాలు నిరీక్షణ మరియు ఆనందాన్ని పునరుద్ధరించుకోవాలని నేను ప్రార్థిస్తున్నాను. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించునుగాక!

పరిశుద్ధ జగద్గురువు మాటల సారాంశం:
ప్రియమైన సహోదరీ సహోదరులారా: “క్రీస్తు మన నిరీక్షణ” అనే జూబిలీ అంశంపై కొనసాగుతున్న బోధనలలో, ‘మంచి సమరయుడు’ అను మరొక ఉపమానమును ధ్యానిద్దాం. ఈ కథ ద్వారా, కనికరం చూపడం ద్వారా నిత్యజీవితం లభిస్తుందని యేసు మనకు బోధిస్తున్నారు. చూచియు తప్పుకొని పోయిన యాజకుడు మరియు లేవీయుడు వలె, కొన్నిసార్లు మనం మన స్వంత ప్రయోజనాలలో మరియు జీవితంలోని బిజీలో చిక్కుకొని, మన చుట్టూ ఉన్నవారికి నిజమైన పొరుగువారుగా ఉండటంలో విఫలమవుతున్నాము. మంచి సమరయుడు తన కనికరముతో మనలను ఆశ్చర్యపరచాడు మరియు అతని ఉదారత మన స్వార్థాన్ని విడనాడటానికి మనల్ని సవాలు చేస్తుంది. దొంగల చేతుల్లో పడిన వ్యక్తిలో మనం కూడా మనల్ని చూసుకోవచ్చు, ఎందుకంటే మనమందరం జీవితంలోని కష్టాలను మరియు పాపం వల్ల కలిగే బాధను అనుభవిస్తున్నాము. మన బలహీనతలో, క్రీస్తు స్వయంగా మన గాయాలను నయం చేసి, మన నిరీక్షణను పునరుద్ధరించే మంచి సమరయుడు అని మనం కనుగొంటాము. కాబట్టి, నిజమైన మానవత్వానికి నమూనైన యేసు పవిత్ర హృదయం వైపు తిరుగుదాం, మరియు మన హృదయం ఆయన వలెనే మారాలని ఆయనను వేడుకుందాం.

మూలము:
https://www.vatican.va/content/leo-xiv/en/audiences/2025/documents/20250528-udienza-generale.html

ఫాదర్ ప్రవీణ్ గోపు OFM Cap.