విశ్వవిభుడైన క్రీస్తురాజు మహోత్సవము, Year C

విశ్వవిభుడైన క్రీస్తురాజు మహోత్సవము, Year C
2 సమూ 5:1-3; కొలొస్సీ 1:12-20; లూకా 23:35-43


మన మంచి కాపరి క్రీస్తురాజు! క్రీస్తురాజు పరలోక రాజ్యమునకు రాజు. రాజులకు రాజు! ప్రభువులకు ప్రభువు! ఆయన రాజ్యము రావాలి. ఆయన రాజ్యములో మనము ఉండాలి.

క్రీస్తు రాజు నందు ప్రియ సహోదరీ, సహోదరులారా, మనం క్రీస్తురాజు మహోత్సవమును జరుపుకొనుచున్నాము. ఈ దైవార్చనా సంవత్సరంలో, ఇది చివరి ఆదివారము. ఈ పండుగ ప్రపంచానికి, సమస్త చరిత్రకు యేసు క్రీస్తే ఏకైక మరియు నిజమైన రాజు అని ప్రకటిస్తుంది. కతోలిక శ్రీసభలో, పదకొండవ పయస్ పొప్ గారు 1925వ సంవత్సరంలో “క్వాస్ ప్రిమాస్” అను అపోస్తోలిక లేఖ ద్వారా, ఈ పండుగను స్థాపించారు.

పోప్ పియస్ గారు ఈ పండుగను స్థాపించడానికి ప్రధాన కారణం లౌకికవాదం పెరుగడం మరియు ప్రపంచంలో రాజకీయ అస్థిరత నెలకొనడం. 1920లలో, ప్రపంచ యుద్ధం తర్వాత, అనేక ప్రభుత్వాలు శ్రీసభ అధికారాన్ని, దైవిక శక్తిని పూర్తిగా విస్మరిస్తూ, మతపరమైన విలువలకు వ్యతిరేకంగా నిలబడటం ప్రారంభించాయి. ఈ ధోరణిని ఎదుర్కోవడానికి మరియు క్రీస్తు సర్వాధికారమును పునరుద్ఘాటించడానికి ఈ పండుగను స్థాపించారు.

ఏ రాజకీయ సంస్థ గాని, లౌకిక నాయకుడు గాని, క్రీస్తు రాజు స్థానాన్ని భర్తీ చేయలేరని, మరియు క్రీస్తు రాజరికం కేవలం ఆధ్యాత్మికం మాత్రమే కాదు, సామాజిక మరియు రాజకీయ రంగాలకు కూడా వర్తిస్తుందని ఈ పండుగ ప్రకటిస్తుంది. క్రీస్తు రాజ్యం శాంతి మరియు న్యాయంపై ఆధారపడి ఉంటుంది. ప్రపంచంలో శాంతిని సాధించాలంటే, ప్రజలు మరియు దేశాలు యేసు క్రీస్తు యొక్క ధర్మాన్ని అంగీకరించాలి. పొప్ పయస్ గారి మాటల్లో, “ప్రజలు మరియు దేశాలు తమ జీవితాల నుండి క్రీస్తును బహిష్కరించినంత కాలం, ఆయా దేశాలకు శాంతి అనేది ఉండదు” అని చెప్పారు.

ఆరంభంలో ఈ పండుగ పేరు “మన ప్రభువైన యేసు క్రీస్తు రాజు” అని ఉండేది. రెండవ వాటికన్ కౌన్సిల్ సంస్కరణల తరువాత, “విశ్వ విభుడైన క్రీస్తు రాజు” అని ఆరవ పౌల్ పొప్ గారు మార్చారు. పండు తేదీ కూడా 1969 వరకు అక్టోబరు నెల చివరిలో కొనియాడేవారు. 1969 నుండి సామాన్య కాలంలో చివరి ఆదివారమున కొనియాడా బడటం జరుగుతుంది. ఈ తేదీ మార్పుకు గల కారణం, యేసు క్రీస్తు యొక్క రాజరికం కేవలం ఒక ప్రత్యేక సందర్భం కాదు, మొత్తం ఆరాధనా సంవత్సరం, ముగింపు మరియు నిత్యత్వానికి సంకేతం అని నొక్కి చెప్పడానికి మార్చ బడింది. ఇది ఆగమన కాలం ప్రారంభం కావడానికి సరిగ్గా ముందు వస్తుంది.

క్రీస్తు రాజరికం యొక్క పునాది ప్రధానంగా మూడు అంశాలపై ఆధారపడి ఉంది:

1. ఆయన జన్మము ద్వారా: యేసు క్రీస్తు దేవుని కుమారుడు కాబట్టి, ఆయన సృష్టికర్త మరియు విమోచకుడు. సమస్త సృష్టి ఆయన ద్వారా మరియు ఆయన కొరకు సృష్టించెను (కొలొస్సీ 1:16). ఈ కారణం చేత, సమస్తం ఆయనకు విధేయత చూపాలి.

2. విమోచన ద్వారా: క్రీస్తు తన రక్తాన్ని సిలువపై కార్చి మానవాళిని పాపం నుండి విమోచించారు. కాబట్టి, ఆయన కేవలం రాజు మాత్రమే కాదు, మన రక్షకుడు కూడా!

3. అధికారం ద్వారా: క్రీస్తుకు శక్తి, శాసన అధికారం, న్యాయ నిర్ణయాధికారం మరియు కార్యనిర్వహణ అధికారం ఉన్నాయి.

క్రీస్తు రాజరికం యొక్క స్వభావం ఏమిటంటే,

1. ఆధ్యాత్మికం: క్రీస్తు రాజ్యం ప్రధానంగా ఆధ్యాత్మికమైనది. ఇది “సత్యం మరియు జీవం యొక్క రాజ్యం, పవిత్రత మరియు కృప యొక్క రాజ్యం, న్యాయం, ప్రేమ మరియు శాంతి యొక్క రాజ్యం”. ఈ రాజ్యం మనుషుల హృదయాలపై పాలన చేస్తుంది.

2. సార్వజనీనం: క్రీస్తు యొక్క అధికారం కేవలం కతోలికులకు లేదా క్రైస్తవులకు మాత్రమే పరిమితం కాదు, ప్రపంచంలోని ప్రతి వ్యక్తికి మరియు ప్రతి దేశానికి విస్తరించి ఉంది.

3. లౌకిక రంగంలో: ప్రభుత్వాలు మరియు దేశాల పాలన కూడా క్రీస్తు రాజు ధర్మానికి లోబడి ఉండాలి. మతపరమైన అంశాలలో శ్రీసభకి క్రీస్తు రాజు ప్రతినిధిగా పూర్తి స్వాతంత్ర్యం ఉండాలి.

క్రీస్తు రాజు పండుగ యొక్క ప్రయోజనాలు ఏమిటంటే,

మనుషులు తమ వ్యక్తిగత మరియు కుటుంబ జీవితాలలో క్రీస్తును రాజుగా అంగీకరించాలి. సమాజంలో మర్యాద, న్యాయం, మరియు సహకారం పెరగాలి. ప్రజలు ప్రభుత్వాన్ని తమ రాజును గౌరవించే విధంగానే గౌరవించాలి. యేసు క్రీస్తు రాజుగా ప్రపంచం అంతటా ప్రభుత్వాలు ఆయనను గౌరవించాలని మరియు ఆయన చట్టాలను చట్టాలలో చేర్చడానికి ప్రయత్నించాలని ప్రోత్సహించడం.

ఈ నాటి పఠనాలలో మనకు మూడు ముఖ్యమైన అంశాలు కనిపిస్తున్నాయి: రాజ్యాభిషేకం, సర్వాధిపత్యం, మరియు సింహాసనం.

మొదటి పఠనం దావీదు రాజ్యాభిషేకం గురించి తెలియ జేస్తుంది. దేవునిచే అభిషేకించబడిన దావీదు ద్వారా క్రీస్తు రాజరికానికి పూర్వ సంకేతాన్ని మొదటి పఠనం తెలియ జేస్తుంది.

మొదటి పఠన నేపధ్యం ఏమిటంటే, ఇస్రాయేలీయులకు ఫిలిస్తీయులకు మధ్య జరిగిన యుద్ధంలో సౌలురాజు, అతని కుమారులు మరణించారు (సమూ 31).  సౌలు తరువాత తమను కాపాడగల నాయకుడు దావీదేననిఅతడు దేవుని యొక్క కృపను పొందిన వాడని ఇశ్రాయేలు ప్రజలు గట్టిగా నమ్మారు. అందుకేఇస్రాయేలీయుల తెగల నాయకులందరూ కలిసి, హెబ్రోనున దావీదు యొద్దకు వచ్చి తమకు రాజుగానాయకుడుగాకాపరిగా ఉండమని ప్రాధేయపడ్డారు. దావీదును రాజును చేయడానికి, ఇశ్రాయేలు గోత్రాల పెద్దలు తెలిపిన కారణాలు ఏమిటంటే, (i) దావీదు వారి రక్త సంబంధుడు (సమూ. 5:1). (ii) సౌలు పరిపాలన సమయంలో ఇస్రాయేలు సైన్యనాయకుడు (సమూ 5:2, 1 సమూ 16:13). దావీదు అభిషేకం ఒక ప్రత్యేకమైన బంధాన్ని తెలియజేస్తుంది. దేవుని ప్రజలకు నాయకత్వం వహించడానికి దావీదు దేవునిచే ఎన్నుకోబడ్డాడు. అతను “నీవు నా ప్రజలకు కాపరివి, నాయకుడవు అయ్యెదవు” అని పిలువ బడ్డాడు.

ఇక్కడ రాజు అంటే అధికారం చెలాయించే వ్యక్తి మాత్రమే కాదు, తన ప్రజలను రక్షించి, నడిపించే గొర్రెల కాపరి కూడా. దావీదు రాజ్యం కేవలం ఒక ముందు చూపు మాత్రమే. ఈ భూసంబంధమైన రాజులందరికీ, దేవుని ఎంపికైన దావీదుకు కూడా పరిమితులు ఉన్నాయి. అయితే, మన పండుగ యొక్క అసలు రాజు, పరిమితులు లేని మరియు శాశ్వతమైన రాజు, యేసు క్రీస్తు రాజు.

దావీదు ఇస్రాయేలీయుల రాజగుటకు, మరియు వారిని సుదీర్ఘకాలం పరిపాలించుటకు ముఖ్య కారణం - అతడు దేవునకు ప్రీతికరమైన వాడగుటచేదేవునకు నచ్చినవాడగుటచే (సమూ 13:14, అ.కా. 13:22). దావీదు మొదటినుండి దైవభయము కలవాడు. దైవభీతితో దేవుని సహవాసమును పొందిదేవుడిచ్చిన శక్తితో అతనికి అడ్డు వచ్చిన శత్రువులను ధైర్యంగా ఎదుర్కొని పోరాడాడు. దేవునియొక్క సహవాసమే (దైవభయం) అతనికి విజయాన్ని చేకూర్చింది. దేవునికిదేవుని మాటకు దావీదు చూపిన వినయవిధేయతలే అతన్ని సింహాసనంపై కూర్చుండ బెట్టింది. విధేయతే అతని సుదీర్ఘకాలం రాజుగాదేవుని ప్రతినిధిగాసేవకుడిగా మన్ననను పొందగలిగేలా చేసింది. దేవుడు అతనికి చేదోడు వాదోడుగా ఉండటం వలననే అతడు కీర్తిప్రతిష్టలు సంపాదించ గలిగాడు.

అయితే, ఎప్పుడైతేఅతడు దేవునితో సంప్రదింపులు మానివేశాడో, అప్పుడే అతని పతనం మొదలైంది. ఎప్పుడైతే, స్వతంత్రంగా రాజ్యాన్ని పాలించడం ఆరంభించాడోఅప్పుడే అతని జీవితం మసకబారి పోయింది. ఎప్పుడైతే, ఇశ్రాయేలు రాజ్యంఅధికారం తన సొత్తు అనుకోవడం ఆరంభించాడో అప్పుడే దేవున్నిదేవుని అధికారాన్ని నిర్లక్ష్యం చేయడం ఆరంభించాడు. నిజమైన అధికారం దేవునిది! తనకు ఇష్టంవచ్చినట్లు జీవించడం ఆరంభించాడు. పాపం చేసాడు. తన పతనానికి తన అధోగతికి తానే కారకుడయ్యాడు. తన ఐశ్వర్యంలోఅధికారంలో దేవున్నే నిజమైన రాజుగాకాపరిగాప్రజలకు అండగా గుర్తించలేక పోయాడు. గుర్తించ లేనంతగా అతని హృదయదృష్టి మందగించింది. అందుచేత, దేవున్ని మరచిపోయి తనకు యిష్టము వచ్చినట్లుగా తన ఆలోచనలకు అనుగుణంగా నడచుకున్నాడు. ఆవిధంగా, దేవుని నుండితన నుండి దూరమయ్యాడు.

దానికి భిన్నంగాక్రీస్తురాజు అన్ని సందర్భాలలో దేవున్ని అంటిపెట్టుకొని యున్నాడు. సర్వదా దేవునికి విధేయుడై యున్నాడు (ఫిలిప్పీ 2:5-11). కష్టమైనా, నష్టమైనా దేవుని చిత్తాన్ని ఇష్టపడ్డాడు. అందుకే అతడు “తండ్రీనీ చిత్తమైనచో ఈ పాత్రను నానుండి తొలగింపుము. కాని నా యిష్టము కాదు. నీ చిత్తమే నెరవేరును గాక” (లూకా 22:42) అని ప్రార్ధన చేయ గలిగారు. తండ్రి చూపిన సిలువ మార్గమునకు వెళ్ళగలిగారు. ఈ బాధాకరమైన శ్రమల మార్గంలో తండ్రిచిత్తాన్ని, దైవనిర్ణయాన్ని వ్యతిరేకించలేదు. సైనికులు హింసిస్తున్న, యూదులు గేలిచేస్తున్న, దారిన పోయేవారు వెక్కిరిస్తున్న, తండ్రి దేవుని ప్రణాళికను, చిత్తమును తప్ప మరేమీ ఆయనకు కనబడలేదు. అందుకే, యేసుతోపాటు సిలువ వేయబడిన నేరస్థుడుసిలువమీద దిగంబరంగా కొన ఊపిరితో ఉన్న యేసులో రాజును చూడగలిగాడు (లూకా 23:36-43). 

రాజంటే పరులను అధికారముతో, ఆధిపత్యముతో పాలించడం కాదు. తండ్రి దేవుని మాటను, చిత్తాన్ని పాటించడం’. రాజంటే అధికారం చెలాయించడం కాదు. అందరి ఆదరణతండ్రియొక్క ఆత్మీయతను పొందడం. రాజంటే స్వతంత్రంగా వ్యవహరించడం కాదు, స్వతంత్రంగా తండ్రిచి త్తానికి అప్పగించు కోవడం. రాజంటే సేవలు చేయించు కోవడం కాదు, సేవలు చేయడం అని క్రీస్తురాజు మనకు నేర్పించారు. అందుకే, యేసు తండ్రికి ప్రియమైన వానిగా నిలిచియున్నారు.

క్రీస్తు, రాజుగా, మనకు నిజ స్వాతంత్ర్యమును, స్వేచ్చను ఒసగారు, అదియే పాపక్షమాపణ. అంధకార శక్తులనుండి విడుదల చేసియున్నారు. దేవునిలో భాగస్థులను చేసారు. దేవునితో తిరిగి మనలను తన సిలువ బలిద్వారా సమాధాన పరచారు. తండ్రి దేవుని రాజ్యములో చేర్చారు. క్రీస్తురాజు మహోత్సవ సందర్భంగా, మనందరికీ ప్రభువు ఇచ్చే పిలుపు ఇదే, సంపూర్ణంగాదేవునికి మనల్ని మనం సమర్పించు కోవాలి. దేవుని పాలన, రాజ్యము భూలోకములో రావాలి. అది మనందరి ద్వారా మాత్రమే సాధ్యం అవుతుంది.

రెండవ పఠనం మన దృష్టిని దావీదు నుండి నేరుగా యేసు క్రీస్తుపైకి మళ్లిస్తుంది. ఇది క్రీస్తు యొక్క గొప్ప రాజరికాన్ని, సర్వాధిపత్యాన్ని ఘనంగా ప్రకటిస్తుంది. క్రీస్తు యొక్క సార్వభౌమ అధికారాన్ని మరియు సృష్టిపై ఆయనకున్న ఆధిపత్యాన్ని వివరిస్తుంది. కొలొస్సీ 1:13వ వచనంలో ఇలా చదువుచున్నాం: “ఆయన మనలను అంధకార శక్తి నుండి విడిపించి, తన ప్రియ పుత్రుని సామ్రాజ్యం లోనికి సురక్షితంగా తోడ్కొని వచ్చెను.” క్రీస్తు మన రాజు మాత్రమే కాదు, మన విమోచకులు కూడా. ఆయన “అదృశ్య దేవుని స్వరూపి” మరియు “సమస్త సృష్టికి ఆది సంభూతుడు”. అంటే, క్రీస్తు ద్వారానే సృష్టి జరిగింది, మరియు సమస్తం ఆయన కొరకు మరియు ఆయన ద్వారానే నిలబడుతోంది. ఆయన సంఘమునకు శిరస్సు. ఆయన మన మధ్యవర్తి. ఈ పఠనం, యేసు రాజు అంటే కేవలం భూమికి రాజు మాత్రమే కాదని స్పష్టం చేస్తుందిఆయన సమస్త అదృశ్య మరియు దృశ్య లోకాలకు రాజు. ఆయన రాజరికం ప్రేమ మరియు సృష్టికి సంబంధించినది.

సువిశేష పఠనం మన రాజు యొక్క సింహాసనాన్ని గూచి తెలియ జేస్తుంది ఆ సింహాసనమే, సిలువ. ప్రజలు, పరిపాలకులు మరియు సైనికులు ఆయనను “ఇతడు ఇతరులను రక్షించెను. కాని , ఇతడు దేవుడు ఎన్నుకొనిన క్రీస్తు అయినచో, తనను తాను రక్షించుకొన నిమ్ము” (లూకా 23:35) అని ఎగతాళి చేసారు.  యేసు తన రాజరిక అధికారాన్ని లోకం ఆశించినట్లుగా, దండించడం ద్వారా లేదా సిలువపై నుండి దిగి రావడం ద్వారా చూపలేదు. బదులుగా, ఆయన తన రాజరికాన్ని బలహీనత, బాధ మరియు క్షమాపణ ద్వారా వ్యక్తపరిచారు. ఆయన పక్కనే ఉన్న నేరస్థులలో ఒకడు తన తప్పును ఒప్పుకొని, “యేసూ! నీవు నీ రాజ్యములో ప్రవేశించునప్పుడు నన్ను జ్ఞాపకముంచు కొనుము” (23:42) అని వేడుకున్నాడు. ఈ నేరస్థుని ప్రార్థన, యేసు రాజరికం యొక్క సారాంశాన్ని తెలియ జేస్తుంది. యేసు తన ప్రాణత్యాగం ద్వారా మనలను రక్షించే రాజు. ఆయన యొక్క వాగ్దానం మన ఆశకు ఆధారం, “నేడే నీవు నాతో కూడ పరలోకమున ఉందువు” (23:43).

ఆత్మపరిశీలన చేసుకుందాం! నా జీవితంలో యేసు క్రీస్తు రాజుగా ఉన్నారా? ఆయన మన హృదయం అనే సింహాసనంపై కూర్చుని ఉన్నారా? ఆయన రాజరికం కేవలం దేవాలయ గోడలకే పరిమితమా, లేక మన పనిలో, కుటుంబంలో, మరియు ఇరుగు పొరుగు వారిపై ప్రేమ చూపడంలో వ్యక్తమవుతోందా? దావీదు ఇశ్రాయేలుకు కాపరి అయినట్లుగా, క్రీస్తు మనలను తన రక్తం ద్వారా కొని, మనకు నిత్య జీవానికి మార్గాన్ని చూపిన మహోన్నతమైన కాపరి మరియు రాజు. ఆయన సిలువ, భూమి యొక్క అధికారాన్ని కాకుండా, ప్రేమపూర్వకమైన సేవ యొక్క రాజరికాన్ని ప్రకటిస్తుంది. ఈ రోజు, మనం ఆయనను మన జీవితానికి, లోకానికి ఏకైక రాజుగా ప్రకటించి, ఆయన రాజ్యంలో జీవించడానికి మనల్ని మనం పునరంకితం చేసుకుందాం.

కనుక మనము ఎల్లప్పుడూ పరలోక రాజు ఐన క్రీస్తు రాజును అనుసరిస్తూ, ఆయన వలే మనము సాటివారి యెడల ప్రేమను, కనికరమును, క్షమాగుణమును, సహాయ గుణమును కలిగి, ఆయన అనుసరణలో, ఆయనను పోలి మనమూ జీవించాలి. మన మంచి కార్యములతో ఆ కాపరి మేపు మందలోని గొర్రెలమై జీవించి, ఆయన సింహాసనాసీనుడై ఉన్న పరలోక రాజ్యమున, కుడి ప్రక్కన వుండు లాగున జీవించుదాం.

సాటివారికి సహాయం చేద్దాం. ఆకలిగొనిన వానికి అన్నము పెడదాం. దప్పికగొనిన వారికి దాహము తీర్చుదాం. గృహములు లేనివారికి చేయూతనిద్దాం. వారికి గృహములను ఏర్పాటు చేయడానికి సహాయం చేద్దాం. వస్త్రములు లేనివారికి వస్త్రములను సహాయం చేద్దాం. రోగులను పరామర్శించుదాం. అన్యాయముగా శిక్షకు పాత్రులైన చెరసాలలో ఉన్న వారిని దర్శించి, వారికి ధైర్యాన్ని చెప్పి, దేవుని యందు విశ్వాసముతో, జీవించేటట్లు మన వంతు మనము దేవుని కొరకు ఎన్నో కార్యములు చేద్దాం.

ఇహలోకమున చేయు సహాయములు, పరలోకమున లెక్కించ బడుతాయని, విశ్వసించి, ఈ లోక జీవిత వైభోగము, పొగడ్తలు కాకుండా, ఆ దైవ రాజ్యములో చోటును సంపాదించు కోవడానికి, మన కొరకు సిద్ధపరచిన పరలోక రాజ్య, నిత్యజీవమున భాగస్తుల మవుదాం. దేవుడు దీనుల పట్ల ఎంతో దయ చూపించారు. వారి కొరకే నేను ఈ భూమికి వచ్చాను అని సాక్ష్యం ఇచ్చారు. నీవు నేను కూడా దీనులను అసహ్యించుకోకుండా, రోగులను ఛీధరించు కోకుండా, పేదలను హీనపరచకుండా, తప్పు చేసిన వారిని ఇంకా బాధించకుండా, వస్త్రములు లేక ఇబ్బందులు పడే వారిని గూర్చి చులకనగా మాట్లాడకుండా,  సహాయం చేద్దాం. క్రీస్తు ప్రభువుని మనస్తత్వమును, ఆయన స్వభావమును, మనం కూడా కలిగి ఉందాం. పరలోక రాజు, క్రీస్తు రాజునకు ఇష్టమైన కార్యములు చేసి, ఆయనకిష్టమైన బిడ్డలముగా ఆయన సింహాసనము ప్రక్కన కుడివైపున, ఆశీర్వదింపబడిన, దీవింపబడిన, జనాంగములో, నీవు/ నేను/ మనమందరమూ  ఉండడానికి నిత్య ప్రయత్నం చేస్తూనే ఆ విధంగా జీవించుదాం. దేనిని గూర్చియూ బాధగా, కష్టముగా, భయముగా, చేతగాని వారముగా బాధపడవద్దు. భయపడవద్దు. మనలో ప్రేమను, సమైక్యతను, క్షమాపణను, తగ్గింపు గుణమును, సహాయక గుణమును, ఓదార్పు మనస్తత్వమును, కలిగి నీతిమంతులు ఉండే నిత్యజీవములో ప్రవేశించుదాం. ఆ విధముగా జీవించడానికి మనము కొన్ని త్యాగములు చేసుకోవలసి ఉంటుంది.  కొన్ని బాధలు పడవలసి ఉంటుంది. ఐనప్పటికీ, మన పరలోక రాజైన, క్రీస్తు రాజునూ, మన హృదయాలలో రారాజుగా ప్రతిష్టించుకొని, ఆయన అనుసరణలో ఆయన వాగ్దానములను, ఆయన ఆజ్ఞలను, మననం చేసుకుంటూ  తుది తీర్పులో నిత్యానందమును పొందుకుందాం. క్రీస్తు రాజు రాజ్యమున జీవించడానికి కావలసిన దైవసహాయమును, ఆ దేవుని నడిపింపును, ఆ దేవున్ని అనుసరించే మనస్తత్వమును, మంచి కాపరియైన క్రీస్తు ప్రభుని మందలోని గొర్రెలమై, ఆయన ప్రజలమై, ఆయన అనుసరణలో ఆయన కనుసన్నలలో, ఆయన జీవించమనిన విధముగా జీవించునట్లుగా, మనల్ని నడిపించమని ఆ దేవునికి ప్రార్థించుకుందాం. ఆమెన్.

కానుక మాత మహోత్సవం: “మనమే దేవునికి జీవముగల కానుకలం” Nov 21


కానుక మాత మహోత్సవం: “మనమే దేవునికి జీవముగల కానుకలం”
జెకర్యా 2:10-13; మత్త 12:46-50

పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున, ఆమేన్.

క్రీస్తునాధుని యందు మిక్కిలి ప్రియ సహోదరీ సహోదరులారా! మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున మరియు మన పరలోకపు తల్లియైన కానుక మాత పేరిట శుభాకాంక్షలు.

మూడు సంవత్సరాల ప్రాయంలో, దేవాలయంలో కానుకగా సమర్పించబడిన మరియమ్మను “కానుక మాత”గా లేదా మరియమాత సమర్పణ పండుగగా కొనియాడుచున్నాము. పశ్చిమ దేశ క్రైస్తవులు 43వ సంవత్సరం నుండే ఈ పండుగను జరుపుకుంటున్నట్లు తెలుస్తుంది. తూర్పు క్రైస్తవ దేశాలలో 6వ శతాబ్దములో ప్రారంభమైంది.

ఈ రోజు మనం కూడా ఎంతో భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో ‘కానుక మాత’ పండుగను కొనియాడు తున్నాము. ‘కానుక’ అనే మాటకు ఎంతో లోతైన అర్థం ఉంది. కానుక అంటే ‘బహుమానం’ లేదా ‘సమర్పణ’ అని అర్ధం. ఈ పండుగ కేవలం చారిత్రక సంఘటనను గుర్తుచేసుకోవడమే కాక, దేవునికి మన జీవితాలను పూర్తిగా అర్పించుకోవాలని పిలుపునిస్తుంది. నేడు ప్రత్యేకంగా, మరియతల్లి సంపూర్ణ దైవాంకిత జీవితాన్ని, వారి పరిశుద్ధ జీవితం గూర్చి ధ్యానిస్తూ ఉంటాం. మరియమ్మ తన జీవితాన్ని దేవునికి అర్పించడం ద్వారా, ఆమె దేవుని అద్భుత ప్రణాళికలో కీలక పాత్ర పోషించింది. ఆమె సంపూర్ణ సమర్పణ మనందరికీ మొదటి ఆదర్శం.

ఈ పండుగ నాడు, మరియతల్లి జీవితం నుండి మనం మూడు ముఖ్యమైన పాఠాలను నేర్చుకుందాం.

1. మరియతల్లి - దేవుడు మనకిచ్చిన అమూల్యమైన కానుక

ప్రియ మిత్రులారా, దేవుడు మానవాళిని ఎంతగానో ప్రేమించాడు. ఆ అంతులేని అనంతమైన ప్రేమకు ప్రత్యక్ష నిదర్శనమే మన మరియ తల్లి. ఆమె సామాన్యమైన స్త్రీ కాదు. సర్వశక్తిమంతుడైన దేవుని కుమారుని తన గర్భంలో మోసిన పవిత్ర దేవాలయం. జన్మపాపము సోకని నిష్కళంక మాత.

ఆమె నామములోనే గొప్పతనం ఉంది. ‘మరియ’ అనగా ‘ప్రియమైన, ఉన్నతమైన, ఘనతవహించిన, స్తుతీయమైన’ అని అర్ధం. ఆ పేరుకు తగ్గట్టుగానే, ఆమె దేవునికి అత్యంత ప్రియమైన వరపుత్రికగా, సకల జనులచేత స్తుతింపబడే తల్లిగా నిలిచింది. జన్మపాపము సోకని నిష్కళంక మాత.

మరియమ్మఆమె తల్లిదండ్రులు, జ్వాకీము అనగా ‘దేవుడు సిద్ధపరుస్తాడు’ అని అర్ధం మరియు అన్నమ్మ అనగా ‘దైవకృప’ అని అర్ధం. జ్వాకీము, అన్నమ్మ గార్లు, లేకలేక పుట్టిన తమ బిడ్డను చూసి మురిసిపోవడమే కాక, తమ దగ్గరే ఉంచుకోకుండా, వారు దేవునికి వాగ్దానం చేసిన విధంగానే, దేవాలయానికి ‘కానుకగా’సమర్పించారు. అదే సంప్రదాయాన్ని మనం ఈనాడు గుర్తుచేసుకుంటున్నాం.

ప్రవక్తయైన జెకర్యా చెప్పిన మాటలను మనం ఈ సందర్భంగా గుర్తుచేసుకుంటే, “సీయోను కుమార్తె, సంతోషంతో కేకలు పెట్టు!” (జెకర్యా 2:10). మరియమ్మ దేవాలయంలోకి ప్రవేశించడం ఆ సీయోను కుమార్తె రాకడను ప్రతిధ్వనించింది. ఆమె రాకడ దేవుని మహిమను, ప్రణాళికను సూచించింది:

ఆమె రాకడతో, దేవుడు తన పరలోక నివాసము నుండి కదలివచ్చు సమయం ఆసన్నమైందని సంకేతం ఇచ్చాడు. దేవుడు ఒక నూతనమైన, ఊహించని రీతిలో మానవాళి మధ్య తనను తాను ప్రకటించుకోవడానికి సిద్ధమయ్యాడు.

దైవ కుమారుడు, మన మానవ స్వభావాన్ని మరియమ్మ గర్భంలో ధరించడానికి సిద్ధమయ్యాడు. వాక్యము శరీరధారియై, మన మధ్య నివసించుటకు ఆమె ఒక మార్గాన్ని సుగమం చేసింది.

దేవుని దయతో కూడిన ఈ ప్రణాళికలో, మరియమ్మ సాధారణ స్త్రీగా కాకుండా, ప్రత్యేకింపబడిన కుమార్తెగా దేవాలయంలో అడుగుపెట్టింది. ఆ పాపరహితమైన, పరిశుద్ధమైన మరియమ్మ, తనంతట తానే ఒక దేవాలయంగా మారింది. ఆమె పాపము లేని నివాస స్థలమైంది. సైన్యముల కర్తయైన ప్రభువు కొరకు సిద్ధం చేయబడిన ఒక జీవముగల గుడారం అయింది. ఆ పవిత్ర దేవాలయం నుండే క్రీస్తు ఈ లోకంలోకి అడుగుపెట్టారు.

మరియమ్మ తల్లిదండ్రుల విశ్వాసాన్ని, త్యాగాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు వారి ద్వారా లోక రక్షణ కొరకు ఒక కృపను సిద్ధపరిచాడు. ఆవిధంగానే వారు మరియమ్మను దేవునికి కానుకగా సమర్పించారు. వీరి విశ్వాసం గొప్పది. వారు దేవునికి చేసిన వాగ్దానం మేరకు, మూడు సంవత్సరాల ప్రాయంలోనే బాల మరియమ్మను దేవాలయానికి కానుకగా సమర్పించారు.

ప్రియ సహోదరులారా, ఆనాడు వారు చేసిన ఆ త్యాగం, వారు సమర్పించిన ఆ కానుకఈనాడు మనందరికీ తల్లిగా మారింది. దేవుడు ఆమెను మనకు తల్లిగా అనుగ్రహించారు. అది మనం పొందుకున్న గొప్ప వరప్రసాదం. కాబట్టి, ఆ తల్లిని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెబుదాం.

2. సంపూర్ణ సమర్పణే నిజమైన కానుక

ప్రియ దేవుని బిడ్డలారా!, మన తల్లి మరియమ్మ జీవితాన్ని ఒక్కసారి తరచి చూస్తే, ఆమె జీవితమంతా ఒక నిరంతర ప్రార్థనలా, దేవునికి అర్పించిన ధూపంలా కనిపిస్తుంది. చిన్నవయసులోనే, యెరూషలేము దేవాలయములో ‘కానుక’గా సమర్పింప బడిన మరియమ్మ, దైవాంకితగా ఎదుగుతూ, జీవించింది. అక్కడ దేవుని సేవలో, పరిచర్యలో తరించింది. ఒకవైపు, లేఖనాలను చదువుతూ, విద్యను, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సంపాదించుకుంది. భక్తి, ప్రార్ధన, మర్యాద మూర్తీభవించిన దైవనివాసిగా జీవించింది. మరొకవైపు భక్తి, ప్రార్థన, వినయం అనే ఆభరణాలను ధరించి, సాక్షాత్తు దైవనివాసిగా జీవించింది. ఈవిధంగా, మరియతల్లి అన్ని విధాల పూర్ణ ఆశీర్వాదితులు. దైవ ప్రేమలోనూ, సాటివారికి సేవ చేయడంలోనూ ఆమె ఒక పరిపూర్ణమైన "కానుక"గా మారిపోయిన కారణజన్మురాలు.

అయితే, ఆమె సమర్పణ కేవలం బాల్యానికే పరిమితం కాలేదు. మరియమ్మ కేవలం దేవాలయంలో సమర్పించబడటమే కాదు, ఆతరువాత కూడా, తన జీవితాంతం దేవుని చిత్తానికి తలవంచింది. ముఖ్యంగా దైవదూత గాబ్రియేలు ఆమెకు దేవుని సందేశాన్ని వినిపించినప్పుడు, ఆమె పలికిన మాటలు చరిత్రనే మార్చివేశాయి: “ఇదిగో ప్రభువు దాసురాలిని, నీ మాట చొప్పున నాకు జరుగును గాక” (లూకా 1:38) అని పలికినప్పుడు, ఆమె తన చిత్తాన్ని, తన జీవితాన్ని, తన భవిష్యత్తును దేవునికి ‘కానుకగా’ అర్పించింది. ఈ ఒక్క మాటతో ఆమె తన సొంత ఇష్టాన్ని, తన కలలను, తన భవిష్యత్తును, చివరకు తన ప్రాణాన్ని కూడా దేవుని పాదాల చెంత కానుకగాపెట్టింది. దేవుని ప్రణాళిక కోసం తనను తాను సంపూర్ణంగా అర్పించుకుంది.

ప్రియ స్నేహితులారా, మనం గుడిలో వేసే డబ్బులు లేదా వస్తువులు మాత్రమే కానుకలు కాదు. దేవుడు కోరుకునేది మన హృదయాన్ని. దేవుడు కోరుకునేది మన జేబులో ఉన్నది కాదు, మన గుండెలో ఉన్నది. ఆయన ఆశించేది మన హృదయాన్ని! మరియమ్మ వలె, ప్రభూ! నా జీవితం నీది, నీ ఇష్టప్రకారం నన్ను వినియోగించుకో” అని చెప్పగలగడమే నిజమైన భక్తి. దేవుని చిత్తానికి "సరే" అని చెప్పడమే మనం ఆయనకు ఇవ్వగలిగిన అత్యుత్తమమైన కానుక. అపోస్తలుడైన పౌలు చెప్పినట్లుగా, "పరిశుద్ధమును, దేవునికి ప్రీతికరమును అయిన సజీవ యాగాముగా మీ శరీరములను దేవునకు సమర్పింపు కొనుడు." (రోమా 12:1). ఇదే మన జీవితంలో మరియమ్మ వలె చూపవలసిన సమర్పణ. “దేవుని వాక్కును ఆలకించి దానిని పాటించువారు మరింత ధన్యులు” (లూకా 11:28). ఇదే మన జీవితంలో మరియమ్మ వలె చూపవలసిన సమర్పణ.

3. మనమే ఒక సజీవ కానుక కావాలి

ఈ రోజు మనం ఎంతో ఆనందంగా, కానుక మాత ఉత్సవాన్ని కొనియాడుచున్నాం. మనం ఆమెకు ఏమి ఇవ్వగలము? పూలు వాడిపోతాయి, కొవ్వొత్తులు కరిగిపోతాయి, డబ్బు ఖర్చయిపోతుంది. కానీ, దేవునికి ఇష్టమైన కానుక ఒకటి ఉంది. అదే ‘పవిత్రమైన జీవితం’. ఈ రోజు కానుక మాత మనల్ని కోరుతున్నది ఒక్కటే, ‘నా బిడ్డలారా, మీ కుటుంబాల్లోని పగలు, ప్రతీకారాలు, ద్వేషాలను విడిచిపెట్టి, క్షమాగుణాన్ని, ప్రేమను కానుకగా ఇవ్వండి. మీలోని గర్వాన్ని, అహంకారాన్ని విడిచి, సాత్ మనిషిలో దేవున్ని చూస్తూ తగ్గింపు స్వభావాన్ని కానుకగా ఇవ్వండి. పాపాన్ని విడిచి, కన్నీటితో కూడిన పశ్చాత్తాపాన్ని కానుకగా ఇవ్వండి’. ప్రియ మిత్రులారా, వాడిపోయే పూలను కాదు, వాడిపోని మన మంచి మనసును తల్లికి కానుకగా ఇద్దాం. కరిగిపోయే కొవ్వొత్తిని కాదు, ఇతరుల కోసం కరిగే సేవా గుణాన్ని కానుకగా ఇద్దాం. అప్పుడే మనం జరుపుకునే ఈ పండుగకు నిజమైన అర్థం, పరమార్థం చేకూరుతుంది. మనమే దేవునికి నచ్చే ఒక సజీవ కానుకగా మారుదాం.

ప్రియ సహోదరీ సహోదరులారా, కానా విందులో ద్రాక్షారసం అయిపోయినప్పుడు, ఆ కొరతను గమనించిన తల్లి మరియమ్మే. ఆ కొరతను, ఆ అవమానాన్ని ఎవరూ అడగకముందే గమనించిన తల్లి మరియమ్మే. తన కుమారుడైన యేసు దగ్గరకు వెళ్లి, ఆ కొరతను వివరించింది. అప్పుడు యేసు ప్రభువు మొదటి అద్భుతాన్ని చేశారు. నేడు మన జీవితంలో ఎన్నో కొరతలు, కష్టాలు ఉన్నాయి. మీ జీవితంలో, మీ కుటుంబంలో ఏ కొరత ఉందో మరియ తల్లికి తెలుసు. సంతోషం అనే ద్రాక్షారసం అయిపోయిందా? ఆరోగ్యం క్షీణించిందా? ఆర్థిక ఇబ్బందులా?

భయపడకండి. మన సమస్య ఎంత పెద్దదైనా, మన కష్టం ఎంత లోతైనదైనా భయపడవద్దు! కానుక మాత పాదాల చెంత మన కష్టాలను పెడదాం! మరియమ్మ మన ప్రార్థనలను స్వీకరించి, తన కుమారుడైన యేసుక్రీస్తుకు వాటిని ‘కానుకగా’ సమర్పించి, మనకు అద్భుతాలను దయచేస్తుంది. మరియమ్మ ఒక అద్భుతమైన మధ్యవర్తి. ఆమె మన ప్రార్థనలను, కన్నీటిని ప్రేమతో స్వీకరించి, తన కుమారుడైన యేసుక్రీస్తుకు వాటిని కానుకగా సమర్పిస్తుంది. అప్పుడు యేసు ప్రభువు ఖచ్చితంగా మన జీవితంలో అద్భుతాలను దయచేస్తారు.

మరియతల్లి తన జీవితాన్ని దేవునికి సంపూర్ణ కానుకగా ఎలా అర్పించిందో, ఆ ఆదర్శాన్ని మనం కూడా అనుసరిద్దాం. ఈ పండుగ రోజు నుండి మన జీవితాలను దేవునికి ప్రీతికరమైన, పవిత్రమైన కానుకలుగా మార్చుకుందాం. ఈరోజు, మరియ మాత సమర్పణ పండుగ సందర్భంగా, మన జీవితాల్లోని ప్రతి భాగాన్నిమన మనసును, మన సమయాన్ని, మన తలంపులను, మన కష్టాలనుదేవునికి సంపూర్ణ కానుకగా అర్పించుకుందాం. మరియమ్మ మధ్యవర్తిత్వం ద్వారా, మన సమర్పణ దేవునికి ప్రీతికరంగా మారి, మనమందరం దైవకృపతో నిండిపోవుదుము గాక!

ప్రార్థన చేసుకుందాం:

ఓ కానుక మాతా! వరప్రసాద నిలయమా! నీవు దేవునికి సంపూర్ణముగా సమర్పించుకున్న విధముగా, మేము కూడా మా జీవితాలను దేవునికి అర్పించుకునేలా మాకు సహాయం చేయండి. మా కుటుంబాలను, మా బిడ్డలను, మా కష్టసుఖాలను, మా ఆశలను, భయాలను అన్నింటినీ, నీ పాదాల చెంత కానుకగా పెడుతున్నాము. మాకు ధైర్యాన్ని, దీవెనను దయచేయండి. యేసు ప్రభువు బాటలో నడిచే కృపను మాకు అనుగ్రహించమని వేడుకొనుచున్నాము తల్లీ. ఆమేన్.

వేదవ్యాపక ఆదివారము 2025

 వేదవ్యాపక ఆదివారము 2025


పునీత మార్కుగారు వ్రాసిన సువార్త 16:15-16, యేసు తన శిష్యులతో ఇట్లనెను, “మీరు ప్రపంచమందంతట తిరిగి, సకలజాతి జనులకు సువార్తను బోధింపుడు. విశ్వసించి జ్ఞానస్నానము పొందువాడు రక్షింపబడును. విశ్వసింపనివానికి దండన విధింపబడును.

ప్రియ సహోదరీ సహోదరులారా! శ్రీసభ అక్టోబరు 19న ప్రపంచ వేదవ్యాపక ఆదివారమును లేదా మిషన్ సండేను జరుపుకుంటుంది. వేద-వ్యాపకం’ అంటే "జ్ఞానాన్ని/వేదాన్ని ముఖ్యంగా దైవజ్ఞానాన్ని సువార్తను విశ్వమంతట వ్యాపింప జేయడం’ అని అర్థం. ఇది ఒకరోజు చేసే కార్యం కాదు. మన జీవిత లక్ష్యం!

సువార్తా వ్యాప్తి, ప్రతి ఒక్కరి బాధ్యత! సువార్త వ్యాప్తి అనేది కేవలం సేవకుల బాధ్యత అనగా గురువుల, ఉపదేశకుల బాధ్యత మాత్రమే కాదు. సువార్త వ్యాప్తి ప్రతి విశ్వాసి యొక్క బాధ్యత. పేతురు, యోహానులు పలికిన మాటలను గుర్తుచేసుకుందాం, అ.కా. 4:20 – “మేము మా కన్నులార చూచిన దానిని గూర్చి, చెవులార విన్న దానిని గూర్చి మాట్లాడకుండ ఉండలేము”. ఎట్టి పరిస్థితులలోనైన సువార్తను ప్రకటించాలనే వారి తపనను మనం చూడవచ్చు! కనుక, సువార్తను వ్యాపింప జేయడంలో మనలో ప్రతి ఒక్కరమూ భాగస్వాములం కావాలి. ఈ పరిశుద్ధ కార్యంలో పాల్గొనడంద్వారా, సహాయ సహకారాలు అందించడం ద్వారా, దేవుడు మనకు అప్పగించిన బాధ్యతను నెరవేర్చినవారం అవుతాం. దేవునియందు విశ్వాసంతో, మనం క్రీస్తుకు సాక్షులుగా జీవించినవారం అవుతాం. క్రీస్తుప్రభువును విశ్వసించి, జ్ఞానస్నానము తీసుకొని, సత్ప్రసాదమును స్వీకరించి, క్రీస్తు సాక్షులుగా జీవించేలా ప్రార్థిస్తూ, మన వంతు కృషి చేద్దాం. ప్రతి ఒక్కరమూ వ్యక్తిగతంగా సువార్తా వ్యాప్తిలో పాలుపంచు కోవాలి. దేవుని ప్రేమ, క్షమాపణ, దయ కలిగి జీవించాలి. ఎందుకంటే, సువార్త వ్యాప్తి అనేది దయ, సేవ మరియు పునరుద్ధరణ కార్యం.

సువార్త వ్యాప్తి మన విశ్వాసానికి కొత్త ఉత్తేజాన్నిస్తుంది అని పునీత రెండవ జాన్ పాల్ గారు చెప్పియున్నారు. సువార్త ప్రకటించడం ద్వారా మన సొంత విశ్వాసం బలపడుతుంది. కనుక, ముందుగా, దేవుని సందేశాన్ని విశ్వాసంతో స్వీకరిద్దాం. పరమ తండ్రి దేవుడు తన ఏకైక కుమారుడైన క్రీస్తును మనకోసం ఈ లోకానికి పంపి, మనవలె సామాన్య మానవునిగా జీవింపజేసి, మన పాపముల కొరకై ఆయన ప్రాణాన్ని సిలువపై బలియాగముగా అర్పించారు. ఆయన మన యెడల చూపిన అపారమైన ప్రేమ, దయ, క్షమాపణ, కనికరాన్ని మనం తప్పకుండా గుర్తించాలి. క్రీస్తు ప్రభువు ఇచ్చిన “మీరు ప్రపంచమందంతటా తిరిగి సకల జాతిజనులకు సువార్తను బోధింపుడు” అన్న ఈ సందేశాన్ని, మనమందరం విశ్వాసంతో స్వీకరించాలి. ఈ బాధ్యతతో సువార్తా వ్యాప్తి పనిలో ఆనందంగా పనిచేస్తూ, నిజ దేవుడు ఎవరో తెలియని వారందరికీ సువార్తను ప్రకటిద్దాం. సువార్తను ఎప్పుడూ సంతోషంతో మరియు ఆనందంతో ప్రకటించుదాం.

సేవకుల పట్ల, సువార్త బోధకుల పట్ల, గౌరవం మరియు సహకారం చూపాలి. సువార్తా పరిచర్య అనేది దేవుని ఇష్టానుసారంగా జరుగుతుంది. దేవుడు నియమించిన సువార్తికులు, సేవకులు, గురువులు, ఉపదేశకులు, మఠవాసులు మొదలైనవారు అభిషిక్తులైన వ్యక్తులు. వీరు సువార్త పరిచర్యకై తమను తాము అర్పించుకున్నారు. వీరు తరచుగా కష్టాలు, తిరస్కారములు, అపనిందలు ఎదుర్కొంటారు, కొందరు హతసాక్షులవుతున్నారు, హింసింపబడుతున్నారు. విశ్వాసం కొరకు చనిపోవడం కొందరికి బహుమానం, విశ్వాసంతో జీవించడం అందరికీ పిలుపు” అని పునీత  రెండవ జాన్ పాల్ గారు అన్నారు.

“సువార్తికులు, గురువులు, మఠవాసులు తమ కుటుంబాన్ని, సుఖాలను వదులుకుని, తమ జీవితాలను ప్రభువు చేతుల్లో ఆయుధాలుగా అర్పించుకున్నారు. వారు మనకు కేవలం బోధకులు మాత్రమే కాదు, విశ్వాస వీరులు.” అందుకే మనం ఈ సేవకుల పట్ల గౌరవభావం కలిగి ఉండాలి. వారిని ఆదరించి ప్రేమించాలి. సువార్తా పరిచర్య సాగించడానికి అవసరమైన సహాయ సహకారాలను మన వంతుగా వారికి అందించాలి. మన వంతుగా వారికి పరిస్థితులకు అనుగుణంగా, అవసరాన్ని బట్టి, ఆర్థిక సహాయము అందించడం ధన్యతగా భావించాలి. వారి ప్రార్థనల ద్వారా మనం ఆశీర్వాదాలు పొందగలము, స్వస్థతను పొందగలము. అయితే, నిజమైన బోధను, సువార్త పరిచర్యను, దేవుని నడిపింపులో ఉన్న బోధకులను, పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా మనం గ్రహించగలగాలి.

సువార్తా వ్యాప్తి అంటే చాలా ఖర్చుతో కూడిన పని కాబట్టి, మన గుప్పెళ్ళను విప్పి, సహాయం చేసే హృదయాన్ని కలిగి ఉండాలి. అటువంటి వారికి దేవుని ఆశీర్వాదాలు తప్పక అందుతాయి. ప్రపంచ వేదవ్యాపక ఆదివారం రోజున తల్లి శ్రీసభ ద్వారా మిషనరీలకు, అనగా దూర ప్రాంతాలలో పనిచేస్తున్న క్రీస్తు సువార్త సేవకులకు ఆర్థిక సహాయం అందించడానికి పిలుపు నిస్తుంది. ఈ రోజు మనం ఇచ్చే ప్రతి చిన్న విరాళం కూడా, దేవుని రాజ్యాన్ని విస్తరించడంలో ఎంతగానో సహాయపడుతుందని గుర్తుంచుకుందాం!

సువార్తా పరిచర్య అనేది దేవుని ఇష్టప్రకారముగా జరుగుతుంది. సువార్త పరి చర్య చేసేవారిని, దేవుడు నియమించిన వ్యక్తులుగా మనం భావించి, గౌరవించి, వారిని ఆదరించి, ప్రేమించి, సువార్తా పరిచర్య జరపడానికి మన వంతు, సువార్తా వ్యాప్తికై, కావలసిన సహాయమును, సేవలను అందించగలగాలి. స్వయముగా, దేవుని పరలోక రాజ్య పరిచర్యలో, సకల మానవాళీ, నిజ దేవున్ని తెలుసుకొని, పరలోక రాజ్యమున ప్రవేశము పొందుకొనుటకై, పని చేయు సేవకుల యెడల, మనము గౌరవభావమును కలిగి ఉండాలి. ప్రతి వ్యక్తి సహాయ సహకారములను, సేవలో అభిశక్తులకు అందించాలి. ఆ విధముగా దేవుని పరిచర్య చేసే వారికి, దేవుని వాక్కును బోధించే వారికి, భోజనమును పెట్టుట ధన్యతగా భావించాలి. దేవుని ఆజ్ఞచే అధికారం ఇచ్చిన అభిషిక్తులైన సేవకులను, మన గృహములకు ఆహ్వానించి, వారు ఒసగు శాంతి సమాధానములను, దేవుని ఆత్మచే, వారు ప్రార్థించే ప్రార్థన ద్వారా, మనము, ఆశీర్వాదములు పొందుకోవాలి.

దేవుని సేవకులు మన బాధలను ఆలకించి, వారు చేయు ప్రార్థన ద్వారా, మనకు స్వస్థతలను దయచేయగలరు. మన వద్దకు, అనగా మన గ్రామమున ఉన్న దేవాలయమునకు వచ్చి, దేవుని సువార్త బోధకులు పరిచర్య చేస్తున్నారంటే, దేవుని రాజ్య విస్తరణకు, దేవుని ప్రణాళికను నెరవేర్చుటకు, దేవుని కార్యము ఉంది. దేవుడు మన గ్రామమునకు, మన యొద్దకు పంపిన ఆయన శిష్యులను మనము, గౌరవించి, ఆదరించి, ప్రేమించి, వారి బోధనలను ఆలకించి, దేవుని రాజ్యమున మనము ప్రవేశించడానికి, దేవుని వాక్కును మనము అనుసరించి, దేవుని సాక్షులమై దేవుని యందు విశ్వాసముతో జీవించగలగాలి.

సువార్తా పరిచర్య రక్షణ మరియు నిత్య జీవంనకు నడిపిస్తుంది. సువార్తా పరిచర్య లేకపోతే, నిజ దేవుడు ఎవరో, సత్యం ఏమిటో సర్వమానవాళికి తెలియదు. అందుకే సువార్తికులు చాలా ప్రధానం. దేవుని యందు విశ్వాసము కలిగించి, రక్షణను ఇచ్చేదే సువార్త వ్యాప్తి. మన జీవితం ఈ లోకంతో మాత్రమే ముగిసిపోదు. మన మరణానంతరం దేవుని రాజ్యమైన పరలోక రాజ్యంలో నిత్యజీవం ఉంటుంది. ఈ సత్యాన్ని మనం చాటాలి. క్రీస్తు ప్రభువు మొదటిసారిగా పదనొకండుగురు శిష్యులను ప్రపంచమంతటా తిరిగి సకల జాతిజనులకు సువార్తను బోధింపుడు అని, తన శిష్యులను సువార్తికులుగా పంపించడానికి ప్రధాన కారణం, సృష్టిలో మానవులలో, ఏ ఒక్కరూ నశించి పోకుండా, నిజ దేవున్ని గూర్చి తెలియజేయటానికి, వారిని లోకములోనికి పంపించారు.

ప్రియ సహోదరీ సహోదరులారా! సువార్త వ్యాప్తి అంటే కేవలం సేవకులకు సహాయం చేయడం మాత్రమే కాదు, మనం రోజువారీ జీవితంలో ఎలా పాలుపంచుకోవచ్చో స్పష్టంగా తెలియజేయడం ముఖ్యం:

వ్యక్తిగత సాక్ష్యం: సువార్తను మన మాటల ద్వారానే కాదు, మన జీవన విధానం ద్వారా కూడా చాటాలి. క్రీస్తు మనలో జీవిస్తున్నారని మన ప్రవర్తన, ప్రేమ, నిజాయితీ ద్వారా ఇతరులు గుర్తించాలి. వ్యక్తిగత సాక్ష్యానికి గొప్ప ఉదాహరణ సమరయ స్త్రీ! కేవలం ఒక్క సంభాషణ ద్వారా తన గ్రామం మొత్తానికి క్రీస్తును పరిచయం చేసింది. ఇది!

కేవలం బోధించడం మాత్రమే కాదు, క్రీస్తు ప్రేమను కార్యాల ద్వారా చూపడం. పేదలకు, రోగులకు, ఒంటరివారికి సేవ చేయడం ద్వారా సువార్తను ఆచరించడం. “మీ మంచి క్రియలను చూసి, పరలోకంలో ఉన్న మీ తండ్రిని మహిమపరచాలి” అని మత్తయి 5:16లో చదువుచున్నాం. కనుక, మాటల కంటే ముందు మన క్రియల ద్వారా క్రీస్తును ప్రకటించుదాం. సువార్త వ్యాప్తి అంటే ఎప్పుడూ పెద్ద ప్రసంగాలు ఇవ్వడం కాదు. అది చిన్న చిన్న క్రియల ద్వారా కూడా సువార్త వ్యాప్తి చేయవచ్చు! మన చుట్టూ ఉన్న వారి దృష్టిలో, నిత్యం మన క్రియల ద్వారా క్రీస్తు ప్రేమను ప్రతిబింబించాలి. ఉదాహరణకు, మీరు పనిచేసే ఆఫీసులో, బస్సులో లేదా మీ పొరుగువారితో - మీ నిజాయితీ, ఓర్పు, మరియు క్షమించే గుణం ఇతరులను కదిలించే విధంగా ఉండాలి. క్రియల ద్వారా క్రీస్తు ప్రేమను చూపించవచ్చని, సువార్త వ్యాప్తి చేయ వచ్చని పునీత మదర్ థెరిస్సా గారి జీవితం మనందరికీ చక్కటి ఉదాహరణ మరియు ఆదర్శం! పునీత పౌలుగారి సువార్తా జీవితం కూడా మనదరికి గొప్ప స్ఫూర్తి, ఆదర్శం. సువార్త వ్యాప్తి కోసం ఆయన చూపిన ధైర్యం, సమర్పణ మరియు సహనం అసాధారణం. అన్యజనులకు సువార్తను ప్రకటించాడు. సువార్తను ప్రకటించే క్రమంలో ఎన్నో దుర్భరమైన కష్టాలను అనుభవించాడు. వీటన్నింటిని, పౌలుగారు ధైర్యంగా, ఆనందంగా భరించారు.

వెళ్లండి, లోకానికి అగ్నిని రాజేయండి” అని పునీత ఇగ్నేషియస్ ఆఫ్ లోయోలా గారు అన్నారు. కనుక, మన సాక్ష్యం ఉత్సాహంతో ఈ లోకంలో మార్పు తీసుకురావాలనే మన పిలుపును గ్రహించాలి. అయితే, మనలో కొందరు దూర ప్రాంతాలకు వెళ్లలేకపోవచ్చు. ఈ రోజు నేను ఎక్కడ ఉన్నాను? నా కుటుంబాన్ని, నా ఆఫీసును, నా ఇరుగుపొరుగువారిని నా 'ప్రపంచంగా' నేను భావిస్తున్నానా? నా ప్రస్తుత స్థలంలో నేను క్రీస్తు ప్రేమను ఎలా ప్రకటించగలను? అని ఆత్మపరిశీలన చేసుకుందాం!

ప్రార్థన: మన ఇంటిని, పని చేసే స్థలాన్ని, స్నేహితుల సమూహాన్ని సువార్త వ్యాప్తి కోసం ప్రార్థనా కేంద్రాలుగా మారుద్దాం. మిషన్ లేదా ప్రేషితం అంటే మన చుట్టూనే, వేరే దేశాలకు వెళ్లడం మాత్రమే మిషన్ కాదు, మన కుటుంబంలో, మన పని ప్రదేశంలో, మన సమాజంలో సువార్తను జీవించడం. మనం ఎక్కడ ఉన్నా, అక్కడే క్రీస్తును ప్రతిబింబించాలి. మనం అలసిపోకుండా ప్రార్థన చేయాలి, ఎందుకంటే మానవజాతి రక్షణ అనేది భౌతిక విజయం మీద ఆధారపడదు... కేవలం యేసుక్రీస్తుపై మాత్రమే ఆధారపడుతుంది” అని పునీత ఫ్రాన్సిస్ జేవియర్ అన్నారు. మిషనరీలకు ప్రార్థన, దైవశక్తి ఎంతో అవసరం కనుక వారి కొరకు నిత్యం ప్రార్ధన చేద్దాం!

మనమందరము కూడా జ్ఞానస్నానం, దివ్యసప్రసాదం స్వీకరించి, దేవునియందు భక్తి విశ్వాసములతో, దేవుని సాక్షులుగా జీవిస్తూ రక్షింపబడదాం. ప్రతి దినం ఆ దేవునికి ఈ విధంగా ప్రార్థించుకుందాం ముఖ్యంగా సుదూర ప్రాంతాలలో లేదా సువార్త వినని మరుగున పడిన జాతుల మధ్య పనిచేస్తున్న మిషనరీల కోసం మనం ప్రత్యేకంగా ప్రార్థించాలి, వారికి తోడ్పాటు అందించాలి. లోకంలో సువార్తను ప్రకటించే మిషనరీలందరి కోసం మనం ప్రార్థించాలి. వారికీ ధైర్యాన్ని, శక్తిని, రక్షణను, సరైన మార్గదర్శకత్వాన్ని ఇవ్వమని దేవుణ్ణి వేడుకోవాలి. కేవలం ప్రార్థించడమే కాదు, సువార్త సేవలో మనం భాగస్వాములు కావాలి. మనకున్న ధన సహాయం, సమయాన్ని, ప్రతిభను సేవ కోసం అంకితం చేయాలి. ప్రతి ఒక్కరిలో దేవుని ప్రేమను పంచడానికి మనం కృషి చేయాలి.

సువార్త వ్యాప్తిని కేవలం మానవ ప్రయత్నంగా కాకుండా, దైవిక ప్రేరేపిత కార్యంగా స్పష్టం చేయాలి. ప్రపంచమంతటా తిరిగి సువార్తను ప్రకటించే ధైర్యాన్ని, జ్ఞానాన్ని ప్రభువు పరిశుద్ధాత్మ ద్వారా మనకు అనుగ్రహిస్తారు. సువార్తను బోధించే శక్తి మన సొంత జ్ఞానం కాదు, అది పరిశుద్ధాత్మ దేవుని శక్తి. సువార్త ఫలించడానికి, ప్రజల హృదయాలు మార్పు చెందడానికి పరిశుద్ధాత్మ నడిపింపు కోసం నిరంతరం ప్రార్థించాలి.

అనేకులైన అన్యులు నిజ దేవుడైన యేసుక్రీస్తు ప్రభువును తెలుసుకోకుండా నశించిపోతున్నారు. ఆ విధంగా జరుగకుండా ప్రతి ఒక్కరూ క్రీస్తు ప్రభువును విశ్వసించి, అనుసరించి, చివరకు నిత్యజీవంలో ప్రవేశించులాగున ఆ దేవున్ని వేడుకుందాం. మన వంతు మనం సువార్తా వ్యాప్తికై పనిచేసి, కొన్ని ఆత్మలను రక్షించుదాం. దేవుని ప్రేరణ, ఆత్మ నడిపింపు మనకు తోడై యుండులాగున ప్రార్థించుకుందాం.

“ఈ రోజు నుండి, నేను క్రీస్తును నా మాటలలో మరియు నా చేతలలో ప్రతిబింబిస్తాను” అని గట్టిగా కోరుకుందాం!

ప్రియమైన సహోదరీ సహోదరులారా! ఈ ప్రపంచ వేదవ్యాపక ఆదివారం రోజున మనం కేవలం మాటలు చెప్పడం కాదు, నిర్ణయం తీసుకుందాం!

1. ప్రార్థన ద్వారా: నిత్యం మిషనరీల కొరకు, సువార్త ప్రకటించ బడని ప్రాంతాల ప్రజల కొరకు ప్రార్థన చేద్దాం!

త్యాగం ద్వారా: వేదవ్యాపక ఆదివారం సందర్భంగా మన వంతు ఆర్థిక సహాయాన్ని వారికి అందించి, వారి సేవలో భాగస్వాములమవుదాం!

3. జీవితం ద్వారా: క్రీస్తును కేవలం ఆదివారం మాత్రమే కాదు, సోమవారం నుండి శనివారం వరకు మన ప్రతి క్రియలో, ప్రతి మాటలో సాక్షులుగా జీవిద్దాం!

కనుక, పునీత ఇగ్నేషియస్ ఆఫ్ లోయోలా అన్నట్లు, 'వెళ్లండి, లోకానికి అగ్నిని రాజేయండి! అన్న మాటలకు, మన జీవితాలే సువార్త కావాలని కోరుకుందాం!

లాటరన్ దేవాలయ ప్రతిష్ట పండుగ (9 నవంబరు)

 లాటరన్ దేవాలయ ప్రతిష్ట పండుగ (9 నవంబరు)
యెహెజ్కే 47:1-2, 8-9, 12; 1 కొరి 3:9-11, 16-17; యోహా 2:13-22
“క్రీస్తే నిజమైన దేవాలయము”



ఈ రోజు, నవంబర్ 9న, మనం రోములోని అత్యంత పురాతనమైన, అత్యంత ప్రతిష్టాత్మకమైన దేవాలయం ‘లాటరన్ దేవాలయ ప్రతిష్ఠాపన పండుగ’ను ప్రపంచవ్యాప్తంగా జరుపుకొంటున్నాము. ఇది కేవలం ఒక కట్టడం యొక్క వార్షికోత్సవం కాదు, మన విశ్వాసం యొక్క పునాదిని గుర్తుచేసే ముఖ్యమైన వేడుక.

రోమ్ నగరంలో, చాలామంది అనుకునే పునీత పేతురు దేవాలయం కంటే ముందు, లాటరన్ దేవాలయమే పోప్ యొక్క అధికారిక కేథడ్రల్. ఇది రోము బిషప్‌గా పోప్ యొక్క ‘సింహాసనం’.

అందుకే దీనిని గర్వంగా, ప్రపంచంలోని అన్ని దేవాలయాలకు ‘తల్లి’ మరియు ‘అధిపతి’ అని పిలుస్తారు. దీనిని ఎందుకు ఇలా పిలుస్తున్నారంటే, క్రైస్తవ మతానికి స్వేచ్ఛ లభించిన తరువాత, భూమిపై చట్టబద్ధంగా నిర్మించబడిన మొట్టమొదటి బృహద్దేవాలయం ఇదే. దీని ప్రతిష్ఠాపన (క్రీ.శ. 324, పోప్ సిల్వెస్టర్ ద్వారా) రోము బిషప్‌గా పోప్ యొక్క ఆధ్యాత్మిక అధికారాన్ని ప్రపంచానికి స్థిరపరిచింది. కాబట్టి, లాటరన్ అనేది ప్రపంచంలోని కతోలిక విశ్వాసానికి మాతృక, మూలస్థానం వంటిది. ఈ దేవాలయ ప్రతిష్టను జరుపుకోవడం అంటే, మన విశ్వాసం యొక్క పునాదిని మరియు పోపు ద్వారా క్రీస్తు అందించే కేంద్ర అధికారాన్ని గుర్తించడమే!

చరిత్ర, దేవుని సంఘం యొక్క శాశ్వతత్వం: కాన్‌స్టాంటైన్ చక్రవర్తి క్రీ.శ. 313లో ‘మిలాన్ శాసనం’ ద్వారా క్రైస్తవులకు మత స్వేచ్ఛను ఇచ్చిన తరువాత, ఆయన లాటరన్ ప్యాలెస్‌ను పోప్ మిల్టియాడెస్‌కు దానం చేశారు. ఆ స్థలంలోనే మొదటి బసిలికా లేదా దేవాలయము నిర్మించ బడింది. క్రీ.శ. 324 నవంబర్ 9న పోప్ సిల్వెస్టర్ ప్రతిష్టించారు. మొదట్లో దీనిని క్రీస్తు రక్షకుని దేవాలయంగా ప్రతిష్టించారు. తరువాత సెయింట్ జాన్ ది బాప్టిస్ట్ మరియు సెయింట్ జాన్ ది ఎవాంజిలిస్ట్ పేర్లు కూడా జోడించ బడ్డాయి.

శతాబ్దాల అణచివేత తర్వాత మత స్వేచ్ఛకు ఇది ఒక అద్భుతమైన చిహ్నం. ఈ దేవాలయం ఎన్నిసార్లు కూలిపోయినా, ఎన్ని ప్రకృతి విపత్తులు వచ్చినా, దానిని పునర్నిర్మించారు. ఇది దేవుని సంఘం యొక్క శాశ్వతత్వాన్ని, క్రీస్తుపై స్థాపించబడిన శ్రీసభ యొక్క అచంచలమైన విశ్వాసాన్ని సూచిస్తుంది.

పండుగ ఉద్దేశం: ప్రధానంగా, పోపు పీఠంతో మరియు ప్రపంచ కతోలిక శ్రీసభ యొక్క ఐక్యతను, ప్రేమను తెలియజేయడానికి ఈ పండుగను జరుపుకుంటారు. ఇది క్రైస్తవ మతానికి స్వేచ్ఛ లభించిన చారిత్రక సందర్భాన్ని మరియు శ్రీసభ యొక్క కొనసాగింపును గుర్తు చేస్తుంది. లాటరన్ దేవాలయం పోపు యొక్క కేథడ్రల్ కాబట్టి, ఈ పండుగ మనందరినీ క్రీస్తు ప్రతినిధి అయిన పోపుగారితో మరియు శ్రీసభ అధికారంతో ముడిపెడుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కతోలిక సంఘం ఏకత్వం యొక్క బంధాన్ని దృఢపరుస్తుంది.

ఈ పండుగ యొక్క అంతిమ సందేశం ఏమిటంటే, ఇటుకలు మరియు రాళ్లతో కట్టిన దేవాలయం కన్నా, ప్రతి విశ్వాసి హృదయం దేవుని నివాస స్థలం అనే సత్యాన్ని ఇది మనకు గుర్తుచేస్తుంది. అపోస్తలుడైన పౌలు చెప్పినట్లు, “మీరు దేవుని ఆలయమై యున్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించు చున్నాడనియు మీరు ఎరుగరా? (1 కొరి 3:16).

దేవాలయం నుండి ప్రవహించే జీవజలాలు (యెహెజ్కేలు 47): ప్రవక్త యెహెజ్కేలు చూసిన దర్శనాన్ని ఈ పండుగ మనకు గుర్తుచేస్తుంది. ఆయన చూసిన దర్శనంలో, నూతన దేవాలయం నుండి జీవజలాలు ప్రవహించి, ఎర్ర సముద్రాన్ని సైతం శుద్ధి చేసి, దాని తీరాన ఫలించే వృక్షాలను పెంచుతాయి. ఈ జీవజలాలు బాప్టిజం ద్వారా మనం క్రీస్తు సంఘంలోకి ప్రవేశించడాన్ని సూచిస్తాయి. క్రీస్తు నుండి ప్రవహించే కృప మరియు పవిత్రాత్మ యొక్క జీవజలాలే శ్రీసభ ద్వారా ప్రపంచానికి శుద్ధిని, జీవితాన్ని అందిస్తాయి. ఈ కృపను మనం అందుకున్న తరువాత, మన హృదయాల నుండి కూడా క్రీస్తు ప్రేమ ఇతరులకు ప్రవహించాలి.

క్రీస్తే అసలైన దేవాలయం (యోహాను 2:13-22): యేసు దేవుని ఆలయాన్ని శుద్ధి చేసిన సంఘటనను ఈ పండుగ గుర్తు చేస్తుంది. అప్పుడు ఆయన, “ఈ దేవాలయాన్ని పడగొట్టండి, నేను మూడు రోజుల్లో దీనిని తిరిగి నిర్మిస్తాను” అని చెప్పారు. క్రీస్తు ఇక్కడ తన శరీరం గురించే మాట్లాడుతున్నారు. అంటే, ఇటుకలతో కట్టిన భవనం కన్నా, క్రీస్తు శరీరమే అసలైన మరియు అంతిమ దేవాలయం. భౌతిక దేవాలయ భవనాలు కేవలం ప్రార్థనా స్థలాలు మాత్రమే; కానీ క్రీస్తు శరీరంలో భాగమైన విశ్వాసుల సమూహమే నిజమైన దేవాలయము. మనందరం “జీవముగల రాళ్ళు”గా క్రీస్తు అనే మూలరాయిపై నిర్మించబడిన ఆత్మీయ గృహము.

ఈ పవిత్రమైన రోజున, లాటరన్ దేవాలయం యొక్క ప్రతిష్టను జరుపుకుంటూ, మన హృదయాలను పరిశుద్ధంగా ఉంచుకోవాలని, దేవుని ఆత్మ మనలో నివసించడానికి తగిన ఆలయంగా మార్చుకోవాలని ప్రార్థిద్దాం. విశ్వశ్రీసభకు మరియు మన మేత్రానులకు విధేయత చూపుతూ, క్రీస్తు ప్రేమను మన జీవితాల ద్వారా ప్రతిబింబిద్దాం.

జపమాల మాత పండుగ (7 అక్టోబరు)

 జపమాల మాత పండుగ (7 అక్టోబరు)


కతోలిక సంప్రదాయంలో, అత్యంత ప్రాముఖ్యమైన ప్రార్ధనలలో జపమాల ఒకటి. మరియమాత మధ్యవర్తిత్వం ద్వారా, యేసుక్రీస్తు జీవితం, మరణం, పునరుత్థాణ పరమ రహస్యాలను లోతుగా ధ్యానిస్తున్నాం. ప్రార్ధనలలో శక్తివంతమైన ప్రార్ధన జపమాల.

అక్టోబరు 7న, కతోలిక విశ్వశ్రీసభ, దేవుని యెడల విధేయత, విశ్వాసం, అనుగ్రహం, ధన్యత కలిగిన “జపమాల మాత” పండుగను మనం ఎంతో భక్తిశ్రద్ధలతో, సంతోషంతో జరుపుకుంటున్నాము. జపమాల ప్రార్ధన శక్తిని, జపమాల భక్తి మాధుర్యాన్ని, అలాగే మన విశ్వాస ప్రయాణంలో మరియతల్లి నడిపింపును మనకు ఈ పండుగ తెలియజేస్తుంది. భక్తి మార్గాలలో జపమాల గొప్ప అందమైన, మధురాతి మధురమైన భక్తిమార్గం.

క్రైస్తవ కతోలిక విశ్వాసానికి సంక్షిప్త రూపమే జపమాల. ఈ విశ్వాసాన్ని తన హృదయం నిండా నింపుకున్న మహా ఘనురాలైన మరియమాత ద్వారా యేసు ప్రభువును చేరుకోగలిగే అద్భుతమైన మార్గం ఈ జపమాల.

పునీత అల్ఫోన్సస్ ది లిగోరి గారు చెప్పిన మాటలను గుర్తుకు చేసుకుందాం, “జపమాల భక్తి ప్రపంచానికి అపారమైన మేలు చేసిందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎంతోమంది పాపము నుండి విముక్తి పొందారు. పవిత్ర జీవితం గడపడానికి మార్గం ఏర్పరచింది. జపమాలను జపించేవారు, మంచి మరణంను పొందియున్నారు. జపమాలను హృదయపూర్వకంగా, మనస్సు లగ్నం చేసి చెప్పాలి” అని ‘ది గ్లోరీస్ ఆఫ్ మేరీ’ అనే తన ప్రసిద్ధ గ్రంథంలో స్పష్టంగా పేర్కొన్నారు. పునీత లిగోరి గారి ఉద్దేశ్యం ఏమిటంటే, జపమాల కేవలం కొన్ని పదాల పునరావృతం కాదు, అది క్రీస్తు జీవితంలోని ముఖ్యమైన రహస్యాల గురించి లోతుగా ధ్యానం చేయడంలో సహాయపడే ఒక శక్తివంతమైన ప్రార్థన. ఈ ధ్యానం ద్వారానే మనం మన జీవితాలను మార్చుకోగలుగుతాము మరియు దైవానికి మరింత దగ్గరవుతాము.

జపమాల భక్తి వలన కలుగుతున్న కొన్ని స్పష్టమైన ఉదాహరణలు మరియు ప్రయోజనాలను తెలుసుకుందాం:

1. పాపాల నుండి విడుదల: “ఉదాత్తమైన భక్తియైన జపమాల ద్వారా ఎంతోమంది పాపం నుండి విముక్తి పొందారు!” అని లిగోరి గారు పేర్కొన్నారు. జపమాల ప్రార్థనలో నిమగ్నమైనప్పుడు, ఆ వ్యక్తి యొక్క మనస్సు క్రైస్తవ విశ్వాస రహస్యాలపై కేంద్రీకరిస్తుంది కనుక, పాపపు ఆలోచనలు, కోరికల నుండి దృష్టి మరలి, మానస్సాక్షి ప్రక్షాళనకు అవకాశం కలుగుతుంది. జపమాల పరిశుద్ధ జీవితానికి మార్గం. జపమాల ప్రార్థన మనలను పవిత్రమైన, దైవభక్తితో కూడిన జీవితం వైపు నడిపించడానికి సహాయపడుతుంది. దీనిని నిత్యం జపించేవారు పరిశుద్ధతలో వృద్ధి చెందుతారు అనేసి మన నమ్మకం.

2. శోధనలపై విజయం: జపమాల ప్రార్థన చేసేవారు దేవుని సహాయంతో శోధనల నుండి శక్తివంతంగా తమను తాము రక్షించుకోగలుగుతారు. పరిశుద్ధ మాత సహాయం కోసం చేసే ఈ ప్రార్థన, సాతాను యొక్క పన్నాగాలు, ప్రలోభాలనుండి దూరంగా ఉంచడంలో కీలకపాత్ర వహిస్తుంది.

3. మరణ సమయంలో గొప్ప సహాయం: లిగోరి గారు, జీవితమంతా జపమాలను భక్తితో జపించేవారు తమ మరణ సమయంలో గొప్ప దయ పొందుతారని, మంచి మరణాన్ని పొంది రక్షింపబడతారని ప్రకటించారు. ఎందుకంటే, జపమాల అనేది పరిశుద్ధ మాత యొక్క కరుణ మరియు శక్తిని కోరే ప్రార్థన.

4. సమాజంలో ఆశీస్సులు: ఐక్యత - ఈ ప్రార్థనను ఒంటరిగా కాకుండా, ఇతరులతో కలిసి జపించడం వలన ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. కుటుంబాలు లేదా సంఘంతో కలిసి జపమాల జపించడం ద్వారా దేవుని ఆశీర్వాదాలు, శాంతి, ఐక్యతను పొందుతాము. శాంతి మరియు రక్షణ - జపమాల కేవలం వ్యక్తిగత భక్తి మాత్రమే కాదు, ప్రపంచానికి శాంతిని మరియు రక్షణను అందించడానికి దేవుడు ఇచ్చిన ఒక గొప్ప సాధనం అని మన విశ్వాసం.

మరియమాత, పునీత యులాలియతో ఇలా చెప్పారు: “ఆదరాబాదరాగా, భక్తి, విశ్వాసం లేకుండా, యాభై మూడు పూసల జపమాలను జపించడం కంటే, నెమ్మదిగా, భక్తితో యాభై మూడు పూసల జపదండ చెప్పవలెను.” ఈ వాక్యంలో ఎంతో గొప్ప అర్ధం దాగి ఉంది: జపమాల యొక్క ముఖ్య ఉద్దేశం కేవలం ప్రార్థనలను యాంత్రికంగా పునరావృతం చేయడం కాదు. జపమాలలోని ప్రతి గురుతులో క్రీస్తు మరియు మరియమాత జీవితంలోని ఒక రహస్యంపై లోతుగా ధ్యానం చేయాలి. త్వరత్వరగా, హడావిడిగా, అశ్రద్ధగా, ఏకాగ్రత లేకుండా జపించడం వలన, ప్రార్థనను అర్ధవంతంగా జపించలేము. తద్వారా ఆ ప్రార్థన శక్తి మరియు ఆశీర్వాదం కోల్పోతాము. నెమ్మదిగా, ప్రతి పూస వద్ద ఆగి, ఆ రహస్యం గురించి ఆలోచించడం ద్వారా, ధ్యానించడం ద్వారా మాత్రమే యేసుక్రీస్తు మరియు మరియమాత పట్ల మన ప్రేమ పెరుగుతుంది. ఏ ప్రార్ధన అయినను హృదయం నుండి చేయాలి. భక్తి, విశ్వాసం, ప్రేమతో ప్రార్ధన చేయాలి. ముఖ్యంగా జపమాలను, పశ్చాత్తాపం మరియు పరిశుద్ధత అనే ధ్యేయంతో జపించాలి.

“జపమాలను వల్లించడం వలన ప్రభువు జీవిత పరమ రహస్యాలను ధ్యానించేటట్లు ఆ వ్యక్తికి తోడ్పడుతుంది. ప్రభువుకు దగ్గరగా ఉన్న ఆ తల్లి దృష్టితో మనం ప్రభువును చూడగలం” అని ఆరవ పౌలు పోప్ గారు చెప్పారు. పోపు గారు జపమాల గురించి చేసిన ఈ వ్యాఖ్య చాలా లోతైన ఆధ్యాత్మిక అర్థాన్ని కలిగి ఉంది. జపమాలను కేవలం ప్రార్థనల సమాహారంగా కాకుండా, క్రీస్తు జీవితాన్ని ధ్యానించడానికి ఉపయోగించే ఒక ‘క్రీస్తు కేంద్రిత పద్ధతి’గా వివరించారు. మరియతల్లి దృష్టితో క్రీస్తును చూడాలి. యేసు బాల్యం నుండి మరణం, పునరుత్థానం వరకు జరిగిన ప్రతి సంఘటనకు మరియమ్మ సాక్ష్యం. ఆయన తొలి నవ్వు, తొలి అడుగు నుండి సిలువపై ఆయన బాధ వరకు ఆమె హృదయంలో దాచుకుంది (లూకా 2:19). మనం జపమాల ధ్యానం చేస్తున్నప్పుడు, మరియమ్మ యొక్క పవిత్రమైన, నిస్వార్థమైన, లోతైన విశ్వాసం అనే ‘కళ్ళద్దాలతో’ క్రీస్తు జీవితాన్ని చూడాలి, ధ్యానించాలి. మరియమ్మ ప్రేమ ద్వారా క్రీస్తు శ్రమల విలువ, ఆయన వాత్సల్యం యొక్క లోతు మనకు మరింత స్పష్టంగా అర్థమవుతాయి. జపమాల ఒక క్రీస్తు-కేంద్రిత అభ్యాస పాఠశాల. మరియమ్మ ఆ పాఠశాలలో మనకు మార్గదర్శకురాలు. ఆమెతో కలిసి మనం క్రీస్తు పరమ రహస్యాలను ధ్యానిస్తున్నాం.

జపమాల భక్తి ఎలా వచ్చింది?

క్రీ.శ. 13వ శతాబ్ద ప్రారంభంలో, మరియమాత తన స్వహస్తాల ద్వారా పునీత డొమినిక్‌ గారికి జపమాలను ఇచ్చి, ఈ ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను ఆయనకు తెలియజేశారు. ఈ సంఘటన జపమాల భక్తి ప్రపంచానికి లభించిన ఒక దైవ వరంగా పరిగణించబడుతుంది. పరిశుద్ధ మరియమాత ఈ లోకానికి ఇచ్చిన ఒక ఆధ్యాత్మిక అస్త్రం, జపమాల! 13వ శతాబ్ద ప్రారంభంలో దక్షిణ ఫ్రాన్స్‌లో, అల్బిజెన్సియనిజం లేదా కాథారిజం అనే ఒక బలమైన విప్లవం శ్రీసభ యొక్క బోధనలను, ముఖ్యంగా క్రీస్తు యొక్క మానవత్వాన్ని మరియు దివ్యసంస్కారాలను తీవ్రంగా ప్రశ్నించింది. పునీత డొమినిక్ గారు ఈ విప్లవాన్ని లేదా కతోలిక విశ్వాస వ్యతిరేక సిద్ధాంతాలను ఎదుర్కోవడానికి ప్రయత్నించారు. ఆయన చేసిన ఉపదేశాలు, బోధనలు, వాదనలు ఆ విప్లవవాదులను మార్చడంలో పూర్తిగా విజయం సాధించలేకపోయాయి. పునీత డొమినిక్ గారు ఈ విప్లవం పట్ల నిరాశ చెంది, ప్రార్థన చేస్తున్నప్పుడు, పరిశుద్ధ కన్య మరియమాత ఆయనకు ప్రత్యక్షమైంది. మరియమాత జపమాలను, పునీత డొమినిక్ గారికి స్వయంగా ఇచ్చి, ఈ ప్రార్థన యొక్క శక్తిని మరియు ప్రాముఖ్యతను తెలియజేశారు. జపమాల ఒక బోధనా సాధనంగా మరియు ఆధ్యాత్మిక ఆయుధంగా పనిచేస్తుందని మరియమాత ప్రకటించారు. తప్పుడు సిద్ధాంతాలలో చిక్కుకున్న సాధారణ ప్రజలకు కతోలిక విశ్వాస సత్యాలను స్పష్టంగా బోధించడానికి జపమాల ఒక గొప్ప మార్గం అయింది. పునీత డొమినిక్ గారు జపమాలను నమ్మకంతో బోధించడం ప్రారంభించిన తర్వాత, అనేక మంది తప్పుడు బోధనలకు దూరమై, తిరిగి కతోలిక విశ్వాసంలోకి వచ్చారు. ఈ విధంగా, జపమాల ఆ కాలంలో గొప్ప విజయాలను సాధించడానికి దోహదపడింది.

తల్లి శ్రీసభ కూడా ఈ జపమాలను జపించాలని నిత్యమూ ప్రోత్సహిస్తుంది. ఎందుకంటే, జపమాల ప్రార్థనలో మనం మొత్తం 20 దేవరహస్యాలను ధ్యానం చేస్తున్నాము - ఐదు సంతోష దేవరహస్యాలు, ఐదు దు:ఖ దేవరహస్యాలుఐదు మహిమ దేవరహస్యాలు, మరియు ఐదు వెలుగు దేవరహస్యాలు. ఈ దేవరహస్యాలద్వారా, క్రైస్తవులు క్రీస్తు అంటే ఎవరో, ఆయన మన కొరకు ఎందుకు వచ్చారో తెలుసుకుంటారు. క్రీస్తు బోధనలు, ఆయన ప్రేమ గురించి తెలుసుకుంటాం. అందుకే శ్రీసభ మరియమాత ద్వారా మనకు జపమాల ప్రార్థనను జపించమని ప్రోత్సహిస్తుంది. ఈ దేవరహస్యాల ధ్యానం ద్వారా మనం క్రీస్తు ప్రభువు గురించి ఎక్కువగా తెలుసుకోవచ్చు. ఆయన జననము, మరణము, మనకోసం అనుభవించిన శ్రమలు, పునరుత్థానము, మోక్షారోహణము, పవిత్రాత్మ రాకడ, దివ్యసత్ప్రసాద స్థాపన వంటి ముఖ్య ఘట్టాలను ధ్యానిస్తాము. అదేవిధంగా, మరియమాతకు సంబంధించిన కొన్ని ఆధ్యాత్మిక ఘట్టాలను కూడా ఇందులో ధ్యానం చేయవచ్చు.

జపమాల మాత పండుగ ఆవిర్భావం

మరియమాతను జపమాల దేవరహస్యంగా కొనియాడడం అనేది, లెపాంటో (Lepanto) ఓడరేవు పట్టణం వద్ద జరిగిన మహాయుద్ధంలో క్రైస్తవులు ఘనవిజయం సాధించినందుకు జ్ఞాపకార్థంగా ఆరంభమైంది. క్రైస్తవులకు, మహమ్మదీయులకు మధ్య లెపాంటో ఓడరేవు పట్టణం సమీపంలో ఈ నావికా యుద్ధం సముద్రంలో జరిగింది. క్రైస్తవుల తరపున ఆస్ట్రియా రాకుమారుడు డాన్ జువాన్ నాయకత్వం వహించి యుద్ధం చేశారు. తనకు తక్కువ సైన్యం ఉన్నప్పటికీ, క్రైస్తవులు ఆ యుద్ధంలో 1571 అక్టోబర్ 7న ఘనవిజయం సాధించారు. కన్య మరియమాతయందు భక్తి, విశ్వాసం, నమ్మకం గల ఈ రాజు, మరియమాత మధ్యవర్తిత్వాన్ని కోరుకున్నారు. కన్య మరియ మధ్యవర్తిత్వం ద్వారా సహాయం అర్థించి, ప్రార్థించి, జపమాలను జపిస్తూ పోరాటం సలిపి ఘనవిజయం సాధించారు. ఈ ఘనత ఆ దేవుని తల్లికే చెందుతుందని డాన్ జువాన్ ఉద్వేగంతో పేర్కొన్నారు. ఈ విజయం జ్ఞాపకార్థంగా, అప్పటి పోప్ ఐదవ పయస్ గారు ఈ జపమాల మరియమాత ఉత్సవాన్ని ప్రవేశపెట్టారు.

చరిత్రలో, జపమాల లెక్కలేనంత మందికి ఊరటను, ఓదార్పును దయచేసింది. ముఖ్యంగా, కష్టాలలో, దిక్కుతోచని స్థితిలో, పోరాట సమయాలలో, జపమాల ద్వారా మరియమాత మధ్యవర్తిత్వాన్ని ఆశ్రయించి ఎన్నో గొప్ప మేలులను పొందియున్నారు.

పునీత రెండవ జాన్ పాల్ జగద్గురువులు, “జపమాల నాకు ఇష్టమైన ప్రార్థన. ఇది దివిని-భువిని కలిపే ప్రార్థన. మరియమాతతో మనలను ఏకం చేస్తుంది. క్రీస్తు చెంతకు నడిచే మార్గంలో, ఆమె మన చేయి పట్టుకుని నడిపిస్తుంది” అని అన్నారు. వీరి మాటలలో అర్ధం ఏమిటంటే, జపమాల అనేది అత్యంత సాధారణమైన మరియు సులభమైన ప్రార్థన. దీనికి ప్రత్యేకమైన పుస్తకాలు లేదా జ్ఞానం అవసరం లేదు. కేవలం కొన్ని ప్రాథమిక ప్రార్థనలు మరియు ధ్యానం చేయాలనే నిబద్ధత ఉంటే సరిపోతుంది. పోప్ గారు దీనిని ఎంతగానో ప్రేమించడానికి కారణం, ఇది అందరికీ, పేదలకు, ధనికులకు, చదువుకున్న వారికి, చదువుకోని వారికి కూడా అందుబాటులో ఉండడమే. దివిని-భువిని కలిపే ప్రార్థన అని అన్నారు: జపమాలలోని రహస్యాల ద్వారా మనం యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని, పునరుత్థాన మహిమను, పరిశుద్ధ మాత యొక్క స్వర్గారోహణ మరియు పట్టాభిషేకం వంటి సత్యాలను ధ్యానిస్తాం. ఇది మన దృష్టిని భూమిపై ఉన్న తాత్కాలిక విషయాల నుండి నిత్య సత్యాల వైపు మళ్లిస్తుంది. అలాగే, మనం జపించే ప్రతి మంగళవార్త జపంలో పాపాత్ములమై యుండెడు మా కొరకు, ఇప్పుడును, మా మరణ సమయ మందును ప్రార్థించండి” అని చెబుతాం. అంటే, మనం ఈ భూమిపై మన నిజమైన అవసరాల గురించి, మన పాపాల గురించి, మన అంతిమ గమ్యమైన మరణం గురించి ప్రార్థిస్తున్నాం. క్రీస్తు జననం, జీవితం, మరణం, పునరుత్థానం అనే దైవిక అంశాలను, మన రోజువారీ జీవితంలోని (భువి) కష్టాలు, సవాళ్లు మరియు నిరీక్షణతో (దివి) జపమాల ఏకం చేస్తుంది.

“మరియమాత మన చేయి పట్టుకుని నడిపిస్తుంది” అని అన్నారు, క్రీస్తు చెంతకు నడిచే మార్గంలో అనేక ఆధ్యాత్మిక సవాళ్లు ఉంటాయి. మరియమాత మన చేయి పట్టుకుని నడిపించడం అంటే, శోధనలలో ఆమె మనకు ధైర్యాన్ని, నిరీక్షణను మరియు భక్తిని కలిగిస్తుంది. క్రీస్తు ప్రేమను పొందుకోవడానికి ఆమె మనకు సురక్షితమైన, సరళమైన మరియు మార్గాన్ని చూపిస్తుంది.

అందుకే, పునీత ఫ్రాన్సిస్ డి సేల్స్ గారు, “పరిశుద్ధ జపమాల భక్తి గొప్పది, ఉన్నతమైనది, దైవికమైనది. అత్యంత కఠినమైన పాపులను మరియు మొండి పట్టుదల గల భిన్నాభిప్రాయ వాదులను మార్చడానికి స్వర్గమే దీనిని మీకు ఇచ్చింది” అని అన్నారు.

మరియ తల్లి ఎప్పుడు కూడా మనలను ప్రభువు చెంతకే నడిపిస్తుంది. పునీత యోహాను గారు వ్రాసిన సువార్త 2:5లో, “ప్రభువు తల్లి సేవకులతో, ‘ఆయన చెప్పినట్లు చేయుడి’ అనెను.” ఈ మాటల ద్వారా, జపమాల మాత సకల మానవాళికి ఏమి సందేశం ఇస్తున్నారో మనం అర్థవంతంగా తెలుసుకోవాలి. “క్రీస్తును వెంబడించండి! ఆయన చెప్పిన విధముగా జీవించండి! ఆయనను అనుసరించండి!” అనేది మరియతల్లి సందేశం. కానా పల్లెలో పెండ్లి విందు జరుగుతున్నప్పుడు, ద్రాక్షారసం తక్కువ పడినప్పుడు, యేసు తల్లి, కన్య మరియ, “వారికి ద్రాక్షారసం లేదు” అని తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుతో చెప్పారు. క్రీస్తు ప్రభువు అక్కడ ఉన్న ఆరు రాతి బానలలో నీటిని నింపమని సేవకులతో చెప్పగానే, మరియమాత సేవకులతో, “ఆయన చెప్పినట్లు చేయండి’ అని చెప్పారు. జపమాల మాత మనకు నిత్యమూ క్రీస్తు ప్రభువును అనుసరించమని చెబుతున్నారు. జపమాల మాత, క్రీస్తు ప్రభువునందు విధేయతతో, ఆయన చెప్పినట్లుగా జీవించమని, మనకు సందేశాన్ని ఇస్తున్నారు.

జపమాల మాత పండుగ జరుపుకుంటున్న మనమందరమూ, జపమాలను ధ్యానిద్దాం. జపమాల ధ్యానంలో, మనము కూడా జపమాల మాతను ఈ విధంగా ప్రార్థించుకుందాం:

1.     అమ్మా, యేసు దేవుని మాతయైన జపమాల మాతా! మీ ప్రార్థన సహాయం ద్వారా మాకు కూడా పవిత్రత కలిగిన జీవితాలను ప్రసాదించండి.

2.    దేవుని యందు ఆనందించే ఆత్మను, జపమాల ధ్యానం ద్వారా మాకు ఒసగండి.

3.    దేవుని దాసులముగా జీవించే కృపను, మీ జపమాల ధ్యాన, ప్రార్థనా సహాయం ద్వారా మాకు అందించండి.

4.    దేవుని యందు భయభక్తులతో జీవిస్తూ, ఆయన కనికరం పొందుకునే ధన్యతను, జపమాల ధ్యానం ద్వారా మాకు ప్రసాదించండి.

5.    జపమాల ధ్యానం ద్వారా మా దుష్టత్వమును, దురాలోచనలను పవిత్రపరచండి.

6.    జపమాల ధ్యానం ద్వారా మాలో ఉన్న అహంకారమును కాల్చివేయండి.

7.    జపమాల ధ్యానం ద్వారా మేమందరమూ దీనులమై జీవించే హృదయాలను మాకు దయచేయండి.

8.    జపమాల ధ్యానం ద్వారా ఆపదలలో, అవసరతలలో ఉన్నవారికి సహాయం చేసే హృదయాలను మాకందరికీ దయచేయండి.

9.    జపమాల ధ్యానం ద్వారా క్రీస్తు ప్రభువును అనుసరించే స్వభావమును మాకు దయచేయండి.

10.  జగతికి జ్యోతులమై, మీ ప్రియ కుమారుడైన మా రక్షకునకు, పరమ తండ్రి దేవునికి ప్రియమైన వారసులమై జీవించి, పరమునందు నిత్యజీవమున ఆనందముతో మేమందరమూ జీవించే లాగున, జపమాల మాతా! మా కొరకు ప్రార్థించండి. మమ్ము క్రీస్తు మార్గములో నడిపించండి.

ప్రియ సహోదరీ, సహోదరులారా, మరియతల్లి బిడ్డలారా, జపమాలను ధ్యానించుకునే కుటుంబాలు ఎంతగా ఆశీర్వాదాలు పొందుకుంటాయో గ్రహించి, మన కుటుంబాలన్నీ అనుదినమూ జపమాలను ధ్యానిస్తూ, క్రీస్తు అనుసరణలో జీవించి, ఆ దేవాది దేవుని కృపను పొందుకొని, దేవుని ఆశీర్వాదములకు పాత్రులమై జీవించుదాం.

మన హృదయాలను ప్రభువు ప్రేమతో నింపే జపమాల ప్రార్థన యొక్క శక్తిని లోతుగా గ్రహిద్దాం. భక్తిశ్రద్ధలతో జపమాల ప్రార్థన ద్వారా మన విన్నపాలను మరియమాతకు తెలియజేద్దాం. అందరికీ మరోమారు జపమాల మాత పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.  దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను నిండుగా, మెండుగా దీవించి, కాచి కాపాడునుగాక. ఆమెన్!

 

పునీత అస్సీసి పుర ఫ్రాన్సిస్ (4 అక్టోబర్)

 పునీత అస్సీసి పుర ఫ్రాన్సిస్ (4 అక్టోబర్)


ఉపోద్ఘాతం

అక్టోబరు 4న, మనం పునీత అస్సీసిపుర ఫ్రాన్సిస్ గారి మహోత్సవాన్ని కొనియాడుచున్నాము. ముందుగా మీ అందరకు పండుగ శుభాకాంక్షలు!

పునీత అస్సీసి ఫ్రాన్సిస్ (క్రీ.శ. 1182–1226) క్రైస్తవ చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన, మిక్కిలిగా ప్రేమించబడుచున్న పునీతులలో ఒకరు. ఫ్రాన్సిస్ గారి ఆధ్యాత్మికతకు కేంద్ర బిందువు ‘సిలువలో కొట్టబడిన యేసుక్రీస్తును సంపూర్ణంగా అనుసరించడం’. విశ్వాసం, ప్రేమ, శాంతి, దీనత్వం, విధేయతలకు మారుపేరుగా జీవించిన పునీతులు అస్సీసిపుర ఫ్రాన్సిస్ గారు!

సువార్తను అక్షరాలా జీవించి చూపిన గొప్ప ప్రతిరూపం పునీత ఫ్రాన్సిస్ గారు. “నక్కలకు బొరియలు, ఆకాశ పక్షులకు గూళ్ళు కలవు. మనుష్యకుమారునకు మాత్రము తలవాల్చుటకైనను చోటు లేదు” (మత్త 8:20) అని పలికిన ప్రభువు మాటలను అక్షరాల పాటించి, పేదరికాన్ని తన జీవిత భాగస్వామిగా నెంచి, ప్రేమించిన మహాజ్ఞాని పునీత అస్సీసిపుర ఫ్రాన్సిస్ గారు! ఆయన జీవించిన ‘పేదరికం’, ఎవరూ జీవించి ఉండరు. ఫ్రాన్సిస్ గారు జీవించిన పద్ధతిలో పేదరికాన్ని మరే ఇతర పునీతులు అంత కఠినంగా పాటించలేదు. పేదవారిపట్ల ప్రేమ, స్నేహం, సేవా భావాలతో జీవించారు. ఎప్పుడైతే పేదవారిని ప్రేమించగలనోఅప్పుడే దేవున్ని పరిపూర్ణంగా ప్రేమించగలనని నమ్మినవారు. ఫ్రాన్సిస్ గారి దృష్టిలో, పేదరికం అనేది దేవునిపై సంపూర్ణ విశ్వాసాన్ని, స్వేచ్ఛను ప్రసాదించే పవిత్ర మార్గం.

ఫ్రాన్సిస్ వారి బోధనలు, జీవన విధానం, పేదరికం, దైవప్రేమ, సృష్టిపట్ల గౌరవం, పశ్చాత్తాపాన్ని ఈ లోకానికి గుర్తుచేశాయి, నేటికీ గుర్తు చేస్తూనే ఉన్నాయి.

1. ఫ్రాన్సిస్ వారి జీవితం, మలుపు-పరివర్తన

ఫ్రాన్సిస్ గారు, 1182లో ఇటలీలోని అస్సీసి పట్టణంలో జన్మించారు. తండ్రి పీటర్‌ బెర్నార్డోన్, ఒక పెద్ద బట్టల వ్యాపారి, తల్లి యోవాన్న పీకా. యువకుడైన ఫ్రాన్సిస్‌ చురుకైన స్వభావంతో, కలుపుగోలు తనంతో ఉండేవారు. ఫ్రాన్సిస్ గారు వ్యాపారంలో తండ్రికి సహాయం చేసినప్పటికీ, విందులు, వినోదాలు మరియు విలాసవంతమైన ఖర్చులకు అధిక ప్రాధాన్యత ఇచ్చేవారు. యుక్తవయస్సులో ఫ్రాన్సిస్ గారు గొప్ప యోధుడుగా కావాలని కలలు కన్నారు. ఈ ఆశయంతోనే, కొన్ని యుద్ధాలలో కూడా పాల్గొన్నారు.

1202లో పెరూజియా నగరంతో జరిగిన యుద్ధంలో పాల్గొనే అవకాశం వచ్చింది. అస్సీసికి గొప్ప పేర్తు, కీర్తిప్రతిష్టలు తీసుకొని వస్తానని వాగ్దానం చేసి యుద్ధభూమికి బయలుదేరారు. సాహసంగల శూరుడుగా యుద్ధంలో పాల్గొన్నారు. కాని ఈ యుద్ధంలో పెరూజియా గెలవడంతో, ఫ్రాన్సిస్ తన ఇతర స్నేహితులతో ఖైదీగా పట్టుబడ్డారు. పరాజయం వారిని పదేపదే బాధించింది. పరాజయాన్ని అంగీకరించలేక, తన మిత్రులతో, తన కలల గురించి గొప్పగా చెబుతూ, ‘గొప్ప భవిష్యత్తు నాకోసం ఎదురు చూస్తుంది. ఒకరోజు లోకమంతా నన్ను గౌరవిస్తుంది’ అని అనేవారు. సంవత్సరం గడచి పోయింది. చెరనుండి విడుదల అయిన కొద్ది కాలానికే, తీవ్రమైన జబ్బున పడి, కోలుకున్నారు. అయితే, ఈ అనుభవాలు అన్నీ కూడా ఆయన అంతరంగంలో మార్పును మొదలుపెట్టాయి.

1205లో, పోపుసైన్యానికి జర్మన్ ప్రభువుల మధ్య యుద్ధం వచ్చింది. తన కలలను సాకారం చేసుకోవడానికి మరొక గొప్ప అవకాశంగా భావించి చాలా సంతోష పడ్డారు. ‘ఇన్ని రోజులు నీవు కోరుకుంటున్న మహిమ నీ తలుపు తట్టుచున్నది. వెళ్లి దానిని ఒడిసి పట్టుకో.ఊగిసలాట వద్దు. ముందుకు దూకు. పోరాడి జయించు. మంచి యోధుడిగా మారు. అప్పుడు లోకమంతా నీ ఆధీనంలో ఉంటుంది’ అని ఫ్రాన్సిస్ గారు తనలోతాను అనుకున్నారు. తండ్రి  బెర్నార్డోన్ కూడా తన కొడుకు ఆ ప్రాంతములోనే ఉత్తమమైన కవచాన్ని ధరించాలని, సొగసైన గుర్రంపై స్వారీ చేయాలని ఆశించి వాటిని సమకూర్చాడు.

ఇక ఆపూలియా ప్రాంతానికి యుద్ధంలో పాల్గొనడానికి వెళుతున్న మార్గంలో, స్పొలేటో అనే ప్రాంతంలో, ఫ్రాన్సిస్ గారు, “ఫ్రాన్సిస్‌, నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావు? అని ఒక స్వరాన్ని విన్నారు. ‘ప్రభూ! నేను యోద్ధభూమికి, యోధున్ని కావాలని వెళ్ళుచున్నాను’ అని బదులు చెప్పారు. మరలా ఆ స్వరం, “నీవు ఎవరిని సేవించగలవు? యజమానుడినా లేక సేవకుడినా?” అని ప్రశ్నించింది. అందుకు ఫ్రాన్సిస్ ‘యజమానుడిని’ అని సమాధానం ఇచ్చారు. మళ్ళీ ఆ స్వరం, “కాని, నీవు యాజమానుడిని గాక, సేవకుడిని సేవిస్తున్నావు” అనగా, లౌకిక ఆశయాలను, కీర్తిని సేవిస్తున్నావు అని ఆ స్వరం పలుకగా, అప్పుడు ఫ్రాన్సిస్‌, ‘అయితే, నన్నేమి చేయమంటారు?’ అని ప్రశ్నించారు. అందులకు “నీవు తిరిగి నగరానికి వెళ్ళు. నీవు ఏమి చేయాలో అక్కడ తెలుసుకుంటావు” అని ప్రభువు స్వరం వినిపించింది. ఫ్రాన్సిస్ గారు ఆశ్చర్యానికి గురయ్యారు. తను కన్న కలలు ఒక్క క్షణంలో మాయమైనట్లుగా అనిపించింది. తనలోతాను చాలాసేపు వేదనపడి, చివరికి ఇదే దేవుని చిత్తమని ఎరిగి అస్సీసికి తిరిగి వచ్చారు.

అప్పటినుండి వారు సువార్త ధ్యానాన్ని మొదలు పెట్టారు. దగ్గరలోని చిన్న గుహలో ప్రార్ధించారు. లౌకిక ఆశయాల నుండి వైదొలగారు. ఈ క్రమంలోనే ఆయన తన ధనాన్ని పేదలకు దానం చేయడం మొదలుపెట్టి, తమ తండ్రితో గొడవపడి, చివరికి తమ ఆస్తి హక్కులను కూడా వదులుకున్నారు. ఫ్రాన్సిస్ గారు తమ ఆస్తిని, ధనాన్ని అస్సీసి చుట్టూ ఉన్న శిథిలమైన దేవాలయాల పునర్నిర్మాణం కోసం ఖర్చు చేయడం ప్రారంభించారు.

2. కుష్టిరోగిలో ప్రభువు దర్శనం

ఫ్రాన్సిస్ గారు అత్యంత నిరాదరణకు గురైన పేదలకు, రోగులకు, ముఖ్యంగా కుష్ఠరోగులకు తమ జీవితాన్ని అంకితం చేయాలని, సేవ చేయాలని దృఢంగా తీర్మానించు కున్నారు. ఈ కుష్ఠరోగుల సేవయే క్రీస్తును అనుసరించడంలో ఆయనకు లభించిన మొట్టమొదటి సవాలు, మరియు ఆధ్యాత్మికంగా ఆయనకు గొప్ప మాధుర్యాన్ని ఇచ్చింది.

పునీత ఫ్రాన్సిస్ గారి ఆధ్యాత్మిక జీవితంలో, కుష్ఠరోగిని ఆలింగనం చేసుకొని ముద్దు పెట్టుకోవడం అనేది ఒక ముఖ్యమైన, నిర్ణయాత్మకమైన మలుపుగా పరిగణించ బడుతుంది. ఇది ఆయన జీవితాన్ని లౌకిక ఆశయాల నుండి దైవ సేవ వైపు పూర్తిగా మళ్లించింది. ఈ సంఘటన, తమ జీవితంలో అత్యంత కీలకమైన సంఘటనగా తాను భావించినట్లుగా ఫ్రాన్సిస్ గారు వారి వ్రాతలలో వ్యక్తపరచారు. ఫ్రాన్సిస్ గారు తమ తొలి జీవితంలో, మారుమనస్సు పొందక పూర్వం, కుష్ఠరోగులను చూడటానికే విపరీతమైన విరక్తి, భయాన్ని కలిగి ఉండేవారు. మధ్యయుగపు సమాజంలో, కుష్ఠు వ్యాధిని పాపానికి సంకేతంగా చూసేవారు, కుష్ఠరోగులను పట్టణాల బయట ఒంటరిగా ఉంచి, బహిష్కరించేవారు. ఫ్రాన్సిస్ కూడా వారిని చూసిన వెంటనే దూరంగా వెళ్ళిపోయేవారు. ఫ్రాన్సిస్ గారు స్వయంగా ఈ అనుభవం గురించి “నేను పాపంలో ఉన్నప్పుడు, కుష్ఠరోగులను చూడటం నాకు అత్యంత చేదుగా, అసహ్యంగా అనిపించేది. అయితే, ప్రభువు తానే నన్ను వారి మధ్యకు నడిపించారు, నేను వారికి దయ చూపించాను” అని రాసారు.

ఒకరోజు ఫ్రాన్సిస్ గారు తమ గుర్రంపై ప్రయాణిస్తున్నప్పుడు, అస్సీసికి సమీపంలో ఒక కుష్ఠరోగిని చూశారు. ఆయన సహజంగానే భయంతో పక్కకు తప్పుకోవాలని అనుకున్నారు. కానీ, దేవుని కృప మరియు ఆత్మబలంతో తన భయాన్ని, విరక్తిని అధిగమించి, గుర్రం దిగి, ఆ కుష్ఠరోగి దగ్గరకు పరిగెత్తారు. ఫ్రాన్సిస్ గారు ఆ రోగిని ముద్దుపెట్టుకొని, ఆయన చేతికి కొంత డబ్బు కూడా ఇచ్చారు. ఆయన తిరిగి గుర్రం ఎక్కి, వెనక్కి తిరిగి చూసినప్పుడు, ఆ కుష్ఠరోగి అక్కడ కనిపించలేదు. దీంతో, ఆ రోగి సాక్షాత్తూ యేసు క్రీస్తే అని ఫ్రాన్సిస్ నమ్మారు.

ఈ సంఘటన ఫ్రాన్సిస్ గారు కేవలం క్షణికావేశంలో చేసిన పని కాదు, అది ఆయన జీవితాన్ని పూర్తిగా మార్చివేసింది: చేదుగా, అయిష్టంగా భావించినది ఇప్పుడు మాధుర్యంగా మారింది. అంటే, లోకంలో తనకు విరక్తి కలిగించిన విషయం, దేవుని దృష్టిలో ప్రేమతో చేసినప్పుడు పరమ ఆనందాన్ని ఇచ్చింది. ఈ అనుభవం తర్వాత, ఫ్రాన్సిస్ గారు అస్సీసికి దిగువన ఉన్న కుష్ఠరోగుల ప్రాంతానికి వెళ్ళి, అక్కడే వారితో జీవించారు. వారికి సేవ చేస్తూ, గాయాలను కడుగుతూ, వారికి సేవలు చేస్తూ తమ జీవితాన్ని గడిపారు.

ఈవిధంగా, కుష్ఠరోగిని కౌగిలించుకోవడం అనేది సువార్తను ఆచరించడానికి ఆయన తీసుకున్న మొట్టమొదటి ఆచరణాత్మక చర్య. తన సుఖాన్ని, అహంకారాన్ని, భయాన్ని సిలువపై త్యాగం చేసి, క్రీస్తు యొక్క కరుణను, ప్రేమను స్వీకరించడానికి ఇది ఆరంభ బిందువు.

ఈ సంఘటన నేటి క్రైస్తవ లోకానికి, ముఖ్యంగా యువతకు, క్రీస్తును అనుసరించే విషయంలో శక్తివంతమైన మరియు ఆచరణాత్మకమైన సందేశాలను అందిస్తుంది. నేడు మన చుట్టూ నిస్సహాయ స్థితిలో నున్నవారు ఎంతోమంది ఉన్నారు. మన సహాయం కోసం ఎదురు చూసే వారు ఎంతో మంది ఉన్నారు!

అయితే, మొదటిగా, ఆకర్షణీయమైన వాటిని త్యజించడం నేర్చుకోవాలి - క్రీస్తును కనుగొనడం అనేది మనకు అత్యంత అసహ్యంగా లేదా అసౌకర్యంగా అనిపించే పనులలో మొదలవుతుంది. నేటి యువత సామాజిక మాధ్యమాలలో మరియు ప్రపంచంలో ఆకర్షణీయంగా, విజయవంతంగా కనిపించే వాటినే అనుసరించాలని కోరుకుంటారు. కానీ ఫ్రాన్సిస్ గారి అనుభవం, నిజమైన ఆధ్యాత్మిక మాధుర్యం మరియు శాంతి లభించేది... మనకు 'అసౌకర్యం' కలిగించే సేవలో... మన ‘అహంకారాన్ని’ చంపుకునే క్షణాల్లో... నిజమైన ఆధ్యాత్మిక మాధుర్యం మరియు శాంతి లభిస్తుందని మనమందరం గుర్తించాలి.

రెండవదిగా, క్రీస్తును ఇతరులలో గుర్తించడం - యేసుక్రీస్తును మందిరాలలో మాత్రమే కాదు, సమాజంలోని ప్రతి ఒక్కరిలో, ముఖ్యంగా పేదలలో, అణగారిన వారిలో, ప్రభువును చూడాలి. మత్తయి 25:40లోని ప్రభువు మాటలను గుర్తుకు చేసుకుందాం! “ఈ నా సోదరులలో అత్యల్పుడైన ఏ ఒక్కనికి మీరు ఇవి చేసినపుడు అవి నాకు చేసితివి”. నేటి సమాజంలో ‘కుష్ఠరోగులు’ అంటే శారీరక వ్యాధితో బాధపడేవారు మాత్రమే కాదు - నిరాదరణకు గురైనవారు, విభిన్నమైన ఆలోచనలు లేదా మతాలు కలిగినవారు, పేదరికం, వ్యసనాలు లేదా మానసిక సమస్యలతో బాధపడుతూ విమర్శలు ఎదుర్కొంటున్నవారు... ఇలా ఎంతోమంది ఎన్నో సమస్యలతో బాధపడుతున్నారు! కుష్టరోగులను జయించే ముందు, ఫ్రాన్సిస్ గారు ముందుగా తనలోని విరక్తిని, అహంకారాన్ని జయించారు. ఈ ఆత్మ-విజయమే ఆయనకు ‘ఆత్మకు, శరీరానికి మాధుర్యాన్ని’ యిస్తుంది నేడు మనం ఇతరులను మార్చాలని, మార్పు రావాలని ఆశిస్తాము, కాని నిజమైన పరివర్తన మొదలయ్యేది మన హృదయంలోనే అని గ్రహించాలి! మన బలహీనతలను, ద్వేషాలను జయించినప్పుడే దేవుని సేవలో నిజమైన ఆనందాన్ని పొందగలం.

3. ఫ్రాన్సిస్: శాశ్వత ఎడబాటు

1206లో, పునీత దమియాను దేవాలయంలో ప్రార్దిస్తుండగా, సిలువలో నున్న క్రీస్తు స్వరమును విన్నారు. “నా మందిరమును నిర్మించు” అని ప్రభువు స్వరాన్ని విన్నారు. శిథిలమైన సాన్ దమియానో దేవాలయాన్ని బాగుచేయించడానికి డబ్బు అవసరం కాగా, ఫ్రాన్సిస్ గారు తమ తండ్రి దుకాణంలోని విలువైన వస్త్రాలను గుర్రమును తీసుకువెళ్లి అమ్మేశారు. ఈ విషయం తెలిసిన ఫ్రాన్సిస్ తండ్రి, పీటరు బెర్నార్డోన్‌కు తీవ్రమైన కోపం వచ్చింది. ఫ్రాన్సిస్ తమ వారసత్వాన్ని, కుటుంబ గౌరవాన్ని, కష్టార్జితాన్ని పాడుచేస్తున్నారని, పిచ్చిగా ప్రవర్తిస్తున్నారని ఆయన భావించారు. కోపంతో రగిలిపోయిన తండ్రి, ఫ్రాన్సిస్‌ను బంధించి, ఆ డబ్బును తిరిగి ఇమ్మని కోరుతూ,  అస్సీసి నగర బిషప్ ముందు న్యాయస్థానంలో నిలబెట్టాడు. బిషప్ గారు ఫ్రాన్సిస్‌ను పిలిచి, “నీవు దేవున్ని సేవించదలుచుకుంటే, ఈ డబ్బును నీ తండ్రికి తిరిగి ఇచ్చివేయాలి. దేవుని పనికి అన్యాయంగా సంపాదించిన డబ్బును ఉపయోగించకూడదు” అని ఉపదేశించారు. బిషప్ గారి మాటలకు ఫ్రాన్సిస్ వెంటనే అంగీకరించారు. అయితే, ఫ్రాన్సిస్ గారు మరింత ముందుకు వెళ్లి, “ఈ క్షణం నుండి నేను ఇకపై నిన్ను ‘తండ్రి’ అని పిలవను. ఇదిగో! నీ డబ్బుతో పాటు నీవు నాకు ఇచ్చిన ఈ బట్టలు కూడా నీకే ఇచ్చివేస్తున్నాను. ఇంతవరకు నేను పీటరు బెర్నార్డోన్ కుమారుడిని. కానీ ఇకపై పరలోకంలో ఉన్న దేవుడే నా ఏకైక తండ్రి” అని అన్నారు. ఆయన వెంటనే తమ శరీరంపై ఉన్న విలువైన దుస్తులను విప్పేసి, ఆ డబ్బుతో సహా వాటిని తండ్రికి ఇచ్చేసారు. నగ్నంగా నిలబడిన ఫ్రాన్సిస్, లౌకిక జీవితంతో తమకు ఇక ఏ సంబంధం లేదని తేల్చి చెప్పారు. వెంటనే బిషప్, తన పై వస్త్రాన్ని ఫ్రాన్సిస్ గారిని కప్పి, ఆశ్రయం కల్పించి రక్షించారు.

1207లో, పునీత దమియాను దేవాలయ పునర్నిర్మాణం పూర్తయింది. పెంతకోస్తు పండుగన గోపురంపై సిలువను ప్రతిష్టించి, ఆ సిలువతో సర్వలోకాన్ని దీవించాడు. “ఫ్రాన్సిస్ నీ తరువాతి ప్రణాళిక ఏమిటి?” అని సాన్ దమియానో దేవాలయ గురువు ప్రశ్నించగా, “దేవుడు ఇప్పటివరకు నేను నడవటానికి నాకు వెలుగును చూపించారు. నా తర్వాతి అడుగుకి కూడా దేవుడే ఒక చిన్న దీపాన్ని వెలిగిస్తాడని నమ్మకం నాకున్నది. ప్రతీక్షణం నా జీవితం ఆయన సేవకే” అని ఫ్రాన్సిస్ గారు సమాధాన మిచ్చారు.

4. ఫ్రాన్సిస్: గొప్ప దైవ చిత్తాన్వేషి

ఈనాడు మనం ‘కోరికలు అనే వలయంలో చిక్కుకుపోతున్నాం. కోరికలు తీరనప్పుడు నిరుత్సాహ పడిపోతున్నాం. సానుభూతిఓదార్పుకు నోచుకోలేక పోతున్నాం. దేవుని వాక్యం, కార్యంపై ధ్యానంచేసి, ఆయన చిత్తాన్ని అన్వేషించుటకు మనకు సమయం లేకుండా పోతుంది. క్రీస్తు విశ్వాసులముగా, మనం దేవుని చిత్తం ప్రకారంగా జీవించాలని మనకు తెలుసు! కాని దైవచిత్తాన్ని వెదకుటలో, తెలుసుకోవడంలో, ఆచరించడంలో వెనకబడి పోతున్నాం! దానిలోనున్న ఆనందాన్ని, సంతోషాన్ని గ్రహించలేక పోతున్నాం.

పునీత అస్సీసిపుర ఫ్రాన్సిస్‌ గారు దైవచిత్తాన్ని అన్వేషించడంలో పొందిన ఆనందం వర్ణణాతీతం. యుక్త వయస్సులోచిలిపిగా యువతకు నాయకుడై విచ్చలవిడిగా జీవించినప్పటికినిమార్పుమారుమనస్సు త్వరలోనే అతని జీవితాన్ని ఆవహించాయి. ఏకాంత ప్రదేశాల్లోనికి వెళ్లి దేవుని వాక్యంపైప్రేమపై ధ్యానించడం, ప్రార్ధించడం ప్రారంభించారు. దమియాను దేవాలయంలోని సిలువలో వ్రేలాడు క్రీస్తు ప్రతిమ ఫ్రాన్సిస్‌ హృదినిమదిని తొలచడం ప్రారంభించింది. ఫ్రాన్సిస్‌ దైవపిలుపును అర్ధం చేసుకున్నది ఆ సిలువనుండియే!

1మే 1208, పునీత మత్తయి గారి పండుగ రోజున దైవపిలుపును, దైవచిత్తాన్ని ఫ్రాన్సిస్ గారు మరింత లోతుగా గ్రహించారు. ఆనాటి సువార్త పఠనం, “క్రీస్తు తన శిష్యులను వేదప్రచారానికి పంపటం” ఫ్రాన్సిస్‌ గారిని ఎంతగానో ఆకట్టుకుంది. తను అర్ధం చేసుకున్నది వెంటనే ఆచరణలో పెట్టుటకు బయలు దేరారు. ఇలా దైవ చిత్తాన్ని అన్వేషింఛి, దాని ప్రకారంగా జీవించారు. ఇదే స్ఫూర్తి మనలో కూడా కలగాలి.

ముఖ్యంగా మూడు విషయాలను మనం నేర్చుకోవాలి: మొదటిగా, ధ్యానం, ఏకాంతాన్ని అలవాటు చేసుకోవాలి – ఈనాడు మనం ‘కోరికలు’ అనే వలయంలో చిక్కుకోవడానికి ప్రధాన కారణం, మన చుట్టూ ఉన్న డిజిటల్ శబ్దం మరియు నిరంతర వినోదం. దైవచిత్తాన్ని వినడానికి అవసరమైన నిశ్శబ్దం, ఏకాంతం మన జీవితాల్లో లేకపోవడమే! ఫ్రాన్సిస్ గారు ఏకాంత ప్రదేశాల్లోకి వెళ్లి ప్రార్థించడం ద్వారానే, దేవుని వాక్యంపై ప్రేమను పెంచుకోగలిగారు. పునీత దమియాను దేవాలయంలోని సిలువ ముందు ఆయన చేసిన ప్రార్థన, దేవుని పిలుపును స్పష్టంగా అర్థం చేసుకోవడానికి కేంద్రంగా మారింది. దైవచిత్తాన్ని తెలుసుకోవాలంటే, మనం మొదట దైవ కార్యానికి మరియు దేవుని వాక్యానికి సమయాన్ని కేటాయించాలి. నేడు మనకు ‘డిజిటల్ ఫాస్టింగ్’, అనగా రోజు కొంతసేపు ఫోనును పక్కన పెట్టేయడం ఎంతో అవసరం. ఆ సమయంలో, ప్రశాంతమైన చోట కూర్చొని, బైబిలులోని ఒక చిన్న భాగాన్ని చదివి, ‘ప్రభూ, నేడు నేను ఏమి చేయాలో నాకు తెలియజేయుము’ అని ధ్యానించాలి.

రెండవదిగా, దైవచిత్తాన్ని తక్షణమే ఆచరణలో పెట్టాలి – క్రీస్తు విశ్వాసులముగా, మనం దేవుని చిత్తం ప్రకారంగా జీవించాలని మనందరికీ తెలుసు! అయినప్పటికీ, దానిని ఆచరించడంలో వెనుకబడి పోతున్నాం. చాలామంది క్రైస్తవులు దేవుని చిత్తాన్ని ‘తెలుసుకోవాలని’ మాత్రమే కోరుకుంటారు, కానీ దానిని ఆచరించడానికి అవసరమైన త్యాగం, కృషి చేయడానికి మాత్రం సిద్ధంగా ఉండరు. ఫ్రాన్సిస్ గారు సువార్త పఠనం విన్న వెంటనే, ఆచరణలో పెట్టడానికి వెంటనే బయలుదేరారు. ఆయనకు ఉన్నత విద్య లేదా శిక్షణ అవసరం రాలేదు. దేవుడు పిలిచిన వెంటనే, సంకోచించకుండా తమకున్నదంతా విడిచిపెట్టి, అక్షరాలా క్రీస్తును అనుసరించారు. కనుక, దేవుని చిత్తం చిన్నదైనా సరే (ఉదా: ఎవరికైనా సహాయం చేయడం, క్షమించడం, పేదలకు దానం చేయడం), ఆలస్యం చేయకుండా, తక్షణమే ఆచరించాలి. తెలుసుకోవడం అనేది దైవచిత్తం యొక్క మొదటి అడుగు మాత్రమే; ఆచరించడం అనేది దైవచిత్తంలో ఉన్న ఆనందాన్ని, సంతోషాన్ని పొందే మార్గం.

మూడవదిగా, సిలువ ద్వారానే దైవపిలుపును, చిత్తాన్ని అర్థం చేసుకోగలం – నేడు మనలో ఉన్న సమస్య ఏమిటంటే, దైవచిత్తం అంటే మన జీవితంలో కేవలం సుఖం, విజయం, వ్యక్తిగత సంతోషం అని చాలామంది భావిస్తున్నాము. అందుకే కష్టాలు, నిరుత్సాహం వచ్చినప్పుడు సానుభూతి, ఓదార్పుకు నోచుకోలేక నిరాశ పడుతున్నాము. ఫ్రాన్సిస్ గారు తమ పిలుపును, సిలువలో వ్రేలాడుతున్న క్రీస్తు ప్రతిమ నుండే అర్థం చేసుకున్నారు. దైవచిత్తాన్ని అన్వేషించాలంటే, అది క్రీస్తు యొక్క త్యాగం, బాధ, పేదరికం యొక్క మార్గం గుండా వెళుతుందని మనం గ్రహించాలి. నిజమైన దైవచిత్తం ఎల్లప్పుడూ స్వీయ-త్యాగాన్ని కోరుతుంది. మన జీవితంలో ఎదురయ్యే కష్టాలను, నిరుత్సాహాలను సిలువలో క్రీస్తు భాగస్వామ్యంగా చూడాలి. మన బాధలను కేవలం వ్యక్తిగత సమస్యగా కాకుండా, క్రీస్తు యొక్క దైవచిత్తానికి విధేయత చూపడానికి ఒక అవకాశంగా భావించాలి. దైవచిత్తం ప్రకారంగా జీవించడంలో ఉన్న ఆనందం, లోకాశలలో, సౌకర్యాలలో ఉండదు; ఆ ఆనందం మన సమర్పణలో ఉంటుంది! ఈ విధంగా, పునీత ఫ్రాన్సిస్ గారిని ఆదర్శంగా తీసుకోవడంద్వారా, మనం కోరికల వలయం నుండి బయటపడి, దైవచిత్తాన్ని అన్వేషించడంలోనూ, ఆచరించడంలోనూ ఉండే నిజమైన ఆనందాన్ని అనుభవించగలం.

5. ఫ్రాన్సిస్‌: ప్రకృతి ప్రేమికుడు

ఫ్రాన్సిస్‌ ప్రకృతి ప్రేమికులు. ప్రకృతిద్వారా దేవుని మహిమను పొగడేవారు. ప్రకృతిపట్ల గాఢమైన ప్రేమనుగౌరవాన్ని పెంచుకున్నారు. ప్రకృతిలోని సమస్తములో దేవుని సాన్నిధ్యాన్ని చవిచూసారు. సమస్తమును తన సహోదరీసహోదరులుగా పిలిచారు. నేడు మనం కూడా ప్రకృతి పట్ల ప్రేమనుదాని నాశనమును కోరుకొనక అభివృద్ధిని కోరుకొనేట్టు జీవించే అవసరం ఎంతగానో ఉంది. పునీత అస్సీసిపుర ఫ్రాన్సిస్ గారి దృష్టిలో, ప్రకృతి కేవలం ఒక వనరు లేదా ఒక దృశ్యం కాదు; అది దేవుని మహిమను, మంచితనాన్ని ప్రతిబింబించే ఒక జీవన దేవాలయంగా భావించారు. ఆయన ప్రకృతిని చూసే విధానం, లోకానికి ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక పాఠాన్ని అందించింది.

మొదటిగా, ప్రకృతి ద్వారా దేవుని మహిమను కీర్తించాలి - ఫ్రాన్సిస్ గారు ప్రకృతిలోని సమస్తములో దేవుని సాన్నిధ్యాన్ని చవిచూశారు. ఒక పుష్పం, పారే నది లేదా మెరిసే నక్షత్రంప్రతిదీ దేవుని ప్రేమ యొక్క చిహ్నంగా, దేవుని హస్తకళగా వారికి కనిపించింది. దీనికి బైబులునే ప్రేరణగా తీసుకున్నారు. ఆదికాండము మొదటి అధ్యాయంలో చెప్పబడిన విధంగా దేవుడు సమస్తమును సృష్టించి, అది ‘మంచిది’ అని పలికారు. అలాగే 148వ కీర్తనలో, సృష్టి అంతా ప్రభువును స్తుతించాలని చెప్పబడింది. సృష్టిలో ఉన్న సమస్తాన్ని సోదరుడు, సోదరీ అని సంబోధించడం ద్వారా, దేవుని సృష్టిలో ఉన్న ఏకత్వాన్ని, సహోదరత్వాన్ని దృఢముగా నమ్మారు. మనం ప్రకృతి నాశనమును కోరుకొనక అభివృద్ధిని కోరుకోవాలి. ప్రకృతి నాశనానికి ప్రధాన కారణం మన వినియోగ సంస్కృతి. మనం నిరంతరం ఎక్కువ కావాలని, కొత్తవి కావాలని కోరుకుంటాం. ఈ కోరికలను తీర్చడానికి పరిశ్రమలు, ఫ్యాక్టరీలు భూమి వనరులను అత్యంత వేగంగా దోచుకుంటాయి. ఫ్రాన్సిస్ గారు జీవించిన పేదరికం, నిరాడంబర జీవనం దీనికి ఒక సమాధానం అని చెప్పవచ్చు. తక్కువ వాడుకోవడం, అవసరానికి మించి కోరుకోకపోవడం అనేది ప్రకృతిపై ఒత్తిడిని తగ్గిస్తుంది. మనం వనరులను ‘సమస్య’గా కాకుండా, దేవుడిచ్చిన ‘వరం’గా చూసినప్పుడే వాటిని గౌరవించగలం. నిజమైన అభివృద్ధి అనేది ఎంత సంపాదించాం అనేదానిపై కాదు, ఎంత త్యాగం చేశాం, ఎంత సమతుల్యంగా జీవించాం అనేదానిపై ఆధారపడి ఉంటుంది. అభివృద్ధిని కోరుకోవడం అంటే ప్రకృతిని దోచుకోవడం కాదు, దానికి సంరక్షకులుగా ఉండడం.

6. ఫ్రాన్సిస్‌: శాంతిదాత

ఫ్రాన్సిసువారు తన జీవితముద్వారా ఈ లోకాన్నే మార్చేసారు. యుద్ధాలు, విద్వేషాలు రాజ్యమేలుతున్న కాలంలో ప్రేమ, కరుణ, ధైర్యం అనే బలమైన ఆయుధాలతో ఈ లోకాన్ని మార్చారు. క్రూసేడుల కాలములో, శాంతిని నెలకొల్పుటకు మధ్యవర్తిగా ఫ్రాన్సిస్ ధైర్యముగా ఈజిప్టుకు వెళ్లి అక్కడి సుల్తానును కలిసారు. యుద్ధాన్ని ఆపాలని కోరారు. చరిత్రలో, పునీత ఫ్రాన్సిస్ గారు శాంతి కోసం చేసిన అత్యంత ధైర్యమైన చర్యలలో ఒకటి, క్రీ.శ. 1219లో ఈజిప్ట్‌కు ప్రయాణించడం మరియు అక్కడ ఉన్న సుల్తాన్ అల్-కామిల్‌ను కలవడం. ఆ సమయంలో క్రైస్తవులు మరియు ముస్లింల మధ్య క్రూసేడుల పేరిట తీవ్రమైన యుద్ధాలు జరుగుతున్నాయి. రెండు వర్గాలు విద్వేషంతో, హింసతో రగిలిపోతున్న సమయమది. ఈ ప్రమాదకర పరిస్థితుల్లో, ఫ్రాన్సిస్ గారు యుద్ధాన్ని ఆపడానికి, మరియు క్రీస్తు సువార్తను ప్రేమపూర్వకంగా ప్రకటించడానికి నిరాయుధుడిగా శత్రు శిబిరంలోకి వెళ్లారు. ఆయన శక్తిని, ఆయుధాన్ని నమ్ముకోలేదు; దేవునిపై విశ్వాసాన్ని మరియు ప్రేమ శక్తిని మాత్రమే నమ్ముకున్నారు. సుల్తాన్ అల్-కామిల్‌తో ఫ్రాన్సిస్ గారు చేసిన సంభాషణ, పరస్పర గౌరవాన్ని మరియు మానవత్వాన్ని తెలియజేసింది. ఈ సంఘటన మతపరమైన తేడాలు ఉన్నప్పటికీ, సకల మానవాళిపట్ల ఫ్రాన్సిస్ వారికి ఉన్న అపారమైన ప్రేమ, కరుణను మరియు సంభాషణ పట్ల ఉన్న నిబద్ధతను తెలియజేస్తుంది. ఈ చర్య, లోకంలో సహోదరత్వం సాధ్యమేనని నిరూపించింది. ఈ సంఘటన సకల మానవాళిపట్ల ఫ్రాన్సిసువారికున్న ప్రేమ, కరుణను తెలియజేస్తుంది.

ఫ్రాన్సిస్ గారి శాంతి సందేశం కేవలం మాటల్లో లేదు; అది వారి ఆచరణలో, ధైర్యంలో మరియు ప్రార్థనలో ఉంది. ఫ్రాన్సిస్ గారి ‘శాంతి ప్రార్థన’ అనేది ఆయన ప్రపంచ శాంతిదూత అని చెప్పడానికి గొప్ప నిదర్శనం.

శాంతి ప్రార్ధన:

ప్రభువా! నీ శాంతి సాధనముగా నన్ను మలచుమయా!

ద్వేషమున్న చోట, ప్రేమను వెదజల్ల నీయుము

గాయమున్న చోట, క్షమాపణను చూప నీయుము

అవిశ్వాసమున్నచోట, విశ్వాసమును నింపనీయుము

నిరాశయున్నచోట, ఆశను పెంచనీయుము

అంధకారమున్నచోట, జ్యోతిని వెలిగింప నీయుము

విచారము నిండినచోట, సంతోషము పంచనీయుము

ఓ దివ్యనాధా,

పరుల ఓదార్పును వెదుకుటకంటె

పరులను ఓదార్చు వరము నీయుము

పరులు నన్ను అర్ధము చెసుకొన గోరుటకంటె

పరులను అర్ధము చేసుకునే గుణము నీయుము

పరులు నన్ను ప్రేమించాలని కోరుటకంటె

పరులను ప్రేమింప శక్తినీయుము

ఎందుకనగా,

యిచ్చుట ద్వారానే, పొందగలము

క్షమించుట ద్వారానే, క్షమింప బడగలము

మరణించట ద్వారానే, నిత్యజీవము పొందగలము.

ఈ ప్రార్థన కేవలం ప్రపంచంలో శాంతిని కోరుకోవడమే కాకుండా, అంతకంటే ముందు తనను తాను దైవ శాంతికి సాధనంగా మార్చమని దేవున్ని వేడుకోవడం. నిజమైన శాంతి బయటి పరిస్థితుల నుండి కాకుండా, మన హృదయాల నుండి మరియు మన చేతల నుండి మొదలవ్వాలని ఇది స్పష్టంగా బోధిస్తుంది. మన అంతరంగంలో శాంతిని స్థాపించుకున్నప్పుడే, మనం దానిని ఇతరులకు పంచగలం. ప్రార్థనలోని ప్రతి అంశం ద్వేషాన్ని ప్రేమతో జయించడం, గాయాన్ని క్షమించడం, నిరాశకు ఆశను అందించడం క్రీస్తు యొక్క గుణాలను  ప్రతిబింబిస్తుంది. ఈ లక్షణాలన్నీ సిలువ త్యాగం నుండి ఉద్భవించిన విమోచన శాంతిని తెలియజేస్తాయి. ఫ్రాన్సిస్ గారు తమ ప్రార్థనను ఆచరణలో చూపినందుకే ప్రపంచ శాంతిదూతగా గౌరవించబడుతున్నారు. అందుకు, ఆయన జీవితమే గొప్ప నిదర్శనం: ఫ్రాన్సిస్ గారు యుద్ధాన్ని నమ్మకుండా, ప్రేమను, సేవను నమ్మారు. శత్రువులను ద్వేషించమని కాకుండా, కౌగిలించుకోమని బోధించారు. ఈ దృఢ సంకల్పమే ఆయన్ను నిరాయుధుడిగా క్రూసేడుల సమయంలో ఈజిప్టు సుల్తానును కలవడానికి ధైర్యాన్ని ఇచ్చింది. ఇది సకల మానవాళి పట్ల ఆయనకు ఉన్న నిస్వార్థ కరుణను తెలియజేస్తుంది. అందుకే, నేటికీ మనం ఫ్రాన్సిసు గారిని కేవలం ఒక పునీతుడిగా కాకుండా, మన హృదయాలలో శాంతిని, సమతుల్యతను నెలకొల్పడానికి, ద్వేషాన్ని ప్రేమతో జయించడానికి నిరంతరం ప్రేరేపించే ఒక గొప్ప శాంతిదూతగా గౌరవిస్తున్నాము. ఆయన ప్రార్థన, ప్రతి విశ్వాసికి తమ జీవితాన్ని ఒక శాంతి వంతెనగా మార్చుకోవడానికి నిత్య మార్గదర్శకం.

ముగింపు:

          జీవితం ఒసగే సుఖసంపదలను ఒడిసి పట్టుకోవాలని పరుగులు తీస్తున్నప్పుడు, ఫ్రాన్సిస్ వారు క్రిందకు త్రోయబడ్డారు. అప్పుడు జీవితంలో ఏది విలువైనది, ఏది నిరుపయోగమైనది, ఏది శాశ్వతమైనది, ఏది అశాశ్వతమైనది? ఈ ప్రశ్నలు ఫ్రాన్సిస్ వారిని వెంటాడాయి. బానిసను వదిలి యజమానికి సేవ చేయడం మొదలు పెట్టారు. లోకాన్ని వీడి దేవునికి సేవ చేయడం ప్రారంభించారు. “క్రీస్తు లేకుండా ధనవంతునిగా ఉండుట కంటే, క్రీస్తు కొరకు నిరుపేదగా ఉండుట మేలు” అని ఫ్రాన్సిస్ గారు గ్రహించారు. అలాగే జీవించారు. “నన్ను అనుసరింపగోరువాడు, సమస్తమును అమ్మి పేదలకు దానము చేయుము. మీ సిలువను ఎత్తుకొని నన్ను అనుసరింప వలయును” అన్న క్రీస్తు ప్రభువు మాటలను అక్షరాల జీవించారు. క్రీస్తున పరిపూర్ణతలో అనుసరించిన క్రైస్తవుడు పునీత అస్సీసిపుర ఫ్రాన్సిస్ గారు. సార్వత్రిక సోదరభావంతో జీవించాడు. సృష్టిలో సకలం ఆయన సోదరీ సోదరులే! సకల సృష్టిలో దేవుని సాన్నిధ్యాన్ని చూడాలని ఫ్రాన్సిస్ లోకానికి నేర్పించారు. దెబ్బతిన్న భూమాతను, నయంచేయు స్పర్శను మనం అందించాలని ఫ్రాన్సిస్ గారి స్ఫూర్తి మనలను కోరుచున్నది.

          ఫ్రాన్సిస్ గారు కలలు కన్నారు. తన త్యాగమయ జీవితం ద్వారా, వాటిని సాకారం చేసుకున్నారు. వారు క్రీస్తుయందే జీవించారు. సంచరిచారు, ఉనికిని కలిగి యున్నారు. “క్రీస్తు వలె జీవించు’ అన్నది ఫ్రాన్సిస్ ఏకైక ధ్యాస. అలాగే జీవించారు. వారు పొందిన బాధలు వర్ణనాతీతం. వారి త్యాగం అమోఘం! అందుకే వారిని “రెండవ క్రీస్తు” అని పిలుస్తున్నాం.

          పునీత అస్సీసిపుర ఫ్రాన్సిస్ నడచిన మార్గంలో, ఆయనవలె విభిన్నంగా ఆలోచించుటకు నీవు ధైర్యం చేయగలవా? ఫ్రాన్సిస్ వారి వలె దేవుని పిలుపుకు స్పందించుటకు, దేవున్ని అన్వేషించుటకు సిద్ధంగా ఉన్నావా? ఫ్రాన్సిస్ గారివలె, మన కుటుంబాన్ని, మన సంఘాన్ని, శ్రీసభను, మన సమాజాన్ని, ఈ లోకాన్ని, పునర్నిర్మించుటకు, పునరుద్ధరించుటకు సాహసం చేయగలవా? ఫ్రాన్సిస్ వారి కలలను, వివిధ రకాల సేవలద్వారా, సాకారం చేయడానికి సిద్ధంగా ఉన్నావా?

          దేవుడు ప్రతీ ఒక్కరికి ఒక కలను కలిగియున్నారు. ఆ కలను సాకారం చేయడానికి మనలో ప్రతీ ఒక్కరిని ఆహ్వానిస్తున్నారు. ఈ లోక బాగుకోసం, శాంతి, ప్రేమ, న్యాయం, సామరస్యం కోసం కలలు కనడం నీకు ఇష్టమేనా? ఒక్క క్షణం ఆలోచించుదాం! రండి అందరం కలిసి దేవుని కలను నిజం చేద్దాం! ఫ్రాన్సిస్ వారి జీవన్ స్పూర్తితో, ప్రార్ధన సహాయంతో అసాధ్యమైనదానిని సుసాధ్యం చేద్దాం! మన నుండే ప్రారంభించి, ఈ లోకాన్ని మరింత మానవత్వం కలదిగా, మరింత అందముగా తయారు చేద్దాం!

ఓ పునీత ఫ్రాన్సిస్ గారా! మేము నీ వైపు చూస్తున్నాము, నిన్ను వేడుకుంటున్నాము:

సిలువ ముందు నిలబడి యుండడం ఎలాగో మాకు నేర్పించు.

సిలువ వేయబడిన క్రీస్తు దృష్టి మాపై పడేలా చేసి, ఆ చూపులో మేము లీనమైపోయేలా మాకు సహాయం చేయుము.

క్రీస్తు ప్రేమ ద్వారా మేము క్షమించబడేలా, నూతనంగా సృష్టించబడేలా మమ్మల్ని అనుమతించమని మాకు నేర్పించు. ఆమెన్.