పునీత మార్కుగారు వ్రాసిన సువార్త 16:15-16, యేసు తన శిష్యులతో ఇట్లనెను, “మీరు ప్రపంచమందంతట తిరిగి, సకలజాతి జనులకు సువార్తను బోధింపుడు. విశ్వసించి జ్ఞానస్నానము పొందువాడు
రక్షింపబడును. విశ్వసింపనివానికి దండన విధింపబడును.”
ప్రియ సహోదరీ సహోదరులారా! శ్రీసభ అక్టోబరు 19న ప్రపంచ వేదవ్యాపక ఆదివారమును లేదా మిషన్ సండేను జరుపుకుంటుంది.
‘వేద-వ్యాపకం’ అంటే
"జ్ఞానాన్ని/వేదాన్ని ముఖ్యంగా దైవజ్ఞానాన్ని సువార్తను విశ్వమంతట వ్యాపింప జేయడం’
అని అర్థం. ఇది ఒకరోజు చేసే కార్యం కాదు. మన జీవిత లక్ష్యం!
సువార్తా వ్యాప్తి, ప్రతి ఒక్కరి బాధ్యత! సువార్త వ్యాప్తి అనేది
కేవలం సేవకుల బాధ్యత అనగా గురువుల, ఉపదేశకుల బాధ్యత మాత్రమే కాదు. సువార్త
వ్యాప్తి ప్రతి విశ్వాసి యొక్క బాధ్యత. పేతురు, యోహానులు పలికిన
మాటలను గుర్తుచేసుకుందాం, అ.కా. 4:20 – “మేము మా కన్నులార చూచిన దానిని గూర్చి,
చెవులార విన్న దానిని గూర్చి మాట్లాడకుండ ఉండలేము”. ఎట్టి పరిస్థితులలోనైన
సువార్తను ప్రకటించాలనే వారి తపనను మనం చూడవచ్చు! కనుక, సువార్తను వ్యాపింప జేయడంలో
మనలో ప్రతి ఒక్కరమూ భాగస్వాములం కావాలి. ఈ పరిశుద్ధ కార్యంలో పాల్గొనడంద్వారా,
సహాయ సహకారాలు అందించడం ద్వారా, దేవుడు మనకు అప్పగించిన
బాధ్యతను నెరవేర్చినవారం అవుతాం. దేవునియందు విశ్వాసంతో, మనం
క్రీస్తుకు సాక్షులుగా జీవించినవారం అవుతాం. క్రీస్తుప్రభువును విశ్వసించి,
జ్ఞానస్నానము తీసుకొని, సత్ప్రసాదమును
స్వీకరించి, క్రీస్తు సాక్షులుగా జీవించేలా ప్రార్థిస్తూ,
మన వంతు కృషి చేద్దాం. ప్రతి ఒక్కరమూ వ్యక్తిగతంగా సువార్తా
వ్యాప్తిలో పాలుపంచు కోవాలి. దేవుని ప్రేమ, క్షమాపణ, దయ కలిగి జీవించాలి. ఎందుకంటే, సువార్త వ్యాప్తి అనేది దయ, సేవ మరియు
పునరుద్ధరణ కార్యం.
సువార్త వ్యాప్తి మన విశ్వాసానికి కొత్త ఉత్తేజాన్నిస్తుంది అని
పునీత రెండవ జాన్ పాల్ గారు చెప్పియున్నారు. సువార్త ప్రకటించడం ద్వారా మన సొంత
విశ్వాసం బలపడుతుంది. కనుక, ముందుగా, దేవుని సందేశాన్ని విశ్వాసంతో
స్వీకరిద్దాం. పరమ తండ్రి దేవుడు తన ఏకైక కుమారుడైన క్రీస్తును మనకోసం ఈ లోకానికి
పంపి, మనవలె సామాన్య మానవునిగా
జీవింపజేసి, మన పాపముల కొరకై ఆయన ప్రాణాన్ని సిలువపై బలియాగముగా
అర్పించారు. ఆయన మన యెడల చూపిన అపారమైన ప్రేమ, దయ, క్షమాపణ, కనికరాన్ని మనం తప్పకుండా గుర్తించాలి. క్రీస్తు
ప్రభువు ఇచ్చిన “మీరు ప్రపంచమందంతటా తిరిగి సకల జాతిజనులకు సువార్తను బోధింపుడు” అన్న
ఈ సందేశాన్ని, మనమందరం విశ్వాసంతో స్వీకరించాలి. ఈ బాధ్యతతో సువార్తా వ్యాప్తి
పనిలో ఆనందంగా పనిచేస్తూ, నిజ దేవుడు ఎవరో తెలియని వారందరికీ
సువార్తను ప్రకటిద్దాం. సువార్తను ఎప్పుడూ సంతోషంతో మరియు
ఆనందంతో ప్రకటించుదాం.
సేవకుల పట్ల, సువార్త బోధకుల పట్ల, గౌరవం మరియు సహకారం చూపాలి. సువార్తా
పరిచర్య అనేది దేవుని ఇష్టానుసారంగా జరుగుతుంది. దేవుడు నియమించిన సువార్తికులు, సేవకులు, గురువులు, ఉపదేశకులు, మఠవాసులు మొదలైనవారు అభిషిక్తులైన వ్యక్తులు.
వీరు సువార్త పరిచర్యకై తమను తాము అర్పించుకున్నారు. వీరు తరచుగా కష్టాలు, తిరస్కారములు, అపనిందలు ఎదుర్కొంటారు, కొందరు హతసాక్షులవుతున్నారు, హింసింపబడుతున్నారు. “విశ్వాసం కొరకు చనిపోవడం కొందరికి బహుమానం, విశ్వాసంతో జీవించడం అందరికీ పిలుపు” అని పునీత రెండవ జాన్ పాల్ గారు
అన్నారు.
“సువార్తికులు, గురువులు, మఠవాసులు తమ కుటుంబాన్ని, సుఖాలను వదులుకుని,
తమ జీవితాలను ప్రభువు చేతుల్లో ఆయుధాలుగా అర్పించుకున్నారు. వారు
మనకు కేవలం బోధకులు మాత్రమే కాదు, విశ్వాస వీరులు.” అందుకే మనం ఈ సేవకుల పట్ల గౌరవభావం కలిగి ఉండాలి. వారిని ఆదరించి
ప్రేమించాలి. సువార్తా పరిచర్య సాగించడానికి అవసరమైన సహాయ సహకారాలను మన వంతుగా వారికి
అందించాలి. మన వంతుగా వారికి పరిస్థితులకు అనుగుణంగా, అవసరాన్ని బట్టి, ఆర్థిక
సహాయము అందించడం ధన్యతగా భావించాలి. వారి ప్రార్థనల ద్వారా మనం ఆశీర్వాదాలు పొందగలము,
స్వస్థతను పొందగలము. అయితే, నిజమైన బోధను,
సువార్త పరిచర్యను, దేవుని నడిపింపులో ఉన్న బోధకులను, పరిశుద్ధాత్మ నడిపింపు
ద్వారా మనం గ్రహించగలగాలి.
సువార్తా వ్యాప్తి అంటే చాలా ఖర్చుతో కూడిన పని కాబట్టి, మన గుప్పెళ్ళను విప్పి, సహాయం
చేసే హృదయాన్ని కలిగి ఉండాలి. అటువంటి వారికి దేవుని
ఆశీర్వాదాలు తప్పక అందుతాయి. ప్రపంచ వేదవ్యాపక ఆదివారంరోజున తల్లి
శ్రీసభ ద్వారామిషనరీలకు, అనగాదూర ప్రాంతాలలో
పనిచేస్తున్న క్రీస్తు సువార్త సేవకులకు ఆర్థిక సహాయం అందించడానికి పిలుపు
నిస్తుంది. ఈ రోజు మనం ఇచ్చే ప్రతి చిన్న విరాళం కూడా, దేవుని
రాజ్యాన్ని విస్తరించడంలోఎంతగానో
సహాయపడుతుందనిగుర్తుంచుకుందాం!
సువార్తా పరిచర్య అనేది దేవుని ఇష్టప్రకారముగా జరుగుతుంది. సువార్త
పరి చర్య చేసేవారిని, దేవుడు నియమించిన
వ్యక్తులుగా మనం భావించి, గౌరవించి, వారిని
ఆదరించి, ప్రేమించి, సువార్తా పరిచర్య
జరపడానికి మన వంతు, సువార్తా వ్యాప్తికై, కావలసిన సహాయమును, సేవలను అందించగలగాలి. స్వయముగా,
దేవుని పరలోక రాజ్య పరిచర్యలో, సకల మానవాళీ, నిజ దేవున్ని
తెలుసుకొని, పరలోక రాజ్యమున ప్రవేశము పొందుకొనుటకై, పని చేయు సేవకుల యెడల, మనము గౌరవభావమును కలిగి
ఉండాలి. ప్రతి వ్యక్తి సహాయ సహకారములను, సేవలో అభిశక్తులకు
అందించాలి. ఆ విధముగా దేవుని పరిచర్య చేసే వారికి, దేవుని
వాక్కును బోధించే వారికి, భోజనమును పెట్టుట ధన్యతగా
భావించాలి. దేవుని ఆజ్ఞచే అధికారం ఇచ్చిన అభిషిక్తులైన సేవకులను, మన గృహములకు ఆహ్వానించి, వారు ఒసగు శాంతి
సమాధానములను, దేవుని ఆత్మచే, వారు
ప్రార్థించే ప్రార్థన ద్వారా, మనము, ఆశీర్వాదములు
పొందుకోవాలి.
దేవుని సేవకులు మన బాధలను ఆలకించి, వారు చేయు ప్రార్థన ద్వారా, మనకు స్వస్థతలను
దయచేయగలరు. మన వద్దకు, అనగా మన గ్రామమున ఉన్న దేవాలయమునకు
వచ్చి, దేవుని సువార్త బోధకులు పరిచర్య చేస్తున్నారంటే,
దేవుని రాజ్య విస్తరణకు, దేవుని ప్రణాళికను
నెరవేర్చుటకు, దేవుని కార్యము ఉంది. దేవుడు మన గ్రామమునకు,
మన యొద్దకు పంపిన ఆయన శిష్యులను మనము, గౌరవించి,
ఆదరించి, ప్రేమించి, వారి
బోధనలను ఆలకించి, దేవుని రాజ్యమున మనము ప్రవేశించడానికి,
దేవుని వాక్కును మనము అనుసరించి, దేవుని
సాక్షులమై దేవుని యందు విశ్వాసముతో జీవించగలగాలి.
సువార్తా పరిచర్య రక్షణ మరియు నిత్య జీవంనకు నడిపిస్తుంది. సువార్తా
పరిచర్య లేకపోతే, నిజ దేవుడు ఎవరో,
సత్యం ఏమిటో సర్వమానవాళికి తెలియదు. అందుకే సువార్తికులు చాలా
ప్రధానం. దేవుని యందు విశ్వాసము కలిగించి, రక్షణను ఇచ్చేదే సువార్త వ్యాప్తి. మన జీవితం ఈ లోకంతో మాత్రమే
ముగిసిపోదు. మన మరణానంతరం దేవుని రాజ్యమైన పరలోక రాజ్యంలో నిత్యజీవం ఉంటుంది. ఈ
సత్యాన్ని మనం చాటాలి. క్రీస్తు ప్రభువు మొదటిసారిగా పదనొకండుగురు శిష్యులను
ప్రపంచమంతటా తిరిగి సకల జాతిజనులకు సువార్తను బోధింపుడు అని, తన శిష్యులను సువార్తికులుగా పంపించడానికి ప్రధాన కారణం, సృష్టిలో మానవులలో, ఏ ఒక్కరూ నశించి పోకుండా,
నిజ దేవున్ని గూర్చి తెలియజేయటానికి, వారిని
లోకములోనికి పంపించారు.
ప్రియ సహోదరీ సహోదరులారా! సువార్త వ్యాప్తి అంటే కేవలం సేవకులకు సహాయం
చేయడం మాత్రమే కాదు, మనం రోజువారీ జీవితంలో
ఎలా పాలుపంచుకోవచ్చో స్పష్టంగా తెలియజేయడం ముఖ్యం:
వ్యక్తిగత సాక్ష్యం: సువార్తను
మన మాటల ద్వారానే కాదు, మన జీవన విధానం ద్వారా
కూడా చాటాలి. క్రీస్తు మనలో జీవిస్తున్నారని మన ప్రవర్తన, ప్రేమ,
నిజాయితీ ద్వారా ఇతరులు గుర్తించాలి. వ్యక్తిగత సాక్ష్యానికి గొప్ప
ఉదాహరణ సమరయ స్త్రీ! కేవలం ఒక్క సంభాషణ ద్వారా తన గ్రామం మొత్తానికి క్రీస్తును
పరిచయం చేసింది. ఇది!
కేవలం
బోధించడం మాత్రమే కాదు, క్రీస్తు ప్రేమను
కార్యాల ద్వారా చూపడం. పేదలకు, రోగులకు, ఒంటరివారికి సేవ చేయడం ద్వారా సువార్తను ఆచరించడం. “మీ మంచి క్రియలను చూసి,
పరలోకంలో ఉన్న మీ తండ్రిని మహిమపరచాలి” అని మత్తయి
5:16లో చదువుచున్నాం. కనుక, మాటల కంటే ముందు మన క్రియల ద్వారా క్రీస్తును
ప్రకటించుదాం. సువార్త వ్యాప్తి అంటే ఎప్పుడూ పెద్ద ప్రసంగాలు ఇవ్వడం కాదు. అది
చిన్న చిన్న క్రియల ద్వారా కూడా సువార్త వ్యాప్తి చేయవచ్చు! మన చుట్టూ ఉన్న వారి
దృష్టిలో, నిత్యం మన క్రియల ద్వారా క్రీస్తు ప్రేమను
ప్రతిబింబించాలి. ఉదాహరణకు, మీరు పనిచేసే ఆఫీసులో, బస్సులో
లేదా మీ పొరుగువారితో - మీనిజాయితీ,
ఓర్పు, మరియుక్షమించే
గుణంఇతరులను కదిలించే విధంగా ఉండాలి. క్రియల ద్వారా
క్రీస్తు ప్రేమను చూపించవచ్చని, సువార్త వ్యాప్తి చేయ వచ్చని పునీత మదర్ థెరిస్సా
గారి జీవితం మనందరికీ చక్కటి ఉదాహరణ మరియు ఆదర్శం! పునీత పౌలుగారి సువార్తా జీవితం
కూడా మనదరికి గొప్ప స్ఫూర్తి, ఆదర్శం. సువార్త వ్యాప్తి కోసం ఆయన చూపిన ధైర్యం,
సమర్పణ మరియుసహనం అసాధారణం.
అన్యజనులకు సువార్తను ప్రకటించాడు. సువార్తను ప్రకటించే క్రమంలో ఎన్నో దుర్భరమైన
కష్టాలను అనుభవించాడు. వీటన్నింటిని, పౌలుగారు ధైర్యంగా, ఆనందంగా భరించారు.
“వెళ్లండి,
లోకానికి అగ్నిని రాజేయండి” అని పునీత
ఇగ్నేషియస్ ఆఫ్ లోయోలా గారు అన్నారు. కనుక, మన సాక్ష్యం ఉత్సాహంతో ఈ లోకంలో మార్పు
తీసుకురావాలనే మన పిలుపును గ్రహించాలి. అయితే, మనలో కొందరు దూర ప్రాంతాలకు వెళ్లలేకపోవచ్చు.ఈ రోజు
నేను ఎక్కడ ఉన్నాను? నా కుటుంబాన్ని, నా
ఆఫీసును, నా ఇరుగుపొరుగువారిని నా 'ప్రపంచంగా'
నేను భావిస్తున్నానా? నా ప్రస్తుత స్థలంలో నేను క్రీస్తు ప్రేమను ఎలా
ప్రకటించగలను? అని ఆత్మపరిశీలన చేసుకుందాం!
ప్రార్థన: మన ఇంటిని, పని చేసే స్థలాన్ని, స్నేహితుల
సమూహాన్ని సువార్త వ్యాప్తి కోసం ప్రార్థనా కేంద్రాలుగా మారుద్దాం. మిషన్ లేదా
ప్రేషితం అంటే మన చుట్టూనే, వేరే దేశాలకు వెళ్లడం మాత్రమే మిషన్ కాదు, మన కుటుంబంలో, మన పని ప్రదేశంలో, మన సమాజంలో సువార్తను జీవించడం. మనం ఎక్కడ ఉన్నా, అక్కడే
క్రీస్తును ప్రతిబింబించాలి. “మనం అలసిపోకుండా
ప్రార్థన చేయాలి, ఎందుకంటే మానవజాతి రక్షణ అనేది భౌతిక
విజయం మీద ఆధారపడదు... కేవలం యేసుక్రీస్తుపై మాత్రమే ఆధారపడుతుంది” అని పునీత
ఫ్రాన్సిస్ జేవియర్ అన్నారు. మిషనరీలకు ప్రార్థన, దైవశక్తి ఎంతో అవసరం కనుక వారి కొరకు నిత్యం ప్రార్ధన చేద్దాం!
మనమందరము కూడా జ్ఞానస్నానం, దివ్యసప్రసాదం
స్వీకరించి, దేవునియందు భక్తి విశ్వాసములతో, దేవుని సాక్షులుగా జీవిస్తూ రక్షింపబడదాం. ప్రతి దినం ఆ దేవునికి ఈ విధంగా
ప్రార్థించుకుందాం ముఖ్యంగా సుదూర ప్రాంతాలలో లేదా సువార్త వినని మరుగున పడిన
జాతుల మధ్య పనిచేస్తున్న మిషనరీల కోసం మనం ప్రత్యేకంగా ప్రార్థించాలి, వారికి తోడ్పాటు అందించాలి. లోకంలో సువార్తను ప్రకటించే మిషనరీలందరి కోసం మనం ప్రార్థించాలి.
వారికీ ధైర్యాన్ని, శక్తిని, రక్షణను, సరైన మార్గదర్శకత్వాన్ని ఇవ్వమని
దేవుణ్ణి వేడుకోవాలి. కేవలం ప్రార్థించడమే కాదు, సువార్త సేవలో మనం భాగస్వాములు కావాలి. మనకున్న ధన సహాయం, సమయాన్ని, ప్రతిభను సేవ కోసం అంకితం చేయాలి.
ప్రతి ఒక్కరిలో దేవుని ప్రేమను పంచడానికి మనం కృషి చేయాలి.
సువార్త వ్యాప్తిని కేవలం మానవ ప్రయత్నంగా కాకుండా, దైవిక ప్రేరేపిత కార్యంగా స్పష్టం చేయాలి. ప్రపంచమంతటా
తిరిగి సువార్తను ప్రకటించే ధైర్యాన్ని, జ్ఞానాన్ని ప్రభువు పరిశుద్ధాత్మ
ద్వారా మనకు అనుగ్రహిస్తారు. సువార్తను బోధించే శక్తి మన సొంత జ్ఞానం కాదు,
అది పరిశుద్ధాత్మ దేవుని శక్తి. సువార్త
ఫలించడానికి, ప్రజల హృదయాలు మార్పు చెందడానికి పరిశుద్ధాత్మ
నడిపింపు కోసం నిరంతరం ప్రార్థించాలి.
అనేకులైన అన్యులు నిజ దేవుడైన యేసుక్రీస్తు ప్రభువును తెలుసుకోకుండా
నశించిపోతున్నారు. ఆ విధంగా జరుగకుండా ప్రతి ఒక్కరూ క్రీస్తు ప్రభువును విశ్వసించి, అనుసరించి, చివరకు నిత్యజీవంలో
ప్రవేశించులాగున ఆ దేవున్ని వేడుకుందాం. మన వంతు మనం సువార్తా వ్యాప్తికై పనిచేసి,
కొన్ని ఆత్మలను రక్షించుదాం. దేవుని ప్రేరణ, ఆత్మ
నడిపింపు మనకు తోడై యుండులాగున ప్రార్థించుకుందాం.
“ఈ రోజు నుండి, నేను
క్రీస్తునునా మాటలలోమరియునా చేతలలోప్రతిబింబిస్తాను”
అని గట్టిగా కోరుకుందాం!
ప్రియమైన సహోదరీ సహోదరులారా! ఈప్రపంచ వేదవ్యాపక ఆదివారంరోజున
మనం కేవలం మాటలు చెప్పడం కాదు, నిర్ణయంతీసుకుందాం!
1. ప్రార్థన
ద్వారా:నిత్యం మిషనరీల కొరకు, సువార్త
ప్రకటించ బడని ప్రాంతాల ప్రజల కొరకు ప్రార్థన చేద్దాం!
త్యాగం ద్వారా:వేదవ్యాపక
ఆదివారం సందర్భంగా మన వంతుఆర్థిక
సహాయాన్నివారికి అందించి, వారి
సేవలో భాగస్వాములమవుదాం!
3. జీవితం
ద్వారా:క్రీస్తును కేవలం ఆదివారం మాత్రమే కాదు, సోమవారం
నుండి శనివారం వరకు మన ప్రతి క్రియలో, ప్రతి మాటలోసాక్షులుగాజీవిద్దాం!
కనుక, పునీత
ఇగ్నేషియస్ ఆఫ్ లోయోలా అన్నట్లు, 'వెళ్లండి, లోకానికి
అగ్నిని రాజేయండి!అన్న మాటలకు, మన జీవితాలే సువార్త కావాలని
కోరుకుందాం!
లాటరన్ దేవాలయ ప్రతిష్ట పండుగ (9 నవంబరు) యెహెజ్కే 47:1-2, 8-9, 12; 1 కొరి 3:9-11, 16-17; యోహా 2:13-22 “క్రీస్తే నిజమైన దేవాలయము”
ఈ రోజు, నవంబర్ 9న, మనం రోములోని అత్యంత పురాతనమైన, అత్యంత ప్రతిష్టాత్మకమైన దేవాలయం ‘లాటరన్
దేవాలయ ప్రతిష్ఠాపన పండుగ’ను ప్రపంచవ్యాప్తంగా జరుపుకొంటున్నాము.ఇది కేవలం ఒక కట్టడం యొక్క
వార్షికోత్సవం కాదు, మన విశ్వాసం యొక్క పునాదిని గుర్తుచేసే
ముఖ్యమైన వేడుక.
రోమ్
నగరంలో, చాలామంది అనుకునేపునీత
పేతురు దేవాలయంకంటే ముందు, లాటరన్
దేవాలయమే పోప్ యొక్క అధికారిక కేథడ్రల్. ఇది రోము బిషప్గా పోప్ యొక్క ‘సింహాసనం’.
అందుకే దీనిని గర్వంగా, ప్రపంచంలోని
అన్ని దేవాలయాలకు ‘తల్లి’ మరియు ‘అధిపతి’ అని పిలుస్తారు. దీనిని ఎందుకు ఇలా
పిలుస్తున్నారంటే, క్రైస్తవ మతానికి స్వేచ్ఛ లభించిన
తరువాత, భూమిపై చట్టబద్ధంగా నిర్మించబడిన
మొట్టమొదటి బృహద్దేవాలయంఇదే. దీని ప్రతిష్ఠాపన (క్రీ.శ. 324, పోప్ సిల్వెస్టర్ ద్వారా) రోము బిషప్గా పోప్ యొక్క ఆధ్యాత్మిక
అధికారాన్ని ప్రపంచానికి స్థిరపరిచింది. కాబట్టి, లాటరన్
అనేది ప్రపంచంలోని కతోలిక విశ్వాసానికిమాతృక,మూలస్థానంవంటిది.
ఈ దేవాలయ ప్రతిష్టను జరుపుకోవడం అంటే, మన విశ్వాసం యొక్క పునాదిని మరియు పోపు ద్వారా క్రీస్తు అందించేకేంద్ర అధికారాన్నిగుర్తించడమే!
చరిత్ర, దేవుని సంఘం యొక్క శాశ్వతత్వం: కాన్స్టాంటైన్ చక్రవర్తి క్రీ.శ. 313లో ‘మిలాన్ శాసనం’ ద్వారా క్రైస్తవులకు మత స్వేచ్ఛను ఇచ్చిన తరువాత,
ఆయన లాటరన్ ప్యాలెస్ను పోప్ మిల్టియాడెస్కు
దానం చేశారు. ఆ స్థలంలోనే మొదటి బసిలికా లేదా దేవాలయము నిర్మించ బడింది. క్రీ.శ. 324
నవంబర్ 9న పోప్ సిల్వెస్టర్ ప్రతిష్టించారు. మొదట్లో దీనిని ‘క్రీస్తు రక్షకుని దేవాలయం’గా
ప్రతిష్టించారు. తరువాత సెయింట్ జాన్ ది బాప్టిస్ట్ మరియు సెయింట్ జాన్ ది
ఎవాంజిలిస్ట్ పేర్లు కూడా జోడించ బడ్డాయి.
శతాబ్దాల అణచివేత తర్వాత మత స్వేచ్ఛకు ఇది ఒక అద్భుతమైన చిహ్నం. ఈ
దేవాలయం ఎన్నిసార్లు కూలిపోయినా, ఎన్ని ప్రకృతి విపత్తులు వచ్చినా,
దానిని పునర్నిర్మించారు. ఇది దేవుని సంఘం
యొక్క శాశ్వతత్వాన్ని, క్రీస్తుపై స్థాపించబడిన శ్రీసభ యొక్క
అచంచలమైన విశ్వాసాన్ని సూచిస్తుంది.
పండుగ ఉద్దేశం: ప్రధానంగా, పోపు పీఠంతో మరియు ప్రపంచ కతోలిక
శ్రీసభ యొక్క ఐక్యతను, ప్రేమను తెలియజేయడానికి ఈ పండుగను
జరుపుకుంటారు. ఇది క్రైస్తవ మతానికి స్వేచ్ఛ లభించిన చారిత్రక సందర్భాన్ని మరియు శ్రీసభ
యొక్క కొనసాగింపును గుర్తు చేస్తుంది. లాటరన్ దేవాలయం పోపు యొక్క కేథడ్రల్ కాబట్టి,
ఈ పండుగ మనందరినీ క్రీస్తు ప్రతినిధి అయిన పోపుగారితో
మరియు శ్రీసభ అధికారంతో ముడిపెడుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కతోలిక సంఘం ఏకత్వం
యొక్క బంధాన్ని దృఢపరుస్తుంది.
ఈ పండుగ యొక్క అంతిమ సందేశం ఏమిటంటే, ఇటుకలు మరియు రాళ్లతో కట్టిన దేవాలయం కన్నా, ప్రతి విశ్వాసి హృదయం దేవుని నివాస స్థలంఅనే సత్యాన్ని ఇది మనకు గుర్తుచేస్తుంది. అపోస్తలుడైన పౌలు
చెప్పినట్లు, “మీరు దేవుని ఆలయమై యున్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించు చున్నాడనియు మీరు ఎరుగరా?”
(1 కొరి 3:16).
దేవాలయం నుండి ప్రవహించే జీవజలాలు (యెహెజ్కేలు 47):ప్రవక్తయెహెజ్కేలుచూసిన దర్శనాన్ని ఈ పండుగ మనకు గుర్తుచేస్తుంది. ఆయన చూసిన దర్శనంలో,
నూతన దేవాలయం నుండి జీవజలాలు ప్రవహించి,
ఎర్ర సముద్రాన్ని సైతం శుద్ధి చేసి, దాని తీరాన ఫలించే వృక్షాలను పెంచుతాయి. ఈ జీవజలాలుబాప్టిజంద్వారా మనం క్రీస్తు సంఘంలోకి ప్రవేశించడాన్ని సూచిస్తాయి. క్రీస్తు
నుండి ప్రవహించే కృప మరియు పవిత్రాత్మ యొక్కజీవజలాలేశ్రీసభ ద్వారా ప్రపంచానికి శుద్ధిని, జీవితాన్ని అందిస్తాయి. ఈ కృపను మనం అందుకున్న తరువాత, మన హృదయాల నుండి కూడా క్రీస్తు ప్రేమ ఇతరులకు ప్రవహించాలి.
క్రీస్తే అసలైన దేవాలయం (యోహాను 2:13-22):యేసు దేవుని ఆలయాన్ని శుద్ధి చేసిన సంఘటనను ఈ పండుగ గుర్తు
చేస్తుంది. అప్పుడు ఆయన, “ఈ దేవాలయాన్ని పడగొట్టండి, నేను
మూడు రోజుల్లో దీనిని తిరిగి నిర్మిస్తాను” అని చెప్పారు. క్రీస్తు ఇక్కడ తనశరీరంగురించే
మాట్లాడుతున్నారు. అంటే, ఇటుకలతో కట్టిన భవనం కన్నా, క్రీస్తు
శరీరమేఅసలైన మరియు అంతిమ దేవాలయం. భౌతిక దేవాలయ భవనాలు
కేవలం ప్రార్థనా స్థలాలు మాత్రమే; కానీక్రీస్తు
శరీరంలో భాగమైన విశ్వాసుల సమూహమేనిజమైన
దేవాలయము. మనందరం “జీవముగల రాళ్ళు”గా క్రీస్తు
అనే మూలరాయిపై నిర్మించబడిన ఆత్మీయ గృహము.
ఈ పవిత్రమైన రోజున, లాటరన్ దేవాలయం యొక్క ప్రతిష్టను
జరుపుకుంటూ, మన హృదయాలను పరిశుద్ధంగా ఉంచుకోవాలని,
దేవుని ఆత్మ మనలో నివసించడానికి తగిన ఆలయంగా
మార్చుకోవాలని ప్రార్థిద్దాం. విశ్వశ్రీసభకు మరియు మన మేత్రానులకు విధేయత చూపుతూ,
క్రీస్తు ప్రేమను మన జీవితాల ద్వారా
ప్రతిబింబిద్దాం.
కతోలిక సంప్రదాయంలో, అత్యంత ప్రాముఖ్యమైన
ప్రార్ధనలలో జపమాల ఒకటి. మరియమాత మధ్యవర్తిత్వం ద్వారా, యేసుక్రీస్తు
జీవితం, మరణం, పునరుత్థాణ పరమ
రహస్యాలను లోతుగా ధ్యానిస్తున్నాం. ప్రార్ధనలలో శక్తివంతమైన ప్రార్ధన జపమాల.
అక్టోబరు7న, కతోలిక విశ్వశ్రీసభ, దేవుని
యెడల విధేయత, విశ్వాసం, అనుగ్రహం, ధన్యత కలిగిన “జపమాల మాత” పండుగను మనం ఎంతో భక్తిశ్రద్ధలతో, సంతోషంతో జరుపుకుంటున్నాము. జపమాల ప్రార్ధన శక్తిని, జపమాల భక్తి మాధుర్యాన్ని,
అలాగే మన విశ్వాస ప్రయాణంలో మరియతల్లి నడిపింపును మనకు ఈ పండుగ తెలియజేస్తుంది.
భక్తి మార్గాలలో జపమాల గొప్ప అందమైన, మధురాతి మధురమైన భక్తిమార్గం.
క్రైస్తవ కతోలిక విశ్వాసానికి సంక్షిప్త రూపమే జపమాల. ఈ విశ్వాసాన్ని
తన హృదయం నిండా నింపుకున్న మహా ఘనురాలైన మరియమాత ద్వారా యేసు ప్రభువును
చేరుకోగలిగే అద్భుతమైన మార్గం ఈ జపమాల.
పునీత అల్ఫోన్సస్ ది లిగోరి గారు చెప్పిన మాటలను గుర్తుకు చేసుకుందాం,
“జపమాల భక్తి ప్రపంచానికి అపారమైన మేలు చేసిందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి
లేదు. ఎంతోమంది పాపము నుండి విముక్తి పొందారు. పవిత్ర జీవితం గడపడానికి మార్గం ఏర్పరచింది.
జపమాలను జపించేవారు, మంచి మరణంను పొందియున్నారు. జపమాలను హృదయపూర్వకంగా, మనస్సు లగ్నం చేసి చెప్పాలి” అని ‘ది గ్లోరీస్ ఆఫ్
మేరీ’ అనే తన ప్రసిద్ధ గ్రంథంలో స్పష్టంగా పేర్కొన్నారు. పునీత లిగోరి గారి
ఉద్దేశ్యం ఏమిటంటే, జపమాల కేవలం కొన్ని పదాల పునరావృతం కాదు,
అది క్రీస్తు జీవితంలోని ముఖ్యమైన రహస్యాల గురించి లోతుగా ధ్యానం
చేయడంలో సహాయపడే ఒక శక్తివంతమైన ప్రార్థన. ఈ ధ్యానం ద్వారానే మనం మన జీవితాలను
మార్చుకోగలుగుతాము మరియు దైవానికి మరింత దగ్గరవుతాము.
జపమాల భక్తి వలన కలుగుతున్న కొన్ని స్పష్టమైన ఉదాహరణలు మరియు
ప్రయోజనాలను తెలుసుకుందాం:
1. పాపాల నుండి విడుదల: “ఉదాత్తమైన
భక్తియైన జపమాల ద్వారా ఎంతోమంది పాపం నుండి విముక్తి పొందారు!” అని లిగోరి గారు
పేర్కొన్నారు. జపమాల ప్రార్థనలో నిమగ్నమైనప్పుడు, ఆ వ్యక్తి యొక్క మనస్సు క్రైస్తవ విశ్వాస రహస్యాలపై కేంద్రీకరిస్తుంది కనుక,
పాపపు ఆలోచనలు, కోరికల నుండి దృష్టి మరలి, మానస్సాక్షి ప్రక్షాళనకు అవకాశం కలుగుతుంది.
జపమాల పరిశుద్ధ జీవితానికి మార్గం. జపమాల ప్రార్థన మనలను పవిత్రమైన, దైవభక్తితో కూడిన జీవితం వైపు నడిపించడానికి సహాయపడుతుంది. దీనిని నిత్యం
జపించేవారు పరిశుద్ధతలో వృద్ధి చెందుతారు అనేసి మన నమ్మకం.
2. శోధనలపై విజయం: జపమాల ప్రార్థన చేసేవారు దేవుని సహాయంతో
శోధనల నుండి శక్తివంతంగా తమను తాము రక్షించుకోగలుగుతారు. పరిశుద్ధ మాత
సహాయం కోసం చేసే ఈ ప్రార్థన, సాతాను యొక్క పన్నాగాలు,
ప్రలోభాలనుండి దూరంగా ఉంచడంలో కీలకపాత్ర వహిస్తుంది.
3. మరణ సమయంలో గొప్ప సహాయం: లిగోరి గారు, జీవితమంతా జపమాలను
భక్తితో జపించేవారు తమ మరణ సమయంలో గొప్ప దయ పొందుతారని, మంచి మరణాన్ని పొంది రక్షింపబడతారని
ప్రకటించారు. ఎందుకంటే, జపమాల అనేది పరిశుద్ధ మాత యొక్క కరుణ
మరియు శక్తిని కోరే ప్రార్థన.
4. సమాజంలో ఆశీస్సులు: ఐక్యత - ఈ ప్రార్థనను ఒంటరిగా కాకుండా, ఇతరులతో కలిసి జపించడం
వలన ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. కుటుంబాలు లేదా సంఘంతో కలిసి జపమాల జపించడం ద్వారా
దేవుని ఆశీర్వాదాలు, శాంతి, ఐక్యతను
పొందుతాము. శాంతి మరియు రక్షణ - జపమాల కేవలం వ్యక్తిగత భక్తి మాత్రమే కాదు,
ప్రపంచానికి శాంతిని మరియు రక్షణను అందించడానికి దేవుడు ఇచ్చిన ఒక
గొప్ప సాధనం అని మన విశ్వాసం.
మరియమాత, పునీత యులాలియతో ఇలా
చెప్పారు: “ఆదరాబాదరాగా, భక్తి, విశ్వాసం లేకుండా, యాభై మూడు
పూసల జపమాలను జపించడం కంటే, నెమ్మదిగా, భక్తితో యాభై మూడు పూసల జపదండ చెప్పవలెను.” ఈ వాక్యంలో ఎంతో గొప్ప అర్ధం
దాగి ఉంది: జపమాల యొక్క ముఖ్య ఉద్దేశం కేవలం ప్రార్థనలను యాంత్రికంగా పునరావృతం
చేయడం కాదు. జపమాలలోని ప్రతి గురుతులో క్రీస్తు మరియు మరియమాత జీవితంలోని ఒక రహస్యంపై
లోతుగా ధ్యానం చేయాలి. త్వరత్వరగా, హడావిడిగా, అశ్రద్ధగా, ఏకాగ్రత లేకుండా
జపించడం వలన, ప్రార్థనను అర్ధవంతంగా జపించలేము. తద్వారా ఆ ప్రార్థన శక్తి మరియు
ఆశీర్వాదం కోల్పోతాము. నెమ్మదిగా, ప్రతి పూస వద్ద ఆగి,
ఆ రహస్యం గురించి ఆలోచించడం ద్వారా, ధ్యానించడం ద్వారా మాత్రమే యేసుక్రీస్తు
మరియు మరియమాత పట్ల మన ప్రేమ పెరుగుతుంది. ఏ ప్రార్ధన అయినను హృదయం నుండి
చేయాలి. భక్తి, విశ్వాసం,ప్రేమతో ప్రార్ధన చేయాలి. ముఖ్యంగా
జపమాలను, పశ్చాత్తాపం మరియు పరిశుద్ధత అనే ధ్యేయంతో జపించాలి.
“జపమాలను వల్లించడం వలన ప్రభువు జీవిత పరమ రహస్యాలను ధ్యానించేటట్లు ఆ
వ్యక్తికి తోడ్పడుతుంది. ప్రభువుకు దగ్గరగా ఉన్న ఆ తల్లి దృష్టితో మనం ప్రభువును చూడగలం”
అని ఆరవ పౌలు పోప్ గారు చెప్పారు. పోపు గారు జపమాల గురించి చేసిన ఈ వ్యాఖ్య చాలా
లోతైన ఆధ్యాత్మిక అర్థాన్ని కలిగి ఉంది. జపమాలను కేవలం ప్రార్థనల సమాహారంగా
కాకుండా, క్రీస్తు జీవితాన్ని
ధ్యానించడానికి ఉపయోగించే ఒక ‘క్రీస్తు కేంద్రిత పద్ధతి’గా వివరించారు.
మరియతల్లి దృష్టితో క్రీస్తును చూడాలి. యేసు బాల్యం నుండి మరణం, పునరుత్థానం వరకు జరిగిన ప్రతి సంఘటనకు మరియమ్మ సాక్ష్యం. ఆయన తొలి నవ్వు,
తొలి అడుగు నుండి సిలువపై ఆయన బాధ వరకు ఆమె హృదయంలో దాచుకుంది (లూకా
2:19). మనం జపమాల ధ్యానం చేస్తున్నప్పుడు, మరియమ్మ యొక్క పవిత్రమైన, నిస్వార్థమైన,
లోతైన విశ్వాసం అనే ‘కళ్ళద్దాలతో’ క్రీస్తు
జీవితాన్ని చూడాలి, ధ్యానించాలి. మరియమ్మ ప్రేమ ద్వారా క్రీస్తు శ్రమల విలువ,
ఆయన వాత్సల్యం యొక్క లోతు మనకు మరింత స్పష్టంగా అర్థమవుతాయి. జపమాల
ఒక క్రీస్తు-కేంద్రిత అభ్యాస పాఠశాల. మరియమ్మ ఆ పాఠశాలలో
మనకు మార్గదర్శకురాలు. ఆమెతో కలిసి మనం క్రీస్తు పరమ రహస్యాలను ధ్యానిస్తున్నాం.
జపమాల భక్తి ఎలా వచ్చింది?
క్రీ.శ. 13వ శతాబ్ద ప్రారంభంలో,
మరియమాత తన స్వహస్తాల ద్వారా పునీత డొమినిక్ గారికి జపమాలను ఇచ్చి,
ఈ ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను ఆయనకు తెలియజేశారు. ఈ సంఘటన జపమాల
భక్తి ప్రపంచానికి లభించిన ఒక దైవ వరంగా పరిగణించబడుతుంది. పరిశుద్ధ
మరియమాత ఈ లోకానికి ఇచ్చిన ఒక ఆధ్యాత్మిక అస్త్రం, జపమాల! 13వ శతాబ్ద ప్రారంభంలో దక్షిణ ఫ్రాన్స్లో, అల్బిజెన్సియనిజం
లేదా కాథారిజం అనే ఒక బలమైన విప్లవం శ్రీసభ యొక్క
బోధనలను, ముఖ్యంగా క్రీస్తు యొక్క మానవత్వాన్ని మరియు
దివ్యసంస్కారాలను తీవ్రంగా ప్రశ్నించింది. పునీత డొమినిక్ గారు ఈ విప్లవాన్ని లేదా
కతోలిక విశ్వాస వ్యతిరేక సిద్ధాంతాలను ఎదుర్కోవడానికి ప్రయత్నించారు. ఆయన చేసిన
ఉపదేశాలు, బోధనలు, వాదనలు ఆ విప్లవవాదులను మార్చడంలో
పూర్తిగా విజయం సాధించలేకపోయాయి. పునీత డొమినిక్ గారు ఈ విప్లవం పట్ల నిరాశ చెంది,
ప్రార్థన చేస్తున్నప్పుడు, పరిశుద్ధ కన్య
మరియమాత ఆయనకు ప్రత్యక్షమైంది. మరియమాత జపమాలను, పునీత
డొమినిక్ గారికి స్వయంగా ఇచ్చి, ఈ ప్రార్థన యొక్క శక్తిని
మరియు ప్రాముఖ్యతను తెలియజేశారు. జపమాల ఒక బోధనా సాధనంగా మరియు ఆధ్యాత్మిక
ఆయుధంగా పనిచేస్తుందని మరియమాత ప్రకటించారు. తప్పుడు సిద్ధాంతాలలో చిక్కుకున్న
సాధారణ ప్రజలకు కతోలిక విశ్వాస సత్యాలను స్పష్టంగా బోధించడానికి జపమాల ఒక గొప్ప
మార్గం అయింది. పునీత డొమినిక్ గారు జపమాలను నమ్మకంతో బోధించడం ప్రారంభించిన
తర్వాత, అనేక మంది తప్పుడు బోధనలకు దూరమై, తిరిగి కతోలిక విశ్వాసంలోకి వచ్చారు. ఈ విధంగా, జపమాల
ఆ కాలంలో గొప్ప విజయాలను సాధించడానికి దోహదపడింది.
తల్లి శ్రీసభ కూడా ఈ జపమాలను జపించాలని నిత్యమూ ప్రోత్సహిస్తుంది.
ఎందుకంటే, జపమాల ప్రార్థనలో మనం మొత్తం 20 దేవరహస్యాలను ధ్యానం
చేస్తున్నాము - ఐదు సంతోష దేవరహస్యాలు, ఐదు దు:ఖ దేవరహస్యాలు, ఐదు మహిమ దేవరహస్యాలు, మరియు ఐదు వెలుగు దేవరహస్యాలు.
ఈ దేవరహస్యాలద్వారా, క్రైస్తవులు క్రీస్తు అంటే ఎవరో, ఆయన మన
కొరకు ఎందుకు వచ్చారో తెలుసుకుంటారు. క్రీస్తు బోధనలు,
ఆయన ప్రేమ గురించి తెలుసుకుంటాం. అందుకే
శ్రీసభ మరియమాత ద్వారా మనకు జపమాల ప్రార్థనను జపించమని ప్రోత్సహిస్తుంది. ఈ
దేవరహస్యాల ధ్యానం ద్వారా మనం క్రీస్తు ప్రభువు గురించి ఎక్కువగా తెలుసుకోవచ్చు. ఆయన
జననము, మరణము, మనకోసం అనుభవించిన
శ్రమలు, పునరుత్థానము, మోక్షారోహణము,
పవిత్రాత్మ రాకడ, దివ్యసత్ప్రసాద స్థాపన వంటి
ముఖ్య ఘట్టాలను ధ్యానిస్తాము. అదేవిధంగా, మరియమాతకు
సంబంధించిన కొన్ని ఆధ్యాత్మిక ఘట్టాలను కూడా ఇందులో ధ్యానం చేయవచ్చు.
జపమాల మాత పండుగ ఆవిర్భావం
మరియమాతను జపమాల దేవరహస్యంగా కొనియాడడం అనేది, లెపాంటో (Lepanto) ఓడరేవు
పట్టణం వద్ద జరిగిన మహాయుద్ధంలో క్రైస్తవులు ఘనవిజయం సాధించినందుకు జ్ఞాపకార్థంగా
ఆరంభమైంది. క్రైస్తవులకు, మహమ్మదీయులకు మధ్య లెపాంటో ఓడరేవు
పట్టణం సమీపంలో ఈ నావికా యుద్ధం సముద్రంలో జరిగింది. క్రైస్తవుల తరపున ఆస్ట్రియా
రాకుమారుడు డాన్ జువాన్ నాయకత్వం వహించి యుద్ధం చేశారు. తనకు తక్కువ సైన్యం
ఉన్నప్పటికీ, క్రైస్తవులు ఆ యుద్ధంలో 1571 అక్టోబర్ 7న ఘనవిజయం సాధించారు. కన్య మరియమాతయందు
భక్తి, విశ్వాసం, నమ్మకం గల ఈ రాజు,
మరియమాత మధ్యవర్తిత్వాన్ని కోరుకున్నారు. కన్య మరియ మధ్యవర్తిత్వం
ద్వారా సహాయం అర్థించి, ప్రార్థించి, జపమాలను
జపిస్తూ పోరాటం సలిపి ఘనవిజయం సాధించారు. ఈ ఘనత ఆ దేవుని తల్లికే చెందుతుందని డాన్
జువాన్ ఉద్వేగంతో పేర్కొన్నారు. ఈ విజయం జ్ఞాపకార్థంగా, అప్పటి
పోప్ ఐదవ పయస్ గారు ఈ జపమాల మరియమాత ఉత్సవాన్ని ప్రవేశపెట్టారు.
చరిత్రలో, జపమాల లెక్కలేనంత మందికి
ఊరటను, ఓదార్పును దయచేసింది. ముఖ్యంగా, కష్టాలలో, దిక్కుతోచని స్థితిలో, పోరాట సమయాలలో, జపమాల ద్వారా మరియమాత
మధ్యవర్తిత్వాన్ని ఆశ్రయించి ఎన్నో గొప్ప మేలులను పొందియున్నారు.
పునీత రెండవ జాన్ పాల్ జగద్గురువులు, “జపమాల నాకు ఇష్టమైన ప్రార్థన.
ఇది దివిని-భువిని కలిపే ప్రార్థన. మరియమాతతో మనలను ఏకం చేస్తుంది. క్రీస్తు
చెంతకు నడిచే మార్గంలో, ఆమె మన చేయి పట్టుకుని
నడిపిస్తుంది” అని అన్నారు. వీరి మాటలలో అర్ధం ఏమిటంటే, జపమాల అనేది అత్యంత సాధారణమైన
మరియు సులభమైన ప్రార్థన. దీనికి ప్రత్యేకమైన పుస్తకాలు లేదా జ్ఞానం అవసరం
లేదు. కేవలం కొన్ని ప్రాథమిక ప్రార్థనలు మరియు ధ్యానం చేయాలనే నిబద్ధత ఉంటే
సరిపోతుంది. పోప్ గారు దీనిని ఎంతగానో ప్రేమించడానికి కారణం, ఇది అందరికీ, పేదలకు, ధనికులకు,
చదువుకున్న వారికి, చదువుకోని వారికి కూడా
అందుబాటులో ఉండడమే. దివిని-భువిని కలిపే ప్రార్థన అని అన్నారు: జపమాలలోని రహస్యాల
ద్వారా మనం యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని, పునరుత్థాన
మహిమను, పరిశుద్ధ మాత యొక్క స్వర్గారోహణ మరియు పట్టాభిషేకం
వంటి సత్యాలను ధ్యానిస్తాం. ఇది మన దృష్టిని భూమిపై ఉన్న తాత్కాలిక విషయాల
నుండి నిత్య సత్యాల వైపు మళ్లిస్తుంది. అలాగే, మనం జపించే ప్రతి మంగళవార్త
జపంలో పాపాత్ములమై యుండెడు మా కొరకు, ఇప్పుడును,మా మరణ సమయ మందును ప్రార్థించండి” అని చెబుతాం. అంటే, మనం ఈ భూమిపై మన నిజమైన అవసరాల గురించి, మన పాపాల
గురించి, మన అంతిమ గమ్యమైన మరణం గురించి
ప్రార్థిస్తున్నాం. క్రీస్తు జననం, జీవితం, మరణం, పునరుత్థానం అనే దైవిక అంశాలను, మన రోజువారీ
జీవితంలోని (భువి) కష్టాలు, సవాళ్లు మరియు నిరీక్షణతో (దివి)
జపమాల ఏకం చేస్తుంది.
“మరియమాత మన చేయి పట్టుకుని నడిపిస్తుంది” అని అన్నారు, క్రీస్తు
చెంతకు నడిచే మార్గంలో అనేక ఆధ్యాత్మిక సవాళ్లు ఉంటాయి. మరియమాత మన చేయి పట్టుకుని
నడిపించడం అంటే, శోధనలలో ఆమె మనకు ధైర్యాన్ని, నిరీక్షణను మరియు భక్తిని కలిగిస్తుంది. క్రీస్తు ప్రేమను పొందుకోవడానికి ఆమె
మనకు సురక్షితమైన, సరళమైన మరియు మార్గాన్ని చూపిస్తుంది.
అందుకే, పునీత ఫ్రాన్సిస్ డి సేల్స్ గారు, “పరిశుద్ధ
జపమాల భక్తిగొప్పది,
ఉన్నతమైనది, దైవికమైనది. అత్యంత కఠినమైన పాపులను మరియు మొండి
పట్టుదల గల భిన్నాభిప్రాయ వాదులను మార్చడానికి స్వర్గమే దీనిని మీకు ఇచ్చింది” అని
అన్నారు.
మరియ తల్లి ఎప్పుడు కూడా మనలను ప్రభువు చెంతకే నడిపిస్తుంది. పునీత
యోహాను గారు వ్రాసిన సువార్త 2:5లో, “ప్రభువు తల్లి
సేవకులతో, ‘ఆయన చెప్పినట్లు చేయుడి’ అనెను.” ఈ మాటల ద్వారా, జపమాల మాత సకల మానవాళికి ఏమి సందేశం ఇస్తున్నారో మనం అర్థవంతంగా తెలుసుకోవాలి.
“క్రీస్తును వెంబడించండి! ఆయన చెప్పిన విధముగా జీవించండి! ఆయనను అనుసరించండి!”
అనేది మరియతల్లి సందేశం. కానా పల్లెలో పెండ్లి విందు జరుగుతున్నప్పుడు, ద్రాక్షారసం తక్కువ పడినప్పుడు, యేసు తల్లి, కన్య మరియ, “వారికి ద్రాక్షారసం లేదు” అని తన
కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుతో చెప్పారు. క్రీస్తు ప్రభువు అక్కడ
ఉన్న ఆరు రాతి బానలలో నీటిని నింపమని సేవకులతో చెప్పగానే, మరియమాత సేవకులతో, “ఆయన చెప్పినట్లు చేయండి’ అని చెప్పారు. జపమాల మాత మనకు నిత్యమూ క్రీస్తు ప్రభువును అనుసరించమని
చెబుతున్నారు. జపమాల మాత, క్రీస్తు ప్రభువునందు విధేయతతో,
ఆయన చెప్పినట్లుగా జీవించమని, మనకు
సందేశాన్ని ఇస్తున్నారు.
జపమాల
మాత పండుగ జరుపుకుంటున్న మనమందరమూ, జపమాలను ధ్యానిద్దాం. జపమాల ధ్యానంలో, మనము కూడా జపమాల మాతను ఈ విధంగా ప్రార్థించుకుందాం:
1.అమ్మా, యేసు దేవుని మాతయైన జపమాల మాతా! మీ
ప్రార్థన సహాయం ద్వారా మాకు కూడా పవిత్రత కలిగిన జీవితాలను ప్రసాదించండి.
2.దేవుని
యందు ఆనందించే ఆత్మను, జపమాల ధ్యానం ద్వారా మాకు ఒసగండి.
3.దేవుని
దాసులముగా జీవించే కృపను, మీ జపమాల ధ్యాన,
ప్రార్థనా సహాయం ద్వారా మాకు అందించండి.
4.దేవుని
యందు భయభక్తులతో జీవిస్తూ, ఆయన కనికరం
పొందుకునే ధన్యతను, జపమాల ధ్యానం ద్వారా మాకు ప్రసాదించండి.
5.జపమాల
ధ్యానం ద్వారా మా దుష్టత్వమును, దురాలోచనలను
పవిత్రపరచండి.
6.జపమాల
ధ్యానం ద్వారా మాలో ఉన్న అహంకారమును కాల్చివేయండి.
7.జపమాల
ధ్యానం ద్వారా మేమందరమూ దీనులమై జీవించే హృదయాలను మాకు దయచేయండి.
8.జపమాల
ధ్యానం ద్వారా ఆపదలలో, అవసరతలలో ఉన్నవారికి
సహాయం చేసే హృదయాలను మాకందరికీ దయచేయండి.
9.జపమాల
ధ్యానం ద్వారా క్రీస్తు ప్రభువును అనుసరించే స్వభావమును మాకు దయచేయండి.
10.జగతికి
జ్యోతులమై, మీ ప్రియ కుమారుడైన మా రక్షకునకు, పరమ తండ్రి దేవునికి ప్రియమైన వారసులమై జీవించి,
పరమునందు నిత్యజీవమున ఆనందముతో మేమందరమూ
జీవించే లాగున, జపమాల మాతా! మా కొరకు ప్రార్థించండి.
మమ్ము క్రీస్తు మార్గములో నడిపించండి.
ప్రియ సహోదరీ, సహోదరులారా, మరియతల్లి
బిడ్డలారా, జపమాలను ధ్యానించుకునే కుటుంబాలు ఎంతగా ఆశీర్వాదాలు పొందుకుంటాయో గ్రహించి,
మన కుటుంబాలన్నీ అనుదినమూ జపమాలను ధ్యానిస్తూ, క్రీస్తు అనుసరణలో జీవించి, ఆ దేవాది దేవుని కృపను పొందుకొని,
దేవుని ఆశీర్వాదములకు పాత్రులమై జీవించుదాం.
మన హృదయాలను ప్రభువు ప్రేమతో నింపే జపమాల ప్రార్థన యొక్క శక్తిని
లోతుగా గ్రహిద్దాం. భక్తిశ్రద్ధలతో జపమాల
ప్రార్థన ద్వారా మన విన్నపాలను మరియమాతకు తెలియజేద్దాం. అందరికీ మరోమారు జపమాల మాత
పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు
మిమ్మల్ని, మీ కుటుంబాలను నిండుగా, మెండుగా
దీవించి, కాచి కాపాడునుగాక. ఆమెన్!
అక్టోబరు 4న, మనం పునీత అస్సీసిపుర ఫ్రాన్సిస్ గారి మహోత్సవాన్ని
కొనియాడుచున్నాము. ముందుగా మీ అందరకు పండుగ శుభాకాంక్షలు!
పునీత అస్సీసి ఫ్రాన్సిస్ (క్రీ.శ. 1182–1226)
క్రైస్తవ చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన, మిక్కిలిగా ప్రేమించబడుచున్న
పునీతులలో ఒకరు. ఫ్రాన్సిస్ గారి ఆధ్యాత్మికతకు కేంద్ర బిందువు ‘సిలువలో
కొట్టబడినయేసుక్రీస్తును సంపూర్ణంగా అనుసరించడం’. విశ్వాసం, ప్రేమ, శాంతి, దీనత్వం, విధేయతలకు మారుపేరుగా జీవించిన
పునీతులు అస్సీసిపుర ఫ్రాన్సిస్ గారు!
సువార్తను అక్షరాలా జీవించి చూపిన గొప్ప ప్రతిరూపం పునీత ఫ్రాన్సిస్
గారు. “నక్కలకు బొరియలు, ఆకాశ పక్షులకు గూళ్ళు కలవు. మనుష్యకుమారునకు మాత్రము
తలవాల్చుటకైనను చోటు లేదు” (మత్త 8:20) అని పలికిన ప్రభువు మాటలను అక్షరాల
పాటించి, పేదరికాన్ని తన జీవిత భాగస్వామిగా నెంచి, ప్రేమించిన మహాజ్ఞాని పునీత
అస్సీసిపుర ఫ్రాన్సిస్ గారు! ఆయన జీవించిన ‘పేదరికం’, ఎవరూ జీవించి ఉండరు. ఫ్రాన్సిస్
గారు జీవించినపద్ధతిలో పేదరికాన్ని మరే ఇతర పునీతులు
అంత కఠినంగా పాటించలేదు.పేదవారిపట్ల ప్రేమ, స్నేహం, సేవా భావాలతో జీవించారు. ఎప్పుడైతే పేదవారిని ప్రేమించగలనో, అప్పుడే దేవున్ని పరిపూర్ణంగా ప్రేమించగలనని నమ్మినవారు. ఫ్రాన్సిస్ గారి దృష్టిలో, పేదరికం అనేది దేవునిపై సంపూర్ణ
విశ్వాసాన్ని, స్వేచ్ఛను ప్రసాదించేపవిత్ర
మార్గం.
ఫ్రాన్సిస్ వారి బోధనలు, జీవన విధానం, పేదరికం, దైవప్రేమ, సృష్టిపట్ల గౌరవం, పశ్చాత్తాపాన్ని
ఈ లోకానికి గుర్తుచేశాయి, నేటికీ గుర్తు చేస్తూనే ఉన్నాయి.
1. ఫ్రాన్సిస్ వారి జీవితం, మలుపు-పరివర్తన
ఫ్రాన్సిస్ గారు, 1182లో ఇటలీలోని అస్సీసి
పట్టణంలో జన్మించారు. తండ్రి పీటర్ బెర్నార్డోన్, ఒక పెద్ద బట్టల వ్యాపారి, తల్లి
యోవాన్న పీకా. యువకుడైనఫ్రాన్సిస్ చురుకైన స్వభావంతో,
కలుపుగోలు తనంతో ఉండేవారు. ఫ్రాన్సిస్ గారు
వ్యాపారంలో తండ్రికి సహాయం చేసినప్పటికీ, విందులు, వినోదాలు
మరియు విలాసవంతమైన ఖర్చులకుఅధిక ప్రాధాన్యత ఇచ్చేవారు. యుక్తవయస్సులో ఫ్రాన్సిస్ గారు గొప్ప యోధుడుగా
కావాలని కలలు కన్నారు. ఈ ఆశయంతోనే, కొన్ని యుద్ధాలలో కూడా పాల్గొన్నారు.
1202లో పెరూజియా నగరంతో
జరిగిన యుద్ధంలో పాల్గొనే అవకాశం వచ్చింది. అస్సీసికి గొప్ప పేర్తు,
కీర్తిప్రతిష్టలు తీసుకొని వస్తానని వాగ్దానం చేసి యుద్ధభూమికి బయలుదేరారు.
సాహసంగల శూరుడుగా యుద్ధంలో పాల్గొన్నారు. కాని ఈ యుద్ధంలో పెరూజియా గెలవడంతో, ఫ్రాన్సిస్
తన ఇతర స్నేహితులతో ఖైదీగా పట్టుబడ్డారు. పరాజయం వారిని పదేపదే బాధించింది.
పరాజయాన్ని అంగీకరించలేక, తన మిత్రులతో, తన కలల గురించి గొప్పగా చెబుతూ, ‘గొప్ప
భవిష్యత్తు నాకోసం ఎదురు చూస్తుంది. ఒకరోజు లోకమంతా నన్ను గౌరవిస్తుంది’ అని
అనేవారు. సంవత్సరం గడచి పోయింది. చెరనుండి విడుదల అయిన కొద్ది కాలానికే, తీవ్రమైన జబ్బున
పడి, కోలుకున్నారు. అయితే, ఈ అనుభవాలు అన్నీ కూడా ఆయన అంతరంగంలో మార్పును
మొదలుపెట్టాయి.
1205లో, పోపుసైన్యానికి జర్మన్ ప్రభువుల మధ్య యుద్ధం వచ్చింది. తన
కలలను సాకారం చేసుకోవడానికి మరొక గొప్ప అవకాశంగా భావించి చాలా సంతోష పడ్డారు. ‘ఇన్ని
రోజులు నీవు కోరుకుంటున్న మహిమ నీ తలుపు తట్టుచున్నది. వెళ్లి దానిని ఒడిసి
పట్టుకో.ఊగిసలాట వద్దు. ముందుకు దూకు. పోరాడి జయించు. మంచి యోధుడిగా మారు. అప్పుడు
లోకమంతా నీ ఆధీనంలో ఉంటుంది’ అని ఫ్రాన్సిస్ గారు తనలోతాను అనుకున్నారు. తండ్రి బెర్నార్డోన్ కూడా తన కొడుకు ఆ ప్రాంతములోనే
ఉత్తమమైన కవచాన్ని ధరించాలని, సొగసైన గుర్రంపై స్వారీ చేయాలని ఆశించి వాటిని
సమకూర్చాడు.
ఇక ఆపూలియా ప్రాంతానికి యుద్ధంలో పాల్గొనడానికి వెళుతున్న మార్గంలో, స్పొలేటో అనే ప్రాంతంలో, ఫ్రాన్సిస్ గారు, “ఫ్రాన్సిస్, నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావు? అని ఒక స్వరాన్ని
విన్నారు. ‘ప్రభూ! నేను యోద్ధభూమికి, యోధున్ని కావాలని వెళ్ళుచున్నాను’ అని బదులు
చెప్పారు. మరలా ఆ స్వరం, “నీవు ఎవరిని సేవించగలవు? యజమానుడినా
లేక సేవకుడినా?” అని ప్రశ్నించింది. అందుకు ఫ్రాన్సిస్ ‘యజమానుడిని’
అని సమాధానం ఇచ్చారు. మళ్ళీ ఆ స్వరం, “కాని, నీవు యాజమానుడిని గాక, సేవకుడిని సేవిస్తున్నావు” అనగా,
లౌకిక ఆశయాలను, కీర్తిని సేవిస్తున్నావు అని ఆ స్వరం పలుకగా, అప్పుడు ఫ్రాన్సిస్,
‘అయితే, నన్నేమి చేయమంటారు?’ అని ప్రశ్నించారు. అందులకు “నీవు తిరిగి నగరానికి వెళ్ళు. నీవు ఏమి
చేయాలో అక్కడ తెలుసుకుంటావు” అని ప్రభువు స్వరం వినిపించింది. ఫ్రాన్సిస్ గారు
ఆశ్చర్యానికి గురయ్యారు. తను కన్న కలలు ఒక్క క్షణంలో మాయమైనట్లుగా అనిపించింది.
తనలోతాను చాలాసేపు వేదనపడి, చివరికి ఇదే దేవుని చిత్తమని ఎరిగి అస్సీసికి తిరిగి
వచ్చారు.
అప్పటినుండి వారు సువార్త ధ్యానాన్ని మొదలు పెట్టారు. దగ్గరలోని చిన్న
గుహలో ప్రార్ధించారు. లౌకిక ఆశయాల నుండి వైదొలగారు. ఈ క్రమంలోనే ఆయన తనధనాన్ని పేదలకు దానంచేయడం
మొదలుపెట్టి, తమ తండ్రితో గొడవపడి, చివరికి
తమ ఆస్తి హక్కులను కూడా వదులుకున్నారు. ఫ్రాన్సిస్
గారు తమ ఆస్తిని, ధనాన్ని అస్సీసి చుట్టూ ఉన్నశిథిలమైన దేవాలయాల పునర్నిర్మాణంకోసం ఖర్చు చేయడం ప్రారంభించారు.
2. కుష్టిరోగిలో ప్రభువు దర్శనం
ఫ్రాన్సిస్ గారు అత్యంత నిరాదరణకు గురైన పేదలకు, రోగులకు, ముఖ్యంగా కుష్ఠరోగులకు
తమ జీవితాన్ని అంకితం చేయాలని, సేవ చేయాలని దృఢంగా
తీర్మానించు కున్నారు. ఈ కుష్ఠరోగుల సేవయే క్రీస్తును అనుసరించడంలో ఆయనకు లభించిన
మొట్టమొదటి సవాలు, మరియు ఆధ్యాత్మికంగా ఆయనకు గొప్ప మాధుర్యాన్ని
ఇచ్చింది.
పునీత ఫ్రాన్సిస్ గారి ఆధ్యాత్మిక జీవితంలో, కుష్ఠరోగిని ఆలింగనం చేసుకొని ముద్దు పెట్టుకోవడం
అనేది ఒక ముఖ్యమైన, నిర్ణయాత్మకమైన మలుపుగా పరిగణించ బడుతుంది. ఇది ఆయన జీవితాన్ని
లౌకిక ఆశయాల నుండి దైవ సేవ వైపు పూర్తిగా మళ్లించింది. ఈ సంఘటన, తమ జీవితంలో
అత్యంత కీలకమైన సంఘటనగా తాను భావించినట్లుగా ఫ్రాన్సిస్ గారు వారి వ్రాతలలో
వ్యక్తపరచారు. ఫ్రాన్సిస్ గారు తమ తొలి జీవితంలో, మారుమనస్సు
పొందక పూర్వం, కుష్ఠరోగులను చూడటానికే విపరీతమైన విరక్తి, భయాన్ని కలిగి ఉండేవారు.
మధ్యయుగపు సమాజంలో, కుష్ఠు వ్యాధిని పాపానికి సంకేతంగా
చూసేవారు, కుష్ఠరోగులను పట్టణాల బయట ఒంటరిగా ఉంచి, బహిష్కరించేవారు.
ఫ్రాన్సిస్ కూడా వారిని చూసిన వెంటనే దూరంగా వెళ్ళిపోయేవారు. ఫ్రాన్సిస్ గారు
స్వయంగా ఈ అనుభవం గురించి “నేను పాపంలో ఉన్నప్పుడు, కుష్ఠరోగులను
చూడటం నాకు అత్యంత చేదుగా, అసహ్యంగా అనిపించేది. అయితే, ప్రభువు
తానే నన్ను వారి మధ్యకు నడిపించారు, నేను వారికి దయ
చూపించాను” అని రాసారు.
ఒకరోజు ఫ్రాన్సిస్ గారు తమ గుర్రంపై ప్రయాణిస్తున్నప్పుడు, అస్సీసికి సమీపంలో ఒక కుష్ఠరోగిని చూశారు. ఆయన
సహజంగానే భయంతో పక్కకు తప్పుకోవాలని అనుకున్నారు. కానీ, దేవుని
కృప మరియు ఆత్మబలంతో తన భయాన్ని, విరక్తిని అధిగమించి,
గుర్రం దిగి, ఆ కుష్ఠరోగి దగ్గరకు
పరిగెత్తారు. ఫ్రాన్సిస్ గారు ఆ రోగిని ముద్దుపెట్టుకొని, ఆయన
చేతికి కొంత డబ్బు కూడా ఇచ్చారు. ఆయన తిరిగి గుర్రం ఎక్కి, వెనక్కి
తిరిగి చూసినప్పుడు, ఆ కుష్ఠరోగి అక్కడ కనిపించలేదు. దీంతో, ఆ రోగి సాక్షాత్తూ యేసు క్రీస్తే అని
ఫ్రాన్సిస్ నమ్మారు.
ఈ సంఘటన ఫ్రాన్సిస్ గారు కేవలం క్షణికావేశంలో చేసిన పని కాదు, అది ఆయన జీవితాన్ని పూర్తిగా మార్చివేసింది: చేదుగా,
అయిష్టంగా భావించినది ఇప్పుడు మాధుర్యంగా మారింది. అంటే, లోకంలో
తనకు విరక్తి కలిగించిన విషయం, దేవుని దృష్టిలో ప్రేమతో చేసినప్పుడు
పరమ ఆనందాన్ని ఇచ్చింది. ఈ అనుభవం తర్వాత, ఫ్రాన్సిస్ గారు
అస్సీసికి దిగువన ఉన్న కుష్ఠరోగుల ప్రాంతానికి వెళ్ళి, అక్కడే
వారితో జీవించారు. వారికి సేవ చేస్తూ, గాయాలను కడుగుతూ,
వారికి సేవలు చేస్తూ తమ జీవితాన్ని గడిపారు.
ఈవిధంగా, కుష్ఠరోగిని కౌగిలించుకోవడం అనేది సువార్తను ఆచరించడానికి ఆయన
తీసుకున్న మొట్టమొదటి ఆచరణాత్మక చర్య. తన సుఖాన్ని, అహంకారాన్ని, భయాన్ని సిలువపై త్యాగం చేసి, క్రీస్తు యొక్క కరుణను, ప్రేమను స్వీకరించడానికి ఇది
ఆరంభ బిందువు.
ఈ సంఘటన నేటి క్రైస్తవ లోకానికి, ముఖ్యంగా యువతకు,
క్రీస్తును అనుసరించే విషయంలో శక్తివంతమైన మరియు ఆచరణాత్మకమైన సందేశాలను
అందిస్తుంది. నేడు మన చుట్టూ నిస్సహాయ స్థితిలో నున్నవారు ఎంతోమంది ఉన్నారు. మన
సహాయం కోసం ఎదురు చూసే వారు ఎంతో మంది ఉన్నారు!
అయితే, మొదటిగా, ఆకర్షణీయమైన వాటిని త్యజించడం నేర్చుకోవాలి -
క్రీస్తును కనుగొనడం అనేది మనకు అత్యంత అసహ్యంగా లేదా అసౌకర్యంగా అనిపించే పనులలో
మొదలవుతుంది. నేటి యువత సామాజిక మాధ్యమాలలో మరియు ప్రపంచంలో ఆకర్షణీయంగా, విజయవంతంగా కనిపించే వాటినే అనుసరించాలని
కోరుకుంటారు. కానీ ఫ్రాన్సిస్ గారి అనుభవం, నిజమైన
ఆధ్యాత్మిక మాధుర్యం మరియు శాంతి లభించేది... మనకు 'అసౌకర్యం'
కలిగించే సేవలో... మన ‘అహంకారాన్ని’ చంపుకునే క్షణాల్లో... నిజమైన
ఆధ్యాత్మిక మాధుర్యం మరియు శాంతి లభిస్తుందని మనమందరం గుర్తించాలి.
రెండవదిగా, క్రీస్తును ఇతరులలో గుర్తించడం - యేసుక్రీస్తును మందిరాలలో
మాత్రమే కాదు, సమాజంలోని ప్రతి ఒక్కరిలో,
ముఖ్యంగా పేదలలో, అణగారిన వారిలో, ప్రభువును చూడాలి. మత్తయి 25:40లోని ప్రభువు
మాటలను గుర్తుకు చేసుకుందాం! “ఈ నా సోదరులలో అత్యల్పుడైన ఏ ఒక్కనికి మీరు ఇవి
చేసినపుడు అవి నాకు చేసితివి”. నేటి సమాజంలో ‘కుష్ఠరోగులు’ అంటే శారీరక వ్యాధితో
బాధపడేవారు మాత్రమే కాదు - నిరాదరణకు గురైనవారు, విభిన్నమైన ఆలోచనలు లేదా మతాలు
కలిగినవారు, పేదరికం, వ్యసనాలు లేదా మానసిక సమస్యలతో
బాధపడుతూ విమర్శలు ఎదుర్కొంటున్నవారు... ఇలా ఎంతోమంది ఎన్నో సమస్యలతో
బాధపడుతున్నారు! కుష్టరోగులను జయించే ముందు, ఫ్రాన్సిస్ గారు ముందుగా తనలోని
విరక్తిని, అహంకారాన్ని జయించారు. ఈ ఆత్మ-విజయమే ఆయనకు ‘ఆత్మకు, శరీరానికి మాధుర్యాన్ని’ యిస్తుంది నేడు మనం ఇతరులను మార్చాలని, మార్పు
రావాలని ఆశిస్తాము, కాని నిజమైన పరివర్తన మొదలయ్యేది మన హృదయంలోనే అని గ్రహించాలి!
మన బలహీనతలను, ద్వేషాలను జయించినప్పుడే దేవుని సేవలో నిజమైన
ఆనందాన్ని పొందగలం.
3. ఫ్రాన్సిస్:
శాశ్వత ఎడబాటు
1206లో,
పునీత దమియాను దేవాలయంలో
ప్రార్దిస్తుండగా, సిలువలో నున్న క్రీస్తు స్వరమును విన్నారు. “నా మందిరమును
నిర్మించు” అని ప్రభువు స్వరాన్ని విన్నారు. శిథిలమైన సాన్ దమియానో దేవాలయాన్ని
బాగుచేయించడానికి డబ్బు అవసరం కాగా, ఫ్రాన్సిస్ గారు తమ తండ్రి దుకాణంలోనివిలువైన వస్త్రాలను గుర్రమునుతీసుకువెళ్లి అమ్మేశారు. ఈ విషయం తెలిసిన
ఫ్రాన్సిస్ తండ్రి, పీటరు బెర్నార్డోన్కుతీవ్రమైన
కోపం వచ్చింది. ఫ్రాన్సిస్ తమవారసత్వాన్ని,
కుటుంబ గౌరవాన్ని,కష్టార్జితాన్ని
పాడుచేస్తున్నారని, పిచ్చిగా ప్రవర్తిస్తున్నారని ఆయన భావించారు.
కోపంతో రగిలిపోయిన తండ్రి, ఫ్రాన్సిస్ను బంధించి, ఆ
డబ్బును తిరిగి ఇమ్మని కోరుతూ, అస్సీసి నగర బిషప్ముందు
న్యాయస్థానంలో నిలబెట్టాడు. బిషప్ గారు ఫ్రాన్సిస్ను పిలిచి, “నీవు
దేవున్ని సేవించదలుచుకుంటే, ఈ డబ్బును నీ తండ్రికి తిరిగి ఇచ్చివేయాలి.దేవుని పనికి అన్యాయంగా సంపాదించిన డబ్బును
ఉపయోగించకూడదు”అని ఉపదేశించారు. బిషప్ గారి మాటలకు
ఫ్రాన్సిస్ వెంటనే అంగీకరించారు. అయితే, ఫ్రాన్సిస్ గారు మరింత ముందుకు వెళ్లి,
“ఈ క్షణం నుండి నేను ఇకపై నిన్ను‘తండ్రి’అని పిలవను. ఇదిగో! నీ డబ్బుతో పాటు నీవు నాకు
ఇచ్చిన ఈ బట్టలు కూడా నీకే ఇచ్చివేస్తున్నాను. ఇంతవరకు నేను పీటరు బెర్నార్డోన్
కుమారుడిని. కానీ ఇకపైపరలోకంలో
ఉన్న దేవుడేనా ఏకైక తండ్రి” అని అన్నారు. ఆయన వెంటనే తమ
శరీరంపై ఉన్నవిలువైన దుస్తులను విప్పేసి, ఆ
డబ్బుతో సహా వాటిని తండ్రికి ఇచ్చేసారు.నగ్నంగానిలబడిన ఫ్రాన్సిస్, లౌకిక
జీవితంతో తమకు ఇక ఏ సంబంధం లేదని తేల్చి చెప్పారు. వెంటనే బిషప్, తన పై
వస్త్రాన్ని ఫ్రాన్సిస్ గారిని కప్పి, ఆశ్రయం కల్పించిరక్షించారు.
1207లో,
పునీత దమియాను దేవాలయ
పునర్నిర్మాణం పూర్తయింది. పెంతకోస్తు పండుగన గోపురంపై సిలువను ప్రతిష్టించి, ఆ సిలువతో
సర్వలోకాన్ని దీవించాడు. “ఫ్రాన్సిస్ నీ తరువాతి ప్రణాళిక ఏమిటి?” అని సాన్ దమియానో
దేవాలయ గురువు ప్రశ్నించగా, “దేవుడు ఇప్పటివరకు నేను నడవటానికి నాకు వెలుగును
చూపించారు. నా తర్వాతి అడుగుకి కూడా దేవుడే ఒక చిన్న దీపాన్ని వెలిగిస్తాడని
నమ్మకం నాకున్నది. ప్రతీక్షణం నా జీవితం ఆయన సేవకే” అని ఫ్రాన్సిస్ గారు సమాధాన
మిచ్చారు.
4. ఫ్రాన్సిస్: గొప్ప దైవ చిత్తాన్వేషి
ఈనాడు మనం ‘కోరికలు’ అనే వలయంలో చిక్కుకుపోతున్నాం. కోరికలు తీరనప్పుడు నిరుత్సాహ పడిపోతున్నాం.
సానుభూతి, ఓదార్పుకు నోచుకోలేక పోతున్నాం. దేవుని
వాక్యం, కార్యంపై ధ్యానంచేసి, ఆయన
చిత్తాన్ని అన్వేషించుటకు మనకు సమయం లేకుండా పోతుంది. క్రీస్తు విశ్వాసులముగా, మనం
దేవుని చిత్తం ప్రకారంగా జీవించాలని మనకు తెలుసు! కాని దైవచిత్తాన్ని వెదకుటలో, తెలుసుకోవడంలో, ఆచరించడంలో వెనకబడి పోతున్నాం!
దానిలోనున్న ఆనందాన్ని, సంతోషాన్ని గ్రహించలేక పోతున్నాం.
పునీత అస్సీసిపుర ఫ్రాన్సిస్ గారు దైవచిత్తాన్ని అన్వేషించడంలో
పొందిన ఆనందం వర్ణణాతీతం. యుక్త వయస్సులో, చిలిపిగా యువతకు
నాయకుడై విచ్చలవిడిగా జీవించినప్పటికిని, మార్పు, మారుమనస్సు త్వరలోనే అతని జీవితాన్ని ఆవహించాయి. ఏకాంత ప్రదేశాల్లోనికి
వెళ్లి దేవుని వాక్యంపై, ప్రేమపై ధ్యానించడం, ప్రార్ధించడం ప్రారంభించారు. దమియాను దేవాలయంలోని సిలువలో వ్రేలాడు
క్రీస్తు ప్రతిమ ఫ్రాన్సిస్ హృదిని, మదిని తొలచడం
ప్రారంభించింది. ఫ్రాన్సిస్ దైవపిలుపును అర్ధం చేసుకున్నది ఆ సిలువనుండియే!
14 మే 1208, పునీత మత్తయి గారి పండుగ రోజున దైవపిలుపును, దైవచిత్తాన్నిఫ్రాన్సిస్ గారు మరింత లోతుగా గ్రహించారు. ఆనాటి సువార్త పఠనం, “క్రీస్తు తన శిష్యులను వేదప్రచారానికి పంపటం”ఫ్రాన్సిస్
గారిని ఎంతగానో ఆకట్టుకుంది. తను అర్ధం చేసుకున్నది వెంటనే ఆచరణలో పెట్టుటకు బయలు
దేరారు. ఇలా దైవ చిత్తాన్ని అన్వేషింఛి, దాని ప్రకారంగా జీవించారు. ఇదే స్ఫూర్తి
మనలో కూడా కలగాలి.
ముఖ్యంగా మూడు విషయాలను మనం నేర్చుకోవాలి: మొదటిగా, ధ్యానం,
ఏకాంతాన్ని అలవాటు చేసుకోవాలి – ఈనాడు మనం ‘కోరికలు’ అనే వలయంలో చిక్కుకోవడానికి
ప్రధాన కారణం, మన చుట్టూ ఉన్న డిజిటల్ శబ్దం మరియు
నిరంతర వినోదం. దైవచిత్తాన్ని వినడానికి అవసరమైన నిశ్శబ్దం, ఏకాంతం మన జీవితాల్లో లేకపోవడమే!
ఫ్రాన్సిస్ గారు ఏకాంత ప్రదేశాల్లోకి వెళ్లి ప్రార్థించడం ద్వారానే, దేవుని
వాక్యంపై ప్రేమను పెంచుకోగలిగారు. పునీత దమియాను దేవాలయంలోని సిలువ ముందు ఆయన
చేసిన ప్రార్థన, దేవుని పిలుపును స్పష్టంగా అర్థం
చేసుకోవడానికి కేంద్రంగా మారింది. దైవచిత్తాన్ని తెలుసుకోవాలంటే, మనం మొదట దైవ కార్యానికి మరియు దేవుని వాక్యానికి సమయాన్ని కేటాయించాలి.
నేడు మనకు ‘డిజిటల్ ఫాస్టింగ్’, అనగా రోజు కొంతసేపు ఫోనును పక్కన పెట్టేయడం ఎంతో
అవసరం. ఆ సమయంలో, ప్రశాంతమైన చోట కూర్చొని, బైబిలులోని ఒక
చిన్న భాగాన్ని చదివి, ‘ప్రభూ, నేడు
నేను ఏమి చేయాలో నాకు తెలియజేయుము’ అని ధ్యానించాలి.
రెండవదిగా, దైవచిత్తాన్ని తక్షణమే ఆచరణలో పెట్టాలి – క్రీస్తు
విశ్వాసులముగా, మనం దేవుని చిత్తం ప్రకారంగా
జీవించాలని మనందరికీ తెలుసు! అయినప్పటికీ, దానిని ఆచరించడంలో
వెనుకబడి పోతున్నాం. చాలామంది క్రైస్తవులు దేవుని చిత్తాన్ని ‘తెలుసుకోవాలని’ మాత్రమే
కోరుకుంటారు, కానీ దానిని ఆచరించడానికి అవసరమైన త్యాగం, కృషి
చేయడానికి మాత్రం సిద్ధంగా ఉండరు. ఫ్రాన్సిస్ గారు సువార్త పఠనం విన్న వెంటనే,
ఆచరణలో పెట్టడానికి వెంటనే బయలుదేరారు. ఆయనకు ఉన్నత విద్య లేదా శిక్షణ అవసరం
రాలేదు. దేవుడు పిలిచిన వెంటనే, సంకోచించకుండా తమకున్నదంతా
విడిచిపెట్టి, అక్షరాలా క్రీస్తును అనుసరించారు. కనుక,
దేవుని చిత్తం చిన్నదైనా సరే (ఉదా: ఎవరికైనా సహాయం చేయడం, క్షమించడం,
పేదలకు దానం చేయడం), ఆలస్యం చేయకుండా, తక్షణమే ఆచరించాలి. తెలుసుకోవడం అనేది దైవచిత్తం యొక్క మొదటి అడుగు
మాత్రమే; ఆచరించడం అనేది దైవచిత్తంలో ఉన్న ఆనందాన్ని,
సంతోషాన్ని పొందే మార్గం.
మూడవదిగా, సిలువ ద్వారానే దైవపిలుపును, చిత్తాన్ని అర్థం చేసుకోగలం –
నేడు మనలో ఉన్న సమస్య ఏమిటంటే, దైవచిత్తం అంటే మన జీవితంలో కేవలం సుఖం, విజయం, వ్యక్తిగత సంతోషం అని
చాలామంది భావిస్తున్నాము. అందుకే కష్టాలు, నిరుత్సాహం
వచ్చినప్పుడు సానుభూతి, ఓదార్పుకు నోచుకోలేక నిరాశ పడుతున్నాము.
ఫ్రాన్సిస్ గారు తమ పిలుపును, సిలువలో వ్రేలాడుతున్న
క్రీస్తు ప్రతిమ నుండే అర్థం చేసుకున్నారు. దైవచిత్తాన్ని అన్వేషించాలంటే, అది క్రీస్తు యొక్క త్యాగం, బాధ, పేదరికం యొక్క మార్గం గుండా వెళుతుందని మనం గ్రహించాలి. నిజమైన దైవచిత్తం
ఎల్లప్పుడూ స్వీయ-త్యాగాన్ని కోరుతుంది. మన జీవితంలో ఎదురయ్యే కష్టాలను, నిరుత్సాహాలను సిలువలో క్రీస్తు భాగస్వామ్యంగా చూడాలి. మన బాధలను కేవలం
వ్యక్తిగత సమస్యగా కాకుండా, క్రీస్తు యొక్క దైవచిత్తానికి విధేయత
చూపడానికి ఒక అవకాశంగా భావించాలి. దైవచిత్తం
ప్రకారంగా జీవించడంలో ఉన్న ఆనందం,లోకాశలలో,
సౌకర్యాలలోఉండదు; ఆ ఆనందం మన సమర్పణలో ఉంటుంది! ఈ విధంగా,
పునీత ఫ్రాన్సిస్ గారిని ఆదర్శంగా తీసుకోవడంద్వారా, మనం
కోరికల వలయం నుండి బయటపడి, దైవచిత్తాన్ని అన్వేషించడంలోనూ, ఆచరించడంలోనూ
ఉండేనిజమైన ఆనందాన్నిఅనుభవించగలం.
5. ఫ్రాన్సిస్:ప్రకృతి ప్రేమికుడు
ఫ్రాన్సిస్ ప్రకృతి ప్రేమికులు. ప్రకృతిద్వారా దేవుని మహిమను పొగడేవారు.
ప్రకృతిపట్ల గాఢమైన ప్రేమను, గౌరవాన్ని
పెంచుకున్నారు. ప్రకృతిలోని సమస్తములో దేవుని సాన్నిధ్యాన్ని చవిచూసారు. సమస్తమును
తన సహోదరీ, సహోదరులుగా పిలిచారు. నేడు మనం కూడా ప్రకృతి
పట్ల ప్రేమను, దాని నాశనమును కోరుకొనక అభివృద్ధిని
కోరుకొనేట్టు జీవించే అవసరం ఎంతగానో ఉంది. పునీత అస్సీసిపుర ఫ్రాన్సిస్ గారి దృష్టిలో, ప్రకృతి కేవలం ఒక వనరు లేదా ఒక దృశ్యం కాదు; అది దేవుని మహిమను, మంచితనాన్ని ప్రతిబింబించే ఒకజీవన దేవాలయంగా భావించారు. ఆయన ప్రకృతిని చూసే విధానం, లోకానికి ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక
పాఠాన్ని అందించింది.
మొదటిగా,
ప్రకృతి ద్వారా దేవుని మహిమను కీర్తించాలి - ఫ్రాన్సిస్ గారు ప్రకృతిలోనిసమస్తములో దేవుని సాన్నిధ్యాన్ని చవిచూశారు.ఒక పుష్పం, పారే నది లేదా మెరిసే నక్షత్రం—ప్రతిదీ దేవుని ప్రేమ యొక్క చిహ్నంగా, దేవుని హస్తకళగా వారికి కనిపించింది. దీనికి బైబులునే ప్రేరణగా
తీసుకున్నారు. ఆదికాండము మొదటి అధ్యాయంలో చెప్పబడిన విధంగా దేవుడు సమస్తమును
సృష్టించి, అది ‘మంచిది’ అని పలికారు. అలాగే 148వ కీర్తనలో, సృష్టి అంతా ప్రభువును
స్తుతించాలని చెప్పబడింది. సృష్టిలో ఉన్న సమస్తాన్ని సోదరుడు, సోదరీ అని
సంబోధించడం ద్వారా, దేవుని సృష్టిలో ఉన్న ఏకత్వాన్ని, సహోదరత్వాన్ని దృఢముగా
నమ్మారు. మనం ప్రకృతి నాశనమును కోరుకొనక అభివృద్ధిని కోరుకోవాలి. ప్రకృతి
నాశనానికి ప్రధాన కారణం మనవినియోగ
సంస్కృతి. మనం నిరంతరం ఎక్కువ కావాలని, కొత్తవి కావాలని కోరుకుంటాం. ఈ కోరికలను
తీర్చడానికి పరిశ్రమలు, ఫ్యాక్టరీలు భూమి వనరులను అత్యంత వేగంగా
దోచుకుంటాయి. ఫ్రాన్సిస్ గారు జీవించిన పేదరికం,నిరాడంబర
జీవనందీనికి ఒక సమాధానం అని చెప్పవచ్చు.తక్కువ వాడుకోవడం, అవసరానికి
మించి కోరుకోకపోవడంఅనేది ప్రకృతిపై ఒత్తిడిని తగ్గిస్తుంది.
మనం వనరులను ‘సమస్య’గా కాకుండా, దేవుడిచ్చిన ‘వరం’గా చూసినప్పుడే వాటిని
గౌరవించగలం. నిజమైన అభివృద్ధి అనేది ఎంతసంపాదించాంఅనేదానిపై కాదు, ఎంతత్యాగంచేశాం,
ఎంతసమతుల్యంగాజీవించాం
అనేదానిపై ఆధారపడి ఉంటుంది. అభివృద్ధిని కోరుకోవడంఅంటే
ప్రకృతినిదోచుకోవడంకాదు,
దానికిసంరక్షకులుగాఉండడం.
6. ఫ్రాన్సిస్:శాంతిదాత
ఫ్రాన్సిసువారు
తన జీవితముద్వారా ఈ లోకాన్నే మార్చేసారు. యుద్ధాలు,
విద్వేషాలు రాజ్యమేలుతున్న కాలంలోప్రేమ, కరుణ, ధైర్యంఅనే బలమైన ఆయుధాలతో ఈ లోకాన్ని మార్చారు.
క్రూసేడుల కాలములో, శాంతిని నెలకొల్పుటకు మధ్యవర్తిగా ఫ్రాన్సిస్
ధైర్యముగా ఈజిప్టుకు వెళ్లి అక్కడి సుల్తానును కలిసారు. యుద్ధాన్ని ఆపాలని కోరారు.
చరిత్రలో, పునీత ఫ్రాన్సిస్ గారు శాంతి కోసం చేసిన అత్యంత ధైర్యమైన చర్యలలో
ఒకటి,క్రీ.శ. 1219లో
ఈజిప్ట్కు ప్రయాణించడంమరియు
అక్కడ ఉన్నసుల్తాన్ అల్-కామిల్నుకలవడం. ఆ సమయంలో క్రైస్తవులు మరియు ముస్లింల మధ్యక్రూసేడుల పేరిట తీవ్రమైన యుద్ధాలు జరుగుతున్నాయి. రెండు
వర్గాలు విద్వేషంతో, హింసతో రగిలిపోతున్న సమయమది. ఈ ప్రమాదకర
పరిస్థితుల్లో, ఫ్రాన్సిస్ గారు యుద్ధాన్ని ఆపడానికి, మరియు
క్రీస్తు సువార్తను ప్రేమపూర్వకంగా ప్రకటించడానికినిరాయుధుడిగాశత్రు శిబిరంలోకి వెళ్లారు. ఆయన శక్తిని, ఆయుధాన్ని
నమ్ముకోలేదు; దేవునిపై విశ్వాసాన్నిమరియుప్రేమ శక్తినిమాత్రమే
నమ్ముకున్నారు. సుల్తాన్ అల్-కామిల్తో ఫ్రాన్సిస్ గారు చేసిన సంభాషణ, పరస్పర
గౌరవాన్నిమరియుమానవత్వాన్నితెలియజేసింది. ఈ సంఘటన మతపరమైన తేడాలు
ఉన్నప్పటికీ, సకల మానవాళిపట్లఫ్రాన్సిస్
వారికి ఉన్నఅపారమైన ప్రేమ, కరుణనుమరియుసంభాషణ
పట్ల ఉన్న నిబద్ధతను తెలియజేస్తుంది. ఈ చర్య, లోకంలోసహోదరత్వంసాధ్యమేనని నిరూపించింది.ఈ సంఘటన సకల మానవాళిపట్ల ఫ్రాన్సిసువారికున్న
ప్రేమ, కరుణను తెలియజేస్తుంది.
ఫ్రాన్సిస్ గారి శాంతి సందేశం కేవలం మాటల్లో లేదు; అది వారిఆచరణలో,
ధైర్యంలోమరియుప్రార్థనలోఉంది. ఫ్రాన్సిస్ గారి‘శాంతి
ప్రార్థన’అనేది ఆయన ప్రపంచ శాంతిదూత అని చెప్పడానికి గొప్ప
నిదర్శనం.
శాంతి ప్రార్ధన:
ప్రభువా! నీ శాంతి సాధనముగా నన్ను మలచుమయా!
ద్వేషమున్న చోట, ప్రేమను వెదజల్ల నీయుము
గాయమున్న చోట, క్షమాపణను చూప నీయుము
అవిశ్వాసమున్నచోట, విశ్వాసమును నింపనీయుము
నిరాశయున్నచోట, ఆశను పెంచనీయుము
అంధకారమున్నచోట, జ్యోతిని వెలిగింప
నీయుము
విచారము నిండినచోట, సంతోషము పంచనీయుము
ఓ దివ్యనాధా,
పరుల ఓదార్పును వెదుకుటకంటె
పరులను ఓదార్చు వరము నీయుము
పరులు నన్ను అర్ధము చెసుకొన గోరుటకంటె
పరులను అర్ధము చేసుకునే గుణము నీయుము
పరులు నన్ను ప్రేమించాలని కోరుటకంటె
పరులను ప్రేమింప శక్తినీయుము
ఎందుకనగా,
యిచ్చుట ద్వారానే, పొందగలము
క్షమించుట ద్వారానే, క్షమింప బడగలము
మరణించట ద్వారానే, నిత్యజీవము పొందగలము.
ఈ ప్రార్థన కేవలం ప్రపంచంలో శాంతిని కోరుకోవడమే కాకుండా,
అంతకంటే ముందుతనను
తాను దైవ శాంతికి సాధనంగామార్చమని దేవున్ని వేడుకోవడం. నిజమైన శాంతిబయటి
పరిస్థితుల నుండి కాకుండా, మనహృదయాల
నుండిమరియు మనచేతల
నుండిమొదలవ్వాలని ఇది స్పష్టంగా బోధిస్తుంది. మన
అంతరంగంలో శాంతిని స్థాపించుకున్నప్పుడే, మనం దానిని ఇతరులకు పంచగలం. ప్రార్థనలోని ప్రతి అంశం — ద్వేషాన్ని
ప్రేమతో జయించడం, గాయాన్ని క్షమించడం, నిరాశకు ఆశను అందించడం — క్రీస్తు
యొక్క గుణాలనుప్రతిబింబిస్తుంది.
ఈ లక్షణాలన్నీసిలువ త్యాగంనుండి
ఉద్భవించినవిమోచన శాంతినితెలియజేస్తాయి.
ఫ్రాన్సిస్ గారు తమ ప్రార్థనను ఆచరణలో చూపినందుకేప్రపంచ శాంతిదూతగాగౌరవించబడుతున్నారు.
అందుకు, ఆయన జీవితమే గొప్ప నిదర్శనం: ఫ్రాన్సిస్ గారుయుద్ధాన్ని
నమ్మకుండా, ప్రేమను, సేవనునమ్మారు.
శత్రువులను ద్వేషించమని కాకుండా, కౌగిలించుకోమని బోధించారు. ఈ దృఢ సంకల్పమే ఆయన్నునిరాయుధుడిగాక్రూసేడుల
సమయంలో ఈజిప్టు సుల్తానును కలవడానికి ధైర్యాన్ని ఇచ్చింది. ఇది సకల మానవాళి పట్ల
ఆయనకు ఉన్ననిస్వార్థ కరుణనుతెలియజేస్తుంది. అందుకే, నేటికీ మనం ఫ్రాన్సిసు గారిని కేవలం ఒక
పునీతుడిగా కాకుండా, మన హృదయాలలోశాంతిని,
సమతుల్యతనునెలకొల్పడానికి,
ద్వేషాన్ని ప్రేమతో జయించడానికి నిరంతరం ప్రేరేపించే ఒకగొప్ప శాంతిదూతగాగౌరవిస్తున్నాము.
ఆయన ప్రార్థన, ప్రతి విశ్వాసికి తమ జీవితాన్ని ఒకశాంతి వంతెనగా మార్చుకోవడానికి నిత్య మార్గదర్శకం.
ముగింపు:
జీవితం ఒసగే సుఖసంపదలను ఒడిసి
పట్టుకోవాలని పరుగులు తీస్తున్నప్పుడు, ఫ్రాన్సిస్ వారు క్రిందకు త్రోయబడ్డారు.
అప్పుడు జీవితంలో ఏది విలువైనది, ఏది నిరుపయోగమైనది, ఏది శాశ్వతమైనది, ఏది
అశాశ్వతమైనది? ఈ ప్రశ్నలు ఫ్రాన్సిస్ వారిని వెంటాడాయి. బానిసను వదిలి యజమానికి
సేవ చేయడం మొదలు పెట్టారు. లోకాన్ని వీడి దేవునికి సేవ చేయడం ప్రారంభించారు. “క్రీస్తు
లేకుండా ధనవంతునిగా ఉండుట కంటే, క్రీస్తు కొరకు నిరుపేదగా ఉండుట మేలు” అని
ఫ్రాన్సిస్ గారు గ్రహించారు. అలాగే జీవించారు. “నన్ను అనుసరింపగోరువాడు, సమస్తమును
అమ్మి పేదలకు దానము చేయుము. మీ సిలువను ఎత్తుకొని నన్ను అనుసరింప వలయును” అన్న క్రీస్తు
ప్రభువు మాటలను అక్షరాల జీవించారు. క్రీస్తున పరిపూర్ణతలో అనుసరించిన క్రైస్తవుడు
పునీత అస్సీసిపుర ఫ్రాన్సిస్ గారు. సార్వత్రిక సోదరభావంతో జీవించాడు. సృష్టిలో సకలం
ఆయన సోదరీ సోదరులే! సకల సృష్టిలో దేవుని సాన్నిధ్యాన్ని చూడాలని ఫ్రాన్సిస్
లోకానికి నేర్పించారు. దెబ్బతిన్న భూమాతను, నయంచేయు స్పర్శను మనం అందించాలని ఫ్రాన్సిస్
గారి స్ఫూర్తి మనలను కోరుచున్నది.
ఫ్రాన్సిస్ గారు కలలు కన్నారు. తన
త్యాగమయ జీవితం ద్వారా, వాటిని సాకారం చేసుకున్నారు. వారు క్రీస్తుయందే జీవించారు.
సంచరిచారు, ఉనికిని కలిగి యున్నారు. “క్రీస్తు వలె జీవించు’ అన్నది ఫ్రాన్సిస్
ఏకైక ధ్యాస. అలాగే జీవించారు. వారు పొందిన బాధలు వర్ణనాతీతం. వారి త్యాగం అమోఘం!
అందుకే వారిని “రెండవ క్రీస్తు” అని పిలుస్తున్నాం.
పునీత అస్సీసిపుర ఫ్రాన్సిస్ నడచిన
మార్గంలో, ఆయనవలె విభిన్నంగా ఆలోచించుటకు నీవు ధైర్యం చేయగలవా? ఫ్రాన్సిస్ వారి వలె
దేవుని పిలుపుకు స్పందించుటకు, దేవున్ని అన్వేషించుటకు సిద్ధంగా ఉన్నావా?
ఫ్రాన్సిస్ గారివలె, మన కుటుంబాన్ని, మన సంఘాన్ని, శ్రీసభను, మన సమాజాన్ని, ఈ
లోకాన్ని, పునర్నిర్మించుటకు, పునరుద్ధరించుటకు సాహసం చేయగలవా? ఫ్రాన్సిస్ వారి
కలలను, వివిధ రకాల సేవలద్వారా, సాకారం చేయడానికి సిద్ధంగా ఉన్నావా?
దేవుడు ప్రతీ ఒక్కరికి ఒక కలను కలిగియున్నారు.
ఆ కలను సాకారం చేయడానికి మనలో ప్రతీ ఒక్కరిని ఆహ్వానిస్తున్నారు. ఈ లోక బాగుకోసం,
శాంతి, ప్రేమ, న్యాయం, సామరస్యం కోసం కలలు కనడం నీకు ఇష్టమేనా? ఒక్క క్షణం
ఆలోచించుదాం! రండి అందరం కలిసి దేవుని కలను నిజం చేద్దాం! ఫ్రాన్సిస్ వారి జీవన్
స్పూర్తితో, ప్రార్ధన సహాయంతో అసాధ్యమైనదానిని సుసాధ్యం చేద్దాం! మన నుండే
ప్రారంభించి, ఈ లోకాన్ని మరింత మానవత్వం కలదిగా, మరింత అందముగా తయారు చేద్దాం!
ఓ పునీతఫ్రాన్సిస్
గారా! మేము నీ వైపు చూస్తున్నాము, నిన్ను
వేడుకుంటున్నాము:
సిలువముందు
నిలబడి యుండడం ఎలాగో మాకు నేర్పించు.
సిలువ వేయబడిన క్రీస్తుదృష్టిమాపై పడేలా చేసి, ఆ
చూపులో మేము లీనమైపోయేలా మాకు సహాయం చేయుము.
క్రీస్తుప్రేమద్వారా మేము క్షమించబడేలా, నూతనంగా
సృష్టించబడేలామమ్మల్ని అనుమతించమని మాకు నేర్పించు.
ఆమెన్.
పరిశుద్ధ
పొప్ ఫ్రాన్సిస్ గారి వేదవ్యాపక
ఆదివార సందేశము 19
అక్టోబరు 2025 “సకల
ప్రజల నిరీక్షణకు మిషనరీలమై ఉందాం”
ప్రియ సహోదరీ సహోదరులారా!
నిరీక్షణ
అనే అంశముతో కొనసాగుతున్న 2025 జూబిలీ సంవత్సరములోని వేదవ్యాపక ఆదివారమునకు నేను
ఎన్నుకున్న నినాదం: “సకల ప్రజల నిరీక్షణకు మిషనరీలమై ఉందాం”. ప్రతి క్రైస్తవునికీ,
జ్ఞానస్నానం పొందినవారికీ, సకల శ్రీసభకు ఇది ఒక ప్రాథమిక పిలుపుని
గుర్తు చేస్తుంది. క్రీస్తు అడుగుజాడల్లో నడుస్తూ, ఆశకు
దూతలుగా,ఆశను నిర్మించేవారిగా ఉండటమే ఆ పిలుపు.
పునరుత్థానుడైన క్రీస్తు ద్వారా “సజీవమగు నిరీక్షణలోకి” మనకు నూతన జన్మను
ప్రసాదించిన విశ్వసనీయుడైన దేవుని కృపతో నిండిన సమయమిదని నేను నమ్ముచున్నాను (1
పేతు 1:3-4). క్రైస్తవ మిషనరీ గుర్తింపుకు సంబంధించిన కొన్ని
ముఖ్యమైన విషయాలను నేను ప్రస్తావించాలనుకుంటున్నాను. తద్వారా, ప్రపంచాన్ని
ఆవరించిన చీకటి నీడలను తొలగించి (ఫ్రతెల్లి తుత్తి, 9-55), ఆశను
పునరుద్ధరించడానికి పంపబడిన సంఘంలో ఒక నూతన సువార్త కాలం కోసం దేవుని ఆత్మచే
నడిపించబడి, పవిత్రమైన ఉత్సాహంతో రగిలిపోగలం.
1. మన నిరీక్షణయగు
క్రీస్తు అడుగుజాడల్లో
2000
పవిత్ర సంవత్సరం తర్వాత, మూడవ సహస్రాబ్దపు మొదటి సాధారణ జూబిలీని
మనం జరుపుకుంటున్నాం. ఈ సమయంలో, మన దృష్టిని చరిత్రకు కేంద్రబిందువు అయిన,
“నిన్న, నేడు, ఎల్లప్పుడు ఒకే రీతిగ ఉన యేసుక్రీస్తుపై”
(హెబ్రీ 13:8) నిలపాలి. నజరేతులోని యూదుల ప్రార్థనా మందిరంలో,
యేసు “నేడు” లేఖనము నెరవేరినదని ప్రకటించారు. దీని ద్వారా, ఆయన
తండ్రిచే పంపబడి, పరిశుద్ధాత్మ అభిషేకంతో దేవుని రాజ్య సువార్తను
ప్రకటించి, సమస్త మానవాళికి“ప్రభుహితమైన
సంవత్సరమును”ప్రకటించుటకు అని వెల్లడించారు (లూకా 4:16-21).
ఈ
ఆధ్యాత్మికమైన“నేడు” (ఈరోజు),
లోకాంతం వరకు కొనసాగుతుంది. ఈ సమయంలో క్రీస్తు అందరికీ, ముఖ్యంగా
దేవుడే తమ ఏకైక ఆశగా ఉన్నవారికి, రక్షణకు సంపూర్ణతగా ఉన్నారు. ఆయన తన భూలోక
జీవితంలో “సమస్తాన్ని మంచిగా చేస్తూ, చెడు నుండి మరియు దుష్టశక్తి నుండి
అందరినీ స్వస్థపరుస్తూ” పర్యటించారు (అ.కా. 10:38).తద్వారా
నిరుపేదలకు, ప్రజలకు దేవునిపై ఆశను తిరిగి నింపారు.పాపం మినహా, మన
మానవ బలహీనతలన్నింటినీ ఆయన అనుభవించారు. గెత్సెమనే తోటలో పడిన వేదన, సిలువపై
అనుభవించిన బాధ వంటి నిరాశ కలిగించే కష్ట సమయాలను కూడా ఆయన చవిచూశారు. అయినప్పటికీ,
మానవాళి రక్షణకు, భవిష్యత్తులో శాంతిని అందించడానికి (యిర్మీయా 29:11)
తండ్రియైన దేవుడు వేసిన ప్రణాళికపై విధేయతతో, నమ్మకంతో
అన్నింటినీ ఆయనకు అప్పగించారు.ఈ
విధంగా, క్రీస్తు ఆశకు ఒక దైవిక మిషనరీగా మారారు. ఎటువంటి
కఠినమైన పరీక్షల మధ్యనైనా దేవుడు తమకు అప్పగించిన మిషన్ను నిర్వర్తించే శతాబ్దాల
నాటి మిషనరీలందరికీ ఆయన ఒక గొప్ప ఆదర్శంగా నిలిచారు.
తన
శిష్యుల ద్వారా, సకలప్రజల యొద్దకు పంపబడిన, మరియు
ఆధ్యాత్మికంగా వారితో ఉన్న ప్రభువైన యేసు, మానవాళికి ఆశను అందించే తన సేవను
కొనసాగిస్తున్నారు. ఆయన ఇప్పటికీ పేదవారిపైనా, బాధలో
ఉన్నవారిపైనా, నిరాశలో ఉన్నవారిపైనా, అణగారినవారిపైనా,
“వారి గాయాలపై ఓదార్పు అనే తైలమును, ఆశ అనే
ద్రాక్షారసాన్ని”పోస్తూ ఉంటారు (ప్రెఫేస్ “యేసు మంచి
సమరయుడు”).ప్రభువు, నాయకుడైన క్రీస్తుకు విధేయత చూపుతూ,
అదే సేవాస్ఫూర్తితో, శ్రీసభయైనక్రీస్తు
మిషనరీ శిష్యుల సంఘం, తన మిషన్ను కొనసాగిస్తుంది. జాతుల మధ్య తన
జీవితాన్ని అందరి కోసం అంకితం చేస్తుంది. అనేక హింసలు, కష్టాలు,
శ్రమలను ఎదుర్కొంటూ, మరియు తోటివారి బలహీనతల వల్ల కలిగే అసంపూర్ణతలు,
వైఫల్యాలు ఉన్నప్పటికీ, శ్రీసభ క్రీస్తు ప్రేమతో నిరంతరం ముందుకు
సాగుతుంది. ఆయనతో ఏకమై తన మిషనరీ ప్రయాణాన్ని కొనసాగించడానికి, మరియు
ఆయన వలె, ఆయనతో కలిసి బాధలో ఉన్న మానవాళి యొక్క మొరను,
నిశ్చయమైన విమోచన కోసం ఎదురుచూస్తున్న ప్రతి ప్రాణి యొక్క ఆక్రందనను
వినడానికి ప్రోత్సహించబడుతుంది. ప్రభువు ఎల్లప్పుడూ పిలిచే సంఘం ఇదే:“స్థిరంగా ఉండే సంఘం కాదు, కానీ
తన ప్రభువుతో కలిసి ప్రపంచ వీధుల్లో నడిచే ఒక మిషనరీ సంఘం” (పీటాధిపతుల
సినోడ్ సాధారణ సభ ముగింపు దివ్యబలిపూజలో ఉపన్యాసం, అక్టోబర్
27, 2024).
మనమంతా
ప్రభువైన యేసు అడుగుజాడల్లో నడవడానికి ప్రేరణ పొందుదాం. తద్వారా, ఆయనతో,
ఆయనలో మనం అందరికీ, దేవుడు మనకు అనుగ్రహించిన ప్రతి చోట, ప్రతి
పరిస్థితిలోఆశకు చిహ్నాలుగా,దూతలుగామారగలం. జ్ఞానస్నానం పొందిన ప్రతి ఒక్కరూ
క్రీస్తు యొక్క మిషనరీ శిష్యులుగా, ఆయన ఆశను భూమి నలుమూలలా ప్రకాశింపజేయాలి!
2. క్రైస్తవులు: సకల ప్రజల ఆశకు వాహకులు, నిర్మాణకర్తలు
తాము కలిసే ప్రజల జీవిత పరిస్థితులను పంచుకోవడం, సువార్తనుఅందించడం కొరకై ప్రభువైన క్రీస్తును
అనుసరించే క్రైస్తవులు పిలువబడి యున్నారు. దీనివల్ల వారు ఆశకు వాహకులుగా, నిర్మాణకర్తలుగా మారతారు. నిజానికి, “ఈ కాలపు ప్రజల ఆనందాలు, ఆశలు, దుఃఖాలు, వేదనలు, ముఖ్యంగా పేదవారివి, బాధలో ఉన్నవారివి అన్నీ క్రీస్తును
అనుసరించేవారివిగా కూడా ఉంటాయి. నిజమైన మానవ జీవితంలో ఉన్న ఏది కూడా వారి హృదయాలలో
ప్రతిధ్వనించకుండా ఉండదు” (గౌడియమ్ ఎట్ స్పేస్ 1).ద్వితీయ వాటికన్ మహాసభ యొక్క ప్రసిద్ధ ప్రకటన, ప్రతి శతాబ్దపు క్రైస్తవ సమాజాల భావన మరియు విధానాన్ని
ప్రతిబింబిస్తుంది. ఇది ఇప్పటికీ వారి శ్రీసభ సభ్యులను ప్రేరేపిస్తూ, ప్రపంచంలో వారి సోదర సోదరీమణులతో కలిసి నడవడానికి సహాయపడుతుంది. ఇక్కడ
నేను ప్రత్యేకంగా‘ఆద్ జెంతెస్’మిషనరీలు అయిన మీ గురించి
ఆలోచిస్తున్నాను. ప్రభువు పిలుపును అనుసరించి, మీరు ఇతర దేశాలకు వెళ్ళి, క్రీస్తులో ఉన్న
దేవుని ప్రేమను తెలియజేస్తున్నారు. దీనికోసం మీకు నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు
తెలుపుతున్నాను! పునరుత్థానం చెందిన క్రీస్తు తన శిష్యులను సకల ప్రజలకు సువార్తను
బోధించమని పంపిన ఆదేశానికి (మత్త 28:18-20) మీ జీవితాలు ఒక స్పష్టమైన ప్రతిస్పందన. ఈ విధంగా, మీరు పరిశుద్ధాత్మ శక్తితో, నిరంతర కృషి ద్వారా, జ్ఞానస్నానం పొందిన ప్రతి ఒక్కరికీ ఉన్న సార్వత్రిక పిలుపుకు
చిహ్నాలుగా మారారు. మీరు సకల ప్రజలలో మిషనరీలుగా, అలాగే ప్రభువైన యేసు మనకిచ్చిన గొప్ప ఆశకు సాక్షులుగా నిలిచారు.
ఈ ఆశ యొక్క పరిధి ఈ ప్రపంచంలోని అశాశ్వతమైన విషయాలను అధిగమించి,
మనం ఇప్పటికే పాలుపంచుకుంటున్న దైవిక వాస్తవాల
వైపు తెరుచుకుంటుంది. వాస్తవానికి, పునీత ఆరవ పాల్ గారు గమనించినట్లుగా,
దేవుని దయ యొక్క వరంగా శ్రీసభ అందరికీ అందించే
క్రీస్తులోని రక్షణ కేవలం “భౌతిక లేదా ఆధ్యాత్మిక అవసరాలను తీర్చే ఒక అంతర్గతమైనది
మాత్రమే కాదు... ఇది తాత్కాలిక కోరికలు, ఆశలు, వ్యవహారాలు మరియు పోరాటాలలో పూర్తిగా నిమగ్నమై లేదు. దాని బదులు,
అది అటువంటి పరిమితులన్నింటినీ దాటి, ఏకైక, నిరపేక్షమైన దేవునితో సహవాసంలో
సంపూర్ణతను పొందుతుంది. ఇది అతీతమైన మరియు అంతిమమైన రక్షణ. ఈ రక్షణ నిజానికి ఈ
జీవితంలోనే మొదలవుతుంది, కానీ నిత్యత్వంలో నెరవేరుతుంది”
(ఎవాంజెలీ నున్షియాంది, 27).
ఈ గొప్ప ఆశతో ప్రేరేపించబడి, క్రైస్తవ
సమాజాలు ఒకనూతన మానవాళికిదూతలుగా మారగలవు. అత్యంత “అభివృద్ధి చెందిన” ప్రాంతాలలో కూడా ప్రపంచం
తీవ్రమైన మానవ సంక్షోభ లక్షణాలను కలిగియుంది: విస్తృతమైన అయోమయం, ఒంటరితనం, వృద్ధుల అవసరాల పట్ల నిరాసక్తత,
కష్టాల్లో ఉన్న పొరుగువారికి సహాయం చేయడానికి
ముందుకు రాకపోవడం. అత్యంత సాంకేతికంగా అభివృద్ధి చెందిన దేశాలలో, “సామీప్యత” కనుమరుగవుతోంది. మనం పరస్పరం అనుసంధానించబడ్డాం, కానీ సంబంధాలు లేవు. సామర్థ్యంపై ఉన్న వ్యామోహం, భౌతిక వస్తువులు, ఆశయాల పట్ల ఉన్న ఆసక్తి మనల్ని
స్వార్థపరులుగా మారుస్తున్నాయి. ఇవి మనల్ని పరోపకారానికి దూరం చేస్తున్నాయి. అయితే,
ఒక సమాజంలో అనుభవించిన సువార్త, మనల్ని సంపూర్ణమైన, ఆరోగ్యకరమైన, విమోచించబడిన మానవత్వానికి తిరిగి తీసుకురాగలదు.
అందువల్ల, జూబిలీ సంవత్సర ప్రకటన పత్రంలో (బుల్
ఆఫ్ ఇండిక్షన్) పేర్కొనబడిన పనులను (నం. 7-15)
మనమందరం తిరిగి చేయాలని నేను కోరుకుంటున్నాను.
ముఖ్యంగా, అత్యంత పేదవారు, బలహీనులు, రోగులు, వృద్ధులు, భౌతికవాద, వినియోగదారు సమాజం నుండి వెలివేయబడిన
వారిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని నేను ఆహ్వానిస్తున్నాను. మనం ఈ కార్యాన్ని
దేవుని “శైలి”లో చేయాలి: సామీప్యతతో, కరుణతో, సున్నితత్వంతో. మన సోదర సోదరీమణుల ప్రత్యేక పరిస్థితులలో వారితో
వ్యక్తిగత సంబంధాన్ని పెంపొందించుకోవాలి (ఎవాంజెలీగౌదియుమ్,
127-128).చాలాసార్లు, వారే మనకు ఆశతో ఎలా జీవించాలో నేర్పిస్తారు. వారితో వ్యక్తిగత పరిచయం
ద్వారా, మనం ప్రభువు యొక్క కరుణామయ హృదయం యొక్క
ప్రేమను కూడా అందిస్తాము. అప్పుడు మనం, “క్రీస్తు
హృదయం... సువార్త యొక్క ప్రారంభ ఉపదేశానికి కేంద్ర బిందువు”అని గ్రహిస్తాము (దిలెక్సిత్ నోస్, 32).ఈ విధంగా, మనం దేవుని నుండి పొందిన నమ్మకము (1
పేతు 1:21) సరళంగా ఇతరులకు అందించగలం. అలాగే, దేవుని ద్వారా మనం పొందిన ఓదార్పునే ఇతరులకు కూడా తీసుకురాగలం (2
కొరి 1:3-4).యేసు యొక్క మానవ, దైవిక హృదయంలో, దేవుడు ప్రతి మనిషి హృదయంతో మాట్లాడాలని, మనందరినీ తన ప్రేమవైపు ఆకర్షించాలని కోరుకుంటున్నారు. “ఈ మిషన్ను కొనసాగించడానికి మనం పంపబడ్డాము: క్రీస్తు హృదయం తండ్రి
ప్రేమకు చిహ్నాలుగా ఉంటూ, ప్రపంచం మొత్తాన్ని ఆలింగనం
చేసుకోవడానికి” (పొంతిఫికల్ మిషన్ సొసైటీల సాధారణ సభలో పాల్గొన్నవారికి ఉపన్యాసం,
జూన్ 3, 2023).
3. ఆశతో నిండిన మిషన్ను పునరుద్ధరించడం
ఈ రోజుల్లో ఆశతో కూడిన మిషన్ యొక్క ఆవశ్యకతను ఎదుర్కొంటూ, క్రీస్తు శిష్యులు ముందుగా“ఆశకు కళాకారులుగా”మరియు తరచుగా అయోమయంలో, అసంతోషంగా ఉన్న
మానవత్వానికి దానిని తిరిగి తీసుకువచ్చే వారిగా ఎలా మారగలరో కనుగొనమని
పిలవబడ్డారు.
దీనికోసం, మనం ప్రతి దివ్యబలిపూజలో, ముఖ్యంగా దైవార్చనసంవత్సరానికి కేంద్రబిందువైనఈస్టర్ త్రయాహములో అనుభవించిన ఈస్టర్
ఆధ్యాత్మికతలో పునరుద్ధరించబడాలి. మనం క్రీస్తు యొక్క విమోచనా మరణం, పునరుత్థానంలో,
అంటే చరిత్ర యొక్క నిత్య వసంతాన్ని సూచించే
ప్రభువు యొక్క పవిత్ర పాస్కలో జ్ఞానస్నానం పొందాము. అందువల్ల, మనం “వసంతకాల ప్రజలు”గా, అందరితో
పంచుకోవడానికి నిండిన ఆశతో ఉన్నాము. ఎందుకంటే క్రీస్తులో “మరణం మరియు ద్వేషం మానవ
జీవితంపై పలికిన చివరి మాట కాదు అని మనం విశ్వసించి, తెలుసుకున్నాం” (కాటేకేసిస్, ఆగస్టు 23, 2017). దైవార్చనావేడుకలు, మరియు సంస్కారాలలో ప్రస్తుతం ఉన్నపవిత్ర పాస్క పరమ రహస్యాలనుండి, ప్రపంచ సువార్త యొక్క విశాలమైన క్షేత్రంలో ఉత్సాహంతో, పట్టుదలతో, ఓపికతో పనిచేయడానికి మనం పరిశుద్ధాత్మ శక్తిని నిరంతరం
పొందుతాము. “పునరుత్థానుడైన, మహిమ పొందిన క్రీస్తు
మన ఆశకు, నిరీక్షణకు, నమ్మకమునకు మూలం. ఆయన మనకు అప్పగించిన మిషన్ను
నెరవేర్చడానికి అవసరమైన సహాయాన్ని మన నుండి దూరం చేయరు” (ఎవాంజెలీగౌదియుమ్,
275).ఆయనలో, మనం“దేవుని నుండి
వచ్చిన ఒక వరం, క్రైస్తవులకు ఒక కర్తవ్యం” (హోప్
ఇస్ ఎ లైట్ ఇన్ ది నైట్, వాటికన్ సిటీ 2024, 7) అయిన ఆ పవిత్రమైన ఆశను జీవిస్తాము, దానికి సాక్షులుగా ఉంటాము.
నిరీక్షణ కలిగిన మిషనరీలు ప్రార్థించేవారు. కార్డినల్
ఫ్రాంకోయిస్-జేవియర్ వాన్ తువాన్ చెప్పినట్లుగా, “నిరీక్షణ కలిగిన వ్యక్తి ప్రార్థన చేసే వ్యక్తి”. వారు తమ సుదీర్ఘ ఖైదు జీవితంలో విశ్వాసపూర్వకమైన ప్రార్థన మరియు
దివ్యబలిపూజ నుండి పొందిన శక్తితో ఆశతో జీవించగలిగారు (ది
రోడ్ అఫ్ హోప్, బోస్టన్, 2001, పేజీ 963).ప్రార్థన ప్రధానమైన మిషనరీ కార్యం అని, అదే సమయంలోప్రార్ధన
“నిరీక్షణకు మొదటి బలం” అని మనం మర్చిపోకూడదు (కాటేకేసిస్,
మే 20, 2020).
ప్రార్థన ద్వారా, ముఖ్యంగా దేవుని వాక్యం ఆధారంగా,
నిరీక్షణతో కూడిన ఈ మిషన్ను మనం
పునరుద్ధరించుకుందాం.ప్రత్యేకంగా, పవిత్రాత్మచే రచించబడిన గొప్ప
ప్రార్థనా సమూహాలైనకీర్తనలద్వారా దీన్ని చేద్దాం (కాటేకేసిస్,
జూన్ 19, 2024).కీర్తనలు కష్టాల్లో కూడా ఆశతో ఉండటానికి,మన చుట్టూ ఉన్న
ఆశ యొక్క సంకేతాలను గుర్తించడానికి,దేవుడు సకల ప్రజలచేత స్తుతించబడాలి అనే నిరంతర “మిషనరీ” కోరికను
కలిగి ఉండటానికి మనకు నేర్పిస్తాయి (కీర్తన 41:12; 67:4).ప్రార్థించడం ద్వారా, దేవుడు మనలో వెలిగించిన ఆశ యొక్క నిప్పురవ్వను
మనం సజీవంగా ఉంచుతాము.తద్వారా అది ఒక పెద్ద అగ్నిగా మారి, మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరినీ వెలిగిస్తుంది మరియు వెచ్చగా
ఉంచుతుంది.ప్రార్థన ప్రేరేపించే నిర్దిష్టమైన
పనులు, క్రియల ద్వారా కూడా ఇది సాధ్యమవుతుంది.
చివరగా, సువార్త ప్రకటన అనేది ఒక సామాజిక
ప్రక్రియ, క్రైస్తవ ఆశ కూడా (బెనెడిక్ట్ XVI,
స్పె సాల్వీ, 14). ఈ ప్రక్రియ కేవలం సువార్త యొక్క ప్రారంభ ఉపదేశంతో, జ్ఞానస్నానంతో ముగిసిపోదు. బదులుగా, ప్రతి జ్ఞానస్నానం పొందిన వ్యక్తికి సువార్త మార్గంలో తోడుగా ఉండి,
క్రైస్తవ సమాజాలను నిర్మించడం ద్వారా ఇది కొనసాగుతుంది.
ఆధునిక సమాజంలో, శ్రీసభలో సభ్యత్వం ఎప్పటికీ ఒక్కసారి
సాధించేది కాదు. అందుకే, క్రీస్తులో పరిపక్వమైన విశ్వాసాన్ని
అందించడం, దాన్ని రూపొందించే మిషనరీ కార్యం“శ్రీసభ యొక్క అన్ని కార్యకలాపాలకు ఒక
ఆదర్శం” (ఎవాంజెలీగౌదియుమ్,
15). ఈ పనికి ప్రార్థన మరియు కార్యాచరణలో ఐక్యత
అవసరం. మరొక్కసారి నేను శ్రీసభ యొక్క ఈమిషనరీ సినోడాలిటీప్రాముఖ్యతను నొక్కి చెబుతున్నాను. అలాగే, జ్ఞానస్నానం పొందినవారి మిషనరీ బాధ్యతను ప్రోత్సహించడంలో, మరియు నూతన ప్రత్యేక స్థానిక శ్రీసభకు మద్దతు ఇవ్వడంలోపొంతిఫికల్ మిషన్ సొసైటీలుఅందిస్తున్న సేవను నొక్కి
చెబుతున్నాను. పిల్లలారా, యువత, పెద్దలు, మరియు వృద్ధులారా, మీరందరూ మీ
జీవిత సాక్ష్యం, ప్రార్థన, త్యాగాలు, దాతృత్వం ద్వారా శ్రీసభ యొక్క ఉమ్మడి
సువార్త మిషన్లో చురుకుగా పాల్గొనాలని నేను కోరుకుంటున్నాను. మీకు ధన్యవాదాలు!
ప్రియమైన సహోదరీ సహోదరులారా, మన ఆశ అయిన
యేసుక్రీస్తు తల్లియైనమరియవైపు చూద్దాం. ఈ
జూబిలీ కోసం, రాబోయే సంవత్సరాల కోసం మనం ఆమెకు మన
ప్రార్థనను అప్పగించి ఇలా వేడుకుందాం: “క్రైస్తవ ఆశ యొక్క కాంతి ప్రతి మనిషిని
వెలిగించుగాక! అది దేవుని ప్రేమ సందేశంగా అందరినీ చేరుకోగాక! శ్రీసభ ప్రపంచంలోని
ప్రతి భాగంలో ఈ సందేశానికి విశ్వసనీయంగా సాక్ష్యమిచ్చుగాక!”(బుల్ ‘స్పెస్ నాన్ కన్ఫుందిత్’, 6).
రోము, సెయింట్ జాన్ లాటరన్, జనవరి 25, 2025, పునీత పౌలు పరివర్తన పండుగ.