విశ్వవిభుడైన క్రీస్తురాజు మహోత్సవము,
Year C
2 సమూ 5:1-3;
కొలొస్సీ 1:12-20; లూకా 23:35-43
మన మంచి కాపరి క్రీస్తురాజు! క్రీస్తురాజు
పరలోక రాజ్యమునకు రాజు. రాజులకు రాజు! ప్రభువులకు ప్రభువు! ఆయన రాజ్యము రావాలి. ఆయన
రాజ్యములో మనము ఉండాలి.
క్రీస్తు రాజు నందు ప్రియ సహోదరీ,
సహోదరులారా, మనం క్రీస్తురాజు మహోత్సవమును
జరుపుకొనుచున్నాము. ఈ దైవార్చనా సంవత్సరంలో, ఇది చివరి ఆదివారము. ఈ పండుగ ప్రపంచానికి,
సమస్త చరిత్రకు యేసు
క్రీస్తే ఏకైక మరియు నిజమైన రాజు అని ప్రకటిస్తుంది. కతోలిక
శ్రీసభలో, పదకొండవ పయస్ పొప్ గారు 1925వ సంవత్సరంలో “క్వాస్ ప్రిమాస్” అను
అపోస్తోలిక లేఖ ద్వారా, ఈ పండుగను స్థాపించారు.
పోప్ పియస్ గారు ఈ పండుగను
స్థాపించడానికి ప్రధాన కారణం లౌకికవాదం
పెరుగడం మరియు ప్రపంచంలో రాజకీయ అస్థిరత నెలకొనడం. 1920లలో,
ప్రపంచ యుద్ధం తర్వాత, అనేక ప్రభుత్వాలు శ్రీసభ అధికారాన్ని, దైవిక
శక్తిని పూర్తిగా విస్మరిస్తూ, మతపరమైన విలువలకు వ్యతిరేకంగా నిలబడటం
ప్రారంభించాయి. ఈ ధోరణిని ఎదుర్కోవడానికి మరియు క్రీస్తు సర్వాధికారమును పునరుద్ఘాటించడానికి
ఈ పండుగను స్థాపించారు.
ఏ రాజకీయ సంస్థ గాని, లౌకిక నాయకుడు గాని,
క్రీస్తు రాజు స్థానాన్ని భర్తీ చేయలేరని, మరియు క్రీస్తు రాజరికం కేవలం
ఆధ్యాత్మికం మాత్రమే కాదు, సామాజిక మరియు రాజకీయ రంగాలకు
కూడా వర్తిస్తుందని ఈ పండుగ ప్రకటిస్తుంది. క్రీస్తు రాజ్యం శాంతి మరియు న్యాయంపై
ఆధారపడి ఉంటుంది. ప్రపంచంలో శాంతిని సాధించాలంటే, ప్రజలు
మరియు దేశాలు యేసు క్రీస్తు యొక్క ధర్మాన్ని అంగీకరించాలి. పొప్ పయస్ గారి
మాటల్లో, “ప్రజలు మరియు దేశాలు తమ జీవితాల నుండి
క్రీస్తును బహిష్కరించినంత కాలం, ఆయా దేశాలకు శాంతి అనేది ఉండదు” అని
చెప్పారు.
ఆరంభంలో ఈ పండుగ పేరు “మన ప్రభువైన యేసు
క్రీస్తు రాజు” అని ఉండేది. రెండవ వాటికన్ కౌన్సిల్ సంస్కరణల తరువాత, “విశ్వ
విభుడైన క్రీస్తు రాజు” అని ఆరవ పౌల్ పొప్ గారు మార్చారు. పండు తేదీ కూడా 1969
వరకు అక్టోబరు నెల చివరిలో కొనియాడేవారు. 1969 నుండి సామాన్య కాలంలో చివరి
ఆదివారమున కొనియాడా బడటం జరుగుతుంది. ఈ తేదీ మార్పుకు గల కారణం, యేసు
క్రీస్తు యొక్క రాజరికం కేవలం ఒక ప్రత్యేక సందర్భం కాదు, మొత్తం ఆరాధనా సంవత్సరం, ముగింపు మరియు నిత్యత్వానికి సంకేతం
అని నొక్కి చెప్పడానికి మార్చ బడింది. ఇది ఆగమన కాలం
ప్రారంభం కావడానికి సరిగ్గా ముందు వస్తుంది.
క్రీస్తు రాజరికం యొక్క పునాది ప్రధానంగా
మూడు అంశాలపై ఆధారపడి ఉంది:
1. ఆయన
జన్మము ద్వారా: యేసు క్రీస్తు దేవుని
కుమారుడు కాబట్టి, ఆయన సృష్టికర్త మరియు విమోచకుడు. సమస్త
సృష్టి ఆయన ద్వారా మరియు ఆయన కొరకు సృష్టించెను (కొలొస్సీ 1:16). ఈ
కారణం చేత, సమస్తం ఆయనకు విధేయత చూపాలి.
2. విమోచన
ద్వారా: క్రీస్తు తన రక్తాన్ని సిలువపై కార్చి మానవాళిని పాపం నుండి విమోచించారు.
కాబట్టి, ఆయన కేవలం రాజు మాత్రమే కాదు, మన రక్షకుడు కూడా!
3. అధికారం
ద్వారా: క్రీస్తుకు శక్తి,
శాసన అధికారం, న్యాయ నిర్ణయాధికారం మరియు కార్యనిర్వహణ అధికారం ఉన్నాయి.
క్రీస్తు రాజరికం యొక్క స్వభావం ఏమిటంటే,
1. ఆధ్యాత్మికం: క్రీస్తు రాజ్యం ప్రధానంగా ఆధ్యాత్మికమైనది.
ఇది “సత్యం మరియు జీవం యొక్క రాజ్యం, పవిత్రత
మరియు కృప యొక్క రాజ్యం, న్యాయం, ప్రేమ మరియు శాంతి యొక్క రాజ్యం”.
ఈ రాజ్యం మనుషుల హృదయాలపై
పాలన చేస్తుంది.
2. సార్వజనీనం:
క్రీస్తు యొక్క అధికారం కేవలం కతోలికులకు లేదా క్రైస్తవులకు మాత్రమే
పరిమితం కాదు, ప్రపంచంలోని ప్రతి వ్యక్తికి మరియు ప్రతి
దేశానికి విస్తరించి ఉంది.
3. లౌకిక
రంగంలో: ప్రభుత్వాలు మరియు దేశాల పాలన కూడా క్రీస్తు రాజు
ధర్మానికి లోబడి ఉండాలి. మతపరమైన అంశాలలో శ్రీసభకి
క్రీస్తు రాజు ప్రతినిధిగా పూర్తి స్వాతంత్ర్యం ఉండాలి.
క్రీస్తు రాజు పండుగ యొక్క ప్రయోజనాలు ఏమిటంటే,
మనుషులు తమ వ్యక్తిగత మరియు కుటుంబ
జీవితాలలో క్రీస్తును రాజుగా అంగీకరించాలి.
సమాజంలో మర్యాద, న్యాయం, మరియు
సహకారం పెరగాలి. ప్రజలు ప్రభుత్వాన్ని తమ రాజును
గౌరవించే విధంగానే గౌరవించాలి. యేసు క్రీస్తు రాజుగా ప్రపంచం అంతటా ప్రభుత్వాలు ఆయనను
గౌరవించాలని మరియు ఆయన చట్టాలను చట్టాలలో చేర్చడానికి ప్రయత్నించాలని
ప్రోత్సహించడం.
ఈ నాటి పఠనాలలో మనకు మూడు ముఖ్యమైన
అంశాలు కనిపిస్తున్నాయి: రాజ్యాభిషేకం,
సర్వాధిపత్యం, మరియు సింహాసనం.
మొదటి
పఠనం దావీదు రాజ్యాభిషేకం
గురించి తెలియ జేస్తుంది. దేవునిచే
అభిషేకించబడిన దావీదు ద్వారా క్రీస్తు రాజరికానికి పూర్వ సంకేతాన్ని మొదటి పఠనం తెలియ
జేస్తుంది.
మొదటి పఠన
నేపధ్యం ఏమిటంటే, ఇస్రాయేలీయులకు ఫిలిస్తీయులకు మధ్య జరిగిన యుద్ధంలో
సౌలురాజు, అతని కుమారులు మరణించారు (1 సమూ 31). సౌలు
తరువాత తమను కాపాడగల నాయకుడు దావీదేనని, అతడు
దేవుని యొక్క కృపను పొందిన వాడని ఇశ్రాయేలు ప్రజలు గట్టిగా నమ్మారు. అందుకే, ఇస్రాయేలీయుల
తెగల నాయకులందరూ కలిసి, హెబ్రోనున దావీదు యొద్దకు వచ్చి తమకు రాజుగా, నాయకుడుగా, కాపరిగా
ఉండమని ప్రాధేయపడ్డారు. దావీదును రాజును చేయడానికి, ఇశ్రాయేలు గోత్రాల పెద్దలు తెలిపిన
కారణాలు ఏమిటంటే, (i) దావీదు వారి రక్త సంబంధుడు (2 సమూ. 5:1).
(ii) సౌలు పరిపాలన సమయంలో ఇస్రాయేలు సైన్యనాయకుడు (2 సమూ 5:2,
1 సమూ 16:13). దావీదు అభిషేకం ఒక ప్రత్యేకమైన
బంధాన్ని తెలియజేస్తుంది. దేవుని ప్రజలకు నాయకత్వం వహించడానికి
దావీదు దేవునిచే ఎన్నుకోబడ్డాడు. అతను “నీవు నా ప్రజలకు కాపరివి, నాయకుడవు అయ్యెదవు” అని పిలువ బడ్డాడు.
ఇక్కడ రాజు అంటే అధికారం చెలాయించే
వ్యక్తి మాత్రమే కాదు, తన ప్రజలను రక్షించి, నడిపించే గొర్రెల కాపరి కూడా. దావీదు
రాజ్యం కేవలం ఒక ముందు
చూపు మాత్రమే. ఈ భూసంబంధమైన రాజులందరికీ, దేవుని
ఎంపికైన దావీదుకు కూడా పరిమితులు ఉన్నాయి. అయితే, మన
పండుగ యొక్క అసలు రాజు, పరిమితులు లేని మరియు శాశ్వతమైన రాజు, యేసు
క్రీస్తు రాజు.
దావీదు ఇస్రాయేలీయుల రాజగుటకు, మరియు వారిని సుదీర్ఘకాలం పరిపాలించుటకు ముఖ్య కారణం - అతడు
దేవునకు ప్రీతికరమైన వాడగుటచే, దేవునకు నచ్చినవాడగుటచే (1 సమూ 13:14, అ.కా. 13:22). దావీదు
మొదటినుండి దైవభయము కలవాడు. దైవభీతితో దేవుని సహవాసమును పొంది, దేవుడిచ్చిన
శక్తితో అతనికి అడ్డు వచ్చిన శత్రువులను ధైర్యంగా ఎదుర్కొని పోరాడాడు.
దేవునియొక్క సహవాసమే (దైవభయం) అతనికి విజయాన్ని చేకూర్చింది. దేవునికి, దేవుని
మాటకు దావీదు చూపిన వినయ, విధేయతలే అతన్ని సింహాసనంపై కూర్చుండ బెట్టింది.
విధేయతే అతని సుదీర్ఘకాలం రాజుగా, దేవుని ప్రతినిధిగా, సేవకుడిగా
మన్ననను పొందగలిగేలా చేసింది. దేవుడు అతనికి చేదోడు వాదోడుగా ఉండటం వలననే అతడు
కీర్తిప్రతిష్టలు సంపాదించ గలిగాడు.
అయితే, ఎప్పుడైతే, అతడు
దేవునితో సంప్రదింపులు మానివేశాడో, అప్పుడే అతని పతనం మొదలైంది. ఎప్పుడైతే, స్వతంత్రంగా
రాజ్యాన్ని పాలించడం ఆరంభించాడో, అప్పుడే అతని జీవితం మసకబారి పోయింది.
ఎప్పుడైతే, ఇశ్రాయేలు రాజ్యం, అధికారం
తన సొత్తు అనుకోవడం ఆరంభించాడో అప్పుడే దేవున్ని, దేవుని
అధికారాన్ని నిర్లక్ష్యం చేయడం ఆరంభించాడు. నిజమైన అధికారం దేవునిది! తనకు
ఇష్టంవచ్చినట్లు జీవించడం ఆరంభించాడు. పాపం చేసాడు. తన పతనానికి తన అధోగతికి తానే
కారకుడయ్యాడు. తన ఐశ్వర్యంలో, అధికారంలో దేవున్నే నిజమైన రాజుగా, కాపరిగా, ప్రజలకు
అండగా గుర్తించలేక పోయాడు. గుర్తించ లేనంతగా అతని హృదయదృష్టి మందగించింది. అందుచేత,
దేవున్ని మరచిపోయి తనకు యిష్టము వచ్చినట్లుగా తన ఆలోచనలకు అనుగుణంగా
నడచుకున్నాడు. ఆవిధంగా, దేవుని నుండి, తన
నుండి దూరమయ్యాడు.
దానికి భిన్నంగా, క్రీస్తురాజు అన్ని
సందర్భాలలో దేవున్ని అంటిపెట్టుకొని యున్నాడు. సర్వదా దేవునికి విధేయుడై యున్నాడు
(ఫిలిప్పీ 2:5-11). కష్టమైనా, నష్టమైనా
దేవుని చిత్తాన్ని ఇష్టపడ్డాడు. అందుకే అతడు “తండ్రీ, నీ
చిత్తమైనచో ఈ పాత్రను నానుండి తొలగింపుము. కాని నా యిష్టము కాదు. నీ చిత్తమే
నెరవేరును గాక” (లూకా 22:42) అని
ప్రార్ధన చేయ గలిగారు. తండ్రి చూపిన సిలువ మార్గమునకు వెళ్ళగలిగారు. ఈ బాధాకరమైన
శ్రమల మార్గంలో తండ్రిచిత్తాన్ని, దైవనిర్ణయాన్ని వ్యతిరేకించలేదు. సైనికులు
హింసిస్తున్న, యూదులు గేలిచేస్తున్న, దారిన
పోయేవారు వెక్కిరిస్తున్న, తండ్రి దేవుని ప్రణాళికను, చిత్తమును
తప్ప మరేమీ ఆయనకు కనబడలేదు. అందుకే, యేసుతోపాటు సిలువ వేయబడిన నేరస్థుడు, సిలువమీద
దిగంబరంగా కొన ఊపిరితో ఉన్న యేసులో రాజును చూడగలిగాడు (లూకా 23:36-43).
రాజంటే పరులను అధికారముతో, ఆధిపత్యముతో
పాలించడం కాదు. తండ్రి దేవుని మాటను, చిత్తాన్ని
పాటించడం’. రాజంటే అధికారం చెలాయించడం కాదు. అందరి ఆదరణ, తండ్రియొక్క
ఆత్మీయతను పొందడం. రాజంటే స్వతంత్రంగా వ్యవహరించడం కాదు, స్వతంత్రంగా
తండ్రిచి త్తానికి అప్పగించు కోవడం. రాజంటే సేవలు చేయించు కోవడం కాదు, సేవలు
చేయడం అని క్రీస్తురాజు మనకు నేర్పించారు.
అందుకే, యేసు తండ్రికి ప్రియమైన వానిగా నిలిచియున్నారు.
క్రీస్తు, రాజుగా,
మనకు నిజ స్వాతంత్ర్యమును, స్వేచ్చను ఒసగారు, అదియే
పాపక్షమాపణ. అంధకార శక్తులనుండి విడుదల చేసియున్నారు. దేవునిలో భాగస్థులను చేసారు.
దేవునితో తిరిగి మనలను తన సిలువ బలిద్వారా సమాధాన పరచారు. తండ్రి దేవుని రాజ్యములో
చేర్చారు. క్రీస్తురాజు మహోత్సవ సందర్భంగా, మనందరికీ
ప్రభువు ఇచ్చే పిలుపు ఇదే, సంపూర్ణంగా, దేవునికి
మనల్ని మనం సమర్పించు కోవాలి. దేవుని పాలన, రాజ్యము
భూలోకములో రావాలి. అది మనందరి ద్వారా మాత్రమే సాధ్యం అవుతుంది.
రెండవ
పఠనం మన దృష్టిని దావీదు నుండి నేరుగా యేసు క్రీస్తుపైకి మళ్లిస్తుంది. ఇది క్రీస్తు
యొక్క గొప్ప రాజరికాన్ని, సర్వాధిపత్యాన్ని ఘనంగా ప్రకటిస్తుంది. క్రీస్తు యొక్క సార్వభౌమ అధికారాన్ని మరియు
సృష్టిపై ఆయనకున్న ఆధిపత్యాన్ని వివరిస్తుంది. కొలొస్సీ 1:13వ వచనంలో ఇలా
చదువుచున్నాం: “ఆయన మనలను అంధకార శక్తి నుండి విడిపించి, తన
ప్రియ పుత్రుని సామ్రాజ్యం లోనికి సురక్షితంగా తోడ్కొని
వచ్చెను.” క్రీస్తు మన రాజు మాత్రమే కాదు, మన విమోచకులు కూడా. ఆయన “అదృశ్య
దేవుని స్వరూపి” మరియు “సమస్త
సృష్టికి ఆది సంభూతుడు”. అంటే, క్రీస్తు ద్వారానే సృష్టి జరిగింది,
మరియు సమస్తం ఆయన కొరకు మరియు ఆయన ద్వారానే నిలబడుతోంది. ఆయన సంఘమునకు శిరస్సు. ఆయన మన
మధ్యవర్తి. ఈ పఠనం, యేసు రాజు అంటే కేవలం భూమికి రాజు మాత్రమే కాదని
స్పష్టం చేస్తుంది—ఆయన సమస్త అదృశ్య
మరియు దృశ్య లోకాలకు రాజు. ఆయన రాజరికం ప్రేమ మరియు సృష్టికి
సంబంధించినది.
సువిశేష
పఠనం మన రాజు యొక్క సింహాసనాన్ని గూచి తెలియ
జేస్తుంది — ఆ సింహాసనమే, సిలువ.
ప్రజలు, పరిపాలకులు మరియు సైనికులు ఆయనను “ఇతడు ఇతరులను
రక్షించెను. కాని , ఇతడు దేవుడు ఎన్నుకొనిన క్రీస్తు అయినచో,
తనను తాను రక్షించుకొన నిమ్ము” (లూకా 23:35) అని ఎగతాళి చేసారు. యేసు తన రాజరిక అధికారాన్ని లోకం ఆశించినట్లుగా,
దండించడం ద్వారా లేదా సిలువపై నుండి దిగి రావడం ద్వారా చూపలేదు. బదులుగా,
ఆయన తన రాజరికాన్ని బలహీనత,
బాధ మరియు క్షమాపణ ద్వారా వ్యక్తపరిచారు. ఆయన పక్కనే ఉన్న నేరస్థులలో
ఒకడు తన తప్పును ఒప్పుకొని, “యేసూ! నీవు
నీ రాజ్యములో ప్రవేశించునప్పుడు నన్ను జ్ఞాపకముంచు కొనుము” (23:42)
అని వేడుకున్నాడు. ఈ నేరస్థుని ప్రార్థన, యేసు రాజరికం యొక్క సారాంశాన్ని తెలియ జేస్తుంది.
యేసు తన ప్రాణత్యాగం ద్వారా
మనలను రక్షించే రాజు. ఆయన యొక్క వాగ్దానం మన ఆశకు ఆధారం, “నేడే నీవు నాతో కూడ
పరలోకమున ఉందువు” (23:43).
ఆత్మపరిశీలన చేసుకుందాం! నా జీవితంలో
యేసు క్రీస్తు రాజుగా ఉన్నారా? ఆయన మన హృదయం అనే సింహాసనంపై కూర్చుని ఉన్నారా? ఆయన
రాజరికం కేవలం దేవాలయ గోడలకే పరిమితమా, లేక మన పనిలో,
కుటుంబంలో, మరియు ఇరుగు పొరుగు వారిపై ప్రేమ చూపడంలో వ్యక్తమవుతోందా? దావీదు
ఇశ్రాయేలుకు కాపరి అయినట్లుగా, క్రీస్తు మనలను తన రక్తం ద్వారా కొని, మనకు నిత్య జీవానికి మార్గాన్ని
చూపిన మహోన్నతమైన కాపరి మరియు రాజు. ఆయన సిలువ, భూమి
యొక్క అధికారాన్ని కాకుండా, ప్రేమపూర్వకమైన సేవ యొక్క
రాజరికాన్ని ప్రకటిస్తుంది. ఈ రోజు, మనం ఆయనను మన జీవితానికి, లోకానికి
ఏకైక రాజుగా ప్రకటించి, ఆయన రాజ్యంలో జీవించడానికి మనల్ని మనం పునరంకితం
చేసుకుందాం.
కనుక మనము ఎల్లప్పుడూ పరలోక రాజు ఐన
క్రీస్తు రాజును అనుసరిస్తూ, ఆయన వలే మనము సాటివారి యెడల ప్రేమను, కనికరమును,
క్షమాగుణమును, సహాయ గుణమును కలిగి, ఆయన
అనుసరణలో, ఆయనను పోలి మనమూ జీవించాలి. మన
మంచి కార్యములతో ఆ కాపరి మేపు మందలోని గొర్రెలమై జీవించి, ఆయన
సింహాసనాసీనుడై ఉన్న పరలోక రాజ్యమున, కుడి ప్రక్కన వుండు లాగున జీవించుదాం.
సాటివారికి సహాయం చేద్దాం. ఆకలిగొనిన
వానికి అన్నము పెడదాం. దప్పికగొనిన
వారికి దాహము తీర్చుదాం. గృహములు లేనివారికి చేయూతనిద్దాం. వారికి గృహములను
ఏర్పాటు చేయడానికి సహాయం చేద్దాం. వస్త్రములు లేనివారికి వస్త్రములను సహాయం
చేద్దాం. రోగులను పరామర్శించుదాం. అన్యాయముగా శిక్షకు పాత్రులైన చెరసాలలో ఉన్న
వారిని దర్శించి, వారికి ధైర్యాన్ని చెప్పి, దేవుని
యందు విశ్వాసముతో, జీవించేటట్లు మన వంతు మనము దేవుని కొరకు ఎన్నో
కార్యములు చేద్దాం.
ఇహలోకమున చేయు సహాయములు, పరలోకమున
లెక్కించ బడుతాయని, విశ్వసించి, ఈ లోక
జీవిత వైభోగము, పొగడ్తలు కాకుండా, ఆ దైవ రాజ్యములో చోటును సంపాదించు కోవడానికి,
మన కొరకు సిద్ధపరచిన పరలోక రాజ్య, నిత్యజీవమున
భాగస్తుల మవుదాం. దేవుడు దీనుల పట్ల ఎంతో దయ చూపించారు. వారి కొరకే నేను ఈ భూమికి
వచ్చాను అని సాక్ష్యం ఇచ్చారు. నీవు నేను కూడా దీనులను
అసహ్యించుకోకుండా, రోగులను ఛీధరించు కోకుండా, పేదలను
హీనపరచకుండా, తప్పు చేసిన వారిని ఇంకా బాధించకుండా, వస్త్రములు
లేక ఇబ్బందులు పడే వారిని గూర్చి చులకనగా మాట్లాడకుండా, సహాయం చేద్దాం. క్రీస్తు ప్రభువుని మనస్తత్వమును,
ఆయన స్వభావమును, మనం కూడా కలిగి ఉందాం. పరలోక రాజు, క్రీస్తు
రాజునకు ఇష్టమైన కార్యములు చేసి, ఆయనకిష్టమైన బిడ్డలముగా ఆయన సింహాసనము ప్రక్కన
కుడివైపున, ఆశీర్వదింపబడిన, దీవింపబడిన,
జనాంగములో, నీవు/
నేను/ మనమందరమూ ఉండడానికి నిత్య ప్రయత్నం
చేస్తూనే ఆ విధంగా జీవించుదాం. దేనిని
గూర్చియూ బాధగా, కష్టముగా, భయముగా,
చేతగాని వారముగా బాధపడవద్దు. భయపడవద్దు. మనలో
ప్రేమను, సమైక్యతను, క్షమాపణను,
తగ్గింపు గుణమును, సహాయక గుణమును, ఓదార్పు
మనస్తత్వమును, కలిగి నీతిమంతులు ఉండే నిత్యజీవములో
ప్రవేశించుదాం. ఆ విధముగా జీవించడానికి మనము కొన్ని త్యాగములు చేసుకోవలసి ఉంటుంది.
కొన్ని
బాధలు పడవలసి ఉంటుంది. ఐనప్పటికీ, మన పరలోక రాజైన, క్రీస్తు
రాజునూ, మన హృదయాలలో రారాజుగా ప్రతిష్టించుకొని, ఆయన
అనుసరణలో ఆయన వాగ్దానములను, ఆయన ఆజ్ఞలను, మననం
చేసుకుంటూ తుది తీర్పులో నిత్యానందమును
పొందుకుందాం. క్రీస్తు రాజు రాజ్యమున జీవించడానికి కావలసిన దైవసహాయమును, ఆ
దేవుని నడిపింపును, ఆ దేవున్ని అనుసరించే మనస్తత్వమును, మంచి
కాపరియైన క్రీస్తు ప్రభుని మందలోని గొర్రెలమై, ఆయన
ప్రజలమై, ఆయన అనుసరణలో ఆయన కనుసన్నలలో, ఆయన
జీవించమనిన విధముగా జీవించునట్లుగా, మనల్ని నడిపించమని ఆ దేవునికి
ప్రార్థించుకుందాం. ఆమెన్.

