పొప్ లియో XIV, రేజీనా చెలీ, 25 మే 2025

పొప్ లియో XIV
రేజీనా చెలీ
పు. పేతురు బసిలికా, రోము నగరము
ఆదివారము, 25 మే 2025

ప్రియమైన సహోదరీ సహోదరులారా! మీ అందరికీ ఆదివారం శుభాకాంక్షలు!

మీ మధ్య నా సేవ ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. అన్నింటికంటే ముందు, మీరు చూపించిన ప్రేమకు నా హృదయ పూర్వక కృతజ్ఞతలు. మీ ప్రార్థనలు, సాన్నిహిత్యంతో నాకు అండగా ఉండాలని కోరుతున్నాను.

మన దైనందిన జీవితంలో లేదా మన విశ్వాస ప్రయాణంలో, ప్రభువు మనలను ఏ కార్యానికి పిలిచినా, కొన్నిసార్లు మనం సరిపోమని భావిస్తుంటాం. అయితే ఈ ఆదివారం సువార్త (యోహాను 14:23-29) మనకు ఒక గొప్ప విషయాన్ని తెలియ జేస్తుంది: మనం మన స్వంత సామర్థ్యాలపై ఆధారపడకూడదు. దానికి బదులుగా మనలను ఎన్నుకున్న ప్రభువు దయపై ఆధారపడాలి. అలాగే, పరిశుద్ధాత్మ మనల్ని నడిపిస్తుందని, మనకు అన్ని విషయాలు నేర్పిస్తుందని మనం ఖచ్చితంగా నమ్మాలి.

ప్రభువు మరణానికి ముందు రోజు, అపొస్తలులు ఆందోళన మరియు బాధలో ఉండి, దేవుని రాజ్యానికి సాక్ష్యం ఇవ్వడము ఎలా కొనసాగించాలని ఆలోచించారు. అప్పుడు యేసు వారికి పరిశుద్ధాత్మ అనుగ్రహము గురించి మాట్లాడారు. ఆయన ఈ అద్భుతమైన వాగ్దానం చేశారు: “నన్ను ప్రేమించువాడు నా మాటను పాటించును. అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును. మేము వాని యొద్దకు వచ్చి వానితో నివసింతుము” (వచనం 23).

ఈ విధంగా, యేసు శిష్యులను వారి ఆందోళన నుండి విముక్తుల్ని చేస్తూ ఇలా అన్నారు: “మీ హృదయములను కలవర పడనీయకుడు. భయ పడనీయకుడు” (వచనం 27). ఎందుకంటే, మనం ఆయన ప్రేమలో ఉంటే, ఆయన మనలో నివసించడానికి వేంచేస్తారు మరియు మన జీవితం దేవుని ఆలయంగా మారుతుంది. ఆయన ప్రేమ మనకు జ్ఞానాన్నిస్తుంది. మనం ఆలోచించే విధానాన్ని, పనిచేసే విధానాన్ని ప్రభావితం చేస్తుంది. ఇతరులకు విస్తరిస్తుంది మరియు మన జీవితంలోని ప్రతి పరిస్థితిని ఆవరించుకుంటుంది.

మనలో దేవుని నివాసం అనేది నిస్సందేహంగా పరిశుద్ధాత్మ యొక్క వరం. పరిశుద్ధాత్మ మనలను చెయ్యి పట్టుకొని, మన దైనందిన జీవితంలో దేవుని ఉనికిని, సాన్నిధ్యాన్ని అనుభవించడానికి సహాయపడుతుంది. ఎందుకంటే, ఆయన మనలను తన నివాసంగా చేసుకుంటాడు.

మన వ్యక్తిగత పిలుపు, మనం ఎదుర్కొనే పరిస్థితులు, మన సంరక్షణకు అప్పగించబడిన వ్యక్తులు, మన బాధ్యతలు, శ్రీసభలో మన సేవ – వీటన్నింటినీ మనం ఆలోచించినప్పుడు, ప్రతి ఒక్కరం విశ్వాసంతో ఇలా చెప్పగలగడం అద్భుతం: “నాలో బలహీనతలు ఉన్నప్పటికీ, ప్రభువు నా మానవనైజం పట్ల సిగ్గుపడరు. బదులుగా, ఆయన నాలో నివసించడానికి వస్తారు. తన ఆత్మతో నాతో పాటు ఉంటారు; నాకు జ్ఞానాన్ని ప్రసాదిస్తారు మరియు ఇతరులకు, సమాజానికి, ప్రపంచానికి తన ప్రేమను అందించడానికి నన్ను ఒక సాధనంగా చేస్తారు.”

ప్రియమైన మిత్రులారా, ప్రభువు వాగ్దానం ఆధారంగా, విశ్వాసం నుండి పుట్టిన ఆనందంతో నడుద్దాం, తద్వారా ప్రభువుకు పవిత్ర ఆలయంగా మారదాం. ఆయన ప్రేమను ప్రతిచోట పంచడానికి సంకల్పించుకుందాం. మన సహోదరీ, సహోదరులు ప్రతి ఒక్కరూ దేవుని నివాస స్థలమే అని, ఆయన ఉనికి ముఖ్యంగా చిన్నవారిలో, పేదవారిలో మరియు బాధపడేవారిలో వ్యక్తమవుతుందని ఎన్నడూ మర్చిపోవద్దు. వీరంతా ఆలోచనాత్మకమైన మరియు కరుణగల క్రైస్తవులుగా ఉండమని మనల్ని కోరుతున్నారు.

మరియు మనం పరిశుద్ధ మరియ మాత మధ్యవర్తిత్వానికి మనల్ని మనం అప్పగించుకుందాం. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా, ఆమె “దేవునికి పవిత్రమైన నివాస స్థలంగా” మారింది. ఆమెతో కలిసి, మనం కూడా మన జీవితాలలో ప్రభువును స్వాగతించే ఆనందాన్ని తెలుసుకుందాం మరియు ఆయన ప్రేమకు చిహ్నాలుగా, సాధనాలుగా ఉందాం.

రేజీనా చెలీ తర్వాత పరిశుద్ధ తండ్రి వ్యాఖ్యలు

ప్రియమైన సహోదర సహోదరీలారా!

నిన్న పోజ్నాన్ (పోలాండ్)లో, స్టానిస్లాస్ కోస్త్కా స్ట్రీచ్ అనే మేత్రాసణములో గురువును ధన్యుడిగా ప్రకటించారు. కమ్యూనిస్ట్ సిద్ధాంతాన్ని అనుసరించేవారికి పేదల మరియు కార్మికుల పట్ల ఆయన చేసిన సేవ నచ్చకపోవడంతో, 1938లో మత ద్వేషంతో ఆయన హత్య చేయబడ్డాడు. సువార్త సేవలో మరియు తమ సహోదరీ సహోదరుల సేవలో గురువులు ముఖ్యంగా ఆయన ఆదర్శాన్ని స్ఫూర్తిగా తీసుకుని తమను తాము ఉదారంగా అంకితం చేసుకోవాలి.

నిన్న, పరిశుద్ధ కన్య మరియ క్రైస్తవుల సహాయ మాత పండుగ రోజున, పోప్ బెనెడిక్ట్ XVI స్థాపించిన చైనాలోని చర్చి కోసం ప్రార్థనా దినోత్సవాన్ని కూడా మనం జరుపుకున్నాం. చైనాలోని మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న చర్చిలలో, పుణ్యక్షేత్రాలలో, చైనీస్ కతోలికుల పట్ల శ్రద్ధకు మరియు ప్రేమకు సూచనగా, మరియు విశ్వవ్యాప్త శ్రీసభతో వారి ఐక్యత కొరకు దేవునికి ప్రార్థనలు సమర్పించ బడ్డాయి. పరిశుద్ధ మరియ మాత మధ్యవర్తిత్వం ద్వారా, వారికి మరియు మనకు, కష్టాల మధ్య కూడా సువార్తకు బలమైన మరియు ఆనందకరమైన సాక్షులుగా ఉండే కృపను పొందేలా చేయుగాక, తద్వారా మనం ఎల్లప్పుడూ శాంతిని మరియు సామరస్యాన్ని ప్రోత్సహించవచ్చు.

ఈ భావాలతో, యుద్ధం కారణంగా బాధపడుతున్న ప్రజలందరినీ మన ప్రార్థన కౌగిలించు కుంటుంది. సంభాషణలో నిమగ్నమైన వారికి మరియు శాంతి కోసం నిజాయితీగా అన్వేషిస్తున్న వారికి ధైర్యాన్ని, పట్టుదలను ప్రసాదించమని మనం వేడుకుందాం.

పదేళ్ల క్రితం, పోప్ ఫ్రాన్సిస్ మన ఉమ్మడి నివాసం (భూమి) సంరక్షణకు అంకితం చేయబడిన తన ఎన్‌సైక్లికల్ లేఖ ‘లౌదాతో సి’ (Laudato Si’) పై సంతకం చేశారు. అది అసాధారణ ప్రభావాన్ని చూపింది. లెక్కలేనన్ని కార్యక్రమాలకు స్ఫూర్తినిచ్చింది మరియు భూమి, పేదల ఉభయ ఆక్రందనను వినమని అందరికీ నేర్పింది. ‘లౌదాతో సి’ ఉద్యమానికి మరియు ఈ నిబద్ధతను కొనసాగిస్తున్న వారందరికీ నేను వందనం పలుకుతూ, ప్రోత్సహిస్తున్నాను.

ఇటలీ నుండి మరియు ప్రపంచంలోని అనేక ప్రాంతాల నుండి వచ్చిన మీ అందరికీ, ముఖ్యంగా వాలెన్సియా మరియు పోలాండ్ నుండి వచ్చిన యాత్రికులకు నేను వందనాలు చెబుతున్నాను. పోలాండ్‌లోని పీకరీ స్లాస్కీలోని మరియ తల్లి పుణ్యక్షేత్రానికి జరుగుతున్న గొప్ప తీర్థయాత్రలో పాల్గొంటున్న వారికి నా ఆశీస్సులు. పెస్కారా, సోర్టినో, పటెర్నో, కాల్టాగైరోన్, మస్సరోసా నార్డ్, మల్నాటే పలగోనియా మరియు సెరెల్లో నుండి వచ్చిన భక్తులకు, అలాగే రోమ్‌లోని యేసు మరియు మరియ తిరు హృదయాల విచారణ నుండి వచ్చిన వారికి కూడా నా వందనాలు. జెనోవా అగ్రపీఠము, శాన్ టియోడోరో, టెంపియో-అంపురియాస్ మేత్రాసణములోని కన్ఫర్మెంట్లకు, మరియు పడెర్నో డుగ్నానో నుండి వచ్చిన సైకిల్‌దారులు మరియు పలెర్మో నుండి వచ్చిన బెర్సాగ్లిరీలకు నేను వందనాలు చెబుతున్నాను.

అందరికీ ఆదివార శుభాకాంక్షలు!

1 comment: