సాధారణ సమావేశం, లియో XIV జగద్గురువులు, బుధవారం, 04 జూన్ 2025

 లియో XIV జగద్గురువులు
సాధారణ సమావేశం
సెయింట్ పీటర్స్ స్క్వేర్, బుధవారం, 04 జూన్ 2025



ఉపదేశం జూబిలీ 2025. యేసుక్రీస్తు మన నిరీక్షణ. II. యేసు జీవితం. ఉపమానాలు 8. ద్రాక్షతోట-కూలీలు. “మీరు నా తోటకు వెళ్లి పని చేయుడు అని అనెను” (మత్త 20:4).

ప్రియ సహోదరీ సహోదరులారా,

యేసు ప్రభువు చెప్పిన ఉపమానాలలో ఒకటి, మనలో నిరీక్షణను నింపే ఒక గొప్ప సత్యాన్ని మరొక్కసారి ధ్యానించాలని నేను ఆశిస్తున్నాను. నిజమే, కొన్నిసార్లు మన జీవితానికి అర్థం లేదని అనిపిస్తుంది. అంగడి వీధిలో పని కోసం నిరీక్షిస్తున్న కూలీల వలె, ఎవరైనా పిలుస్తారని ఆశగా ఎదురుచూస్తూ ఉంటాం. మనం పనికిరాని వాళ్ళమని, అసమర్థులమని భావిస్తూ ఉంటాం. కాలం గడిచిపోతూ ఉంటుంది, జీవితం ముందుకు సాగుతూ ఉంటుంది. ఎవరూ మనల్ని గుర్తించడం లేదని, అభినందించడం లేదని లోలోపల బాధపడుతూ ఉంటాం. బహుశా సరైన సమయానికి మనం అక్కడికి చేరుకోలేకపోయాం కావచ్చు, లేదా ఇతరులు మనకంటే ముందే చేరుకొని ఉండవచ్చు, లేదా కొన్ని సమస్యలు మనల్ని ఆపి ఉండవచ్చు!

మార్కెట్ (అంగడి) అనే రూపకం ఈ రోజుల్లోనూ ఎంతో సముచితంగా ఉంది. ఎందుకంటే, మార్కెట్ వ్యాపార స్థలం. దురదృష్టవశాత్తు, అక్కడ ప్రేమ, గౌరవం కూడా కొని, అమ్మబడుతూ ఉంటాయి. ఏదో ఒకటి సంపాదించుకోవాలనే ప్రయత్నంలో ఇది జరుగుతూ ఉంటుంది. మనం విలువైనవారమని గుర్తించబడనప్పుడు, ప్రశంసించబడనప్పుడు, మొట్టమొదట ధర పలికిన వారికి మనల్ని మనం అమ్ముకునే ప్రమాదం ఉంది. అయితే, ప్రభువు మనకు గుర్తుచేసేది ఏమిటంటే, మన జీవితం అత్యంత విలువైనది. ఈ విలువను కనుగొనడానికి ఆయన మనకు సహాయం చేయాలని ఆశిస్తున్నారు.

మనం ఈరోజు ధ్యానిస్తున్న ఉపమానం కూడా రోజువారీ కూలీ కోసం ఎదురు చూస్తున్న పనివారికి సంబంధించింది. దీనిని మత్తయి సువార్త 20వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. ఇక్కడ కూడా మనం ఒక వింత ప్రవర్తన కలిగిన, మనల్ని ఆశ్చర్యపరిచే, సవాలు చేసే ఒక వ్యక్తిని చూస్తున్నాము. ఆయన ఒక ద్రాక్షతోట యజమాని. పనివారిని వెతుక్కుంటూ స్వయంగా బయటికి వస్తున్నాడు. ఆయన వారితో వ్యక్తిగత సంబంధాన్ని ఏర్పరచుకోవాలని కోరుకుంటున్నాడు.

నిజంగా, ఈ ఉపమానం మనలో ఆశను చిగురింపజేస్తుంది! ఎందుకంటే, తమ జీవితాలకు అర్థం వెతుక్కుంటున్న వారిని కనుగొనడానికి ఈ ద్రాక్షతోట యజమాని పదే పదే బయలుదేరి వెళ్ళాడు. తెల్లవారుజామునే బయలుదేరిన అతను, ఆ తర్వాత ప్రతి మూడు గంటలకు ఒకసారి తన ద్రాక్షతోటలోకి పనివారిని పంపడానికి వెతికాడు. ఈ ప్రణాళిక ప్రకారం, మధ్యాహ్నం మూడు గంటలకు బయలుదేరిన తర్వాత, మళ్ళీ వెళ్లాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, పనిదినం సాయంత్రం ఆరు గంటలకు ముగుస్తుంది.

అలుపెరుగని యజమాని మనలో ప్రతి ఒక్కరి జీవితానికి విలువ ఇవ్వాలని ఎంతగానో కోరుకుంటున్నాడు. అందుకే, పనిదినం ముగియడానికి కేవలం ఒక గంట ముందు, అంటే సాయంత్రం ఐదు గంటల సమయమున కూడా బయటకు వెళ్ళాడు. సంత వీధిలో ఇంకా నిలిచియున్న కూలీలు బహుశా తమ ఆశలన్నీ వదులుకొని ఉంటారు. ఆ రోజు వారికి పని దొరకలేదని పూర్తిగా నిరాశపడి ఉంటారు. అయినప్పటికీ, ఎవరో ఒకరు వారిని నమ్మారు. చివరి గంటలో మాత్రమే కూలీలను తీసుకోవడం వల్ల ఏమిటి ప్రయోజనం అనిపించవచ్చు. అయినా సరే, జీవితంలో మనం చాలా తక్కువ చేయగలుగుతున్నామని అనిపించినా, అది ఎల్లప్పుడూ విలువైనదే. మన జీవితానికి అర్థాన్ని కనుగొనే అవకాశం ఎల్లప్పుడూ ఉంటుంది. ఎందుకంటే, దేవుడు మన జీవితాన్ని అమితంగా ప్రేమిస్తున్నారు.

ఈ ద్రాక్షతోట యజమాని యొక్క విశిష్టత, రోజు చివరిలో, వేతనం చెల్లించే సమయంలో కూడా స్పష్టంగా కనిపిస్తుంది. తెల్లవారుజామున ద్రాక్షతోటలోకి వెళ్ళిన మొదటి పనివారికి రోజుకు ఒక దీనారము (సాధారణ రోజు కూలీ) చెల్లించడానికి యజమాని అంగీకరించాడు. మిగిలిన వారికి “తగిన వేతనము” ఇస్తానని చెప్పాడు. ఇక్కడే ఈ ఉపమానం మనల్ని ఆలోచింపజేస్తుంది: ఏది తగినది? ద్రాక్షతోట యజమాని దృష్టిలో, అంటే దేవుని దృష్టిలో, ప్రతి వ్యక్తికి జీవించడానికి అవసరమైనది ఉండటమే న్యాయం. అతను కూలీలను వ్యక్తిగతంగా పిలిచాడు, వారి గౌరవాన్ని గుర్తించాడు, మరియు దీని ఆధారంగా వారికి వేతనం ఇవ్వాలని కోరుకుంటాడు. అందుకే అందరికీ ఒక దీనారమును ఇచ్చాడు.

ఈ ఉపమానంలో, మొదటి గంట నుండి పని చేసిన కూలీలు నిరాశ పడ్డారు. యజమాని చేసిన పనిలో ఉన్న అందాన్ని వారు చూడలేకపోయారు. అతను అన్యాయం చేయలేదు, కేవలం ఉదారంగా ఉన్నాడు; యోగ్యతను మాత్రమే కాకుండా, అవసరాన్ని కూడా చూశాడు. దేవుడు తన రాజ్యాన్ని అంటే సంపూర్ణమైన, నిత్యమైన, సంతోషకరమైన జీవితాన్నిప్రతి ఒక్కరికీ ఇవ్వాలని కోరుకుంటాడు. మరియు యేసు మనతో చేసేది ఇదే: ఆయన ఎలాంటి ర్యాంకులను ఏర్పాటు చేయడు. ఆయనకు తమ హృదయాలను తెరిచిన వారికి ఆయన సర్వాన్ని ఇస్తాడు.

ఈ ఉపమాన వెలుగులో, నేటి క్రైస్తవులు "”నేను వెంటనే పని ఎందుకు ప్రారంభించాలి? వేతనం ఒకటే అయినప్పుడు నేను ఎక్కువ పని ఎందుకు చేయాలి?” అని శోధింపబడే అవకాశం ఉంది. ఈ సందేహాలకు పునీత అగుస్తీను వారు ఇలా సమాధానమిచ్చారు: “నీకు ప్రతిఫలం లభిస్తుందని ఖచ్చితంగా తెలిసినా, కాని ఆ రోజు ఎదో నీకు ఖచ్చితంగా తెలియకపోయినా, నిన్ను పిలిచిన వానిని ఎందుకు నిరాశపరుస్తావు? అందువల్ల, వాగ్దానం ద్వారా నీకు ఇవ్వబోయే దానిని ఆలస్యం చేయడం ద్వారా నీవే దూరం చేసుకోకుండా చూసుకో.

ముఖ్యంగా యువతీ యువకులకు నేను చెప్పదలచుకున్నది ఏమిటంటే, ఆలస్యం చేయకండి! ప్రభువు తన ద్రాక్షతోటలో పని చేయడానికి పిలుస్తున్నప్పుడు, ఉత్సాహంగా స్పందించండి. ఆలస్యం చేయవద్దు, పనికి సిద్ధపడండి. ఎందుకంటే, ప్రభువు ఉదార స్వభావుడు, మీరు నిరాశ చెందరు! ఆయన ద్రాక్షతోటలో పని చేయడం ద్వారా, మీలో నున్న, “నా జీవితానికి అర్థం ఏమిటి?” అన్న లోతైన ప్రశ్నకు సమాధానాన్ని కనుగొంటారు.

నిరుత్సాహ పడవద్దు! జీవితంలోని చీకటి సమయాల్లో, మనం కోరుకున్న సమాధానాలు దొరకకుండా కాలం గడిచిపోతున్నప్పుడు కూడా, ప్రభువును వేడుకుందాం. ఆయన మళ్ళీ బయటికి వచ్చి, ఆయన కోసం ఎదురు చూస్తున్న చోటనే మనల్ని కనుగొంటాడు. ఆయన ఉదార స్వభావుడు, త్వరలోనే వస్తాడు!

 

ప్రత్యేక శుభాకాంక్షలు:

నేటి సమావేశంలో పాల్గొంటున్న ఆంగ్ల భాష మాట్లాడే యాత్రికులకు, సందర్శకులకు నా హృదయపూర్వక స్వాగతం. ముఖ్యంగా ఇంగ్లండ్, స్కాట్లాండ్, ఐర్లాండ్, ఫిన్లాండ్, కెన్యా, భారతదేశం, ఇండోనేషియా, దక్షిణ కొరియా, ఫిలిప్పీన్స్ మరియు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుండి వచ్చిన మీకు ప్రత్యేక ధన్యవాదాలు. పెంతకోస్తు పండుగను జరుపుకోవడానికి మనం సిద్ధమవుతున్న వేళ, మీపై మరియు మీ కుటుంబాలపై పవిత్రాత్మ వరాలు సమృద్ధిగా కురియాలని ప్రార్థిస్తున్నాను.

పరిశుద్ధ జగద్గురువు మాటల సారాంశం:

ప్రియమైన సహోదరీ సహోదరులారా, “యేసుక్రీస్తు మన నిరీక్షణ” అనే జూబిలీ అంశంపై కొనసాగుతున్న ఉపదేశంలో భాగంగా, ఈరోజు మనం చివరి గంట పని చేసిన కూలీల గురించిన యేసు ఉపమానాన్ని (మత్తయి 20:1-16) ధ్యానిస్తున్నాం. చివరి గంటలో వచ్చిన కూలీలకు కూడా ఒకే వేతనం ఇచ్చిన యజమాని, మన తండ్రియైన దేవునికి ప్రతీక. ఆయన తన వద్దకు వచ్చేవారిని నిరంతరం వెతుకుతూ ఉంటారు. ఆయన ప్రేమ, ఔదార్యం ఆయన పిలుపునకు స్పందించిన వారికి, ఎంత ఆలస్యంగానైనా సరే, సంపూర్ణమైన, నిత్య జీవము గల తన రాజ్యములో పాలుపంచుకునేలా సమృద్ధిగా ప్రతిఫలమిస్తారు. దేవుడు మనలను ఎన్నడూ విడిచిపెట్టడు. మన పరిస్థితి ఎంత నిస్సహాయంగా కనిపించినా, మన యోగ్యతలు ఎంత అల్పంగా తోచినా, ఆయన మనలను అంగీకరించడానికి, మన జీవితాలకు అర్థం, నిరీక్షణ ఇవ్వడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు. మనమందరం, ముఖ్యంగా యువత, ఆయన ద్రాక్షతోటలో పని చేయాలనే ఆయన పిలుపునకు ఉదారంగా, ఉత్సాహంగా స్పందించాలి.

మూలము:
https://www.vatican.va/content/leo-xiv/en/audiences/2025/documents/20250604-udienza-generale.html

గురుశ్రీ ప్రవీణ్ కుమార్ గోపు

No comments:

Post a Comment