లియో XIV జగద్గురువులు
సాధారణ సమావేశం
సెయింట్ పీటర్స్ స్క్వేర్, బుధవారం, 11 జూన్ 2025
ఉపదేశం - జూబిలీ 2025. యేసుక్రీస్తు మన నిరీక్షణ. II. యేసు జీవితం. ఉపమానాలు 9. బర్తిమయి. “లెమ్ము,
ధైర్యముగా నుండుము. ఆయన రమ్మనుచున్నాడు”.
ప్రియ సహోదరీ సహోదరులారా,
ఈ ఉపదేశ ధ్యానం ద్వారా, యేసు జీవితంలో మరొక
ముఖ్యమైన అంశం - ఆయన చేసిన స్వస్థతలు –
పై మన దృష్టిని కేంద్రీకరించాలని నేను కోరుకుంటున్నాను. అందువల్ల, మీ జీవితంలో మీకు అత్యంత బాధ కలిగించే,
బలహీనంగానున్న అంశాలను,
మీరు చిక్కుకు పోయినట్లు మరియు ముందుకు కదలలేక పోతున్నట్లు భావించే పరిస్థితులను,
క్రీస్తు హృదయంలో ఉంచమని మిమ్ములను
ఆహ్వానిస్తున్నాను. మన ప్రార్థనలను విని, మనలను స్వస్థపరచమని
ప్రభువును నమ్మకంతో వేడుకుందాం!
ఈ ధ్యానంలో మనకు తోడుగా, ఆశకు ప్రతీకగా నిలిచే ఒక ముఖ్యమైన పాత్ర
ఉంది. మనం దారి తప్పినట్లు అనిపించినప్పుడు కూడా, ఆశను ఎప్పటికీ వదులుకోకూడదని అర్థం చేసుకోవడానికి ఈ పాత్ర మనకు సహాయ పడుతుంది:
అతనే బర్తిమయి, ఒక
గుడ్డివాడు మరియు భిక్షగాడు. యేసు ఇతన్ని యెరికో పట్టణంలో కలుసు కున్నారు (మార్కు
10:46-52 చూడండి). ఈ సందర్భంలో యెరికో పట్టణం చాలా ముఖ్యం: యేసు తన చివరి
ప్రయాణముగా యెరూషలేముకు వెళ్తూ, సముద్ర మట్టానికి దిగువనున్న యెరికో 'అధోలోకం'
నుండి ప్రారంభించారు. వాస్తవానికి, యేసు తన
మరణం ద్వారా, అట్టడుగున పడిపోయిన
మరియు మనలో ప్రతి ఒక్కరినీ సూచించే ఆదామును తిరిగి తీసుకురావడానికి
వెళ్ళారు.
బర్తిమయి అంటే ‘తిమయి కుమారుడు’. ఈ పేరు ఒక వ్యక్తిని అతని బంధం ద్వారా
వర్ణిస్తుంది, అయినప్పటికీ బర్తిమయి తన
పరిస్థితిలో ఒంటరిగా ఉన్నాడు. అయితే, ఈ పేరుకు ‘గౌరవనీయుడు’ లేదా
‘ఆరాధనీయుడు’ అనే అర్థం కూడా ఉంది. ఇది అతను జీవిస్తున్న వాస్తవ పరిస్థితికి
పూర్తిగా విరుద్ధం. యూదుల సంస్కృతిలో పేరుకు చాలా ప్రాముఖ్యత
ఉంటుంది కాబట్టి, బర్తిమయి తాను పిలువబడిన గొప్ప పేరుకు
తగ్గట్టుగా జీవించలేక పోతున్నాడని దీని అర్థం. అతని పేరు ఉన్నతమైన స్థితిని
సూచిస్తే, అతని జీవితం మాత్రం నిస్సహాయత, దైన్యాన్ని ప్రతిబింబిస్తుంది.
యేసు వెనుక జనసమూహాలు నడుస్తూ ఉండగా, దానికి భిన్నంగా బర్తిమయి కదలకుండా త్రోవ పక్కన కూర్చుని యున్నాడని
సువార్తికుడు తెలియ జేస్తున్నాడు. ఇది బర్తిమయి నిస్సహాయ స్థితిని స్పష్టం
చేస్తుంది. తనంతట తానుగా లేవలేక, ప్రయాణాన్ని తిరిగి
ప్రారంభించలేక, అతనికి ఎవరైనా సహాయం అవసరమని ఈ దృశ్యం
సూచిస్తుంది. జనసమూహం కదలికలో ఉంటే, బర్తిమయి మాత్రం
స్థిరంగా, నిరీక్షణతో ఉన్నాడు.
నిస్సహాయ పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనం ఏమి చేయాలి అనే ప్రశ్నకు, బర్తిమయి తన జీవితం ద్వారా సమాధానం బోధిస్తున్నాడు.
మనలో నున్న వనరులను, మనకు అంతర్భాగమైన వాటిని ఎలా ఉపయోగించు కోవాలో అతను నేర్పుతున్నాడు.
బర్తిమయి ఒక భిక్షగాడు. అతనికి అడగడం ఎలాగో తెలుసు, అంతేకాదు,
అతను అరవగలడు! మీకు నిజంగా ఏదైనా కావాలంటే,
ఇతరులు మిమ్ములను నిందించినా, అవమానించినా,
ఊరకుండుము అని గద్దించినా సరే, అనుకున్న
దానిని చేరుకోవడానికి మీరు ప్రతిదీ చేయగలరు. మీకు నిజంగా అది కావాలంటే, మీరు కేకలు వేస్తూనే ఉంటారు!
మార్కు సువార్తలోని బర్తిమయి కేక – “దావీదు కుమారా! యేసు ప్రభూ! నన్ను కరుణింపుము” (వచనం
47), తూర్పు క్రైస్తవ సంప్రదాయంలో అత్యంత ప్రసిద్ధ
ప్రార్థనగా మారింది. దీనినే మనం కూడా ఉపయోగించవచ్చు, “యేసుక్రీస్తు ప్రభూ, దైవ కుమారా! నేను పాపిని, నన్ను కరుణింపుము.” ఈ ప్రార్థన, బర్తిమయి చూపిన విశ్వాసాన్ని, ఆశను
ప్రతిబింబిస్తుంది. మన నిస్సహాయ స్థితిలో ప్రభువు దయ కోసం విజ్ఞప్తి చేయడానికి ఇది
ఒక శక్తివంతమైన మార్గం.
బర్తిమయి గుడ్డివాడైనప్పటికీ, ఆశ్చర్యకరంగా ఇతరులకంటే మెరుగ్గా
చూడగలిగాడు. యేసు ఎవరో అతను గుర్తించాడు! అతని కేకను విని, యేసు నిలిచి, “వానిని ఇటకు పిలువుడు” అని చెప్పారు (మార్కు 10:49 చూడండి).
ఎందుకంటే, మనం దేవునిని ఉద్దేశించి మాట్లాడుతున్నామని
గ్రహించలేకపోయినా, దేవుడు వినని కేక అంటూ ఏదీ ఉండదు (నిర్గమకాండము 2:23 చూడండి).
యేసు వెంటనే అతని వద్దకు వెళ్ళక పోవడం వింతగా అనిపించ వచ్చు. కానీ, మనం లోతుగా ధ్యానిస్తే, అది
బర్తిమయి జీవితాన్ని తిరిగి క్రియాత్మకం చేసే మార్గంగా ఉందని అర్థమవుతుంది. అతను
మళ్ళీ లేవడానికి యేసు అతన్ని ప్రోత్సహించారు. నడవగలిగే అతని సామర్థ్యంపై నమ్మకం
ఉంచారు. ఆ వ్యక్తి మళ్ళీ తన కాళ్ళపై నిలబడగలడు, మృత్యువు అంచు నుండి లేవగలడు. అయితే, ఇది చేయాలంటే,
అతను తప్పక చాలా అర్థవంతమైన పని చేయాలి. అదేమిటంటే, అతను తన ‘వస్త్రమును’ పారవేయాలి (మార్కు 10:50
చూడండి)!
ఒక బిచ్చగాడికి, వస్త్రం అనేది కేవలం
కప్పుకోవడానికి మాత్రమే కాదు, అది అతని సర్వస్వం. అది అతని భద్రత, అతని ఇల్లు, అతన్ని
రక్షించే కవచం. మోషే ధర్మశాస్త్రం కూడా బిచ్చగాడి
వస్త్రానికి రక్షణ కల్పించింది; దానిని తాకట్టుగా
తీసుకున్నట్లయితే సాయంత్రం తిరిగి ఇవ్వాలని నిర్దేశించింది (నిర్గమకాండము 22:25
చూడండి). అయినప్పటికీ, చాలాసార్లు, మన మార్గంలో అడ్డుపడేవి పైకి కనిపించే భద్రతలే. మనల్ని
మనం రక్షించు కోవడానికి మనం ధరించినవే, మనల్ని ముందుకు
నడవకుండా నిరోధిస్తాయి. యేసు వద్దకు వెళ్లి స్వస్థత
పొందాలంటే, బర్తిమయి తన వస్త్రం లేకుండా, పూర్తి బలహీనతతో తనను తాను చూపించు కోవాలి. తన ఏకైక రక్షణను వదులు కోవాలి.
ఇది స్వస్థత ప్రయాణంలో ఒక ప్రాథమిక దశ - మనకున్న ఆధారాలను వదులుకొని, దైవ సహాయంపై పూర్తిగా ఆధారపడటం.
యేసు బర్తిమయిని అడిగిన ప్రశ్న కూడా వింతగా అనిపించవచ్చు: “నేను ఏమి చేయగోరు చున్నావు?” (మార్కు
10:51). అస్వస్థతల నుండి స్వస్థత పొందాలని కోరుకోవాలనే
నియమమేమీ లేదు. కొన్నిసార్లు, బాధ్యత తీసుకోకుండా నిశ్చలంగా
ఉండటానికే మనం ఇష్టపడతాం. కానీ, బర్తిమయి సమాధానం చాలా
లోతైనది. అతను ‘అనబ్లెపేన్’ [anablepein] అనే క్రియను ఉపయోగించాడు. దీనికి “మళ్ళీ చూడటం” అని అర్థం, అయితే దీనిని “పైకి చూడటం” అని కూడా అనువదించవచ్చు. నిజానికి, బర్తిమయి కేవలం దృష్టిని తిరిగి పొందాలని మాత్రమే కోరుకోవడం లేదు. అతను తన
గౌరవాన్ని తిరిగి పొందాలని కోరుకుంటున్నాడు! పైకి చూడాలంటే, మనం
మన తలలు పైకెత్తాలి. కొన్నిసార్లు జీవితం కలిగించిన అవమానాల వల్ల ప్రజలు
నిస్సహాయంగా ఉండిపోతారు. అలాంటి స్థితిలో, వారు కోరుకునేది
కేవలం తమ ఆత్మగౌరవాన్ని తిరిగి పొందడమే. ఈ అడుగు, శారీరక స్వస్థతతో పాటు మానసిక, ఆత్మీయ స్వస్థతకు
కూడా దారి తీస్తుంది.
బర్తిమయిని, మనలో ప్రతి ఒక్కరినీ,
నిజంగా రక్షించేది మన విశ్వాసం. యేసు మనలను
స్వస్థపరుస్తాడు, తద్వారా మనం స్వతంత్రుల మౌతాము. ఆశ్చర్యకరంగా, యేసు బర్తిమయిని తనను అనుసరించమని
ఆహ్వానించలేదు. బదులుగా, “నీవు వెళ్ళుము” అని బర్తిమయితో
చెప్పారు (మార్కు 10:52 చూడండి). అయితే, మార్కు సువార్త తన వృత్తాంతాన్ని ముగిస్తూ, బర్తిమయి
త్రోవ వెంట యేసును అనుసరించాడని చెబుతుంది. అంటే, అతను స్వేచ్ఛగా,
తనంతట తానుగా ఆయనే మార్గమైన యేసును అనుసరించడానికి ఎంచుకున్నాడు.
ఇది నిజమైన స్వస్థత యొక్క ఫలితం: కేవలం శారీరక విముక్తి మాత్రమే కాదు, ప్రభువును స్వచ్ఛందంగా ప్రేమించి, అనుసరించే హృదయ
పరివర్తన.
ప్రియ సహోదరీ సహోదరులారా, మన అస్వస్థతలను, అలాగే మన ప్రియమైనవారి అస్వస్థతలను కూడా యేసు ముందు నమ్మకంతో ఉంచుదాం.
దారి తప్పి, నిస్సహాయంగా నున్నవారి బాధను ఆయన ముందుంచుదాం.
వారికోసం కూడా మనం బిగ్గరగా కేకలు వేద్దాం, అప్పుడు ప్రభువు
మన మొర విని ఆగుతాడని మనం నిశ్చయించు కోవచ్చు.
విజ్ఞప్తి
గ్రాజ్లోని పాఠశాలలో జరిగిన దుర్ఘటన బాధితుల కోసం నా ప్రార్థనలు. ఈ
కష్ట సమయంలో బాధిత కుటుంబాలకు, ఉపాధ్యాయులకు, విద్యార్థులకు
నేను అండగా ఉంటాను. ప్రభువు ఈ పిల్లలను తన శాంతిలో చేర్చుకొనుగాక.
ప్రత్యేక
శుభాకాంక్షలు
ఈరోజు సమావేశంలో పాల్గొంటున్న ఆంగ్ల భాష మాట్లాడే యాత్రికులకు, సందర్శకులకు, ముఖ్యంగా ఇంగ్లాండ్, స్కాట్లాండ్,
బెల్జియం, కామెరూన్, జింబాబ్వే,
చైనా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్,
సింగపూర్, కెనడా, మరియు
యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుండి వచ్చిన వారికి నా హృదయపూర్వక స్వాగతం. వచ్చే ఆదివారం మనం పరమ పవిత్ర త్రిత్వైక సర్వేశ్వరుని మహోత్సవమును జరుపుకోవడానికి
సిద్ధమవుతున్నాము కాబట్టి, మీ హృదయాలను తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మలకు స్వాగతించే నివాసంగా
మార్చుకోవాలని నేను మిమ్ములను ఆహ్వానించు చున్నాను. దేవుడు మీ అందరినీ
ఆశీర్వదించునుగాక!
పరిశుద్ధ
జగద్గురువు మాటల సారాంశం:
ప్రియ
సహోదరీ సహోదరులారా,
మన జూబిలీ అంశం అయిన “యేసుక్రీస్తు మన నిరీక్షణ”పై కొనసాగుతున్న మన జ్ఞానోపదేశంలో, ఈ రోజు మనం యేసు జీవితం మరియు పరిచర్యలో మరొక అంశాన్ని - ఆయన చేసిన స్వస్థత అద్భుతాలను - ధ్యానిస్తున్నాము. మనం విన్న సువిశేష భాగంలో, గుడ్డివాడైన బర్తిమయి “యేసు ప్రభూ! నన్ను కరుణింపుము” అనే ప్రార్థనతో యేసును వేడుకున్నాడు. ఇది నిజమైన విశ్వాస కార్యము. యేసు బర్తిమయిని తన వద్దకు రమ్మని అడిగినప్పుడు, ఆ అంధ బిచ్చగాడు వెంటనే తన వస్త్రమును విసిరిపారవేయడం గమనించదగిన విషయం. ఆ వస్త్రం అతని ఏకైక ఆస్తి, మరియు అతని భద్రతకు ఏకైక ఆధారం. ఈ కోణంలో, అతను తన సంపూర్ణ దుర్బలత్వంతో యేసు ముందు నిలబడ్డాడు. తన దృష్టిని తిరిగి పొందగల ప్రభువు శక్తిపై నమ్మకం ఉంచాడు. మనం కూడా, స్వస్థత కోసం మన స్వంత అవసరాన్ని గుర్తించి, మన బలహీనతతో ప్రభువు వద్దకు రావాలి. ఆయన స్వస్థపరిచే శక్తిని అనుభవించడానికి మన “వస్త్రములు” - అనగా మన భద్రతలు, మన సౌకర్యవంతమైన ప్రదేశాలు - విడిచిపెట్టాలి. ఈ నిరీక్షణ జూబిలీ సమయంలో, విశ్వాస వెలుగులో అన్నింటినీ కొత్తగా చూడటానికి, మరియు స్వేచ్ఛతో, నూతన జీవితంతో ప్రభువును అనుసరించడానికి మనమూ కృపను పొందుదుము గాక.
మూలము:
https://www.vatican.va/content/leo-xiv/en/audiences/2025/documents/20250611-udienza-generale.html
గ్రురుశ్రీ ప్రవీణ్ గోపు, OFM Cap.
No comments:
Post a Comment