కుటుంబాలు, పిల్లలు, తాతయ్యలు, అమ్మమ్మలు, వృద్ధుల
ఉత్సవం (జూబ్లీ)
పరిశుద్ధ పొప్ లియో XIV ప్రసంగము
సెయింట్ పీటర్స్ స్క్వేర్, ఈస్టర్ 7వ ఆదివారం - 1
జూన్ 2025
మనం వింటున్న సువార్త, కడరాత్రి భోజన సమయంలో, యేసు మనందరి తరపున ప్రార్థించడాన్ని (యోహాను 17:20) తెలియజేస్తుంది. దేవుని వాక్యం మానవునిగా అవతరించి, తన భూలోక జీవితపు చివరి ఘడియలలో, తన సహోదరీ సహోదరులైన మన గురించి ప్రార్థిస్తున్నారు. పరిశుద్ధాత్మ శక్తితో, ఆయన తండ్రికి ఆశీర్వాదంగా, విజ్ఞాపన మరియు స్తుతి ప్రార్థనగా మారియున్నారు. మనము కూడా ఆశ్చర్యంతో, నమ్మకంతో యేసు ప్రార్థనలో పాలుపంచుకుప్పుడు, ఆయన ప్రేమకు కృతజ్ఞత తెలుపుతూ, సర్వ మానవాళికి సంబంధించిన గొప్ప ప్రణాళికలో భాగమవుతాము.
యేసు, "అందరూ ఏకమై ఉండాలి" (యోహాను 17:21)
అని ప్రార్థించారు. ఈ ఐక్యతే మనం పొందగలిగే
అత్యున్నతమైన మేలు. ఎందుకంటే, తండ్రి ద్వారా జీవం పొందే కుమారుడు,
దాన్ని పంచుకునే ఆత్మ వంటి దేవుని స్వభావంలో
ఉన్న శాశ్వతమైన ప్రేమ, సృష్టిలోని జీవుల మధ్య కూడా సంపూర్ణ
ఐక్యతను కలిగిస్తుంది.
ప్రభువు కోరుకునేది మనం అజ్ఞాతంగా, ప్రాధాన్యత లేకుండా ఉండటం కాదు. బదులుగా, ఆయన మనమంతా ఐక్యంగా ఉండాలని ఆశిస్తున్నాడు. “తండ్రీ! నీవు
నాయందు, నేను నీయందు ఉన్నాము గనుక వారును మనయందు ఉండునిమ్ము” (వచనం 21) అని ఆయన ప్రార్ధించారు.
యేసు ప్రార్థించిన ఈ ఐక్యత, దేవుని ప్రేమ ఆధారంగా ఏర్పడిన సహవాసం. ఇది లోకానికి జీవాన్ని,
రక్షణను అందిస్తుంది. నిజానికి, ఇది యేసు మనకు ప్రసాదించిన ఒక బహుమతి. దేవుని కుమారుడు తన మానవ హృదయం
నుండి తండ్రిని ఇలా ప్రార్థిస్తాడు, “వారు
సంపూర్ణంగా ఏకమై ఉండుటకును, నీవు నన్ను పంపితివనియు, నీవు
నన్ను ప్రేమించినట్లే వారిని కూడా ప్రేమించితివనియు లోకము తెలిసికొనుటకు నేను
వారియందును, నీవు నాయందును ఉన్నాము”
(యోహాను 17:23).
ఈ మాటలను ఆశ్చర్యంతో విందాం. దేవుడు తనను తాను ప్రేమించినట్లే మనల్ని
ప్రేమిస్తున్నాడని యేసు మనకు చెబుతున్నారు. తండ్రి తన ఏకైక కుమారుడిని ప్రేమించిన
దానికంటే తక్కువగా మనల్ని ప్రేమించడం లేదు. అనగా, మనల్ని అనంతమైన ప్రేమతో ప్రేమిస్తున్నారు! దేవుడు తక్కువగా ప్రేమించరు, ఎందుకంటే ఆయన ఆదినుండి, ముందుగానే మనలను ప్రేమిస్తున్నారు! క్రీస్తు స్వయంగా ఈ విషయాన్ని ధృవీకరిస్తూ
తండ్రితో ఇలా పలికారు, “లోకము ఆరంభమునకు మునుపే నీవు నన్ను ప్రేమించితివి” (యోహాను 17:24). నిజానికి, తన కరుణలో, దేవుడు ఎల్లప్పుడూ సర్వ మానవాళిని తన యొద్దకు
ఆకర్షించాలని కోరుకున్నాడు. క్రీస్తునందు మనకు అనుగ్రహించబడిన తండ్రి దేవుని జీవమే మనల్ని ఏకం చేస్తుంది, మనల్ని ఒకరితో
ఒకరిని కలుపుతుంది.
ఈ రోజు, కుటుంబాలు, పిల్లలు, తాతయ్యలు, అమ్మమ్మలు,
వృద్ధుల ఉత్సవం (జూబ్లీ) సందర్భంగా ఈ సువార్త ఆలకించడం మనలను
ఆనందంతో నింపుతుంది.
ప్రియ స్నేహితులారా, మనం కోరుకోకముందే ఈ జీవితాన్ని పొందాం. పోప్ ఫ్రాన్సిస్
చెప్పినట్లుగా, “మనమందరం కుమారులు, కుమార్తెలమే; అయితే, మనలో ఎవరూ పుట్టడానికి ఎంచుకోలేదు” (ఏంజెలుస్, 1 జనవరి 2025). అంతేకాదు, మనం పుట్టిన వెంటనే జీవించడానికి
ఇతరులపై ఆధారపడ్డాం. మనల్ని వదిలేసి ఉంటే బ్రతికేవాళ్ళం కాదు. ఆత్మీయంగా, శారీరకంగా జాగ్రత్తగా చూసుకోవడం ద్వారానే మనం రక్షింపబడ్డాం. ఈ రోజు
మనమందరం ఒక బంధం కారణంగానే జీవిస్తున్నాం – అది మానవ దయ, పరస్పర శ్రద్ధతో కూడిన స్వేచ్ఛాయుతమైన,
విముక్తిని కలిగించే సంబంధం.
మానవత్వం చూపే దయ కొన్నిసార్లు ద్రోహానికి
గురవుతుంది. ఉదాహరణకు, స్వేచ్చను జీవం
ఇవ్వడానికి కాకుండా, దానిని తీసివేయడానికి; సహాయం చేయడానికి కాకుండా, హాని చేయడానికి ఉపయోగించినపుడు.
జీవానికి వ్యతిరేకంగా నిలబడి, దానిని నాశనం చేసే దుష్టత్వం
ఎదురైనప్పటికీ, యేసు మన కొరకు తండ్రికి ప్రార్థిస్తూనే ఉంటారు.
ఆయన ప్రార్థన మన గాయాలకు ఔషధములా పనిచేస్తుంది; అది మనకు
క్షమాపణ
మరియు సఖ్యత
గురించి బోధిస్తుంది. తల్లిదండ్రులుగా, తాతామామ్మలుగా, కుమారులు, కుమార్తెలుగా ఒకరిపై ఒకరు చూపించుకునే ప్రేమకు ఆ ప్రార్థన సంపూర్ణ అర్థాన్ని ఇస్తుంది. ప్రభువు మనలను “ఐఖ్యముగా” ఉండాలని
కోరుకున్నట్లే, మనం లోకానికి ఇదే
ప్రకటించదలుచుకున్నాం: జీవితంలోని ప్రతి పరిస్థితిలో, ప్రతి దశలో, మన కుటుంబాలలో, మనం నివసించే, పనిచేసే, చదువుకునే ప్రదేశాలలో మనం “ఐఖ్యముగా” ఉండటానికి ఇక్కడ ఉన్నాం. మనం
వేర్వేరుగా ఉన్నప్పటికీ, ఎల్లప్పుడూ ఐక్యంగా ఉంటాం; అనేకంగా ఉన్నప్పటికీ, ఐక్యంగా ఉంటాం.
ప్రియ స్నేహితులారా, “ఆల్ఫా మరియు ఒమేగా,” “ఆదియును, అంతమునైన” (దర్శన 22:13) క్రీస్తులో
స్థిరపడి, ఒకరినొకరు ప్రేమించినట్లయితే, సమాజంలోనూ, ప్రపంచంలోనూ అందరికీ శాంతికి చిహ్నంగా నిలుస్తాము. మానవజాతి
భవిష్యత్తుకు కుటుంబాలే ఊయల అన్న విషయాన్ని మనం ఎప్పటికీ మరువరాదు.
ఇటీవలి దశాబ్దాలలో, మనకు ఆనందాన్ని కలిగించే మరియు
ఆలోచింపజేసే ఒక విశేషమైన సూచన కనిపిస్తోంది: అనేకమంది దంపతులు విడివిడిగా కాకుండా,
వివాహిత జంటలుగా పునీతులుగా
ప్రకటించబడుతున్నారు. ఈ కోవలో, పునీత థెరిస్ ఆఫ్ ది చైల్డ్ జీసస్
తల్లిదండ్రులైన లూయిస్ మరియు జెలీ మార్టిన్లు స్ఫూర్తినిస్తున్నారు. గత శతాబ్దంలో రోమ్లో తమ కుటుంబాన్ని భక్తిశ్రద్ధలతో పెంచిన బ్లెస్డ్ లూయిగి మరియు మరియా బెల్ట్రామ్
క్వాట్రోచిల జీవితాలు కూడా మనకు ఆదర్శప్రాయం. అంతేకాకుండా, పోలాండ్కు చెందిన ఉల్మా కుటుంబాన్ని మనం ఎప్పటికీ మర్చిపోలేం: తల్లిదండ్రులు మరియు పిల్లలు, ప్రేమ, అమరత్వంలో ఏకమైన వారి త్యాగం నిరుపమానం.
ఇది మనల్ని ఆలోచింపజేసే సంకేతం. దేవుని ప్రేమను అర్థం చేసుకోవడానికి,
అంగీకరించడానికి, అలాగే సంబంధాలను, సమాజాలను విచ్ఛిన్నం చేసే శక్తులను
ఓడించడానికి నేటి ప్రపంచానికి వివాహ నిబంధన (marriage covenant) అవసరం అని శ్రీసభ చెబుతోంది. వివాహ జీవితానికి ఆదర్శప్రాయమైన
సాక్షులుగా దంపతులను చూపించడం ద్వారా, ఈ నిబంధన దేవుని
ఏకీకృత, రాజీపడని శక్తిని తెలియజేస్తుంది.
ఈ కారణంగా, కృతజ్ఞతతో నిండిన హృదయంతో, వివాహిత జంటలందరికీ నేను గుర్తుచేయదలిచింది ఏమిటంటే, వివాహం కేవలం ఒక ఆదర్శం కాదు, కానీ ఒక పురుషుడు, ఒక స్త్రీ మధ్య ఉన్న నిజమైన ప్రేమకు
కొలమానం. ఈ ప్రేమ పరిపూర్ణమైనది, నమ్మకమైనది, ఫలవంతమైనది (సెయింట్ పాల్ VI, హ్యూమనే వీతె, 9). ఈ ప్రేమ మిమ్మల్ని ఏక శరీరులను చేస్తుంది, దేవుని స్వరూపంలో, జీవం అనే బహుమతిని ప్రసాదించడానికి
వీలు కల్పిస్తుంది.
మీ పిల్లల ముందు మీరు ఆచరణీయంగా ఉండాలని, వారికి విధేయత ద్వారా స్వేచ్ఛను నేర్పాలని, వారిలోని మంచిని నిరంతరం గుర్తించి, ప్రోత్సహించాలని, అలాగే సమగ్రతకు నిదర్శనంగా నిలవాలని
నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. ప్రియమైన పిల్లలారా, మీ తల్లిదండ్రుల పట్ల కృతజ్ఞత కలిగి
ఉండండి. మీకు లభించిన ఈ జీవితమనే బహుమతికి, దానితో పాటు వచ్చే ప్రతిదానికీ ప్రతిరోజూ "ధన్యవాదాలు"
చెప్పడం ద్వారా మీరు మీ తండ్రిని, తల్లిని గౌరవించవచ్చు (నిర్గమ 20:12). చివరగా, ప్రియమైన తాతయ్యలు, అమ్మమ్మలు, పెద్దలారా, జ్ఞానం, కరుణ, వయస్సుతో వచ్చే వినయం, మరియు ఓర్పుతో మీ ప్రియమైనవారిని జాగ్రత్తగా చూసుకోమని నేను మీకు
విజ్ఞప్తి చేస్తున్నాను.
కుటుంబంలో, తరతరాలుగా జీవంతో పాటు
విశ్వాసం కూడా అందించబడుతుంది. కుటుంబ బల్ల వద్ద ఆహారం పంచుకున్నట్లే, హృదయాల్లోని ప్రేమలా విశ్వాసము కూడా పంచబడుతుంది. ఈ విధంగా, కుటుంబాలు యేసును కలుసుకోవడానికి ప్రత్యేకమైన ప్రదేశాలుగా మారతాయి. ఆయన మనలను
ప్రేమిస్తాడు, ఎల్లప్పుడూ మన మంచినే కోరుకుంటాడు.
నేను చివరిగా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మన ప్రయాణంలో మనకు ఆశను
ఇచ్చే దేవుని కుమారుని ప్రార్థన, మనం ఒక రోజు అందరం – uno unum (సెయింట్ అగస్టిన్, సెర్మో సూపర్ పి.ఎస్. 127), అన్నట్లుగా, ఏకైక రక్షకునిలో ఒకటిగా – దేవుని శాశ్వత ప్రేమతో ఆలింగనం చేసుకోబడతామని గుర్తుచేస్తుంది. మనమే కాదు, మన తల్లిదండ్రులు, తాతముత్తాతలు, తోబుట్టువులు, మరియు పిల్లలు కూడా ఇప్పటికే ఆయన శాశ్వత పాస్క కాంతిలోకి
వెళ్లిపోయారు. ఈ వేడుక సమయంలో, వారి ఉనికిని మనం ఇక్కడే, మనతో పాటు అనుభవిస్తున్నాము.
మూలము:
https://www.vatican.va/content/leo-xiv/en/homilies/2025/documents/20250601-omelia-giubileo-famiglie.html
గురుశ్రీ ప్రవీణ్ గోపు OFM Cap.
No comments:
Post a Comment