పాస్కా ఐదవ సోమవారము (I)

 పాస్కా ఐదవ సోమవారము
అ.కా. 14:5-18; యోహాను 14:21-26
ధ్యానం: పవిత్రాత్మ

పవిత్రాత్మ ద్వారా క్రీస్తు సాన్నిధ్యం మనకు వాగ్ధానము చేయబడినది. కుమారుని ద్వారా తండ్రితో అత్యంత సన్నిహిత సంబంధాన్ని కలిగియుండుటకు ప్రియశిష్యునికి పవిత్రాత్మ తోడ్పడును. ప్రియశిష్యునిలో దేవుడు తన నివాసమును ఏర్పరచు కొనును. దేవున్ని మరియు ఇతరులను షరతులు లేకుండా ప్రేమించువాడే ప్రియశిష్యుడు. తండ్రి దేవుడు కుమారుడు యేసును, యేసు మనలను ప్రేమించునటుల, మనము కూడా పరస్పరము ప్రేమించు కొనవలయును. దేవుని చిత్తమును నెరవేర్చుట ద్వారా లేదా దేవుని ఆజ్ఞలను స్వీకరించి పాటించుట ద్వారా, ఇలాంటి ప్రేమను మనం ప్రదర్శించాలి. “నన్ను ప్రేమించువాడు నా మాటను పాటించును. అపుడు నా తండ్రి వానిని ప్రేమించును. మేము వాని యొద్దకు వచ్చి వానితో నివసింతుము” (యో 14:23). అలాంటి ప్రియశిష్యునిలో దేవుడు నివాస మేర్పరచు కొనును. దేవుడు మనలో వసించాలంటే, మన హృదయాలు పాపమునుండి శుద్ధిగావింప బడాలి. సువార్తల ద్వారా దేవుని వాక్కును చాలా జాగ్రత్తగా ఆలకించడం ఎంతో ముఖ్యము.

తండ్రి దేవుడు పంపు పవిత్రాత్మ మనకు సమస్త విషయములను బోధించును (యో 14:25-26). పౌలు అంటారు, “ఆత్మ మనకు సాయపడును. మాటలకు సాధ్యపడని నిట్టూర్పుల ద్వారా మన కొరకై ఆత్మయే దేవుని ప్రార్ధించును” (రోమీ 8:26). పవిత్రాత్మ మనకు అంత:ర్గత శాంతిని ఒసగును.

ఈరోజు పునీత సియోన నగర కత్తరీనమ్మను స్మరించుకొను చున్నాము. ఆరేళ్ళ ప్రాయములోనే దైవపిలుపు బీజం ఆమెలో పడింది. ప్రార్ధన, ఏకాంత వాసమును అమితముగా ఇష్టపడేది. ఉపవాసము చేస్తూ పవిత్రముగా జీవించేది. తపోక్రియలు ఎక్కువగా చేసేవారు. దోమినికన్ సన్యాసులు ధరించే నల్లరంగు అంగీని ధరించుటకు అనుమతి పొందారు. ఒక్క గురువుతో తప్ప ఎవరితో మాట్లాడక మౌనవ్రతం పాటించేవారు. గుడికి వెళ్ళడానికి మాత్రమే బయటకు వెళ్ళేవారు. దివ్యసత్ప్రసాదమే ఆహారముగా ఎన్నోరోజులు గడిపేవారు. 28 ఏళ్ల ప్రాయములో యేసుక్రీస్తు పంచగాయాలను పొందారు. పోపుగార్లకు మధ్యవర్తిగా ఉండి శాంతి సమైఖ్యతకు దోహద పడ్డారు. పక్షవాత వ్యాధికిలోనై, తన 33వ యేటనే మరణించారు.

No comments:

Post a Comment