20వ సామాన్య బుధవారము (I)

20వ సామాన్య  బుధవారము
న్యాయా. 9:6-15; మత్త. 20:1-16

ధ్యానాంశము: ద్రాక్షతోట కూలీలు

ధ్యానమునకు ఉపకరించు వాక్యములు: మొదటివారు కడపటి వారగుదురు. కడపటివారు మొదటి వారగుదురు” (మత్త. 20:16)

ధ్యానము: ద్రాక్షతోట కూలీలు’, పరలోకమును గూర్చిన ఇదొక అద్భుతమైన ఉపమానము. స్వార్ధము, శతృత్వము సంఘములో, కుటుంబాలలో విభజనలు సృష్టిస్తాయి. కనుక, శతృత్వాన్ని వీడి జీవించాలి. యేసు కాలములో, యేసు పాపాత్ములతో, సుంకరులతో స్నేహముగా ఉండటం, అనాధి క్రైస్తవ సంఘములో అన్యులు చేరడం, వారిని సమానభావముతో చూడటం కొందరికి ఇష్టము లేకపోవడం ఉండేది. ఈ నేపధ్యములోనే ఈ ఉపమానం చెప్పబడింది. దేవుడు మన జీవితములో వివిధ సమయములలో తన చెంతకు, క్రైస్తవ పరిపూర్ణ జీవితానికి, తనలో ఐఖ్యతకు పిలుచుకుంటారు. పిలవడం మాత్రమేకాదు, ఒక్కొక్కరికి ఒక్కొక బాధ్యతను అప్పజెప్పుచున్నారు. దేవుని పిలుపునకు ప్రతిపిలుపును బట్టి, ప్రత్యుత్తరమును బట్టి, వారికి అప్పజెప్పినదానిపై వారి బాధ్యతను బట్టి, వారి విశ్వాసమును బట్టి, దేవుని ప్రతిఫలము ఉంటుంది. మనం దేవుని పిలుపును గుర్తించి, ప్రతిస్పందిస్తున్నామా? గతములో మనం చేసినవిగాక, ఇప్పుడు నేను ఏమి చేయుచున్నాను అన్నది ముఖ్యము. దేవుని పిలుపుకు, అనుగ్రహానికి, ఇప్పుడు నేను స్పందిస్తున్నానా? దేవుడు తన దయ, ప్రేమను మనపై ఉదారముగా కురిపించును. మొదటిగా, దేవుడు తన రాజ్యములోనికి ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నారు. ఆయన అందరిని రక్షించాలని ఆశిస్తున్నారు. చివరి క్షణములోకూడా, మన ఆత్మలను రక్షించాలనే ఆయన కోరుకుంటున్నారు. ఆయన రక్షణ అందరికి అందుబాటులోనే ఉందని అర్ధమగుచున్నది. అందరిని తన బిడ్డలగు అర్హతను కల్పించుటకు సిద్ధముగా ఉన్నారు.

నేడు నూతన క్రైస్తవ విశ్వాసుల పట్ల, మన దృక్పధం ఎలా ఉన్నది? మన సంఘములో, విచారణలో అందరిని సమానత్వముతో చూస్తున్నామా? ఉపమానములోని పనివారివలె ఇతరులపై అసూయ, శతృత్వం కలిగి జీవిస్తున్నామా లేక దేవుని కృపనుబట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నామా?

No comments:

Post a Comment