సామాన్య 8వ వారము - సోమవారం (II)

  దేవుని ప్రేమ సందేశం: అనుదిన ధ్యానాంశాలు (II)
సామాన్య 8వ వారము - సోమవారం
1 పేతురు 1:3-9; మార్కు 10:17-27

ధ్యానాంశము: ధనాపేక్ష - నిత్యజీవము (యేసు)
ధ్యానమునకు ఉపకరించు వాక్యములు:  "నీవు వెళ్లి నీకు ఉన్నదంతయు వెచ్చించి, పేదలకు దానము చేయుము. పిమ్మట వచ్చి నన్ను అనుసరింపుము. పరలోక మందు నీకు ధనము చేకూరును" (10:21). "దేవునకు సమస్తము సాధ్యమే" (10:27).
ధ్యానము: "యేసు పయనమై పోవుచుండగా" - యేసు పయణం యెరూషలేము వైపునకు, సిలువవైపునకు అని మనకు గుర్తుచేస్తుంది. ఇది శిష్యుల పయణంకూడా - స్వీయార్పణం, త్యాగం, పాపమునుండి పరిపూర్ణ మారుమనస్సు, ఇతరులకు సేవ, లోకాశలనుండి కావడం, యేసునందు సంపూర్ణ విశ్వాసం, నమ్మకం.
"మార్గమధ్యమున, ఒకడు పరుగెత్తుకొని వచ్చి యేసు ఎదుట మోకరించాడు." మత్తయి ఆ వ్యక్తి 'యువకుడు' అని (19:22), లూకా 'అధికారి' (18:18) అని చెప్పారు. మార్కు కూడా చివరిలో 'యువకుడు' అని (10:22) చెప్పాడు. ఎవరైనను, ఆ వ్యక్తి "నిత్యజీవము" పొందుటకు ఏమి చేయాలో తెలుసుకోవడానికి వచ్చాడు. 'నిత్యజీవము'ను 'దేవుని రాజ్యము'గా 10:24-25లో యేసు సంబోధించడం చూస్తున్నాము. ఆ వ్యక్తి ధనవంతుడు (10:22). నిత్యజీవితం పొందుటకు ఎలాంటి అర్హతలు కలిగియుండాలో తెలుసుకోవాలని వచ్చాడు.
మొదటిగా, ఆ వ్యక్తి 'యేసు ఎదుట మోకరించాడు', అనగా యేసు బోధనలను వినడానికి సిద్ధముగా ఉన్నాడని సూచన! యేసును "సద్భోధకుడా" అని సంబోధించాడు. అనగా, యేసులో ఉన్న 'మంచిని', మంచి బోధకునిగా (రబ్బయి) గుర్తించాడు. యేసు దైవాజ్ఞలను గురించి చెప్పినప్పుడు, ఆ వ్యక్తి దైవాజ్ఞలను చిన్ననాటినుండే పాటిస్తున్నాను అని యేసుతో అన్నాడు. అయితే, ఆ వ్యక్తి చేయవలసినది ఇంకొకటి ఉన్నదని యేసు స్పష్టం చేసారు. "నీవు వెళ్లి నీకు ఉన్నదంతయు వెచ్చించి, పేదలకు దానము చేయుము. పిమ్మట వచ్చి నన్ను అనుసరింపుము. పరలోక మందు నీకు ధనము చేకూరును" (10:21). నిత్యజీవము కొరకు ధనాపేక్షను త్యజించాలని యేసు కోరారు. ధనం, సంపదలు, అత్యాశ, దైవరాజ్యమునకు, సువార్తకు విరోధకాలు. దైవరాజ్యమా? ధనమా? అని యేసు ఆ వ్యక్తిని కోరారు. 
ఆ యువకుడు, నిత్యజీవము లేదా దైవరాజ్యము లేదా యేసు కొరకు తన సంపదలను వదులుకోలేక పోయాడు, లోకాశలను త్యజించుకోలేక పోయాడు. "ఆ యువకుడు అధిక సంపద గల వాడగుటచే, ఈ మాట విని మొగము చిన్న బుచ్చుకొని వెళ్ళిపోయెను" (10:22). "ధనవంతులు దేవుని రాజ్యమున ప్రవేశించుట ఎంత కష్టము!... ధనవంతుడు దేవుని రాజ్యమున ప్రవేశించట కంటె, ఒంటె సూది బెజ్జములో దూరిపోవుట సులభము!" (10:23, 25). యేసు ఆ యువకుని సంపదలను కోరుకోలేదు, కాని ఆ యువకుని హృదయాన్ని కోరారు; అతని మారుమనస్సును ఆశించారు. 'నిత్యజీవము' అనగా "ఏకైక సత్య దేవుడును, ఆయన పంపిన యేసు క్రీస్తును తెలుసుకొనుటయే నిత్య జీవము" (యోహాను 17:3).
అయితే, ఈ బోధన కేవలం ధనవంతులకు మాత్రమే కాదు; అత్యాశ, దురాశ కలిగిన వారందరికి ఈ సందేశం. "ఇచ్చుటలోనే మనం పొందెదము" (అస్సీసి ఫ్రాన్సిస్). "సంతోషముతో దానమొనర్చువానిని దేవుడు ప్రేమించును" (2 కొరి 9:7). ఎందుకు ధనం, పరలోకం కలిసిపోలేవు? ఎందుకన, పరలోకం దైవానుగ్రహము; ధనముతో దానిని కొనలేము లేదా సంపాదించలేము.
యేసును అనుసరించుటకు, శిష్యులు సమస్తమును త్యజించాలి, త్యాగం చేయాలి; చివరికి వారి ప్రాణములను సైతము అర్పించడానికి సిద్ధముగా యుండాలి.
నేను నిజముగా నిత్యజీవమును పొందాలని అనుకుంటున్నానా? యేసు మనకు చక్కటి బోధనలు చేసారు: దేవున్ని, క్రీస్తును తెలుసుకోవాలి; దైవాజ్ఞలను జీవించాలి; లోకాశలను, ఆకర్షణలను విడనాడాలి; పేదలకు దానము చేయాలి; యేసును అనుసరించాలి.

No comments:

Post a Comment