బాలయేసు దేవాలయములో సమర్పణ పండుగ (ఫిబ్రవరి 2)

ప్రభువు సాక్షాత్కార పండుగ (ఫిబ్రవరి 2)
యేసు క్రీస్తుని దేవాలయములో కానుకగా సమర్పించుట
మాలాకి 3:1-4 లేదా హెబ్రీ 2:14-18; లూకా 2:22-40 లేదా 2:22-32



"సర్వశక్తిమంతుడైన ప్రభువిట్లు బదులు చెప్పుచున్నాడు: ఇదిగో నా మార్గమును సిద్ధము చేయుటకు నేను ముందుగా నా దూతను పంపుదును. అపుడు మీరెదురు చూచుచున్న ప్రభువు అకస్మాత్తుగ దేవాలయమునకు వచ్చును. మీరు చూడగోరుచున్న నిబంధన దూత శ్రీఘ్రముగా వచ్చును" (మలాకి 3:1)
ఈ పండుగ నాలుగు విషయాలను ప్రత్యేకముగా ధ్యానిస్తుంది: 1. మౌనము వహించినను తిరు కుటుంబాన్ని కాపాడిన, ప్రేమగల, నీతిమంతుడైన యోసేపు; 2. సిమియోను విశ్వాసము; 3. ప్రార్ధనాపూర్వకమైన విశ్వాసముగల అన్నమ్మ; 4. అన్నింటికన్న ముఖ్యముగా దేవుని చిత్తానికి ఎల్లప్పుడు అందుబాటులోనున్న మరియ తల్లి.

లూకా సువార్త ప్రకారం, బాలయేసును దేవాలయములో కానుకగా అర్పించుట, మరియమ్మ మోషే చట్టప్రకారము శుద్ధిగావించబడటం ఒకేరోజు జరిగాయి. బాలయేసు జన్మించి ఎనిమిది దినములు గడచిన పిమ్మట శిశువునకు సున్నతి చేసి, 'యేసు' అని పేరు పెట్టిరి (లూకా 2:21). అలాగే, బాలయేసు జన్మించిన 40వ రోజున, అతనిని దేవాలయములో కానుకగా సమర్పించారు (నిర్గమ 13). మోషే చట్టప్రకారం, స్త్రీ బిడ్డను ప్రసవించిన తరువాత, 40 రోజులు, ఆచారపరముగా ఆశుద్దురాలుగా పరిగణింప బడుతుంది. 40వ రోజున, శుద్ధికాలము ముగియగానే, దేవాలయములో శుద్ధీకరణకు కానుకలు సమర్పించ వలసియున్నది. యాజకుడు ఆమె శుద్ధిని పొందు విధిని నిర్వహింపగా ఆమె శుద్ధిని బడయును (చదువుము. లేవీ 12:1-8). 

1969 వరకు, ఈ పండుగను, 'మరియమాత శుద్ధీకరణ పండుగ' అని పిలువబడినది. ప్రారంభ కాలములో, బహుశా నాలుగవ శతాబ్దమునుండి, యెరూషలేము దేవాలయములో ఈ పండుగను కొనియాడారు. అక్కడనుండి క్రైస్తవ ప్రపంచమంతా వ్యాప్తి చెందినది. కాన్-స్టాంట్-నోపుల్ రాజ్యములో కలరా వ్యాధి ప్రభువు దయవలన కనుమరుగై పోవుటవలన, కృతజ్ఞతగా, ఈ పండుగను 1వ జుస్తీనియన్ జగద్గురువులు క్రీ.శ. 526లో  ఈ పండుగను జరుపుకొనుటకు అనుమతిని ఇచ్చారు.

ఇదే రోజును 'క్రొవ్వొత్తుల దినోత్సవము'గా కూడా పిలుస్తారు. ఎందుకన, ఈ రోజు అనేక దేశాలలో, ఆశీర్వదింపబడిన క్రొవ్వొత్తులతో గుడిలోనికి ప్రదక్షిణగా వచ్చి, బాలయేసు స్వరూపమును సమర్పిస్తారు. సిమియోను బాలయేసును "అన్యులకు ఎరుకపరచు వెలుగు. నీ ప్రజలగు యిస్రాయేలీయులకు మహిమను చేకూర్చు వెలుగు" (లూకా 2:32) అన్న దానికి సూచనగా చేసేవారు. ఈ ఆచారం 6వ శతాబ్దములో ఫ్రాన్సు దేశములో ప్రారంభమై, మధ్యయుగ కాలములో బాగా ప్రాచుర్యములోనికి వచ్చినది. 8వ శతాబ్దములో సెర్జియుస్ జగద్గురువులు గురువులు, విశ్వాసులు ఆశీర్వదింప బడిన క్రొవ్వొత్తులతో గుడిలోనికి ప్రదక్షిణగా రావటాన్ని ప్రారంభించారు. క్రీస్తు ఈ లోకమునకు వెలుగుగా వచ్చెను. "లోకమునకు వెలుగును నేనే" (యోహాను 8:12). 

అయితే, ఈ 'వెలుగు' చీకటిని, అంధకారమును జయించాలంటే, ఎన్నో శ్రమలను అనుభవించ వలసి యున్నదని సిమియోను పవిత్రాత్మచే ప్రవచించాడు. సిమియోను ఆ బిడ్డ తల్లి మరియతో ఇట్లనెను: "ఇదిగో! ఈ బాలుడు యిస్రాయేలీయులలో అనేకుల పతనమునకు, ఉద్ధరింపునకు కారకుడు అగును. ఇతడు వివాదాస్పదమైన గురుతుగా నియమింపబడి యున్నాడు. అనేకుల మనోగత భావములను బయలు పరచును. ఒక ఖడ్గము నీ హృదయమును దూసికొని పోనున్నది" (2:34-35). బాలుడు పరిపూర్ణం చేయవలసిన రక్షణ కార్యము తెలియజేయ బడినది. వాస్తవముగా, యేసు "పాపులను పిలువ వచ్చినాడు; నీతిమంతులను పిలుచుటకు రాలేదు' (లూకా 5:32). ఆయన "తప్పిపోయిన దానిని వెదకి రక్షించుటకు వచ్చియున్నాడు" (లూకా 19:10). అలాగే, రక్షణ కార్యములో మరియతల్లికూడా, తన విశ్వాసమునకు విధేయతగా ఉంటూ, కుమారునితో శ్రమలను అనుభవించ వలసి యున్నదని తెలియజేయ బడినది. మరియ పరిపూర్ణ శిష్యురాలు; విశ్వాసానికి, ప్రేమకు ఆదర్శమూర్తి.దేవుని వాక్యాన్ని పరిపూర్ణముగా విశ్వసించినది.

బాలయేసు జన్మించి 40వ రోజున దేవాలయములో కానుకగా అర్పించుటకు, మరియ, జోజప్పలు యెరూషలేమునకు వెళ్ళిరి. ఎందుకన, "ప్రతి తొలిచూలు మగబిడ్డ దేవునికి అర్పింప బడవలయును" (నిర్గమ 13:2, 12).  వారు చట్ట ప్రకారము 'ఒక జత గువ్వలనైను, రెండు పావురముల పిల్లల నైనను" బలి సమర్పణ చేయుటకు దేవాలయమునకు వెళ్లిరి. అచట, బాలయేసును యాజకుని చేతులో పెట్టడము వలన, బాలుని దేవునికి కానుకగా సమర్పించిరి. మోషే చట్టప్రకారము, బిడ్డను ఐదు వెండి నాణెములు చెల్లించి విడిపించుకొన వలెను (సంఖ్యా 3:47-48; 18:15-16). 

సిమియోను, అన్నమ్మ: సిమియోను నీతిమంతుడు, దైవభక్తుడు. పవిత్రాత్మ అతనియందుండెను (2:25). అన్నమ్మ ప్రవక్తి. ఉపవాసములు, ప్రార్ధనలు చేయుచు, రేయింబవళ్ళు దేవుని సేవలో మునిగి యుండెను (2:37). వీరిరువురు యిస్రాయేలు ప్రజలవలె మెస్సయ్య కొరకు వేచి యుండిరి. బాలయేసు దేవాలయములోనికి కొనివచ్చినపుడు, వారచటకు ఆత్మ ప్రేరణచేత నడిపింపబడితిరి. సిమియోను బాలుని చూడగానే, క్రీస్తుగా (మెస్సయ్య) గుర్తించాడు. బాలుని హస్తములలోనికి తీసుకొని దేవుని ఇట్లు స్తుతించెను: "ప్రభూ! నీ మాట ప్రకారము ఈ దాసుని ఇక సమాధానముతో నిష్క్రమింపనిమ్ము. ప్రజలందరి ఎదుట నీవు ఏర్పరచిన రక్షణను నేను కనులారా గాంచితిని. అది అన్యులకు ఎరుకపరచు వెలుగు. నీ ప్రజలగు యిస్రాయేలీయులకు మహిమను చేకూర్చు వెలుగు" (2:29-32). అన్నమ్మ కూడా దేవునకు ధన్యవాదములు అర్పించెను. యెరుషలేము విముక్తికై నిరీక్షించు వారందరకు ఆ బాలుని గురించి చెప్పసాగెను (2:38). ఎవరి హృదయాలైతే క్రీస్తు ప్రేమగల సాన్నిధ్యముచేత తకబడతాయో, వారు రక్షణను పొందుదురు.

"వారు ప్రభువు ఆజ్ఞానుసారము అన్ని విధులు నెరవేర్చి, గలిలీయ ప్రాంతములోని తమ పట్టణమగు నజరేతునకు తిరిగి వచ్చిరి. బాలుడు పెరిగి దృఢకాయుడై పరిపూర్ణ జ్ఞానము కలవాడాయెను. దేవుని అనుగ్రహము ఆయనపై ఉండెను" (2:39-40). తిరు కుటుంబము, మోషే చట్టమునకు విధేయులై జీవించారు. పవిత్ర కుటుంబముగా జీవించారు.

జ్ఞానస్నానం స్వీకరించినప్పుడు, మనం కూడా దేవునికి సమర్పించ బడినాము. అయితే, ప్రతీ దివ్యపూజా బలిలో మనలను మనం దేవునికి కానుకగా సమర్పించుకోవాలి. పవిత్రముగా జీవించాలి. మనం పరిశుద్ధాత్మ చేత నడిపింప బడాలి. పరిశుద్ధాత్మ, దేవుని ఉనికిని, సాన్నిధ్యాన్ని మనకు తెలియజేస్తుంది.

No comments:

Post a Comment