పవిత్ర సిలువ విజయోత్సవం (సెప్టెంబర్ 14)

పవిత్ర సిలువ విజయోత్సవం (సెప్టెంబర్ 14)


ఈనాడు మన యావత్ తల్లి శ్రీ సభ పవిత్ర సిలువ విజయోత్సవాన్ని కొనియాడుతూ మనం క్రీస్తు సిలువను మహిమపరచాలని,ఆ సిలువ మార్గంలో మనమంతా పయనించాలని,మన  సిలువలను విడనాడక,విస్మరింపక విశ్వాసముతో వాటిని చేకొని ప్రేమతో వాటిని మోయాలని అదేశిస్తున్నది.. ఈ సందర్భంగా ఈ వ్యాసం ద్వారా సిలువను గురించి,పండుగను గురించి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలను తెలుసుకుందాం-:

పండుగ చరిత్ర:
కల్వరిలో క్రీస్తు నాథుడు మోసిన సిలువ కోసం జరిగిన అన్వేషణ ఫలితంగా క్రీస్తుశకం 320 సెప్టెంబర్ 14న పవిత్ర సిలువ లభ్యమైంది. క్రీస్తుశకం 325లో కాన్స్టాంటైన్ చక్రవర్తి యెరుషలేము లోని కల్వరి కొండ సమీపంలో ఒక దేవాలయాన్ని నిర్మించి పవిత్ర సిలువలో కొంతభాగం అందు ప్రతిష్టింపచేశాడు
కాని క్రీస్తు శకం 614 లో పెర్షియన్ రాజు ఖోస్రోయి యెరుషలేము పై దాడి చేసి విజయం సాధించాడు. తన విజయ సూచనగా గర్వంతో దేవాలయంలోని పవిత్ర సిలువను తీసుకొని వెళ్ళాడు. కానీ దేవుడు చూస్తూ ఊరుకోలేదు. 13 సంవత్సరాల తర్వాత క్రీస్తుశకం 627 లో కాన్స్టాంటైన్ నోపిల్కు చెందిన హేరక్లియుస్ చక్రవర్తి పెర్షియన్ రాజును ఓడించాడు. పవిత్ర సిలువను తిరిగి యెరుషలేముకు పంపించాడు. క్రీస్తుశకం 629లో హేరక్లియుస్ చక్రవర్తి యెరుషలేముకు వచ్చి సెప్టెంబర్ 14న సిలువను పున: ప్రతిష్ఠించి ఆరాధించారు. ఈ సంఘటననే "పవిత్ర సిలువ విజయోత్సవం"గా జరుపుకుంటున్నాం...

క్రైస్తవ లోకంలో సిలువ చరిత్ర:
సిలువపై క్రీస్తు శరీరాన్ని చూపించే ఆచారం ఐదో శతాబ్దంలో ప్రారంభమైంది. నాల్గవ శతాబ్దం వరకు క్రైస్తవులు వట్టి సిలువనే వాడేవాళ్ళు ఈ వట్టి సిలువకూడ నాల్గవ శతాబ్దంలోగాని ప్రచారంలోకి రాలేదు. తొలిమూడు శతాబ్దాల్లో క్రైస్తవులు సిలువను చాల అరుదుగా వాడారు.
దీనికి రెండు కారణాలున్నాయి. మొదటిది యూదులూ గ్రీకు రోమను ప్రజలూ కూడ సిలువను ఎగతాళి చేసేవాళ్ళు. సిలువ నెక్కినవాడు శాపగ్రస్తుడని యూదుల భావం. కొరత వేయబడినవాడు వెర్రివాడని గ్రీకు రోమను ప్రజల తలంపు. అందుచే సిలువను బహిరంగంగా ప్రదర్శించడానికి తొలినాటి క్రైస్తవులు వెనుకాడారు. గాడిద తలగల మనిషి సిలువమీద వ్రేలాడుతున్నట్లుగాను, క్రింద ఒక నరుడు అతన్ని ఆరాధిస్తున్నట్లుగాను గీయబడిన చిత్రం ఒకటి ప్రాచీన రోమను భవనాల్లో కన్పించింది. 
"అలెక్స్ప్రెమెనోస్ తన దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు" అని ఆ చిత్రం క్రింద వ్రాసివుంది. ఆ గాడిద తలగల మనిషి క్రీస్తే, అలా ఆ రోజుల్లో అన్యమతాలవాళ్ళు సిలువ వేయబడిన క్రీస్తుని ఎగతాళి చేసేవాళ్ళూ. కనుక ప్రాచీన క్రైస్తవులు సిలువను బహిరంగంగా చూపించేవాళ్ళు కాదు. రెండవది, తొలి మూడు శతాబ్దాల్లో వేదహింసలు వుండేవి. సిలువ చిహ్నం ద్వారా క్రైస్తవులు రోమను ప్రభుత్వానికి చిక్కిపోయేవాళ్ళు అందుచే వాళ్ళు దాన్ని వాడటానికి భయపడ్డారు
ఇంకా, క్రీస్తుని దిగంబరుణ్ణిగానే సిలువ వేసారు. ఆలాంటి దిగంబర క్రీస్తుని బహిరంగంగా చూపించడానికి క్రైస్తవులు వెనుకాడారు. అందుకే క్రీస్తు రూపంగల సిలువలు ఐదవ శతాబ్దందాకా వాడుకలోకి రాలేదు. అంతకు ముందు క్రీస్తు దేహంలేని సిలువను వాడి అది జీవన దాయకమైనదని విశ్వసించేవాళ్ళు.

సిలువ వాడకం:
క్రైస్తవ సంకేతాలన్నిటిలోను మనం ఎక్కువగా వాడేది సిలువనే, ఐదవ శతాబ్దంలోనే సిరియా దేశంలో పూజనర్పించే పీఠంపై సిలువను పెట్టేవాళ్ళు. ఆరవ శతాబ్దంలో ప్రదక్షిణాల్లో సిలువను మోసికొనిపోవడం మొదలుపెట్టారు. 8వ శతాబ్దంలో షార్ల్మేన్రాజు పాపుగారికి ప్రదక్షిణ సిలువను బహూకరించాడు. ప్రదక్షిణం ముగిసాక దాన్ని పూజనర్పించే పీఠం దగ్గర పెట్టేవాళ్లు. మధ్యయుగాల్లో దేవాలయాల గోడలపై పండ్రెండు తావుల్లో సిలువ ఆకృతులు చెక్కేవాళ్ళు ఈ పండ్రెండు తావుల్లోను దేవళాలకు ప్రతిష్ఠ చేసేవాళ్లు. క్రమేణ దేవాలయాల మీదనేగాక ఇండ్లమీద, బళ్ళమీద ఇంకా రకరకాల కట్టడాల మీద సిలువ ఆకృతులు నిర్మించారు. సమాధుల దొడ్లలో సిలువలు నెలకొల్పారు. పూజ వస్తాల మీద వాటిని కుట్టించారు.
క్రమేణ పంట భూములను సిలువతో ఆశీర్వదించడం మొదలుపెట్టారు. ఆలాగే నూత్న భవనాలు, వాహనాలు పశువులు మొదలైనవాటిని గూడ ఆశీర్వదించారు. సిలువ ఆకృతులను గూడ సిలువ గుర్తుతో ఆశీర్వదించారు. భక్తిగలవాళ్లు తాము వాడుకొనే ప్రతిక్రొత్త వస్తువును మొదట సిలువతో ఆశీర్వదించిగాని వాడుకొనేవాళ్లు కాదు.
11-13 శతాబ్దాల మధ్యకాలంలో క్రైస్తవులు మహమ్మదీయులతో చేసిన యుద్దాలకు "సిలువ యుద్దాలు" అని పేరు. ఐతే ఈ కాలంలో సిలువ క్రీస్తుశ్రమల చిహ్నంగా గాక విజయ చిహ్నంగా మారిపోయింది. క్రీస్తు తన సిలువ ద్వారా మరణాన్నీ పాపాన్నీ జయించినట్లే మనం కూడ సిలువ ద్వారా శత్రువులను జయిస్తామని క్రైస్తవ ప్రభువులు భావించారు.
రానురాను సిలువభక్తి ఇంకా చాలా భక్తి మార్గాలకు దారితీసింది. పంచగాయాల భక్తి, తిరుహృదయ భక్తి, క్రీస్తు శ్రమలపట్ల భక్తి,  సిలువ మార్గం మొదలైన భక్తిమార్గాలన్నీసిలువ నుండి పుట్టినవే. మధ్యయుగాల్లో సిలువ ధ్యానాలు కూడ విరివిగా ప్రచారం లోకి వచ్చాయి.

సిలువగుర్తును వేసికోవడం:
భక్తులు నొసటిమీద సిలువగుర్తు వేసికోవడం రెండవ శతాబ్దంలోనే వాడుకలో వుండేది. కాని ఈ ఆచారం 4వ శతాబ్దంలోనే బాగా వాడుకలోకి వచ్చింది. తర్వాత నొసటి మీదా రొమ్మమీదా గూడ ఈ గుర్తువేసికొనే పద్ధతి అమలులోకి వచ్చింది. కొందరు దివ్యసత్ర్పసాదంతో గూడ నొసటిమీద కండ్లమీద సిలువగుర్తు వేసికొనేవాళ్ళు. పెదవుల మీద ఈ గుర్తు వేసికొనే పద్ధతి 8వ శతాబ్దంలో వచ్చింది, నొసలు, రొమ్ము భుజాలమీద పెద్ద సిలువ గుర్తు వేసికొనే ఆచారం 10వ శతాబ్దంలో గాని వాడుకలోకి రాలేదు. మొదట నొసటమీదా రొమ్ముమీదా ఆ పిమ్మట కుడి భుజంమీద, కడపట ఎడంభుజంమీద చేతిని త్రిప్పేవాళ్ళు తర్వాతి కాలంలో చేతిని ఎడమ భుజంమీదినుండి కుడిభుజం మీదికి త్రిప్పడం మొదలుపెట్టారు. ఇప్పటికీ ఈ పద్ధతే కొనసాగుతూంది.
సిలువ గురుతు వేసికొనేపుడు భక్తిని కలిగించుకోవడానికి కొన్ని మాటలను గూడ ఉచ్చరించేవాళ్ళు "పిత పుత్ర పవిత్రాత్మ నామమున" అనే మాటలు అతి ప్రాచీన కాలం నుండీ వాడుకలో వున్నాయి. వీటికి బదులుగా గ్రీకు క్రైస్తవులు "ఓ పవిత్రుడవైన దేవా, ఓ పవిత్రుడువూ బలవంతుడవూ ఐన దేవా, ఓ పవిత్రుడవూ అమర్త్యుడవూ ఐన దేవా మాపై దయజూపు" అనే మాటలు వాడతారు.
ఐతే నరులను సిలువ గురుతుతో ఆశీర్వదించడంలో అర్థమేమిటి? ఇక్కడ చాల అర్ధాలున్నాయి. ఆ నరులు క్రీస్తు ముద్రను స్వీకరించి ఆ యజమానునికి చెందుతారని ఒక భావం. వారు క్రీస్తుని విశ్వసిస్తున్నారని మరొక అర్థం. ప్రభువు పిశాచ శక్తినుండి మనలను కాపాడతాడని మరొక భావం. క్రీస్తు సిలువ మనలను రక్షించాలనిగాని అతని వరప్రసాదం మనలను కాపాడాలనిగాని ఇంకొక అర్థం. ఈ సిలువ గుర్తుతో నరులనూ ,వస్తువులనూ గూడ ఆశీర్వదించవచ్చు.

ముగింపు:
క్రైస్తవులమైన మనం ఈ దేశంలో అల్పసంఖ్యాకులం. ఐనా అన్యమతస్తులముందు మన రక్షణ సాధనమైన సిలువను ప్రదర్శించడానికి ఏమీ సిగ్గుపడకూడదు. ఈ లోకంలో మనం క్రీస్తుని అంగీకరించకపోతే పరలోకంలో అతడు మనల నేలా అంగీకరిస్తారు? పవిత్ర  సిలువను మనం మహిమ పరచాలంటే ఒకటే మార్గం -: సిలువను గుండెపైన ధరించడం కాదు గుండెల్లో స్మరించాలి
ఓ సిలువా! మా రక్షణ కొయ్యా!  నిన్నే అంటిపెట్టుకొని ఉండేలా మమ్ము దీవించుము ఆమెన్..

జోసెఫ్ అవినాష్✍️
యువ కతోలిక రచయిత
పెదవడ్లపూడి విచారణ
WhatsApp-:7207773395

No comments:

Post a Comment