పునీత అస్సీసిపుర క్లారమ్మ

పునీత అస్సీసిపుర క్లారమ్మ, 11 ఆగష్టు


ఉన్నతమైన కుటుంబములో 16 జూలై 1194లో క్లార జన్మించారు. తల్లిదండ్రులు ఫవరినో, ఒర్తోలాన. తండ్రి పురాతన రోమన్ కుటుంబము నుండి, తల్లి ‘ఫ్యూమి’ అను సుసంపన్నమైన కుటుంబము నుండి వచ్చారు. తల్లి చాలా భాక్తిపరురాలు. చిన్ననాటి నుండే క్లారా ప్రార్ధన పట్ల ఎంతో ఆసక్తిని చూపింది. 18సం.ల వయస్సులో, ఒక తపస్కాల రోజున పునీత జార్జి దేవాలయములో అస్సీసిపుర ఫ్రాన్సిస్ ప్రసంగీచడం విని, సువార్త ప్రకారం జీవించే లాగున తనకు సహాయం చేయమని అతనిని కోరింది. 1212 వ సం.ము, మ్రానికొమ్మల ఆదివారమున, క్లార ఇల్లు విడిచి, ఫ్రాన్సిసును కలుసుకోవడానికి ‘పోర్షింకుల’ దేవాలయానికి వెళ్ళినది. అచ్చట, దైవాంకిత జీవితానికి గుర్తుగా, ఫ్రాన్సిస్ ఆమె అందమైన వెంట్రుకలను కత్తిరించి, సాధారణ దుస్తులను ఇచ్చారు.

ఫ్రాన్సిస్ ఆదేశానుసారముగా, క్లార, పునీత బెనడిక్టు మఠములో చేరింది. తన తండ్రి ఆమెను కనిగొని, యింటికి తీసుకొని వెళ్ళడానికి ప్రయత్నించగా ఆమె నిరాకరించి, యేసు క్రీస్తే నాకు సర్వస్వం అని ఖరాఖండిగా చెప్పింది. ఆమెకు మరింత ఏకాంతం కలిగించుటకు, ఫ్రాన్సిస్ ఆమెను మరో బెనడిక్టు మఠమునకు పంపించారు.

కాలం గడిచే కొలది, అనేకమంది పుణ్యస్త్రీలు పేదరికములో, దేవునికి అంకితం కావింపబడి జీవించడానికి చేరారు. వారు “పూర్ లేడీస్ ఆఫ్ సాన్ దమియానో”గా పిలువ బడినారు. వారు లోకాశలకు, వ్యామోహాలకు దూరముగా, పేదరికములో కఠినమైన జీవితాన్ని జీవించారు. ఫ్రాన్సిస్ వారిని రెండవ సభగా స్థాపించి, ఆయన వ్రాసి ఇచ్చిన సభ నియమావళిని అక్షరాల జీవించారు.

పునీత క్లార, ఆమె సోదరీమణులు చెప్పులు వేసుకొనేవారు కాదు; మాసం భుజించేవారు కాదు; పేద యింటిలో జీవించేవారు; ఎక్కువ సమయాన్ని మౌనము, ప్రార్ధనలో గడిపేవారు. తోటలో పని చేసేవారు. అయినప్పటికిని వారు ఎంతో సంతోషముగా ఉండేవారు ఎందుకన, ఆని వేళలలో ప్రభువు వారికి చేరువలో ఉండేవారు. క్లార సభకు ‘సాన్ దమియానో’ ప్రాముఖ్యమైనదిగా మారింది. అప్పటికి వారు “ఆర్డర్ ఆఫ్ పూర్ లేడీస్ ఆఫ్ సాన్ దమియానో”గా పిలువబడినారు. కొంత కాలముపాటు పునీత ఫ్రాన్సిస్ వారిని ఆధ్యాత్మికముగా నడిపించారు. 1216లో క్లార, సాన్ దమియానో మఠాధ్యక్షురాలుగా నియమించడ మైనది. క్లార మరణించిన పది సంవత్సరముల తరువాత, ఈ సభ “ఆర్డర్ ఆఫ్ సెయింట్ క్లేర్”గా పిలువ బడినది.

తన సభకు తానే సభ నియమాళిని రచించినది. క్లార “మరో ఫ్రాన్సిస్”లా జీవించినది. ఫ్రాన్సిస్ మరణించిన తరువాత సభ నియమావళిని సడలించాలని ప్రయత్నాలు జరిగినప్పుడు, క్లార ఎంతమాత్రం ఒప్పుకోలేదు. కార్పోరేట్ పేదరికంలో పడిపోవడానికి ఆమెకు ఎంతమాత్రం ఇష్టం లేకుండెను.

1224లో రెండవ ఫ్రెడరిక్ సైన్యం అస్సీసిపై దాడిచేయడానికి వచ్చింది. అనారోగ్యముతో ఉన్నను, దివ్యసత్ప్రసాదముతో వారిని కలుసుకోవడానికి బయటకు వెళ్ళింది. శత్రువులకు అగుపించునట్లుగా దివ్యసత్ప్రసాదాన్ని ఉంచి, మోకరిల్లి, తన తోటి మఠకన్యలను కాపాడమని దేవున్ని ప్రార్ధించింది: “ఓ ప్రభువా! నేను ఇప్పుడు కాపాడలేని ఈ మఠకన్యలను మీరు కాపాడండి.” అప్పుడు, “నేనెప్పుడు వారిని నా సంరక్షణలో ఉంచెదను” అను స్వరము ఆమెకు వినబడింది. ఆ సమయములోనే, తక్షణ భయం సైనికులలో కలిగింది. మఠకన్యలను మాత్రమేకాదు, అస్సీసి పట్టణములోనే ఎవరికీ హాని చేయక, అక్కడనుండి వారు పారిపోయారు.

క్లార అనేక సంవత్సరాలు అనారోగ్యముతో బాధపడింది. అయినను, ప్రభు సేవలో ఎప్పుడు సంతోషముగా జీవించింది. ఆమె ఒకసారి, “మనం చాలా పేదవారమని కొందరు అంటున్నారు. అనంతమైన దేవుని కలిగిన హృదయం పేదదని పిలువబడునా?” అని పలికింది.

9 ఆగష్టు 1253లో పోపు నాలుగవ ఇన్నోసెంట్ క్లార సభ నియమావళిని ఆమోదించారు. రెండు రోజుల అనంతరం, క్లార తన 59వ ఏట తుదిశ్వాస విడిచారు. 1255లో పోపు నాలుగవ అలెగ్జాండరు ఆమెను పునీతురాలుగా ప్రకటించారు.

No comments:

Post a Comment