21వ సామాన్య ఆదివారము, Year B
యెహోషు. 24:1-2, 15-18; ఎఫెసీ. 5:21-32; యోహాను. 6:60-69
యేసు:
జీవవాక్కు
యూదులు అనేకమంది యేసు బోధనలకు,
కార్యాలకు ఆకర్షింపబడ్డారు. యేసు ఎక్కడికి వెళ్లినను ఆయనను వెదికి అనుసరించారు.
యేసు ఎప్పుడైతే “జీవాహారము”ను గురించి బోధిస్తూ, “నా శరీరమును భుజించి, నా
రక్తమును పానము చేయువాడు నిత్యజీవము పొందును” (యోహాను. 6:54) అని చెప్పారో, అది
విని, అనేకమంది శిష్యులు “ఈ మాటల కఠినమైనవి. ఎవరు వినగలరు?” అని చెప్పుకున్నారు.
ఆయన శిష్యులలో అనేకులు ఆయనను విడిచి వెళ్లి, మరెన్నడును ఆయనను వెంబడింపరైరి.
ఎందుకన, వారు ఆయనను విశ్వసించ లేదు. యేసు బోధను అంగీకరించలేక పోయారు. ఇలా కఠినమైనవిగా
భావింప బడిన బోధనలు ఎన్నో ఉన్నాయి.
మొదటి పఠనములో
మనం చూసినట్లయితే, యెహోషువ, తన జీవితములో
అప్పజెప్పబడిన బాధ్యతను ముగించిన తరువాత, చివరిలో ఇశ్రాయేలు ప్రజలను సమావేశ పరచి, వారందరు
ఒక నిర్ణయం చేయాలని కోరారు. యావేనా లేక మరియొకరిని పూజింతురో నిర్ణయం చేయాలని
కోరారు. యెహోషువ, “నేనూ, నా కుటుంబము
మాత్రము యావేను ఆరాధింతుము” అని స్పష్టం చేసారు. అప్పుడు
వారందరు “మేమును యావేను పూజింతుము అతడే మాకును దేవుడు” అని నిర్ణయించారు.
అలాంటి నిర్ణయమే తన పన్నిద్దరు
శిష్యులు కూడా చేయాలని, వారితో, “మీరును వెళ్లిపోయెదరా?” అని అడుగగా, సీమోను పేతురు,
“ప్రభూ! మేము ఎవరి యొద్దకు పోయెదము? నీవు నిత్యజీవపు మాటలు కలవాడవు. మేము
విశ్వసించితిమి. నీవు దేవునినుండి వచ్చిన పవిత్రుడవు అని గ్రహించితిమి” అని
అన్నారు.
జీవవాక్కుగల యేసును ప్రభువుగ మన
హృదయాలలో ప్రతిష్టించు కోవాలి. ఆ జీవవాక్కును మనం అనుదిన జీవితములో ఆచరించాలి.
గొప్ప నమ్మకముతో, విశ్వాసముతో ప్రభువును అనుసరించాలి. మనం ఎవరి యొద్దకు పోయెదము?
సర్వము ఆయనే! ప్రేమ, క్షమ, శాంతి, నిరీక్షణ, రక్షణ....
సాధారణంగా, మన జీవితాలకు
వ్యతిరేకముగా, విరుద్ధముగా లేనంతవరకు మనము కూడా దేవుని వాక్కును అంగీకరిస్తాము.
ఏదైతే, మన జీవితాలకు, ఆలోచనలకు అడ్డుగా ఉంటుందో, దానిని కఠినమైనదిగా భావిస్తూ
ఉంటాము. నోటితో పలికిన మాటలను మనం ఆచరించడములో విఫలమవుతాము. ఇశ్రాయేలు ప్రజలు కూడా
యావే మా దేవుడు అని పలికారు, కాని ఆ తరువాత అనేకసార్లు దేవున్ని తృణీకరించారు, విడనాడారు. ఇతర
దేవుళ్ళను కొలిచారు. “అన్యదైవములను ఆశ్రయించువారు పెక్కు శ్రమలకు గురియగుదురు”
(కీర్తన. 16:4) అన్న వాక్యాన్ని గుర్తుకు చేసుకుందాం. అలాగే, ఇశ్రాయేలు ప్రజలు
ఎన్నో శ్రమలను అనుభవించారు.
పేతురు చెప్పిన నిత్యజీవపు
మాటలను బైబులులో చూడవచ్చు. అందుకే, మనం ప్రతీ రోజు బైబులును చదవాలి, ధ్యానించాలి,
ఆచరించాలి. దివ్యపూజ కూడా మనం దేవుని వాక్కును చదువుకొని ధ్యానిస్తూ ఉంటాము. మన
రక్షణకు, దేవుని వాక్కు, క్రీస్తు శరీర రక్తములు (దివ్యసత్ప్రసాదం) ఎంతో
ముఖ్యమైనవి. మన నిత్యజీవితానికి అవి ఎంతో అవసరం. ఒక్కోసారి, దేవుని వాక్కును
నిర్లక్ష్యం చేస్తూ ఉంటాము.
రెండవ
పఠనం కేవలం భార్యాభర్తల గురించి లేక వివాహము గురించి చర్చించడం లేదు; ప్రధానముగా
‘వివాహము’ అను ఉదాహరణను బట్టి, క్రీస్తుతో మన సంబంధం ఎలా ఉండాలి అన్న అంశాన్ని
గురించి బోధిస్తుంది. క్రీస్తుతో మన బంధం ప్రేమతో ఉండాలి. నమ్మకం, విశ్వాసం
ఉండాలి. చిన్న కష్టం వస్తే విడాకులు తీసుకొనే ఈ రోజుల్లో, ఏ సంక్షోభం వచ్చినను,
క్రీస్తుతో మన బంధం దృఢముగా ఉండాలి.
మనం
కూడా అలాగే ఆలోచిస్తున్నామా? క్రీస్తును అనుసరిస్తే, అంతా సులువుగా ఉంటుందని
అనుకుంటున్నామా? మనం అనుకున్నది జరగకపోతే, దేవాలయానికి వెళ్ళడం మానేస్తాము,
వాక్యాన్ని ఆలకించము. కొంతమంది, సంఘాన్ని కూడా విడిచి వెళ్లిపోతారు. మన సంగతి
ఏమిటి? ఆత్మపరిశీలన చేసుకుందాం! యెహోషువ, పేతురువలె, మన దేవుని కొరకు, క్రీస్తు
కొరకు నిర్ణయం చేద్దాం!
No comments:
Post a Comment