పునీత
బర్నబాసు
అపోస్తలుడు,
పౌలు సహచరుడు, వేదసాక్షి
పునీత బర్నబాసును, అపోస్తలుడుగా, పునీత పౌలు సహచరుడుగా, మరియు
వేదసాక్షిగా మనం గౌరవిస్తాము. అపోస్తలుల కార్యములు 11:24లో, “ఈ బర్నబా మంచివాడు. అతడు పవిత్రాత్మతోను, విశ్వాసముతోను
నిండి యుండెను” అని చదువుచున్నాము. అలాగే అ.కా. 11:37లో, “అతడు తన సొంత భూమిని అమ్మి, వచ్చిన పైకమును తెచ్చి అపోస్తలుల పాదముల చెంత పెట్టెను” అని చదువుచున్నాము.
జీవితం, నేపధ్యము: జూన్ 11న, క్రీ.శ. 1-60 సంవత్సరాల మధ్య జీవించిన పునీత బర్నబాసు మహోత్సవాన్ని జరుపుకుంటాము. ఆయన అసలు పేరు యోసేపు. సైప్రస్
ద్వీపంలో జన్మించిన ఈయన, ఒక లేవి వంశస్తుడు (అ.కా. 4:36). అప్పట్లో సైప్రస్ రోమన్ సామ్రాజ్యంలో
భాగంగా ఉండేది. అయితే, వారి కుటుంబం యెరూషలేములో స్థిరపడింది. సౌలు (తరువాత పౌలు) కాలంలోనే, యోసేపు కూడా గమాలియేలు వద్ద విద్యాభ్యాసం చేశాడు. లేవి వంశం ఇశ్రాయేలు పన్నెండు
గోత్రాలలో ఒకటి, మరియు ఈ గోత్రం దేవాలయ సేవలకు
కేటాయించబడింది. బర్నబాసు లేవి వంశానికి చెందినవాడైనప్పటికీ, ఆయన దేవాలయ సేవకుడిగా కాకుండా, క్రైస్తవ బోధకుడిగా మారడం విశేషం!
‘బర్నబాసు’ అనే పేరు వెనుక అర్థం: పెంతెకోస్తు పండుగ తరువాత క్రీ.శ. 29 లేక 30లో క్రీస్తు విశ్వాసిగా
మారి, బర్నబాసుగా పేరు మార్చుకున్నాడు. బర్నబా అనగా ‘ఉత్సాహపరచువాడు’ లేదా ‘ఓదార్చేవాడు’ అని అర్ధము (అ.కా. 4:36). ఆయన ఇతరులను
ప్రోత్సహించే, ఓదార్చే స్వభావాన్ని బట్టి ఈ పేరు
పెట్టబడింది.
ప్రారంభ జీవితం, క్రైస్తవత్వంలో
ప్రవేశం: బర్నబాసు యొక్క ప్రారంభ జీవితం మరియు క్రైస్తవత్వంలోకి ప్రవేశం గురించి
బైబిలులో చాలా వివరాలు లేవు. అయితే, ఆయన యెరూషలేములో సంఘం ప్రారంభమైన తొలినాళ్లలోనే
ఒక ప్రముఖ సభ్యుడిగా ఉన్నారు. ఆయన తన ఆస్తిని అమ్మి, ఆ డబ్బును అపోస్తలుల పాదాల వద్ద ఉంచడం ద్వారా క్రైస్తవ సమాజానికి తన
నిబద్ధతను చూపించారు (అ.కా. 4:37). ఇది ఆయన సంఘము పట్ల, విశ్వాసము పట్ల నున్న ఉదార స్వభావాన్ని,
అంకితభావాన్ని స్పష్టంగా తెలియ జేస్తుంది.
పౌలుకు మద్దతు: పరివర్తన పొందిన పౌలును యెరూషలేము అపోస్తలులకు పరిచయం చేసినది ఈ
బర్నబానే (అ.కా. 9:27). క్రైస్తవ విశ్వాసములోనికి మారిన తర్వాత,
యెరూషలేములోని క్రైస్తవులు పౌలుగా మారిన సౌలును
అంత త్వరగా నమ్మలేక పోయారు. ఎందుకంటే, పౌలు అంతకుముందు
క్రైస్తవులను హింసించిన వ్యక్తి. అటువంటి సమయంలో, బర్నబాసు పౌలును అపోస్తలుల దగ్గరికి తీసుకువెళ్లి, ఆయన నిజముగా మారినట్లు ధృవీకరించాడు (అ.కా. 9:26-28). బర్నబాసు లేకపోతే, పౌలుకు ఆదిమ సంఘములో అంత త్వరగా అంగీకారం లభించి ఉండేది కాదు.
బర్నబాసు తన పేరుకు తగ్గట్లే పౌలుకు “ప్రోత్సాహం” ఇచ్చాడు.
అంతియోకియాలో సహకారం: యెరూషలేములోని క్రీస్తు సంఘము బర్నబాసును సిరియాలోని అంతియోకియాకు
గ్రీకు-క్రైస్తవులను సందర్శించమని పంపింది. “అతడు అక్కడకు వెళ్లి దేవుని క్రుపను
చూచి సంతోషించి, ప్రభువు యెడల హృదయ పూర్వకముగా విశ్వాస పాత్రులై ఉండుడని వారిని
ప్రోత్సహించెను” (అ.కా. 11:23). పిదప బర్నబాసు పౌలును వెదకుటకై తార్సు నగరమునకు వెళ్లి,
అక్కడ పౌలును కనుగొని, అతనిని అంతియోకియాకు తీసుకొని వచ్చాడు. వారిరువురు, ఒక ఏడాదిపాటు అచటి క్రీస్తు సంఘమును కలుసుకొని అనేకులకు క్రీస్తు సువార్తను బోధించారు,
సంఘాన్ని నిర్మించారు. అంతియోకియాలోనే శిష్యులు మొట్టమొదటి సారిగా ‘క్రైస్తవులు’ అని పిలువ
బడిరి (అ.కా. 11:25-26).
క్రీ.శ. 45లో, క్లౌదియా చక్రవర్తి కాలములో, యెరూషలేములో గొప్ప కరువు సంభవించినప్పుడు, యూదయాలోని సోదరులకు సాయము పంపవలెనని అంతియోకియా సంఘం నిర్ణయించుకుంది. బర్నబా, పౌలుల ద్వారా అంతియోకియా నుండి సహాయమును పొంది, యెరూషలేము
క్రైస్తవ సంఘ పెద్దలకు ఆ డబ్బును పంపించారు (అ.కా. 11:27-29).
మిషనరీ యాత్రలు: పౌలు మరియు బర్నబాసులు కలిసి అనేక
మిషనరీ యాత్రలు చేశారు. అంతియోకియాలో వారు దేవుని వాక్యాన్ని బోధించారు (అ.కా. 13:1-2). పరిశుద్ధాత్మ ద్వారా ప్రత్యేకించబడి, పౌలు, బర్నబాసులు కలిసి మొదటి మిషనరీ యాత్రను ప్రారంభించారు (అ.కా.13:2).
వారు సైప్రస్ మరియు ఆసియా మైనర్ (పిసిదియలోని అంతియోకియా, ఇకోనియం, లిస్త్ర, దెర్బే వంటి నగరాలు) ప్రాంతాలలో సువార్తను ప్రకటించారు. వారు మొదట
యూదుల సమాజ మందిరాలలో బోధించారు, కానీ యూదుల నుండి వ్యతిరేకత
ఎదురైనప్పుడు, అన్యజనులకు సువార్తను ప్రకటించడం ప్రారంభించారు. ఈ యాత్రలో వారికి అనేక కష్టాలు, హింసలు ఎదురయ్యాయి. లిస్త్రలో పౌలును రాళ్లతో కొట్టి చంపినట్లు
భావించారు, కానీ దేవుడు ఆయనను కాపాడారు. ఈ కష్టాలను
ఒకరికొకరు తోడుగా ఎదుర్కొన్నారు.
యెరూషలేము సభ: ఆదిమ సంఘంలో యూద క్రైస్తవులు, అన్య
క్రైస్తవుల మధ్య సున్నతికి సంబంధించిన భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు, పౌలు, బర్నబాసులు యెరూషలేమునకు వెళ్లి అపోస్తలులతో, సంఘ పెద్దలతో ఈ విషయాన్ని చర్చించారు (అ.కా. 15:1-2). అన్యమతాల నుండి
క్రైస్తవులుగా మారిన వారికి సున్నతి అవసరమా అనే విషయంలో వారు మార్గదర్శకాలను
కోరారు. ఈ సభలో, అన్యజనులకు సున్నతి అవసరం లేదని
నిర్ణయించబడింది. ఇది సువార్త
వ్యాప్తికి చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడింది, ఎందుకంటే ఇది క్రైస్తవ్యాన్ని యూదుల ఆచారాల నుండి విడదీసి, అన్యజనులకు మరింత అందుబాటులోకి తెచ్చింది.
యెరూషలేమునుండి తిరిగి వచ్చిన తరువాత, పౌలు, బర్నబాసు, మార్కు అను మారుపేరు గల యోహానుతో
కలిసి సైప్రసు ద్వీపములో సువార్తా ప్రచారమును చేపట్టారు. ఆ తరువాత ఆసియా మైనరులో కూడా
(ప్రస్తుత టర్కీ) సువార్తా ప్రచారం చేసారు. వారు అక్కడ యూదుల చేత ఎన్నో హింసలను పొందారు. అయినప్పటికీ, అచట ఎన్నో క్రైస్తవ సంఘాలను నిర్మించారు.
మార్కు గురించి విభేదం: రెండవ మిషనరీ యాత్రకు సిద్ధమవుతున్నప్పుడు, పౌలు, బర్నబాసుల మధ్య ఒక ముఖ్యమైన విభేదం తలెత్తింది. బర్నబాసు తన
బంధువైన యోహాను మార్కును తమతో తీసుకెళ్లాలని కోరాడు. అయితే మొదటి యాత్రలో మార్కు వారిని
విడిచిపెట్టి వెళ్ళిపోయినందున ఆయనను తీసుకెళ్లడానికి పౌలు ఇష్టపడలేదు. ఈ విభేదం
కారణంగా వారు విడిపోయారు (అ.కా. 15:36-40). పౌలు, బర్నబాసులు విడిపోయిన తర్వాత, బర్నబాసు మార్కును తనతో పాటు తీసుకెళ్లి సైప్రస్కు వెళ్లాడు (అ.కా. 15:39). పౌలు మాత్రం
సీలను తనతో పాటు తీసుకొని ఆసియా మైనర్కు వెళ్లాడు. ఈ సంఘటన దురదృష్టకరంగా అనిపించినప్పటికీ, ఇది ఇద్దరు బలమైన సువార్తికులు వేర్వేరు ప్రాంతాలలో సేవ చేయడానికి
దారితీసింది.
బర్నబాసును “అన్యజనుల అపోస్తలుడు” అని కూడా పిలుస్తారు. ఆయన అన్యమతాల
ప్రజలకు సువార్తను ప్రకటించడంలో ముఖ్య పాత్ర పోషించాడు.
వేదసాక్షి మరణం: బర్నబాసు తన
స్వస్థలమైన సైప్రసులో వేదప్రచారం చేస్తూ ఉండగా, సుమారు క్రీ.శ. 61 ప్రాంతంలో రాళ్లతో కొట్టబడి
చంపబడ్డాడు. సలామిస్లోని ఒక యూదుల సమాజ మందిరంలో బోధిస్తున్నప్పుడు, ఆయన సందేశాన్ని వ్యతిరేకించిన ఒక యూద గుంపు ఆయనపై దాడి చేసి, రాళ్లతో కొట్టి చంపింది. ఆయన బంధువైన యోహాను మార్కు, బర్నబాసు
మృతదేహాన్ని సేకరించి, ఒక గుహలో రహస్యంగా ఖననం చేసినట్లు
సంప్రదాయం చెబుతుంది. అనాది క్రైస్తవ సంఘ విశ్వాసులు బర్నబాసును ఎంతగానో
గౌరవించారు.
బర్నబాసు అవశేషాలను క్రీ.శ. 482లో సైప్రసులోని సలామిస్ వద్ద కనుగొన్నారు. అతని సమాధిలో హీబ్రూ భాషలో
వ్రాయబడిన మత్తయి సువార్త
గ్రంథమును కూడా
కనుగొన్నారు. పౌలుతో కలిసి, అపూర్వ సేవలు అందించినందులకు,
12 మంది అపోస్తలులలో ఒకరు కాకున్నా, శ్రీసభ బర్నబాసును ‘అపోస్తలుడు’గా గౌరవించింది.
అపోస్తలుడు అనగా ‘పంపబడినవాడు’ అని అర్ధము. యేసు తన శిష్యులను వేదప్రచారమునకు పంపారు (మత్త 10:1-15). వారికి స్పష్టమైన సూచనలను ఇచ్చి, “పరలోక రాజ్యము సమీపించినదని ప్రకటింపుడు” అని చెప్పారు. అంతేకాదు, వ్యాధిగ్రస్తులను స్వస్థపరచుటకు, దయ్యములను వెడలగొట్టుటకు వారికి అధికారమును ఇచ్చారు.
“శ్రీసభ స్వభావ సిద్ధంగానే వేదబోధక సంఘం” (Ad Gentes Divinitus, No. 2). ఈ ప్రకటన శ్రీసభ యొక్క అంతర్గత లక్ష్యాన్ని తెలియజేస్తుంది. వేదబోధక సంఘముగా, మనం ఏమీ ఆశించకుండా సంపూర్ణముగా క్రీస్తు కొరకు మన జీవితాలను అర్పించుకుందాం. ఆయన సువార్తను లోకమంతటా ప్రకటించేందుకు మన వంతు కృషి చేద్దాం.
No comments:
Post a Comment