బాప్తిస్మ యోహాను జయంతి మహోత్సవము (June 24)

బప్తిస్మ యోహాను జననం (24 జూన్)
యెష 49 :1-6, అ.కా. 13:22-26. లూకా 1:57-66, 80
వెలుగుకు సాక్ష్యమిద్దాం!


జూన్ 24న తిరుసభ బప్తిస్మ యోహాను జననాన్ని కొనియాడుచున్నది. ప్రవక్తలలో యోహాను గొప్పవాడు. ఆయన జననం లోకరక్షకుని రాకకు గొప్ప సంకేతం, బాలయేసు జననానికి పునాది. ఆయన చేసిన తొలి శబ్దం క్రీస్తు జననానికి మార్గం చూపింది. ఆయన బోధనలు, హెచ్చరికలు ప్రజలలో స్ఫూర్తిని రగిలించి, ఎంతోమందిని దైవమార్గంలోకి నడిపించాయి. అందుకే, ప్రతి సంవత్సరం జూన్ 24వ తేదీన శ్రీసభ, పునీత బప్తిస్మ యోహాను జన్మదినోత్సవాన్ని అత్యంత వైభవంగా జరుపుకుంటుంది.

దేవుడు తన ద్వారా ప్రవక్తల ప్రవచనాలను పరిపూర్ణం చేశాడు. యోహాను వెలుగునకు సాక్ష్యమివ్వడానికి వచ్చాడు. “నీవు ఎవరిపై ఆత్మ దిగివచ్చి ఉండుటను చూచెదవో ఆయనయే పవిత్రాత్మతో జ్ఞానస్నానమును ఇచ్చువాడు. ఇప్పుడు నేను ఆయనను చూచితిని. ఆయనయే దేవుని కుమారుడు అని నేను సాక్ష్యమిచ్చుచున్నాను” (యో 1:33-34) అని యోహాను వెలుగుకు సాక్ష్యమిచ్చి యున్నాడు. ప్రవక్తలలో యోహాను చివరివాడు. ప్రవక్తల ద్వారా దేవుడు ప్రజలకు రక్షణపై నమ్మకాన్ని కలిగిస్తారు. ప్రవక్తలు దైవ ప్రజల రక్షణను బోధిస్తారు. ప్రవక్తలు దేవునిచేత అభిషేకించబడినవారు.

సన్మనస్కుని సందేశం (లూకా 1:5-25)

హేరోదు రాజు పరిపాలన కాలంలో, యూదయా రాష్ట్రంలో జెకర్య అనే యాజకుడు ఉండేవాడు. అతని భార్య పేరు ఎలిజబెతమ్మ. వారికి సంతానం లేకపోయినా, ఇద్దరూ దేవునిపట్ల పరిపూర్ణమైన భక్తి విశ్వాసాలతో జీవించేవారు. అయితే, వృద్ధాప్యం కారణంగా వారికి సంతానం లేకపోవడం ఒక పెద్ద బాధగా ఉండేది. ఒకనాడు జెకర్యా దేవాలయంలో పీఠంపై దేవునికి సాంబ్రాణి పొగ వేస్తుండగా, గాబ్రియేలు దేవదూత అతనికి దర్శనమిచ్చాడు. దేవదూత, జెకర్యా! దేవుడు నీ మొర ఆలకించాడు. నీ భార్య గర్భం ధరించి కుమారుని కనును. అతనికి యోహాను అని పేరు పెట్టుము. అతడు నజరేయ వ్రతాన్ని పాటించి దేవునికి సేవలు చేస్తాడు. యోహాను ఏలియా అంతటి ఆత్మశక్తి కలవాడై ప్రభువునకు ముందుగా వెడలును. తల్లిదండ్రులను బిడ్డలను సమాధాన పరచును. అవిధేయులను నీతిమంతుల మార్గమునకు మరల్చును. ప్రభువు కొరకు సన్నద్ధులైన ప్రజలను సమాయత్త పరచును” (లూకా 1:17) అని చెప్పాడు. 

యోహాను జననం (లూకా 1:59-65)

దేవదూత చెప్పినట్లే, ఎలిజబెతమ్మ ఒక కుమారుడిని కన్నది. బిడ్డ పుట్టినందుకు ఇరుగుపొరుగు వారు ఎంతో ఆనందించారు. ఎనిమిదవ రోజు శిశువుకు సున్నతి చేసి, జెకర్యా అని పేరు పెట్టాలని అనుకున్నారు. కానీ, తల్లి అయిన ఎలిజబెతమ్మ అతనికి యోహాను అనే పేరు పెట్టాలని స్పష్టంగా చెప్పింది. కుమారుడికి ఏమి పేరు పెట్టమంటారు అని తండ్రి జెకర్యాను అడగగా, ఆయన పలక మీద యోహాను అని రాసి ఇచ్చాడు. దాంతో బిడ్డకు ఆ పేరే పెట్టారు. వెంటనే జెకర్యా నాలుక పట్టు సడలగా, ఆయన దేవుణ్ణి స్తుతించడం మొదలుపెట్టాడు. ఇలా అద్భుతంగా జన్మించిన ఆ బిడ్డడు తర్వాత ఎంత గొప్పవాడు అవుతాడో కదా అని ప్రజలు విస్తుపోయారు. ఈ సంఘటన దైవ ప్రణాళికను, యోహాను భవిష్యత్ పాత్రను తెలియజేస్తుంది.

యోహాను పుట్టుకలో పవిత్రత- దైవ నియమిత పాత్ర

బాప్తిస్మమిచ్చు యోహాను జననం కేవలం ఒక మానవ జననం కాదు, అది దైవ ప్రణాళికలో భాగమైన ఒక విశేషమైన సంఘటన. యోహాను మాతృగర్భంలోనే పవిత్రాత్మతో పరిపూర్ణంగా నింపబడ్డాడు అని బైబిల్ స్పష్టంగా చెబుతుంది (లూకా 1:15). ఈ అద్భుతమైన నింపుదల వల్ల, ఆయన జన్మ, కర్మ పాపములు శుద్ధిచేయబడి, పవిత్రంగా జన్మించాడు. ఇది సాధారణ మానవ జననం కంటే భిన్నమైనది, ఇది దేవుని అసాధారణమైన కృపకు నిదర్శనం. యెషయా ప్రవక్త ద్వారా (యెష 40:3) దేవుడు తెలియజేసిన విధంగా, లోకరక్షకుడైన క్రీస్తు రాకను ప్రజలకు తెలియజేసి, వారిని ఆత్మీయంగా సిద్ధం చేయడానికి దేవుడు యోహానును ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు. యోహాను పాత్ర కేవలం ప్రవక్తగా ఉండటం కాదు, ఆయన ప్రభువు మార్గాన్ని సిద్ధం చేసేవాడు, ప్రజల హృదయాలను మారుమనస్సు వైపు మరల్చేవాడు. ఆయన జీవితం, బోధనలు, చివరికి ఆయన మరణం కూడా క్రీస్తును మహిమపరచడానికే ఉద్దేశించబడ్డాయి.

యోహాను బోధనలు: క్రీస్తుకు మార్గనిర్దేశం

క్రీస్తు తన బహిరంగ జీవితాన్ని, బోధనా పరిచర్యను ప్రారంభించడానికి సిద్ధమవుతున్న సమయంలో, ఆయనకు మార్గాన్ని సిద్ధం చేయడానికి బప్తిస్మ యోహాను ముందుకు వచ్చాడు. ఆయన యోర్దాను నది సమీపంలో తన బోధనలను ప్రారంభించాడు. యోహాను సందేశం ప్రధానంగా, దేవుని రాజ్యం సమీపించింది, హృదయ పరివర్తన చెంది పుణ్యకార్యాలు చేయండి’ అనే పిలుపుపై ఆధారపడింది. ఆయన ప్రజలకు బప్తిస్మమిస్తూ, వారిని మారుమనస్సు పొందమని ప్రోత్సహించాడు.

యోహాను కేవలం ఆధ్యాత్మిక మార్పును మాత్రమే బోధించలేదు, సామాజిక న్యాయం, దాతృత్వం పట్ల కూడా ఆయన ప్రత్యేక దృష్టి పెట్టారు. సోదర ప్రేమ, పేదల పట్ల కనికరాన్ని బోధించాడు: ఆయన ప్రజలను సోదర ప్రేమను, పేదల పట్ల కనికరాన్ని అలవరచుకోమని ప్రోత్సహించాడు. రెండు అంగీలున్న వ్యక్తి ఏమియు లేనివానికి ఒకదానిని ఈయవలయును. భోజన పదార్ధములు ఉన్నవాడు కూడ అట్లే చేయవలయును” (లూకా 3:11) అని బోధించాడు. ఇది వస్త్రహీనులకు దుస్తులు, అన్నార్తులకు ఆహారం ఇవ్వాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పింది. అన్యాయం, అవినీతికి వ్యతిరేకంగా బోధించాడు: ప్రజలలో ఉన్న అన్యాయాన్ని, అవినీతిని అరికట్టడానికి యోహాను ప్రయత్నించాడు. పన్ను వసూలు చేసేవారిని ఉద్దేశించి, నిర్ణయింపబడిన పన్నుకంటె అధికముగా మీరు ఏమియు తీసికొనవలదు” అని చెప్పాడు. అలాగే రక్షక భటులతో, “బలాత్కారముగా గాని, అన్యాయారోపన వలన గాని, ఎవ్వరిని కొల్లగొట్ట వలదు. మీ వేతనముతో మీరు సంతృప్తి పడుడు” (లూకా 3:12-14) అని ఉపదేశించాడు. ఈ బోధనలు నిజాయితీ, న్యాయబద్ధమైన జీవన ప్రాముఖ్యతను నొక్కి చెప్పాయి.

క్రీస్తు గురించి యోహాను ప్రవచనం

యోహాను తన గురించి కాకుండా, రాబోయే మెస్సయ్య గురించి నిరంతరం బోధించాడు. ఆయన, నేను నీటితో మీకు బప్తిస్మము ఇచ్చుచున్నాను. కాని, నా కంటే అధికుడు ఒకడు రానున్నాడు. నేను ఆయన పాదరక్షల వారును విప్పుటకునైనను యోగ్యుడను కాను. కాని, నా తర్వాత వచ్చు క్రీస్తు పవిత్రాత్మతోనూ, అగ్నితోనూ జ్ఞానస్నానము చేయించును” (లూకా 3:16) అని ప్రవచించాడు. క్రీస్తును మెస్సయ్యగా అంగీకరించి, ఆయనను విశ్వసించేవారు నిత్యజీవమును పొందుతారని యోహాను స్పష్టంగా బోధించాడు. ఈ విధంగా, యోహాను బోధనలు ప్రజల హృదయాలను క్రీస్తు రాకకు సిద్ధం చేస్తూ, ఆయన పరిచర్యకు బలమైన పునాదిని వేశాయి.

యోహాను జీవనశైలి

బప్తిస్మ యోహాను తండ్రి ఒక యాజకుడు. పూర్వం, తండ్రి యాజకుడైతే బిడ్డలకు కూడా యాజకత్వం వారసత్వంగా లభించేది. అయితే, యోహాను మాత్రం ఆ వారసత్వాన్ని విడిచిపెట్టి, ఎడారిలో సన్యాస జీవితాన్ని ఎంచుకున్నాడు. ఆయన జీవనశైలి ఎంతో వైరాగ్యంతో కూడుకుంది: వస్త్రధారణ: యోహాను ఒంటె రోమముల వస్త్రములను ధరించి, నడుము చుట్టూ తోలుదట్టీ కట్టుకొని సంచరించాడు. ఇది లోక విషయాలపై ఆయనకున్న నిర్లిప్తతను, దేవుని సేవకు తనను తాను పూర్తిగా అంకితం చేసుకున్న విధానాన్ని సూచిస్తుంది. ఆహారం: ఆయన ఆహారం మిడతలు మరియు అడవి తేనె. ఇది ఎడారిలో దొరికే సహజమైన, సాధారణ ఆహారం, ఇది ఆయన నిరాడంబరమైన జీవనాన్ని ప్రతిబింబిస్తుంది. నిరుపేద, తపస్సుతో కూడిన జీవితం: యోహాను నిరుపేదగా జీవించాడు. ఆయన నిరంతరం ఉపవాసాలు ఉంటూ, తపస్సు చేస్తూ, ప్రార్థనలో నిమగ్నమై తన భవిష్యత్ పరిచర్యకు సిద్ధపడ్డాడు. ఈ కఠినమైన జీవనశైలి ఆయన దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి, క్రీస్తు రాక కోసం ప్రజలను సిద్ధం చేయడానికి తనను తాను బలపరచుకున్న విధానాన్ని చూపిస్తుంది.

ఈవిధముగా, యోహాను జీవనశైలి దైవ నిబద్ధతకు, లోక సుఖాలపై విరక్తికి, మరియు తన పరిచర్య పట్ల ఆయనకు గల తీవ్రమైన తపనకు ఒక స్పష్టమైన ఉదాహరణ.

క్రీస్తుకు బలమైన సాక్ష్యం (మత్త 3:13-17)

క్రీస్తు ప్రభువు తండ్రి చిత్తానుసారం బప్తిస్మము పొందుటకు బప్తిస్మ యోహాను దగ్గరకు వచ్చాడు. ఈ సమయంలో యోహాను అసాధారణమైన వినయాన్ని ప్రదర్శించాడు. “నేనే నీ చేత బప్తిస్మము పొందవలసిన వాడను” అని తనను తాను తగ్గించుకున్నాడు. అయితే, క్రీస్తు అది దేవుని సంకల్పమని పలికినప్పుడు, యోహాను నమ్రతతో విధేయత చూపాడు.

క్రీస్తు బప్తిస్మము పొందిన తరువాత, పవిత్రాత్మ పావుర రూపమున ప్రభువుపై వేంచేసి వచ్చుటను కనులారా చూసి ధన్యుడయ్యాడు. ఇది క్రీస్తు దైవత్వాన్ని, ఆయనపై దేవుని ఆశీర్వాదాన్ని నిర్ధారించే ప్రత్యక్ష సాక్ష్యం. “ఈయనే నా ప్రియ కుమారుడు .ఈయన యందు నేను అధికముగా ఆనందించు చున్నాను” అని క్రీస్తును ఉద్దేశించి తండ్రి పలికిన పలుకులను  చెవులారా విన్నాడు. ఈ మాటలు క్రీస్తు దైవ కుమారుడని, తండ్రికి అత్యంత ప్రీతిపాత్రుడని లోకానికి చాటిచెప్పాయి. ఈ సంఘటన త్రిత్వేక సర్వేశ్వరుని (తండ్రి, కుమారుడు, పవిత్రాత్మ) ఏకకాలంలో ప్రత్యక్షపరిచిన అద్భుతమైన సన్నివేశం. యోహాను ఈ మహిమాన్వితమైన దైవ ప్రకటనకు బలమైన సాక్షిగా నిలవడం ద్వారా, క్రీస్తు మెస్సయ్య అని, లోకరక్షకుడని ఆయన చేసిన బోధలకు మరింత శక్తిని, విశ్వసనీయతను చేకూర్చాడు.

దుష్టత్వ ఖండన, యోహాను నిర్భయ సాక్ష్యం

“నిజాన్ని నిర్భయంగా చెప్పడం” అనేది యోహానుకున్న అత్యంత విశిష్టమైన సుగుణం. అసలైన దేవుని ప్రవక్త ఎవరంటే, నిజాన్ని గుండెనిండా నింపుకొని, దానిని ధైర్యంగా ప్రకటించేవాడే. నిరుపేదలకు, సామాన్య ప్రజలకు సత్యాన్ని చెప్పడం సులభం కావచ్చు, కానీ అధికారులకు, ముఖ్యంగా పాలకులకు నిజాన్ని చెప్పాలంటే అది వారి అహాన్ని దెబ్బతీయడం వంటిది. కొంతమంది అధికారులు సానుకూలంగా స్పందించవచ్చు, కానీ చాలా సందర్భాలలో తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతాయి, కొన్నిసార్లు ప్రాణానికే ముప్పు కలుగుతుంది. అయితే, యోహానులో అత్యంత స్పష్టంగా కనిపించే సుగుణం ఇదే: అధికారానికి, ముఖ్యంగా రాజుకు తన తప్పును వేలెత్తి చూపడం.

హేరోదు రాజు తన తమ్ముడు ఫిలిప్పు భార్య, సౌందర్యవతి అయిన హేరోదియాను అక్రమంగా వివాహమాడాడు. అప్పట్లో ప్రజాస్వామ్యం అమలులో లేదు. రాజులు, సామంత రాజులు, సుంకరులు, అధికారులు అడిందే ఆట, పాడిందే పాట అన్నట్లుగా వ్యవహరించేవారు. అలాంటి పరిస్థితులలో, తప్పును తప్పుగా, ఒప్పును ఒప్పుగా చెప్పడం నిజమైన ప్రవక్త లక్షణం, అది ప్రాణానికి ముప్పు అయినా సరే. హేరోదు చేస్తున్నది తప్పని, అది అవినీతి, అధర్మమని యోహాను నిర్మొహమాటంగా ఖండించాడు. హేరోదు చేస్తున్న ఇతర దుశ్చర్యలను కూడా ఆయన మందలించాడు. ఈ కారణంగానే, హేరోదు యోహానును కారాగారంలో బంధించాడు.

శిరచ్ఛేదనం, సత్యానికి అమరత్వం

యోహాను తనను మందలించినందుకు హేరోదు అతన్ని చంపించ గోరాడు. అయితే, యోహానును ప్రజలు ఒక ప్రవక్తగా గౌరవించడంతో, ప్రజాగ్రహానికి భయపడి హేరోదు వెనుకాడాడు. కానీ, ఒకరోజు రాజు జన్మదిన వేడుకలలో, హేరోదియా కుమార్తె సలోమీ నాట్యం చేసి, హేరోదును ఎంతో మెప్పించింది. ఆమె ప్రదర్శనతో సంతోషించిన రాజు, అందరి ఎదుట ఏమి అడిగినా ఇస్తానని ప్రమాణం చేశాడు. తన తల్లి హేరోదియా ప్రోద్బలంతో, ఆ బాలిక యోహాను శిరస్సును అడగమని రాజును కోరింది. బప్తిస్మ యోహాను శిరస్సును ఒక పళ్లెంలో పెట్టి ఇప్పించమని” ఆమె రాజును కోరింది. రాజు అందరి ఎదుట మాట ఇచ్చినందున తప్పించుకోలేకపోయాడు. తన సేవకుని పంపి, చెరలో ఉన్న యోహాను తల నరికించి తెప్పించి బాలికకు ఇచ్చాడు. ఆమె దానిని తన తల్లికి అందించింది. యోహాను శిష్యులు తమ గురువు దేహాన్ని గౌరవపూర్వకంగా పాతిపెట్టారు.

ఈ సంఘటన యోహాను ధైర్యానికి, సత్యం పట్ల ఆయనకున్న నిబద్ధతకు, మరియు క్రీస్తు మార్గాన్ని సిద్ధం చేయడంలో ఆయన చేసిన అంతిమ త్యాగానికి నిదర్శనం. యోహాను మరణం సత్యానికి, న్యాయానికి నిలబడటం ఎంతటి మూల్యాన్ని అయినా కోరవచ్చని గుర్తుచేస్తుంది. అయినప్పటికీ, దైవచిత్తాన్ని నెరవేర్చడంలో ఆయన జీవితం ఒక గొప్ప స్ఫూర్తి.

సత్యానికి నిలబడటం - బప్తిస్మ యోహాను స్ఫూర్తి

అజ్ఞానుల క్రూరత్వం కన్నా విజ్ఞానుల మౌనం సమాజానికి అత్యంత ప్రమాదకరం” అనే నానుడిలో ఎంతో సత్యముంది. ఎదిరించేవాడు లేకపోతే, బెదిరించేవాడిదే రాజ్యమవుతుంది. ఇది అత్యంత అన్యాయంగా, అప్రజాస్వామికంగా పరిణమిస్తుంది. ప్రజాస్వామ్యంలో నాయకులను, ప్రభుత్వాలను విమర్శించే హక్కు పౌరులకు ఉంది. మానవ హక్కుల సంఘాలు, ప్రజా సంఘాలు, సామాజికవేత్తలు తరచుగా సద్విమర్శలు చేస్తుంటారు.

అయినప్పటికీ, కొన్నిసార్లు మత సంఘాలు, పెద్దలు సంఘ విద్రోహ శక్తులను, అప్రజాస్వామిక పాలనను విమర్శించడం చాలా అరుదుగా చూస్తాం. మనతో పాటు జీవిస్తూ, విశ్వాసాన్ని మరచి, దైవ ఆజ్ఞలను మీరి జీవించే వ్యక్తులను ప్రశ్నించడం కూడా క్రమేణా తగ్గుతోంది.

ఇటువంటి సమయంలో, బాప్తిస్మమిచ్చు యోహాను మనకు ఒక గొప్ప మాతృకగా నిలుస్తాడు. యోహాను ఒక నిజమైన ప్రవక్త, సామాజికవేత్త. ఆయన చేసిన తప్పును, ముఖ్యంగా హేరోదు రాజు దుశ్చర్యలను నిర్భయంగా మందలించి, దాని ఫలితంగా శిరచ్ఛేదనానికి గురయ్యాడు. అయినా సత్యాన్ని చెప్పడం, ముఖ్యంగా అధికారాన్ని, అధికారులను ప్రశ్నించడం ఆయన ఏనాడూ మరువలేదు.

ఈ గొప్ప సుగుణాన్ని మనం కూడా అలవర్చుకోవాలి. మన కళ్ళముందు జరిగే అన్యాయాలను, అక్రమాలను ముక్తకంఠంతో ఖండించాలి. ధైర్యంగా సత్యాన్ని పలికినప్పుడు, దేవుడు మనల్ని బహుగా ఇష్టపడతాడు. యోహాను జీవితం మనకు కేవలం ఒక చారిత్రక సంఘటన మాత్రమే కాదు, అది నేటికీ సత్యం కోసం నిలబడటానికి, న్యాయం కోసం పోరాడటానికి మనకు స్ఫూర్తినిచ్చే ఒక శక్తివంతమైన ఉదాహరణ.

ఈనాటి మొదటి పఠనంలో వింటున్నాం: “నేను తల్లి కడుపున పడినప్పటినుండియు ప్రభువు నన్నెన్నుకొని తన సేవకునిగా నియమించెను” (యెష 49:1). ఈ వాక్యం మనకు బయలుపరచు వి అద్భుతమైన సత్యమేమిటంటే, మనం జన్మించక మునుపే, దేవుడు మనలను మన పిలుపును ఎన్నుకొని యున్నాడు. ఈ సత్యం కేవలం యెషయాతోనే ఆగలేదు, యిర్మియా విషయంలో (యిర్మియా 1:5), బాప్తిస్మమిచ్చు యోహాను విషయంలో (లూకా 1:15), యేసు విషయంలో (లూకా 1:31), మరియు పౌలు విషయంలో (గలతీయులు 1:15) కూడా నిరూపితమైంది. దేవుడు మనలను ఒక ఉద్దేశంతో సృష్టించాడు, ఆయన ప్రణాళిక మన పుట్టుకకు ముందే ఉంది. 

యెషయా ప్రవక్తతో ప్రభువు, “అతడు నాకు పదునైన కత్తివంటి వాక్కునొసగెను” (యెష 49:1) అని పలికాడు. ప్రవక్తలు దేవుని వాక్కును ప్రజలకు ప్రవచించారు. దైవ ప్రజలు ఆ వాక్కును ఆలకించి, ప్రవక్తల ద్వారా దైవ సందేశాన్ని విన్నారు. దేవుని వాక్కు “ఆత్మ యొసగు ఖడ్గము” (ఎఫే 6:17). “దేవుని వాక్కు సజీవమును, చైతన్య వంతమునైనది. అది కత్తివాదరకంటే పదునైనది.  జీవాత్మల సంయోగ స్థానము వరకును, కీళ్ళ మజ్జ కలియువరకును అది చేధించుకొని పోగలదు.  మానవుల హృదయములందలి ఆశలను, ఆలోచనలను అది విచక్షింపగలదు” (హెబ్రీ 4:12). దేవుని వాక్కు మన అంతరంగాలను పరీక్షించి, మార్చగల శక్తి కలిగి ఉంది.

ప్రభువు యెషయాతో “యిస్రాయేలు! నీవు నా సేవకుడవు” అని చెప్పాడు.  దేవుడు తన ఇశ్రాయేలు ప్రజలతో పలికిన ఈ మాటలు, వారి చివరి ధ్యేయం అన్యులకు వెలుగును మరియు రక్షణను భూదిగంతముల వరకు తీసుకొని రావడం అని సూచిస్తాయి (ఆ.కాం. 22:17-18). ఇది దేవుని విశ్వవ్యాప్తమైన రక్షణ ప్రణాళికను తెలియజేస్తుంది.

కానీ, అనేకసార్లు ఇశ్రాయేలు ప్రజలు తమ బలహీనతల వలన దేవునికి దూరముగా వెళ్ళడం జరిగింది. వారు దేవుని ఆశీర్వాదాలను మరచారు. ఈ మానవ బలహీనతను మనం బప్తిస్మ యోహానులో కూడా చూస్తాం. ఆయన చెరసాలలో ఉన్నప్పుడు, తన శిష్యులను యేసు చెంతకు పంపి, రాబోవువాడవు నీవా! లేక మేము మరియొకరి కొరకు ఎదురు చూడవలెనా” అని ప్రశ్నించడం జరిగింది. “ఇదిగో! లోకము యొక్క పాపములను పరిహరించు దేవుని గొర్రె పిల్ల” (యోహాను 1:29) అని యేసును యోర్దాను నది చెంత చూచినప్పుడు ప్రవచించిన ప్రవచనాలను, కష్టాలలో ఉన్నప్పుడు యోహాను మరచాడా?

ఈ సంఘటన మానవ స్వభావంలోని బలహీనతను మనకు గుర్తుచేస్తుంది. మనం కూడా కష్టాలలో, బాధలలో దేవున్ని నిందిస్తాం, ఆయన సాన్నిధ్యాన్ని అనుమానిస్తాం, దేవుని అనుగ్రహాన్ని, దేవుని ప్రేమను అనుమానిస్తాం. ఇలాంటి సమయాలలో మనం విశ్వాసాన్ని కలిగి జీవించాలి. ప్రార్థనలో గడపాలి, దైవ సన్నిధిలో జీవించాలి. దేవుడు ఎల్లప్పుడూ మన వెన్నంటే ఉంటాడు, నిస్వార్థంగా ప్రేమిస్తూనే ఉంటాడు. ఆ అపారమైన ప్రేమను మనం తెలుసుకోవాలి, దానిలో స్థిరంగా ఉండాలి.

రెండవ పఠనములో పౌలు, దావీదు మహారాజు గూర్చి, యోహానుగూర్చి, యేసును గూర్చి బోధిస్తున్నాడు. దేవుడు దావీదును అభిషేకించి, ఆయన వంశం నుండి మెస్సయ్యను పంపాడు. మెస్సయ్య అంటే 'అభిషేకించబడినవాడు' అని అర్థం. ఈ విధంగా, దేవుడు తన ఇశ్రాయేలు ప్రజలకు చేసిన వాగ్దానాన్ని నెరవేర్చాడు.

ఈ వాగ్దానానికి సాక్ష్యంగా, మరియు ఈ ప్రవచనాల పరిపూర్ణత కోసం బప్తిస్మ యోహాను పంపబడ్డాడు. యోహాను యేసయ్య రాకను ప్రకటించి, ఆయన ఆగమనం కోసం మార్గాన్ని సిద్ధం చేశాడు. యేసు రాకతో, యోహాను ప్రవక్త కార్యం ముగిసింది. ఆయన పని క్రీస్తును వెల్లడిపరచడమే. క్రీస్తు వచ్చిన తర్వాత, యోహాను తన పాత్రను సమర్థవంతంగా పూర్తి చేశాడు.

సువిశేష పఠనములో, మనం బప్తిస్మయోహాను జననం గురించి వింటున్నాం. ఆయన జననం ఈ లోకానికి వెలుగును పరిచయం చేయడం, మరియు ఆ వెలుగుకు సాక్ష్యం ఇవ్వడం అనే ఉన్నతమైన ప్రయోజనంతో ముడిపడి ఉంది.

మనం ప్రవక్తలం కాకపోవచ్చు. అయినప్పటికీ, యోహాను వలె, మనం కూడా ఆ వెలుగునకు సాక్ష్యమివ్వడానికి పిలువబడ్డాం. యేసు మనకు చేసిన గొప్ప కార్యముల గురించి, ఆయన మనకు ఒసగిన అపారమైన దీవెనల గురించి సాక్ష్యమిద్దాం. ఈ లోకానికి ప్రభువు అందించిన రక్షణకు సాక్ష్యమిద్దాం!

యోహాను తన జీవితాన్ని క్రీస్తును ప్రకటించడానికి, ఆయనకు మార్గాన్ని సిద్ధం చేయడానికి అంకితం చేశాడు. అదే విధంగా, మన జీవితాల ద్వారా, మాటల ద్వారా, మరియు క్రియల ద్వారా క్రీస్తు ప్రేమను, సత్యాన్ని లోకానికి తెలియజేయడం మన బాధ్యత. మనం జీవిస్తున్న ఈ సమాజంలో, చీకటి ఆవరించి ఉన్న చోట, క్రీస్తు వెలుగును ప్రసరింపజేద్దాం.

No comments:

Post a Comment