పునీత సిలువ పౌలు గారి మహోత్సవం (అక్టోబర్ 20)

 పునీత సిలువ పౌలు గారి మహోత్సవం (అక్టోబర్ 20)


మనమొకటి తలిస్తే దైవమొకటి తలుస్తారు. దేవుని ఆలోచనలు  మానవుల ఆలోచనల వంటివి కావు. దేవుని ఆలోచనలు, మార్గములు మన మార్గముల వంటివి కావు. దేవుని ఆలోచనలు, మార్గములు, ప్రణాళికలు ఉన్నతంగా ఉంటాయి. దేవుని స్వరాన్ని ఆలకించి, క్రీస్తు బోధనలకు ఆకర్షితులై తమ సమస్తాన్ని  వదిలిపెట్టి దైవ చిత్తాన్ని పరిపూర్తిగా నెరవేర్చి, శ్రీ సభ అభివృద్ధికి కృషిచేసిన పునీతులు ఎందరో ఉన్నారు. అట్టివారిలో పునీత సిలువ పౌలు గారు ఒకరు.

1694 వ సంవత్సరం జనవరి 3న ఇటలీలో పౌలు ఫ్రాన్సిస్ డేనియో( పునీత సిలువ పౌలు) గారు జన్మించారు. తన చిన్నతనం నుండే ప్రభు ప్రేమను గూర్చి దార్శనికత కలిగి పెరిగారు. పౌలుగారు 19  సంవత్సరాల ప్రాయంలో  ఉన్నప్పుడు తన తండ్రి తన లాగే పౌలును వ్యాపారంలో సహకారిగా ఉండమని కోరారు. గురుశ్రీ అయిన తన అంకుల్ తనను గురువు కమ్మని ప్రోత్సహించారు. ఉన్నత కుటుంబమునకు చెందిన ఒక యువతి తనను పెళ్లాడమని కోరింది.

తను ఏం చేయాలి? దేవుని చిత్తమేమిటి? తను 13- 19 సంవత్సరాల మధ్య కొమ్మరి ప్రాయంలో ఉన్నప్పుడు క్రీస్తు సిలువచే ప్రేరణ పొందాడు. మానవాళి కొరకు క్రీస్తు అనుభవించిన శ్రమలు, మరణాన్ని ధ్యానిస్తూ ఆయన ప్రేమను గ్రహించాడు. ఆ ప్రేమకు బదులుగా తిరిగి తను కూడా ప్రభువును ప్రేమించాలని తన అంతరాత్మ ప్రబోధించింది. ప్రార్థన, సువార్త,  క్రీస్తు శ్రమల బోధ ద్వారా యేసు పట్ల తన ప్రేమను ప్రదర్శించాలనుకున్నాడు.

కుటుంబంలో తను పెద్ద కుమారుడు కుటుంబం పెద్దది తమ్ముళ్లు,చెల్లెండ్ర సంఖ్య ఎక్కువ కుటుంబ బాధ్యతలలో తండ్రితో పాలు పంచుకోవాల్సిన పరిస్థితి తప్పని పరిస్థితిలో తండ్రి మాటకు విధేయించి. ఇంటి బాధ్యతలలోనే నిమగ్నమయ్యాడు.

21 సంవత్సరాల ప్రాయంలో ఉన్నప్పుడు క్రైస్తవులకు టర్కీ దేశస్థులకు జరుగుచున్న  మతపరమైన యుద్ధంలో పాల్గొన్నాడు. ఈ విధంగా ప్రభు సేవ చేసిన వాడనౌతానని భావించాడు. కానీ ఆ యుద్ధంలో జరుగుతున్న హింస, అధర్మాన్ని, అన్యాయాన్ని చూసి ప్రభువు సేవకు ఈ మార్గం సరైనది కాదని భావించి యుద్ధరంగం నుంచి విరమించుకున్నాడు. ప్రభువు తన సేవ నిమిత్తం తనకు మరొక రకమైన యుద్ధ మార్గమును సూచిస్తాడని ఎదురు చూశాడు.

ఇంట్లోనే ఉంటూ కుటుంబానికి చేదోడువాదోడుగా ఉన్నాడు. అలాగే ప్రార్థన, ప్రాయశ్చిత్తము తపస్సు కూడా చేస్తూ దైవ ధ్యానంలో  ఆధ్యాత్మిక చింతనలో కొనసాగుచున్నాడు. 1720వ సంవత్సరంలో స్థానిక మేత్రానులను కలసి  చర్చిలో సేవ చేయటానికి అనుమతి పొందాడు. పొడవైన నల్ల దుస్తులు ధరించి చర్చిలో సేవ చేస్తూ పూజా బలికి ఏర్పాట్లు చేస్తుండేవాడు‌. బాలబాలికలకు సత్యోపదేశం నేర్పిస్తూ, గృహ ప్రార్థనలు, వాక్య పరిచర్య చేస్తూ ఉండేవాడు. జ్ఞానవంతుడు పవిత్రుడుగా పరిగణించబడ్డారు. పెద్దలకు సలహాలనిచ్చేవారు.

ఒక సభను స్థాపించాలనే సదుద్దేశంతో తను ఆశించిన సభ యొక్క నియమ నిబంధనలు రూపొందించాడు. ప్రార్ధన ,ఉపవాసము, సాధన ఆధ్యాత్మిక క్రమశిక్షణ, తపస్సు పవిత్రత ,బ్రహ్మచర్యం త్యాగం, ధర్మం, సేవ దాతృత్వం మొదలగు అంశాలకు సంబంధించి విధి విధానాల రూపకల్పన చేశాడు.

1721 వ సంవత్సరంలో పాపు గారి అనుమతి కొరకు రోముకు వెళ్ళాడు. కానీ అతన్ని బిచ్చగాడిగా భావించి భద్రతా సిబ్బంది అధికారులను కలువ నివ్వలేదు. తిరిగి స్వగ్రామం చేరి పాషనిస్ట్ సభను ఏర్పాటు చేశాడు. తన ఆశయం ప్రజలకు తెలియపరచి సభ్యులుగా చేరమని ఆహ్వానించాడు. కొందరు సభ్యులుగా చేరారు .క్రీస్తు శ్రమలు మరణమును గూర్చి ప్రజలకు బోధిస్తూ వచ్చారు.

1734 సంవత్సరంలో గురువుగా అభిషేకింపబడ్డారు "సిలువ పౌలుగా" నామకరణమును స్వీకరించారు. కొంతకాలం ఒక హాస్పటల్ గురువుగా సేవలందించారు. తరువాత మధ్య ఇటలీలో సువార్త ప్రబోధం చేశారు. వివిధ ప్రాంతాలలో సిలువ శ్రమలు మరణమును గూర్చి బోధిస్తూ క్రీస్తు ప్రేమను చాటారు. ఎందరినో క్రీస్తు వైపుకు తిప్పారు.

1769 వ సంవత్సరంలో వారి సభకు పాపుగారి అనుమతి లభించింది. 1771 లో కన్యా స్త్రీలకు పాషనిష్ట్ మఠంను స్థాపించారు. అనేక సంవత్సరాలు సేవలందించి 1775 లో తన 82 వ ఏట ప్రభువు నందు నిద్రించారు. 1867 జూన్ 29న తొమ్మిదవ భక్తి నాధ‌ పాపు గారు పునీత పట్టం కట్టారు.

ధ్యానం-:

 శ్రమల దేవుడిచ్చే వరాలు. అలలు లేని సముద్రం ఉండదు. మలుపులు లేని రహదారులుండవు. అలలే సముద్రానికి అందం. మలుపులే రహదారులకు శోభ. శ్రమలు ప్రేమకు సంకేతం. మహిమకు మార్గం. ప్రభు శ్రమలు ధ్యానించుదాం. పునరుజ్జీవమును పొందుదాం. అట్టి శక్తిని, సంకల్పాన్ని అనుగ్రహించమని పునీత సిలువ పౌలు గారి యొక్క మధ్యస్థ ప్రార్థనను వేడుకుందాం..... అందరికీ పండుగ శుభాకాంక్షలు....

జోసెఫ్ అవినాష్ సావియో
యువ కతోలిక రచయిత
పెదవడ్లపూడి విచారణ

No comments:

Post a Comment