పునీత జోజప్పగారి మహోత్సవం - 19 మార్చి

 పునీత జోజప్పగారి మహోత్సవం, 19-03-2021

క్రీస్తు నాధునియందు ప్రియ సోదరా, సోదరీ!

నేడు మరియతల్లి భర్తయగు పునీత జోజప్పగారి పండుగను కొనియాడు చున్నాము. ఈ పండుగను 9వ భక్తినాధ పోపుగారు 1847లో ఏర్పాటు చేసారు. 1870వ సం.లో విశ్వశ్రీసభకు పాలకునిగా ప్రకటింప బడినాడు. 12వ భక్తినాధ పోపుగారు 1955 వ సం.లో మే 1న పునీత కార్మిక జోజప్పగారి పండుగను ఏర్పాటు చేసారు.

రక్షణ ప్రణాళికలో దేవమాతకు భర్తగా, దివ్య బాలయేసుకు సాకుడు తండ్రిగా, తిరుకుటుంబ పోషకుడిగా తన జీవిత పాత్రలో నీతిమంతునిగా, కష్టజీవిగా, విశ్వసనీయుడిగా వినుతికెక్కిన సుగుణశీలుడు పునీత జోజప్పగారు. మన తల్లి శ్రీసభ ప్రతి యేటా మార్చి 19వ తేదీన విశ్వవ్యాప్తంగా పునీత జోజప్పగారి మహోత్సవాన్ని కొనియాడుతూ, ఆయన విశ్వాస జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని, ప్రతి ఒక్కరు క్రీస్తు బాటలో అడుగులు వేయాలని మన అందర్నీ ఆదేశిస్తున్నది.

ఈ మేరకు జోజప్ప గారి సుగుణాలను ధ్యానిద్దాం:

1. నీతిమంతుడు: 
పునీత రెండవ జాన్ పాల్ జగద్గురువులు శ్రీసభకు రాసిన లేఖలో పునీత జోజప్పగారిని గూర్చి, “లోక సర్వేశ్వరునికి సంరక్షకుడు అంటే అతడు చాలా పరిశుద్ధుడు, పవిత్రుడు, సాదుశీలుడు, వినమ్ర హృదయుడు. నిర్మలత్వం, నిష్కపటత్వము మొదలైన సుగుణాలతో కూడిన వ్యక్తిత్వం కలవారు” అని ప్రశంసించారు. వాస్తవానికి నీతిమంతుడు ప్రార్ధనాపరుడు, విశ్వాసములో జీవించేవాడు.

మత్తయి సువార్త 1వ అధ్యాయం 19వ వచనములో, జోజప్పగారు “నీతిమంతుడు” అని చదువుచున్నాము. జోజప్పగారిని “నీతిమంతుడు” అని పిలవటం వెనుక ఎన్నో కారణాలు ఉన్నాయి. యూదుల సంప్రదాయాలలో వివాహానికి ఒక చక్కటి విశిష్టత ఉన్నది. వివాహానికి కొద్ది నెలల ముందు యూదులు దేవుని, కుటుంబీకుల సమక్షంలో నిశ్చితార్థాన్ని కొనియాడేవారు. ఈ నిశ్చితార్థం పూర్తయిన కొన్ని నెలల తర్వాత వివాహాన్ని ఆచరించేవారు.

లూకా సువార్త 1వ అధ్యాయం 27వ  వచనం ప్రకారం, జోజప్పగారికి మరియతల్లితో ప్రధానము చేయబడింది. ఇక వీరిరువురూ కూడా కొన్ని రోజులలో పరిశుద్ధ వివాహాన్ని చేసుకొని కుటుంబ జీవితంలోకి అడుగు పెట్టబోతున్న తరుణంలో పవిత్రాత్మ ప్రభావం వలన మరియతల్లి గర్భం దాల్చారు. ఇది దైవ ప్రణాళిక. మోషే ధర్మశాస్త్రం ప్రకారం వివాహం కాకముందు స్త్రీ గర్భం ధరిస్తే అది పాపం కిందకి వస్తుంది. శిక్షలు కూడా చాలా కఠినంగా ఉంటాయి. ద్వితీయోపదేశకాండము 22:20-21 ప్రకారం, అలాంటి స్త్రీని రాళ్ళతో కొట్టి చంపాలని చెబుతుంది.

జోజప్పగారి స్థానంలో మరొక మానవమాత్రుడు ఉన్నట్లయితే, ఖచ్చితంగా మరియతల్లిని తీసుకొని వెళ్లి న్యాయం కోసం పరిసయ్యుల, ధర్మశాస్త్ర బోధకుల చేతికి అప్పగించేవాడు. కాని జోజప్పగారు ఆ పని చేయలేదు. సమాజంలో నిలబెట్టి బహిరంగంగా అవమానింప ఇష్టంలేక మరియతల్లిని మౌనంగా, రహస్యంగా విడిచి పెట్టాలనుకున్నారు (మత్తయి 1:19). ఎందుకన, ఆయన నీతిమంతుడు. దేవదూత స్వప్నంలో కనిపించి ఇది దైవ కార్యం, దయచేసి మరియమ్మను విడిచిపెట్టవద్దు, ఆమెను స్వీకరించు అని చెప్పినప్పుడు దేవుని ప్రణాళికను పరిపూర్తిగా అర్థంచేసుకొని జోజప్పగారు మరియతల్లికి అన్ని వేళలా తోడుగా ఉన్నారు.

నేడు కొన్ని కుటుంబాలను చూసినట్లయితే భార్యమీద లేనిపోని అనుమానాలతో చేయిచేసుకునేవారు, విడాకులు తీసుకొని కుటుంబాలను చేజేతులారా నాశనం చేసుకునేవారు ఎంతోమంది ఉన్నారు. అట్టివారు ఓసారి జోజప్పగారిని స్మరించుకుంటే మంచిది. జోజప్ప, మరియతల్లి వీరిరువురు కూడా కాపురం చేయకముందే మరియ తల్లి గర్భం దాల్చారు. ఆ క్షణంలో మరియమ్మను జోజప్పగారు బహిరంగంగా జనం మధ్య అవమానించ లేదు, దానికి బదులుగా, మౌనంగా రహస్యంగా విడిచి పెట్టాలనుకున్నారు. కాని దూత ద్వారా ఇది దైవకార్యం, పవిత్రాత్మ ప్రభావం వలన జరిగిన మహత్కార్యం అని తెలుసుకొని మరియతల్లికి అండగా ఉన్నారు. ముఖ్యంగా ప్రసవ సమయంలో  జోజప్పగారి మంచి మనసును బట్టి దేవుడు ఆయనను నీతిమంతునిగా సత్కరించారు. ఇది ఆయనకు దక్కిన అరుదైన గౌరవం.

నీతిమంతుడు అనగా, నీతిగా, న్యాయముగా జీవించేవాడు, సత్ప్రవర్తన కలిగి యుండేవాడు, ధర్మాత్ముడు అని అర్ధం. కనుక ఇదొక గొప్ప సుగుణం.

2. పునీత జోజప్పగారు దైవభక్తిపరుడు:
 దైవభక్తిగల మనిషిలో ఐదు సుగుణాలు ఖచ్చితముగా ఉంటాయి:
1. దేవున్ని నమ్ముతాడు: అనగా అందరికన్నా, అన్నింటికన్నా దేవునికి ప్రధాన స్థానం ఇవ్వడం. దేవునిపై ఆధారపడి జీవించడం. దేవునికన్న, ఇతర విషయాలకు ప్రాముఖ్యతను ఇచ్చినప్పుడు అది విగ్రహారాధన అవుతుంది. దైవభక్తిగల తండ్రి తన కుమారున్ని దేవునివైపుకు నడిపిస్తాడు. “యేసు జ్ఞానమందును, ప్రాయమందును వర్దిల్లుచు, దేవుని అనుగ్రహమును, ప్రజల ఆదరాభిమానములను పొందుట” (లూకా 2:52) జోజప్పగారు చూసారు. కష్టతరమైనవి ఎన్నో జోజప్పగారు చేయగలిగారు, ఎందుకన, ఆయన దేవున్ని నమ్మాడు, విధేయించాడు. దేవునిపై నమ్మకముంచడం అనగా, మన భయాలలో, బలహీనతలలోకూడా ముందుకు వెళ్ళగలము అని విశ్వసించడం. 
2. దేవుని వాక్యాన్ని ఎరిగినవాడై ఉంటాడు: దేవునియొక్క వాక్యమును హృదయమున నిలుపు కొంటాడు (కీర్తన 119:11). దైవభక్తిగల భర్త, తండ్రికి దేవుని వాక్యం తప్పక తెలిసి ఉంటుంది. జోజప్పగారు దేవుని వాక్యాన్ని క్షుణ్ణముగా ఎరిగినవారు. 
3. ఎల్లప్పుడూ ప్రార్ధన చేస్తాడు: మత్తయి సువార్త 6:5-15లో యేసు తన శిష్యులకు ప్రార్ధన చేయడం నేర్పించాడు. దేవుని చిత్తం నెరవేరాలని ప్రార్ధన చేస్తాడు. జోజప్పగారు దేవుని చిత్తాన్ని అక్షరాల పాటించాడు. 
4. బంధాలను నిర్మిస్తాడు: ఆపదలలో, కష్టసమయాలలో, కుటుంబాలను నిలబెడతాడు. పునీత జోజప్పగారు అక్షరాల అలాగే చేసారు. తిరుకుటుంబాన్ని నిలబెట్టారు, నిర్మించారు. 
5. ఇతరులకు సేవ చేస్తాడు: హృదయపూర్వకముగా సేవ చేయుట. జోజప్పగారి గొప్పతనం ఏమిటంటే, ఆయన మరియతల్లి భర్తగా, యేసుకు తండ్రిగా - రక్షణ ప్రణాళికలో తన సేవను హృదయపూర్వకముగా, సంపూర్ణముగా అందించాడు. ఆయన సేవ త్యాగపూరితమైనది. తిరు కుటుంబానికి తన సర్వాన్ని, త్యాగం చేసాడు. తన ప్రేమను తన సేవలో పరిపూర్ణం గావించాడు. 
విశ్వాసము ద్వారా నీతిమంతుడు జీవిస్తాడు (రోమీ 1:17).

3. కష్టజీవి:

మత్తయి 1:1-16 ప్రకారం, పునీత జోజప్పగారు దావీదు వంశానికి చెందిన వ్యక్తి. దావీదు వంశానికి ఎంతటి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయో మనందరికీ తెలుసు. జోజప్పగారు ఈ పేరుప్రఖ్యాతులను ఉపయోగించి ఏవైనా చేయవచ్చు. కాని ఆయన తనకు తెలిసిన వడ్రంగి వృత్తినే కుటుంబ పోషణకై ఎంచుకున్నారు. ఈ వడ్రంగి వృత్తిలోనే మంచి ప్రావీణ్యతను, గుర్తింపును సంపాదించుకున్నారు (మత్తయి 13:55). ‘పని చేయడంఅనేది రక్షణ ప్రణాళికలో భాగస్తులగుటకు ఓ చక్కటి మార్గం. మనకున్న వరాలద్వారా సమాజములో ఇతరుల సేవనిమిత్తమై ఉపయోగించే బాగ్యం లభిస్తుంది. పనిచేయడం దేవుని ప్రణాళికలో భాగం. ఏ పనైనను మానవ గౌరవార్ధమై యుండాలి. 

4. సంరక్షకుడు / ప్రేమగల తండ్రి:

తన స్వప్నంలో దేవదూత ద్వారా దేవుని ఆదేశాలను స్వీకరించి. హేరోదు రాజు యొక్క దుష్ట తలంపుల నుండి బాల యేసును కాపాడారు. ఒక గాడిద సహాయముతో తాను నడుస్తూ మరియతల్లిని, బాల యేసును సురక్షిత ప్రాంతానికి చేర్చి శత్రువుల బారినుండి తల్లిని, బిడ్డని కాపాడారు (మత్తయి 2:13-15). అదేవిధముగా, బాలయేసు 12 ఏళ్ల ప్రాయంలో యెరుషలేములో తప్పిపోయినప్పుడు తల్లడిల్లిపోయి, మూడు రోజులపాటు నిద్రాహారాలు మానేసి వెతికి వెతికి చివరికి దేవాలయంలో కనుగొన్నారు. అన్ని వేళలా క్రీస్తుకు తోడుగా ఉన్నారు. జోజప్పగారు నిజమైన తండ్రి, నిజమైన సంరక్షకుడు. మరియతల్లి, యేసు కొరకు ఆయన సర్వం ప్రేమతో, ఆప్యాయముతో చేసాడు. జోజప్పగారు బాలయేసుకు సర్వం చేసారు. ప్రతీ క్షణం వెన్నంటి ఉన్నారు.

5. ప్రార్థనాపరుడు:

జోజప్పగారు మంచి ప్రార్థనా పరుడు. మోషే ధర్మశాస్త్రాన్ని, పది ఆజ్ఞలను తు.చ. తప్పకుండా పాటించిన వ్యక్తి. దేవుని ఆదేశానుసారం ఎనిమిది దినములు గడిచిన పిమ్మట శిశువునకు సున్నతి చేసి దేవదూత ముందుగా సూచించినట్లు ఆ బిడ్డకు “యేసు” అని పేరు పెట్టారు. మోషే ధర్మ శాస్త్రాన్ని గౌరవించి, పాటించి ప్రతి తొలిచూలు మగబిడ్డ దేవునికి అర్పింపబడవలెను అని ప్రభువు ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్నట్లు బాల యేసుని దేవాలయంలో కానుకగా సమర్పించారు. సాధారణంగా కలలను ఎవరూ పట్టించుకోరు. కాని జోజప్పగారు మాత్రం తన స్వప్నంలో దేవుని ద్వారా దూత మోసుకొచ్చిన ప్రతి సందేశాన్ని త్రికరణశుద్ధిగా ఆలకించి, పాటించి దేవుని చిత్తాన్ని నెరవేర్చారు. పరిశుద్ధ గ్రంథంలో ఎందరో నోరు తెరిచి మాట్లాడిన సందర్భాలు మనకు అనేకం కనిపిస్తాయి. కానీ జోజప్పగారు నోరు తెరిచి మాట్లాడిన ఒక్క సందర్భం కూడా మనకు పరిశుద్ధ గ్రంథంలో కనిపించదు. ఆయన దేవుని పట్ల ప్రేమను, తనకుగల విశ్వాసాన్ని మాటల్లో కాదు చేతల్లో నిరూపించి  చూపించారు.

5. మంచి మరణం:

పునీత జోజప్పగారు దేవుని పిలుపును అందుకున్నారు. మరియతల్లికి భర్తగా, దైవకుమారునికి తండ్రిగా పిలుపును అందుకున్నాడు. తన పిలుపును సంపూర్ణ విశ్వసనీయతతో పరిపూర్తి చేసాడు. ఆతరువాత దేవుడు జోజప్పగారిని తన సన్నిధిలోనికి పిలచుకున్నాడు. పరిశుద్ధమైన జీవితాన్ని జీవించి, క్రీస్తు, మరియతల్లి సన్నిధిలో, ఒడిలో భాగ్యమైన మరణాన్ని పొందారు. తిరుసభ పాలకుడిగా, మంచి మరణాన్ని ప్రసాదించు పునీతుడిగా వినతికెక్కారు.

చివరిగా:

ఈ సంవత్సరాన్ని (8 డిసెంబర్మ 2020 - 8 డిసెంబరు 2021) పరిశుద్ధ పోపుగారు “జోజప్పగారి మహా సంవత్సరము”గా అంకితమిచ్చారు. పరిశుద్ధ జీవితాన్ని జీవించుటకు కావాల్సిన వరప్రసాదాలను తన ప్రియ కుమారుని ద్వారా అనుగ్రహించమని పునీత జోజప్పగారి మధ్యస్థ ప్రార్థనను వేడుకుందాం. 
అందరికీ పునీత జోజప్పగారి పండుగ శుభాకాంక్షలు!

1 comment: