క్రీస్తు సాక్షాత్కార పండుగ

 క్రీస్తు సాక్షాత్కార పండుగ
యెషయా 60: 1-6, కీర్తన 72:1-2, 7-8,
10-13, ఎఫెసీ 3:2-3, 5-6, మత్తయి 2:1-12

ఇదిగో! సర్వాధికారియైన సర్వేశ్వరుడు వచ్చుచున్నాడు. 
తన చేతియందు రాజ్యాధికారము
శక్తి సామర్ధ్యమును కలిగి వచ్చుచున్నాడు. 
దేవుడు నమ్మదగిన వాడు 

క్రీస్తు సాక్షాత్కార పండుగ, క్రీస్తు రాజుగా, రక్షకుడిగా, కేవలం యూదులకు మాత్రమేగాక, సర్వలోకానికి ఆయన రాజు, రక్షకుడు అని తెలియజేయుచున్నది. నేటి పండుగ, అన్యులకు లోకరక్షకుని మొట్టమొదటి దర్శనాన్ని సూచిస్తుంది. దేవుడు భూలోకమునయున్న అన్ని జాతులవారిని, దేశాలవారిని ప్రేమిస్తున్నాడని తెలియజేయుచున్నది. దేవుడు తన ప్రేమను, అనేక విధాలుగా ప్రజలకు, జాతులకు బయలుపరుస్తున్నాడు. అయితే, ముగ్గురు జ్ఞానులవలె దేవుని ప్రేమను తెలుసుకొని, విశ్వాసముతో ప్రతిస్పందించడం చాలా ముఖ్యమైనది. నేటి దివ్యపూజలో ప్రపంచములోని సకల ప్రజల కొరకు ప్రార్ధన చేద్దాం.

దేవుడు నమ్మదగినవాడు: మనలో ప్రతి ఒక్కరముకూడా, నమ్మకము కలిగిన వ్యక్తిని కోరుకొంటాం. అలాంటి వ్యక్తికోసం ఎదురు చూస్తూ ఉంటాము. మనలను ఎల్లప్పుడూ అంటిపెట్టుకొని ఉండటము మాత్రమేగాక, చేసిన వాగ్దానాలను చేయడం మాత్రమేగాక, మంచితనము కలిగి చేసిన వాగ్దానాలను నెరవేర్చుటకు కావసిన శక్తిని కలిగియున్న వ్యక్తికోసం ఎదురుచూస్తూ ఉంటాం. అధారపడదగిన వ్యక్తి, నమ్మదగిన వ్యక్తి, విశ్వాసముగల వ్యక్తి మనదరికీ కావాలి. ఆ వ్యక్తియే దేవుడు. జ్ఞానులు శిశుసందర్శనము, దేవుని విస్వసనీయతకు, నమ్మకమునకు ఋజువుగా, బైబిలు గ్రంధములోనున్న అత్యంత అందమైన ప్రామాణాలలో ఒకటి. 

క్రీస్తు జనమ్మునకు 500సం.ల పూర్వమే యెషయా ప్రవక్త ద్వారా, రక్షణ వెలుగును పంచుకొనుటకు అన్ని దేశములను (అన్యులను) యేరూషలేమునకు నడిపిస్తానని దేవుడు వాగ్ధానము చేసియున్నాడు (యెషయా 49:6). యేరూషలేముకు మంచి రోజులు, భవిష్యత్తు గురించి ప్రవక్త ప్రస్తావిస్తున్నాడు. దేవునియొక్క మహిమ అన్యులకు కూడా అందుబాటులో ఉండునని అర్ధమగుచున్నది. కీర్తనకారుని ద్వారా, ఇదే వాగ్దానాన్ని మరోమాటలో చేసియున్నాడు: ‘‘తర్శీషు రాజు, ద్వీపము నృపులు కప్పము కట్టుదురు. షేబా, సెబా పాలకులు కానుకలు కొనివత్తురు’’ (కీర్తన 72:10). 500సం.లు యుద్ధాలు జరిగినను, ప్రజలు వలుసలు పోయినను, చారిత్రాత్మక కలతలు జరిగినను, నాగరికత ప్రపంచములో మూడు వేర్వేరుసార్లు ప్రపంచ పటమును తిరగరాసినను, దేవుడు వాగ్ధానము చేసిన దానిని నెరవేర్చి యున్నాడు. మంచి వ్యక్తులు, నమ్మకము కలిగిన వ్యక్తులు మాత్రమే మంచి వాగ్దానాలను నిబెట్టగలరు. జ్ఞానులద్వారా, వారి కానుకలద్వారా, సకల ప్రజలు, జాతులు, రక్షణ వెలుగులోనికి ప్రవేశించి యున్నాయి. యేరూషలేము గురించి ప్రవచింప ప్రవచనాలు క్రీస్తులో నెరవేర్చబడ్డాయి.

జ్ఞానులు శిశుసందర్శనము దేవుని మంచితనాన్ని మరియు ఆయన శక్తికలవాడని నిరూపిస్తున్నది. ఆయన మన దేవుడు, అందరి దేవుడు. దేవుని మంచితనము, ఆయన శక్తి మనవే, ఎందుకన, మనము క్రీస్తుకు చెందినవారము. దేవుడు, నీకు, నాకు వ్యక్తిగతముగా విశ్వసనీయుడు, నమ్మదగినవాడు. ఆయన మన ఆధ్యాత్మిక జీవితానికి ఆధారం. అన్నివేళల, అన్నిసమయాలో, ఆయనను పరిపూర్తిగా విశ్వసించుదాం, పూర్ణహృదయముతో ప్రేమించుదాం. మనమూ ఆయనకు నమ్మదగినవారముగా జీవించుదము. 

రాజైన దేవుడు పరిపాలించుటకు వేంచేయును 

జ్ఞానులు శిశుసందర్శనములో, లోకరాజు జన్మనుగూర్చి ఎరిగి, హేరోదు రాజు కలత చెందాడు. అదే వార్తను ఎరిగిన జ్ఞానులు ఎంతో ఆనందించారు. హేరోదు తన జీవితాంతం హత్యలు చేస్తూ, అన్యాయముగా మరియు స్వార్ధముతో జీవించి యున్నాడు. వ్యక్తిగత కీర్తికోసం, పేరు ప్రతిష్టల కోసం రాజ్యాన్ని పరిపాలించాడు. పరలోకమునుండి, గొప్ప అధికారముతో క్రీస్తు లోకరాజుగా ఈ లోకములో ఉద్భవించాడు. హేరోదు భయపడి, క్రీస్తును హంతం చేయకపోతే, తన జీవితం ముగుస్తుందని కలత చెందాడు. మరోవైపు, అన్య దేశాలనుండి వచ్చిన జ్ఞానులు లోకరక్షకునిపట్ల ఎంతగానో సంతోషించారు. నేటి రెండవ పఠనములో, పౌలుగారు ఇలా తెలియజేయుచున్నారు: క్రీస్తురాకతో, యూదులు, అన్యుల మధ్య దూరం చెరిగిపోయినది. క్రీస్తు పాలనలో ఇరువురు ఒకే ప్రజగా, దైవప్రజగా పిలువబడియున్నారు.

జ్ఞానులు – మన ఆదర్శం

(క్రీస్తు జల్లులు) జ్ఞానులు తూర్పు దేశంనుండి పయనమై వచ్చారు. యూదుల రాజుగా జన్మించిన దేవుని దర్శించుకోవాలని ఆశించారు. సామెత 9:10లో ఇలా చదువుచున్నాం: "దేవునికి భయపడడం, ఆయనకు విధేయించుటo జ్ఞానానికి మూలo." జ్ఞానసంపన్నులు దేవునికి దగ్గరగా ఉంటారు, కాబట్టి ఆయన ఇచ్చే సంకేతాలను గ్రహిస్తారు, గౌరవిస్తారు. ఆ ముగ్గురు జ్ఞానులు దేవుని సృష్టి సంకేతాలపట్ల ఎంతో గౌరవం ప్రదర్శించారు. ఆకాశంలో వెలిసిన విశేషమైన నక్షత్రాన్ని వాళ్లు నిర్లక్ష్యం చేయలేదు. అది దేవునినుండి ఓ సందేశాన్ని తమకు అందిస్తుందని గ్రహించారు. కనుక నక్షత్రం చూపిన జాడనుబట్టి వెంటనే పయనమయ్యారు, దేవుని సుతుని చేరుకున్నారు. జ్ఞానులైన వాళ్ళు దేవుని సందేశాల కోసం ఎదురు చూస్తారు, ఆ సందేశాలను పాటిస్తారు. దేవుని వెలుగులో జీవిస్తారు. అంతేకాదు జ్ఞానులు మనుష్యుల మాటలనుకాక దేవుని ఆజ్ఞలను పాటిస్తారు. దుష్టుడైన హేరోదు బాలుని చంపాలని కుట్ర పన్ని, అతని జాడ తెలుపమని జ్ఞానులను కపటముతో కోరాడు. కాని ఆ ముగ్గురు జ్ఞానులు అతని మాటనుకాక దేవుని మాటలు విన్నారు. దేవుని ఆదేశం చొప్పున వేరే మార్గంగుండా తమ దేశానికి తిరిగి వెళ్ళారు. జ్ఞాని ఎల్లప్పుడూ శ్రేష్ఠమైన దానిని వెదుకుతాడు, ఉత్తమమైన దాని కోసం నిరీక్షిస్తాడు, మంచిని గ్రహిస్తాడు. అల్పమైన దానితో సంతృప్తి పడడు. యేసుక్రీస్తును దర్శింపడానికి తూర్పు దేశమునుండి యెరూషలేము (బేత్లెహేము) వచ్చిన జ్ఞానులుకూడా అట్టివారే. (ఈ జ్ఞానుల తెగను గ్రీకు భాషలో మాగోస్అని పిలిచేవారు. ఈ పదము నుండే లతీనులో మాగిఅని, ఆంగ్లంలో మేజైఅనే పదాలు పుట్టుకొచ్చాయి).   జ్ఞానులలో ఉన్న గొప్ప గుణాన్ని చూసారా! ఒక సంకేతాన్ని చూచి ఊరక కూర్చోలేదు. దాని జాడనుబట్టి అది సూచించే వ్యక్తిని వెదుక్కుంటూ సుదూర తీరాలకు వెళ్ళారు. ఎంతో వ్యయ ప్రయాసలకు ఓర్చుకొన్నారు. ఆ నక్షత్రం కనుమరుగైనా తమ అన్వేషణను ఆపలేదు. హేరోదురాజు సాయం తీసుకొన్నారు. యూదుల రాజును కనుగోనేంత వరకు విశ్రమించలేదు. సత్యాన్వేషకుల సాధన అలా ఉంటుంది. మరి నిత్య సత్యమైన యేసును కనుగొనడానికి మనం శ్రమిస్తున్నామా? లేక ఏదైనా చిన్న అవాంతరం వచ్చినప్పుడు దానిని ప్రక్కన బెడుతున్నామా? ఆత్మపరిశీలన చేసుకుందాం!

ప్రభువు కృప సదా మనకు తోడై యుండునుగాక!

No comments:

Post a Comment