క్రిస్మస్ సందేశము

క్రిస్మస్ సందేశము 

ఉపోద్ఘాతం: సృష్టి ఆరంభమునుండికూడా మానవుడు దేవునికోసం అన్వేషిస్తూనే ఉన్నాడు, వెదకుతూనే ఉన్నాడు. వివిధ రకాలుగా, వివిధ పద్ధతులలో ఈ అన్వేషణ కొనసాగుతుంది. కొంతమంది సృష్టికి మూలాన్ని అన్వేషిస్తున్నారు. ఈ అన్వేషణలో మానవుడు ఎన్నో తెలుసుకోగలిగాడు. అందులో ఎలాంటి సందేహం లేదు. ఎన్నో శాస్త్రీయాలను కనుగొన్నాడు, ఆధ్యాత్మిక సిద్ధాంతాలను లేదా మార్గాలను కనుగొన్నాడు. కాని, దేవున్ని మాత్రం పూర్తిగా తెలుసుకోలేక పోయాడు, కనుగొనలేక పోయాడు. ఈ అన్వేషణ ఇంకా కొనసాగుతూనే ఉన్నది. 
బైబులు - దేవుడు మానవున్ని వెదకడం: అయితే, బైబులులో ఒక ప్రత్యేకమైన అంశాన్ని చూస్తున్నాము. అదేమిటంటే, మానవుడు దేవున్ని వెదకటంకన్న, దేవుడు మానవున్ని వెదకడం! ఆ.కాం. 1:27 – ఇచట దేవుడు సృష్టికర్త, సృష్టికి మూలము అని చూస్తున్నాము. “దేవుడు మానవ జాతిని సృజించెను. తన పోలికలో మానవుని చేసెను. స్త్రీ పురుషులనుగా మానవుని సృజించెను. దేవుడు వారిని దీవించెను. సృష్టి-రెండవ కథనములో చూసినట్లయితే, 2:7 – “దేవుడైన యావే నేలమట్టిని కొంత తీసుకొని, దానినుండి మానవుని చేసెను. అతని ముక్కురంధ్రములలో ప్రాణవాయువును ఊదెను. మానవుడు జీవముగలవాడయ్యెను.” ఆది కాండము, మూడవ ఆధ్యాయములో చూస్తున్నట్లుగా, మానవుడు దేవున్ని అవిధేయించి పాపము కట్టుకున్నాడు, దేవుని శిక్షకు గురియైయ్యాడు. తన సన్నిధినుండి తరిమివేసాడు. అయినప్పటికిని, దేవుడు ఆదామును, ఏవను దేవుడు దీవించాడు. వారికి సంతానాన్ని కలుగజేసాడు. కయీనును కనిన తర్వాత ఏవ, “దేవుని తోడ్పాటుతో నాకు ఒక నరుడు లభించెను” (4:1) అని తలంచినది. అంటే దేవుడు శిక్షించినను, వారిని విడనాడలేదు. మరల దేవుడు కయూనును పాపము విషయములో హెచ్చరించాడు (4:6-7). దేవుని హెచ్చరికను పెడచెవిన పెట్టి కయూను హెబెలును చంపాడు. 6:1 – “మానవులు పెంపొంది భూమిపై విస్తరిల్లిరి.” 6:5 – “భూమిపై గల మానవులు పరమదుష్టులైరి.” దేవుని కృపకు పాత్రుడైన నోవాను అతని కుటుంబమును తప్ప సర్వమును దేవుడు జలప్రళయముద్వారా నాశనం చేసాడు. “దేవుడు నోవాను, అతని కుమారులను దీవించాడు” (9:1). ప్రజలు భూమిపై వ్యాపించారు. 
తరువాతి కాలములో దేవుడు అబ్రహామును పిలచుకొని ఆయన ద్వారా, ఒక మహాజాతిని తీర్చిదిద్దెదను అని వాగ్దానం చేసాడు (12:2-3). గొడ్రాలైన సారాకు కొడుకును (ఈసాకు) ప్రసాదించాడు (21:2). ఈసాకు భార్య రిబ్కా కూడా గొడ్రాలే. అయినను, దేవుడు వారికి ఏసావు, యాకోబు అను ఇద్దరు కుమారులను ప్రసాదించెను. యాకోబు భార్యలు: లేయా, రాహేలు (గొడ్రాలు). రాహేలుకు పుట్టిన బిడ్డ యోసేపు. 
ఆ తరువాత, ఐగుప్తు దేశములో స్థిరపడిన యాకోబు సంతతి అచట వృద్ధిచెందిరి. కాని, ఐగుప్తు రాజులు వారిని ఎన్నో ఇబ్బందులు పెట్టారు. అప్పుడు దేవుడు మోషేను ఎన్నుకొని ఆయనద్వారా తన ప్రజలను ఐగుప్తు దేశమునుండి విడిపించి, వాగ్ధత్త భూమివైపుకు నడిపించాడు. దేవుడు మోషెకు “నేను ఉన్నవాడను” అని తన పేరును కూడా ఎరిగించెను (నిర్గమ 3:14). ఈవిధముగా, దేవుడు తను సృష్టించిన మానవుని వెంటనే ఉండి వారిని దీవిస్తూ వచ్చాడు. ఇలా న్యాయాధిపతులు, ప్రవక్తలు, యాజకులు, రాజులద్వారా దేవుడు ఇస్రాయేలు ప్రజలను నడిపించాడు. ఈవిధముగా, దేవుడే మానవునికొరకు వెదకడం బైబులులో మాత్రమే చూస్తాము: కొన్ని ఉదాహరణలు – యెహెజ్కె. 34:11,16, లూకా. 19:10 లేదా మత్త. 18:11. 
క్రీస్తు జనన ప్రవచనాలు: కాలము పరిపక్వమైనప్పుడు, దేవుడు తన కుమారున్ని ఈలోకానికి పంపాడు (గలతీ. 4:4). కాలము పరిపక్వమైనప్పుడు అనగా ఏమిటి? పాపములో పడి నశిస్తున్న మానవున్ని రక్షించడానికి, కాపాడటానికి. ధర్మశాస్త్రము లేదా మోషేచట్టము మెస్సయ్యరాకకు సర్వము సంసిద్ధము చేసినది, ఆ మెస్సయ్య వైపునకు నడిపించినది. ప్రజలుకూడా మెస్సయ్య రాకకొరకు ఎదురుచూస్తున్న కాలం, సంసిద్ధపడిన కాలము. 
క్రిస్మస్ పండుగను అర్ధవంతముగా కొనియాడాలంటే, దానిలోని పరమార్ధాన్ని అర్ధంచేసుకోవాలి. ముందుగా, క్రీస్తు రక్షకుని జననం దైవప్రణాళిక. ఏదో అనుకోకుండా, ఊహించనిదిగా జరిగినది ఎంతమాత్రము కాదు. మూడు ముఖ్యమైన ప్రవచనాలను ఇక్కడ ప్రస్తావించుకుందాము: ఆది. 3:15 – “నీకు, స్త్రీకి, నీ సంతతికి, ఆమె సంతతికి మధ్య తీరని వైరము కలుగును. ఆమె సంతతివారు నీ తల చితకగొట్టుదురు. నీవేమో వారి మడమలు కరతువు.” యెషయ 11:1 – “ఈషాయి మొద్దునుండి ఒక పిలక పుట్టును. అతని వేరులనుండి ఒక కొమ్మ ఎదుగును.” మీకా. 5:2 – “బెత్లెహేము ఎఫ్రాతా! నీవు యూదా నగరములలో మిక్కిలి చిన్నదానవు. కాని యిస్రాయేలు పాలకుడు నీనుండియే ఉద్భవించును. అతని వంశము పురాతన కాలమునకు చెందినది.” అతను “నీతి సూర్యుడు”వలె ఉదయిస్తాడు అని మలా. 4:2లో చూస్తున్నాము. ఈ ప్రవచనాల ప్రకారం, లూకా. 2:11 లో ఇలా చదువుచున్నాము: “నేడు దావీదు నగరమున మీకు ఒక రక్షకుడు పుట్టెను. ఆయన క్రీస్తు, ప్రభువు.” పునీత పౌలు క్రిస్మస్ గురించి ఇలా చెప్పాడు: “ఆయన ఎల్లప్పుడును దైవస్వభావమును కలిగి ఉన్నను, దేవునితో తన సమానత్వమును గణింపలేదు. ఇది గ్రహింపవలసిన విషయము. కాని ఆయన తన్నుతాను రిక్తుని చేసికొని, సేవకరూపము దాల్చి మానవమాత్రుడుగా జన్మించెను” (ఫిలిప్పీ. 2:6-7)
క్రిస్మస్ పరమార్ధం: దేవుడు మానవునిగా ఈ లోకమునకు రావడం. క్రిస్మస్ అనగా క్రీస్తును ఆరాధించడం, స్తుతించడం, శ్లాఘించడం, మహిమపరచడం. క్రిస్మస్ (ఆరంభములో క్రైస్ట్-మాస్) అనగా “క్రీస్తు దివ్యబలిపూజ.” అనగా దేవునికి కృతజ్ఞతార్చన చెల్లించడం. క్రిస్మస్ ఆనందం, శాంతి, ఆశ, వెలుగును కొనియాడు పండుగ. "చీకటిలో నడచు జనులు పెద్ద వెలుగు చూచిరి (యెషయ 9:2).
క్రీస్తు ఎందుకు మనుష్యావతారం ఎత్తాడు? క్రీస్తు తండ్రి దేవున్ని, ఆయన ప్రేమను మానవునికి బహిర్గతపరచడానికి వచ్చాడు. ఉదా. యోహాను. 1:18 (ఆయనను తెలియపరచెను), యోహాను. 14:6-11 (తండ్రి యొద్దకు మార్గము), మత్త. 11:27. క్రీస్తే ఏకైక రక్షణ మార్గము – “నేనే సత్యము, జీవము, మార్గము” (నేను కూడా అని చెప్పలేదు). పూర్వపు వైభవాన్ని ఇవ్వడానికి (పాపలేమి స్థితిని). క్రీస్తు రక్షకునియందు విశ్వాసము వలన మనలను నీతిమంతులను చేయుటకు. 
1. తన ప్రజలను రక్షించుకోవడానికి - యోహాను. 3:17, "దేవుడు తన కుమారున్ని లోకమును రక్షించుటకు పంపెనే కాని, దానిని ఖండించుటకు పంపలేదు." మనకొక రక్షకుడు అవసరమని క్రిస్మస్ గుర్తుచేస్తుంది. "సర్వ మానవాళి రక్షణకై దేవుని కృప ప్రత్యక్షమయ్యెను (తీతు 2:11).
2. పాపపు ఊబిలో కొట్టుమిట్టాడుతున్న తన ప్రజలను పాపము నుండి విముక్తులుగా చేయడానికి, మనలను ప్రేమించడానికి - 1 యోహా. 4:10, "దేవుడు మనలను ప్రేమించి మన పాపములకు విమోచకునిగ తన కుమారుని పంపెను." మంచిగా ఉన్నప్పుడు అందరు ప్రేమిస్తారు. కాని, పాపములోనున్న లోకాన్ని ప్రేమించడం దేవునికి మాత్రమే సాధ్యమైనది. ఆయన మన హృదయములో జన్మించాలి.
3. తన సమస్తాన్ని మానవునికి ఇవ్వడానికి - 2 పేతు. 1:3-4, "ఆయన దైవశక్తి, పవిత్ర జీవమునకు సంబంధించిన సమస్తమును మనకొసగుటకు యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు."
4. నిత్యజీవము ఒసగడానికి - యోహాను. 3:16, "మానవుడు నిత్యజీవము పొందుటకై దేవుడు తన కుమారున్ని ఈ లోకానికి పంపాడు."
5. సర్వరోగాలతో బాధపడుతున్న వారిని స్వస్థత పరచడానికి - మత్త. 9:12, "వ్యాధిగ్రస్తులకేగాని, ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కరలేదు." అలాగే, చెదరిపోయిన గొర్రెలమందవలె నున్న మానవాళిని ఒక మందగా చేయడానికి, అవిశ్వాసములో నున్న ప్రజలను, విశ్వాసులుగా తీర్చిదిద్దడానికి, అన్యదేవుళ్ళను కొలుస్తున్న తన ప్రజలను తనవైపుకు త్రిప్పుకోవడానికి, హింస, మారణహోమాలతో జీవించే మానవాళిని, ప్రేమ శాంతి సమాదానముతో నింపడానికి, అన్యాయ అక్రమ కుళ్ళు రాజకీయాలతో నిండిపోయిన సమాజాన్ని సరిచేయడానికి, పేద-ధనిక బేధమున్న సమాజాన్ని ఒక దైవసమాజముగా మార్చడానికి, దాస్యమునుండి స్వాతంత్రమునకు, చీకటినుండి వెలుగునకు, దు:ఖమునుండి సంతోషమునకు నడిపించడానికి క్రీస్తు మనమధ్య జన్మించాడు. తన జన్మము, జీవితముద్వారా మనిషి ఇలా జీవించాలని చూపించాడు. తన జన్మముద్వారా ఈ లోకములో దైవరాజ్య స్థాపనకు పునాదులు వేసాడు.
6. ప్రభువు మనతో ఉండటానికి (ఇమ్మానుయేలు) జన్మించాడన్న సత్యాన్ని మనం తెలుసుకోవాలి. ఆయన పేరులోనే ఉన్నది. ఇమ్మానుయేలు అనగా "ప్రభువు మనతో ఉన్నాడు" (మత్త. 1:23). "లోకాంతము వరకు సర్వదా నేను మీతో ఉంటాను" (మత్త. 28:20) అని వాగ్దానం చేసాడు. కాబట్టి, సుఖాలున్నప్పుడు దేవుడున్నాడని, దు:ఖాలున్నప్పుడు దేవుడు లేడని చెప్పరాదు. మనం ఎలాంటి నిస్సహాయ స్థితిలో నున్నను, క్రీస్తు మనతో ఎల్లప్పుడు ఉంటాడు. ఆయన మనతో ఉంటె అదే శ్రేష్టమైన క్రిస్మస్ గిఫ్ట్.
7. మన జీవితాలకు అర్దాన్నివ్వడానికి - యోహాను. 10:10, "నేను జీవమునిచ్చుటకు, దానిని సమృద్ధిగా ఇచ్చుటకు వచియున్నాను." చాలామంది జీవిత గమ్యము లేక జీవిస్తున్నారు. ప్రభువును విశ్వసించినచో జీవితాలకు పరమార్ధం చేకూర్చుతాడు.
8. మన హృదయాలలో వసించడానికి - వాక్కు అయిన దేవుడే మనమధ్య జన్మించాడు. కాబట్టి, దేవుని వాక్యాన్ని (బైబులు) చదివి, ధ్యానించి, ఆచరించినచో ప్రభువు (వాక్కు) మన హృదయాలలో వసించును.
9. నూతన నివాసమేర్పరచడానికి - యోహాను. 14:2, "నా తండ్రి గృహమున అనేక నివాస స్థలములు కలవు. నేను మీకొక నివాస స్థానమును సిద్ధము చేయబోవుచున్నాను." ఈ లోకములో మన జీవితము శాశ్వతము కాదు. అందుకే, ప్రభువు మనతో నివసిస్తూ, ఈలోక జీవితం తర్వాత మనలను పరలోకరాజ్య వారసులుగా, దేవుని బిడ్డలుగా చేయడానికి వచ్చియున్నాడు. "ఆయనను అంగీకరించి, విశ్వసించిన వారందరికీ, దేవుని బిడ్డలగు భాగ్యమును ఇచ్చెను" (యోహాను. 1:12).
ఈవిధముగా, సర్వసృష్టికర్త సర్వలోకాన్ని రక్షించడానికి తన కుమారున్ని పంపాడు.
క్రిస్మస్: సంఘటనలు, వ్యక్తులు, పరిస్థితులు...
క్రిస్మస్ పండుగను అర్ధవంతముగా కొనియాడుటకు, క్రిస్మస్ సంఘటనలోనున్న వ్యక్తులను, పరిస్థితులను ధ్యానిద్దాం. క్రీస్తు రక్షకుడిని వెదకి కనుగొన్న వారిని ఆదర్శముగా తీసుకొందాం.
1. మరియ-యోసేపులు: నీతిమంతులు, దేవుని వాక్యమును మననం చేసుకొని అర్ధం చేసుకున్నవారు. దైవచిత్తానికి తలొగ్గినవారు... 
2. గొల్లలు (లూకా. 2:8-20): క్రీస్తు రక్షకుని జనన సమాచారం మొదటగా గొల్లలకు తెలుపబడినది – సామాన్యులు, పేదవారు, అనామకులు. హీరోదురాజుకుగాని, బలవంతులకుగాని, ధనవంతులకుగాని, శాస్త్రజ్ఞులకుగాని, పండితులకుగాని, ధర్మశాస్త్ర బోధకులకుగాని తెలుపబడలేదు. గొల్లలు: శుభాసమాచారాన్ని విన్నారు, విశ్వసించారు, వెళ్ళారు, కనుగొన్నారు, వెల్లడించారు, వందనాలు తెల్పారు, దేవుని వైభవమును శ్లాఘించారు. 
3. జ్ఞానులు (మత్త. 2:1-12): యెషయ ప్రవచనాన్ని గుర్తుచేసుకుందాం: “ఒంటెల సమూహము నీ చెంతకు వచ్చును. అవి బంగారమును, సాంబ్రాణిని గొనివచ్చును (60:6). జ్ఞానులు హేరోదుచేత క్షోభింపబడినారు (నేడు మన శ్రమలు, బాధలు, హింసలు). బంగారము (రాజు, శక్తి, మహిమ), సాంబ్రాణి (యాజకుడు), పరిమళద్రవ్యములు (మృత్యుంజయుడు) కానుకలుగా అర్పించారు. 
4. నక్షత్రము: తూర్పుదేశ జ్ఞానులకు మార్గచూపరియై యున్నది. వారిని నడిపించింది. నక్షత్రం దేవుడు ఒసగిన మార్గదర్శకం. కనుక మనం, దేవుని సూచనలను అనుసరించాలి. దేవుని యొద్దకు నడిపించేవారిని అనుసరించాలి. ఈ నక్షత్రం లోకరక్షకుని యొద్దకు నడిపించింది. కనుగొను-అనుసరించు. దేనికోసం వెదుకుచున్నామో స్పష్టత ఉండాలి. లేచి-నడవాలి.
5. పశువుల పాక (లూకా. 2:7): పేదరికానికి, దీనత్వమునకు సూచన. పశువులపాక, రక్షకుడైన యేసు అందరికి అందుబాటులో ఉన్నాడని సూచిస్తుంది. ఒక సందర్భములో యేసు ఇలా అన్నాడు, “నక్కలకు బోరియలు, ఆకాశపక్షులకు గూళ్ళు కలవు. కాని మనుష్యకుమారునకు తలదాచుకొనుటకు ఇసుమంతైనను తావులేదు” (లూకా. 9:58). పశువుల పాక సాంప్రదాయాన్ని మొట్టమొదటిగా ప్రారభించినది పునీత అస్సీసిపుర ఫ్రాన్సిస్ వారు. ఫ్రాన్సిస్ వారికి క్రిస్మస్ పండుగ అంటే ఎంతో ఇష్టం. ఎందుకన, దేవుడే స్వయంగా బాలుని రూపములో భువుకి ఏతెంచాడు. మనము ప్రేమించడానికి మనకూ ఒకరు ఉన్నారు అని ఫ్రాన్సిస్ భావించాడు. తిరుకుటుంబ దారిద్ర్యమును, వినయాన్ని, కన్నులారా చూడాలని అనుకున్నాడు. ఆ చారిత్రాత్మిక ఘట్టాన్ని పునరావృతంచేసి, కన్నులారా చూడాలని క్రీ.శ. 1223వ సం.లో, గ్రేచియా అను స్థలములో పశువులపాకను ఏర్పాటుచేసి, నిజమైన పశువుల మధ్యన (ఒక ఎద్దు, గాడిద, రెండు గొర్రెపిల్లలు) బాలయేసు స్వరూపమును ఉంచి మనసారా ముద్దాడి, ఆరాధించి తన్మయం చెందాడు. “ప్రేమ, శాంతితో నిండిన హృదయాలలో మనం ఆయనను మోసినప్పుడు మనం ఆయనకు తల్లులుగా మారుచున్నాము. మన పవిత్ర కార్యములద్వారా మనం ఆయనకు జన్మనిస్తున్నాము” అని అంటాడు ఫ్రాన్సిస్. 
6. క్రిస్మస్ ట్రీ (చెట్టు): ఈ సాంప్రదాయం క్రీ.శ. 16వ శతాబ్దములో జర్మనీ దేశములో ప్రారంభమైనది. శీతాకాలములో చెట్లు ఆకులను రాల్చుకొని మోడుపోయి ఉంటాయి. కాని కొన్ని చెట్లు అన్నివేళలా పచ్చగా ఉంటాయి. పచ్చని చెట్లు జీవానికి, సంపదకు, సమృద్ధికి గుర్తు. క్రీస్తు ఉదయించిన సంతోష ఘడియలకు గుర్తుగా, ఈ చెట్లను యిండ్లలో పెట్టుకొని, దీపాలతో అలంకరించి, దానిచుట్టూ తిరుగుతూ ఆనందముగా పాటలు పాడేవారు. ఇలా ఈ సాంప్రదాయం ప్రపంచమంతట వ్యాపించింది. 
7. క్రిస్మస్ తాత (శాంతాక్లాస్): ఇది క్రీ.శ. 4వ శతాబ్దములో జీవించిన పునీత నికోలస్ నుండి ప్రారభమయినది. ప్రతీ క్రిస్మస్ రోజున మారువేషములో యిల్లిల్లూ తిరుగుతూ పిల్లలకు బహుమతులు పంచేవాడు. క్రిస్మస్ పండుగ జరుపుకోవడానికి పేదరికం అడ్డురాకుడదని నికోలస్ వారు తలంచారు. శాంతాక్లాస్ అనేది సెయింట్ నికోలస్ గారికి మారుపేరు. ఇలా ఈ సాంప్రదాయం మొదలైనది. అందుకే క్రిస్మస్ రోజున బహుమతులను ఇచ్చిపుచ్చుకొంటూ ఉంటాము. మనకున్నది ఇతరులతో పంచుకోవాలనే సందేశం దీనిలో దాగి ఉన్నది. ఇతర జీవితాలలో వెలుగులు నింపినప్పుడే, మనం నిజమైన క్రిస్మస్ కొనియాడగలం. 
*********
క్రిస్మస్ 
శ్రీ యేసుని జన్మదినం లోకానికి పర్వదినం. శ్రీ క్రీస్తుని జన్మదినం మనుజాళికి శుభదినం. ఎందుకంటే, క్రిస్మస్‌ పండుగ ఈ లోకాన్ని, మనుజాళిని బానిసత్వంనుండి స్వేఛ్ఛలోనికి, యుద్ధమార్గంనుండి శాంతిపధంలోనికి, కారుచీకటినుండి ఉజ్వల వెలుగులోనికి, తీరని బాధనుండి అంతుపట్టని సంతోషంలోనికి నడిపిస్తుంది. అందుకనే, చిన్నారి యేసుని జననం యావత్‌ క్రైస్తవ జనావళికి ఒక పర్వదినం, ఒక శుభదినం. నీలాల నింగిలో తార వెలుగగా పాపపు చీకటి తొలగిపోయెను. దూతలంతా గళము విప్పగా, పాపిగుండె ప్రజ్వరిల్లెను, కాపరులంతా కలసి ఆడగా, పాపభీతి చెదరి పోయెను. అందుకనే, 
ఆ జననం పగలిన గుండెకు నవ్య కిరణాలు వంటిది, 
ఆ జననం చెదరిన మనసుకు ప్రేమ గీతాలు వంటిది, 
ఆ జననం విరిగిన వీణకు కోటిరాగాలు వంటిది. 
దారి తెలియక తిరుగుచుండగా వింతచుక్క దారి చూపెను. 
స్థలముకోసము వెదకుచుండగా, పశువుల పాక పలకరించెను, 
రాజులంతా శిరమువంచగా, దూతవార్త శరణమిచ్చెను, 
కన్యమరియ కడుపుపండగా, క్రీస్తు ప్రభువు జన్మించెను. అందుకనే. 
ఆ జననం వెదకినవారికి దొరికిన వరాలు వంటిది, 
ఆ జననం అడిగిన వారికి పొందిన ఫలాలు వంటిది, 
ఆ జననం తట్టిన వారికి తెరచిన ద్వారాలు వంటిది. 
ఆ కన్యమరియ కడుపు పండగ జన్మించిన క్రీస్తు ప్రభువే, చీకటిని చీల్చిన చిన్నారి యేసు. ఈ పుడమిన పుట్టిన ఈ చిన్నారి యేసే, పాప చీకటిని ప్రజ్వలింపచేసి ప్రకాశవంతంగా మలచింది. ఈ చిన్నారి యేసే, నిశిరాత్రి సమయాన నీతి సూర్యునిలా ఉద్భవించి, పాపచీకటిని పఠాపంచలు చేసింది. ఈ సంఘటనను ఉద్దేశించే దాదాపు క్రీ.పూ. 700 సం.ల క్రితమే యెషయా ప్రవక్త ప్రవచనం పలికాడు: ‘‘చీకటిలో నడచు జనులు పెద్దవెలుగును చూచిరి. దట్టమైన నీడులుక్రమ్మిన తావున వసించు ప్రజలమీద జ్యోతి ప్రకాశించెను’’ (9:2). ఈ వచనం మనకు అర్ధం కావాలంటే, మనకు కొంత చారిత్రక నేపధ్యం తెలిసి ఉండాలి. 
బహుశ, యెషయా ఈ వచనాన్ని లేదా ఈ వృత్తాంతాన్ని రచించినపుడు, ఆ రోజులలో చోటుచేసుకున్న ఒక భయంకర సంఘటన తన మదిలో ఉండవచ్చు. ఆ సంఘటన ఏమంటే, ఇశ్రాయేలీయుల శత్రువు వారిమీదకు దండెత్తి వచ్చారు. ఈ దండయాత్రలో ఒక గొప్ప విధ్వంసాన్ని వారు సృష్టించారు. గ్రామాలను తగల బెట్టారు. పంటలను నాశనం చేసారు. వేలాదిమందిని బానిసలుగా తీసుకు వెళ్ళారు. శత్రువులు వారిని బానిసలుగా ఎలా తీసుకు వెళ్ళారంటే, పొలందున్నే కాడికి ఆవును ఎలా కడతారో ఆ మాదిరిగా నలుగురైదు బానిసలును ఒక కొయ్యకు కట్టి తీసుకొని వెళ్ళేవారు. ఆ సంఘటనను మన కళ్ళముందు చిత్రీకరించుకుంటే, ఆ బాధ వర్ణణాతీతం! 
ఈ సందర్భంలోనే యెషయా ప్రవక్త ఈ వచనాలను వ్రాసాడు: ‘‘నీవు వారి మెడమీద కాడిని విరుగ గొట్టితివి. వారి భుజము మీద దండమును ముక్కలు చేసితివి. నీవు పూర్వము మిద్యానీయులను ఓడించినట్లుగా ఆ ప్రజలను పీడించు వారిని ఓడించితివి’’ (9:4). ఇలా బానిసత్వ చీకటిలో పయనించే నాటి ఇశ్రాయేలును ఉద్దేశించి, ‘చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును గాంచిరి’ అని ప్రవక్త ప్రవచించాడు. చీకటిని చీల్చే చిన్నారి యేసును గురించి తెలియజేస్తూ, యెషయా ఈ ఊరట వచనాలను పలికారు: ‘మనకొక శిశువు జన్మించును’ అని, ‘అతడు రాజ్య భారమును వహించును’ అని, రాబోవు రాజు గుణగణాలను తెలియచేశారు. అందుకనే, యేసు జననం అలసిన వారికి ఆశ్రయ స్థానంగా మారుతుంది. 
యేసు జననం తండ్రి దేవుని ప్రేమ వర్ణవిల్లు: 
పాత నిబంధనలో చూసినట్లయితే, తండ్రి దేవుడు పాప జగతిని ప్రక్షాళన చేయడానికి జలప్రళయమును పంపించారు. జప్రళయము తరువాత, ‘‘దేవుడు నోవాను, అతని కుమారులను దీవించి పిల్లపాపలతో పెంపొంది భూమండలము నందంతట వ్యాపింపుడు’’ (ఆ.కాం. 2:9) అని దీవించి, ‘ఇకపై ఇటువంటి ప్రళయము సంభవించదు’ అని నోవాతో ఒడంబడిక చేసుకొని దానికి గుర్తుగా ఇంద్రధనస్సును ఇచ్చారు. అదేవిధంగా, పాప ఊభిలోనున్న జనావళిని రక్షించడానికి తండ్రి దేవుడు తన కుమారున్ని పంపారు. అందుకనే, ఆ జననం తండ్రి దేవుని ప్రేమ వర్ణవిల్లు అయింది. దీని అర్ధం ఏమంటే, మరణం ఇకపై మనమీద ఎటువంటి ఆధిపత్యం చెల్లించదు. ఎందుకంటే, శాశ్వత మరణానికి మనకి మధ్య యేసు అనే రక్షణ చిహ్నమైన వర్ణవిల్లు ఉన్నది. దానిని ఉద్దేశించి యోహానుగారు ఇలా వ్రాసారు: ‘‘దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించారు. ఆయనను విశ్వసించు ప్రతివాడును నాశనము చెందక నిత్య జీవమును పొందును’’ (3:16).
 యేసు జననం దేవుని త్యాగ సిరిజల్లు: 
సాధారణంగా, ఎప్పుడు పుడతామో, ఎలా మరణిస్తామో, ఎవరికీ తెలియదు. కాని యేసు ప్రభువు విషయంలో ఆయన ఎప్పుడు పుట్టేది, ఎవరి కడుపున జన్మించేది, ఎలా మరణించేది అన్న విషయాలు ఆయనకు విదితమే! ఇది రక్షణ ప్రణాళికలో భాగం! తాను భూలోకంలోనికి వచ్చింది దైవరాజ్యాన్ని స్థాపించి తన మరణము ద్వారా మనలను తండ్రితో ఐఖ్యం చేయడానికి అని ఆయనకు తెలుసు. కాని ఆయన వెనకడుగు వేయలేదు. అందుకనే, రక్షకుడైన యేసు జననం దేవుని త్యాగ సిరిజల్లు అయింది. 
యేసు జననం ఆత్మదేవుని వరాల పొదరిల్లు: 
మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే, రక్షణ ప్రణాళికలోని ప్రతి ఘట్టంలో త్రిత్వైక సర్వేశ్వరుడు కొలువై ఉన్నాడు. యేసు ప్రభుని జననం కూడా అదేవిధంగా సంభవించినది. పవిత్రాత్మ సర్వేశ్వరుని శక్తివలన మరియమాత గర్భం ధరించింది. ఆమె అనుగ్రహ పరిపూర్ణురాలై, దైవవరముతో పరిపూర్తిగా నింపబడినది. దానినే లూకా సువార్తికుడు ఇలా తెలియజేశారు: ‘‘పవిత్రాత్మ శక్తి నీపై వేంచేయును. సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును’’ (1:35). అందుకనే, యేసు జననం ఆత్మదేవుని వరాల పొదరిల్లు. ఇంకొక్క మాటలో చెప్పాలంటే, చిన్నారి యేసుని జననం త్రిత్వైక సర్వేశ్వరుని సమిష్టి వరదానం. 
క్రీస్తు జననం త్రిత్వం ఒసగిన ఒక గొప్ప బహుమానం. ఈ పండుగను మనమందరం ఎంతో ఉల్లాసంతో, ఉత్సాహంతో, సంతోషంతో జరుపుకుంటాం. కాని క్రిస్మస్‌ పండుగ ప్రతి సంవత్సరం వచ్చి వెళ్ళే పండుగలా ఉండకూడదు. ప్రతి క్రైస్తవుని జీవితంలో మార్పు తీసుకొని రావాలి. పునీత పౌలుగారు తీతుకు రాసిన లేఖ ద్వారా ఇలా తెలియ జేయుచున్నారు: ‘‘శక్తిహీనతను, లౌకిక మోహమును విడనాడి, ఇంద్రియ నిగ్రహము కలిగి ఋజుమార్గమున, పవిత్రమైన జీవితమును గడపవలెనని మనకు ఆ కృప బోధించుచున్నది’’ (2:12). కావున ప్రియ మిత్రులారా! చీకటిని చీల్చిన చిన్నారి యేసు, మన గుండెల్లో, మన జీవితంలో ఉంటే ఆయన అనుగ్రహించే కృపానుగ్రహము చేత మనము ఎట్టికార్యమునైనను సాధింపవచ్చు. కనుక, మనమందరం, చిన్నారి యేసయ్యా, రావయ్యా అని ఆహ్వానిస్తూ, ఈ పాపికి నూతన జన్మను ఇవ్వవయ్యా అని ప్రార్ధించుదాం! 
*******
ప్రభువు మనకోసం జన్మించెను - క్రిస్మస్ 
ఈరోజు, ఒకజ్యోతి మనపై ప్రకాశించెను, ప్రభువు మనకోసం జన్మించెను. ఆయన, దేవుని మహిమయొక్క ప్రకాశవంతమైన జ్యోతి. తన శక్తివంతమైన ఆజ్ఞతో ఈ లోకం పోషింపబడుతున్నది. క్రీస్తుజయంతి యొక్క అర్ధము ఏమిటి? ప్రాముఖ్యత ఏమిటి? మనసృష్టికర్త మనకి దూరములో లేడు, అతడు మనకు తెలువనంటివాడుకాదు అన్న నిజాన్ని ఎరిగి ఆనందముతో సంబరాన్ని చేసుకుంటున్నాము. దేవుడు మనకి అతిసమీపములోనే, మనచెంతనే ఉన్నాడు. ఎంతదగ్గర అంటే, ఆయన మనలో ఒకనిగా జన్మించాడు. ఇప్పుడు, స్వతంత్రముతో, నమ్మకముతో, దేవున్ని సమీపించవచ్చు. మనం ఆయనతో మాట్లాడవచ్చు. మన సమస్యలను ఆయనతో పంచుకోవచ్చు. ఆయనను స్తుతించవచ్చు, ఆరాధించవచ్చు. మనకు సాధ్యమైన తీరులో ఆయనతో సంభాషించవచ్చు. దేవుడు ప్రేమించే తండ్రిగా, దయగల రక్షకునిగా, కరుణగల ఆప్తునిగా బయలు పరచబడ్డాడు. దేవుడు మనలను తెరచిన కరములతో ఆహ్వానిస్తున్నాడు. ఈరోజే, మనం ఆయన దరికి వెళ్దాం.
ప్రభువా, మా హృదయాలను ప్రేమతో మీ కొరకు విశాలము చేయండి. అమ్మ మరియవలె, ''అవును'' అని చెప్పుటకు మమ్ములను బలవంతులనుగా చేయండి. ముఖ్యముగా, జీవితాలలో ప్రేమసుగుణాన్ని మరచిపోయినవారిని ఆశీర్వదించండి. వారిని తాకండి. తద్వారా, ఈ క్రిస్మస్ రోజున వారుకూడా మిమ్ములను ఆహ్వానించెదరుగాక. మీకు మాఅందరిపైఉన్న ప్రేమను నిజము చేయులాగున మమ్ములను చేయండి. 
*******
క్రిస్మస్ సందేశము 
“మీరు భయపడ వలదు. సమస్త ప్రజలకు పరమానందము కలిగించు శుభ సమాచారమును మీకు వినిపించెదను. నేడు దావీదు నగరమున మీకు ఒక రక్షకుడు పుట్టెను'' (లూకా 2:10-11). ఆహా! ఎంతటి అనుగ్రహం! ఎంతటి భాగ్యం! మనం పొందిన వరాలలోకెల్ల గొప్ప వరం, అనుగ్రహం: క్రిస్మస్ - దేవుడు లోక రక్షకుడిగా జన్మించడం. వాక్కు మానవుడై మన మధ్య నివసించడం. తన ప్రజలకు వాగ్ధానము చేసిన విధముగా, చీకటిలోనున్న ఈ లోకానికి వెలుగును ప్రసాదించడం. నిజముగా ఇది గొప్ప శుభవార్తే! అందుకే పరలోకదూతల సమూహము సైతము ప్రత్యక్షమై ఇట్లు స్తుతించెను: 
''మహోన్నత స్థలములో సర్వేశ్వరునికి మహిమ, 
భూలోకమున ఆయన అనుగ్రహమునకు 
పాత్రులగు వారికి సమాధానము కలుగుగాక!'' (లూకా 2:14). 
"మనకొక శిశువు జన్మించెను. మనమొక కుమారుని బడసితిమి" (యెషయా 9:6). క్రీస్తు పూర్వం 8వ శతాబ్దములో యెషయా ప్రవక్త ఇస్రాయేలు ప్రజలకు ఇచ్చిన గొప్ప ఊరట కలిగించే ప్రవచనం. ఎందుకన, బలమైన అస్సీరియ దేశం ఇస్రాయేలీయుల మీద దండెత్తుతున్న రోజులు. అస్సీరియా రాజు మరణముతో, 'చీకటిలో ఉన్న ప్రజలు వెలుగును చూస్తారని, దట్టమైన నీడలు క్రమ్మిన తావున వసించు ప్రజలమీద జ్యోతి ప్రకాశించునని, మెడమీద కాడి (బానిసత్వం), విరగగొట్టబడునని, భుజములమీద దండమును (అణచివేయుట) ముక్కలు చేయబడునని, నూతన రాజ్యభారమును వహించుటకు శిశువు జన్మించునని' యెషయా ప్రవచించాడు. యేసు జననంపట్ల ఈ ప్రవచనాలు మనకీ ఊరట కల్గించే ప్రవచానాలే! ఎందుకనగా, మనంకూడా ఈనాడు అనేక విధాలుగా, చీకటిలో, బానిసత్వములో జీవిస్తున్నాం. 
క్రీస్తు జన్మము - ఇమ్మానుయేలు: దేవుడు మనతో ఉన్నాడు అను ఆనందమును కొనియాడటం. ఆయన మనతో లోకాంతము వరకు ఉంటాడు, మనలను అమితముగా, అనంతముగా ప్రేమిస్తాడు అను దానికి ఆయన జన్మ నిదర్శనం. క్రీస్తు జననం ఒక నూతన సృష్టి. నూతన దివికి, నీతికి నిలయమైన భువికి ఆరంభం (యెషయ 65:17; 2 పేతు. 3:13). పుట్టిన ప్రతీ బిడ్డ ఓ కొత్త ఆరంభం, ఎంతో భవిష్యత్తు. 
జన్మించిన రక్షకునిలో జీవముండెను. ఆ జీవము మనకు వెలుగాయెను (యోహాను 1:4). తన కుమారుని జన్మముతో దేవుడు తన శక్తిని, అనంతమైన ప్రేమను మనం తెలుసుకొనేలా చేస్తున్నాడు. తద్వారా, మనము జీవితమును, దానిని సమృద్ధిగా పొందులాగున చేసియున్నాడు. కాని, మనము గుర్తుంచుకోవలసిన విషయం: ''ఆయన తన వారి యొద్దకు వచ్చెను. కాని, తన వారే ఆయనను అంగీకరించలేదు'' (యోహాను 1:11). మనమందరము ఆయనకు చెందినవారమని మన విశ్వాసం. ఈరోజు ఆయన మన మధ్యలో జన్మించాడు. మరి, ఆయనను ఎరిగియున్నామా? వాక్కు మానవుడై మన మధ్య నివసించెను. అదే క్రిస్మస్. దేవుని మహిమను మనమందరము పొందాలి. తండ్రి యొద్ద నుండి వచ్చే ఏకైక కుమారుని మహిమను మనం చూడాలి, పొందాలి. అప్పుడే, ఈ క్రిస్మస్ కి అర్ధం ఉంటుంది. దేవుని బిడ్డగా, ఏకైక కుమారునిగా జన్మించిన ప్రభువును అంగీకరించి విశ్వసిస్తే మనమూ దేవుని బిడ్డలగు భాగ్యమును పొందుదము (యోహాను 1:12). 
క్రీస్తు జన్మించే నాటికి, ఈ లోకం చీకటిలో ఉంది. పాపముతో నిండియున్నది. మనం అవిశ్వాసములో ఉన్నాము. పాలస్తీనా దేశం సాంఘిక అసమానలతో నిండి ఉన్నది. రోమను సామ్రాజ్యం తన మిలటరీ బలగాలతో మధ్యధరా ప్రపంచాన్నంతటిని తన గుప్పిట్లో ఉంచుకుంది. మతోన్మాదులు విప్లవాలను, రక్త పాతాన్ని, ఉగ్రవాదాన్ని, సృష్టిస్తున్నారు. ధనికులు పేదవారిపై పెత్తనం, మతాధికారులు తమ అధికారాన్ని, ప్రభావాన్ని చాటుకొనుటకు ప్రయత్నంచేసేవారు. యేరుషలేము శతాబ్దాలుగా రక్తపాతాలకు, ఘర్షణలకు నిలయముగా చరిత్రలో చిరస్థాయిగా నిలచినటువంటిది. ఇలాంటి విషమ పరిస్థితులు ఉన్నప్పటికిని, దివ్యబాలుడు ఎదురొడ్డి అద్భుత రీతిన జీవించగలిగాడు. అతడు పెరిగి పెద్దవాడై శాంతికి మూలాధారమైయ్యాడు. ఇదే దేవుని అపారమైన శక్తికి, కరుణకు నిదర్శనం. అందుకే దివ్య బాలుని జన్మను కృతజ్ఞతతో కొనియాడాలి. ఆయన జన్మతో, ఒక క్రొత్త జీవితం ఆరంభమైనది, లేతమొక్క అంకురించి యున్నది. ఓ నూతన సూరీడు దేదీప్యముగా ప్రకాశించి యున్నది. పెరిగి పెద్దవాడైన తర్వాత, దైవరాజ్యముగూర్చి, న్యాయముగూర్చి భోదిస్తాడు. 
16వ బెనడిక్ట్ పాపుగారు తన క్రిస్మస్ సందేశములో ఇలా చెప్పియున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా మనం సాంకేతిక, సామాన్య పరిజ్ఞానములో అపారమైన పురోగతిని సాధించాం. ఈరోజు మనం అన్ని విషయాలలో అపారమైన జ్ఞానవనరులను కల్గియున్నాము. అయితే, ఇలాంటి పరిస్థితులలో, మానవ మేధస్సుకు, సాంకేతిక పరిజ్ఞానానికి బానిసలయ్యే అవకాశం లేకపోలేదు! అలా బానిసలుగా మారినప్పుడు, మనలో ఆధ్యాత్మికలేమి, హృదయశూన్యత సంతరించుకొంటాయి. అందుకే, మనం క్రీస్తు జన్మమునకు మన హృదయాలను, మనస్సులను తెరవాలి. రక్షణ ఘట్టమైన క్రీస్తు జననం ప్రతీ మానవునికి ఒక క్రొత్త నమ్మకాన్ని ఇస్తుంది. 
ఈనాడు ప్రపంచం ఎంతో అభివృద్ధి చెందినదని భావిస్తున్నాం. కాని, క్రీస్తు వెలుగులేనిచో మన అభివృద్ధికి ఎలాంటి సార్ధకత ఉండదు (యోహాను 1:9). వాక్కు మానవుడైనందునే మానవ జీవితానికి సంపూర్ణ అర్ధమున్నదని శ్రీసభ పదేపదే భోదిస్తుంది. ఈ రోజుల్లో అన్ని విభాగాల్లోనూ అన్యాయం, అవినీతి, స్వార్ధం, భేదాభిప్రాయాలు, మనస్పర్ధలు, నైతిక విలువలు లేకపోవడం, ఆర్ధిక అసమానతలు మొ.గు దుష్ట శక్తులతో మన సమాజం నిండిపోయినది. క్రీస్తు ఆనాడు బెత్లేహేములో పుట్టినట్లుగా, ఈనాడు మన సమాజములోనూ జన్మించాల్సిన అవసరం ఉంది. మనం మారాలి. అప్పుడే, మన సమాజం మారుతుంది. దేవుడు కోరుకొనేది ఒక్కటే: పరలోక రాజ్యం భూలోకమున నెలకొనాలి. దానికి మనందరి సహాయ సహకారం అవసరం. 
క్రీస్తు జయంతిని బాహ్యముగా కొనియాడటముతో సరిపోదు. దివ్యబాలుడు ఈ లోకానికి తెచ్చిన పశ్చాత్తాపము, మారుమనస్సు అను సందేశాన్ని మన జీవితానికి అన్వయించుకొన్నప్పుడే, మనం కొనియాడే ఈ పండుగకు అర్ధం ఉంటుంది. రెండవ జాన్ పౌల్ పాపుగారు 19 డిశంబర్ 1999వ సంవత్సరములో, త్రికాలజపముగూర్చి సందేశాన్ని ఇస్తూ ఇలా అన్నారు. క్రీస్తు జయంతి కేవలం 2000ల సం.ల క్రితం క్రీస్తు జన్మించిన సంఘటనని గుర్తు చేసుకోవడం మాత్రమే కాదు. ఇది ఒక సజీవమైన వాస్తవము. కనుక, విశ్వాసుల హృదయాలలో ప్రతీ సం.ము ఈ సజీవ వాస్తవం పునరావృతం కావాలి. ఆనాటి చారిత్రాత్మిక సంఘటన ఈ రోజు ఆధ్యాత్మిక సజీవ వాస్తవముగా మన సాంగ్యాలలో జీవించాలి. 
క్రిస్మస్ - దేవుని శక్తి, దేవుని ప్రేమ, దేవుని మహిమ, దేవుని వెలుగు, దేవుని శాంతి మరియు దేవుని రక్షణ. ఆమెన్.

No comments:

Post a Comment