ఆగమనకాల రెండవ ఆదివారము, Year B

ఆగమనకాల రెండవ ఆదివారము, Year B
యెషయ 40:1-5, 9-11; పేతురు 3:8-14; మార్కు 1:1-8

ఆగమన కాలము: రెండు భాగాలు:

మొదటి భాగము: డిశంబర్ 16 వరకు

అన్ని దైవార్చన కాలాలలో ముఖ్యముగా, సువిశేష పఠనము ప్రధాన కేంద్రముగా నిలుస్తూ ఉంటుంది. ఆగమన కాలములోని మొదటివారాల పఠనాలు యెషయ గ్రంథమునుండి తీసుకొనబడుతున్నాయి. విశ్వాస కన్నులతో చూసినట్లయితే, ఈ పఠనాలు మెస్సయ్యరాకను గూర్చి ప్రబోధిస్తున్నాయి. అదేవిధముగా, ఇతర దైవార్చన కాలాలకు భిన్నముగా, సువిశేష పఠనము వేరువేరు సువార్తలనుండి తీసుకొనబడటము గమనిస్తాము. 

దాదాపు రెండు వారాలపాటు యెషయ గ్రంథమునుండి పఠనాలను ధ్యానించిన తరువాత, మెస్సయ్యరాకను గూర్చి, సిరాకు, సంఖ్యాకాండము, జెఫన్యా గ్రంధములనుండి ఆలకిస్తాము. తర్వాత, మరల యెషయ గ్రంధమునకు తిరిగిరావడం జరుగుతుంది. వారాలు గడచే కొలది ప్రవక్తలు రక్షకుని రాకను గూర్చి సుస్పష్టముగా ప్రవచించడం చూస్తాము. 

ఈవిధముగా, ఆగమనకాల మొదటి భాగములో, మొదటి పఠనాన్ని పటించినప్పుడు, నిరీక్షణ, ఆశ, నమ్మకము, వాగ్ధానము మొదలగు అంశములగూర్చి ధ్యానిస్తూ ఉంటాము. సువిశేష పఠనాన్ని చదువుకొన్నప్పుడు, ప్రవక్తల ప్రవచనాల సంపూర్ణతను ధ్యానిస్తూఉంటాము. 

రెండవ భాగము: డిశంబరు 17 - 24 

క్రిస్మస్ పండుగకు ముందు 8 రోజులు, పఠనాలమధ్య బాంధవ్యం మారుతుంది. సువిశేష పఠనం క్రిస్మస్ వేడుకలకు తీసుకొని వస్తుంది. మత్తయి, లూకా సువార్తలలోని యేసు బాల్యవృత్తాంతాలను ధ్యానిస్తూ ఉంటాము. ఈదినాలలో, మొదటి పఠనము హెబ్రీయుల గ్రంథమునుండి తీసుకొన బడుతుంది. 

ప్రభువు మార్గమును సిద్ధము చేయుము. నా కంటే శక్తిమంతుడొకడు నా వెనుక రానున్నాడు (మార్కు 1:7) - బప్తిస్మ యోహాను. 

ఆగమన కాలము 'కాలసూచనలను' (signs of the times) గమనించేకాలము. దైవరాజ్యము మన హృదయాలలో, మన సంఘములో నెలకొను సమయములో పొందు ఆనందము, నమ్మకము అను కాలసూచనలను గమనించాలి. ఆగమనకాలాన్ని ఒక నమ్మకము మరియు ఎదురు చూసే సమయముగా కొనియాడుటకు మన విశ్వాసమే మనలను ఆహ్వానిస్తుంది. మనకు తెలిసిన విధముగా, క్రీస్తురాకయందు న్యాయము, ప్రేమ, శాంతితో కూడిన దైవరాజ్యస్థాపన జరిగి ఈలోకాన్నే మారుస్తుంది. క్రీస్తు మానవ రూపమున ఈలోకమున జన్మించి 2000 సం.లు పైగా గడచి పోయాయి. ఈ కాలమంతయుకూడా మానవ లోకానికి ఒక గొప్ప దైవవరం, అనుగ్రహం. ఈ సమయ మంతయు, అన్నిచోట్ల, అన్నిజాతులకు, దయ, పాపక్షమాపణతో కూడిన సువార్త బోధించబడి యున్నది. ఈ కాలమంతయు, పవిత్రాత్మశక్తి లోకాన్ని మారుస్తూ దైవరాజ్య స్థాపనకు మనల్ని ఆయత్తం చేస్తూ ఉండినది. ప్రతీ ఆగమన కాలము ఒక దైవవరం. దైవరాజ్యస్థాపనకు ఆయత్తపడే కాలం. యేసు నాటి కాలములో, పాలస్తీనా ప్రజలు యోహాను బోధలు విని సిద్ధపడ్డారో, ఈ రోజు మనముకూడా సిద్ధపడాలి: ''పరలోకరాజ్యము సమీపించినది. మీరు హృదయపరివర్తనము చెందుడు'' (మ. 3:2). 

బైబిలుగ్రంధములో ఇద్దరువ్యక్తులు ప్రాధాన్యముగా ఆగమన కాలముతో అనుబంధాన్ని కలిగి యున్నారు: ఒకరు మరియమ్మగారు, మరొకరు బప్తిస్మ యోహానుగారు. ఇద్దరుకూడా వారివారి రీతిలో క్రీస్తురాకకై ఎదురు చూసారు. మరియమ్మ తననమ్మకాన్ని సంపూర్ణముగా దేవునిపై ఉంచి, దైవచిత్త కార్యరూపానికి ఎదురు చూసింది. ఆమె ''అవును'' అని చెప్పి ఎదురు చూసింది. దేవుడు ఆమెతో చేసిన వాగ్దానములు తప్పక నెరవేర్చ బడతాయని నమ్మకము కలిగి ఉన్నది. బప్తిస్మ యోహాను గారు శక్తివంతముగా దైవకుమారుని రాకనుగూర్చి భోదించాడు. అతని ఎదురుచూపు, తక్షణమైన పశ్చాత్తాపము, మారుమనస్సుతో ఉన్నది. మరియమ్మది ఓర్పు, నమ్మకముతో కూడిన ఎదురుచూపు. యోహాను గారిది సవాలు, తీర్పుతో కూడిన ఎదురు చూపు. ఈనాటి మన ధ్యానాంశం బాప్తిస్మ యోహానుగారి జీవితం, ఆయన బోధన మరియు ఆయన ఎదురుచూపు. 

బప్తిస్మ యోహానుగూర్చి మనకి ఏం తెలుసు? 

మెస్సయ్య మార్గమును సిద్ధపరచువాడు ఒక పెద్ద 'బుల్డోజరు'వలె వచ్చును అని యెషయ ప్రవచనాలలో కన్పిస్తుంది. దేవుని కొరకు ఎడారిలోనే రహదారిని ఏర్పాటు చేయగల వాడు. “ప్రతి లోయ పూడ్చి ఎత్తు చేయుడు, ప్రతి పర్వతమును, కొండను నేలమట్టము చేయుడు. మిట్ట పల్లములు సమతలము కావలెను. కరుకు తావులు నునుపు కావలెను” (యెషయా 40:4). 

తిబేరియ రోము చక్రవర్తి. పోంతు పిలాతు యూదయాలో పాలకుడు. హేరోదు అంతిపాసు గలీలయను, ఫిలిప్పు ఇతూరయా-త్రకోనితలకు, లిసాన్యా అబిలేనేకు అధిపతులు. అన్నా-కైఫాలు ప్రధానార్చకులు. లోతైన అవినీతి, పరిపాలనలోను-మతపరమైన విషయాలలోను క్రూరత్వం! ఇలాంటి పరిస్థితులలో జీవించిన వ్యక్తి బప్తిస్మ యోహానుగారు. బప్తిస్మ యోహానుగారి పరిచర్య అనాది క్రైస్తవులకు ఎంతో విశేషమైనది, ప్రాముఖ్యమైనది. సువార్తలన్నియుకూడా అతనిగూర్చి చెబుతున్నాయి. 400 నిశబ్ద సం.ల తర్వాత దేవుడు తనప్రజలతో తన నూతన ప్రవక్తద్వారా మాట్లాడుతున్నాడు. మెస్సయ్య రాకను గూర్చి ప్రవచించడానికి రాబోవు ఏలియ బప్తిస్మ యోహాను గారు (మార్కు 9:13; మ 11:10-14; 17:12; లూ 1:17). ప్రభువు మార్గమును సిధ్ధమొనర్చు వాడు, ఆయన త్రోవను తీర్చిదిద్దువాడు. 

యోహాను జీవితం 

యోహాను జననము ప్రత్యేకమైనది, అద్భుతమైనది (లూ 1:57-80). యోహాను అను నామము దేవుని చేత ఇవ్వబడినది (లూ 1:13). యోహాను అనగా 'దేవుడు దయాళుడు'. దేవుని ఆగమనమును స్వీకరించుటకు, ప్రజల హృదయాలను సిద్దపరచుటకు పంపబడిన ప్రవక్త. ప్రజలు పాపము నుండి పశ్చత్తాపమునకు, అంధకారము నుండి వెలుగు లోనికి రావాలని భోదించాడు. 

''బాలుడు పెరిగి దృఢకాయుడై పరిపూర్ణజ్ఞానము కలవాడాయెను'' (లూ 2:40). యూదయా దేశపు ఎడారిలో బోధించుచూ, ప్రభువు మార్గమును సిద్ధముచేస్తూ, ఆయనత్రోవను తీర్చిదిద్దుతున్నాడని చూస్తున్నాము. (మ 3:1-12, మా 1:1-11). ఎడారి, ప్రవక్తలందరికి ప్రత్యేకమైన స్థలం. తర్ఫీదుపొందు తావు. ప్రవక్తలందరూ ఎడారిలో గడిపినవారే! మొదటిగా, ఏడారిలోనే మోషే దేవుని స్వరాన్ని విన్నాడు (ని.కా.3:1-6). ఇశ్రాయేలుప్రజలతో ఒప్పందం చేసుకొన్నది, 10 ఆజ్ఞలుపొందినది ఎడారిలోనే! ఏలియా ఎడారిలోనికి నడిపించబడ్డాడు (1 రాజులు 19:3-7). అక్కడ అతను దేవుణ్ణి కలుసుకోవడం జరిగింది(19:3 -12). ఎడారి దేవున్ని కలుసుకొను స్థలముగా సూచిస్తున్నది. అందుకే యేసుప్రభువు కూడా తండ్రి దేవున్ని కలుసు కొనడానికి ఎడారికి వెళ్ళాడు (మా 1:11-12). ఏలియావలె (2 రాజు 1:8) యోహానుకూడా, ఒంటె రోమములు కంబళి ధరించి, నడుమునకు తోలుపట్టెను కట్టి, మిడతలను భుజించుచూ, పుట్టతేనెను త్రాగుతూ జీవించుచుండెను. (మ 3:4). 

యోహాను భోధన 

అతని భోదనలు శక్తివంతమైనది. దుస్తులను, భోజనాన్ని ఇతరులతో పంచుకోవాలని (లూ 3:11), సుంకరులు నిర్ణయించ బడిన పన్నుకంటే అధికముగా తీసుకోవలదని (లూ 3:12-13), రక్షక భటులు బలాత్కారముగాకాని, అన్యాయారోపణవలనగాని, ఎవరిని కొల్లగొట్టవలదని (లూ 3:14) ముక్కుసూటిగా బోధించాడు. తన బోధ ద్వారా ప్రభువు మార్గమును సిద్ధమొనర్చాడు (మా 3:14). ఆ మార్గమే ప్రభువు ఆగమనము: ''నా కంటే శక్తివంతుడు నా వెనుక రానున్నాడు.'' (మా 1:7). అందుకే ప్రభువు యోహానుగూర్చి ఇలా చెప్పడములో అతిశయోక్తి లేదు: ''మానవులందరిలో బప్తిస్మ యోహానుకంటే అధికుడగువాడు ఎవ్వడు పుట్టలేదు'' (మ 11:11-14). 

ఈ ఆగమనకాలములో యోహాను జీవితం, భోధనలనుండి మనం ఏమి నేర్చుకోవాలి? 

1. పాపము/పశ్చాత్తాపము 

యోహానుగారి బోధ ఉరుములాంటిది, శక్తివంతమైనది, ముక్కుసూటిగా ఉంటుంది: 'హృదయపరివర్తన చెందండి, మీ మార్గములను మార్చుకొనండి, సక్రమముగా జీవించండి' అన్నది ఆయన బోధనల సారాంశం. పశ్చాత్తాపము అనగా, ఆలోచన విధానం మార్చుకోవడం కన్న, చేసిన పాపాలకు చింతించడం కన్న, మరియు ప్రాయశ్చిత్తం చేయడంకన్నఎక్కువ. పశ్చాత్తాపము అనగా ఆలోచనలో, మనసులో, హృదయములో సంపూర్ణమైన మార్పు కలగడం. నూతన జీవితమునకు నడిపించే మార్పు. మనపాపాలకు పశ్చాత్తాపపడి సూటిగా జీవించే శక్తి మనకి ఎక్కడనుంచి వస్తుంది? ''ఇదిగో! లోకముయొక్క పాపములను పరిహరించు దేవుని గొర్రెపిల్ల'' (యో 1:29, 36) అని యోహాను యేసు ప్రభువును మనకి పరిచయం చేస్తున్నాడు. క్రీస్తు అనుచరులకు పాప విముక్తి సిలువనుండియే కదా! 

2. నిరాశ/ఆశ 

''పరలోక రాజ్యము సమీపించినది'' మెస్సయ్యరాబోవు సమయం ఆసన్నమైనది. ఇన్ని సంవత్సరాల ఆశలు, కలలు త్వరలో నెరవేరబోతున్నాయి. మెస్సయ్య రాజ్యము వినయవినమ్రతలతో కూడినది. కడపటివారు, మొదటివారగుదురు. చిన్న బిడ్డలే ఈ రాజ్యములో మొదటివారు. ఈ విషయములో, యోహానుగారే మనకు ఆదర్శం: ''నేను ఆయన పాదరక్షలు మోయుటకైనను యోగ్యుడనుకాను''(మ 3:11). అది నిజమైన వినమ్రత. మనలోనున్న పాపము, అధికారదాహం, గర్వం, స్వార్ధం, వ్యామోహం...మొ.వి మనలోనున్న నిరాశ. దైవరాజ్యసామీప్యముతో, క్రీస్తు ఆగమనముతో మనలో నూతన జీవితానికి ఆశను కల్పిస్తున్నది. 

3. అంధకారము/వెలుగు 

యోహాను సువార్తలో బప్తిస్మ యోహానుగూర్చి ఇలా చదువుతున్నాం: ''దేవుడు ఒక మనుష్యుని పంపెను. అతని పేరు యోహాను. అతని మూలమున అందరు విశ్వసించుటకు, అతడు వెలుగునకు సాక్షమీయ వచ్చెను'' (1:6-7). నిజమైన ఆ వెలుగు క్రీస్తు. మనలోనున్న అంధకారం తొలగి పోవాలి. అంధకారం? ప్రతి రోజు సగం ప్రపంచం ఆకలి భాధతో నిద్రిస్తున్నది, రోగాలు, ఆత్మహత్యలు, బాల్య కార్మికం, అశ్లీలత, అపనమ్మకం, నమ్మకద్రోహం మొ.గు అంధకారములో జీవిస్తున్నాం. వెలుగును పొందుటకు ఆయత్త పడుదాం.

No comments:

Post a Comment