సర్వాధికారియగు క్రీస్తు రాజు మహోత్సవము, Year A

సర్వాధికారియగు క్రీస్తు రాజు మహోత్సవము, Year A
కడపటి 34వ సామాన్య ఆదివారము
పఠనములు: యెహెజ్కెలు 34:11-12; 1 కొరి 15: 20-26, 28; మత్తయి 25:31-46 

    
“బలియైన గొర్రెపిల్ల అధికారమును, దైవత్వమును, వివేకమును, శక్తిసామర్ధ్యములను, మహిమలను పొందుటకు అర్హత కలిగియున్నది. దీనికే యుగయుగముల పర్యంతము మహిమ రాజ్యాధికారములు లభించును. సర్వేశ్వరుడు రాజసింహాసనమందు ఆసీనుడై యుండును. ఆయన తన ప్రజలకు శాంతి వరమును ప్రసాదించును” (కీర్తన. 29:10-11). 

   క్రీస్తునందు ప్రియ సహోదరీ, సహోదరులారా! ఈ రోజు దైవార్చన కాలములో చివరి ఆదివారము. నేడు సర్వాధికారియగు క్రీస్తురాజు మహోత్సవమును ఘనముగా, వైభవముగా కొనియాడు చున్నాము. మన జీవితాలను మనం క్రీస్తుకు అంకితం చేసినప్పుడు, ఆయనను దేవునిగా, రక్షకునిగా, రాజుగా అంగీకరించినప్పుడు, మనలను పాలించమని కోరినప్పుడు, ఆయన ఒసగు శాంతితో మనం జీవిస్తాము

        పాత నిబంధన గ్రంథములో, మెస్సయ్యను గురించిన ప్రవచనాలలో (సమూవేలు, యెషయ, యిర్మియా, దానియేలు) క్రీస్తును రాజుగా చూస్తున్నాము. అలాగే, నూతన నిబంధనలో, లూకా. 2:32-33లో “ఆయన మహనీయుడై, మహోన్నతుని కుమారుడని పిలువబడును. ప్రభువగు దేవుడు, తండ్రియైన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును. ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును. ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు” అని చూస్తున్నాము. జ్ఞానులు శిశువును సందర్శింప వచ్చి, “యూదుల రాజుగా జన్మించిన శిశువెక్కడ?” (మత్త. 2:2) అని అడిగారు. యేసు యెరూషలేము పుర ప్రవేశమున (మ్రానికొమ్మల / శ్రమల ఆదివారము), ప్రజలు, “ప్రభువు పేరిట వచ్చు రాజు స్తుతింపబడునుగాక!” (లూకా. 19:38). అలాగే, పిలాతు, “నీవు యూదుల రాజువా?” (యోహాను. 18:33) అని యేసును ప్రశ్నించాడు. అందుకు క్రీస్తు, “నేను రాజునని నేవే చెప్పుచున్నావు. నేను సత్యమునకు సాక్ష్యమిచ్చుటకు జన్మించితిని. దీనికొరకే ఈ లోకమునకు వచ్చితిని. సత్యసంబంధులందరు నా మాటనాలకింతురు” (18:37) అని సమాధానమిచ్చెను. “నజరేయుడగు యేసు, యూదులరాజు” (యోహాను. 19:19) అని క్రీస్తు సిలువపై వ్రాసి పెట్టబడెను. అలాగే, మోక్షారోహణమునకు ముందుగా క్రీస్తు, “ఇహపరములందు నాకు సర్వాధికార మీయబడినది” (మత్తయి 28:18) అని ప్రకటించాడు. అలాగే మత్తయి 25:31లో, “మనుష్యకుమారుడు సమస్త దూతల సమేతముగా తన మహిమతో వచ్చునపుడు, తన మహిమాన్విత సింహాసనముపై ఆసీనుడగును” అని క్రీస్తు మాటలను చదువుచున్నాము.

    ప్రపంచ దేశాలెన్నో గతములో రాజులచేత పరిపాలించబడ్డాయి. రాజుల పాలనను మనం చూడక పోయినను, ఎంతగానో వినియున్నాము కాబట్టి, ఎంతోకొంత రాజుల పరిపాలన గురించి మనకు అవగాహన ఉన్నది. ఎంతోమంది గొప్పగొప్ప రాజుల చరిత్రలు మనం చదివి యున్నాము. అలాగే పాలితులను, రాజ్యాలను కొల్లగొట్టి వినాశనము చేసిన రాజుల చరిత్రలూ మనకు తెలుసు. రాజు అనగానే, మన మదిలో మెదిలేది భయం, క్రూరత్వం, సైన్యం, యుద్ధం మొ.వి.

    రాజు అనేవాడు తన ప్రజలకు ఓ గొర్రెల కాపరివలె, ప్రేమించే హృదయాన్ని కలిగియుండాలి. సంఘాన్ని న్యాయముతో, శాంతి పధములో నడిపించగలగాలి. ప్రజల అవసరాలను గుర్తెరిగి వాటిని నెరవేర్చేవాడై యుండాలి. అలాంటి పరిపాలనను మనం స్వర్ణయుగముతో పోల్చుతూ ఉంటాము. 

    ఈనాటి మొదటి పఠనములో రాజైన యావేను "మంచికాపరి"గా చూస్తున్నాము. మంచి కాపరి [తండ్రి దేవుడు] తన మందను [ప్రజలను] వెదకును. చెదరిపోయిన గొర్రెలను గూర్చి జాగ్రత్త పడును. మంచి గడ్డి బీడులలో మేపును. గాయపడిన వాటికి కట్టు కట్టును. రోగము తగిలిన వానికి జబ్బు నయము చేయును. ఆయన న్యాయముగా ప్రవర్తించును. తన గొర్రెలను మేకలనుండి వేరు చేయును. 

దీనికి నేపధ్యం ఇశ్రాయేలు ప్రజలు బబులోనియ దేశములోని బానిసత్వం [నేపధ్యం]. సోలోమోను మరణము తర్వాత ఇశ్రాయేలు దేశం రెండు రాజ్యాలుగా విభజింప బడినది - ఇశ్రాయేలు దేశము (ఉత్తర భాగము), యూదా దేశము (దక్షిణ భాగము). ముందుగా, క్రీ.పూ.722వ సం.లో అస్సీరియా రాజు ఇశ్రాయేలు (ఉత్తర భాగము) దేశమును బానిసత్వములోనికి తీసుకొని వెళ్ళాడు. ఆతరువాత, క్రీ.పూ.597వ సం.లో బబులోనియ యెరూషలేము పట్టణమును నాశనం చేసి యూదా దేశమును బానిసత్వములోనికి తీసుకెళ్ళినది (2 రాజు. 24:13-14). యాజకుడైన యెహెజ్కెలు కూడా బాబులోనియాకు కొనిపోబడ్డాడు. అచట ఐదు సం.ల తర్వాత యావే దేవుడు అతనిని ప్రవక్తగా పిలచియున్నాడు. ఈవిధముగా, యెహెజ్కెలు యెరూషలేము వినాశనమును, ప్రజలకు నమ్మకాన్ని ప్రకటించుటకు పిలువబడినాడు. యెహెజ్కెలు, యిర్మియా ప్రవక్తలు  సమకాలీకులు. యెహెజ్కెలు బులోనియాలో ప్రవక్తగా ఉండగా, యిర్మియా యెరూషలేములో ప్రవక్తగా ఉండినాడు. యెహెజ్కెలు క్రీ.పూ.587వ సం.లో యెరూషలేము వినాశనము వరకు (2 రాజు. 25) ప్రవక్తగా కొనసాగెను. క్రీ.పూ.539వ సం.లో పర్షియన్ దేశం బబులోనియను ఓడించగా, క్రీ.పూ.538వ సం.లో ఇశ్రాయేలు ప్రజలు యేరూషలేమునకు తిరిగి వచ్చారు. క్రీ.పూ.516వ సం.ము కల్ల, యెరూషలేము దేవాలయమును పునర్నిర్మించు కున్నారు. ఈ నేపధ్యములో ఇశ్రాయేలు కాపరులకు [రాజులు, యాజకులు, ఇతర పాలకులు] వ్యతిరేకముగా ఈ ప్రవచనాలు చెప్పడం జరిగింది. వారువారి కడుపు నింపుకున్నారేగాని, గొర్రెల మందలను మేపలేదు.... (యెహెజ్కె. 34:2-10).

    ఇశ్రాయేలు రాజులు సక్రమముగా లేరు కనుక, స్వయముగా దేవుడే వారి కాపరిగా ఉందునని తెలియజేయు చున్నాడు. యావేను కాపరిగా ఆ.కాం. 48:15; 49:24; కీర్తన. 23:1; 78:52; 80:1; యెషయ. 40:11; మీకా. 7:14; జెక. 11:7లో కూడా చూడవచ్చు. ప్రజలు చెల్లాచెదరైతే, కాపరి సరిగా లేడని అర్ధం. మంచికాపరి ప్రజలను ప్రోగుచేయును. ఈ మంచికాపరిని క్రీస్తు మెస్సయ్యలో మనం చూస్తున్నాము (చదువుము: యోహాను. 10:1-16). "నేను మంచి కాపరిని" అని యేసు చెప్పడం యోహాను 10:11లో చదువుచున్నాము. అలాగే కాపరి బాధ్యత మనందరికి కూడా ఇవ్వబడింది.

    ఈనాడు మనం కొనియాడే ఈ పండుగ, క్రీస్తుని సర్వాధికారమును, ఆయన సర్వాధిపతియని తెలియజేస్తుంది. ఈ పండుగ మన భవిష్యత్తును ధ్యానించేలా చేస్తుంది. అవి మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన రోజులు! ఐహికత్వం పెరుగుతున్న కాలం! యూరపు, ఇతర దేశాలలో భయానకర నియంతలు వెలుగులోనికి వస్తున్న కాలం. ఇలాంటి సమయములో, క్రీస్తు ఒక రాజుగా గౌరవించ బడాలని, చర్చికికూడా స్వతంత్ర౦ కలదనే విషయం, లోకం తెలుసుకోవాలని, విశ్వాసులు బలాన్ని, ధైర్యాన్ని పుంజుకోవాలని తలంచి, ఈ పండుగను 1925వ సం.లో 11వ భక్తినాధ పాపుగారు స్థాపించారు. ప్రతీ దైవార్చన సం.ర చివరి ఆదివారమున ఈ ఉత్సవం కొనియాడటం జరుగుతూ ఉన్నది. ఈ పండుగద్వారా, మనం గుర్తుకు చేసుకోవాల్సింది, క్రీస్తు మన హృదయాలను, మనసులను పరిపాలించును. 

      ప్రజాస్వామ్యం కలిగిన దేశాలలో 'రాజు', 'ప్రభువు' అన్న పదాలను సంభోదించడం సమంజసం కాదేమో! ఎందుకన, ఇవి నిరంకుశ ప్రభుత్వ పాలనలోనుంచి పుట్టుకొచ్చాయి. అనేక సందర్భాలలో, రాజు గర్వానికి, అధికార దుర్వినియోగానికి, యుద్ధాలకు, అవినీతికరమైన జీవితాలకు ప్రతీక. అయితే, క్రీస్తు ప్రభుని రాజరికం, అణకువకు, సేవకు ప్రతీక. 

    క్రీస్తు తన శిష్యులతో ఇలా అన్నారు: "అన్య జాతి ప్రజలలో పాలకులు పాలితులను నిరంకుశముగా పరిపాలించుచున్నారు. పెద్దలు వారిపై పెత్తనము చెలాయించుచున్నారు. మీకు ఇది తగదు. మీలో ఎవడైన గొప్పవాడు కాదలచిన అతడు మీకు పరిచారకుడై ఉండవలెను. మీలో ఎవడైన ప్రముఖుడుగా ఉండదలచిన అతడు మీకు బానిసయై ఉండవలెను. ఏలయన, మనుష్య కుమారుడు సేవించుటకేగాని, సేవింపబడుటకు రాలేదు. ఆయన అనేకుల రక్షణార్ధము విమోచన క్రయ ధనముగ తన ప్రాణమును ధారపోయుటకు వచ్చెను (మార్కు. 10:42-45).

        మన రాజైన క్రీస్తు పాలన ఆధిపత్యంతోగాక, సేవాభావముతో నున్నది. యేసు పిలాతుతో ఇలా అన్నారు: "నేను సత్యమునకు సాక్ష్యమిచ్చుటకు జన్మించితిని. ఇందు కొరకే ఈ లోకమునకు వచ్చితిని" (యోహాను. 18:37). తండ్రి దేవుడగు సత్యమునకు, ఆయన ప్రేమకు సాక్ష్యమిచ్చుటకు క్రీస్తు ఈలోకమునకు వచ్చెను. 

        ఈనాటి మహోత్సవం క్రీస్తు రాజరికపు బిరుదులను స్థిరపరుస్తుంది. మొట్టమొదటిగా, క్రీస్తు దేవుడు, సృష్టికర్త. కనుక తన సర్వాధికారాన్ని సమస్తముపై చూపుచున్నాడు. "దేవుడు సమస్త విశ్వమును ఆయన ద్వారా, ఆయన కొరకు సృష్టించెను"అని కొలొస్సీ. 1:16లో చదువుచున్నాము. రెండవదిగా, క్రీస్తు మన రక్షకుడు. తన పవిత్ర రక్తాన్ని వెలగా పెట్టి మనలను తన స్వంతం చేసుకొన్నాడు (1 కొరి. 6:20). మూడవదిగా, క్రీస్తు శ్రీసభకు అధిపతి (కొలొస్సీ. 1:18; ఎఫెసీ. 1:22; 5:23). చివరిగా, క్రీస్తు రాజ్యం ఈ లోకానికి సంబంధించినది కాదు (యోహాను. 18:36). 

    క్రీస్తు ఈ లోకమున జీవించినప్పుడు, దైవరాజ్యమును గురించి భోదించాడు. తన శిష్యులతో, "మొదట ఆయన రాజ్యమును, నీతిని వెదకుడు" (మత్త. 6:33) అని వారికి స్పష్టము చేసాడు. దేవునికి ప్రధమ స్థానాన్ని ఇవ్వాలని సూచించాడు. తన శిష్యులను సేవకులనిగాక స్నేహితులని పిలిచాడు. తన గురుత్వమును, రాజరికాన్ని వారితో పంచుకొన్నాడు. ఆయన మరణించినప్పటికిని, ఈ లోక రాజులవలెగాక, ఇష్టపూర్తిగా, తన ప్రజల రక్షణార్ధమై మరణించాడు. ఆయన మరణం యుద్ధము వలన వచ్చినది కాదు. రక్షణ ప్రణాళికలో సృష్టికి పూర్వమే ఏర్పాటు చేయబడినది.

    ఆయన మహిమతో పుణరుత్థానుడై మోక్షారోహణుడైనాడు. క్రీస్తు రాజుగా ఈ లోకములో సేవకునిగా ప్రజల దరికి చేరాడు. తన శిష్యులను సైతం సేవకులుగా ఉండాలని ఆజ్ఞాపించాడు. ఆయన నిజమైన స్వాతంత్రాన్ని ఒసగువాడు. ఈ విధముగా, 'రాజు'కు ఓ నూతన అర్ధాన్ని ఇచ్చాడు. 

    దానియేలు ప్రవక్త - "శాశ్వతజీవి, నరపుత్రుని రాక"ను గూర్చిన దర్శనమును తెలియజేయు చున్నాడు. "ఆ నరపుత్రుడు పరిపాలనమును, రాజ్యాధికారమును బడసెను. సకల దేశములకు, జాతులకు, భాషలకు చెందిన ప్రజలతనికి దాసులైరి. అతని పరిపాలనము శాశ్వతమైనది. అతని రాజ్యమునకు అంతము లేదు (దాని. 7:13-14). దేవుడు రాజుగా కలకాలం ప్రజల చెంత నున్నాడని, దేవునిరాజ్యం భూలోకమునకు ఏతెంచినదని నిరూపిస్తున్నది. 

    క్రీస్తును ప్రేమించే రాజుగా దర్శన గ్రంధము 1:5-8 వర్ణిస్తుంది. "ఆయన మనలను ప్రేమించు చున్నాడు" (1:5). మనకోసం ఒక రాజ్యాన్ని స్థాపించిన సర్వాధికారియైన క్రీస్తు రాజసత్వమును ఇది బోధిస్తున్నది. ఈ రాజ్యములో, క్రీస్తు మనలను దైవసేవకు అంకితము చేసియున్నాడు. ఆయన రక్తముద్వారా, మనలను పాపవిముక్తులను చేసి (1:5), తన ప్రేమను నిరూపించు కున్నాడు. అందుకే, ఆయన సర్వాధికారమునకు పాత్రుడైనాడు. ఆయన మరల మహిమతో తిరిగి వచ్చును. ఆయన "ఆల్ఫా, ఒమేగ" (1:8). 

    పిలాతు ఎదుట ప్రభువు తన రాజ్యము ఈ లోకసంబంధమైనది కాదని, తన రాజ్యము ఆధ్యాత్మిక మైనదని, తన రాజ్యము సత్యము, న్యాయములపై ఆధారపడి యున్నదని చెప్పాడు (యోహాను. 18:33-37), కాని, పిలాతు దానిని అర్ధము చేసుకోలేక పోయాడు. సిలువ క్రీస్తురాజు రాజ్యవిజయానికి చిహ్నము. ఈ విజయం జీవితం, సత్యం, ప్రేమ కొరకు. 

    క్రీస్తు మన రాజు, అందరి రాజు, ఆయనసర్వాధికారమును కలిగినవాడు. ఆయన మన జీవితాలకు, హృదయాలకు రాజు. ఆయన చూపిన ప్రేమ-సేవ మార్గములో మనమందరం పయనిద్దాం. ఇతరులకు సేవకులమై దేవుని రాజ్యాన్ని ఈ లోకములో బలపరచుదాం.

    ఈనాటి సువిశేష పఠనము కూడా క్రీస్తును రాజుగా, తీర్పరిగా మనకు పరిచయం చేస్తుంది. "మనుష్య కుమారుడు సమస్త దూతల సమేతముగా తన మహిమతో వచ్చునప్పుడు తన మహిమాన్విత సింహాసనముపై ఆసీనుడగును. సకల జాతులవారు ఆయన సముఖమునకు చేర్చబడుదురు...అప్పడు రాజు తన కుడిప్రక్కన ఉన్నవారితో... నీతిమంతులను ఆయన నిత్యజీవితమును ఒసగును" (మత్త. 25:31). పునీత పౌలుగారు కూడా దేవుని రాజ్యము గురించి ఇలా చెప్పారు: "దేవుని రాజ్యము అనగా తినుట, త్రాగుట కాదు, పవిత్రాత్మ యొసగు నీతి, శాంతి, సంతోషములే!" (రోమీ. 14:17). మన రాజు, క్రీస్తురాజ్యములో నీతిమంతులుగా నిత్యజీవము పొందాలంటే, మంచి కాపరులుగా మన తోటివారికి సహాయం (ఆహారం, నీరు, ఆదరణ, వస్త్రములు, దర్శన...) చేద్దాం... "ఈ అత్యల్పులలో ఒకనికైనను మీరివి చేయనప్పుడు నాకును చేయలేదు" అని ప్రభువు చెప్పారు.

    "క్రీస్తు రాజ్యము' అనగా క్రీస్తు పరిపాలన. ఆయన తిరుసభను [సర్వలోకమును కూడా] పాలిస్తున్నాడు. దేవుని రాజ్యము రావాలని ప్రార్ధన చేయమని ప్రభువు శిష్యులకు నేర్పించాడు (మత్త. 6:10). "దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది" (లూకా. 17:21). క్రీస్తును రాజుగా అంగీకరించి, ఆయన పాలనలో ఉండుటకు నిశ్చయిస్తావో అదే దేవుని రాజ్యము. క్రీస్తు రాజు మనలను దీవించునుగాక!

  ప్రార్ధన: సర్వశక్తిగల ఓ సర్వేశ్వరా! సమస్తము మీద రాజ్యాధికారముగల మీ ప్రియతమ పుత్రుని ద్వారా సృష్టినంతటిని పునరిద్దరించ చిత్తగించితిరి. సృష్టి అంతయు పాపదాస్యము నుండి విముక్తి చెంది మీ వైభవ సేవకు అంకితమగు నట్లును, నిత్యము మీ స్తుతిగానమందు నిమగ్నమై యుండునట్లును చేయుమని మిమ్ము బ్రతిమాలు కొనుచున్నాము. ఆమెన్.

4 comments: