20వ సామాన్య ఆదివారము, Year A

 20వ సామాన్య ఆదివారము, Year A
యెషయ 56:1, 6-7; రోమీ. 11:13-15, 29-32; మత్త. 15:21-28 

ఈనాటి మూడు పఠనాలు కూడా దేవుని రక్షణ సర్వమానవాళికి అనగా అందరికి వర్తించును అని తెలియజేయుచున్నాయి. మొదటి పఠనములో యెషయా ప్రవక్త "నూతనయుగము" గురించి తెలియజేయుచున్నాడు. సకల జాతిజనులు పవిత్రమైన దేవుని ప్రార్ధనామందిరమునకు పిలువబడుదురు. రెండవ పఠనములో పౌలు అన్యజనులకు సువార్త బోధనపట్ల, తన ప్రేషిత కార్యముపట్ల సంతోషాన్ని వ్యక్తపరచుచున్నాడు. అన్యజనుల విశ్వాసం వారి మారుమనస్సు, యూదుల మారుమనస్సునకు నడిపించునని పౌలు ఆశిస్తున్నాడు, విశ్వసిస్తున్నాడు. దేవుని కృపగల రక్షణను యూదులు ఆలింగనము చేసుకొనే రోజుకై పౌలు ఎదురుచూచుచున్నాడు. సువార్త పఠనములో అన్యజాతి అయిన కమనీయస్త్రీ ప్రభువు స్వస్థతవరమును, ఆశీర్వాదమును పొందటం చూస్తున్నాము. ఆమె ప్రార్ధనలో ఓపికకు, పట్టుదలకు, విశ్వాసమునకు మాతృక! 
మొదటి పఠనము:
యెషయా దేవుని తరుపున మాట్లాడుచున్నాడు: దేవుని మందిరము సకల జాతిజనులకు ప్రార్ధనాలయముగా పిలువ బడును. బానిసత్వము [ప్రవాసము] నుండి తిరిగి వచ్చిన తరువాత, ఇశ్రాయేలు ప్రజలు నిర్మించబోయే దేవాలయమును సూచిస్తుంది [తరువాత మెస్సయా 'దేవుని ఆలయము'గా సూచిస్తుంది]. అన్యజనులుకూడా ఇశ్రాయేలీయులలో చేర్చబడునని దేవుడు ప్రమాణము చేయుచున్నాడు. అన్య జనులుకూడా దేవుని ఆశీర్వాదములు పొందుదురు. నిబంధనము అనుసరించు అన్యజాతి ప్రజలకు ప్రభువిట్లు చెప్పుచున్నాడు: "నేను మిమ్ము నా పవిత్ర పర్వతముకు కొనివత్తును. నా ప్రార్ధనా మందిరమున మిమ్ము సంతోష చిత్తుల గావింతును. నా బలి పీఠముపై మీరర్పించు బలులను, దహన బలులను స్వీకరింతును. నా మందిరము సకల జాతిజనులకు ప్రార్ధనా మందిరమని పిలువబడును" (యెషయా 56:7). ఇది సర్వమానవాళి [సార్వత్రిక రక్షణ] రక్షణను తెలియజేయుచున్నది. ఇది క్రీస్తు మెస్సయ్య రాకతో ఆరంభమై, పూర్తియగును.
దేవుడు తన రక్షణ ప్రణాలికను పరిపూర్తి చేయుటకు ముందుగా ఇశ్రాయేలు ప్రజలను ఎన్నుకున్నాడు. కాని, అందరూ రక్షింప బడాలనేదే దేవుని కోరిక! ప్రభువు యెషయాతో ఇట్లు పలికెను: "నీవు నాకు సేవకుడవై యాకోబు వంశజులను, యిస్రాయేలున మిగిలిన వారిని నా యొద్దకు తీసికొని వచ్చుట మాత్రమే చాలదు, నేను నిన్ను జాతులకు జ్యోతిగా నియమింతును. అప్పుడు నా రక్షణము నేల అంచుల వరకు వ్యాపించును" (యెషయ 49:6). అబ్రహాము కాలమునుండే, తన ఆశీర్వాదాలు, రక్షణ సర్వలోకానికి చేరాలని దేవుడు కోరుచున్నాడు.
రెండవ పఠనము:
పౌలు "అన్య జనులకు అపొస్తలుడు". యెషయ వలెనె దేవుడు పౌలును జాతులకు జ్యోతిగా నియమించాడు. అయితే, పౌలు యూదులను మరువలేదు. దేవుడు అన్యజనులకు చేయుకార్యాలను చూసి, యూదులు యేసు ప్రభువును అంగీకరించి, రక్షణలో భాగస్థులు అగుదురని ఆశతో ఉన్నాడు. యూదులు, అన్యులు ఇరువురుకూడా దేవుని చిత్తమును అవిధేయించిరి. కానీ, ఇశ్రాయేలు ప్రజలపట్ల దేవుని కృపావరములు, ఎన్నిక మార్చబడనివి అని పౌలు తెలియ జేయుచున్నాడు. యూదులపట్ల పౌలు ఎంతో విచారాన్ని, హృదయ వేదనను పొందియున్నాడు (రోమీ 9:2). అయినను, సర్వమునుండి దేవుడు మంచికార్యములు చేయునని పౌలు పలుకుచున్నాడు. ఇశ్రాయేలు ప్రజలపై కరుణను జూపిన దేవుడు అన్యజనులపై కూడా కరుణ జూపును. అందుకే, పౌలు యూదులు మరియు అన్యులు దేవుని దయను పొందాలని ఎంతగానో కృషి చేసాడు.
సువార్త పఠనము:
యేసు తూరు, సీదోను పట్టణ ప్రాంతములకు వెళ్లగా, అన్యజాతి స్త్రీ [కననీయురాలు; గ్రీకు మతం పాటించే స్త్రీ, అనగా అనేక దేవుళ్ళను పూజించే స్త్రీ] యేసు ప్రభువు దగ్గరకు సహాయము కొరకు వచ్చియున్నది. తూరు, సీదోను అన్యులు వసించే ప్రాంతాలు. ఆ కననీయ స్త్రీ దయ్యముపట్టి మిక్కిలిగా బాధపడుచున్న తన కుమార్తె ప్రేమవలన, స్వస్థత కొరకు ప్రభువు దగ్గరకు వచ్చియున్నది. బహుశా, యూదులకు ప్రభువు చేయుచున్న అద్భుతములు గురించి ఆ స్త్రీ ఎరిగి యుండవచ్చు. తద్వారా, వ్యక్తిగతముగా ప్రభువును కలుసుకొని తన కుమార్తెకు స్వస్థత కొరకై ప్రభువును ఆశ్రయించింది. ఆమె ఒక కననీయ స్త్రీ. పాత నిబంధనలో కనానీయులను పాపాత్ములుగా, అపవిత్రులుగా, దుష్టులుగా, శత్రువులుగా, నశింపబడిన జాతిగా, యూదులు పరిగణించేవారు. యూదులు, సమరీయులతోను, అలాగే కననీయులతోను ఎలాంటి సంబంధాలను కలిగియుండేవారు కాదు.
ఇచ్చట యూదులచేత తిరస్కరించబడిన కననీయజాతి స్త్రీ తన కుమార్తె స్వస్థత కొరకు ప్రభువు దగ్గరకు వచ్చినది. యేసును, "ప్రభూ! దావీదు కుమారా! అని సంబోధించినది. "దావీదు కుమారా! అనగా యేసును, మెస్సయ్యగా, రక్షకునిగా, తన విశ్వాసాన్ని ప్రకటించినది. "ప్రభూ!" - "నీ నోటితో యేసు 'ప్రభువు' అని ఒప్పుకొని, మృతులలోనుండి దేవుడు ఆయనను లేవనెత్తునని నీ హృదయమున నీవు విశ్వసించినచో నీవు రక్షింపబడుదువు" (రోమీ 10:9). ప్రభువును ఒక అతీతమైన శక్తిగా, ప్రత్యేకమైన వ్యక్తిగా (బహుశా దేవునిగా) గుర్తించినది. [ప్రభువును మెస్సయ్యగా ఎలా ఎరిగియున్నదనే విషయం సువార్తలో చెప్పబడలేదు].
ఆమె మొరను (ప్రార్ధనను) ప్రభువు మొదటగా పట్టించుకొనలేదు. "ఆయన ఆమెతో ఒక్క మాటనైనను మాట్లాడలేదు" (15:23). ప్రభువు ఎంత మౌనముగా యున్నాడో, అంతగా ఆమె తన మొరను విన్నవించినది - "ప్రభూ! దావీదు కుమారా! నాపై దయ చూపుము!" శిష్యులు ఆమెను అడ్డంకిగా భావించి, ఆమె మొరను ఆలకించి [స్వస్థతను ఒసగి] పంపివేయమని ప్రభువుతో చెప్పారు. శిష్యుల మాటలను విన్న ప్రభువు, ఆమెతో నేరుగా మాట్లాడక, శిష్యులతో "నేను ఇశ్రాయేలు వంశమున చెదిరిపోయిన గొర్రెల కొరకు మాత్రమే పంపబడితిని" అని సమాధానమిచ్చాడు. ఈ మాటలు ఆమెను ఎంతగానో నిరాశ పరచియుండవచ్చు. "దేవుని కృప కేవలం నా వారికే! పాలస్తీయులకే! నీవు కననీయురాలవు. ఇక్కడ నుండి వెళ్ళిపో" అనే అర్ధం స్పృశిస్తుంది. 
అయినప్పటికిని, ఆ స్త్రీ అక్కడ నుండి వెళ్లిపోలేదు. ఆమె అధైర్య పడలేదు. బాధ పడలేదు. నిరాశ పడలేదు. తన ప్రార్ధనలో ఓపికను, పట్టుదలను చూపించింది. అప్పుడు ఆమె ఆయన పాదములపై పడి [ఆరాధించడం], "ప్రభూ! నాకు సాయపడుము" అని ప్రార్ధించినది. ఆమె ప్రార్ధనలో నిస్సహాయతను, దృఢమైన విశ్వాసాన్ని వ్యక్తపరచుచున్నది. అయినను ప్రభువు, "బిడ్డల రొట్టెలను కుక్క పిల్లలకు వేయ తగదు" అని సమాధానమిచ్చాడు. యూదులు కననీయులను బయటివారిగ, అశుద్ధులుగా, కుక్కలకన్నా హీనమైన వారిగ భావించేవారు. అయితే ఆ స్త్రీ సమాధానం వలన ప్రభువు ఆమె విశ్వాసాన్ని గుర్తించాడు - "అది నిజమే ప్రభూ! కాని తన యజమానుని భోజనపు బల్ల నుండి క్రింద పడిన రొట్టె ముక్కలను కుక్క పిల్లలును తినును గదా!" ప్రభువు ఆమె గొప్ప విశ్వాసాన్ని, ఓపికను, పట్టుదలను చూసి, "అమ్మా! నీ విశ్వాసము మెచ్చదగినది. నీ కోరిక నెరవేరునుగాక!" అని ఆమెను ఆశీర్వదించాడు. ఆమె కుమార్తెను స్వస్థత పరచాడు. ఆమె విశ్వాసము ఆమె ప్రార్ధన, స్వస్థత, రక్షణ, దేవుని ఆశీర్వాదం, కృపను పొందేలాగున చేసింది. ప్రభువు తన మౌనము ద్వారా, మాటల ద్వారా, ఆ స్త్రీలోని విశ్వాసాన్ని బలపరిచేలా చేశాడు. ఆమె విశ్వాసమునుబట్టి ఆమె దేవుని వరమును, కృపను, అనుగ్రహమును, దీవెనను పొందియున్నది. అలాగే, ఈ అద్భుతముద్వారా, దేవుని రక్షణ అందరికి అని యేసు తెలియజేశాడు. తద్వారా, అన్యులుకూడా దేవుని రక్షణకార్యములో భాగస్థులని తెలియుచున్నది. సర్వము ఆయన సృష్టియే కనుక, సర్వమును ఆయన కృపజూపును, కాపాడును, రక్షించును. అన్యులకుకూడా సువార్తను బోధించమని ప్రభువే స్వయముగా శిష్యులను [పౌలుతో సహా] ఆజ్ఞాపించాడు.
ఈ సంఘటనద్వారా, మత్తయి సువార్తీకుడు, క్రైస్తవ సంఘములో అన్యజనుల స్థానమును స్పష్టము చేయుచున్నాడు [ఆ కాలములో అన్య క్రైస్తవుల మధ్య - యూద క్రైస్తవుల మధ్య విభేదాలు ఉండేవి]. దేవుని రాజ్యము అందరిది! కేవలం యూదులకు [ఒక వర్గము వారికి] మాత్రమేకాదు. సర్వసృష్టి, సర్వమానవాళి దేవునిరాజ్యములో భాగమే! [క్రీస్తునందు] విశ్వాసము యూదులని, అన్యులనే విబేధాన్ని, విభజనను తొలగించినది. క్రీస్తునందు విశ్వాసమునుబట్టి అందరూ దేవుని బిడ్డలే! అందరు సమానమే!
కననీయ స్త్రీ నుండి మనము నేర్చుకోవలసిన విషయాలు:
1. మన ప్రార్ధనలో ఓపిక, పట్టుదల, ఉండాలి. మనం అనుకున్నవన్నీ, అడిగినవన్నీ వెంటనే జరగకపోవచ్చు. దేవుని చిత్తానుగుణముగా జరుగును. ప్రార్ధనలో దేవుని చిత్తమును తెలుసుకోవాలి. మన చిత్తం, దేవుని చిత్తం ఒక్కటియై ఉండాలి. ఓపిక - "దేవుని ముందట నెమ్మదిగా నిల్చియుండుము. అతని అనుగ్రహము కొరకు ఓపికతో వేచియుండుము" (కీర్తన 37:7). దావీదు ఇలా అంటున్నాడు, "నేను గంపెడాశతో ఓర్పు వహించి ప్రభువు కొరకు కనిపెట్టుకొని యుంటిని. ఎట్టకేలకతడు నా వైపు వంగి నా వేడుకోలును ఆలించెను" (కీర్తన 40:1).
2. ప్రభువు పట్ల ప్రేమను, విశ్వాసాన్ని మనం ప్రకటించాలి. విశ్వాసముతో ప్రార్ధన చేయాలి [మత్త 21:22; యో 14:13-14; యెషయ 55;6; ఆమోసు 5:4; కీర్తన 34:6; ద్వితీ 4:29). ఆమెకు ప్రభువు ఒక్కడే తన ఆశగా, నమ్మకముగా కనిపించాడు. ప్రభువు తన మొరను, ప్రార్ధనను తప్పక ఆలకిస్తాడు అనే దృఢమైన విశ్వాసం కలిగియున్నది. విశ్వాసములో, నమ్మకములో దేవుని కృప ఒసగబడును.
3. ఆమె తన కుమార్తెను ఎంతగానో ప్రేమించినది. తన కుమార్తె బాధను తన బాధగా చేసుకుంది. ఆ ప్రేమయే ప్రభువును తెలుసుకునేలా, ప్రభువు దగ్గరకు వచ్చేలా చేసింది. మనలోనున్న ప్రేమ దేవుని ప్రేమకు నిదర్శనము.మన కుటుంబాన్ని ప్రేమిద్దాం. కుటుంబ సభ్యుల బాధలను, కష్టాలను నావిగా భావిద్దాం. అలాగే ఆ ప్రేమను ఇతరులపై కూడా చూపించుదాం. కష్టాలలో నున్నవారికై విన్నప ప్రార్ధన చేద్దాం!
4. సమస్యలు, అడ్డంకులు తనను చుట్టుముట్టినను ఆ స్త్రీ ధైర్యముగా, సంతోషముగా ముందుకు సాగింది. ఆ స్త్రీ విశ్వాసములో మూడు ప్రధానమైన అడ్డంకులు: - యేసు ఆమెతో ఒక్కమాటనైనను మాట్లాడలేదు (15:23). - "నేను యిస్రాయేలు వంశమున చెదరి పోయిన గొర్రెల కొరకు మాత్రమే పంపబడితిని" అని యేసు చెప్పడం (15:24). - శిష్యులు "ఈమె మన వెంటబడి అరచుచున్నది. ఈమెను పంపివేయుడు" అని చెప్పడం (15:23).
"దేవుడు ఎట్టి పక్షపాతము లేక అందరిని సమదృష్టితో చూచును. దేవునికి భయపడుచు, సత్ప్రవర్తన కలవాడు ఏ జాతి వాడైనను దేవునికి అంగీకార యోగ్యుడే" (ఆ.కా. 10:34-35). సత్ర్పవర్తన, మంచి కార్యాలు - నీతి న్యాయములు పాటించడం, దేవున్ని ప్రేమించడం, సేవించడం, విశ్రాంతి దినమును పాటించడం, నిబంధనను అనుసరించడం. "సత్కార్యములు చేయుటయందు విసుగు చెందరాదు. ఏలయన, మనము అట్లుచేయుట యందు నిరాశ చెందకున్నచో, మన కృషి ఫలవంతమగు సమయము వచ్చును" (గలతీ 6:9). కాబట్టి మనలోనున్న విభేదాలను పక్కన పెడదాం. అందరిని సమాన దృష్టితో చూద్దాం.

No comments:

Post a Comment