బైబులు – దేవుని ప్రేరణ

 బైబులు – దేవుని ప్రేరణ

వాక్కు శక్తి

“దేవుని వాక్కు సజీవమును, చైతన్యవంతమునైనది. అది పదునైన రెండంచుల ఖడ్గముకంటెను పదునైనది. జీవాత్మల సంయోగస్థానము వరకును, కీళ్ళు, మజ్జ కలియు వరకును అది ఛేదించుకొని పోగలదు. మానవుల హృదయములందలి ఆశలను ఆలోచనలను అది విచక్షింప గలదు” (హెబ్రీ. 4:12). “మానవుడు దేవుని నోటినుండి వచ్చు ప్రతి మాటవలన జీవించును” (మత్త. 4:4). “భూమ్యాకాశములు గతించిపోవును గాని నా మాటలు ఎన్నడును గతించిపోవు” (మత్త. 24:35). “నీ వాక్కు సత్యము” (యోహాను. 17:17). “దేవుని వాక్కును ఆలకించి దానిని పాటించువారు మరింత ధన్యులు” (లూకా. 11:28). “గడ్డి ఎండిపోవును, పూవు వాడిపోవును. కాని మన దేవుని వాక్కు కలకాలము నిలుచును” (యెషయ 40:8). “దేవుని మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి” (యోహాను. 6:63). “నూతనముగా జన్మించిన శిశువుల వలె కల్మషములేని వాక్కు అను పాలకొరకై దాహముతో ఉండుడు. దానిని త్రాగుటవలన మీరు పెరిగి పెద్దవారై రక్షింప బడుదురు” (1 పేతు. 2:2). “క్రీస్తు సందేశము మీ హృదయములలో సమృద్ధిగా ఉండవలెను” (కొలొస్సీ. 3:16). “దేవుని వాక్కును ఆత్మయొసగు ఖడ్గముగను గ్రహింపుడు” (ఎఫెసీ. 6:17). “నా నోటినుండి వెలువడు వాక్కు నిష్ఫలముగా నా యొద్దకు తిరిగిరాక, నా సంకల్పమును నెరవేర్చును. నేను ఉద్దేశించిన కార్యమును సాధించును” (యెషయ 55:11). “మీరు నా మాటపై నిలిచియున్నచో నిజముగా మీరు నాశిష్యులై ఉందురు. మీరు సత్యమును గ్రహించెదరు. సత్యము మిమ్ము స్వతంత్రులను చేయును” (యోహాను. 8:31-32). “ప్రభువు పలుకులు సత్యమైనవి” (కీర్తన. 33:4). “క్రీస్తును గూర్చిన వాక్కు వలన విశ్వాసము కలుగును” (రోమీ. 10:17). “సువార్త విశ్వసించువారందరకు రక్షణ నొసగు దేవుని శక్తి” (రోమీ. 1:16).

దేవుని ప్రేరణ

పవిత్ర బైబులు గ్రంథము దేవుని వాక్కు అయినప్పటికిని, ఇది దైవప్రజలచేత పవిత్రాత్మ ప్రేరణ శక్తితో లిఖించబడిన అనేక గ్రంథాల (పుస్తకాల) కలయిక. కనుక, ఇవి పవిత్ర రచనలు. ఈ రచనలకు సాక్షాత్తు దేవుడే రచయిత. ఇవి తిరుసభ చట్టప్రకారం ఆమోదయోగ్యమైన పవిత్ర గ్రంథాలు (Canonical Books).

బైబులు దేవుని ప్రేరణ అని చెప్పడానికి రుజువులు బైబులులోనే చూడవచ్చు:

పవిత్ర గ్రంథమంతయు దైవప్రేరణ వలననే కలిగి బోధించుటకు, దోషమును ఖండించుటకు, తప్పులు సరిదిద్దుటకు నీతియందు నడిపించుటకును ఉపయోగ పడును. దైవజనుడు ఎట్టి సత్కార్యమునైన చేయుటకు సంపూర్తిగ సంసిద్ధుడగుటకు అది తోడ్పడును” అని 2 తిమో. 3:16లో చదువుచున్నాము.

“కనుకనే ప్రవక్తల ప్రబోధముల యందలి సందేశములను మరింత అధికముగ మనము నమ్ముచున్నాము. దానిని శ్రద్ధతో ఆలకించుట మీకును మంచిది. ఏలయన, ఉష:కాలమున వేగుచుక్క మీ హృదయములను వెలుతురుతో నింపువరకు, అది అంధకారమున వెలుగుచున్న దీపిక వంటిది. ఇది మాత్రము తప్పక జ్ఞాపకము ఉంచుకొనుడు. తనంతట తానుగా, ఏ ఒక్కడును లేఖనము నందలి ప్రవచనమును వివరింపలేడు. ఏలయన, ఏ ప్రవచన సందేశమును కేవలము మానవ సంకల్పముచే జనించలేదు. ప్రవక్తలు పవిత్రాత్మచే ప్రభావితులై దేవుని నుండి జనించిన సందేశమునే  పలికిరి” అని 2 పేతు. 1:19-21లో చదువుచున్నాము.

“యేసు మరెన్నియో అద్భుత చిహ్నములను శిష్యుల ఎదుట చేసెను. అవన్నియు ఈ గ్రంథమున వ్రాయబడలేదు. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని విశ్వసించుటకు, ఈ విశ్వాసము ద్వారా ఆయన నామమున మీరు జీవము పొందుటకును ఇవి వ్రాయబడినవి” అని యోహాను. 20:30-31లో యోహాను తన సువార్తను ముగించుచున్నాడు.

“ఎవరైన ఏమైన ఈ గ్రంథపు ప్రవచన వాక్కులనుండి తొలగించినచో, ఈ గ్రంథమున వివరింప బడినట్లు వాని భాగమగు జీవవృక్ష ఫలములను, వాని పవిత్ర నగర భాగస్వామ్యమును దేవుడు తొలగించును. ఈ విషయములను గూర్చి సాక్ష్యము ఇచ్చు వ్యక్తి ‘అది నిజము! నేను త్వరలో వచ్చుచున్నాను!’ అని దర్శన. 22:19-20లో ముగింపులో హెచ్చరికను చూస్తున్నాము.

“మీరు పూర్వ సంప్రదాయమును అనుసరించు నెపమున దైవవాక్కునే అనాదరము చేయుచున్నారు” (మార్కు. 7:13) అని యేసు పరిసయ్యులకు, ధర్మశాస్త్ర బోధకులకు చెప్పెను. “దేవుడు తన సందేశమును యూదులకు అప్పగించెను” (రోమీ. 3:2) అని పౌలు రోమీయులకు వ్రాసెను. “గతమున దేవుడు పెక్కుమార్లు పెక్కు విధములుగ ప్రవక్తల ద్వారా మన పూర్వులతో మాట్లాడెను” (హెబ్రీ. 1:1). కనుక బైబులు గ్రంథాలకు దేవుడే రచయిత అని స్పష్టమగు చున్నది.

పునీత 1వ పెద్ద గ్రెగోరి (64వ పోపు, శ్రీసభ పండితుడు, క్రీ.శ. 540-604) క్రీ.శ. 595వ సంవత్సరములో బైబులును “దేవుని లేఖ”గా వర్ణించారు.

యూద, క్రైస్తవ సంప్రదాయాలు బైబులును దేవుని ప్రేరణగా అంగీకరిస్తున్నాయి. హీబ్రూ బైబులులో ఉన్న పవిత్ర గ్రంథాలద్వారా దేవుడు తననుతాను బయలుపరచుకున్నాడని యూదులు పరిగణిస్తారు. అయితే, పాత నిబంధనలోని పవిత్ర గ్రంథాల దృష్టి, కేంద్ర బిందువు క్రీస్తు అని అనాధి క్రైస్తవులు వివరించారు:

“మోషే మొదలుకొని ప్రవక్తలందరి లేఖనములలో తనను గూర్చి వ్రాయబడినవి అన్నియు వారికి వివరించెను” (లూకా. 24:27). అవన్నియు కూడా క్రీస్తు గురించి వ్రాయబడినట్లుగా, సంపూర్ణ దివ్యావిష్కరణము యేసుక్రీస్తులో నేరవేరినట్లుగా అనాధి క్రైస్తవులు అర్ధం చేసుకున్నారు (లూకా. 4:18-19; యోహాను 5:39; 1 పేతు. 1:10-12; హెబ్రీ. 1:1-2).

రెండవ శతాబ్దానికి చెందిన శ్రీసభ పితరులు బైబులును దైవప్రేరణతో కూడిన దేవుని ‘డిక్టేషను’గా భావించారు. పవిత్ర గ్రంథము దేవునివాక్కుగా పవిత్రాత్మ చెబుతూ ఉండగా దేవునిచేత ఎన్నుకొనబడిన పవిత్ర రచయితలు వ్రాసారని వారు విశ్వసించారు. మూడు, నాలుగు శతాబ్దాలకు చెందిన శ్రీసభ పితరులు రెండు నిబంధనలను కూడా పవిత్రాత్మచేత ప్రేరిపింపబడినవిగాను, తద్వారా దేవుడే రచయిత అని నొక్కిచెప్పియున్నారు.

దేవునిచేత ఎన్నుకొనబడిన పవిత్ర రచయితలు దేవుని సాధనాలుగా భావించారు. ఏవిధముగానైతే, దైవవాక్కు (క్రీస్తు ప్రభువు) నిరాడంబర మానవ స్థితిన మానవునిగా వెలసినదో, అలాగే మహోన్నతుడైన దేవుడు తన మనోభావాలను తెలియజేయుటకు, ఈ మానవ రచయితలద్వారా, మానవ స్వభావమునకు అనుగుణముగా అనువర్తించి యున్నాడని శ్రీసభ విధ్వాంసుడు, పునీత యోహాను క్రిసోస్తం వీక్షించారు. దైవవాక్కు మానవ భాషలో ఇమిడిపోవడం అనేది గొప్ప విశేషం[1].

బైబులు ద్వారా దేవుడు వెల్లడి చేయుచున్న సత్యము, సందేశము తెలియాలంటే, ఆయా గ్రంథ రచయితలు చెప్పదలచుకున్న వాస్తవ సందేశము ఏమిటో గ్రహించడానికి ప్రయత్నం చేయాలి. వారు ఎంచుకున్న సాహిత్య ప్రక్రియలను అర్ధం చేసుకోవాలి. బైబులు వ్యాఖ్యాతలు వారు ఉపయోగించిన రచనా ప్రక్రియలను బట్టి, అందులో అంతర్లీనముగా దాగియున్న సందేశాలను వెలికి తీయాలి. అందులకు, రచనల కాలం, స్థలం, సాహితీ సాంస్కృతిక నేపధ్యం, ఆచార వ్యవహారాలూ, సంభాషణ విధానం, కథాకదన పద్ధతులు, మానవ సంబంధాలు మొదలైనవన్నీ క్షుణ్ణముగా తెలిసి యుండాలి.[2]

బైబులు పవిత్రాత్మ ప్రేరణ శక్తితో దైవప్రజలచేత లిఖించబడినదని చెప్పుకున్నాము. కనుక, పవిత్ర గ్రంథములోని విషయాలు, సత్యాలపట్ల, వారి జీవితము, విశ్వాసము దృఢముగా ప్రభావితము చేశాయని చెప్పడములో ఎలాంటి సందేహము లేదు. బైబులును క్షుణ్ణముగా అర్ధము చేసుకోవడానికి ఈ పరిశీలన మనకు ఎంతగానో ఉపయోగ పడుతుంది. అందుకే, బైబులును విశ్వాసముతోను, అలాగే తార్కికముతోను పరిగణింప వలయును. ఈ రెండింటి మధ్య ఎలాంటి విబేధాలను చూడవలసిన అవసరము లేదు. ఎందుకన, విశ్వాసము దేవుడు మనకొసగిన వరము. అలాగే, తార్కికం దేవుడు మనకొసగిన శక్తి. బైబులు పఠన అధ్యయనములో ఈ రెండింటిని ఆపాదించినపుడు, సంపూర్ణ సామరస్యము, సంపూర్ణ ఆధ్యాత్మిక పోషణ కలుగుతుంది.

బైబులు దైవప్రేరణచే వ్రాయబడిన పవిత్ర గ్రంథము. యేసు, క్రీస్తు రూపమున శరీరధారియైన దేవుని వాక్కు. దేవుని వాక్కు మనకు ‘పవిత్ర సంప్రదాయము’ ద్వారా, ‘శ్రీసభ బోధనల’ ద్వారా అందించ బడుచున్నది. దేవుని వాక్కుగా బైబులు దైవార్చనా సాంగ్యాలలో (దివ్యబలిపూజలో), ఇతర ప్రార్ధనలలో ఉపయోగించ బడుచున్నది. అధ్యాత్మికముగా బలపడటానికి వ్యక్తిగతముగా కూడా బైబులు ఎంతగానో మనకు ఉపకరిస్తుంది. అందుకే, పునీత జేరోము “పవిత్ర గ్రంథము గూర్చి తెలియక పోవడమంటే, క్రీస్తును గురించి తెలియక పోవడమే” అని అన్నారు.

దేవునిచేత ప్రేరేపింపబడిన దేవుని వాక్కు మానవ భాషలో మానవులచేత లిఖింప బడినది. నూతన నిబంధన రచయితలు, పాత నిబంధన గ్రంథమును కూడా ‘దేవుని వాక్కు’గా పరిగణించారు:

“దేవుడే స్వయముగా పలికెను” (2 కొరి. 6:16), “పవిత్రాత్మ పలికిన పరిశుద్ధ గ్రంథ ప్రవచనము” (అ.కా. 1:16) అని చదువుచున్నాము. కొన్నిసార్లు పరిశుద్ధ గ్రంథము దేవునితో సమానముగా చెప్పబడినది: “పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నది” (గలతీ. 3:8), “లేఖనము (దేవుడు) ఫరోతో పలుకుచున్నది” (రోమీ. 9:17) అని చదువుచున్నాము. ఈవిధముగా, నూతన నిబంధన రచయితలు పాత నిబంధనమును దేవుని వాక్కుగా ఆపాదించి యున్నారు.

అలాగే, నూతన నిబంధన రచయితలు, వారి బోధనలనుకూడా స్వయముగా దేవుని నుండి వచ్చిన ప్రామాణికమైన మరియు అధికారపూర్వకమైన రచనలుగా సమర్పించి యున్నారు (1 తిమో. 2:7). పునీత పౌలు కూడా తన బోధనలను దేవుని వాక్కుగా భావించాడు:

“దేవుని వాక్కును మేము మీకు తీసికొని వచ్చితిమి” అని 1 తెస్స. 2:13లో చదువుచున్నాము. పౌలు మరియు ఇతర రచయితలు తమనుతాము దేవునికి మరియు క్రీస్తుకు రాయబారులుగా, సాక్షులుగా పరిగణించారు. వారు బోధించిన సువార్తను “అందరకు రక్షణ నొసగు దేవుని శక్తిగ” (రోమీ. 1:16) చూసారు.



[1] Dei Verbum (దైవ వాక్కు - దివ్యావిష్కరణం), సంఖ్య 13
[2] Dei Verbum (దైవ వాక్కు - దివ్యావిష్కరణం), సంఖ్య 12

No comments:

Post a Comment