భాగము 1: బైబులు పరిచయం: ఉపోద్ఘాతము

 భాగము 1: బైబులు పరిచయం

ఉపోద్ఘాతము



పవిత్ర గ్రంథము (బైబులు) దేవుని వాక్కు. ఆ వాక్కు దేవుడే. “వాక్కు దేవుడై ఉండెను” (యోహాను. 1:1; చూడుము. 1 యోహాను. 1:1-3). ఆ వాక్కు క్రీస్తువే. ఆ వాక్కు మానవుడై (యేసుక్రీస్తు) మనమధ్య నివసించెను” (యోహాను. 1:14, 17:2-3).

ఈ వాక్కు సర్వమానవాళికి తండ్రియైన దేవుని యొద్దకు చేర్చు గొప్ప రక్షణ సందేశం. “నేనే మార్గమును, సత్యమును, జీవమును. నా మూలమున తప్ప ఎవరును తండ్రి యొద్దకు రాలేరు” (యోహాను. 14:6) అని యేసు తోమాతో పలికి యున్నారు. “నేనే జీవాహారమును. నా యొద్దకు వచ్చువాడు ఎన్నటికిని ఆకలిగొనడు. నన్ను విశ్వసించువాడు ఎన్నడును దప్పిక గొనడు” (యోహాను. 6:35) అని యేసు పలికి యున్నారు. మరల, “కుమారుని చూచి విశ్వసించు ప్రతివాడు, నిత్యజీవమును పొందుటయే నా తండ్రి చిత్తము. అంతిమ దినమున నేను వానిని లేపుదును” (యోహాను. 6:40) అని యేసు చెప్పియున్నారు. దేవుడు తననుతాను ప్రత్యక్షపరచుకొని, తన రక్షణ ప్రణాళికను మనకు వెల్లడించారు.

ప్రతి ఒక్కరు కూడా రక్షింప బడవలయుననియు, సత్యమును గూర్చిన జ్ఞానమును కలిగియుండవలయుననియు రక్షకుడైన దేవుని అభిలాష. దేవుడు ఒక్కడే! దేవునకు మానవులకు మధ్యన ఒకే మధ్యవర్తి యేసు క్రీస్తు. మానవాళి రక్షణకై యేసు క్రీస్తు తననుతాను అర్పించుకొనెను (1 తిమో. 2:4-6). దీనినిమిత్తమై, “నేను ప్రచారకునిగాను, అపోస్తలునిగాను, బోధకునిగాను నియమింప బడితిని” (1 తిమో. 2:7) అంటూ పౌలుగారు సువార్తా బోధనను తన ప్రధాన బాధ్యతగా స్వీకరించాడు. అలాగే నేడు మనమందరమును పిలువబడుచున్నాము.

కనుక మనం ఈ రక్షణ సందేశాన్ని సాధ్యమైనంత వరకు లోతుగా అర్ధం చేసుకోవడానికి తప్పకకుండా ప్రయత్నం చేయాలి. అందులకు, పవిత్ర గ్రంథమును శ్రద్ధగా పఠనం చేయాలి, ఉత్సాహపూరితముగా అధ్యయనం చేయాలి. తద్వారా, పవిత్ర గ్రంథమైన దేవుని పరిశుద్ధ వాక్కు సందేశము, మనలను రక్షకుడి దరికి చేర్చగలదు. పాపాత్ములకు ఏకైక రక్షకుడు క్రీస్తు! కనుక పవిత్ర గ్రంథమును చదవడం, నేర్చుకోవడం, అధ్యయనం చేయడం, ప్రతీ క్రైస్తవ విశ్వాసి యొక్క బాధ్యత.

పవిత్ర గ్రంథము తరగని సత్యనిధి. అది మానవాళికి లభించిన గొప్ప కృపానుగ్రహము, ఆశీర్వాదము. మనం ఏమి చేయవలయునో, ఎలా జీవించవలయునో తెలుసుకోవాలంటే తప్పక పవిత్ర బైబులు గ్రంథమును (దేవుని వాక్కు) చదవాలి. దేవుని వాక్కు మనకు ఏమి బోధించునో తెలుసుకోవాలంటే, మన గురించిన దేవుని ప్రణాళికను, చిత్తమును తెలుసుకొనవలయునంటే, దేవుని వాక్కును శ్రద్ధగా చదవాలి, ఆలకించాలి, ధ్యానించాలి, మన జీవితాలకు అన్వయించుకోవాలి, విశ్వాసముతో ప్రకటించాలి.

ఈ బైబులు పాఠాల ద్వారా, ప్రతీ క్రైస్తవ విశ్వాసి పవిత్ర బైబులు గ్రంథమును క్షుణ్ణముగా, లోతుగా అర్ధం చేసుకోవాలనేదే నా ఆశ! నా ప్రార్ధన! ఈ నా చిన్ని ప్రయత్నాన్ని మన రక్షకుడైన యేసు దేవుడు దీవించునుగాక! అలాగే, చదువరులందరిని మరియు శ్రోతలందరిని త్రిత్వైక దేవుడు తన ఆత్మతో నింపునుగాక!

No comments:

Post a Comment