8. పౌలు కొలొస్సీయులకు వ్రాసిన లేఖ

 8. పౌలు కొలొస్సీయులకు వ్రాసిన లేఖ
8.1. ఉపోద్ఘాతము
8.2. గ్రంథకర్త
8.3. కొలొస్సి పట్టణం
8.4. లేఖ వ్రాయు సందర్భము

 8.1. ఉపోద్ఘాతము

పౌలు చెర నుండి వ్రాసిన నాలుగు లేఖలలో ఇది ఒకటి (ఫిలే. 1:22, ఫిలిప్పీ. 1:7, 12:14,19, 2:25, ఎఫెసీ. 4:1). ఈ లేఖను గురించి మనకు ఎదురయ్యే కొన్ని ప్రధానమైన ప్రశ్నలు: ఈ లేఖను వ్రాసినది ఎవరు? ఈ లేఖలో ప్రముఖ బోధనలు ఏమిటి? ఈ లేఖ ‘కొలొస్సి’ పట్టణంలోని క్రైస్తవులకే వ్రాయబడినదా? ఈ ప్రశ్నలకు సరియైన సమాధానాలను ఇవ్వటం చాలా కష్టం. ఎదేమైనప్పటికిని, ఈ లేఖలోని దైవీక సందేశమును తెలుసుకోవడం అన్నింటికన్నా చాలా ముఖ్యం. ఈ లేఖలోని ముఖ్య అంశము, బోధన లేదా సందేశం: “క్రీస్తు శాస్త్రము.”

8.2. గ్రంథకర్త

లేఖలో చెప్పబడి నట్లుగా, పౌలు గ్రంథకర్తయని తెలియు చున్నది (1:1, 1:23, 4:18). కాని వాస్తవానికి, అసలు గ్రంథకర్త వేరొకరు అయి ఉండవచ్చు. ఈ వాదనకు కారణాలు, ఈ లేఖలో మనము గమనించే పౌలేతర భాష, అనుకరణ, దైవీక భావనలు లేదా వాదనలు, అలాగే ‘క్రీస్తు శాస్త్రము’లోను (1:15-20, 29:10) మరియు శ్రీసభ గురించిన బోధనలలో వ్యత్యాసం ఉండటం (ఇక్కడ, “క్రీస్తు శిరస్సు”, 1 కొరి. 12:12-27, రోమీ. 12:4-5లో “క్రీస్తు శరీరము”).

ఈ లేఖను పౌలు వ్రాసినట్లయితే, ఎఫెసు నగరము నుండి క్రీ.శ. 60వ సంవత్సరములో వ్రాసి యుండవచ్చు. ఒకవేళ వేరొకరు (పౌలు అనుచరుడు) వ్రాసినట్లయితే, క్రీ.శ. 64-65లో కాని లేదా 80లలో వ్రాయబడి యుండవచ్చు.

8.3. కొలొస్సి పట్టణం

ప్రస్తుతం టర్కీ దేశములో ఉన్నది. ఇది ఆసియా మైనరు లికుసు అనే నది తీరం ఎగువ భాగంలో ఉంటుంది. ఎఫెసు పట్టణానికి 150 కి.మీ. దూరములో ఉంటుంది. ఉన్ని వస్త్రాలకు ప్రసిద్ధి. క్రీ.శ. 60-61లో జరిగిన ఘోర భూకంపములో కొలొస్సి పట్టణం ధ్వంసమైనది. పట్టణ శిధిలాలను 1835వ సంవత్సర తవ్వకాలలో కనుగొన్నారు.

పౌలు కొలొస్సి పట్టణాన్ని సందర్శించలేదు (కొలొస్సీ. 2:1) మరియు క్రైస్తవ సంఘమును స్థాపించ లేదు. పౌలు ఎఫెసు నగరములో సువార్తా ప్రచారం చేయుచుండగా (క్రీ.శ. 52-55), తన సహచరుడైన ఎపఫ్రా (కొలొస్సీ. 1:7-8, 4:12,13) ద్వారా కొలొస్సి ప్రజలు సువార్తను విన్నారు. కనుక ఎపఫ్రా సువార్తా పరిచర్య ద్వారా, కొలొస్సి పట్టణములో క్రైస్తవ సంఘము ఏర్పాటు చేయబడినది.

ఎపఫ్రా కొలొస్సీయుడు, పౌలు అనుచరుడు (4:12-13, ఫిలే. 1:23). ఇతడు ఎఫెసు నగరమును సందర్శించినపుడు, పౌలు ద్వారా క్రైస్తవుడిగా మారియుండవచ్చు (చూడుము. అ.కా. 19:8-10). ఆ తరువాత ఎపఫ్రా కొలొస్సీలోనున్న అన్యులను క్రైస్తవులుగా మార్చాడు (1:7). ఇచ్చటి క్రైస్తవ సంఘములో ఎక్కువ శాతం అన్య-క్రైస్తవులే (కొలొస్సీ. 1:21,27, 2:13). అచ్చట యూదులు కూడా ఉండిరి (కొలొస్సీ. 3:11, ఎఫెసీ. 1:12-13, 2:1-3, 11-22).

కొలొస్సీ క్రైస్తవులను ఎప్పుడూ చూడనప్పటికిని, పౌలు తన బాధ్యతగా ఈ లేఖను వ్రాసియున్నాడు (కొలొస్సీ. 1:9,24, 2:1-2). ఫిలేమోను మరియు ఒనేసిము కూడా కొలొస్సీ పట్టణ వాస్తవ్యులే (4:9). ఫిలేమోను గృహము వద్ద క్రైస్తవ సంఘము ప్రార్ధనకు, ఆరాధనకు సమావేశ మయ్యెడిది (ఫిలే. 1:2).

8.4. లేఖ వ్రాయు సందర్భము

ఎఫెసు నగరములో చెరలో నున్న పౌలును ఎపఫ్రా సందర్శించాడు. లికుసు ప్రాంతములో నున్న క్రైస్తవ సంఘముల అభివృద్ధిని ఎపఫ్రా పౌలుకు తెలియజేయు చున్నాడు. ఎపఫ్రా పౌలును సందర్శించుటకు ముఖ్య కారణం కొలొస్సీనున్న అబద్ధపు బోధకుల విషయములో పౌలు సలహాను కోరుటకు వచ్చాడు. ఈ అత్యవసర పరిస్థితిలో పౌలు కొలొస్సీయులకు ఈ లేఖను వ్రాసియున్నాడు:

- కొలొస్సీయుల విశ్వాసమును ప్రోత్సహించుటకు (1:3,14, 2:2-3)
- అబద్ధపు ప్రచారకులను, వారి బోధనలను ఎదుర్కొని సరిచేయుటకు (2:4,8,16,18-22)
- దేవదూతల (ఆరాధన) గూర్చిన తప్పుడు బోధనను సరిచేయుటకు (2:18)
- ఎపఫ్రాకు అపోస్తోలిక అధికారమును ఒసగుటకు

పౌలు ఈ లేఖను వ్రాసియున్నాడు.

No comments:

Post a Comment