యేసు మృత్యుంజయుడు (ఉత్థాన పండుగ)


యేసు మృత్యుంజయుడు

ప్రియ సహోదరీ, సహోదరులారా! మీ అందరికి ప్రభువు ఉత్థాన మహోత్సవ శుభాకాంక్షలు!
క్రీస్తు ఉత్థాన (ఈస్టర్) పండుగ మనందరికీ, ఆనందకరమైన, సంతోషకరమైన, ఆశీర్వాదకరమైన మహోత్సవం. ఇది అన్ని పండుగలలో కెల్ల గొప్ప పండుగ. ఈ పండుగను మనం అర్ధవంతముగా జరుపుకొనని యెడల, మనం కొనియాడే మిగతా పండుగలన్నీ కూడా వృధాయే! ఎందుకన, ఈరోజు మనం దేవుని కృపలోనికి తిరిగి పునరుద్దరింప బడినాము. ఈరోజు ప్రభువు మరణపు సంకెళ్ళను తెంచి ఈ లోకానికి వెలుగును, జీవమును ఒసగిన రోజు! మరణించిన యేసు పునరుత్థానమైన రోజు! అందుకే ఈరోజు, దేవుని చేత ఎన్నుకొనబడిన ఆశీర్వాదకరమైన రోజు ఈ ఈస్టర్ రోజు!

మనం ప్రభువును ఎక్కడ వెదుకుచున్నాము? ఖాళీ సమాధిలోనా? సువార్తలో వింటున్నట్లుగా స్త్రీలు సమాధిని చూచుటకై వచ్చిరి, కాని వారికి ఖాళీ సమాధి కనబడెను. “భయపడకుడు. మీరు సిలువ వేయబడిన యేసును వెదుకుచున్నారు. ఆయన ఇక్కడ లేడు తాను చెప్పినట్లు సమాధినుండి లేచెను. ఆయన మృతులలో నుండి లేచెనని శిష్యులకు తెలుపుడు” (మత్త. 28: 5-7) అని దూత వారికి చెప్పెను. ప్రభువునకు సమాధి అవసరము లేదు, ఎందుకన ఆయన మృత్యుంజయుడు. ఆ సమాధి ఆయనది కూడా కాదు, తన శిష్యుడు, ధనికుడు అయిన అరిమత్తయియవాసి యోసేపు సమాధి! సమాధి ప్రభువును కలిగియుండలేక పోయింది, ఎందుకన, ఆయన పునరుత్థానమై బయటకు వచ్చెను. మార్గమధ్యలో ఆ స్త్రీలకు ఉత్థాన క్రీస్తు దర్శనమిచ్చెను. “మీకు శుభము. భయపడవలదు. మీరు వెళ్లి, నా సోదరులతో గలిలీయకు పోవలయునని చెప్పుడు. వారచట నన్ను చూడగలరు” (మత్త. 28:9-10)అని వారితో చెప్పెను.

ప్రభువును ఎక్కడ వెదుకుచున్నావు? ఖాళీ సమాధిలోనా! ఉత్థాన క్రీస్తును వెదకవలసినది ‘నీలో’నే! ఆయన నీలోనే కొలువై యున్నాడు. ఉత్థాన ఆనందము, సంతోషము, ఆశీర్వాదము మనలోనే ఉన్నది. సువార్తానందము మనలోనే ఉన్నది. ఆ ఆనందాన్ని, సంతోషాన్ని, ఆశీర్వాదాన్ని ఇతరులతో పంచుకోవాలి. ఇతరులకు ప్రకటించాలి.

ఈరోజు, మరణం జీవానికి గుర్తుగా మారింది! సిలువ లేనిది కిరీటం లేదు, మరణం లేనిది జీవం లేదు, నిరాశ లేనిది ఆశ లేదు, చీకటి లేనిది వెలుగు లేదు. అందుకే ఈ రోజు వెలుగు “క్రీస్తు జ్యోతి” పండుగగా కొనియాడు చున్నాము. “నేనే వెలుగు” అని క్రీస్తు పలికిన పలుకులే ఈరోజు పండుగ సారాంశం!

ఈరోజు మనం కొనియాడే పండుగలో, నాలుగు ముఖ్యమైన అంశాలు ఉన్నాయి: అగ్ని/వెలుగు, నీరు, దైవవాక్కు మరియు రొట్టె. వీటిని ధ్యానించుదాం!

1. అగ్ని/వెలుగు: ఈస్టర్ జాగరణ సాంగ్యాన్ని నూతన అగ్నితో ప్రారంభిస్తాము. ఆ అగ్నినుండి ఈస్టర్ క్రొవ్విత్తిని వెలిగిస్తాము. ఈ ఈస్టర్ క్రొవ్విత్తిని ఉత్థాన ప్రభువును సూచిస్తుంది. “లోకమునకు వెలుగును నేనే. నన్ను అనుసరించు వాడు అంధకారమున నడువక జీవపు వెలుగును పొందును” అని యేసు చెప్పి యున్నాడు. అందుకే ఈస్టర్ క్రొవ్విత్తి నుండి వెలుగును మన క్రొవ్వొత్తులను వెలుగించు కుంటాము. అనగా, క్రీస్తు మన జీవితాలను ప్రకాశింప జేయుచున్నాడు. క్రీస్తు వెలుగును మనం పొందు తున్నాము. “మీరు లోకమునకు వెలుగై యున్నారు” అని ప్రభువు శిష్యులతో చెప్పి యున్నాడు. మన వెలుగు క్రీస్తు నుండి వచ్చును, మన జీవితం క్రీస్తు నుండి వచ్చును. క్రీస్తు ఈ వెలుగును తన మరణ-పునరుత్థానాల ద్వారా కొనివచ్చెను.
- వెలుగు (క్రీస్తు) మన హృదయాలను, జీవితాలను ప్రకాశింప జేయును, వెలుగింప జేయును, జ్ఞానోదయం కలుగ జేయును. మనలోనున్న అంధకారమును తొలగించును. మనలో నున్న అజ్ఞానమును తీసివేయును. దేవుడు మనలను తన రూపములో, పోలికలో సృష్టించాడు. అదే దేవుడు మనలను తన వారిగా పిలుచు కున్నాడు. ఈలోకము మనలను ఎన్నుకొన లేదు, పిలువలేదు. దేవుడు తన కుమారుడైన యేసు ప్రభువు ద్వారా ఎన్నుకున్నాడు, పిలుచు కున్నాడు. క్రీస్తు జ్యోతి వలన, మనం అసత్యము నుండి సత్యమునకు, అధకారము నుండి వెలుగునకు, మరణము నుండి జీవమునకు నడిపింప బడినాము.
- వెలుగు (క్రీస్తు) విశ్వాసానికి, నమ్మకానికి సూచన. చీకటి అంటే మనందరికి భయం. అందుకే దీపాలను వెలిగిస్తాము. యేసు మనదరికి నిజమైన వెలుగు. ఆయన మనకు ధైర్యాన్ని, నమ్మకాన్ని ఇస్తాడు. వెలుగుగా ఆయనే మన మార్గ చూపరి. ఆయననే మనం అనుసరించుదాం. ఆయన ఎప్పటికి మనలను అంధకారము లోనికి త్రోసి వేయడు. ఆయనే మన వెలుగు, నమ్మకము.
- వెలుగు (క్రీస్తు) ఆనందానికి సూచన. “ప్రభువు నందు ఎల్లప్పుడును ఆనందింపుడు. మరల చెప్పు చున్నాను. ఆనందింపుడు!” (ఫిలిప్పీ. 4:4) అని పౌలుగారు చెప్పియున్నారు. యేసు ప్రభువే మన ఆనందం, సంతోషం. ఈలోకం మనకు ఏవిధముగను ఆనందాన్ని, సంతోషాన్ని ఇవ్వలేదు. డబ్బు, పదవి, ప్రతిష్ట, గొప్పతనం, అధికారం ... ఏదీ కూడా సంతోషాన్ని ఇవ్వలేవు. నిత్యమైన, నిజమైన ఆనందమును యేసు ప్రభువు మాత్రమే ఇవ్వగలడు. “మీ హృదయములు సంతోషించును. మీ సంతోషమును మీ నుండి ఎవడును తీసివేయడు” (యోహాను 16:22) అని ప్రభువు చెప్పి యున్నారు.

2. నీరు: రోమీయులకు వ్రాసిన పత్రిక 6:3-11లో జ్ఞానస్నానము గురించి వింటున్నాము. “మనము అందరమూ క్రీస్తు యేసు నందు జ్ఞానస్నానము పొందితిమి. ఆయనతో సమాధి చేయబడి ఆయన మరణమున పాలు పంచుకొంటిమి. తద్వారా, ఒక క్రొత్త జీవితమును గడుపుచున్నాము. మనలో పాత స్వభావము, పాపము నశించినది.” మన జ్ఞానస్నానము ద్వారా, మనము రక్షింప బడినాము మరియు రూపాంతరము చెందినాము. యిస్రాయేలు బానిసత్వము నుండి వాగ్ధత్త భూమికి ఎర్ర సముద్రము గుండా నడిపింప బడినారు. అలాగే ఈరోజు మనము క్రీస్తు మరణము, ఉత్థానము ద్వారా స్వతంత్రము లోనికి నడిపింప బడుచున్నాము. మనము ఇక పాపమునకు బానిసలము కాము. క్రీస్తు నందు మనము స్వతంత్రులము. పాపమునకు మరణించి క్రీస్తుతో సజీవులము అయ్యాము.
- నీరు శుభ్రపరచే స్వభావము కలది. మనము నీటితో చేతులను శుభ్ర పరచు కుంటాము. నిత్య జీవజలమైన క్రీస్తు మనలను పవిత్ర పరచును. మన జ్ఞానస్నానమందు మనము పవిత్ర పరచ బడినాము. ఆదిపాపము మనలో నుండి తీసివేయ బడినది.
- నీరు మన దాహమును తీర్చును. దాహము గొన్నప్పుడు, ఏయితర పానీయాలు మన దాహాన్ని తీర్చలేవు. ఒక్క గ్లాసు మంచి నీరు కోసం చూస్తూ ఉంటాము. ఈరోజు మనం దేనికోసం ‘దాహం’ కలిగి యున్నాము? డబ్బు, అధికారం, పదవి కోసమా? ఇవి ఏవియు కూడా మన దాహాన్ని తీర్చలేవు. ఎప్పుడైతే ప్రభువు కోసం దాహమును కలిగి ఉంటామో, ఆయన మన దాహాన్ని తీరుస్తాడు. కనుక ఈ లోక ఆశల వెంబడి, శోధనల వెంబడి పరుగులు తీయక ప్రభువు కోసం పరుగులు తీద్దాం.
-నీరు తాజాదనమును ఇచ్చును. పూలు వాడిపోకూడదని వాటిపై నీళ్ళను చల్లుచూ ఉంటారు. నీరు ఆ పూవులను తాజాదనముగా ఉంచుతాయి. యేసు ప్రభువు మన జీవితాలను తాజాదనముగా ఉంచును. ఆధ్యాత్మికముగా, బుద్ధివికాసములో, మానసికంగా, భౌతికముగా అన్ని విధాలా ప్రభువు మనలను తాజాదనముగా, తేజోవంతముగా చేయును.
- నీరు ఏ ఆకారమునైనా తీసుకొనును. నీటిని ఏ పాత్రలో పోస్తే ఆ పాత్ర ఆకారములో ఇమిడి పోతుంది. నీటికి సులువుగా ఇమిడిపోయే స్వభావం ఉన్నది. అలాగే, ప్రభువు ఈ లోకములోనికి వచ్చి, ఒక్క పాపము విషయములో తప్ప, అన్నీ విషయాలలో మానవ స్వభావాన్ని కలిగి జీవించాడు. ఆయన ఇమ్మానుయేలు, మనతో ఉన్నాడు. మనము కూడా మనతో, ఇతరులతో ఇమిడిపోయే, వారితో కలిసిపోయే, సర్దుబాటు స్వభావాన్ని కలిగి యుండాలి.

3. దైవ వాక్కు: ఇది దేవుని శక్తి. మనం దేవుని వాక్కుకు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వటం లేదని అంటూ ఉంటారు. కాని అది అవాస్తవం. వాస్తవం ఏమిటంటే, మనము ఏ కార్యము చేసినను దేవుని వాక్కుతోనే ప్రారంభిస్తాము. వాక్కు లేనిచో మన జీవితాలు శూన్యమే! దైవ వాక్కు, మనలను మార్చును, నడిపించును, రక్షణ ఒసగును. దైవ వాక్కు మనకు బలల్మును, ధైర్యమును ఒసగును. “భూమ్యాకాశములు గతించి పోవును. కాని నా మాటలు ఎన్నటికిని గతించి పోవు” (లూకా 21:33) అను ప్రభువు పలికి యున్నారు. మన ప్రతీ సమస్యకు పరిష్కారం బైబులులో దొరుకుతుంది. నమ్ముదాం! విశ్వసించుదాం! బైబులు గ్రంథ పుటలను తిరగ వేద్దాం. దేవుని వాక్కును చదివి, ధ్యానించి, మన జీవితాలకు అన్వయించు కుందాం! దేవుని వాక్కును గౌరవించుదాం. దైవ వాక్కు అనగా స్వయాన క్రీస్తు ప్రభువే! “ఆ వాక్కు మానవుడై మనమధ్య నివసించెను” (యోహాను 1:14).

4. రొట్టె: ప్రతీ రోజు మనం దివ్య పూజా బలిలో పాల్గొను చున్నాము. కాని, ఈరోజు, దివ్యపూజాబలి ప్రత్య్కమైనది. ఈరోజు రొట్టె విరవడం చాలా అర్ధవంత మైనది. శిష్యులు ఎమ్మావు గ్రామమునకు వెళ్ళుచుండగా వారితో కలిసి ప్రయాణం చేయుచున్న ప్రభువును వారు గుర్తించలేక పోయారు. తోటి ప్రయాణికినిగా మాత్రమే భావించారు. కాని ఎమ్మావు గ్రామములో ప్రభువు రొట్టెను తీసుకొని ఆశీర్వదించి, విరచినప్పుడు వారికి కనువిప్పు కలిగినది. వారు యేసును గుర్తించారు (లూకా 24:30-31). ఈనాడు ప్రభువు రొట్టె విరువగనే, శిష్యులలో కనువిప్పు కలిగి ప్రభువును గుర్తించారు. ఈనాడు గురువు దివ్యపూజా బలిలో రొట్టె విరచినప్పుడు, మన కన్నులు, హృదయాలు తెరువబడును. చాలా సార్లు ఈ మహిమను, బహుమానమును గుర్తించలేక పోవుచున్నాము. మన కన్నులను తెరువాలని ప్రార్ధన చేద్దాం. భౌతిమైన చూపు కాదు, ఆధ్యాత్మిక కన్నులను తెరువమని ప్రార్ధన చేద్దాం (not sight to the body, but insight to the soul). అంత:ర్గత / ఆధ్యాత్మిక చూపు సరిగా నున్నప్పుడు, భౌతిక చూపు దానంతట అదే బాగుంటుంది. రొట్టె విరచినప్పుడు, ప్రభువు ఉత్థానమైనాడని గుర్తించుతాము.

ప్రియులారా! ఈ నాలుగు అంశముల ద్వారా ప్రభువు మనతో ఉన్నాడని మనకు తెలియజేయు చున్నాడు. మనం ఏమి చేయాలి? యోహాను వ్రాసిన మొదటి లేఖలో ఇలా చదువు చున్నాము: “ప్రియులారా! మనము ఇప్పుడు దేవుని బిడ్డలమే కాని, ఇక ఏమి కానుంటిమో ఇంకను స్పష్టము కాలేదు. క్రీస్తు దర్శనము ఇచ్చునప్పుడు ఆయన యాదార్ధ రూపమును మనము చూతము. కనుక, ఆయనవలె అగుదుము అని మాత్రము మనకు తెలియును” (3:2). ప్రభువును కలుసు కొనుటకు మనం సిద్ధ పడాలి.అదే మన జీవిత ఆశయం! దేవునకు మనలను అర్పించు కుందాం. క్రైస్తవులుగా, ఆనందదాయకమైన వారిగా ఉందాం. ఉత్థాన క్రీస్తు మనలను ఆశీర్వదించును గాక!

1 comment: