పాస్కా రెండవ ఆదివారము - దివ్యకారుణ్య ఆదివారము (19.4.2020)


పాస్కా రెండవ ఆదివారము - దివ్యకారుణ్య ఆదివారము (19.4.2020)
ప్రియ క్రైస్తవ సహోదరీ/సహోదరా!  నీవు నీ జీవితములో ఆందోళన, భయం, నిరర్థత మరియు గందరగోళం అనే నిరాశాభావ సంధిగ్థ పరిస్థితులను ఏప్పుడైనా ఎదుర్కొని యున్నావా? వీటి కారణమున అవిశ్వాసం మరియు అనుమానలలో పడియున్నావా? ఇటువంటి ఒక పరిస్థితి ప్రతి ఒక్కరి జీవితంలో పలువిధములుగా,  పలుసమయములలో తలెత్తుతూ ఉంటుంది; అనగా అది ఆధ్యాత్మిక, సాంఘికకుటుంబ, మానసిక పరంగా కావచ్చు. అయితే ఈనాటి పఠనములను దానికి చక్కని సమాధానమును ఇస్తున్నాయి.

శిష్యుల భయాందోళన
"యూదుల భయముచే శిష్యులు తాము కూడిన ఇంటిలో తలుపులు మూసికుని ఉండిరి'' (యోహాను 20:19). ఈ వచనములో క్రీస్తు శిష్యుల యొక్క భయమును, ఆందోళనను, నిరాశను మనం చూస్తూ ఉన్నాము. మూడు సంవత్సరములుగా ఆయనతోపాటు తిరుగుతూ, ఆయన చేసిన అద్భుతకార్యములను చూసిన వీరు ఆయన చనిపోయి, సమాధి చేయబడిన తరువాత భయాందోళనతో బిక్కుబిక్కుమంటూ తలుపులు మూసికొని ఉండిరి. తమ గురువు, బోధకుడు, నాయకుడు లేని పరిస్థితి. ఆయనను వలె  యూదులు  తమనుకూడా చంపుతారేమో అని భయముతో దాక్కొని ఉండిరి. అనుమానం, భయం, అవిశ్వాసం, ఇవే వారి ఆలోచనలలో, మాటలలో తలెత్తిన అంశములు.

క్రీస్తు సాన్నిథ్యం/ ప్రత్యక్షం
వారు ఇటువంటి ఒక క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు  యేసు క్రీస్తు ప్రభువు ప్రత్యక్ష మవుచున్నారు.  చీకటిని జయించి, మూసిన తలుపులు మూసినట్లు ఉండగనే వారందరి నిరాశా భావములను పటాపంచలు చేయుటకు ఆయన తన ఉత్థాన శరీరముతో, గాయపడిన దేహము యొక్క గుర్తులతో వారి మధ్యలోనికి ప్రవేశించియున్నారు. అశాంతిలో ఉన్న వారి మనసులను, మూసియున్న వారి చీకటి గదిని శాంతితో నింపుటకు ఆయన వచ్చియున్నాడు. "... మీకు శాంతి కలుగును గాక!" (యోహాను 20:19). ఆయన భయముతో ఉన్న వారి హృదయములను ధైర్యముతో నింపుటకు వచ్చియున్నాడు. వారికి పవిత్రాత్మను ఒసగియున్నాడు. అలాగే  తోమాసు గారు, 'తక్కిన శిష్యులంతా ఆయనను చూచు భాగ్యమును పొందియున్నారు, నేను కూడా చూడాలి, ఆయనను తాకాలి' అని 'విశ్వాస - అవిశ్వాస' అయోమయ స్థితిలో ఉన్నపుడు క్రీస్తు మరలా తోమాసు కొరకు వచ్చియున్నాడు (యోహాను 20:26).

శిష్యుల ధైర్యం-సాక్ష్యం
ఎపుడైతే శిష్యులు తమ గురువు, బోధకుడు, నాయకుడు, దైవకుమారుడైన యేసును మరల చూసారో, ఆయన వారికిచ్చిన పవిత్రాత్మ శక్తితో ప్రభావితులై  భయభ్రాంతులైనవారు ధైర్యవంతులుగా మారి సువిశేష ప్రకటనపై మూసిన తలుపులను తెరిచియున్నారు. మరణమునకు కూడా భయపడకుండా బయటకు వచ్చి క్రీస్తు సజీవుడై లేచి ఉన్నాడని సాక్ష్యం చెప్పటానికి బయటకు వస్తూ ఉన్నారు. చివరికి వారిలో పెక్కుమంది సువిశేష హతసాక్షులుగా మారియున్నారు. ఇదిగో వారు ఆనాడు ధైర్యముతో పలికిన సాక్ష్యం యొక్క ఫలితమే ఈనాటి మన యొక్క క్రైస్తవ జీవితము, ఈ తిరుసభ యొక్క మనుగడ.

దివ్య కారుణ్యము
ఈనాడు మన తల్లి తిరుసభ "దివ్యకారుణ్య ఆదివారము"ను  కొనియాడమని మనల ఆహ్వానించుచున్నది. ఎందరో గాయములను స్వస్థపరచిన క్రీస్తు ఉత్థానమైనప్పుడు తన గాయముల మచ్చలతో అనగా మేకులు తన శరీరములో చేసిన రంధ్రములతో ఎందుకు ప్రత్యక్షమయ్యాడు? తన శిష్యులకు వాటిని ఎందుకు చూపించాడుఅంతట ఆయన వారికి తన చేతులను, ప్రక్కను చూపగ, వారు ప్రభువును చూచి ఆనందించిరి (యోహాను 20:20, 27). ఎందుకంటే ఆ గాయముల ద్వారా మాత్రమే లోకపాపం పరిహరించబడింది, మనకు జీవం అనుగ్రహించబడింది, మోక్షం తెరువబడింది. అవే మన రక్షణ కొరకు చెల్లించబడిన ఖరీదు యొక్క చిహ్నములు (యోహాను 3:16).

ఆరంభంలో మనం ధ్యానించినట్లు మన జీవితంలో కూడా ఎన్నోసార్లు ఇటువంటి ఆందోళనకర, భయంతో కూడిన పరిస్థితులు వస్తూ ఉంటాయి. జీవితం అంటే ఏంటో అర్థం కాని పరిస్థితులలో మనము కొన్నిసార్లు సంధిగ్థమై పోతూ ఉంటాము. ఇటువంటి సమయములలో అవిశ్వాసమనే కారుమబ్బులచేత కప్పబడి మండే సూర్యునికంటే ఉన్నతుడైన సర్వేశ్వరుని చూడలేని లేక గుర్తించలేని పరిస్థితులలో పడిపోతుంటాము. ఆయన శక్తి వలననే మనము మనగలుగు చున్నామని, అపోస్తలులకు పవిత్రాత్మ శక్తిని ఒసగి బలపరచిన  ఆయన మనకునూ అలాగే ఒసగుతాడని మరచిపోతుంటాము.   

నిన్ను సృష్టించిన వాడు నిన్ను దీవించడా! కరుణగల దేవుడు, మానవ రక్షణార్థం గాయపరచబడి, చీలలచేత కొట్టబడి, తన ప్రాణమునర్పించిన దేవుడు నిన్ను విడిచి పోతాడా?

కనుక కరుణగల మన దేవుని మీద అపార విశ్వాసముతో మన సమస్త స్థితిగతులలో ఆయన చెంతకు ఆనందముతో, ఆశాభావముతో అరుదెంచుదాం, దీవెనలు పొందుకుందాం! (ఫాదర్. జాన్ పాల్, కపూచిన్, జర్మని).

No comments:

Post a Comment