మంగళవార్త మహోత్సవము

మంగళవార్త మహోత్సవము

పతనమైన మానవాళిని రక్షించి, తిరిగి మోక్షద్వారం విప్పి, దైవ ప్రణాళిక చొప్పున తన బిడ్డలైన మానవులను తన చెంతకు చేర్చుకొనే నిమిత్తం, ప్రవక్తలు పలికిన పలుకు నెరవేర్చుటకు భగవంతుడు పూనుకొన్నారు. సమయం వచ్చినప్పుడు దేవుడు గబ్రియేలు దూతను గలిలయలోని నజరేతు గ్రామంలో వసిస్తున్న మరియ వద్దకు పంపారు.

మరియ నిష్కళంక మైనదిగా జన్మపాపం సోకని పవిత్రురాలుగా దేవుడు ముందుగానే ఏర్పరచుకున్నారు. మంచి పనికి మంచి మార్గమును ఎన్నుకోవడం దేవుని నైజం. గబ్రియేలు, ‘‘అనుగ్రహ పరిపూర్ణురాలా! నీకు శుభము. ఏలినవారు నీతో ఉన్నారు. ఇదిగో! నీవు గర్భము ధరించి కుమారుని కనెదవు. పవిత్రాత్మ నీపై వేంచేయును. సర్వోన్నత శక్తి నిన్ను ఆవహించును’’ అని మంగళవార్త వినిపించి మరియ సందేహాన్ని తీర్చాడు (లూకా 1:26-38).

అందుకు మరియ, ‘‘ఇదిగో! ఏలినవారి దాసిరాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక!’’ అని ప్రభువు చిత్తాన్ని విధేయించింది. తననుతాను దేవునికి అంకితం చేసుకుంది. ఆ క్షణమే క్రీస్తు శకానికి శుభారంభమైనది. ఆక్షణమే ఆమె దేవునికి తల్లి అయినది. మొదటి క్రైస్తవురాలిగా ఆవిర్భవించినది.

ఇదంతా దేవుని ప్రేమకు నిదర్శనం. పునీత బెర్నార్డు గారు, ‘‘దేవుడు మానవాళికి అనుగ్రహించిన అత్యన్నత స్థానం మరియను తన తల్లిగా ఎంపిక చేసుకోవడమే’’ అని చెప్పారు. వేదపండితుడైన ఆల్బర్టు ఘనుడు, ‘‘మరియ దేవుని తల్లి కాకపోయినచో ప్రభువుతో ఐఖ్యమై ఉండేది కాదు’’ అని నుడివారు.

మరియమ్మ ఒకసారి పునీత జెత్రుతమ్మకు కలలో కనిపించి, ‘‘ఇదిగో! ఏలినవారి దాసిరాను అని నేను చెప్పినప్పుడు నేనెంతో ఆనందించాను. నేను దేవుని తల్లియని నా పేరిట వేడుకున్న ప్రతీ ఒక్కరికి అదే ఆనందాన్ని పంచుతాను’’ అని వాగ్దానం చేసారు. మరియ అనగా ‘ఏలినవారు’, ‘యజమానురాలు’, ‘సర్వోత్క్రుష్ట స్త్రీ’ అని అర్ధం.

ధ్యానాంశం: యేసు తాను ఏమీ లేని వానిగా రిక్తుని చేసుకున్నాడు. అదృష్యుడైన ప్రభువు సాదృశ్యుడయ్యాడు. సమస్తమునకు సృష్టికర్త అయి ఉండికూడా సామాన్య నరుడయ్యాడు. దైవమై యుండి కూడా సేవక రూపం దాల్చాడు (పునీత లియో).

ప్రతి రోజూ మరియమ్మ సంరక్షణ అందుతూనే ఉంటుంది. మనం ఆమె బిడ్డలముగా ఉండేందుకు ఆశించినంత కాలం ఆమె ఎంతో ఆతురతగా మన గురించి ఎదురు చూస్తుంది (పునీత విన్సెంట్‌ దె పాల్‌).

No comments:

Post a Comment