మంగళవార్త పండుగ (25 మార్చి)
యెషయ7:10-14; 8:10; హెబ్రీ 10:4-10; లూకా 1:26-38
లోకానికే శుభము జరిగిన, ఒక గొప్ప శుభ సందేశ పండుగను, జ్ఞాపకం చేసుకుంటూ, ఈనాడు యావత్ శ్రీసభ, శుభసందేశ పండుగను లేదా మంగళవార్త మహోత్సవమును జరుపుకుంటుంది. క్రైస్తవ విశ్వాసంలో అత్యంత ముఖ్యమైన వేడుకలలో ఒకటి. మంగళవార్త మహోత్సవం యొక్క ప్రధాన సందేశం దేవుని ప్రేమ మరియు మానవజాతికి దేవుడు అందించిన రక్షణ. యేసుక్రీస్తు జననం ద్వారా, దేవుడు తన కుమారుడిని లోకానికి పంపి, మన పాపాల నుండి మనల్ని రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడని నిరూపించాడు. ఈ మహోత్సవమును జరుపుకుంటున్న మనమందరమూ, “దేవునికి అసాధ్యమైనది ఏదియునూ లేదు” అని గ్రహించి దృఢముగా విశ్వసించాలి. ఈ మంగళవార్త మహోత్సవం సందర్భంగా, మనమందరం దేవుని ప్రేమను, దేవుని రక్షణను గుర్తుంచుకోవాలి. మనం దేవునకు కృతజ్ఞతలు తెలుపుతూ, దేవుని బోధనలను నిత్యమూ అనుసరించాలి. నేటి మొదటి పఠనము యెషయా గ్రంథం 7:10-14 వచనాలు యేసుక్రీస్తు జననానికి సంబంధించిన ముఖ్యమైన ప్రవచనాన్ని కలిగి యున్నాయి. ఈ ప్రవచనం మంగళవార్త మహోత్సవం యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడంలో సహాయపడుతుంది. యెషయా 7:14 లో, ప్రవక్త ఒక కన్యక గర్భవతియై కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును అని ప్రవచించాడు. ‘ఇమ్మానుయేలు’ అనగా ‘దేవుడు మనతో ఉన్నాడు’ అని అర్ధము. ఈ ప్రవచనం యేసుక్రీస్తు జననాన్ని సూచిస్తుంది. యేసుక్రీస్తు కన్యక అయిన మరియద్వారా జన్మించాడు, మరియు యేసుక్రీస్తుద్వారా దేవుడు మానవాళితోనున్నాడు. యెషయా 8:10లో, ‘దేవుడు మనతో ఉన్నాడు’ అనే మాట మళ్ళీ వస్తుంది. ఇది దేవుడు తన ప్రజలతో ఎల్లప్పుడూ ఉంటాడని మరియు వారికి సహాయం చేస్తాడని తెలియజేస్తుంది.
నేటి రెండవ పఠనము హెబ్రీయులకు వ్రాసిన లేఖ 10:4-10 వచనాలు యేసుక్రీస్తు బలియాగం యొక్క ప్రాముఖ్యత గురించి మాట్లాడుతాయి. ఇది మంగళవార్త మహోత్సవం యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడంలో సహాయపడుతుంది. హెబ్రీయులకు 10:4 లో, “ఎద్దుల మేకల రక్తము ఏనాటికి పాపములను తొలగింపలేదు” అని వ్రాయబడింది. ఇది పాత నిబంధనలో అర్పించబడిన జంతుబలులు పాపాలను పూర్తిగా తొలగించలేవని చూపిస్తుంది. హెబ్రీయులకు 10:5-7 లో, యేసుక్రీస్తు లోకానికి వచ్చినప్పుడు, ఆయన దేవుని చిత్తాన్ని చేయడానికి వచ్చాడని వ్రాయబడింది. ఆయన జంతుబలికి బదులుగా తననుతాను బలిగా అర్పించడానికి వచ్చాడు. హెబ్రీయులకు 10:10 లో, యేసుక్రీస్తు ఒకే ఒక శరీర బల్యర్పణ చేత మనమందరమును, పాపములనుండి శాశ్వతముగ పవిత్రులుగ చేయబడితిమి” అని వ్రాయబడింది. ఇది యేసుక్రీస్తు బలియాగం మన పాపాలకు శాశ్వతమైన పరిష్కారాన్ని అందిస్తుందని చూపిస్తుంది. ఈ వచనాలు యేసుక్రీస్తు జననం మరియు బలియాగం దేవుని ప్రణాళికలో ఒక భాగమని మరియు ఇది మానవాళికి రక్షణను అందించడానికి ఉద్దేశించబడిందని చూపిస్తున్నాయి. ఈ వచనాలు మంగళవార్త మహోత్సవం యొక్క ప్రాముఖ్యతను మరియు యేసుక్రీస్తు జననం మరియు బలియాగం యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడానికి సహాయపడతాయి.
ఇశ్రాయేలు ప్రజలు మెస్సయా కోసం ఎదురు చూస్తున్నారు. ఆయన వస్తాడని, తమను రక్షిస్తాడని వారు ఆశించారు. క్రీస్తు వచ్చినప్పుడు లోకరక్షకుడు ఆయనేనని గుర్తించ లేకపోయారు. విశ్వసించ లేకపోయారు. “దేవునికి సంబంధించిన వాడు దేవుని మాటను ఆకించును” (యోహాను 8:47). ఇప్పుడు, పతనమైన మానవాళిని రక్షించి, తిరిగి మోక్షద్వారం విప్పి, దైవప్రణాళిక చొప్పున తన బిడ్డలమైన నరులను తన చెంతకు చేర్చుకొనే నిమిత్తం. వేదాలలో ప్రవక్తలు పల్కిన పలుకులు నెరవేర్చుటకు యావే ప్రభువు పూనుకున్నారు. సమయం పరిపక్వం కాగా తదుపరి ఆరవ మాసమున దేవుడు దావీదు వంశస్తుడగు యోసేపునకు ప్రధానము చేయబడిన గలిలయ సీమలోని నజరేతు గ్రామంలో నివసిస్తున్న మరియ అనబడు కన్యక వద్దకు తన దేవదూతను పంపించారు. మరియమ్మ నిష్కళంకమైనదిగా, జన్మపాపము సోకని పవిత్రగా దేవుడు ముందుగానే ఏర్పరచుకున్నారు. మంచి పనికి మంచి మార్గం ఎన్నుకోవడం దేవుని నైజం. గాబ్రియేలు మరియచెంత వినమ్రతతో దర్శనమై “అనుగ్రహ పరిపూర్ణురాలా! నీకు శుభము. దేవుడు నీకు తోడైయున్నాడు” అన్న మాటతో మరియ పరవశించినది. సాక్ష్యాత్తు దేవుడే తన దూతద్వారా వర్తమానం పంపడం ఆమె పవిత్రతకు, సౌశీల్యతకు తార్కాణం.
కాని, అంతలో, “నీవు గర్భము ధరించి ఒక కుమారుని కనెదవు” అని అన్నప్పుడు ఆమె కలవర పడినది. ఆ శుభ వచనం ఏమిటోయని ఆలోచించు చుండగా, దేవదూత, “మరియమ్మా! నీవు భయపడకుము. నీవు దేవుని అనుగ్రహమును పొందియున్నావు. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కనెదవు. ఆ శిశువునకు ‘యేసు’ అని పేరు పెట్టుము. ఆయన మహనీయుడై, మహోన్నతుని కుమారుడని పిలువ బడును. ప్రభువగు దేవుడు తండ్రియైన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును. ఆయన ద్వారా యాకోబు వంశీయులను పరిపాలించును. ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు” అనెను.
అంతట మరియమ్మ “నేను పురుషున్ని ఎరుగను కదా! ఇది ఎట్లు సాధ్యమగును?” అని దూతను ప్రశ్నించినది. అందుకు ఆ దూత ఇట్లనెను, “పవిత్రాత్మ నీపై వేంచేయును. సర్వోన్నతుని శక్తి నిన్నావరించును. అందుచేత, ఆ పవిత్ర శిశువు ‘దేవుని కుమారుడు’ అని పిలువ బడును” అని అనెను.
అందుకు మరియమ్మ ఇలా జవాబిచ్చినది, “ఇదిగో ప్రభువు దాసిరాలను. నీ మాట చొప్పున నాకు జరుగునుగాక!” అని ప్రభువునకు విధేయించినది. తననుతాను దేవునికి పునరంకితం చేసుకున్నది. ఆ క్షణమే క్రీస్తు శకానికి శుభారంభం అయినది. విర్రవీగే సాతానుకు విరుగుడు మందు వేసాడు ప్రభువు. నిజమైన దేవుడుగా నిజమైన నరుడుగా దైవరాజ్యం అయిన ప్రభువు నవమాసాల్లో తొలిక్షణం మరియ పరిశుద్ధ గర్భంలో అంకురించాడు. ఆ క్షణమే ఆమె దేవుని తల్లిగా మారినది. మొదటి క్రైస్తవురాలిగా ఆవిర్భవించినది.
మరియతల్లి దేవదూత మాటకు, “అట్లే అగునుగాక!” అంటూ ధీశాలిగా నిలబడినది. ఆమె సహృదయం, ఉదారస్వభావం, త్యాగమయ జీవితములో దేవాధి దేవుడు తనతో వాసమై, అంచెలంచెలుగా ఎదిగి విశ్వజ్యోతిగా ఈలోకములో ఉదయించ డానికి తన సంపూర్ణ సహకారాన్ని అందించినది.
ఆమె జీవితం పవిత్రతకు నిలయం. తత్ఫలితముగానే తాను తండ్రికి ప్రియమైన బిడ్డగా కుమారునికి తల్లిగా, పరిశుద్ధాత్మ పత్నిగా ఎంపిక చేయబడినది. వినయ విధేయతలకు ఆదర్శం ఆమె అనుదిన జీవితం. తండ్రి ఆజ్ఞకు లోబడి, కుమారుడిని సహితం త్యాగం చేయడానికి సిద్ధపడినది. ప్రభువు పడే శ్రమను చూస్తూ ఊరకుండి పోయినది. ఆమె ఔదార్యం, వినయం ఎంతో శ్లాఘనీయమైనది. రక్షణ చరిత్రలో తనవంతు పాత్ర సంపూర్ణముగా నిర్వహించినది. మరియ మనందరి అమ్మ. అమ్మను ఆశ్రయిద్దాం. దీవెను పొందుదాం.
ఇదంతా దేవుని అపారమైన ప్రేమకు, కరుణకు, తార్కాణం. అందుకే పునీత బెర్నర్దీను గారు ఇలా అన్నారు, “దేవుడు మానవాళికి అనుగ్రహించిన అత్యన్నత స్థానం, మరియను తన తల్లిగా ఎంపిక చేసుకోవడమే”. వేద పండితుడు అయిన పునీత ఆల్బర్టు ఘనుడు ఇలా అన్నారు, “మరియ దేవుని తల్లి కాకపోయినచో ప్రభువుతో ఐఖ్యమై ఉండేది కాదు”.
మరియమాత ఒకసారి పునీత జెత్రూతమ్మకు కలలో కనిపించి, “ఇదిగో! ప్రభువు దాసిరాలను అని నేను చెప్పినప్పుడు నేనెంతో ఆనందించాను. నేను దేవుని తల్లినని నా పేరిట వేడుకున్న ప్రతి ఒక్కరికి అదే ఆనందాన్ని పంచుతాను” అని వాగ్దానం చేసినది.
మన జీవితాలలో కూడా, ఇది జరగదేమో అని సందేహిస్తున్నప్పుడు,మనోవ్యధ,దిగులుతో మనము సంకోచిస్తున్నప్పుడు, నలిగిపోతున్నప్పుడు, ఆందోళనకు గురియవుతున్నప్పుడు, మనము దేవుని యందు విశ్వాసము ఉంచాలి. ప్రభువు ఏది చేసినా, మన మంచికే చేస్తారు అనే ఒక దృఢ నమ్మకం మనలో ఉండాలి. దేవుడు సమస్త పీడలనుండి ఒక గొప్ప మహాకార్యమును చేసి నన్ను విడిపించగలడు అనే గొప్ప విశ్వాసము మనలో ఉండాలి. క్రీస్తు ప్రభువును కన్యమరియమ్మ గర్భమున జన్మింప చేయడానికి కూడా, అదే కదా కారణం. మనల్ని బంధకాల నుండి విడిపించడానికి, నరకమున నశించి పోకుండా, పాపక్షమాపణను కలుగజేసి, నిత్యజీవములో నిత్యము జీవింపజేయడానికి. ఇదంతా తండ్రి దేవుడు తన ఏకైక కుమారుడైన క్రీస్తు ప్రభునితో, ఈ భూమి యందు జన్మింప చేసి, సామాన్య మానవునిగా జీవింపజేసి, సిలువ మరణం పొందుకొని, తర్వాత ఉత్థానమై తండ్రి కుడిపార్శ్వమున సింహాసనమున అధిష్టించి, మనకు తీర్పు చెప్పుటకు, ఈ కార్యము చేయించారు. అటువంటి శుభసందేశ పండగను, మంగళవార్త మహోత్సవమును మనం జరుపుకోవడం, నిజంగా మనము ఎంతో భాగ్యవంతులము!
ఈ శుభసందేశ పండుగ నుండి మనం, ఈ సందేశాన్ని నేర్చుకోవాలి: దేవుని కార్యములకు, మనం తలవంచాలి. ఆయన కార్యాలు నెరవేర్చడానికి ఎన్ని శ్రమల అయినా భరించాలి. దేవునికి దాసులమైపోవాలి, అప్పుడే దేవుని కృప మనపై ఉంటుంది. యేసు ఇమ్మానువేలుయై, మన రక్షణ కొరకు తన ప్రణాళికను నెరవేర్చారు. మనతో ఉన్నారు. మనకు రక్షణ తెచ్చారు. అదేవిధముగా మనము కూడా, దేవుడు మనకు ఇచ్చిన జీవితాలను, ఆయన ప్రణాళికను బట్టే, సంపూర్ణం చేద్దాం! విచ్చలవిడిగా జీవించడానికి కాదు ఈ జన్మ ఎత్తినది. ఆయనకు దాసుడనై, దాసురాలనై, ఆయన ప్రణాళికను నెరవేర్చడానికే కదా నేను జన్మించినది అనే ఆలోచన క్రీస్తును విశ్వసించే ప్రతి విశ్వాసికి ఉండాలి. బాధ్యత కలిగి జీవించాలి.
ఈనాడు మరియమాతను మనం గౌరవిస్తున్నాము. ఆమె దేవుని యెడల చూపిన అపారమైన విశ్వాసమును ఆమె భక్తిని, ఆమె వినయవిధేయతలను మనమూ స్వీకరించాలి. మన ఆపరాధములను గూర్చి, మనం ఆత్మ పరిశీలన చేసుకొని, ఈ శుభసందేశ పండుగ రోజున, మనమూ మారుమనస్సు పొందుకుందాం! దేవుని చిత్తాన్ని మనం స్వచ్ఛంగా, హృదయపూర్వకముగా స్వీకరిద్దాం! అందుకే ఈ సృష్టిలో నేను జన్మించాను అనే, ఒక గొప్ప ఆలోచనతో, దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ, దేవునికి దాసులమై జీవించడానికి, ఎన్నిప్రయాసలు ఐనా, పడుతూనే దేవుని చిత్తాన్ని, మనవంతు మనం నెరవేర్చుదాం. మరియమ్మవలె, మనము కూడా దేవుని చిత్తాన్ని అంగీకరించి, స్వీకరించి, నెరవేర్చుదాం.
No comments:
Post a Comment