తపస్కాలము

తపస్కాలము

    ఓ సర్వేశ్వరా! మమ్మందరిని కరుణించుము. మీరు సృజించిన దానిలో దేనిని మీరు ద్వేషించరు. పశ్చాత్తాపము చూపినపుడు మానవుల పాపములను క్షమించి వారిని విముక్తులను చేసి, మీరు సర్వాధికారియగు దేవుడనని వెల్లడి చేసికొంటిరి.

    తపస్కాలము ఉత్థాన మహోత్సవమునకు 40 దినాల ఆయత్తము. తపస్కాలము విభూతి పండుగతో ప్రారంభమవుతుంది. ఈ సంవత్సరము 6 మార్చి విభూతి పండుగతో ప్రారంభమై 13 ఏప్రిల్‌తో ముగుస్తుంది. ఈ కాలములో యేసు ప్రభువుతో ఎడారిలో ప్రయాణము చేస్తూ ఆయన జీవితము, త్యాగము, మరణము, సమాధి మరియు ఉత్థానము గూర్చి ధ్యానిస్తూ ఉంటాము.

    తపస్కాలము, క్రైస్తవ జీవిత పరమ రహస్యాన్ని (ప్రేమ) ధ్యానించుటకు మనము పొందిన మరో గొప్ప అవకాశము. దైవవాక్కు, దివ్యసంస్కారము సహాయముతో, మన విశ్వాస యాత్రను పునర్మించుటకు మరో చక్కటి అవకాశం. తపస్కాల యాత్ర ప్రార్ధన, ఉపవాసం మరియు దానధర్మముతో కూడి ఉంటుంది.

    తపస్కాలము, పశ్చాత్తాపము, మారు మనస్సు పొందు సమయము. మారు మనస్సు అనగా, మన ఆలోచనను, కార్యాలను దైవచిత్తముతో ఏకమై ఉండటము. మన జీవితములో దేవునికి, ఆయన చిత్తానికి ప్రధమ స్థానాన్ని ఇవ్వటం. దానికోసం సమస్తాన్ని త్యాగం చేయడానికి సంసిద్ద పడటము.

    మనము స్వార్ధముతో అన్నీ మన స్వాధీనములో ఉండాలని కోరుకుంటాం. ఇతరుపై అధికారాన్ని చేలాయించాలని చూస్తూ ఉంటాం. ఆధ్యాత్మిక విషయాలను మరచి, లోకాశలకు లోనై జీవిస్తూ ఉంటాం. పేరు ప్రతిష్టకోసం, ధనంకోసం, పలుకుబడికోసం, అధికారంకోసం జీవిస్తూ ఉంటాం. స్వార్ధముతో, మోహపు తలంపులతో, అన్యాయపు ఆలోచనలతో, ఇతరులను భ్రష్టుపరచాలనే ఉద్దేశముతో జీవిస్తూ ఉంటాము. వీటన్నింటితో, దేవునికి, ఇతరులకు చివరికి మనకు మనం ఏమివ్వగలుగుతున్నాం? వీటితో మనం ఎలాంటి సమాజాన్ని నిర్మించాలని కోరుకుంటున్నాం?

    దైవకుమారుడైన క్రీస్తు వీటన్నింటినుండి మనలను విముక్తులను చేయుటకు, మనమధ్యలోనికి వచ్చాడు. మనలో  సహోదరభావాన్ని పెంపొందించుటకు, అందరు కలిసి మెలిసి జీవించునటుల చేయుటకు, మనలో ప్రేమను నింపుటకు ఆయన మనను నడిపిస్తూ ఉన్నాడు. విబేధాలు లేకుండా, అందరూ సమానులే అన్న భావన మనలో కలుగ జేస్తున్నాడు. మరియు దేవుడు అందరికీ తండ్రీ అని నేర్పిస్తున్నాడు.

    ‘‘మనము ఒకరికి ఒకరము సహాయపడుచు ప్రేమను ప్రదర్శించి, మేలుచేయుటకు పరస్పరము ప్రేరేపించుకొనుటకు దారులు కనుగొందము’’ (హెబ్రీ 10:24). దీనికి తపస్కాము ఓ మంచి దారియే కదా!

    ఒకరికి ఒకరము సహాయ పడుదాం. తోటి వారి పట్ల బాధ్యత కలిగి జీవించుదాం. ముందుగా, మన హృదయాలను యేసు వైపునకు త్రిప్పాలి. ‘‘దేవునిచే పంపబడిన యేసును చూడుడు’’ (హెబ్రీ 3:1). ప్రభువునుండి పొందే శక్తితో, తోటివారిని చూడగలం. వారిపట్ల బాధ్యతగా ఉండగలం. జక్కయ్య అన్యాయముగా తోటివారిని మోసంచేస్తూ ధనం కూడబెడుతూ జీవించేవాడు. కాని, ప్రభువును చూసిన తర్వాత తన జీవితములో మార్పు కలిగింది. మారుమనస్సు పొందాడు. చేసిన పాపాలకు పశ్చాత్తాప పడ్డాడు. అన్యాయముగా మోసంచేసిన తోటివారికి వారి ధనాన్ని తిరిగి ఎక్కువగా ఇచ్చేసాడు. తన జీవితములో, మొట్టమొదటిసారిగా, సంతోషమును, ఆనందమును అనుభవించాడు. తను కూడా దేవుని కుమారుడేనని గుర్తించాడు. తను కూడా, సహోదరులో ఒక సహోదరుడని గుర్తించాడు. దేవున్ని చూసి, మారుమనస్సు పొందిన హృదయం దేవునితో, తనతో మరియు ఇతరుతో సఖ్యతలో, సహవాసములో జీవించును. ‘‘ఎవరికిని ఏమియును బాకీపడి ఉండకుడు. మీకు ఉండవసిన ఒకేఒక అప్పు అన్యోన్యముగా ప్రేమించుకొనుటయే’’ (రోమీ 13:8).

    తోటివారికి మేలు చేద్దాం. తోటివారిపై తీర్పుచేయక, వారిని భ్రష్టుపరచక, పరస్పర ప్రేమకలిగి జీవించుదాం. ‘‘సమాధానమును, పరస్పర క్షేమాభివృద్ధిని కలుగజేయు విషయమునే ఆసక్తితో అనుసరించుదము’’ (రోమీ 14:19).

    తపస్కాము, ప్రాయశ్చిత్తము, ధ్యానము, ఉపవాసముతో కూడినటువంటిది. ఈ తపస్కాలములో, మన జీవితములో మార్పు కోసం ఆశిద్దాం. దానికై కృషి చేద్దాం. విభూతి పండుగ రోజున, మనం స్వీకరించే విభూతి దేవునిపై మన సంపూర్ణ ఆధారమును, దేవుని దయ, క్షమను సూచిస్తుంది. ‘సిలువ మార్గము’ పవిత్రాత్మచే ఏర్పాటు చేయబడిన గొప్ప మార్గము. దీనిద్వారా, క్రీస్తు శ్రమను ధ్యానిస్తూ, ఆయన శ్రమలో భాగస్తుమవుతున్నాము.

విభూతి పండుగ
    ‘‘నీవు మట్టి నుండి పుట్టితివి కాన చివరకు మట్టిలోనే కసి పోవుదువు’’ (ఆ.కాం. 3:19). విభూతిని వాడే ఆచారం, పాతనిబంధన కాలము నుండియే ఉన్నది. విభూతి దు:ఖమును, మరణమును, ప్రాయశ్చిత్తమునకు చిహ్నం. అహష్వేరోషు రాజు యూదును కుట్రపన్ని చంపడానికి రాజశాసనమును చేసాడని విని, మొర్దేకయి ‘‘సంతాపముతో బట్టలు చించుకొనెను. గోనె తాల్చి తలమీద బూడిద చల్లుకొని పరితాపముతో పెద్దగా ఏడ్చెను’’ (ఎస్తేరు 4:1). యోబు తాను పలికిన పలుకులకు సిగ్గుపడి ‘‘దుమ్ము బూడిద పైనచల్లుకొని పశ్చాత్తాప పడెను’’ (యోబు 42:6). ఇజ్రాయేలు ప్రజలు బాబిలోను బానిసత్వమును గూర్చి ప్రవచిస్తూ దానియేలు ఇలా పలికాడు, ‘‘నేను ప్రభువునకు భక్తితో ప్రార్ధన చేయుచు అతనికి మనవి చేసికొని ఉపవాసముండి గోనె తాల్చి బూడిదలో కూర్చుంటిని’’ (దానియేు 9:3). యేసు ప్రభువు కూడా, విభూతిని గూర్చి సూచించాడు, ‘‘మీయందు చేయబడిన అద్భుత కార్యము, తూరు సీదోను పట్టణములో జరిగియుండినచో, ఆ పుర జనులెపుడో గోనెపట్టలు కప్పుకొని, బూడిద పూసికొని హృదయ పరివర్తనము పొంది యుండెడివారే’’ (మత్త 11:21).

    శ్రీసభ ఈ ఆచారాన్ని తపస్కాల ఆరంభానికి, ప్రాయశ్చిత్తానికి గురుతుగా తీసుకొనియున్నది. తపస్కాములో మన మరణముగూర్చి తలంచి, పాపాలకు దు:ఖపడుతూ ఉంటాము. గురువు విభూతిని ఆశీర్వదించి విశ్వాసుల నుదిటిపై శిలువ గురుతు వేస్తూ, ‘‘ఓ మానవుడా! నీవు ధూళి నుండి పుట్టితివనియు, తిరుగ ధూళిగ మారిపోవుదవనియు స్మరించుకొనుము’’ లేక ‘‘పశ్చాత్తాపపడి క్రీస్తు సువిశేషమును నమ్ముకొనుము’’ అని చెప్పును.

    విభూతి యొక్క తాత్పర్యం, ‘పశ్చాత్తాపపడి పాపాలకు ప్రాయశ్చిత్త పడటము’. మన రక్షణార్ధమై శ్రమనుపొంది, మరణించి, ఉత్థానుడయిన ప్రభువునకు మన హృదయాను అర్పించి మారుమనస్సు పొందటము. మన జ్ఞానస్నాన వాగ్దానాలను తిరిగి చేయడం. క్రీస్తులో పాత జీవితమునకు మరణించి, నూతన జీవితమునకు ఉత్థానమవడము. భూలోకములోనే, దైవరాజ్యమును జీవించుటకు ప్రయాసపడి, పరలోకములో దాని పరిపూర్ణతకై ఎదురు చూడటము.

    నినేవే వాసులు గోనెపట్టలు, బూడిదతో పశ్చాత్తాపపడిన విధముగా, మనము కూడా విభూతిని మన నుదిటిపై ధరించి మన పాపాలకోసం, చెడు జీవితముకోసం పశ్చాత్తాప పడుచున్నాము. ఈ లోక జీవితము శాశ్వతము కాదని గుర్తుకు చేసుకొంటున్నాము. మన హృదయాను అణకువపరచు కొంటున్నాము.

ప్రార్ధన, ఉపవాసము, దానధర్మము
    ప్రార్ధన, ఉపవాసము, దానధర్మము తపస్కాలములో ముఖ్యమైన మూడు స్తంభాల వంటివి. మన ప్రాయశ్చిత్తమునకు, పశ్చాత్తాపమునకు, జ్ఞానస్నాన వాగ్దానముకు విశ్వాస జీవితాన్ని పునర్మించుటకు ఎంతగానో తోడ్పడతాయి.

ప్రార్ధన: 
    తపస్కాలములో ఎక్కువ సమయాన్ని ప్రార్ధనలో గడపాలి. అది ప్రభువునకు మనను దగ్గరగా చేస్తుంది. మన జ్ఞానస్నాన ప్రమాణాలను జీవించుటకు కావసిన శక్తికోసం ప్రార్ధన చేయాలి. ఉత్థాన పండుగ దినమున జ్ఞానస్నానము పొందువారి కొరకు ప్రార్ధన చేయాలి. పాపసంకీర్తనము చేయు వారికొరకు ప్రార్ధన చేయాలి.

ఉపవాసము:
    ఉపవాసము పవిత్రమైన కార్యము. ఉపవాసము కేవలం ఇంద్రియ నిగ్రహము కోల్పోకుండా ఉండుటకు మాత్రమేగాక, ప్రార్ధన చేయుటకు సహాయపడును. శారీరక ఆకలి, మన ఆధ్యాత్మిక ఆకలిని గుర్తు చేస్తుంది. అయితే, దేవునికి ఇష్టమైన ఉపవాసము ఇదే: ‘‘నేను ఇష్టపడు ఉపవాసమిది. మీరు అన్యాయపు బంధములను విప్పుడు. ఇతరుల మెడమీదికి ఎత్తిన కాడిని తొగింపుడు. పీడితును విడిపింపుడు. వారిని ఎట్టి బాధకును గురిచేయకుడు. మీ భోజనమును ఆకలిగొనిన వారికి వడ్డింపుడు. ఇల్లు వాకిలి లేనివారికి ఆశ్రయమిండు. బట్టలు లేనివారికి దుస్తులిండు. మీ బంధువులకు సహాయము నిరాకరింపకుడు (యెష 58:6-7).

మన ఉపవాసము వలన, మన సమాజములో ఎంతోమంది పేదరికము వలన రోజూ ఉపవాసము ఉంటున్నారని గుర్తించుదాం. సమానత్వము కొరకు, అందరూ క్షేమముగా ఉండటానికి కృషి చేద్దాం.

దానధర్మము: 
    దానధర్మాలు తోటి వారిపట్ల మనకున్న బాధ్యతను గుర్తుచేస్తుంది. దేవుడు మనకు ఇచ్చిన వరములకు కృతజ్ఞతు తెలుపుకోవాలి. అవసరములో నున్నవారికి సహాయం చేయాలి, దానధర్మము చేస్తూనే, మన సమాజములో నీతి, న్యాయ స్థాపనకు కృషి చేయాలి.

సిలువ మార్గము
    తపస్కాములో ‘సిలువ మార్గము’నకు ప్రత్యేక స్థానము ఉన్నది. తపస్కాములో మనం ముఖ్యముగా క్రీస్తు శ్రమను, మరణము గూర్చి ధ్యానిస్తూ ఉంటాము. సిలువ మార్గము ద్వారా, క్రీస్తు శ్రమలో మనమూ పాలుపంచుకొనాలి. సిలువ మార్గము, క్రీస్తు శ్రమలను పొందిన విధముగా, దేవునకు విశ్వాసపాత్రులుగా ఉండాలంటే, మనము కూడా శ్రమలను పొందాని గుర్తు చేస్తూ ఉంటుంది.

No comments:

Post a Comment