గుడలూప్ మరియ మాత (12 డిశంబర్)

గుడలూప్ మరియ మాత (12 డిశంబర్)


క్రీ.శ. 1531 డిసెంబరు 9న అనగా మెక్సికోను స్పానిషు వారు ఆక్రమించుకొని అప్పటికి సరిగ్గా 10 సం.లు నిండాయి. మెక్సికో నగరానికి కొన్ని మైళ్ళ దూరంలోగల ఒక పేటలో జ్వాన్‌డిగో అను ఒక పేద సామాన్య రెడ్‌ ఇండియన్‌ ఉండేవాడు. వారు కతోలిక మతంలోనికి మారి కేవలం ఒక తరం గడిచింది. ఒకరోజు అతడు మెక్సికో నగరంలోగల ఒక దేవాలయంలో దివ్యపూజా బలిలో పాల్గొని ఉపదేశికి ఇవ్వబడే సూచనలు తెలుసుకోవడానికి బీడుభూమి మార్గాన నడచుకొంటూ బయలు దేరాడు. మార్గ మధ్యలో టెపెయక్‌పేరుతో ఒక చిన్న కొండ ఉన్నది. అది కేవలం మెక్సికోకు మూడు మైళ్ళ దూరంలో   ఉన్నది. ఆ చిన్న కొండ దగ్గరకు రాగానే జ్వాన్‌డిగోకు పరిశుద్ధ దేవమాత దర్శనమయ్యారు. తాను నిలబడిన చోట తన పేరిట ఒక పవిత్ర దేవాలయం నిర్మింపబడాలని కోరుకొనుచున్నానని పలికి అదృశ్యమయ్యారు.

జ్వాన్‌డిగో ఆశ్చర్యకరమైన ఆనందముతో స్థానిక బిషప్‌ జుమర్రా గారికి ఈ విషయమును తెలియ జేశాడు. ఏదైనా నిదర్శనం ఉంటే తప్ప తాను నమ్మజాలనని వారు పలికారు. మరో మూడు రోజులైనాక డిసెంబరు 12  జ్వాన్‌డిగోకు దేవమాత రెండవమారు దర్శన మయ్యారు. అతని వద్ద ఉన్న దుప్పటిలాంటి ముతక వస్త్రాన్ని పరిపించుకొని దానిపై రోజా పుష్పాలను ఆ మరియ తల్లి పేర్చారు. పిమ్మట అంతర్ధాన మయ్యారు.

దుప్పటిని పూలతో సహా తీసుకొని పోయి జ్వాన్‌డిగో స్థానిక బిషప్‌ గారికి ప్రదర్శించారు. వారు ఆ దుప్పటి వస్త్రంపై పరిశీలనగా చూడగా గుడాలుప్‌ మరియమాత బొమ్మ విస్పష్టంగా గోచరించింది. ఇది నిజంగా అద్భుతమేనని నమ్మారు. బిషప్‌ జుమర్రా గారు టెపెయక్‌కొండపై గుడాలుప్‌ మరియమాత బృహద్దేవాలయాన్ని (బసిలికా) నిర్మింప జేశారు. ఇది క్రీ.శ. 1709లో ప్రారంభింప బడినది. మరియ తల్లి బొమ్మ అద్భుతంగా అచ్చుకాబడిన ఆ దుప్పటి వస్త్రాన్ని ఆ దేవాలయంలోనే భక్తుల సందర్శనార్ధం ప్రదర్శింప బడినది.

ప్రపంచంలో దేవమాత పుణ్యక్షేత్రాలలో ఇది కూడా గొప్పదిగా పేర్కొన బడుతుంది. మెక్సికో ప్రజలు దీనిని తమ జాతీయ సంపదగా గౌరవిస్తారు.

No comments:

Post a Comment