పునీత అంద్రెయ, అపోస్తలుడు (30 నవంబర్)

పునీత అంద్రెయ, అపోస్తలుడు (30 నవంబర్)

రోమీ. 10:9-18; మత్తయి 4:18-22 

"మీరు నన్ను అనుసరింపుడు. మిమ్ము మనుష్యులను పట్టువారినిగా చేసెదను" (మత్తయి 4:19).

అంద్రెయ ‘‘సీమోను పేతురు సోదరుడు’’ అని సువార్తలో పేర్కొనబడినది. మొత్తం పన్నెండు సార్లు వీరి పేరు ప్రస్తావించబడినది. అంద్రెయ యేసు అపోస్తలుడు. యోహాను తన సువార్తలో మొదటి అధ్యాయంలో ఆంద్రెయ తొలుత బప్తిస్త యోహాను అనుచరుడని, ఆ తరువాత తనంతట తానే యేసును వెతుక్కొంటూ వచ్చారని వ్రాశారు. అతను యేసును విశ్వసించాడు, శిష్యుడయ్యాడు. సోదరుడైన పేతురుతో చెప్పగానే పరుగుపరుగున యేసు చెంతకు వెళతారు (యోహాను 1:35-41). మత్తయి, మార్కు ప్రకారం పేతురు, యాకోబు, యోహానులతో పాటు ఆంద్రెయకూడా గలిలీయ సముద్రంలో చేపలు పడుతూ ఉండగా, యేసు అద్భుతం వలన, వారికి వలలు చినిగి పోయేలా చేపలు పడతాయి. ఈ సందర్భంలోనే వారిని తన శిష్యులుగా చేరమని యేసు ఆహ్వానించినట్లు ఉన్నది. శిష్యగణంలో ఆంద్రెయ ప్రథముడే అయినా అపోస్తలుల పేర్లు ప్రస్తావనలో నాలుగవదిగా ఉంటుంది.

యేసు కొండమీద ప్రసంగం సందర్భంలో స్త్రీలు, పిల్లలు కాక ఐదువేల మంది పురుషులతో ఉన్న వారు ఆకలి గొన్నప్పుడు, వారికి ఆహారము పెట్టమని యేసు శిష్యులను కోరినప్పుడు, యేసు అద్భుత శక్తిపై నమ్మకమున్న అంద్రెయ జనం మధ్యకు వెళ్లి అయిదు రొట్టెలను రెండు చేపలను తీసుకొని యేసు ముందుకు వచ్చాడు. యేసు వాటిని వృద్ధిచేసి అచటి ప్రజలందరికి ఆహారం పెట్టియున్నాడు. ఈవిధంగా అంద్రెయ ఇంత గొప్ప అద్భుతానికి కారకుడయ్యాడు (యోహాను 6:13).

యేసును నిర్భంధించి సిలువ వేయడానికి ముందుగా యేసుతో మాట్లాడాలని కొందరు గ్రీకులు వచ్చి ఫిలిప్పును అభ్యర్ధించారు. యేసు రక్షణకార్యం ఇశ్రాయెలీయులకేనా, అన్యజాతులకు ఉందా? అని అడుగుటకు వచ్చిరి. ఫిలిప్పు సంకోచిస్తుండగా అంద్రెయ గ్రీకులను యేసు వద్దకు కొనిపోయి యేసు నోటిద్వారానే దేవుని సేవించిన వారందరికీ రక్షణ ఉందని చెప్పబడే గొప్ప మాటకు ప్రధాన కారణం అంద్రెయ కావడం విశేషం (యోహాను 12:26). అంద్రెయ లోకాంత్యం గురించి యేసును అడిగిన వారిలో ఒకరని, క్రీస్తు మోక్షారోహణం పిమ్మట అపోస్తలులతోను, మరియ తల్లితోను ‘‘పైన గది’’లో, పెంతకోస్తు రోజున ఉన్నారని లూకా తన సువార్తలో తెలిపాడు.

అంద్రెయ, పేతురు ఇరువురు సోదరులు. వీరు యూద జాతి వారు. వీరి జన్మ స్థలం బెత్సయిదా. తండ్రి పేరు యోనా. తల్లి పేరు యోవాన్నా. అంద్రెయ అనే గ్రీకు పేరుకు ‘ధైర్యం’, ‘వీరోచితం’ అని అర్ధం. వీరిది కొద్దిపాటి చుదువే. కలిసి చేపలు పట్టేవారు. సువార్తా ప్రచారానికి వెళ్ళేవరకు అంద్రెయ పేతురు ఇంట్లోనే ఉండి జీవించినట్లు చరిత్ర చెబుతుంది. అంద్రెయ బ్రహ్మచారి. ఆరోజుల్లో అవివాహిగా ఉండటం గొప్ప విశేషంగా భావింపబడేది.

అంద్రెయ దయార్ద్ర హృదయుడు, సున్నిత స్వభావుడు, అపోహలు గిట్టనివాడు, స్నేహశీలి, సులభ సాధ్యుడు, నమ్మకపాత్రుడు. అంద్రెయకు దురాశా స్వభావం లేదు, దౌర్జన్యతత్వం లేదు, అసంతృప్తి లేదు. పెత్తనం చెలాయించాలన్న ధ్యాస అసలే లేదు. క్రీస్తుపట్ల భక్తి, సువార్తా ప్రచారం అందరికీ చేరాలన్నదే ఆయన కోరిక.

యేసు పునరుత్థానం తర్వాత అంద్రెయగారు పశ్చిమ ఆసియా మైనరు (టర్కీ) ప్రాంతంలో సువార్త భోదించారు. నీరో చక్రవర్తి కాలంలో వేదసాక్షి మరణం పొందారు. సుమారు క్రీ.శ. 70లో పత్రస్‌ అనుచోట సిలువ మరణం పొందారు. అతను తాళ్ళతో బంధించబడి సిలువ వేయబడ్డారు.

అంద్రెయ భౌతిక కాయాన్ని కాన్‌స్టాంట్‌ నోపిల్‌ పట్టణానికి తరలించి అక్కడ అపోస్తలుల దేవాలయంలో ఉన్న పునీత తిమోతి, పునీత లూకాగార్ల సమాధుల ప్రక్కన ఖననం చేశారు. క్రీ.శ. 1210లో వీరి అస్థికల్ని దక్షిణ ఇటలీకి తరలించారు. నేటికి అక్కడ వీరిని విశ్వాసులు భక్తితో ప్రార్ధిస్తున్నారు.

"సువార్తను ప్రకటించువారి పాదములు ఎంత సుందరమైనవి!" (రోమీ 10:15).

No comments:

Post a Comment