30వ సామాన్య ఆదివారము, YEAR C

30వ సామాన్య ఆదివారము, YEAR C
సీరా. 35:15-17, 20-22; 2 తిమో. 4:6-8, 16-18; లూకా. 18:9-14

వ్యాపార ప్రపంచంలో పోటీతత్వం ఉంటుంది, ఇది సహజం. దీనిని మనం టీవిలో చూస్తున్నాము, వింటున్నాము, పేపర్లలో చదువుతున్నాము. ఆకట్టుకునే ప్రకటనలతో వినియోగ దారులను ఆకర్షించుటకు ఎన్నో రకాలుగా, విధాలుగా విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇతర వస్తువులతో పోల్చుతూ ఎవరికివారు, వారి ఉత్పత్తియే ఉత్తమ మైనదని, గొప్పగా చూపించుకోవడానికి ప్రచారం చేస్తూ ఉంటారు. ఈ పోలిక అక్కడ వినియోగదారులను ఆకర్షించడానికి పనికొస్తుంది. పోటీతత్వం మంచేదే కాని, అది ఇతరులను నాశనం చేస్తుందని గుర్తించాలి.

అయితే, ఆధ్యాత్మిక జీవితంలో ఈ ‘పోటీ’ లేదా ‘పోల్చుకోవడం’ అనేది పూర్తిగా విరుద్ధమైనది. దేవుని దృష్టిలో ప్రతి ఆత్మ విలువైంది, ప్రత్యేకమైనది. ఒక వ్యక్తి ఇతరుతో పోల్చుకున్నపుడు, ఆ వ్యక్తి ఉత్తమం కాలేడు. తననుతాను ఇతరుతో పోల్చుకుంటూ, ‘నాకు శత్రువులు ఎవరు లేరు, నేను ఎవరిని నాశనం చేయడం లేదుచాలా వినయంతో ఉన్నాను, ఎలాంటి తప్పు చేయడం లేదు’ అని చెప్పుకునేవాడు అహంకారిగర్విష్టి అని చెప్పవచ్చు. ఎప్పుడు విమర్శించేవాడు సమస్యకు ప్రత్యామ్నాయ పరిష్కారాన్ని ఆలోచించలేడు. ఎప్పుడు తానే ఒప్పు అని ఇతరులకు చూపించుకొంటూ ఉంటాడు. కనుక ఆధ్యాత్మిక జీవితంలో లేదా దేవున్ని విశ్వసించేవారు పోటీపోల్చుట అను పదాలకు తావు ఇవ్వకూడదు. ఆధ్యాత్మిక జీవితంలో అవసరమైనది: ‘‘నేనే ఘోరపాపిని’’ అంటూ వినయం కలిగి జీవించాలి.

కనుక, ప్రియ సహోదరీ సహోదరులారా! దేవుడు మనల్ని ఒకరితో ఒకరిని పోల్చి తీర్పు చెప్పరు. ఆయన ప్రతి ఒక్కరినీ వారి హృదయాన్ని, ప్రయత్నాన్ని బట్టి చూస్తారు. ఆధ్యాత్మికంగా మనం ఎవరితోనూ పోటీ పడాల్సిన అవసరం లేదు. మన నిజమైన యుద్ధం కేవలం మన సొంత అహంకారం, స్వార్థంతో మాత్రమే!

నేటి సువార్త (లూకా 18:9-14) పరిసయ్యుడికి, సుంకరికి మధ్య ఉన్న వైరుధ్యాన్ని స్పష్టంగా చూపుతుంది. పరిసయ్యుడు తననుతాను పొగడుకొను చున్నాడు. అందరిలోకెల్ల, తానే నీతిమంతుడని, మంచివాడని భావించాడు. ధర్మశాస్త్రాన్ని అక్షరాలా పాటించాడు. “వారానికి రెండుసార్లు ఉపవాస ముందుననినా ఆదాయం అంతటిలో పదియవ వంతు చెల్లించుచున్నాను” అని తననితాను ప్రచారం చేసుకున్నాడు. ఇవన్నీ మంచి క్రియలే. కానీ, ఇతరులతో పోల్చుకుంటూ, తన భక్తిని దేవుడికి వినిపించడం ద్వారా తన క్రియల ప్రయోజనాన్ని కోల్పోయాడు. “ఇతరువలె లోభినిఅన్యాయము చేయువాడనువ్యభిచారిని కాను. ఈ సుంకరి వంటి వాడను కాను” అని సుంకరితో, ఇతరులతో తననుతాను పోల్చుకున్నాడు. పరిసయ్యుడి ప్రార్థనలో “ఓ దేవా” కంటే, “నేను” అనే మాటకే ఎక్కువ ప్రాధాన్యత ఉంది. అతడికి కావలసింది క్షమాపణ కాదు, మెచ్చుకోలు.
కాని సుంకరి సమాజంలో అసహ్యించుకోబడిన వ్యక్తి. అతడు పాపి అని మనకు తెలుసు. సుంకరి దూరంగా నిలువబడి కన్నులనైనను పైకెత్తుటకు సాహసింపక, రొమ్ము బాదుకొనుచు, “ఓ దేవా! ఈ పాపాత్ముని కనికరింపుము” అని ప్రార్ధించాడు. ఈ ప్రార్ధన నిజమైన పశ్చాత్తాపం నుండి వచ్చింది. సుంకరికి తెలుసు, దేవుని దయ తప్ప తనను ఏదీ రక్షించలేదు అని. “ఇద్దరిలో దేవుని ఎదుట నీతిమంతునిగ పరిగణింపబడి, ఇంటికి వెళ్ళినది సుంకరియే” అని ప్రభువు చెప్పియున్నారు. ఎందుకంటే, “తనను తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడును; తనను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును” (లూకా 18:14).

పరిసయ్యుడు ధర్మశాస్త్రమును తు.చ. తప్పక పాటించాడు. కాకపోతే, గర్విష్టి, అహంభావి, స్వార్ధపరుడు. అతనిలో వినయము అసలు లేదు. సుంకరి పాపాత్ముడే, దుష్టకార్యాలు చేసేవాడే, కాని, వినయంతో, దేవుని ఎదుట తన పాపాన్ని ఒప్పుకున్నాడు. మార్పు చెందుటకు సిద్ధపడ్డాడు. “దేవుడు అహంకారులను ఎదిరించి, వినయశీలురులను కటాక్షించును’’ అని పేతు 5:5లో చదువుచున్నాం! మనం కూడా దేవునితో సఖ్యపడి, క్షమించబడిన వారిగా తిరిగి ఇంటికి వెళ్ళాలంటే, మనలోనున్న స్వార్ధాన్ని, అహంను, గర్వాన్ని తీసేద్దాం. మన పాపాన్ని ఒప్పుకొని, దేవుని దయవైపు చూద్దాం. ఇతరులను నిందించక, వారికి మన వంతు సహాయం అందిద్దాం.

ప్రార్ధించునప్పుడు, సుంకరివలె వినయంతో ప్రార్ధించాలి. వినయం కేవలం ఒక సుగుణం మాత్రమే కాదు, అది ప్రార్థనకు ఆధారం. పరిసయ్యుడు తాను నీతిమంతుడని అనే భావన ఉంది. కనుక, అతడు దేవుడితో మాట్లాడలేదు, కేవలం తన గురించి తాను గొప్పగా చెప్పుకున్నాడు. పునీత అగుస్తీను చెప్పినట్లుగా, దేవుని ఎదుట మనం భిక్షగాళ్ళం. సుంకరి ఆ స్థితిని గుర్తించాడు. అందుకే అతడి ప్రార్థన హృదయాంతరాళము నుండి వచ్చింది. అతడి వినయమే దేవుని కనికరాన్ని ఆకర్షించింది.

మన ప్రార్ధన హృదయాంతరాళము నుండి రావాలి. ఆత్మయే ఎటుల ప్రార్దించాలో మనకు నేర్పును అని రోమీ 8:26లో చదువుచున్నాం! మన ప్రార్ధన మన దేవునికి అర్పించే గొప్ప అర్పణ. వినయంతో చేసే మన ప్రార్ధన దేవునికి మహిమనువైభవమును చేకూర్చాలి.

నిజమైన ప్రార్థన అనేది దేవునితో కబుర్లు చెప్పడం కాదు, మన అవసరాన్ని, బలహీనతను, దయ కోసం ఆరాటాన్ని ఆయన ముందు అంగీకరించడం. సీరా గ్రంథంలో (మొదటి పఠనం) చెప్పబడినట్లుగా: దీనుల ప్రార్థన మేఘములను చేరును; అది ఆ చోటికి చేరువరకు అతడు ఓదార్పు పొందడు” (సీరా 35:17). దేవుడు నిస్సహాయుల, ఒంటరుల, పేదవారి ప్రార్థనలను వింటాడు (సీరా 35:15-16).

ఈనాటి రెండవ పఠనంలో వినయానికి చక్కటి ఉదాహరణను పౌలుగారిలో చూడవచ్చు. పౌలు ఎప్పుడు కూడా తననుతాను గొప్పలు చెప్పుకోలేదు. 2 తిమో 4:6-8లో పౌలు తన జీవితాన్ని ఒక గొప్ప పోరాటంగా, ఒక పందెంగా వర్ణించాడు: “నేను మంచి పోరాటము పోరాడితిని, నా పరుగును ముగించితిని. విశ్వాసమును నిలుపు కొంటిని.” ఇక్కడ పౌలుగారు తనను తాను గొప్పలు చెప్పుకోవడం లేదు. బదులుగా, ఆయన తన జీవితాన్ని దేవుని సేవకు బలిగా సమర్పించుకున్నాడు (4:6). వేరొక సందర్భంలో, “పాపులలో నేను ప్రధాన పాపిని” అని ఒప్పుకున్నాడు. ఇది నిజమైన వినయం! దేవుని దయ ద్వారానే తాను ఇంతటి వాడినయ్యానని పౌలుగారు నమ్మారు.

మన అనుదిన జీవితంలో కూడా, ఏమి చేయక పోయిన, గొప్పలు చెప్పుకుంటూ ఉంటాము. మనం కూడా కొన్నిసార్లు తెలియకుండానే పరిసయ్యుడిలా ప్రవర్తిస్తాం. మనం చేసే సేవలను, ఇచ్చే విరాళాలను ఇతరులు గుర్తించాలని కోరుకుంటాం; మన ప్రార్థనను లేదా భక్తిని ఇతరులతో పోల్చుతూ ఉంటాం. ఈ ఆదివారం, మన హృదయాలను పరిశీలించుకుందాం. “నేను ఇతరులను తీర్పు తీరుస్తున్నానా, లేక సుంకరిలా దేవుని దయ కోసం ఎదురుచూస్తున్నానా?

మనం చేయవలసినది:
స్వార్థాన్ని, అహాన్ని తీసివేయాలి: పరిసయ్యుడిలా ఇతరులను తీర్పు తీర్చడం మానుకోవాలి. మన దృష్టిని ఇతరుల తప్పుల నుండి మన సొంత బలహీనతలపైకి మళ్లించాలి.
సుంకరిలా ప్రార్థించాలి: “ఓ దేవా, ఈ పాపాత్ముని కనికరింపుము” అని నిజంగా హృదయపూర్వకంగా ప్రార్థించాలి. ఈ వినయమే దేవునితో మనల్ని సఖ్యపరుస్తుంది.
కృతజ్ఞతతో సేవ చేయాలి: మనం ఏ మంచి చేసినా అది దేవుని కృప వలనే అని గుర్తించి, పౌలులాగా గొప్పలు చెప్పుకోకుండా, నిస్వార్థంగా ఇతరులకు సహాయం అందించాలి.
కనుక, వినయమనే సుగుణాన్ని అలవర్చుకోవడం ద్వారానే మనం దేవుని కటాక్షానికి పాత్రులమవుతాము, క్షమించబడిన వారిగా తిరిగి ఇంటికి చేరుతాము.


No comments:

Post a Comment