అమ్మ పునీత థెరిస్సా

అమ్మ పునీత థెరిస్సా

4 సెప్టెంబర్‌ 2016, ప్రపంచానికి, భారత దేశానికి, తిరుసభకు ఓ పర్వదినం. ఆ రోజు అమ్మథెరిస్సా, పునీత థెరిస్సాగా పోపు ఫాన్సిస్‌ వారు ప్రకటించి యున్నారు. ఆమె నిజంగా పునీతురాలు. పేద వారికోసం జీవించింది. సుఖదు:ఖాలతో రాజీపడుతూ జీవించే వారు. ప్రేమ బాటలో నడిచేవారు. ఎవరును ఇలాంటి మహోన్నత స్థాయిని పొందలేరు.

పునీత థెరిస్సాగారు శాంతిదూతగా జీవించారు. తన జీవితము ద్వారా ఈలోకానికి గొప్ప సందేశాన్ని ఇచ్చియున్నారు. ఓసారి ఆమె ఇలా అన్నారు, ‘‘చీకటిని నిందించే బదులుగా ఓ క్రొవ్వొత్తిని వెలిగించు’’ అని. ఇదే ఆమె జీవితములో జీవితాంతం గుర్తుపెట్టుకొని ఆచరించారు. చీకటిలో బ్రతుకుతున్న జీవితాలకు, తన ప్రేమ, సేవ ద్వారా, వెలుగును నింపియున్నారు. ఇదే సందేశాన్ని ఈ నాటికి కూడా, ఆమె స్థాపించిన మఠకన్య సభద్వారా చాటి చెప్పుచున్నది.

ఈ ప్రయాణములో ఎన్నో ఇబ్బందులు, అవమానములు, తిస్కారములు, చీదరణలు, దూషణలు ఎదురయ్యాయి. అయిన వాటన్నింటిని ఆమె దేవుని సహాయముతో ధైర్యముగా ఎదుర్కొని యున్నది. ‘‘మత మార్పిడి’’ పేరుతో కొందరు ఆమెను నిందించారు. అందరూ మంచి మనుషులుగా, దేవుని బిడ్డలుగా సమాజములో గౌరవముగా జీవించాలని ఎ్లప్పుడూ ఆమె కోరుకున్నారు, దాని నిమిత్తమై ఎంతగానో కృషి చేసియున్నారు.

తల్లి తిరుసభకు కూడా గొప్ప సందేశాన్ని ఈ పునీతురాలు ఇచ్చియున్నారు. ‘‘నువ్వు, నేను కలిస్తేనే తిరుసభ! మన ప్రజలతో మనకున్నది పంచుకోవాలి. మనలో ఇచ్చేగుణం, పంచుకొనే గుణం లేకపోవడం వలననే ఈనాడు మనం చూస్తున్న కష్టాలకు కన్నీటికి కారణం’’. దివ్య కారుణ్య సం॥లో ఆమె పునీత పట్టాన్ని పొందియున్నది. ఆమె దేవుని కారుణ్యమునకు ప్రతి బింబముగా జీవించి యున్నది. మనము కూడా దివ్య కారణ్యముతో జీవించాలని ఆమె జీవితం మనకు నేర్పిస్తున్నది.

నీ జీవితములో ఇంత గొప్పగా సాధించడానికి కారణం ఏమిటిఅని ఓ ఇంటర్వూలో అడిగినప్పుడు, ‘‘క్రీస్తు తనను తానుగా జీవముగల అప్పముగా మార్చుకొని మనకు జీవమును ఇచ్చియున్నాడు. ఈ పరమ రహస్యాన్ని ప్రతీరోజు ఉదయం  దివ్యపూజా బలితో ముగిస్తాము. ఇంతగొప్పగా దేవుని కార్యాలు చేయడానికి కారణం ప్రతీరోజు నాలుగు గంటలు ప్రార్థన చేయటం’’ అని ఆమె సమాధానము ఇచ్చియున్నది.

‘‘నా జీవితములో నెరవేర్చబడిన ప్రతీది దేవుని కార్యమే. నాదంటూ ఏమీ లేదు. నేను దేవుని చేతిలో ఓపెన్సిల్‌ మాత్రమే. వ్రాసేది ఆయనే. దేవుడే ప్రతి కార్యము నా ద్వారా చేస్తున్నారు. నన్ను ఓ సాధనముగా ఉపయోగించు కొనుచున్నారు’’ అని ఆ అమ్మ తన వినమ్రతను చాటుకొనియున్నది.

దేవుడు నీకిచ్చిన గొప్పవరం ఏమిటి అని అడుగగా, ఆమె వెంటనే ‘‘పేద ప్రజలు’’ అని సమాధానం చెప్పియున్నది. వారి ద్వారా నేను 24 గం॥లు యేసుతో ఉండే భాగ్యము పొందియున్నాను.

26 ఆగష్టు 1910వ సం॥లో అల్బీనియా, మాసిడోనియాలో ఆగ్నేస్‌ జన్మించి ప్రపంచ వ్యాప్తముగా మదర్‌థెరిస్సాగా పిలువబడియున్నది. 1928వ సం॥లో ఐర్లండు దేశములోని లొరెటొ మఠకన్య సభలో చేరి మేరి థెరిస్సాగా పేరును మార్చు కొనియున్నది. 1929వ సం॥లో భారతదేశానికి వచ్చి 87 సం॥లు సుదీర్ఘముగా తన సేవలను అందించి యున్నది. 7అక్టోబర్‌ 1950వ సం॥లో మిషనరీస్‌ ఆఫ్‌ ఛారిటీ, అను నూతన మఠకన్యగా సభను స్థాపించి యున్నది. ఇప్పుడు అది 133 దేశాలలో వ్యాపించి, వివిధ రకాలుగా సేవలను అందిస్తూ, పునీత మదర్‌ థెరిస్సా ఆశను సజీవముగా ఉంచుతున్నది!

No comments:

Post a Comment