25వ సామాన్య ఆదివారము, YEAR C

25వ సామాన్య ఆదివారము YEAR C
ఆమో. 8: 4-7; 1 తిమో. 2: 1-8; లూకా. 16: 1-13

జీవితపు ప్రయాణంలో మనం కలిసే వ్యక్తులు, మనకు కలిగే అనుభవాలు మనలను దేవుని వైపునకు నడిపించవచ్చు. అవే సంఘటను, వ్యక్తులు (మనం జాగ్రత్తగా లేకపోతే) మనల్ని దేవుని నుండి దూరం కూడా చేయవచ్చు. ఇశ్రాయేలీయులను, వారి ప్రవర్తన, వారి పని, వారి ఆదాయం, వారి అభివృద్ధి దేవుని నుండి ఎలా దూరం చేసిందో, ఈనాటి మొదటి పఠనం తెలియ జేస్తుంది. ఆ సందర్భమును, సందేశమును తెలుసుకుందాం.

సందర్భం: ఈనాడు మనం ఆలకించిన మొదటి పఠనం ఆమోసు గ్రంధం 8వ అధ్యాయం నుండి తీసుకొనబడినది. ఆమోసు ప్రవక్త తన సందేశమును ఉత్తర భాగములోనున్న ఇశ్రాయేలీయులకు వినిపిస్తున్నాడు. యేరోబోము రాజు కాలమునందు రాజ్యము స్థిరపడినది, బలపడినది, అభివృద్ధి చెందినది. బాహ్యపు శత్రువు యొక్క బెడద తగ్గినది. రాజ్యపు సరి హద్దులు సురక్షితముగా ఉన్నవి. ఈ సుస్థిరతలోనే, ఈ అభివృద్ధిలోనే, వారియొక్క అంత:రంగిక శత్రువు వారిని, వారి దేవుడు నుండి వేరుచేశాడు. వారి మాటలు దేవుని ఆజ్ఞలను వల్లెవేస్తున్నా, వారి హృదయాలు మాత్రం దేవునికి బహుదూరంలో ఉన్నాయి. ఎంత దూరం అంటే, అన్నీ అనుగ్రహించిన దేవున్ని మరచిపోయేటంత. వారి ఆలోచన అంత, మోసపూరితమైన ఆలోచనలో, క్రియలో,తమ వ్యాపారమును, తమ సంపదను ఎలా వృద్ధి చేసుకోవాలనే ఉండేది. పేదలను మోసగించి, నకిలీ వస్తువులను అమ్మి, మోసపూరితముగా ధనం కూడబెట్టుకోవాలని తహతహలాడుతున్నారు. వీలైనంత తొందరగా దైవారాధన ముగించి, తమ ఆస్తులను అభివృద్ధి చేసుకోవడంలో నిమగ్నమవుదామని వారు ఆలోచిస్తున్నారు. ఇటువంటి ఆలోచనలో ఉన్న వారికి ఆమోసు ప్రవక్త తన నాలుగవ దర్శనం ద్వారా దేవుని సందేశమును వారికి వినిపిస్తున్నాడు. ఈ దర్శనంలో ఒక వేసవికాలపు పండ్ల గంపను వారికి చూపిస్తున్నాడు. ఇది కోతకాలమునకు, నూర్పుకామునకు సూచన. బైబులు గ్రంథపు మాటలో, తీర్పుకాలము, అంత్యకాలము ఆసన్న మైనదనుటకు సూచన. వారి పాపం పండినదని, దానికి ఫలితమును వారు అనుభవిస్తారని వారికి దేవుడు ఆమోసు ప్రవక్త సందేశం ద్వారా తెలియ జేస్తున్నాడు.

సందేశం: నీవు ఎవరివైనా, నీకు ఏమివున్నా, అంతా దేవుని క కృపయే. ఆయన నీకు అనుగ్రహించినదే. నీకు ఎన్నియున్నా, నీవు ఏమైయున్నా, అదంతా దేవుని వరమే. నీ అభివ వృద్ధిలో, నీ ఆనందంలో, నీ సంతోషంలో వాటినన్ని నీకనుగ్రహించిన దేవుని, ఆయన ఆజ్ఞలను, ఆయన మార్గమును, ఆయన మాటలను మరువకుము. నీ హృదయంలో, నీ జీవితంలో ఆయన ప్రాముఖ్యతను ఆయన స్థానమును మార్చకుము. అదేవిధంగా, నీవు దేవుని నుండి ఏదైనా పొందినప్పుడు, ఏమిలేని వారిని గురించి, పేదల గురించి, అవసరంలో నున్న వారి గురించి ఆలోచించు. వారికి ఏవిధంగా సహాయపడగలవో ఆలోచించు. వారిని ఏవిధంగా పైకి తేగలవో ఆలోచించు. వారు ఏవిధంగా దేవుని వైపుకు మరగలరో సహాయం చేయి. వారికి న్యాయం జరిగించు. వారికి దేవుని తరుపున ఆదరణగా ఉండు. నీ అభివృద్ధిలో దేవున్ని మరువకు. పేదలతో వ్యాపారం చేయకు, వారిని మోసగించి లాభం పొందాలని ఆశించకు. నీ హృదయంలో దేవునికి మొదటి స్థానం ఇవ్వు. ఆయన నీతో ఉంటే, నీవు ఏమైనా సాధించగలవు. నీ హృదయం నుండి ఆయనను తీసివేస్తే, నిర్లక్ష్యం చేస్తే, నిన్ను నీవు పతనం వైపుకు నడిపించుకున్నట్లే.

No comments:

Post a Comment