పవిత్ర సిలువ విజయోత్సవము (14 సెప్టెంబరు)

పవిత్ర సిలువ విజయోత్సవము (14 సెప్టెంబరు)


ఈరోజు విశ్వకతోలిక శ్రీసభ మరియమాత ‘వ్యాకులమాత’ పండుగను కొనియాడుతూ ఉన్నది. ఈరోజు, ‘వ్యాకులమాత’ పండుగను కొనియాడుతూ ఉన్నాము. ఇది దేవునితల్లి అయిన మరియ ఆధ్యాత్మిక వేదసాక్ష్యము అని చెప్పవచ్చు. దేవుని కుమారుడు క్రీస్తు శ్రమలలో పాల్గొనిన జీవితం అని చెప్పవచ్చు. కనుక, ఈరోజు మనం వ్యాకులమాత హృదయాన్ని గౌరవిస్తున్నాము.
ఈ పండుగ క్రీ.శ. 1814వ సం.నుండి విశ్వశ్రీసభలో పండుగగా కొనియాడ బడుచున్నది. అయితే, 11వ శాతాబ్ధములోనే ఈ పండుగను కొన్నిచోట్ల స్థానిక పండుగగా కొనియాడేవారు. 1233వ సం.లో సర్వైట్స్ [సర్వంట్స్ ఆఫ్ మేరీ) సభను స్థాపించిన ఏడుగురు మఠవాసులకు, మరియతల్లి దర్శనములో తన ఏడు వ్యాకులముల భక్తిని వ్యాప్తిచేయమని కోరినట్లు తెలుస్తుంది. ఏడవ భక్తినాధ జగద్గురువులు, మరియతల్లి మధ్యస్థ ప్రార్ధనలద్వారా తాను పొందిన మేలులకు, శ్రీసభను రక్షించినందులకు కృతజ్ఞతగా, వ్యాకులమాత పండుగను, 1814వ సం.లో విశ్వశ్రీసభయంతట, సెప్టెంబరు మూడవ ఆదివారమున కొనియాడ ఆజ్ఞాపించారు. పదవ భక్తినాధ జగద్గురువులు 1914వ సం.లో, ఈ పండుగ తేదీని 15 సెప్టెంబరుగా నిర్ణయించారు.
ఇక్కడ మనం ఒక ముఖ్యవిషయాన్ని గమనించాలి. ‘వ్యాకులం చెందడం’, ‘విచారపడటం’ ఒకటికాదు. ‘వ్యాకులహృదయం’, ‘విచారహృదయం’ ఒకటికాదు. విచారం అనేది తనపై తనకున్న జాలితో కలుగుతుంది లేదా ఒకరికి ఇష్టమైనదానిని కోల్పోయినప్పుడు విచారం కలుగుతుంది. బాలయేసు తప్పిపోయినప్పుడు, మరియ యోసేపులు ‘విచారముతో’ వెదికినట్లు లూకా 2:48వ వచనములో చదువుచున్నాం. అయితే, శోఖము లేదా వ్యాకులము లేదా దు:ఖము, అష్టభాగ్యాలలో ఒకటి. “శోకార్తులు ధన్యులు, వారు ఓదార్ప బడుదురు” (మత్త 5:4). కనుక, ‘శోఖము’ లేదా ‘వ్యాకులము’ పవిత్రమైన లక్షణాలలో ఒకటి. ‘శోకించుట’ అనగా వ్యాకులముతో [దు:ఖము] కూడిన హృదయాన్ని కలిగియుండటం. అష్టభాగ్యాల నేపధ్యములో, ‘శోకించే హృదయం’ అనగా, ‘ప్రేమించే హృదయం’ అని అర్ధం. పాపము కొరకై దు:ఖించే హృదయమునుండి శోఖము వస్తుంది. మరియతల్లి విషయములో తన కుమారుని పట్ల క్రూరమైన ప్రవర్తనను, ఆయన శ్రమలను, తిరస్కారాన్ని, మరణాన్ని కళ్ళారా చూసింది. చూసినను, ఆమె నిరాశకు లోనవ్వలేదు. కోపపడలేదు. జాలితో విచారానికి లోనవ్వలేదు. బదులుగా, యేసునకు బాధలకు గురిచేసిన పాపాల గురించి, ఆమె పవిత్ర హృదయం శోకించినది, వ్యాకులము చెందినది. ఆ పాపవిమోచనకై వేడుకున్నది. మరియమ్మ తన వ్యాకులముద్వారా, పాపము ఎంతదుష్టమైనదో, మనకు గుర్తుచేయుచున్నది మరియు పశ్చాత్తాప మార్గాన్ని మనకు తెలియజేయుచున్నది. మరియతల్లి వివిధ సందర్భాలలో ఇచ్చిన దర్శనాలలో ఈ సందేశాన్ని బలంగా వినిపించినది.
సాధారణంగా దేవునితల్లి అంటే, అందరి మనసులో ఆమె గొప్పవ్యక్తి, ఆమెకు ఎటువంటి కష్టాలు ఉండవని భావిస్తాం. “అనుగ్రహ పరిపూర్ణురాలు” అయిన మరియ ఎలా బాధలను పొందగలదు? అని ప్రశ్నిస్తాం. కాని, మరియతల్లి జీవితం దీనికి పూర్తిగా భిన్నం. దేవునికితల్లి, దేవమాత అయినప్పటికీ ఎన్నోబాధలను అనుభవించినది. ఎంతోదుఃఖాన్ని, వ్యాకులమును అనుభవించినది. మరియతల్లిమాత్రం కష్టాలను దుఃఖాన్నిసైతం దేవుడిచ్చిన బహుమానంగా స్వీకరించినది. ఆమె జీవించిన విశ్వాస జీవితం, దేవునిపట్ల ప్రేమ, కుమారుని చెంతన ఆసీనురాలుగా వెలుగొందే భాగ్యాన్ని పొందినది.
మరియతల్లి అనుభవించిన ఏడు దు:ఖపూరితమైన సంఘటనలను స్మరించుకుంటూ, ‘వ్యాకులమాత’గా స్మరించుకుంటున్నాము. మరియతల్లి హృదయముమీద నున్న ఆ ఏడు ఖడ్గములు మరియతల్లి అనుభవించిన బాధలకు నిదర్శనం. మరియతల్లి అనుభవించిన ఏడు దుఖపూరితమైన సంఘటనలు ఏవనగా:
1. మరియతో పలికిన సిమియోను ప్రవచనం: “ఇదిగో! ఈ బాలుడు యిస్రాయేలీయులలో అనేకుల పతనమునకు, ఉద్ధరింపునకు కారకుడు అగును. ఇతడు వివాదాస్పదమైన గురుతుగా నియమింపబడి యున్నాడు. అనేకుల మనోగత భావములను బయలు పరచును. ఒక ఖడ్గము నీ హృదయమును దూసికొని పోనున్నది” (లూకా 2:25-35). సిమియోను ప్రవచనం మరియతల్లి హృదయములో దూసుకెళ్లిన మొదటి ఖడ్గము. ఈ ప్రవచనంద్వారా, తన కుమారుడు శ్రమలను అనుభవించబోతున్నాడని తెలియపరచడమైనది. మానవాళి రక్షణకోసం తానుసైతం వ్యాకులమాతగా దుఃఖభారాన్ని వహించి, తన కుమారుని కష్టాలలో పాలుపంచుకున్నది.
2. దేవదూత యోసేపునకు కలలో కనిపించి చెప్పిన మాటలు, “శిశువును చంపుటకు హేరోదు వెదకబోవుచున్నాడు. కావున నీవు లేచి, బిడ్డను తల్లిని తీసుకొని ఐగుప్తునకు పారిపోయి, నేను చెప్పువరకు అచటనే యుండుము” (మత్త 2:13-15). ఈ వార్త విన్న మరియ హృదయం ఎంతగానో తల్లడిల్లి పోయి యుండవచ్చు. బాలయేసును పొత్తిళ్ళలో పట్టుకొని 300 మైళ్ళదూరములోనున ఐగుప్తునకు వెళ్ళారు. అచట వారు పరదేశులుగా జీవించారు.
3. యెరూషలేము దేవాలయములో ప్రభువు తప్పిపోయినప్పుడు (లూకా 2:41-50), మరియమ్మ “కుమారా! ఎందులకు ఇట్లు చేసితివి? నీ తండ్రియు, నేనును విచారముతో నిన్ను వెదకుచుంటిమి” అని అనెను.
4. సిలువ మార్గములో ప్రభువును చూసినప్పుడు (లూకా 23:27-31; యో 19:17). ప్రభువు సిలువ మోయుచుండగా, గొప్ప జనసమూహము ఆయనను వెంబడించెను. కొందరు స్త్రీలు ఆయన కొరకు రొమ్ములు బాదుకొనుచు విలపించు చుండిరి.
5. ప్రభువు సిలువలో కొట్టబడుట, సిలువ మరణం పొందుట (యో 19:25-30). యేసు సిలువ చెంత ఆయన తల్లియు ...నిలువబడి యుండెను.
6. యేసు శరీరమును సిలువనుండి దించి, మరియతల్లి ఒడిలో నుంచినప్పుడు (లూకా 23:50-54; యో 19:31-37)
7. యేసు శరీరమును భూస్ధాపనము చేసినప్పుడు (లూకా 23:50-56; యో 19:38-42; మార్కు 15:40-47). ఏ తప్పు చేయని తన కుమారుడు దుష్టులైన యూదుల చేతికి చిక్కి అవమానాలను భరించవలసి రావటం మరియతల్లిని తీవ్రమైన మనోవేదనకు గురిచేశాయి. క్రీస్తు ప్రభు పవిత్ర రక్తాన్ని చూసినప్పుడు, దుఃఖసాగరంలో నిండిపోయినది. ప్రభు దేహాన్ని నిలువెత్తు గాయంచేస్తున్నప్పుడు, మరియమ్మ హృదయం తల్లడిల్లి పోయినది. ఆ బాధను వర్ణించటం ఎవరి వల్ల కాదు! కాని, ఆమె ప్రస్తుత దుఃఖాన్ని చూడలేదు. భవిష్యత్తులో వచ్చే దేవుని రాజ్యాన్ని చూశారు.
మన జీవితంలో మన చుట్టూ ఎన్నోకష్టాలు, శోధనలు చుట్టుముట్టి ఉంటాయి. అవి వచ్చినప్పుడు మన విశ్వాసాన్ని కోల్పోతూ దేవుని ఉనికినే ప్రశ్నిస్తూ ఉంటాము. నిజానికి కష్టాలు కన్నీళ్లు శోధనలు ఇవన్నీ మనలని దేవునికి దగ్గర చేస్తాయే తప్ప దూరం చేయవు. మన జీవిత పయనంలోని శ్రమలు, కష్టాలు, మనకు పరీక్ష. మరి మనము మన జీవిత పరీక్షను ఎలా ఎదుర్కుంటున్నాము? ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చిన, వాటన్నిటినీ ఎదుర్కొని ప్రభువు కొరకు నడవండి. ప్రభువుతో నడవండి. ప్రభువు కొరకు జీవించండి అని వ్యాకులమాత మరియమ్మ మనకు తెలియజేస్తున్నారు. కాబట్టి, మనముకూడా ఎన్నికష్టాలు వచ్చినా ఎన్నిబాధలు వచ్చినా ఇవన్నీ ప్రభువు ఇచ్చిన బహుమానాలుగా భావించి ముందుకు నడుద్దాం. అందర్నీ నడిపిద్దాం. దేవుడు మిమ్ము దీవించునుగాక! ఆమెన్.

No comments:

Post a Comment