17వ సామాన్య ఆదివారము, YEAR C

17వ సామాన్య ఆదివారము, YEAR C
ఆది. 18:20-32; కొలొస్సీ. 2:12-14; లూకా. 11:1-13
ప్రార్దన 

ఈ పఠనములో సొదొము నగరమును గురించి అబ్రహాము దేవుని ఎదుట నిలువబడి విన్నప ప్రార్ధనను చేయుచున్నాడు. ఆ పట్టణమునందు నివసించుచున్న నీతిమంతుల నిమిత్తమై ఆ పట్టణమును నాశనం చేయవద్దని ప్రభువుకు విన్నవించుకొంటున్నాడు. ఈ వాక్య భాగముయొక్క సందేశమును తెలిసికొనుటకు, దానియొక్క సందర్భమును విపులముగా మనం తెలుసుకోవాలి. ఈ రోజు మనం 18వ అధ్యాయములో రెండవ భాగం విన్నాము. మొదటి భాగమునకు రెండవ భాగమునకు అత్యంత సన్నిహితమైన సంబంధం ఉన్నది. మొదటి భాగంలో ఏం జరిగిందో క్లుప్తముగా తెలుసుకొందాం!

సందర్భం
అది మధ్యాహ్న సమయము. ఎండ విపరీతముగా కాయుచున్నది. మధ్యాహ్న భోజనం తర్వాత, ఎండ తీవ్రత వలన అబ్రాము సేదతీరాలనుకొని చెట్టునీడన నడుం వాల్చి, కనురెప్ప మూసేసమయానికి, ఎవరో వచ్చిన అలికిడి విని, లేచి, వారిని పలుకరించి, వారు కాళ్ళు కడుగుకొనుటకు, త్రాగుటకు నీరు ఇచ్చి వారిని భోజనమునకు ఆహ్వానిస్తున్నాడు. 90 సం.ల వయస్సులోకూడా తానే దగ్గరుండి అతిధులకు సపరిచర్యలు చేస్తున్నాడు. హడావిడిగా అటుఇటు పరుగెత్తుతున్నాడు. వారు భోజనం చేయుచుండగా చేతులు కట్టుకొని వారికి దగ్గరలో నిలువబడి సిద్ధంగా ఉన్నాడు. నిజం చెప్పాంటే, అబ్రాము ఆ పనికి జీతగాళ్ళను పురమాయించవచ్చు. కాని తానే దగ్గరుండి అన్నీ చూసుకొంటున్నాడు. దానికి ఫలితముగా, ఆ అతిధులు, ముసలి ప్రాయములో ఉన్న దంపతులకు ఒక సంతోషకరమైన వార్తను తెలియజేస్తున్నారు. వారికి ఒక వారసుడు జన్మిస్తాడని, అతనిద్వారా ఒక మహాజాతి ఏర్పడునని, ఆ జాతిద్వారా భూమండమునందలి సకల జాతులు దీవింపబడునని వాగ్ధానము చేయుచున్నారు. అతని వలన కలుగు సంతానము దేవుని మార్గము నెరిగి ఆయన బాటలో నడచి, నీతి న్యాయము పాటించే ఒక కుటుంబముగా, జాతిగా ఎదుగునని వాగ్దానం చేయుచున్నారు. 

ఆ తరువాత సొదొమ, గొమోర్రాలను గురించి ప్రస్తావించబడినది. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏమంటే, ఒకవైపు అబ్రాము కుటుంబం, మరియొకవైపు సొదొమ పట్టణములో నివసిస్తున్న కుటుంబాలు. ఒకప్రక్క దేవున్ని అంటిపెట్టుకొని, ఆయన మార్గములో నడుస్తూ, నీతి న్యాయం పాటించే కుటుంబం, మరియొకవైపు దేవునికి దూరముగా, ఆయన మార్గమును విడనాడి, నీతి న్యాయం జరిగించని కుటుంబాలు. అబ్రాము కుటుంబం, దేవున్ని తమ జీవిత కేంద్రబిందువుగా చేసుకొని, తోటివారికి, పరాయివారికి పరోపకారం చేస్తూ జీవిస్తున్నారు. సొదొమ వాసులు మాత్రం తమ జీవితాలకు, తామే కేంద్రబిందువుగా మారి జీవిస్తున్నారు. తమ సంతోషంకోసం, ఆనందంకోసం, తమ చుట్టుప్రక్కన ఉన్నవారిని పీడిస్తున్నారు. వారి హక్కులను కాలరాస్తున్నారు. వారిని హింసలకు గురిచేస్తున్నారు. దేవుని ఉద్దేశాలను తృణీకరించి, తమ ఆలోచనల ప్రకారం, జీవిస్తున్నారు. అంతేగాదు, తమ తృప్తికోసం ఇతరును వాడుకొంటున్నారు. ఇతరును తమ శక్తితో అణగద్రొక్కుతున్నారు. వీరి అణచివేతకు గురియైన వారి ఆక్రందనను, రోదనను, ప్రభువుకు ఆలకించారు. అందుకే, ప్రభువు వారిమీద చర్యలు తీసుకొని, అణచివేయబడిన వారికి న్యాయము చేయుటకు ప్రయత్నిస్తున్నాడు.

సందేశం
నీ జీవితాన్ని ప్రభువు మార్గములో, ఆయనను అంటిపెట్టుకొని దేవుని ఉద్దేశానుసారముగా ఆయనను కేంద్రబిందువుగా చేసుకొని, నీతి న్యాయము పాటిస్తూ, ఇతరును గౌరవిస్తూ జీవిస్తున్నావా? నీ తోటివారిని, పరాయివారిని, ప్రోత్సహిస్తూ దేవుని మార్గములో నడచుటకు ఉత్సాహపరుస్తూ జీవిస్తున్నావా? నీతో ఉన్నవారు, నీ చుట్టూ ఉన్నవారు, నీ ఆనందం, సంతోషం కోసం కాదు, నీకు పనిముట్లు కాదు, దేవుని బిడ్డలు అని గుర్తించావా? నీవు అందనంత ఎత్తుకు ఎదిగిపోయావని గర్వముతో (సొదొము ప్రజలవలె) విర్రవీగుతున్నావా? నీకు అవసరమైన దానికంటే ఎక్కువగా దేవునినుండి పొందినప్పుడు, అవసరములో ఉన్న నీ తోటివారిని విస్మరిస్తున్నావా? వారి బాధను, రోదనను పెడచెవిన పెడుతున్నావా? అబ్రామును అతని కుటుంబమును ఎన్నుకొన్న విధముగా నిన్ను, నీ కుటుంబాన్ని ఎన్నుకొని, నీ ద్వారా, నీ కుటుంబంద్వారా, తన ఉద్దేశమును జరిగించుకొనాలని అనుకొంటున్నాడు. నీతి న్యాయమును నీ చుట్టూ జరిగించాలని అనుకొంటున్నాడు. నిన్ను, నీ కుటుంబాన్ని, నీ సొత్తును దేవుని ఉద్దేశాన్ని జరిగించడానికి వెచ్చించగలవా? ప్రభువును నీ జీవిత కేంద్ర బిందువుగా చేసుకొని, ఆయనకు, ఆయన సేవకు, సంపూర్తిగా నిన్ను నీవు సమర్పించుకోగలవా? అలా చేయాంటే, నీవు కష్టసమయములోనూ... క్లిష్ట సమయములోనూ... దేవుని ముందు అబ్రామువలె, నిబడటం నేర్చుకోవాలి. నిలబడి, ఇతరులకోసం, విన్నవించడం నేర్చుకోవాలి.

ప్రార్ధన యొక్క విలువను గురించి నేడు తెలుసుకోవాలి

ప్రార్ధన మన జీవితములో ఒక భాగం కావాలి. నిత్యమూ ప్రార్ధన చేయాలి. నాకు అడగటానికి ఏమీ లేదు నేను ఎందుకు ప్రార్ధన చేయాలి అని కొందరు అనుకుంటారు! నేను ప్రతిరోజు ప్రార్ధన చేస్తున్నాను, కాని నా జీవితములో ఏదీ జరగడం లేదు, కనుక నేను ఇంకెలా ప్రార్ధించాలి అని కొందరు అనుకుంటారు! ప్రార్ధనయనగా, దేవునితో మన సహవాసాన్ని వ్యక్తపరచడం! దేవునితో సంభాషించుటం! ప్రార్ధించడం అందరికీ అవసరమే! పునీతులు ప్రార్ధించారు. నిష్కళంక మరియ ప్రార్ధన చేసింది. దైవకుమారుడైన క్రీస్తుకూడా తండ్రి దేవునికి ప్రార్ధించాడు. మరి మనకింకా ఎంత అవసరమో తెలుసుకుందాం! అబ్రహామువలె ఇతరుల క్షేమం కొరకు ప్రార్ధన చేద్దాం!

నేటి సువిశేషములో ప్రభువు అంటున్నారు: "మీరును అడుగుడు. మీకు అనుగ్రహింపబడును. వెదుకుడు మీకు దొరకును. తట్టుడు మీకు తెరువబడును" (లూకా 11:9). దేవుడు తన వాగ్దానాలను తప్పక నెరవేర్చువాడు. ప్రతీ ప్రార్ధనను దేవుడు ఆలకిస్తాడు. ఆయన చిత్తమైతే తప్పక అనుగ్రహిస్తారు. మనకు ఏది అవసరమో, మనకన్న దేవునికే బాగా తెలుసు!

ప్రార్ధనలో పట్టుదల ఉండాలి. పట్టువిడువక ప్రార్ధన చేయాలి. అబ్రహాము, పునీత మోనికమ్మ చక్కని ఉదాహరణలు. తన కుమారుని పరివర్తన కొరకు, మోనికమ్మ 20 సం.లు ప్రార్ధన చేసింది. దేవుడు మన ప్రార్ధనలను ఎప్పటికీ నిర్లక్ష్యం చేయడు. చిత్తశుద్ధితో, విశ్వాసముతో ప్రార్ధన చేయాలి. మనకు ఉదారముగా ఒసగే తండ్రి ఉన్నారని యేసుక్రీస్తు తెలియజేయుచున్నారు. దీనికి విరుద్ధముగా, దేవుని బిడ్డలమైన మనం స్వార్ధముతో, గర్వముతో, ఇతరులపట్ల ఔదార్యము లేకుండా జీవిస్తున్నాం. తండ్రి దేవునివలె ఉదారముగా ఉన్నామా అని ఆత్మపరిశీలన చేసుకుందాం!

ప్రార్ధన కృతజ్ఞతాభావముతో చేయాలి. దేవుడు ఇప్పటికే మన జీవితములో ఎన్నో మేలులు చేసారు. దేవునకు వందనాలు తెలుపుకోవాలి.

ప్రార్ధన ఎప్పుడుకూడా దేవునితో మనకున్న అనుబంధముపై ఆధారపడి ఉంటుంది. కనుక, దేవునితో మనకున్న బంధముపై ముందుగా మనం ఎక్కువ దృష్టిని పెట్టాలి.

ప్రార్ధనతోపాటు మన కృషి ఉండాలి. ఉదాహరణకు, కుటుంబములో శాంతి, సమాధానాలు ఉండాలని ప్రార్ధన చేస్తాం. కాని, వాటికొరకు ఎలాంటి కృషి చేయము! మంచి ఆరోగ్యంకొరకు ప్రార్ధన చేస్తాం. కాని దానికి తగిన జాగ్రత్తలు తీసుకోము! బహుశా, మన ప్రార్ధనలు నెరవేరక పోవడానికి అదొక కారణం కావొచ్చు!

No comments:

Post a Comment