ప్రభువు మోక్షారోహణము, Year C

క్రీస్తు మోక్షారోహణ మహోత్సము, Year C
అ.కా. 1:1-11; ఎఫెసీ. 1:17-23; లూకా. 24:46-53


క్రీస్తు మోక్షారోహణము క్రైస్తవ విశ్వాసంలో, ముఖ్యంగా కతోలిక క్రైస్తవ విశ్వాసంలో, ఒక కేంద్ర సిద్ధాంతం మరియు అత్యంత ముఖ్యమైన సంఘటన. ఇది క్రీస్తు పునరుత్థానం తర్వాత నలభై రోజుల అనంతరం జరిగింది. యేసుక్రీస్తు ప్రభువు తన శిష్యుల కళ్ళముందే ఆకాశంలోకి ఆరోహణమయ్యారు. ఈ సంఘటన క్రీస్తు భూసంబంధమైన పరిచర్యకు ముగింపు పలకడమే కాకుండా, ఆయన మహిమాన్వితమైన స్థితిని, మరియు ఆయన శిష్యులపై పరిశుద్ధాత్మను పంపడానికి సిద్ధంగా ఉన్నారని సూచిస్తుంది. అంతేకాదు, ఆయన తిరిగి వస్తాడని మన నిరీక్షణను ఇది గుర్తు చేస్తుంది.

బైబిల్ ఆధారాలు మరియు క్రీస్తు మోక్షారోహణము గురించిన ముఖ్య సమాచారం:

క్రీస్తు మోక్షారోహణము గురించి, బైబులులో మార్కు 16:19; లూకా 24:50-53 మరియు అపోస్తలుల కార్యములు 1:6-11లో స్పష్టముగా వివరించ బడినది. ఈ బైబులు వచనాలు క్రీస్తు ప్రభువు మోక్షారోహణము గురించిన కొన్ని ముఖ్యమైన అంశాలను స్పష్టముగా తెలియజేయు చున్నాయి. ఒకటి, కాలము: ప్రభువు పునరుత్థానం తర్వాత నలభై రోజున క్రీస్తు మోక్షారోహణము జరిగింది; స్థలం: బేతానియ సమీపంలో, ఒలీవల కొండపై; సాక్షులు: శిష్యులు; పర్యవసానం: క్రీస్తు దేవుని కుడిప్రక్కన ఆసీనుడవ్వడం, పరిశుద్ధాత్మను పంపడానికి వాగ్దానం, మరియు ఆయన తిరిగి వస్తాడని దూతల ద్వారా హామీ ఇవ్వడం.

మార్కు 16:19లో ప్రధానముగా రెండు విషయాలు చెప్పబడినాయి: ఒకటి ప్రభువైన యేసు పరలోకమునకు కొనిపోబడుట; రెండు ఆయన దేవుని కుడి ప్రక్కన కూర్చుండుట. ఇది ఆయన అధికారానికి, మహిమకు సూచన. దేవుని కుడి ప్రక్కన కూర్చొనుట పరలోకములో ఆయనకు అత్యున్నత స్థానం, అధికారం ఉన్నాయని అర్ధం.

లూకా 24:50-53లో మరింత వివరణ ఇవ్వబడినది. ఇక్కడ గమనించాల్సిన ముఖ్యాంశాలు, యేసు తన శిష్యులను బెతానియా వరకు తీసుకొని వెళ్ళాడు. ఆయన వారిని ఆశీర్వదించు చుండగా పరలోకమునకు వెడలి పోయారు. శిష్యులు ఆయనను ఆరాధించి మహానందముతో యెరూషలేమునకు తిరిగి పోయి, ఎడతెగక దేవాలయమున దేవుని స్తుతించు చుండిరి.

అపోస్తలుల కార్యములు 1:6-11లో క్రీస్తు మోక్షారోహణము గురించి అత్యంత వివరణాత్మకమైన వృత్తాంతాన్ని ఇస్తుంది. ఈ భాగములో కీలకమైన అంశాలు, “ప్రభూ! ఇప్పుడు మీరు యిస్రాయేలునకు రాజ్యమును పునరుద్ధరించెదరా?” అని శిష్యులు యేసును ప్రశ్నించారు. ఇప్పటికీ శిష్యులకు ఇహలోక రాజ్యము గురించే ఆలోచన ఉంది. అందుకు సమాధానముగా యేసు, “కాలములును, సమయములును నా తండ్రి తన అధికారమున ఉంచుకొని యున్నాడు. వాటిని గూర్చి తెలిసికొనుటకు మీ పనికాదు. ఐనను, పరిశుద్ధాత్మ మీ పైకి వచ్చునప్పుడు మీరు శక్తిని పొందుదురు. కనుక మీరు యెరూషలేములోను, యూదయా, సమరియా సీమల యందు అంతటను, భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉండెదరు” అని స్పష్టం చేశాడు. ఆతరువాత, వారు చూచుచుండగానే ఆయన పరలోకమునకు కొనిపో బడెను. ఒక మేఘము ఆయనను కమ్మివేసెను. యేసు ఆరోహణం అయిన తర్వాత, తెల్లని వస్త్రములు ధరించిన ఇద్దరు మనుష్యులు (దేవదూతలు) అక్కడ కనిపించారు. వారు శిష్యులతో, గలిలీయులారా! మీరు ఎందుకు ఇంకను ఇక్కడ నిలిచి ఆకాశము వైపు చూచు చున్నారు? మీ చెంత నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసు, ఎట్లు పరలోకమునకు పొవట మీరు చూచితిరో, అట్లే ఆయన మరల వచ్చును” అని చెప్పారు. ఇది యేసు రెండవ రాకడ గురించి స్పష్టమైన హామీగా యున్నది.

అయితే లూకా సువార్తను మరియు అపోస్తలుల కార్యములు గ్రంధమును వ్రాసినది లూకాయే. మరి ఎందుకు రెండు భిన్నమైన వివరణలు చేసారు? లూకా సువార్తలో మోక్షారోహణము యేసు భూలోక సేవకు ఒక ముగింపు బిందువుగా చూపబడింది. ఆయన మరణం, పునరుత్థానం, మరియు మోక్షారోహణము అనే వరుస సంఘటనల ద్వారా దేవుని రక్షణ ప్రణాళికను నెరవేర్చారు. ఇక్కడ శిష్యుల ఆనందం మరియు దేవాలయంలో దేవున్ని స్తుతించడం, యేసు యొక్క మహిమను గుర్తించడం మరియు దేవుని కార్యానికి ప్రశంసను సూచిస్తుంది. ఇది యేసు యొక్క జీవితానికి మరియు పరిచర్యకు ఒక గౌరవప్రదమైన ముగింపుగా లూకా వర్ణించాడు. అపోస్తలుల కార్యములులో మోక్షారోహణము ఒక క్రొత్త యుగానికి, సంఘ స్థాపనకు నాందిగా చిత్రీకరించబడింది. యేసు భౌతికంగా వెళ్ళిపోయినప్పటికీ, ఆయన పరిశుద్ధాత్మ ద్వారా తన శిష్యులతో మరియు సంఘంతో ఉంటాడని హామీ ఇస్తున్నాడు. ఈ భాగం పరిశుద్ధాత్మను స్వీకరించి, భూదిగంతముల వరకు” సాక్షులుగా మారడానికి శిష్యులను సంసిద్ధం చేస్తుంది. ఇది సంఘం యొక్క పరిచర్యకు అధికారం మరియు దిశను ఇస్తుంది.

మోక్షారోహణము కేవలం ఒక కల్పిత కథ కాదని, చారిత్రకంగా జరిగిన వాస్తవం అని మన విశ్వాసం. అలాగే, ఇది కేవలం ఒక భౌతిక ఆరోహణము మాత్రమే కాదు, అంతకంటే మించి లోతైన ఆధ్యాత్మిక మరియు దైవశాస్త్ర ప్రాముఖ్యత కలిగిన విశ్వాస సిద్ధాంతం. ఇది క్రీస్తు యొక్క దైవత్వం మరియు మానవత్వం యొక్క ఏకత్వాన్ని, ఆయన మహిమను సూచిస్తుంది. పునరుత్థానం ద్వారా క్రీస్తు మరణంపై విజయం సాధించగా, మోక్షారోహణము ద్వారా ఆయన దేవుని మహిమలో ప్రవేశించారు. ఆయన పునరుత్థాన దేహంతోనే స్వర్గానికి ఆరోహణమయ్యారు, ఇది మానవత్వం యొక్క మహిమాన్వితమైన స్థితిని సూచిస్తుంది.

మోక్షారోహణము యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యత:

ప్రభువు మోక్షారోహణము ఒక పరమ రహస్యము. ప్రభువు తన భూలోక పరిచర్యను ముగించుట వలన, తద్వారా తిరుసభ పరిచర్య ఆరంభమైనది. శిష్యులు ప్రభువునకు వీడ్కోలు చెబుతుండగా, ప్రభువు ఈ లోకమును వీడి వెళ్ళుచుండగా వారికి కొన్ని విలువైన అనుగ్రహాలను దయచేశారు: (i). లేఖనములు అర్ధమగునట్లు వారికి బుద్ధి వికాసము కలుగజేసారు (లూకా 24:45); (ii). పైనుండి పవిత్రాత్మ శక్తిని వారు పొందుతారని వాగ్ధానం చేసారు (లూకా 24:49;.కా.1:4); (iii) తన చేతులెత్తి వారిని ఆశీర్వదించారు (లూకా 24:50). ఇది కేవలం ఒక సాధారణమైన ఆశీర్వాదము కాదు, గొప్ప ప్రధాన యాజకుడిగా వారిని ఆశీర్వదించారు; (iv). అంతిమ దినముల వరకు వారితో ఉంటానని వాగ్ధానం చేసియున్నారు (మత్త 28:20).

అప్పుడు శిష్యులు ఆయనను ఆరాధించి మహానందముతో యెరూషలేమునకు తిరిగిపోయి, అక్కడ వారు ఎడతెగక దేవాలయమున దేవుని స్తుతించారు (లూకా 24:52-53).

శిష్యులలో మార్పు మరియు మిషన్:

క్రీస్తు సిలువ మరణము తరువాత భయముతో పారిపోయి దాగుకొనిన శిష్యులలో మోక్షారోహణము తర్వాత గొప్ప మార్పు సంభవించినది. వారు కొత్త వ్యక్తులుగా రూపాంతరం చెందారు, విశ్వాసములో బలపడి, భవిష్యత్తుపై గొప్ప నిరీక్షణ కలిగియున్నారు. యెరూషలేము నుండి భూదిగంతముల వరకు తనకు సాక్షులుగా ఉండవలెనని ప్రభువు వారిని ఆదేశించారు (అ.కా.1:8). ప్రభువు తన అంతిమ సందేశములో, వెళ్లి, సకల జాతి జనులకు పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున జ్ఞానస్నాన మొసగుచు, వారిని నా శిష్యులు చేయుడు (మత్త 28:19) అని శిష్యులను కోరారు. అలాగే పవిత్రాత్మశక్తి వరము కొరకు వేచియుండాలని ఆదేశించారు. పరలోక దూతలు (తెల్లని దుస్తులు ధరించిన ఇద్దరు మనుష్యులు) శిష్యుల యొద్ద నిలిచి యేసు ఎట్లు పరలోకమునకు పోవుట మీరు చూచితిరో, అట్లే ఆయన మరల వచ్చును” అని వారికి అభయమునిచ్చారు (అ.కా.1:11).

ప్రభువు మోక్షారోహణ పండుగ, తన మహోన్నత ఉత్థానము తర్వాత 40 రోజులకు, తన శిష్యుల సమక్షంలో యేసు ప్రభువు తన శక్తి చేత పరలోకమునకు ఎత్తబడుటను కొనియాడుతుంది. ఈ పండుగ ప్రభువు భూలోకంలోని తన రక్షణ కార్యము పరిపూర్తి అయినదని తెలియజేస్తుంది. ఉత్థానమునకు మోక్షారోహణమునకు మధ్యలో ప్రభువు అనేక మంది విశ్వాసులకు కనిపించి ముఖ్యముగా రెండు విషయాలను రూఢీ పరిచారు: మొదటగా, తాను వాగ్దానం చేయబడిన మెస్సయ్య అని నిరూపించారు. రెండవదిగా, మరణాన్ని జయించిన తాను, ఎవరైతే విశ్వాసములో చివరి కంటా జీవిస్తారో, వారు కూడా మరణాన్ని జయించి దైవరాజ్యాన్ని పొందుతారని నిరూపించారు.

సువార్త పరిచర్య మరియు ఆశీర్వాదాలు: 

ప్రభువు మోక్షారోహణ దినమున తాను తన శిష్యులకు ఇచ్చిన సందేశం - వారు ప్రపంచమంతటా వెళ్లి సువార్తను బోధించాలి. సువార్తను విశ్వసించి జ్ఞానస్నానం పొందువారు రక్షింపబడుదురు, విశ్వసింపనివారు ఖండింపబడుదురు. క్రీస్తును విశ్వసింపనివారు ఆయన సన్నిధానమును కోల్పోవుదురు. ఆయనను విశ్వసించువారిని ఆయన ఆధ్యాత్మిక వరములతో నింపును. ప్రభువు నామమున వారు దయ్యములను వెడలగొట్టెదరు, అనేక భాషలలో మాట్లాడ గలుగుదురు, పాములను చేతులలో ఎత్తి పట్టుదురు, అనారోగ్యులపై వారి చేతులు చాచిన వారు స్వస్థత పొందెదరు. క్రీస్తు మోక్షారోహణము అయిన తరువాత శిష్యులు అంతటా వెళ్లి సువార్తను బోధించారు.

మోక్షారోహణము ద్వారా క్రీస్తు తండ్రిలో సంపూర్ణముగా కలకాలం ఐక్యమై ఉన్నారు. శిష్యులు చూచుచుండగా ఆయన పరలోకమునకు కొనిపోబడెను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండ, ఒక మేఘము ఆయనను కమ్మివేసెను.” బైబిలులో మేఘము” దేవుని సాన్నిధ్యాన్ని సూచిస్తుంది. తండ్రి దేవుడు తన కుమారున్ని తిరిగి తన దరికి తీసుకొని వెళ్ళారు.

శ్రీసభ పరిచర్య మరియు మన బాధ్యత:

మోక్షారోహణముతో శ్రీసభ పరిచర్య మొదలైనది, అనగా మన పరిచర్య మొదలైనది. క్రీస్తు జీవితము, బోధన, శ్రమలు, మరణము, ఉత్థానము గూర్చి బోధింప వలసిన బాధ్యత మనందరిపై ఉంది. దేవుని ప్రేమను, దయా కనికరమును, పాపమన్నింపును, దేవునితో, తోటివారితో సఖ్యతను బోధించాలి. కనుక ఈ సువార్తా పరిచర్యకు మనలను మనము సంసిద్ధం చేసుకోవాలి. దీని నిమిత్తమై, పరిశుద్ధాత్మను పొందాలి. అందుకే ప్రభువు శిష్యులను పవిత్రాత్మ రాకడ కొరకు వేచియుండాలని పదేపదే కోరారు. మనము కూడా ఆత్మపూరితులము కావాలి. అప్పుడే సువార్త పరిచర్య చేయగలం మరియు క్రీస్తుకు సాక్షులముగా ఉండగలం. సువార్తా ప్రచారంలో పవిత్రాత్మ మనకి తోడుగా ఉండును.

ఈరోజు మనం క్రీస్తు మహిమను ధ్యానిస్తున్నాము. తండ్రి మహిమలో కుమారుడు సమానముగా పాలుపంచుకొని ఉన్నారు. తన మహిమలో శ్రీసభను ఎప్పుడు కూడా విడిచిపెట్టరు. త్రిత్వైక సన్నిధి శ్రీసభతో ఎల్లప్పుడూ ఉంటుంది (మత్త 28:20). యేసు మన హృదయాలలో వాసం చేయుచున్నారు అని ఈ మహోత్సవం మనకు గుర్తు చేస్తుంది. అలాగే ఆయన శ్రీసభలో వాసం చేయుచున్నారు, దివ్యసత్ప్రసాదములో వాసం చేయుచున్నారు. ఆయన మోక్షారోహణము అయినప్పటికీ ఆయన మనతోనే ఉన్నారు.

మోక్షారోహణ పండుగ క్రీస్తు మెస్సయ్య అని నిశ్చయముగా తెలియజేస్తుంది. “యేసు నామము”న శిష్యులు పరిచర్య చేయవలెను, అనగా క్రీస్తు దైవానుసంభూతుడని నిరూపితమగుచున్నది. ప్రభువు మోక్షారోహణమున తన చేతులెత్తి వారిని ఆశీర్వదించెను”. ఇది ఒక సాధారణమైన ఆశీర్వాదము కాదు, గొప్ప ప్రధాన యాజకుడిగా వారిని ఆశీర్వదించారు..

ప్రభువు మోక్షారోహణము ఆయన తండ్రి వద్దకు వెళ్లిపోవడము మాత్రమే కాదు, ఆయన సాన్నిధ్యం మనతో కలకాలం ఉన్నదని ఈ మహోత్సవం మనకు గుర్తు చేస్తుంది. మనకు ప్రభువు చేసిన రక్షణ కార్యమును మనము కొనసాగించాలి. మన ప్రేషిత కార్యములో మనం చేయవలసినవి: సువార్తను బోధించాలి (అనగా, క్రీస్తు జీవితమును, ఆశయమును తెలియజేయాలి); శారీరక, ఆధ్యాత్మికమగు క్రీస్తు స్వస్థతా పరిచర్యను కొనసాగించాలి; పవిత్రాత్మ శక్తిని అనుభవించులాగా చేయాలి; క్రీస్తు సాన్నిధ్యమును అనుభవించులాగా చేయాలి.

ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక 1:17-18లో ఇలా చెప్పబడింది: మీకు ఆత్మను ప్రసాదింపవలసినదిగ, మన ప్రభువైన క్రీస్తు దేవుడు, మహిమాన్వితుడగు తండ్రిని అర్ధించుచుందును. మీరు ఆయనను ఎరుగునట్లుగ, ఆ ఆత్మ మీకు వివేకమును కలిగించి, దేవుడు మీకు విదితమొనర్చును. ఆయన వెలుగును చూచునట్లు మీ మనస్సులు వికాసము పొందునుగాక అని నా అభ్యర్ధన. అప్పుడే ఆయన మిమ్ము చేరబిలిచిన, ఆ నిరీక్షణ ఎట్టిదియో, ఆయన తన ప్రజలకు వాగ్దానం చేసిన దీవెనలు ఎంత మహత్తరమైనవో, విశ్వాసులమగు మనలో నున్న ఆయన శక్తి ఎంత అతీతమైనదో మీరు తెలిసికొనగలరు.”

పునీతుల ధ్యానాలు:

ప్రభువు మోక్షారోహణము గురించి అనేకమంది పునీతులు లోతైన ఆధ్యాత్మిక అర్ధముతో ధ్యానం చేసారు:

పునీత అగస్టిన్: మోక్షారోహణమును క్రీస్తు తన శిష్యులకు “శాంతిని” ప్రసాదించిన తర్వాత జరిగిన ఒక సంఘటనగా చూశారు. క్రీస్తు ఆరోహణము ద్వారా, ఆయన మన కొరకు స్వర్గంలో ఒక స్థలాన్ని సిద్ధం చేస్తున్నాడని మరియు మనల్ని తనతో పాటు తీసుకెళ్ళడానికి తిరిగి వస్తాడని అగస్టిన్ గారు బోధించారు. ఇది భూమిపై మన ప్రయాణంలో నిరీక్షణ మరియు ప్రోత్సాహానికి ఆధారం.

పునీత థామస్ అక్వినాస్: మోక్షారోహణమును క్రీస్తు తన మానవ స్వభావంతో దేవుని మహిమను పొందడంగా వివరించారు. ఇది క్రీస్తు తన మానవత్వంతో స్వర్గంలోకి ప్రవేశించడం ద్వారా, మానవాళికి స్వర్గంలో ఒక స్థలాన్ని సంపాదించాడని అక్వినాస్ గారు నొక్కి చెప్పారు. మోక్షారోహణము మనకు “మహిమ గల నిరీక్షణ”ను ఇస్తుంది, అనగా మనం కూడా క్రీస్తుతో పాటు స్వర్గంలో ఉండాలని ఆశిస్తున్నాము.

పునీత మేరీ మాగ్డలీన్ ది పజ్జి: మోక్షారోహణమును క్రీస్తు యొక్క దైవిక ప్రేమ యొక్క గొప్ప వ్యక్తీకరణగా చూశారు. క్రీస్తు తన శిష్యులను విడిచి వెళ్ళినప్పటికీ, ఆయన వారికి పరిశుద్ధాత్మను ప్రసాదించారు, తద్వారా వారు ఆయన ప్రేమను మరియు ఆయన మిషనును కొనసాగించ గలరు.

పునీత థెరేసా ఆఫ్ లిసియూక్స్: మోక్షారోహణము అనేది క్రీస్తు పట్ల తన ప్రేమను పెంచుకోవడానికి ఒక అవకాశం. క్రీస్తు స్వర్గానికి వెళ్ళినప్పుడు, ఆయన తన ప్రేమను భూమిపై వదిలిపెట్టారని ఆమె నమ్మింది, మరియు ఈ ప్రేమను మనం స్వీకరించాలి మరియు ఇతరులతో పంచుకోవాలి.

సత్యోపదేశం (Catechism) ఏమి బోధిస్తుంది?

మోక్షారోహణమును క్రీస్తు పునరుత్థానము మరియు పరిశుద్ధాత్మ రాకడ మధ్య ఒక కీలకమైన సంఘటనగా కతోలిక శ్రీసభ సత్యోపదేశం (Catechism of the Catholic Church) వివరిస్తుంది:

“క్రీస్తు యొక్క ఆరోహణము ఆయన మానవత్వముతో దేవుని కుడిప్రక్కన మహిమను పొందుటను సూచిస్తుంది. ఇది ఆయన మానవత్వానికి మహిమ యొక్క చివరి దశ” (CCC 659). “క్రీస్తు యొక్క ఆరోహణము ఆయన మహిమాన్వితమైన ప్రభువుగా తన పాలనను ప్రారంభించెను” (CCC 661). క్రీస్తు యొక్క ఆరోహణము భూమిపై మన నిరీక్షణకు ఆధారం. ఆయన మన కొరకు స్వర్గంలో ఒక స్థలాన్ని సిద్ధం చేయడానికి వెళ్ళెను” (CCC 665). క్రీస్తు యొక్క ఆరోహణము తర్వాత, ఆయన పరిశుద్ధాత్మను పంపెను, తద్వారా ఆయన శిష్యులు ప్రపంచానికి సువార్తను ప్రకటించగలరు” (CCC 667).

ముగింపు:

ప్రభువు మోక్షారోహణము కేవలం క్రీస్తు ఈ లోకమును విడిచిపెట్టడం మాత్రమే కాదు; అది ఆయన మహిమ, మన నిరీక్షణ, మరియు మన మిషన్ యొక్క ప్రారంభం. ఇది శ్రీసభ యొక్క స్థాపనకు మరియు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా సువార్త యొక్క వ్యాప్తికి కీలకమైన సంఘటన. ఈ పండుగను జరుపుకోవడం ద్వారా, మనం క్రీస్తు యొక్క గొప్ప ప్రేమను మరియు ఆయన తిరిగి వస్తాడని మన నిరీక్షణను గుర్తు చేసుకుంటాము.

No comments:

Post a Comment