పునీత దోమినిక్ సావియో, 6 మే

పునీత దోమినిక్ సావియో, మే
(బాలుడు, మత సాక్షి క్రీ. శ. 1842 – 1857)

దోమినిక్ సావియో  పునీత డాన్ (జాన్) బోస్కో గారి మొదటి విద్యార్ధుల్లో ఒకరు. వీరు ఉత్తర ఇటలీ లోని ‘మురియాల్డో’ ప్రాంతంలోని ‘రివా’ గ్రామం లో 1842 ఏప్రిల్ 2 న  జన్మించారు. తండ్రి చార్లెస్ సావియో, తల్లి బ్రిజిత. వీరిద్దరు భక్తి గల వారు కావడం వల్ల ఇంటి వద్ద, విచారణ గుడి వద్ద, అందించే ఆధ్యాత్మిక శిక్షణలో వృద్ధి చెందుతూ వచ్చారు. వారి ఇంటి వాతా వరణం కూడా, వీరి ఆధ్యాత్మిక అభివృద్ధికి దోహదం చేసింది. విచారణ గురువు ఫాదర్ జాన్ గారు కూడా దోమినిక్ గారు దేవుని, ప్రకృతిని, మేరీమాతను ఘాడంగా ప్రేమించేటట్లు తీర్చిదిద్దారు.

దోమినిక్ చిన్న పిల్ల వాడైనను పెందలకాడనే లేచి ప్రతీ రోజు దేవాలయానికి వెళ్ళే వాడు. చలి కాలమైన, ఎండా కాలమైన ప్రార్ధనా కాండకు, దివ్యబలి పూజకు విధిగా హాజరు అయ్యేవారు. ఆ రోజుల్లో పన్నిండు సంవత్సరాలు దాటితే కాని దివ్య సత్ప్రసాదం ఇవ్వబడేది కాదు. అయినా దోమినిక్ కోరిక మేరకు మరియు వారి భక్తి ప్రపత్తులను బట్టి వారికి తమ ఏడవ యేటనే 1849 ఏప్రిల్ 8 న ప్రధమ దివ్య సత్ప్రసాదం ఇవ్వబడింది. ఆ రోజు పవిత్రత లోను యేసుతోను నిండిన హృదయము తో తన చిన్న డైరీలో తాను ఆచరించాల్సిన నాలుగు ప్రధాన నిర్ణయాలు వ్రాసుకున్నారు. అవి, 1. వీలయినన్ని సార్లు పాప సంకీర్తనం చేయాలి. 2. అనుదినం దివ్య సత్ప్రసాదాన్ని లోకొనాలి. 3. పాపం చేయుట కన్నా మరణించడం మేలు. 4. యేసు మరియలు నా మిత్రులు.

దోమినిక్ గారికి కావలి అయిన సన్మనస్కునిపై నమ్మకం గౌరవం ఎక్కువ. చాలా దూరం ఉన్నప్పటికీ క్రమం తప్పక బడికి వెళ్లి చెప్పే పాటాలు శ్రద్ధగా వినేవాడు, నేర్చే వాడు. 1853 ఏప్రిల్ 13న దోమినిక్ గారు భద్రమైన అభ్యంగ సంస్కారాన్ని పొంది, యేసు కోసం యుద్ధ వీరుడు లా పోరాడుతానని ప్రభువుకు వాగ్దానం చేశారు. ఆ దినాల్లోనే వారు తనకు భోదిస్తున్న గురువుతో “ఆత్మల రక్షణ కోసం నేను గురువు కావాలని ఆశిస్తున్నాను. లోక రక్షణలో యేసుకు సహాయపడే జీవితం కన్నా మనోహరమైనది ఏది లేదు” అని చెప్పారు.

అదే దినాల్లో  డాన్ బోస్కో అనే గురువు దోమినిక్ గారి ఊరు వచ్చారు. వందలాది బాలురకు ఇటలీ లోనే గల టూరిన్ పట్టణంలో విద్యాభ్యాసం చేయిస్తున్న గురువుగా వారికి ఆ ప్రాంతంలో పేరుంది. దోమినిక్ గారి గురించి డాన్ బోస్కో గారికి విచారణ గురువు వివరించారు. టూరిన్ లో తన వద్ద వుండి చదువుకోవడానికి బోస్కో గారు దోమినిక్ గారికి అనుమతిని ఇచ్చారు. దోమినిక్ గారు టూరిన్ లో బోస్కో గారి పాఠశాలలో చేరారు. తన ఊరిలో మాదిరే అక్కడ కూడా తరగతి లో ఆదర్శ విద్యార్ధి గా వుండి అందరికీ ప్రీతిపాత్రుడయ్యారు.

1854 డిసెంబర్ 8న గొప్ప  పండుగ దినం. 9వ పయస్ (భక్తి నాధ) పోపు గారు కన్య మరియాంబ గారు ‘జన్మ పాపము లేక జన్మించిన మాత’ అన్న విశ్వాస సత్యాన్ని వెల్లడించారు. శ్రీ సభ ఆ రోజు ఆ పండుగను ఘనంగా కొనియాడింది. డాన్ బోస్కో గారి విద్యాలయంలో లోను గొప్ప ఉత్సవం జరుపుకున్నారు. దోమినిక్ గారు తనను మరియమాతకు పునరంకితం చేసుకొని తనను సదా పవిత్రంగా ఉండే లా కాపాడ మని ప్రార్ధించారు.

1855 తపస్సు కాలంలో ఒక ఆదివారం పూజలో బోస్కో గారు పవిత్రత గూర్చి చెప్తూ “మీలో ప్రతీ ఒక్కరూ పునీతులు కావాలి. అది దేవునికి ఎంతో ఇష్టం” అని చెప్పారు. తాను పునీతుడిని కావాలి అని దోమినిక్ గారు పదే పదే తలంచారు. ఆనాటి నుండి ముఖం వ్రేలాడేసుకుని తలదించుకుని నవ్వక మాట్లాడక, నవ్వక, దిగాలుగా ఉండసాగారు. బోస్కో గారు విషయం తెలుసుకుని “దోమినిక్! పవిత్రత అనేది ముఖం వ్రేలాడేసుకోవడంలో లేదు. అనుక్షణం ఆనందంగా చిరునవ్వుతో దేవుని చిత్తాన్ని నెరవేర్చడంలో వుంది” అని నచ్చ చెప్పారు. ఆ విధంగా దోమినిక్ గారిలో తిరిగి ఆనందం పెల్లుబికింది.

దోమినిక్ గారు తోడి పిల్లలను మంచి పాప సంకీర్తనం చేయ ప్రోత్సహించేవారు. చెడ్డ పుస్తకాలు చదివే వారికి బుద్ధి చెప్పే వారు. క్రైస్తవ మతానికి వ్యతిరేకంగా మాట్లాడే వారికి దూరంగా వుండాలని పిల్లలకు చెప్పే వారు. ఎప్పుడూ ఎవరోఒకరికి సాయ పడే అవకాశం కోసం ఎదురు చూసేవారు. రోగులను పరామర్శించి ధైర్యం చెప్పి ఆనందపరచే వారు. దైవ దూషణ చేసే వారికి సంతృప్తి కర సమాధానం చెప్పి నోరు మూయించే వారు. ఒకసారి దివ్య సత్ప్రసాదంతో గురువు వెళ్తుండగా వర్షం పడి బురదగా వున్నా కాని మోకరిల్లి మర్యాద చూపారు. తన పక్కనున్న సైనికుడు ఒకడు అలా చేసేందుకు సిగ్గు పడుతుండగా తన చేతి రుమాలను నేలపై పరచి మోకరిల్లి గౌరవించేటట్లు చేశారు. అలాగే పోట్లాడుకుంటున్న ఇద్దరు విద్యార్ధులకు “పపరహితుడైన క్రీస్తు తనను హింసించిన వారల కోసం క్షమా భిక్ష పెడుతూ మరణించారు. కాని పాపాత్ముడనైన నేను మాత్రం పగ తీర్చుకుంటాను అని గట్టిగా పలకండి” అని చెప్పి వారిలో పరివర్తనగొని తెచ్చారు.

దోమినిక్ గారు భక్తితో దివ్య సత్ప్రసాదం లోకొనే వారు. అందుకు ముందు మరియు వెనుక కూడా చాలా సేపు జపాలు మరియు కృతజ్ఞతా ప్రార్ధనలు సలిపే వారు. తీరిక దొరికినపుడెల్లా  గుడికి వెళ్లి జపించడం చేసేవారు. “నా తోడి బాలురందరినీ దేవుని వైపు మరల్చగలిగితే నేను ఎంత ధన్యుడిని” అని బోస్కో గారితో అనేవారు. దోమినిక్ గారు తోడి విద్యార్ధులను సంఘటిత పరచి “అమలోద్భవిమాత” సంఘం ఏర్పరిచారు. నిజమైన అపోస్తలుగా ఉండేందుకు పిల్లలకు సత్యోపదేశం నేర్పించడం వారిని పూజకు తీసుకువెళ్ళడం, ప్రార్ధనలు చెప్పించడం చేసేవాళ్ళు. వారికి నీతి కథలతో క్రైస్తవ విశ్వాసం పటిష్ట పరిచే వారు. తనను గట్టిగా కొట్టినా ఒక తోడి పెద్ద విద్యార్ధిని క్షమించారు కాని ఫిర్యాదు చేసి చాడీలు చెప్పక అతనిని మార్చారు.

దోమినిక్ గారికి దూరంలో జరుగుతున్న విషయాలను తాను తెలుసుకొని చెప్పగల వరం దేవుని నుండి పొంది వున్నారు. ఒక వీధి చివర వున్న మూడంతస్తుల భవనంలో మరణావస్తలో వున్న ఒక వ్యక్తి అవసరాన్ని ఇలా తెలుసుకుని ఫాదర్ జాన్ బోస్కో గారిని తీసుకొని పోయి మారు మనస్సు పొంది దేవునితో సఖ్యతపడదలచిన ఆ వృద్ధినికి మంచి పాప సంకీర్తనం కడపటి సాంఘ్యం లభించేలా చేయగలిగారు. అలాగే మరో చోట పెద్ద బంగళాలో తీవ్రంగా జబ్బు పడి ఆందోళనతో గురువు కోసం ఎదురుచూస్తున్న ఒక స్త్రీ అవసాన కోరికను తన ఆత్మశక్తితో గ్రహించి బోస్కో గారిని తీసుకొని పోయి ఆమెకు అవస్థను ఇప్పించి స్వర్గమార్గం సుగమం చేశారు. అలాగే మూడు మైళ్ళ దూరంలో తల్లి బ్రిజిత అనారోగ్యంతో వున్న సంగతి కూడా దివ్య వరంతో తెలుసుకొని పెద్దల అనుమతితో వెళ్లి సందర్శించి రిబ్బనుతో కట్టిన దేవమాత స్వరూపాన్ని తల్లి మెడలో వేయగా ఆమె స్వస్థతనొందింది.  

టూరిన్ లో బోస్కో గారి విధ్యాలయములో విద్యార్ధిగా వున్న దశ లోనే దోమినిక్ గారు ఒక రోజు  తల నొప్పి, దగ్గుతో అస్వస్థులయ్యారు. బోస్కో గారు వారిని ఆసుపత్రి లో చేర్పించారు. కాని వారి ఆరోగ్యం రోజు రోజుకూ క్షీనింపజొచ్చింది. “నేను ఈ లోకంలో ఇక ఎంతో కాలం ఉండను. అనేక ఆత్మలను దేవుని వైపు త్రిప్పేందుకు నా భావి జీవితాన్ని అర్పించాను” అని దోమినిక్ గారు చూడ వచ్చిన మిత్రులతో మెల్లగా చెప్పారు. బోస్కో గారు దోమినిక్ గారి తండ్రిని పిలిపించి ఇంటికి పంపారు. ఆ సమయంలో దోమినిక్  గారి తండ్రిని ఇంటికి పంపారు. ఆ సమయంలో దోమినిక్ గారు తమ జ్ఞాన తండ్రి ఫాదర్ జాన్ బోస్కో గారితో “నేను పరలోకము నుండి మీకు సాయపడతాను..... మీ కోసం నా సహచరుల కోసం ప్రార్ధిస్తాను” అని చివరి సారిగా పలికారు.

ఇంటిని చేరిన దోమినిక్ గారిని చూసి తల్లి బోరున విలపించింది. తండ్రి వైద్యున్ని తీసుకొచ్చారు. డాక్టరు ఇంజక్షన్ సిద్ధం చేస్తూ “బాబూ! భయపడకు .....ఆ వైపు తిరుగు” అన్నప్పుడు దోమినిక్ గారు “డాక్టర్ గారూ!  ప్రభువు చేతులు, కాళ్ళలో చీలలతో పోలిస్తే ఈ సూది ఎంతండి!” అని నవ్వి ఊరుకున్నారు. ఎంతకూ వ్యాధి నయం గాకుండా తీవ్రం కావడంతో గురువును రప్పించి అంతిమ సంస్కారం ఇప్పించారు. దోమినిక్ గారు తన తల్లిని ఓదారుస్తూ “అమ్మా!ఆతృత ఈ లోకంలో కంటే నేను పరలోకంలో వుండడటమే అధిక లాభ దాయకం నేను పైనుండి మిమ్మల్ని గమనిస్తూ వుంటాను నా తోబుట్టువులందరినీ సంరక్షిస్తాను” అన్నారు.

1857 మర్చి 9న తన 15వ ఏట దోమినిక్ గారు “అమ్మా! నేను మోక్షానికి వెళ్తున్నాను...... ప్రభూ! నా ఆత్మ తొలిసారిగా మీ ముందు నిలిచినపుడు నా పై దయచూపండి. నేను సదా మీ మహిమను కీర్తింతును. ఆహా ఎంతటి దేదీప్య మానమైన వెలుగును చూస్తున్నాను.....” తల వాల్చిన దోమినిక్ గారి ముఖం తేజోవంతమైనది.

కొన్ని వారాల తర్వాత దోమినిక్ గారు ఒక రాత్రి తండ్రికి అగుపించి “అవును..... నేనే నాన్నా! నేను మోక్షంలో వున్నాను. నేను నిన్ను, అమ్మను, తమ్ములని, చెల్లెల్ని సంరక్షిస్తాను” అని చెప్పి అద్రుశ్యమయ్యారు. దోమినిక్ గారి మరణానంతరం వారిని ప్రార్ధించుట వల్ల ఎంతో మంది వరాలు పొందారు. అందులో గొప్పది ఏమనగా ఒక బాలుడు చనిపోయాడని డాక్టరు మరల ధ్రువ పత్రంపై సంతకం పెట్టిన తర్వాత ఆ బాలుని తల్లితండ్రులు బంధుమిత్రులు దోమినిక్ గారి మధ్యవర్తిత్వమున ప్రాణభిక్ష కోసం ప్రార్ధింపగా చనిపోయిన ఆ బాలుడు నిద్ర నుండి లేచిన వానిలా లేచాడు.

1954 జూన్ 12న, 12వ పయస్ (భక్తినాధ) పాపు గారు దోమినిక్ గారికి పునీత పట్టాన్ని ఇచ్చి గౌరవించారు. కేవలం 15 సంవత్సరాల పిల్లవాడయిన దోమినిక్ సావియోను పునీతునిగా ప్రకటించడం తనకెంతో ఆనందంగా వుందని, నేటి యువత వీరిని ఆదర్శంగా తీసుకోవాలని ఆ రోజు జగద్గురువులు నుడివారు. దోమినిక్ అనగా ప్రభువు కు సంభందించిన, దేవునకు చెందిన అని అర్ధం.

ధ్యానంశం: నేను గొప్ప కార్యాలు చేయలేను. కాని, దేవునికి అధిక మహిమ కలిగించేందుకు, అతి చిన్న కార్యాలతో పాటు, అన్నింటినీ చేయాలని ఆశిస్తున్నాను. (పు. దోమినిక్ సావియో)

No comments:

Post a Comment